-
ఏడేళ్ల తర్వాత సవాల్ చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: పలు ఫిల్మ్ సిటీలకు ప్రభుత్వ భూ కేటాయింపు సమర్థనీయమైనప్పుడు.. ఆనంద్ సినీ సర్వీసెస్కు ఇవ్వడం తప్పెలా అవుతుందని పిటిషనర్, మాజీ మంత్రి హరీశ్రావును హైకోర్టు ప్రశ్నించింది. అలాగే 2001లో తొలిసారి జీవో జారీ చేస్తే.. 2008లో సవాల్ చేయడం సరికాదని, ఆలస్యానికి కారణాలు కూడా తెలుపలేదని వ్యాఖ్యానించింది. ఈ పిటిషన్లో ఎలాంటి మెరిట్స్ కనిపించనందున కొట్టివేస్తున్నామని స్పష్టం చేసింది. 2001, ఆగస్టు 21న సాధారణ పరిపాలన (ఐఅండ్పీఆర్) విభాగం జీవో 355ను జారీ చేసింది. హైదరాబాద్ షేక్పేట్లోని సర్వే నంబర్ 403లో 5 ఎకరాల భూమిని ఆనంద్ సినీ సర్వీసెస్కు ఎకరం రూ.8,500లకు కేటాయించాలని ఏపీ రాష్ట్ర ఫిల్మ్, టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్డీసీ)కు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత ఎందుకో భూమి అప్పగింతను నిలిపివేస్తూ ప్రభుత్వం ఏపీఎస్ఎఫ్డీసీకి లేఖ రాసింది. వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం వచ్చాక డిసెంబర్, 2008లో మరో జీవో 744ను జారీ చేసి.. భూమిని అప్పగించింది. ఈ రెండు జీవోలను సవాల్ చేస్తూ మాజీ మంత్రి హరీశ్రావు 2008లో పిటిషన్ దాఖలు చేశారు. భూ కేటాయింపు చట్టవిరుద్ధమని, జీవోలను కొట్టివేయడంతో పాటు ఈ అంశంపై విచారణ జరిపించాలని కోరారు.ఈ పిటిషన్పై జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఏపీఎస్ఎఫ్డీసీకి 1982లో ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది. అలాగే పద్మాలయా స్టూడియోకు 9.5 ఎకరాలు, సురేశ్ ప్రొడక్షన్స్కు 5 ఎకరాలతో పాటు ఆనంద్ సర్వీసెస్కు కూడా 5 ఎకరాలు కేటాయించారు. దీన్ని సవాల్ చేస్తూ 2004లో దాఖలైన పిల్ను హైకోర్టు కొట్టివేసింది.ఇది సినీ రంగ అభివృద్ధికి 1982లో ప్రభుత్వం తీసుకువచ్చిన ఓ అద్భుతమైన పాలసీ. 2011లోనూ పలు పిటిషన్లు డిస్మిస్ అయ్యాయి. సుప్రీంకోర్టు కూడా ఈ పిటిషన్లను కొట్టివేసింది. అంతేకాదు దర్శకుడు ఎన్.శంకర్కు 5 ఎకరాల కేటాయింపును ఇదే హైకోర్టు సమర్థించింది’ అని పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. జీవో ఇచ్చిన ఏడేళ్ల తర్వాత పిటిషన్ వేయడం సరికాదని స్పష్టం చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం విచక్షణాధికారాన్ని వినియోగించుకుని జాప్యానికి కారణం లేనందున ఈ పిటిషన్ను కొట్టివేస్తున్నామని తెలిపింది. -
ఆడ రాక పాత గజ్జెలు.. సీఎం రేవంత్పై హరీశ్రావు సెటైరికల్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కరెంట్ కోతల విషయంలో సీఎం రేవంత్ తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగుల మీద అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ హరీశ్రావు ట్వీట్ చేశారు.‘‘విద్యుత్ రంగ వైఫల్యాలకు నేనే బాధ్యుడిని అన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఆయన వైఖరి ఆడ రాక పాత గజ్జెలు అనే సామెతను గుర్తు చేస్తున్నది. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేసేందుకు.. విద్యుత్ ఉద్యోగుల సహకారంతో పటిష్ఠమైన వ్యవస్థను నిర్మించింది’’ అని హరీశ్ పేర్కొన్నారు.‘‘రెప్పపాటు కాలం కూడా కరెంట్ కోతలు లేని ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపింది. కేవలం 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను కుప్పకూల్చింది. గృహ, వ్యవసాయ, పారిశ్రామిక అవసరాలకు సరిపోయే విద్యుత్ సరఫరా చేయడంలో పూర్తిగా విఫలమైంది. తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై రేవంత్ రెడ్డి నిరాధార ఆరోపణ చేస్తున్నారు’’ అని హరీశ్రావు మండిపడ్డారు.‘‘తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పునర్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన విద్యుత్ ఉద్యోగులను చీటికి మాటికి నిందించడం, చర్యలు తీసుకోవడం వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడమే. విద్యుత్ ఉద్యోగులపై నెపం నెట్టడమే తప్ప కరెంటు కోతలను ఎలా సరిదిద్దాలనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి లేకపోవడం దురదృష్టకరం’’ అంటూ హరీశ్ వ్యాఖ్యానించారు.‘‘సీఎం ఇలాంటి చిల్లర మల్లర చేష్టలు మాని కేసీఆర్ హయాంలో రెప్ప పాటు కూడా పోని విధంగా 24 గంటల విద్యుత్ను ఇచ్చినట్టుగా అన్ని రంగాలకు సరఫరా చేస్తే మంచిది. తన లాగే అందరూ కుట్రలు కుతంత్రాలకు పాల్పడతారని సీఎం భ్రమల్లో ఉన్నట్టున్నారు. వాటిని వీడి పాలన పై దృష్టి పెడితే మంచిది’’ అంటూ హరీశ్రావు హితవు పలికారు. కరెంట్ కోతల విషయంలో సిఎం రేవంత్ రెడ్డి గారు తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతి పక్షాలు, విద్యుత్ ఉద్యోగుల మీద అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. విద్యుత్ రంగ వైఫల్యాలకు నేనే భాద్యుడిని అన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఆయన వైఖరి ఆడ రాక పాత గజ్జెలు అనే…— Harish Rao Thanneeru (@BRSHarish) May 15, 2024 -
రివర్స్ గేర్లో కాంగ్రెస్ సర్కార్
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవడం.. బీజేపీ పదేళ్లలో ఏమీ చేయకపోవడంతో ఆ పార్టీలు ప్రజల్లో విశ్వసనీయతను కోల్పోయాయని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే టి.హరీశ్రావు చెప్పారు.కాంగ్రెస్పై ఓటర్లకు విరక్తి కలిగిందని, ఉదయ్పూర్ డిక్లరేషన్ అభాసుపాలైందని, రాష్ట్రంలో మంత్రులు అహంకారంతో మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం రాబోతోందని, అనూహ్య ఫలితాలు రానున్నాయని చెప్పారు. ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా హరీశ్రావు శనివారం సాక్షితో ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే..రాహుల్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారుఅసెంబ్లీ ఎన్నికల్లో హామీలుగా ఇచ్చిన ఆరు గ్యారంటీలనే ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అలాంటిది పార్లమెంట్ ఎన్నికల్లో కొత్త గ్యారంటీలంటూ అబద్ధపు మాటలతో ప్రజల ముందుకొస్తున్నారు. ఈ గ్యారంటీలను ప్రజలు నమ్మేపరిస్థితిలో లేరు. రాష్ట్రంలో ఏం జరుగుతుందనే అవగాహన లేకుండా సీఎం రేవంత్రెడ్డి ఏది రాసిస్తే దాన్ని రాహుల్గాంధీ చదువుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్ గేర్లో నడుస్తోంది. రాహుల్ గాంధీ ఉదయ్పూర్లో చేసిన డిక్లరేషన్ అమలు చేయకపోవడంతో నాయకులు, కార్యకర్తల్లో విశ్వసనీయతను కోల్పోయారు. ప్యారాచూట్ నేతలకు టికెట్లు ఇవ్వమని చెబుతూ వచ్చి చివరకు వారికే ఎక్కువగా టికెట్ ఇచ్చి పార్టీని నమ్ముకున్నవారిని నట్టేట ముంచారు. సర్కారు నుంచి వేధింపులురాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు విరక్తి కలిగింది. హైదరాబాద్లో రాహుల్ గాంధీ సభనే దీనికి నిదర్శనం. జనాలు రాకపోతే సుమారు 45 నిమిషాలపాటు రాహుల్ బస్సులోనే ఉండిపోయారు. సభ ప్రాంగణంలోకి వెళ్లండంటూ స్వయంగా రేవంత్రెడ్డి గేట్ దగ్గరుండి కోరినా.. ప్రజలు లోపలికి పోని పరిస్థితి ఉంది. కాంగ్రెస్ మంత్రులు అహంకారంతో మాట్లాడుతున్నారు. గాలిలో ఉన్న కాంగ్రెస్ను భూమి మీదకు దించాలంటే ఆ పార్టీ నేతలను ఓడించాలి. నిరుద్యోగులు, ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసింది. వ్యాపారులతోపాటు అన్ని వర్గాల వారికి ప్రభుత్వం నుంచి వేధింపులు మొదలయ్యాయి. అక్రమ కేసులు పెట్టి గౌడన్నలను జైలు పాలు చేశారు, చంచల్గూడ జైలులో ఇప్పుడు సగం మంది వారే ఉన్నారు.బీజేపీ ఒరగబెట్టింది ఏమీలేదుపదేళ్లలో బీజేపీ తెలంగాణకు ఒరగబెట్టింది ఏమీలేదు, అందుకే దేవుని పేరుతో ఎన్నికల్లోకి వస్తున్నారు. అయోధ్యలో రామాలయాన్ని ట్రస్ట్ నిర్మించింది. ఆలయ నిర్మాణానికి చాలామంది ప్రజలు ఇచ్చారు... నేను కూడా విరాళం ఇచ్చా. అయితే, ఆ గుడిని తాము కట్టించామని బీజేపీ చెప్పుకుంటోంది. విదేశాల నుంచి నల్లధనాన్ని తెచ్చి పేదల ఖాతాల్లో రూ.15 లక్షలు జమ చేస్తామన్న హామీని బీజేపీ ప్రభుత్వం చేయలేదు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసింది. బీజేపీకి చెందిన నలుగురు ఎంపీలు రాష్ట్రానికి చేసింది గుండు సున్నా. బీజేపీ ప్రభుత్వం బీడీ కార్మికులకు పెన్షన్ను దూరం చేసింది. బీడీ కట్టలకు జీఎస్టీ పెట్టడంతో కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. తులం బంగారం తుస్సుపేదింటి ఆడ బిడ్డల పెళ్లికి ప్రభుత్వం నుంచి కల్యాణలక్ష్మి కింద ఇస్తామని చెప్పిన రూ.లక్ష చెక్ బౌన్స్ అయింది. తులం బంగారం హామీ కూడా తుస్సుమంది. వడ్లకు తరుగు తీస్తున్నారని స్వయంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒప్పుకున్నారు. వడ్లకు తరుగు తీస్తున్న కాంగ్రెస్కు రైతులు ఓట్లలో తరుగు పెట్టాలి. రాష్ట్రంలో అప్పులు చూపించి.. దివాళా తీసిందని ప్రభుత్వం చెబుతుండటంతో పెట్టుబడులు రాకుండా పోతున్నాయి. సీఎం రేవంత్రెడ్డి ఇప్పటివరకు నా సవాల్ను స్వీకరించలేదు. ఆగస్టు 15లోపు ఆరు గ్యారంటీలు, రూ 2లక్షల రుణ మాఫీ అమలు చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పినా సీఎం ఇప్పటివరకు స్పందించలేదు. సవాల్ను స్వీకరించకపోతే బేషరతుగా క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ బీజేపీలు బోగస్ సర్వేలు విడుదల చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు చేస్తున్నాయి. యువత వాటిని నమ్మొద్దు.(గజవెల్లి షణ్ముఖరాజు) -
ఆయన రాహుల్ గాంధీ కాదు.. ‘రాంగ్’ గాంధీ: హరీశ్రావు
సాక్షి, సిద్ధిపేట జిల్లా: రైతుల ఉసురు పోసుకుందంటూ.. బీజేపీని కార్మిక, కర్షక వ్యతిరేక పార్టీగా అభివర్ణించారు మాజీ మంత్రి హరీష్రావు. బడా బడా కార్పొరేట్ సంస్థల గురించి మాత్రమే బీజేపీ ఆలోచించిందని.. 14 లక్షల కోట్లు మాఫీ చేసిందన్నారు. పేదలకు ఒక్క రూపాయి మాఫీ చేయలేదని విమర్శించారు.హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ, బీజేపీ పంచిన బొమ్మలను చూసి ఓటు వేస్తే కడుపు నిండుతుందా? అంటూ ప్రశ్నించారు.అయోధ్య రామాలయం బీజేపీ కట్టలేదు.. ట్రస్ట్ కట్టింది.ఆలయ నిర్మాణానికి తానుకూడా 2 లక్షలు ఇచ్చానని చెప్పారు.నిన్న హైదరాబాద్లో రాహుల్ గాంధీ సభ తుస్సు మంది. 30 వేల కుర్చీలు వేస్తే 3 వేల మంది రాలేదు. కాంగ్రెస్ వాళ్లు వచ్చి ఓటు అడిగితే ఐదు నెలల 12,500 ఇచ్చిన తర్వాతే ఓటు వేస్తామని అక్క చెల్లెళ్లు చెప్పండి. ప్రియాంక గాంధీ గెలిచాక ఇస్తామని హామీ ఇచ్చిన మెడికల్ కాలేజీ హుస్నాబాద్కు వచ్చిందా? రేవంత్ రెడ్డి కంటే రాహుల్ గాంధీ ఎక్కువ అబద్ధాలు మాట్లాడున్నాడు, ఆయన రాహుల్ గాంధీ కాదు రాంగ్ గాంధీ’’ అంటూ హరీశ్ ఎద్దేవా చేశారు.‘‘ఈ కాంగ్రెస్ పాలన వచ్చాక కల్యాణ లక్ష్మి ఖతమయ్యింది. తులం బంగారం తుస్సు మంది. బండి సంజయ్ బొమ్మలు పంచి ఓట్లు వేయమంటున్నాడు. బండి సంజయ్ కి ఓటు వేస్తే అంతా వృధా అయిపోతుంది. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ మూడోస్థాలో ఉంది. అది గెలిచే ప్రసక్తే లేదు’’ అని హరీశ్రావు పేర్కొన్నారు. -
ప్రజలకు రాహుల్గాంధీ క్షమాపణ చెప్పాలి
జహీరాబాద్ (సంగారెడ్డి)/సిద్దిపేటజోన్: కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహూల్గాంధీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి మరిచిపోయారని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు. హామీల అమలులో విఫలమైనందుకు రాష్ట్ర ప్రజలకు రాహుల్ గాంధీ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి ఏం ముఖం పెట్టుకుని రాష్ట్రానికి వచ్చారని హరీశ్రావు ప్రశ్నించారు. అక్కా చెల్లెళ్లకు రాహూల్గాంధీ రూ.8,500 ఇస్తానంటున్నారని, మళ్లీ ఎవరి చెవులో పువ్వు పెడతారని నిలదీశారు.సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో గురువారం బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్కుమార్కు మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ..కరెంటు కోతలు పెడుతున్న కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో వాతలు పెట్టాలన్నారు. ఆరు గ్యారంటీ పథకాలు వచ్చిన వారు కాంగ్రెస్కు ఓటు వేయాలని, రాని వారంతా బీఆర్ఎస్కు ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్కుమార్, ఎమ్మెల్యే కె.మాణిక్రావు, డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వై.నరోత్తం, బేవరేజస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవిప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు కిజర్యాఫై పాల్గొన్నారు.బీజేపీతో కొట్లాడినందుకే కవితకు జైలుబీజేపీతో కొట్లాడేది ఒక్క కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీయేనని ఆ పోరాటం ఫలితంగానే ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్లాల్సి వచ్చిందని హరీశ్రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన ముస్లిం, మైనార్టీ ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీజేపీ, బీఆర్ఎస్లు ఒక్కటేనని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీజేపీతో బీఆర్ఎస్ కలిసి ఉంటే కవిత అరెస్ట్ అయ్యేవారా..? అని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ప్రధాని మోదీతో జత కట్టారని, చాలాసార్లు బహిరంగంగానే ప్రధానిని పొగిడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. రేవంత్రెడ్డి, బీజేపీ మిలాఖత్ అయి రాష్ట్రంలో బీఆర్ఎస్ను లేకుండా చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. -
గ్యారంటీలు అమలైతే ఓట్లడగం! : మాజీ మంత్రి హరీశ్రావు
మెదక్: ఆరు గ్యారంటీలు అమలయ్యే గ్రామాల్లో మేం ఓట్ల అడగమని, అమలు కాని గ్రామాల్లో మీరు ఓట్లు అడగొద్దని మాజీ మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు. సోమవారం నర్సాపూర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. అమలు కాని గ్యారెంటీలపై మాట్లాడిన రాహుల్గాం«దీకి, కేసీఆర్ను బూతులు తిడుతున్న రేవంత్రెడ్డికి ఓట్లతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీలు అబద్ధాలకు పుట్టిన కవలలని విమర్శించారు.ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ రిజర్వేషన్లు, బీజేపీ మతం పేరుతో ఓటర్లను రెచ్చగొడుతూ గ్లోబల్ ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం రేవంత్రెడ్డి జిల్లాలను ఎత్తివేస్తానంటున్నారని, దీనిపై ప్రజలు ఆలోచించాలన్నారు. పదేళ్ల బీజేపీ పాలన కార్పొరేట్లకు దోచిపెట్టిందన్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు ఎన్నికలకు ముందు ఫేక్ వీడియోలు విడుదల చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ఆలోచనతో ఉన్నారని చెప్పారు.అనంతరం ఎమ్మెల్యే సునీతారెడ్డి మా ట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదన్నారు. హత్నూర మండలం రెడ్డిపాలెంలో పలువురికి బలవంతంగా కాంగ్రెస్ కండువాలు కప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 8న నర్సాపూర్లో నిర్వహించే రోడ్షోలో కేసీఆర్ పాల్గొంటారని, ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి, నాయకులు సింగయ్యపల్లి గోపి, చంద్రగౌడ్, మన్సూర్, మున్సిపల్ చైర్మన్ అశోక్గౌడ్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, సత్యంగౌడ్, నయీమ్, ఆంజనేయులుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.ఇవి చదవండి: కాంగ్రెస్, బీఆర్ఎస్ల పోటీ.. రెండో స్థానం కోసమే! : కిషన్రెడ్డి -
కేసీఆర్ను అవమానిస్తే సహించం
దుబ్బాక: కేసీఆర్ను అవమానిస్తే సహించేది లేదని మాజీ మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. ‘ఏదో అడ్డిమారి గుడ్డిదెబ్బలా గెలిచిన రేవంత్రెడ్డీ.. నీవు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మొదట అమలు చేయి.. చేతకాకపోతే నాతో కాదు అని ప్రజలకు క్షమాపణ చెప్పు’ అంటూ సవాల్ విసిరారు. శనివారం రాత్రి దుబ్బాకలో బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి హరీశ్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ జూటా మాటలతో గెలిచి ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. ఈ రివర్స్గేర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎందుకు అమలు చేయడం లేదో ప్రజలు ప్రశ్నించాలని సూచించారు. ‘బీడీ కట్టలపై పుర్రె గుర్తు పెట్టింది కాంగ్రెస్ కాదా?.. జీఎస్టీ విధించింది బీజేపీ కాదా?..’ అని ప్రశ్నించారు. బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చింది కేసీఆరేనని గుర్తుచేశారు. ‘పెన్షన్లు ఎటు పాయే.. ఆడబిడ్డలకు రూ.2,500, తులం బంగారం ఎటు పాయే’, ‘కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది.. మళ్లీ మోటార్లు కాలిపోయే కాలం వచ్చింది’ అంటూ ఎద్దేవా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రఘునందన్రావును దుబ్బాకలో ప్రజలు మడతపెట్టి ఉతికినట్టే ఈ ఎన్నికల్లోనూ మరోసారి ఉతికి ఆరేయాలన్నారు. -
రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి టి.హరీశ్రావు చెప్పారు. రివర్స్ గేర్లో వెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకునేందుకు బీఆర్ఎస్ గెలవాలని వారు భావిస్తున్నారని వివరించారు. రాష్ట్రంలో చెరో 8 లోక్సభ స్థానాలు గెలుచుకునేలా కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. ఆంధ్రా మూలాలు కలిగిన సీఎం రేవంత్రెడ్డి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. శనివారం హైదరాబాద్లో ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీకి మూటలు పంపడంపైనే శ్రద్ధ‘సీఎం రేవంత్ చెప్తున్న ప్రజాపాలన ఫార్స్గా మారింది. ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ ఇచ్చిన బాండ్ పేపర్లు బౌన్స్ అయ్యాయి. హామీల అమలుపై ప్రశ్నిస్తే ఓ వైపు దూషిస్తూ, మరోవైపు ఒట్లు పెడుతున్నారు. ప్రజలను నిరంతరం మోసగించడం సాధ్యం కాదనే విషయం గ్రహించి కేసీఆర్ను దుర్భాషలాడుతున్నారు. ఢిల్లీకి మూటలు పంపడంలో ఉన్న శ్రద్ధ హామీల అమలు, పరిపాలనపై లేదు.రాష్ట్రంలో పాలనకు బదులుగా పగలు, ప్రతీకారాలు నడుస్తున్నాయి. పాలన వికేంద్రీకరణ కోసం ఏర్పాటు చేసిన జిల్లాలను రద్దు చేయడం తిరోగమన ఆలోచన. ప్రజాపాలనలో వచ్చిన 3.50 లక్షల దరఖాస్తుల పరిష్కారంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి..’ అని హరీశ్ డిమాండ్ చేశారు. ఉమ్మడి రాజధానికి రేవంత్ సహకరించే చాన్స్‘హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సమైక్య వాదులు కోరుతున్నారు. ఆంధ్రా మూలాలు కలిగిన రేవంత్రెడ్డి దానికి సహకరించే అవకాశముంది. గతంలో ఏడు మండలాలను ఏపీలో విలీనం చేయడంలో బీజేపీ, కాంగ్రెస్దే ప్రధాన పాత్ర. తెలంగాణ ప్రయోజనాలను కాపా డటం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యం. కేసీఆర్ బస్సు యాత్రకు ప్రజల్లో ఆదరణ లభిస్తోంది. ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ, కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయి. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ సీట్లలో గెలిపిస్తే బీఆర్ఎస్ కీలకంగా మారుతుంది..’ అని హరీశ్రావు చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తున్న రేవంత్‘రాష్ట్రం దివాలా తీసిందంటూ సీఎం చేస్తున్న వ్యాఖ్యలతో రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటు న్నాయి. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ లేకపోతే అభివృద్ధి, పెట్టు బడుల సాధన, ఉద్యోగాల కల్పన ఎలా సాధ్యం? రేవంత్ తీరుతో పెట్టుబడుదారులు పునరా లోచనలో పడుతున్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్క డమే పనిగా పెట్టుకున్న రేవంత్ బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలను వేధిస్తూ కేసులు పెడుతు న్నారు..’ అని హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు‘దేవుడు పేరు చెప్పి ఓట్లు అడుగుతున్న బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదు. మెడికల్, నర్సింగ్ కాలేజీలు, రైల్ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం సహా ఏదీ ఇవ్వలేదు. బీజేపీ ఆదానీని మాత్రం ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో నిలబెట్టింది. నల్ల చట్టాలతో రైతులపై దాడులు, ఎస్సీ వర్గీకరణ, పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు వంటి అనేక అంశాలు బీజేపీ వైఫల్యాలకు అద్దం పడుతున్నాయి. యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించిన కేసీఆర్ ఆధ్యాత్మికలో బీజేపీ కంటే రెండు అడుగులు ముందే ఉన్నారు..’ అని మాజీమంత్రి స్పష్టం చేశారు. -
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయి: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వస్తోందని, రివర్స్ గేర్లో పోతున్న కాంగ్రెస్ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రం దివాలా తీసిందని ముఖ్యమంత్రే చెబితే పెట్టుబడులు వస్తాయా? అని ప్రశ్నించారు. రేవంత్ మాటల వల్ల రియిల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిందని, ర్మాణరంగంపై ఆధారపడిన లక్షల మంది రోడ్డునపడ్డారని విమర్శించారు. సీఎం బీజేపీలో చేరుతారని ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చెబుతున్నారని, పార్టీ మార్పు విషయమై బీజేపీ వ్యాఖ్యలను సీఎం రేవంత్ ఎందుకు ఖండించడం లేదని నిలదేశారు.హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని విమర్శించారు. 8 సీట్లలో బీజేపీ గెలిచేలా కాంగ్రెస్, 8 సీట్లలో కాంగ్రెస్ గెలిచేలా బీజేపీ ఒప్పందం చేసుకున్నాయని మండిపడ్డారు. మోదీ ఆశీర్వాదం కావాలని రేవంత్ రెడ్డి కోరుతున్నారని,8 సీట్లలో బీజేపీ గెలుపునకు రేవంత్ సహకరిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ మైనారిటీలను మోసం చేస్తున్నారని. కేబినెట్లో మైనారిటీని తీసుకోలేదని అన్నారు.‘హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సమైక్యవాదులు అంటున్నారు. రేవంత్ రెడ్డికి ఆంధ్రా మూలాలున్నాయి. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోడానికి బీఆర్ఎస్ గెలవాలని ప్రజలు కోరుకుంటున్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం బీఆర్ఎస్ తోనే సాధ్యం. ముస్లింలు, క్రైస్తవులు కాంగ్రెస్, బీజేపీలను ఓడించాలి. బీజేపీతో కలిస్తే జోడీ.. లేకుంటే ఈడీ. అక్రమంగా కవితను అరెస్ట్ చేశారు.కాంగ్రెస్ వచ్చాక మళ్లీ తాగునీటి కొరత వచ్చింద,దిప్రజలకు నీళ్ల కష్టాలు మొదలయ్యాయి. విద్యుత్ సరఫరాలో మార్పు మొదలైంది. కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చారు. కాంగ్రెస్ 15 గంటల విద్యుత్ కూడా ఇవ్వడం లేదు. కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు ఒక్క మోటర్ కూడా కాలలేదు. కాంగ్రెస్ వచ్చాక మోటర్లు కాలిపోతున్నాయి. ప్రభుత్వ దవాఖానల్లో డెలివరీలు తగ్గిపోయాయి. ప్రతిపక్షాలతో జైళ్లను నింపడంలో మార్పు మొదలైంది. కొత్త పథకాలు రాలేదు, ఉన్న పథకాల్లో కోతలు వచ్చాయి.ఆరు గ్యారంటీల్లో ఒక్కటైనా అమలయ్యిందా?. ఐదు గ్యారంటీలు అమలు చేశామని అబద్ధాలు చెప్తున్నారు. రైతులకు మోసం, మహిళలకు మోసం, పేదలకు మోసం. కాంగ్రెస్ మోసం చేయని మనిషి లేడు.రాష్ట్రం పరువు తీసేలా రేవంత్ మాట్లాడుతున్నారు. ఆయన భాషను తెలంగాణ ప్రజలు అంగీకరించడం లేదు. తెలంగాణ సాధించిన కేసీఆర్ పట్ల రేవంత్ భాషను ప్రజలు ఆమోదించడం లేదు. యువతకు, భవిష్యత్ తరానికి రేవంత్ ఏం సందేశం ఇస్తున్నారు?. కేసీఆర్ చేసినవాటికి వ్యతిరేకంగా చేయడమే రేవంత్ ఉద్దేశం. రోజూ ప్రజలను కలుస్తానని చెప్పిన సీఎం.. మొదటి రోజు తప్ప మళ్లి కనిపించలేదు. 3.50 లక్షల దరఖాస్తులు వస్తే ఎన్ని పరిష్కరించారో చెప్పలేదు. పార్టీలు మారినవారిని రాళ్లతో కొట్టాలన్న రేవంత్ ఇప్పుడు చేస్తున్నదేంటి?. పార్టీ మారితే వెంటనే అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పారు. కానీ, బీఆర్ఎస్ నుంచి చేర్చుకున్న ఎమ్మెల్యేలున్న వేదికపైనే మేనిఫెస్టో ప్రకటించారు. -
ఆరు గ్యారంటీలు, రుణమాఫీ చెయ్.. రాజీనామా ఇస్తా..!
సాక్షి,సిద్దిపేట/చండూరు/అక్కన్నపేట(హుస్నాబాద్): ‘‘ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15లోగా అమలు చేస్తే.. నేను రాజీనామా చేస్తా.. హామీలను అమలు చేయకపోతే సీఎం పదవికి రేవంత్రెడ్డి రాజీనామా చేస్తారా?’’ అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు సవాల్ చేశారు. రేవంత్రెడ్డి రాజీనామా పత్రాన్ని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్రెడ్డికి పంపించాలని... పది నిమిషాల్లో నేనూ స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను పంపిస్తానని..ఇందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. శుక్రవారం సిద్దిపేటలో, నల్లగొండలో, అదే జిల్లా చండూరులో, సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘ప్రమాణ స్వీకారం చేసి కుర్చీలో కూర్చోగానే రైతులకు రుణమాఫీ చేస్తానని బాండ్ పేపర్ రాసిచ్చిన సీఎం రేవంత్రెడ్డి.. ఆ హామీ ఇప్పటికీ అమలు చేయలేదు. ఇప్పుడేమో ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తానంటూ ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడి మీద ఒట్టు పెడుతున్నారు. రేవంత్ రుణమాఫీ అమలు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఉప ఎన్నికల్లో కూడా పోటీచేయను. పదవుల కోసం చిల్లర రాజకీయాలు చేయడం నాకు అలవాటు లేదు.వారిది ఢిల్లీకి గులాంగిరీ!రేవంత్రెడ్డి ఢిల్లీకి గులాంగిరీ చేస్తున్నారు. ఏం చేయాలన్నా ఢిల్లీకి వెళ్లాల్సిందే. తోడు పెళ్లికొడుకులా ఉప ముఖ్యమంత్రిని వెంట తీసుకుని ఇప్పటివరకు 20 ట్రిప్పులు పోయారు. అదే కేసీఆర్ తెలంగాణ ప్రజలే హైకమాండ్గా సేవలు అందించారు. స్వార్థం కోసం కొందరు నాయకులు పార్టీ మారొచ్చు కానీ, పార్టీ కోసం పనిచేసే నాయకులు, కార్యకర్తలు కేసీఆర్తో ఉన్నారు. అబద్దపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చి.. హామీలు అమలు చేయని కాంగ్రెస్ను పాతాళానికి తొక్కాలి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి’’ అని హరీశ్రావు పిలుపునిచ్చారు.కేసీఆర్ యాత్రను చూసి వణుకుకేసీఆర్ బస్సుయాత్ర సూపర్ సక్సెస్ కావడంతో కాంగ్రెస్, బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయి. చీకటి ఒప్పందంతో చెరో 8 సీట్లు పంచుకున్నాయి. ఒకరేమో దేవుడిని చూపించి, మరొకరు దేవుడి మీద ఒట్లు పెట్టి ఓట్లు అడుగుతున్నారు. కాంగ్రెస్ హిందువుల ఆస్తులను ముస్లింలకు పంచుతుందని ప్రధాని ఆరోపిస్తున్నారు. బీజేపీతో రిజర్వేషన్లు రద్దు అవుతాయని రేవంత్రెడ్డి అంటున్నారు. అవేమీ జరగబోవు. హైదరాబాద్ను ఉమ్మడి రాజధాని చేయడానికి చంద్రబాబు లాంటి వాళ్లు కుట్ర చేస్తున్నారు. మేం వాళ్ల ఆటలు సాగనివ్వబోం. -
అగ్రనేతల క్యూ! సై.. అంటే సై!!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: లోక్సభ ఎన్నికల పోరు కీలక దశకు చేరింది. ఇంకా వారం రోజుల్లో ప్రచార పర్వం ముగియనుంది. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో విజయమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి.రాష్ట్రంలో ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం రేవంత్ సొంత ఇలాకా కావడంతో పార్టీ అధిష్టానం పాలమూరుపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టింది. రెండింటిలోనూ విజయకేతనం ఎగురవేసి సత్తా చాటాలని బీజేపీ.. సిట్టింగ్ స్థానాలను తిరిగి దక్కించుకుని, పట్టు నిలుపుకోవాలని బీఆర్ఎస్ కదనరంగంలో దూకుడు ప్రదర్శిస్తున్నాయి.ప్రచార గడువు దగ్గరపడుతుండడంతో ఆయా పార్టీ ల అభ్యర్థులకు మద్దగా అగ్రనేతలు రంగంలోకి దింపుతున్నారు. మహబూబ్నగర్, నాగర్కర్నూల్ పార్లమెంట్ల పరిధిలో జాతీయ, రాష్ట్రస్థాయి నేతలు రోడ్షోలు, బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ప్రచారం మరింత హోరెత్తనుంది.ఇవి చదవండి: మరోసారి పీఠమెక్కేదెవరో..? -
కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసింది: హరీష్ రావు
-
బీజేపీతో జోడీ లేకపోతే ఈడీ
హత్నూర(సంగారెడ్డి) /జిన్నారం (పటాన్చెరు): బీజేపీతో జోడి లేకపోతే ఈడీ కేసులు బనాయిస్తున్నారని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ఆరోపించారు. గురువారం రాత్రి సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌల్తాబాద్, గుమ్మడిదల, జిన్నారం మండలం బొల్లారం మునిసిపాలిటీలో మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఎమ్మెల్యే సునీతారెడ్డితో కలిసి రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు ప్రసంగిస్తూ బీజేపీతో తాము కలవకపోవడంతోనే ఎమ్మెల్సీ కవితపై ఈడీ కేసులు బనాయించి జైల్లో పెట్టారని, కేసులకు భయపడేది లేదన్నారు. పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు నిధులు రాలేదని విమర్శించారు. మతాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకోవడం కోసమే బీజేపీ ప్రయతి్నస్తోందని మండిపడ్డారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు ఏకంగా భార్యాభర్తలను విడదీసి ఓట్లు వేయించుకోవాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీకి ఓటు వేస్తే కాంగ్రెస్కు వేసినట్టేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రిజెక్ట్ అయిన బాండ్ పేపర్లాంటిదని, బాండ్ పేపర్ రిజెక్ట్ అయితే కేసులు ఎలా నమోదు చేస్తారో ప్రజలు కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఉద్యమంలో ఏ ఒక్కరోజు పాల్గొనని రేవంత్రెడ్డి తెలంగాణ కోసం మాట్లాడే నైతిక హక్కు లేదని హరీశ్రావు పేర్కొన్నారు. జై తెలంగాణ అన్న ఉద్యమకారులపై రైఫిల్ పట్టుకొని దాడి చేసిన రేవంత్రెడ్డికి ఈరోజు తెలంగాణ గుర్తుకొచి్చందా అని ప్రశ్నించారు. -
తెలంగాణకు రేవంత్రెడ్డి శనిలా పట్టాడు: హరీష్ రావు
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణకు రేవంత్రెడ్డి శనిలా పట్టాడని ధ్వజమెత్తారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ అధికారంలోకి వచ్చాక, మంచినీళ్ల కష్టం వచ్చిందని విమర్శించారు. ఎక్కడ పోతే ఎక్కడ దేవుళ్లపై ఒట్టు వేస్తున్నాడని మండిపడ్డారు. మాట్లాడితే రెండు లక్షల రుణమాఫీ చేస్తా అంటున్నాడే తప్ప ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పడం లేదని దుయ్యట్టారు. అంటే ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు గాలికి వదిలిసేనట్టేనా అని ప్రశ్నించారు.సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటట్రామి రెడ్డి కి మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలోఎమ్మెల్యే హరీష్ రావు, గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. బీజేపీయే కాదు కాంగ్రెస్ కూడా తెలంగాణకి గాడిద గుడ్డు ఇచ్చిందని విమర్శలు గుప్పించారు. అయిదు నెలల కాంగ్రెస్ పాలనలో ఒక్క బస్సు తప్ప మిగాతావన్ని తుస్సేనని ఎద్దేవా చేశారు. ఒకరేమో దేవుని చూపించి ఓట్లు అడుగుతున్నారు..ఇంకొకరమో దేవుడిపై ఒట్టు వేసి ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు.రైతుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటున్నదన్నారు. కాంగ్రెస్ నాయకులు అధికార అహాంకారంతో ఉన్నారని, వారిని భూమి మీదకు దించాలని పేర్కొన్నారు. కేవలం పదవుల కోసం, పార్టీల కోసం జరుగుతున్న ఎన్నికలు కాదు.. తెలంగాణ భవిష్యత్కు జరుగుతున్న ఎన్నికలు ఇవని అననారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. -
హరీష్ రావు ఎమోషనల్
-
అయితే తిట్టు..లేదంటే ఒట్టు
వెల్దుర్తి (తూప్రాన్), చిన్నశంకరంపేట(మెదక్): సీఎం రేవంత్రెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అయితే తిట్టు.. లేదంటే ఒట్టు అన్నట్లుగా ఆయన విధానం ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఎద్దేవా చేశారు. దేవుడిని అడ్డం పెట్టుకొని రేవంత్రెడ్డి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్లో, చిన్నశంకరంపేటలో నిర్వహించిన సభలో హరీశ్ మాట్లాడారు.తప్పుడు వాగ్దానాలతో గద్దెనెక్కిన గుంపుమేస్త్రీ గువ్వ గుయ్యిమనేలా ఓటర్లు ఎంపీ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని పిలుపునిచ్చారు. హామీల అమలు చేయమని సవాల్ చేస్తే తోకముడిచి పారిపోయారని విమర్శించారు. మండుటెండల్లో గోదావరి నీరు తెచ్చి ఈ ప్రాంత ప్రజల కాళ్లు కడిగిన మాజీ సీఎం కేసీఆర్ రుణం తీర్చుకోవాలని కోరారు. బీజేపీకి ఓటేస్తే ప్రజల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారుతుందన్నారు. బీజేపీతో చేతులు కలిపి ముస్లింలకు మోసం మైనార్టీలకు కనీసం కేబినెట్లో మంత్రి పదవి కూడా ఇవ్వలేదని, ముస్లింలను సీఎం రేవంత్రెడ్డి మోసం చేస్తున్నారని హరీశ్రావు విమర్శించారు. బీజేపీతో చేతులు కలిపి ముస్లింలను రేవంత్రెడ్డి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం రంజాన్ తోఫా కూడా అందించలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్ హామీలు అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్ విసిరితే సీఎం పారిపోయారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో త్వరలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని.. ప్రజలకు మేలు చేస్తుందని హరీశ్ చెప్పుకొచ్చారు. -
రేవంత్కి ఓటమి భయం పట్టుకుంది
కరీంనగర్, సిద్దిపేటజోన్: లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే సీఎం పదవి నుంచి దింపేస్తారనే భయం రేవంత్రెడ్డికి పట్టుకుందని, అందుకే ఇచ్చిన హామీలు, పరిపాలనపై మాట్లాడాల్సిన ఆయన అసహనంతో తిట్ల దండకాన్ని అందుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు విమర్శించారు. శనివారం కరీంనగర్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి బోయినపల్లి వినోద్కుమార్కు మద్దతుగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే గంగుల నివాసంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యాయని, ఆ రెండు పార్టీల కుమ్మక్కు రాజకీయాలను ప్రజలు గమనించి ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి ఆరు గ్యారంటీలతోపాటు ఇచ్చిన 420 హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని, అందుకే ప్రధాని మోదీని సీఎం బడేబాయి అంటున్నారని, రేవంత్రెడ్డి ఓ ఫైటర్ అని బండి సంజయ్ పొగుడుతున్నారని, రేవంత్రెడ్డి బీజేపీలోకి రావాలని ఎంపీ అర్వింద్ మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఎవరికి ఎవరు బీ టీమ్నో అర్థం అవుతోందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ దోస్తీకు బోలెడు కారణాలు ఉన్నాయని, కరీంనగర్తోపాటు అనేక సీట్లలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలిపి పరోక్షంగా బీజేపీ గెలుపునకు సహకరిస్తోందన్నారు. నన్ను తిట్టినా ఫర్వాలేదు.. హామీలు అమలు చేయండి: హరీశ్ ‘‘నేను కొత్త డిమాండ్లను అమలు చేయమని అనలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అడుగుతున్నా. దానికి మీరు. మీ మంత్రులు నన్ను తిడుతున్నారు. నన్ను ఎంత తిట్టినా, ప్రజల కోసం భరించడానికి సిద్ధంగా ఉన్నా.. హామీలు అమలయ్యే వరకు అడుగడుగునా నిలదీస్తా’’అని హరీశ్రావు అన్నారు. శనివారం ఆయన సిద్దిపేటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఎవరెన్ని కుట్రలు చేసినా ఆరు గ్యారంటీలు అమలయ్యేంత వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. నాడు ఓటుకు నోటు అయితే.. నేడు ఓటుకు ఒట్టు అని ఎద్దేవా చేశారు. సీఎం సవాల్ మేరకు అమరవీరుల స్తూపం వద్దకు తాను రాజీనామాతో వస్తే రేవంత్ మొఖం చాటేశారని విమర్శించారు. రాజీనామా ఎలా చేయాలో తనకు తెలుసని, పదవులు ముఖ్యం కాదని, ప్రజా ఆకాంక్షలే ముఖ్యమని పేర్కొన్నారు.గతంలో వచ్చిన తెలంగాణను కేంద్రం వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని కోరితే రేవంత్రెడ్డి జిరాక్స్ కాగితం ఇచ్చి మోసం చేసి పారిపోయారని విమర్శించారు. అప్పట్లో కిషన్రెడ్డి రాజీనామా చేయలేదని అలాంటి వారు ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులు అని మండిపడ్డారు. కొత్త జిల్లాలను రద్దు చేయాలని సీఎం రేవంత్రెడ్డి చూస్తున్నారని, లోక్సభ నియోజకవర్గానికి ఒక జిల్లా సరిపోతుందంటూ అందుకు కమిషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని హరీశ్ ఆరోపించారు. -
హరీశ్.. పేజీన్నర లేఖ రాసి రాజీనామానా?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావుపై రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర రాజకీయాల్లో హరీశ్ రావు ఓ జోకర్లా మారారని, ఆయన అన్నీ హౌలా(పులిష్) పనులు చేస్తున్నారని అందుకే ఆయన్ను హౌవ్లేష్రావు అంటారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేయడానికి సిద్ధపడితే.. ఆయన స్పీకర్ ఫార్మాట్లో లేఖ ఇవ్వాలే తప్ప.. సుదీర్ఘంగా పేజీన్నర లేఖ రాసి రాజీనామా చేస్తు న్నట్లు ప్రకటించడం ఏమిటని మంత్రి కోమటిరెడ్డి నిలదీశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డితో కలిసి మీడియా తో మాట్లాడారు. ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటిస్తే..ఆ ఒక్క హామీ కాదు.. మొత్తం 13 హామీలు నెరవేర్చాలని.. లేదంటే రాజీనామాకు సిద్ధం కావాలని హరీశ్ సవాల్ చేస్తూ.. ఓ డూప్లికేట్ రాజీనామా పట్టుకుని అమరవీరుల స్తూపం వద్ద రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే మెదక్లో బీఆర్ఎస్ అభ్యర్థికి డిపాజిట్ తెచ్చుకోవాలని హరీశ్రావుకు సవాల్ విసిరారు. హరీశ్కు మతిభ్రమించింది అధికారం పోయాక హరీశ్కు మతిభ్రమించిందని మంత్రి విమర్శించారు. ఆర్థిక మంత్రిగా ఉండి ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వడం చేతకాని ఈ దద్దమ్మ, ఇవ్వాళ తాము ఒకటో తారీఖు జీతాలు ఇస్తుంటే ఓర్వలేకపోతున్నాడని నిందించారు. ఆయన, ఆయన మామ చేసిన రూ.లక్షల కోట్ల అప్పులకు ప్రతినెలా రూ.26 వేల కోట్ల వడ్డీలు కడుతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. జూన్ 3 తరువాత బీఆర్ఎస్ మూతే... పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మూతపడుతుందని మంత్రి జోస్యం చెప్పారు. మీ మామ చేసిన పలు హామీలు అమలు చేయనప్పుడు ఆ రాజీనామా లేఖ తీసుకుని అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. రుణమాఫీ కాంగ్రెస్ బ్రాండ్ అనీ.. అప్పటికే రుణం చెల్లించిన వారికి కూడా అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 5 వేల నుంచి రూ. 10 వేలు ప్రోత్సాహం ఇచ్చిన విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. నష్టమని తెలిసినా.. తెలంగాణ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ కి నష్టం జరుగుతుందని తెలిసినా.. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నేరవేర్చిన దేవత సోనియాగాంధీ అని మంత్రి కోమటిరెడ్డి కొనియాడారు. తెలంగాణ వస్తే దళితున్ని సీఎం చేస్తానని ఆ తరువాత తానే సీఎం అయిన కేసీఆర్ మోసగాడని నిందించారు. -
హరీశ్రావుకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: మోసం చేయాలనుకునే ప్రతీ సారి హరీశ్రావుకు అమరవీరుల స్థూపం గుర్తొస్తది అంటూ సీఎం రేవంత్రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం ఆయన సోషల్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, హరీశ్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం. ఇన్నాళ్లు ఎప్పుడైనా అమరుల స్థూపం దగ్గరకు వెళ్లారా?. చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటుండు.. రాజీనామా లేఖ అలా ఉండదు.. హరీష్ తన మామ చెప్పిన సీస పద్యమంతా లేఖలో రాసుకొచ్చారు’’ అని ఎద్దేవా చేశారు.స్పీకర్ ఫార్మాట్ లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదు. హరీశ్ తెలివి ప్రదర్శిస్తున్నారు.. ఆయన తెలివి మోకాళ్లలో కాదు.. అరికాళ్లలోకి జారినట్టుంది.. హరీశ్..ఇప్పటికీ చెబుతున్నా.. నీ సవాల్ను కచ్చితంగా స్వీకరిస్తున్నాం.. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతాం.. నీ రాజీనామా రెడీగా పెట్టుకో’’ అంటూ రేవంత్ సవాల్ విసిరారు.రాజీనామా పేరుతో మళ్లీ హరీశ్ జోకర్ అయ్యాడు:మంత్రి కోమటిరెడ్డిమరోసారి రాజీనామా లేఖ పేరుతో హరీశ్రావు డ్రామాలు చేస్తున్నారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మండిపడ్డారు. హరీశ్ బీఆర్ఎస్లో ఉద్యోగి మాత్రమే. ఆగస్టు 15లోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని సీఎం ప్రకటించారు. ఇప్పటికే 5 గ్యారెంటీలు అమలు చేశాం. హరీశ్రావుకు పర్సనాలిటీ పెరిగింది కానీ.. బుర్ర మాత్రం పెరగలేదు. నీ దగ్గరకు పని కోసం వస్తే మంత్రిగా ఒక్క పని చేయకలేకపోయావు. రాజీనామా పేరుతో మళ్లీ హరీశ్రావు జోకర్ అయ్యాడు. బీఆర్ఎస్ పార్టీనే మోసాల పార్టీ, అవినీతి పార్టీ’’ అంటూ మంత్రి కోమటిరెడ్డి దుయ్యబట్టారు.హరీశ్రావుది దొంగ రాజీనామా. మీరు దొంగ దీక్షలు చేసినట్లు ఇప్పుడు చేస్తే నడవదు.ఇవాళ మళ్లీ మోసం చేయానికి వచ్చిండు.. నువ్వు డ్రామాలు ఆడితే ప్రజలు పట్టించుకోరు.. నువ్వు కేసీఆర్ కింద గులాం గిరి చేయాలి తప్ప నిన్ను ఎవరు పట్టించుకోరు.. 20 ఎండ్ల కింద 76 వేల కోట్ల రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. దమ్ముంటే మెదక్లో డిపాజిట్ తెచ్చుకో.. బీఆర్ఎస్ పార్టీ జూన్ 4 నుంచి దుకాణం బంద్ అవుతుంది. కేసీఆర్ దళితున్ని ముఖ్యమంత్రి చేశారా?. తెలంగాణా వస్తే దళిత ముఖ్యమంత్రి చేస్తా.. లేకుంటే నా మెడ మీద తలకాయ ఉండదు అన్నాడు.. నువ్వు తీసుకోలేదు తలకాయ మమ్మల్ని తీయమంటావా? లేకుంటే దళితులను తీయమంటావా?’’ అంటూ కోమటిరెడ్డి ధ్వజమెత్తారు. -
రైతుల క్షేమం కంటే నా ఎమ్మెల్యే పదవి గొప్ప కాదు : హరీశ్రవు
-
మాజీ మంత్రి హరీష్ రావు, సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం
-
గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత.. రాజీనామా లేఖతో హరీశ్
సాక్షి, హైదరాబాద్: రైతు రుణమాఫీపై తెలంగాణ రాజకీయం వేడెక్కింది. మాజీ మంత్రి హరీష్రావు, సీఎం రేవంత్ మధ్య సవాళ్లు.. ప్రతి సవాళ్ల మాటల యుద్ధం సాగుతోంది. రాజీనామా పత్రం జేబులో పెట్టుకొని సిద్ధంగా ఉండాలంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు రాజీనామా లేఖతో గన్పార్క్కు చేరుకున్నారు. దీంతో గన్ పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులు భారీగా చేరుకున్నాయి. హరీష్రావు సవాల్తో పోలీసులు భారీగా మోహరించారు. గన్పార్క్ వద్ద అనుమతి లేదని పోలీసులు అంటున్నారు.దమ్ముంటే సీఎం రేవంత్ తన సవాల్ స్వీకరించాలి..గన్ పార్క్ అమరుల స్తూపం వద్ద నివాళులర్పించిన హరీష్ రావు.. మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలన్నారు. ఆయనకు రావడానికి మొహమాటంగా ఉంటే పీఏతోనైనా స్టాఫ్తోనైనా రాజీనామా లేఖను పంపించాలన్నారు. జర్నలిస్టుల సాక్షిగా.. మేధావుల చేతిలో రాజీనామా లేఖను పెడుతున్నానన్నారు.‘‘ఆగస్టు 15th లోగా ఏకకాలంలో రుణమాఫీ చేయాలి. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో ఇప్పటికే మోసం చేసింది. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి కాంగ్రెస్ మాట తప్పింది. సోనియమ్మ మాట అంటూ రేవంత్ రెడ్డి ప్రజలను ఎన్నికల్లో హామీ ఇచ్చి మోసం చేశారు. రైతుల కోసం నా రాజీనామా నా ఒక్క ఎమ్మెల్యే పదవి గొప్ప కాదు. రైతుల కోసం నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. రేవంత్ రెడ్డి తను ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. సోనియా గాంధీ పేరుతో తెలంగాణ ప్రజలను రేవంత్ రెడ్డి తప్పుదోవ పట్టించారు’’ అని రేవంత్ ధ్వజమెత్తారు.గన్ పార్కు వద్దకు చేరుకున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హరీశ్రావుకు మద్దతు పలికారు. ఈ సందర్బంగా తలసాని మాట్లాడుతూ, రుణమాఫీపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పిందంటూ మండిపడ్డారు. డిసెంబర్ 9వ తేదీన రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్ మాట తప్పింది. ఇప్పుడు ఆగస్టు 15 అంటూ మరోసారి ఎన్నికల స్టంట్ వేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే హరీష్ రావు సవాల్ను స్వీకరించి ఇక్కడికి రావాలి. ఇవాళ కాకున్నా రేపైనా హరీష్ రావు సవాల్ను సీఎం రేవంత్ రెడ్డి స్వీకరించాలని తలసాని డిమాండ్ చేశారు. -
నేడు గన్పార్కుకు నేనొస్తున్నా..దమ్ముంటే నువ్వూ రా
మెదక్జోన్/సాక్షి, హైదరాబాద్: రాజీనామా పత్రం జేబులో పెట్టుకొని సిద్ధంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు స్పందించారు. ‘మెదక్ నుంచి రేవంత్రెడ్డికి మరోసారి చాలెంజ్ చేస్తున్నా.. శుక్రవారం ఉదయం 10గంటలకు అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్తూపం దగ్గరికి నేను రాజీనామా పత్రంతో వస్తున్నా.. దమ్ముంటే నువ్వూ అక్కడికి రా. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేసేది నిజమైతే.. బాండ్ పేపర్ల మీద రాసిన గ్యారంటీలు అమలు చేసే మాట నిజమైతే.. గన్పార్కు వద్దకు రా.. ఇద్దరం రాజీనామా లేఖలను మేధావుల చేతు ల్లో పెడదాం. ఆగస్టు 15లోపు రుణమాఫీ, ఆరు గ్యారంటీలను అమలు చేస్తే నా రాజీనామా లేఖను మేధావులు తీసుకెళ్లి స్పీకర్కు ఇస్తారు. ఒకవేళ అమలుకాకపోతే నీ రాజీనామా లేఖను గవర్నర్కు ఇస్తా రు.. నువ్వు సిద్ధమా? కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి తోకముడిచినట్లే’అని హరీశ్రావు వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మెదక్లో భారీ ర్యాలీ నిర్వహించారు. రాందాస్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో హరీశ్ ప్రసంగించారు. కాగా, స్పీకర్ ఫార్మాట్లో హరీశ్ రాజీనామా పత్రం సిద్ధం చేసుకున్నా రు. దీంతో శుక్రవారం ఉదయం 10 గంటలకు అమరుల స్తూపం వద్దకు వెళ్లనున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. ఆయనతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అక్కడికి వెళ్లనున్నారు. మెడలు వంచుతాం.. ‘అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కొడుకులు గాల్లో ఉన్నారు. హామీలు అమలు కావాలన్నా.. వారిని కిందకు దింపి మెడలు వంచాలన్నా రాష్ట్రంలో బీఆర్ఎస్కు కనీసం 12 సీట్లు ఇవ్వాలి’అని హరీశ్రావు అన్నారు. పేగులు మెడలో వేసుకొని తిరుగుతా అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడుతున్నారని, అసలు పేగులు వేసుకొని తిరిగేది రాక్షసులు కదా అని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అనాల్సిన మాటలేనా అని ప్రశ్నించారు. జిల్లాలను తొలగించే కుట్ర చేస్తున్నారు.. పదేళ్లుగా కేసీఆర్ ఏం చేశారని సీఎం అనడం విడ్డూరంగా ఉందని హరీశ్రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కొత్త జిల్లాలు చేయడంతోనే రేవంత్రెడ్డి మెదక్ వచ్చి కలెక్టరేట్లో వారి అభ్యర్థి నామినేషన్ దాఖలుకు వచ్చారని, లేకుంటే సంగారెడ్డి పోయే వాడన్నారు. జిల్లాలు ఎక్కవయ్యాయని, కొన్నింటిని తొలగించే కుట్ర చేస్తున్నారని, అలాచేస్తే మెదక్ ప్రజలు ఊరుకుంటారా? అని అన్నారు. కనీసం చరిత్ర తెలుసుకోకుండా రేవంత్ మాట్లాడుతున్నాడని, ఇందిరాగాంధీ మెదక్ నుంచి ఎంపీగా గెలిచి ప్రధానమంత్రి అయ్యాకే సంగారెడ్డికి బీహెచ్ఈఎల్ లాంటి పరిశ్రమలు వచ్చాయనడం ఆయన విజ్ఞతకు నిదర్శనమన్నారు. 1952లోనే సంగారెడ్డికి బీహెచ్ఈఎల్ పరిశ్రమ వచ్చిందని, ఇందిరాగాంధీ 1980లో ప్రధాని అయ్యారని గుర్తుచేశారు. కేసీఆర్ బస్సు యాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి కాంగ్రెస్లో వణుకు పుట్టిందన్నారు. -
ఆగస్టు 15 డెడ్లైన్.. నేను రాజీనామాకు రెడీ: రేవంత్కు హరీష్ సవాల్
సాక్షి, హైదరాబాద్: రాబోయే ఆగస్టు 15వ తేదీలోపు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసి, హామీలను అమలు చేస్తే తాను రాజీనామా చేస్తానని మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. దీంతో, ఎన్నికల వేళ మరోసారి పొలిటికల్ హీట్ చోటుచేసుకుంది. కాగా, మాజీ మంత్రి హరీష్ సంగారెడ్డిలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘సీఎం రేవంత్ సవాల్ను నేను స్వీకరిస్తున్నా. అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చేసే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది. అలాగే, సీఎంకి కూడా సవాల్ చేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసి.. ఆగస్టు 15లోగా ఏకకాలంలో రుణ మాఫీ చేస్తే.. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయను. అలాగే రైతు రుణమాఫీ, కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలు అమలు చేయకపోతే.. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామాకు సిద్ధమా?. తెలంగాణ అసెంబ్లీ ముందు ఉన్న అమరుల స్థూపం వద్ద తెలంగాణ అభివృద్ధిపై చర్చ పెడదాం. నేను చర్చకు వస్తాను. రేవంత్ చర్చకు వచ్చే దమ్ముందా?’ అని కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి నేను సవాల్ విసురుతున్నఎల్లుండి అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం వద్దకి నేను వస్తా.. మీరు రండి అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాంఆగస్ట్ 15 లోపు మీరు ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తానని నువ్వు ప్రమాణం చెయ్యి..ఆగస్ట్ 15 లోపు పూర్తిగా ఆరు గ్యారంటీలు అమలు… pic.twitter.com/jUVKakgdYf— Telugu Scribe (@TeluguScribe) April 24, 2024Video Credit: Telugu Scribeఇదే సమయంలో సీఎం రేవంత్కు హరీష్ రావు కౌంటరిచ్చారు. ‘నాకు పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యం. గతంలో కొడంగల్లో ఓడిపోతే సన్యాసం తీసుకుంటానని చెప్పి తోక ముడిచి మాట తప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆరు గ్యారెంటీలను డిసెంబర్ 9 కల్లా అమలు చేస్తామని చెప్పి మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన మాట తప్పడం, పూటకో పార్టీ మారడం మీ నైజం. 120 రోజులు దాటినా మీ గ్యారెంటీలు ఏమయ్యాయి?. మహాలక్ష్మి పథకంలో మహిళలకు రూ.2,500 ఎందుకు ఇవ్వలేదు? రైతులకు ఎకరానికి రైతు బంధు రూ.15,000 సహాయం ఎందుకు ఇవ్వలేదు? ధాన్యానికి రూ.500 బోనస్ ఏది?. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ను నమ్మే పరిస్థితి లేదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. -
హామీలు అమలు చేస్తే..రాజీనామా చేస్తా..
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/ఖమ్మం: ‘వందరోజుల్లో రుణమాఫీ చేస్తానని చెప్పి.. మళ్లీ వచ్చే ఆగస్టు 15 తేదీలోగా చేస్తానని రేవంత్రెడ్డి నయా నాటకం మొదలుపెట్టిండు. మిస్టర్ రేవంత్రెడ్డి ఆగస్టు 15వ తారీఖులోపు రూ.2 లక్షల రుణమాఫీ చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామాకు సిద్ధమా? నువ్వు పార్టీ రద్దు చేసుకుంటవా అని రేవంత్రెడ్డి నన్ను అంటున్నడు. ఖమ్మం నుంచి మళ్లీ చెబుతున్నా. నేను సవాల్ను స్వీకరిస్తున్నా.ఇచ్చిన మాట ప్రకారం వడ్డీతో సహా రూ.39వేల కోట్లు రుణమాఫీ, ఆరు గ్యారంటీలు అమలు చేయకపోతే రాజీనామాకు సిద్ధమా? ఈనెల 26న ఉదయం 10గంటలకు అసెంబ్లీ ఎదురుగా అమరవీరుల స్తూపం వద్దకు వస్తా, నువ్వు రా. అక్కడ బాండ్ పేపర్పై రాసి ప్రమాణం చేయి. నువ్వు అమలు చేస్తే.. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రమాణం చేస్తా. మళ్లీ పోటీ కూడా చేయను. అమలు చేయకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమా’అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రశ్నించారు.బుధవారం సంగారెడ్డిలో జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్, ఖమ్మంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ రెండు కార్యక్రమాలకు హాజరైన అనంతరం హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ రేవంత్రెడ్డి తీరును విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక రాష్ట్రంలో కాంగ్రెస్పార్టీ గ్రాఫ్ పడిపోయిందని, కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న రేవంత్రెడ్డిది పూటకోసారి మాట మార్చడం ఆయన నైజం అన్నారు. రేవంత్ తొండి రాజకీయం చేస్తున్నారన్నారు.ఆరు గ్యారంటీలు, 13 హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని మీ తల్లిగా మాట ఇస్తున్నానని సోనియా సంతకాలతో బాండు పేపర్లు రాయించి పంపిణీ చేశారని. రాహుల్, ప్రియాంకగాం«దీలతో ప్రకటన చేయించారని గుర్తు చేశారు. 120 రోజులు గడుస్తున్నా, హామీలు అమలు చేయకుండా ఇప్పుడు దేవుళ్లపై ప్రమాణం చేస్తున్నారన్నారు. ప్రజలు నమ్మేలా లేక దేవుడిని వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. గార్యంటీల అమలుకు శాసనసభ తొలి సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి, మడమ తిప్పారని, రూ.2లక్షల రుణమాఫీకి విధివిధానాలనే ఖరారు చేయలేదని, మరోమారు గడువు పెడుతున్న రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.మహాలక్ష్మి పథకం కింద ఒక్కో మహిళకు నెలకు రూ.2,500 చొప్పున ఇస్తామన్న సాయం 4 నెలలుగా ఇవ్వకుండా ఒక్కో మహిళకు రూ.పది వేల బాకీ పడ్డారని, కల్యాణలక్ష్మి లబి్ధదారులకు తులం బంగారం, రైతుభరోసా సాయం ఎకరానికి రూ.15 వేలు, వరికి క్వింటాల్కు రూ.500 బోనస్, పెంచిన పింఛన్లు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు, నిరుద్యోగభృతి నెలకు రూ.4 వేలు ఎప్పుడు ఇస్తారని నిలదీశారు. కాంగ్రెస్ పార్టీకి సీపీఎం, సీపీఐ ఎందుకు ఊడిగం చేస్తున్నాయని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఆయా పార్టీల నేతలు విజ్ఞతతో ఆలోచించాలన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ముద్దు పేర్ల యుద్ధం...పంజాబ్లో కొత్త పోకడ
- Lok Sabha Election 2024: బస్తీ మే సవాల్!
- ఎన్నికల వేళ పట్టుబడ్డ సొత్తు ఎంతంటే..
- బరువు తగ్గాలంటే.. మిల్లెట్స్తో హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ !
- 200 లోక్సభ స్థానాల్లో గెలవడం కష్టమే.. దీదీ ఎద్దేవా
- హైదరాబాద్లో భారీగా పెరిగిన ఇళ్ల రిజిస్ట్రేషన్స్.. వాటికే డిమాండ్ ఎక్కువ
- T20 WC: టీమిండియా ఆటగాళ్ల అమెరికా ప్రయాణం ఆరోజే!
- ప్రధానిపై చర్యలు తీసుకోండి: ‘ఈసీ’కి ఖర్గే డిమాండ్
- మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
- మెగా‘ఆవేశం స్టార్’ నాగబాబు.. ఆలోచన తక్కువ..తొందరెక్కువ!
Advertisement