-
ఇండియా కూటమిని గెలిపించాలి
● మంచికి, చెడుకు మధ్య జరుగుతున్న పోరాటం ● మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నెహ్రూసెంటర్: దేశ సమాగ్రాభివృద్ధి, పరిరక్షణ, సంక్షేమం కోసం ఇండియా కూటమిని (కాంగ్రెస్) గెలిపించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సీపీఎం బలపర్చిన కాంగ్రెస్ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ను గెలిపించాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్స్లో ఎన్నికల సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్న ఎత్తుగడలు ఎండగట్టాలని, ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికలు పేదలు, పెట్టుబడిదారులకు, మంచికి, చెడుకు జరుగుతున్న పోరాటమని, ఈ పోరాటంలో ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. బీజేపీ, బీఆర్ఎస్కు వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభమైందని, ఇందులో ఇండియా కూటమి తప్పక గెలుస్తుందని ఽధీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాంనాయక్ గెలుపు కోసం కృషి చేయాలని, అత్యధిక మెజార్టీ అందించాలని పిలుపునిచ్చారు. ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ ఎన్నికల్లో లబ్ధిపొందాలని చూస్తున్న బీజేపీని గద్దె దించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సుంకరి వీరయ్య చెప్పారు. సభలో డోర్నకల్, మానుకోట ఎమ్మెల్యేలు రాంచంద్రునాయక్, భూక్య మురళీనాయక్, డీసీసీ అధ్యక్షుడు భరత్చందర్రెడ్డితోపాటు జి.నాగయ్య, వెన్నం శ్రీకాంత్రెడ్డి, ఘనపురపు అంజయ్య పాల్గొన్నారు. కాంగ్రెస్ సత్తా చాటాలి మరిపెడరూరల్: మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం మరిపెడ మండలం గాలివారిగూడెం స్టేజీ ఏఎన్నార్ గార్డెన్స్లో నిర్వహించిన మహబూబాబాద్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల్లో బలరాంనాయక్ను గెలిపించాలని కోరారు. -
కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి..
ఖమ్మంసహకారనగర్: ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించేందుకు, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు రఘురాంరెడ్డి, బలరాంనాయక్ను గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీలు బి.మోహన్రెడ్డి, పూల రవీందర్ అన్నారు. ఆదివారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో చర్చించామని, ఆయన అన్ని విషయాలపై సానుకూలంగా స్పందించి ఎన్నికల కోడ్ ముగియగానే సమస్యల పరిష్కారానికి హామీనిచ్చారన్నారు. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏల్లో రెండింటిని విడుదల చేస్తామని, ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆరోగ్య కార్డులు, పెండింగ్ బిల్లులను జూన్ 30లోగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. సమావేశంలో మోతు కూరి మధు, రవీందర్రెడ్డి పాల్గొన్నారు. -
ఇక దోస్త్ షురూ..
ఖమ్మంసహకారనగర్ : రాష్ట్ర ప్రభుత్వం డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ప్రవేశాల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ను ఈనెల 3వ తేదీన విడుదల చేసింది. ఈనెల 6 నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా.. డిగ్రీలో బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీసీఏ, బీబీఎం తదితర కోర్సుల్లో చేరాలనుకునే వారు దోస్త్ వెబ్సైట్ను సంప్రదించాల్సి ఉంటుంది. దోస్త్ వెబ్ఆప్షన్ల ప్రక్రియలో విద్యార్థులు ఆన్లైన్ ద్వారా తాము చేరదలుచుకున్న కళాశాలను, సబ్జెక్టులను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ అడ్మిషన్ ప్రక్రియ మూడు విడతలుగా కొనసాగుతుంది. ఖమ్మం జిల్లాలో ఐదు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 37 ప్రైవేటు డిగ్రీ కళాశాలలున్నాయి. ఖమ్మం నగరంలో ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, సత్తుపల్లి, నేలకొండపల్లి, మధిరల్లో డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో కలిపి 15,840 సీట్లు ఉన్నాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 16 ప్రైవేటు కళాశాలలు ఉండగా 7,380 సీట్లు ఉన్నాయి. మీ సేవ, ఆన్లైన్ సర్వీస్లతో పాటు దోస్త్ వెబ్సైట్ ద్వారా విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దోస్త్ ప్రక్రియ ఇలా.. దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) ద్వారా డిగ్రీలో ప్రవేశాల కోసం మూడు విడతల్లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. తొలి విడత ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుండగా వచ్చే నెల 25వ తేదీ వరకు విద్యార్థులు రూ.200 రుసుంతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈనెల 15 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, జూన్ 3న మొదటి విడత డిగ్రీ సీట్ల కేటాయింపు ఉంటాయి. 4 నుంచి 10వ తేదీ వరకు ఆయా కళాశాలల్లో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కళాశాల ఫీజు, సీటు రిజర్వేషన్ ఫీజు ఆన్ౖలైన్ ద్వారా చెల్లించాలి. ● ఇక 2వ విడతలో రూ. 400 రిజిస్ట్రేషన్ ఫీజుతో ఆన్లైన్ చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చే నెల (జూన్) 4 నుంచి 13వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు ఉండగా, 4 నుంచి 14వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. 18న సీట్లు కేటాయిస్తారు. 19 నుంచి 24వ తేదీ వరకు విద్యార్థులు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కళాశాల ఫీజు, సీటు రిజర్వేషన్ ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ● 3వ విడత ప్రక్రియ జూన్ 19 నుంచి 25వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు జరగనుండగా రూ.400 ఫీజు చెల్లించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. 19 నుంచి 26వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు, 29న సీట్ల కేటాయింపు జరగనుంది. 29 నుంచి జూలై 3వ తేదీ వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. 1, 2, 3 విడతల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులంతా జూన్ 29నుంచి జూలై 5వ తేదీ వరకు ఆయా కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. జూలై 1 నుంచి 6వ తేదీల్లో ఆయా కళాశాలల్లో విద్యార్థులతో ఓరిఝెంటేషన్ కార్యక్రమాలు ఏర్పాటుచేసి 8 నుంచి తరగతులు నిర్వహించనున్నారు. మూడు విడతల్లో డిగ్రీలో ప్రవేశాలు నేటి నుంచి దరఖాస్తులు రిజిస్ట్రేషన్ సమయంలో విద్యార్థులకు కావాల్సినవి.. ఇంటర్ ద్వితీయ సంవత్సరం హాల్టికెట్ నంబర్ ఆధార్కార్డు జిరాక్స్ ఆధార్కార్డుకు లింకై న ఫోన్ నంబర్. టెన్త్, ఇంటర్మీడియట్ మెమోలు 6 నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు ఇంటర్మీడియట్ టీ.సీ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పాస్పోర్టు సైజ్ ఫొటో ఆధార్కార్డు ఓటీపీలు ఇతరులకు చెప్పొద్దు దోస్త్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఓటీపీని ఎవరికీ చెప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే కళాశాలలో ఉన్న హెల్ప్డెస్క్లో సంప్రదించవచ్చు. లేదంటే సమీపంలోని కళాశాలల్లో ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్లను సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. – ఎం.సుబ్రహ్మణ్యం, దోస్త్ కో ఆర్డినేటర్, ఖమ్మం -
వేసవి అభ్యాసం
‘జాగ్రత్తమ్మా సుభద్ర... అక్కడకు వెళ్లాక ఆ వైభోగంలో మమ్మల్ని మర్చిపోతావేమో’ అంటుంది రేవతి పాత్రధారి ఛాయాదేవి సుభద్ర పాత్రధారైన ఋష్యేంద్రమణితో ‘మాయాబజార్’లో. అప్పటికి పాండవుల స్థితి చెడలేదు. ఇంద్రప్రస్థం నుంచి పుట్టిల్లైన ద్వారకకు సుభద్ర రాకపోకలు సాగుతున్నాయి. సోదరులైన బలరాముడు, కృష్ణుడు ఆదరిస్తున్నారు. మేనకోడలైన శశిరేఖను తన కుమారుడైన అభిమన్యుడికి చేసుకోవాలని సుభద్ర తలపోస్తోంది. రేవతి ఉబలాటపడుతోంది. పిల్లలు ముచ్చటపడి ఆశ కూడా పెట్టుకున్నారు. కాని ఒక్కసారిగా పరిస్థితి మారి జూదంలో పాండవుల రాజ్యం పోయింది. అడవుల పాలు కావాల్సి వచ్చింది. ఒకనాడు సుభద్ర రాకకోసం వేయికళ్లతో ఎదురు చూసిన రేవతి ఇప్పుడామె చెడి పుట్టింటికి చేరితే ఏం చేసింది? దొంగ శిరోభారంతో పడకేసింది. పొడ గిట్టనట్టుగా చూసింది. మనుషులు అలా ఉంటారు.పాండవులకు అన్యాయం జరిగిందని తెలిసి బలరామ పాత్రధారి గుమ్మడి వీరావేశంతో కౌరవుల భరతం పట్టడానికి బయలుదేరినప్పుడు భయంతో దుర్యోధన పాత్రధారి ముక్కామల కంపిస్తే, శకుని పాత్రధారి సి.ఎస్.ఆర్. ‘భయమెందుకు? ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉంది’ అని ఊరుకోబెడతాడు. వేంచేసిన బలరాముడిపై పూలవర్షం కురిపించి, కన్యకామణుల చేత పన్నీరు చిలకరింపచేసి ప్రసన్నం చేసుకుంటాడు. భరతం పడతానన్న బలరాముడే ‘ధర్మజూదంలో జయించడం ధర్మయుద్ధంలో జయించినంత పుణ్యమే’ అని రాజ్యం లాక్కున్న కౌరవులను ప్రశంసిస్తాడు. అంతేనా? దుర్యోధనుడి కుమారుడైన లక్ష్మణ కుమారుడికి తన కుమార్తె శశిరేఖను కట్టబెట్టే వరం ఇస్తాడు– చెల్లెలు సుభద్రకు ఇచ్చిన మాట మరిచి. మనుషులు అలా కూడా ఉంటారు.ధర్మరాజు రాజసూయం చేయడం, మయసభ కట్టడం దుర్యోధనుడికి కంటగింపు అయ్యింది. కయ్యానికి అసలు కారణం అదే. ద్రౌపది నవ్వు మిష. అది గమనించిన శకుని ‘తలలో ఆలోచనలు చేతిలో పాచికలు... వీటితో పాండవులను సర్వనాశనం చేస్తాను’ అన్నప్పుడు ప్రకృతి కలవరపడి వెర్రిగాలితో వద్దు వద్దు అని సంకేతం ఇస్తుంది. కాని దుర్యోధనుడు వినడు. శకుని విననివ్వడు. సిరిని ప్రదర్శనకు పెట్టి ధర్మరాజు చెడ్డాడు. అది చూసి అసూయతో దుర్యోధనుడు మునిగాడు. ‘రాజ్యాలు పోయినా పరాక్రమాలు ఎక్కడికి పోతాయి’ అని సుభద్ర అంటుంది కాని పరాక్రమం లేకపోయినా అందలం ఎక్కాలనుకునేవారు ఉంటారు. వారికి భజన చేసి పబ్బం గడుపుకునేవారూ ఉంటారు. లక్ష్మణ కుమారుడు రేలంగి ఎప్పుడూ అద్దం ముందే ఉంటాడు. అలంకరణప్రియుడు వీరుడే కాదు. మరి ఇతని గొప్పతనమో? ‘అటు ఇద్దరె ఇటు ఇద్దరె అభిమన్యుని బాబాయిలు. నూటికి ఒక్కరు తక్కువ బాబాయిల సేన తమకు’. ఇతనికి స్తోత్రాలు వల్లించే శర్మ, శాస్త్రులు ఉద్దండ పండితులేగాని ‘ప్రభువుల ముందు పరాయి వారిని పొగడకూడదనే’ ఇంగితం లేని వారు. అందుకే శకుని ‘మీకు పాండిత్యం ఉంది కాని బుద్ధి లేదయ్యా’ అని చివాట్లు పెడతాడు. బుద్ధి లేని మనుషులు బుద్ధి ఉన్న మనుషుల్ని పితలాటకంలో పెట్టడమే లోకమంటే.స్వభావరీత్యా చెడ్డవాళ్లు, పరిస్థితుల రీత్యా చెడ్డతనం ప్రదర్శించేవాళ్లు... వీళ్లు మాత్రమే కిటకిటలాడితే జనులు నిండిన ఈ భూమి భ్రమణాలు చేయకపోవును. కష్టంలో ఉన్నప్పుడు సాయానికి వచ్చే మనుషులు తప్పక ఉంటారు. అడవులు పట్టిన సుభద్ర, అభిమన్యుల కోసం హిడింబి, ఘటోత్కచుడు, చిన్నమయ్య, లంబు, జంబు వీరితోపాటు దుందుభి, దుందుభ, ఉగ్ర, భగ్ర, గందరగోళక, గగ్గోలక తదితర అసుర సేన పరిగెత్తుకొని రాలేదూ? వీరందరి కంటే అందరి మొర వినే మురారి ఉండనే ఉన్నాడాయె. చివరకు కౌరవుల ఆటకట్టి సుభద్ర పౌరుషం నిలిచి శశిరేఖ ఆమె కోడలు కావడంతో ‘మాయాబజార్’ ముగుస్తుంది.తెలుగు వారికి మాత్రమే దొరికిన అమూల్యమైన వ్యక్తిత్వ వికాస సంగ్రహం ‘మాయాబజార్’ చిత్రం. అస్మదీయులను కలుపుకు వెళ్లి, తస్మదీయులతో జాగ్రత్తగా మెసలి, పైకి ఒకలాగా ఆంతర్యాలు వేరొకలాగా ఉండేవారిని కనిపెట్టుకుంటూ, ప్రగల్భాలరాయుళ్లను గమనించుకుంటూ, ఉబ్బేసే వాళ్ల ఊబిలో పడకుండా, దుష్ట పన్నాగాలతో బతికే వారితో దూరంగా ఉంటూ, అనూహ్యంగా మారిపోతూ ఉండే మనుషుల చిత్తాలను అర్థం చేసుకుంటూ, చిన మాయల పెను మాయల నడుమ ముందుకు సాగడం ఎలాగో ఈ సినిమా చెబుతుంది. అది కూడా ఏదో శాస్త్రం చెప్పినట్టుగా ‘నిష్కర్షగానూ కర్కశంగానూ’ కాదు. ‘సౌమ్యంగా సారాంశం’ అందేలాగానే. వేసవి వచ్చింది. నెల సెలవులున్నాయి. పిల్లలకు అందాల్సిన చాలా వాటిని నాశనం చేశాం. దుంప తెంచి ధూపం వేశాం. కనీసం ఈ సినిమా చూపించండి. వారు ఘటోత్కచుణ్ణి చూసి ‘హై హై నాయకా’ అంటారు. భక్ష్యాలకూ చిత్రాన్నాలకు తేడా తెలుసుకుంటారు. శాకాంబరీ దేవి ప్రసాదాన్ని నాలుక మీద వేసి ‘ఠ’ అంటూ లొట్టలు వేస్తారు. తల్పం గిల్పం కంబళి గింబళి చూసి కిలకిలా నవ్వుతారు. ఆ రోజుల్లోనే వీడియో కాల్ చేయగలిగిన ‘ప్రియదర్శిని’ పెట్టెకు నోళ్లు తెరుస్తారు. ‘సత్యపీఠం’ అను ‘లైడిటెక్టర్’తో సైన్స్ ఊహలు చేస్తారు. ‘ముక్కుకు తగలకుండా నత్తును కొట్టే’ ప్రావీణ్యం విద్యలో కలిగి ఉండాలని తెలుసుకుంటారు. తియ్యటి తెలుగుల ధారలలో లాహిరీ విహారం చేస్తారు. తెలుగు నేల మీద ఎప్పుడు వేసవి వచ్చినా పిల్లలకు ప్రిస్క్రయిబ్ చేయాల్సిన తొలి అభ్యాసం ‘మాయాబజార్’. అది చూసిన పిల్లలకు ఒక వీరతాడు, చూపించిన తల్లిదండ్రులకు రెండు వీరతాళ్లు. మాయాబజార్... నమో నమః -
ఆటోడ్రైవర్ ఆత్మహత్య
ఖమ్మంక్రైం: నగరంలోని వన్టౌన్ పరిధిలో ఆటోడ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చర్చికాంపౌండ్ ప్రాంతానికి చెందిన కాళంగి మధు (45) కొంతకాలంగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నాడు. జీవితంపై విరక్తి చెందిన ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుమారుడు కృపాకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాలీ ఆటో పల్టీ రఘునాథపాలెం: మండలంలోని రాంక్యాతండా రోడ్డులో మూలమలుపు వద్ద ట్రాలీ ఆటో పల్టీకొట్టిన ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. గ్రామస్తుల కథనం ప్రకారం.. నగరంలోని బాలాపేటకు చెందిన 10 మంది యువకులు ఓ శుభకార్యానికి డీజే తీసుచొచ్చేందుకు ట్రాలీ ఆటోలో రాంక్యాతండాకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటో పల్టీ కొట్టగా ఆనంద్, మంగీలాల్, నాగేశ్వరరావుతో పాటు వికాస్ గాయపడ్డారు. వారందరినీ ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. -
35 మంది మావోయిస్టుల లొంగుబాటు
చర్ల: ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో ఆదివారం 35 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ గౌరవ్రాయ్ వివరాలు వెల్లడించారు. ఛత్తీస్గఢ్ పోలీస్శాఖ చేపట్టిన పూనా నార్కొమ్ ప్రచారానికి ఆకర్షితులవుతున్న మావోయిస్టులు పెద్ద సంఖ్యలో వనం వీడి జనం బాట పడుతున్నారని తెలిపారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాల అటవీ ప్రాంత గ్రామాల్లో కొంత కాలంగా కొనసాగుతున్న లోన్ వర్రాటో (ఇంటికి తిరిగి రండి) కార్యాక్రమంలో భాగంగా బీజాపూర్, దంతెవాడ, సుకుమా జిల్లాల్లోని వివిద ప్రాంతాల్లో పని చేస్తున్న 35 మంది మావోయిస్టులు స్వచ్ఛందంగా లొంగిపోయారని తెలిపారు. వారిలో ముగ్గురిపై రూ. లక్ష చొప్పున రివార్డు ఉందని, లొంగిపోయిన వారందరికీ పోలీస్ శాఖ, ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. తక్షణ సాయం కింద ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున నగదు అందజేసినట్లు వెల్లడించాచారు. లోన్ వర్రాటో కార్యక్రమం చేపట్టిన నాటి నుంచి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 796మంది మావో యిస్టులు లొంగిపోయారని, వారిలో 180 మందిపై రివార్డులు ఉన్నాయని ఎస్పీ వివరించారు. వివరాలు వెల్లడించిన దంతెవాడ ఎస్పీ గౌరవ్రాయ్ -
కాంగ్రెస్లో చేరికల లొల్లి..
వైరా/కొణిజర్ల: వైరా నియోజకవర్గ కాంగ్రెస్లో చేరికల లొల్లి షురువైంది. ఇప్పటికే నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి చేరికలు ప్రారంభం కావడంతో కాంగ్రెస్లో ఇప్పటివరకు పనిచేసిన నాయకులు వారిని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్లో చేరేందుకు వరస కట్టిన ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పుడు తమ అవసరాల నిమిత్తం కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతుండగా.. ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారు వ్యతిరేకిస్తున్నారు. ఆదివారం వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్ క్యాంపు కార్యాలయం వద్ద కొణిజర్ల మండల కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున సుమారు 3 గంటలకు పైగా ఆందో ళన చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యుత్ కూడా తొలగించి బీఆర్ఎస్ నుంచి వచ్చే వారిని చేర్చుకోవద్దని స్పష్టం చేశారు. కొణిజర్ల మండలంలో సొసైటీ చైర్మన్ చెరుకుమల్లి రవి, బీఆర్ఎస్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా పని చేసిన చిరంజీవి, శ్రీనవాసరావు, మాజీ సర్పంచ్ ఒకరు, సీనియర్ నాయకులు పార్టీని వీడి కాంగ్రెస్లో చేరేందుకు యత్నిస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి.. మంత్రికి దగ్గరగా ఉండే మండల నాయకుడి ద్వారా కాంగ్రెస్ కండువా కప్పించు కోవాలని ప్రయత్నించారు. దీనిని మంత్రి పొంగులేటి వ్యతిరేకించి, ఎమ్మెల్యే సమక్షంలో చేరాలని సూచించినట్లు సమాచారం. దీంతో మండల కాంగ్రెస్ అధ్యక్షుడినని చెప్పుకుంటున్న ఓ వ్యక్తి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సిఫార్సుతో పార్టీలో చేరేందుకు వైరాలో ఆదివారం భారీ ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న కొణిజర్ల మండలానికి చెందిన కోసూరి శ్రీనివాసరావు నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన నిర్వహించారు. టెంట్లు పీకి రచ్చ చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మె ల్యే రాందాస్నాయక్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని కార్యకర్తలను సముదాయించారు. అయినప్పటికీ కార్యకర్తలు ఎమ్మెల్యేను పట్టించుకోకుండా గలాటా సృష్టించారు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరేందుకు ప్రోత్సహించిన కొణిజర్ల మండల నాయకుడు వడ్డె నారాయణరావు క్యాంపు కార్యాలయంలో ఉన్నాడని తెలుసుకుని విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. సుమారు 3 గంటల పాటు కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యే సమక్షంలోనే రెండు వర్గాల మధ్య వాగ్వాదం -
నాడు ఒప్పయింది.. నేడు తప్పయిందా?
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో తెలుగుదేశం... దాని అనుబంధ ఎల్లో మీడియా పాపం పిల్లిమొగ్గలు వేస్తోంది... ఎలాగైనా ప్రజలను మెప్పించాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారు కాకుంటే ఇప్పుడు ఆ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వాళ్లే జస్ట్.. కొద్దిరోజుల క్రితం అబ్బో ఆ చట్టం... రైతులకు చుట్టం... అసలు అలాంటి చట్టం ఉంటే భూ యజమానులు నిశ్చింతగా ఉండొచ్చు.. మీ భూములు.. స్థలాలు కాపాడుకునేందుకు యాతనపడక్కర్లేదు అంటూ అప్పుడు చెప్పినవాళ్ళే ఇప్పుడు ఆమ్మో అది చట్టం కాదు... భూతం అంటూ కొత్త రాగాలు అందుకుంటున్నారు. చంద్రబాబుకు పనికొస్తుంది అంటే రాజ్యాంగాన్ని సైతం రద్దు చేద్దాం అనే స్థాయికి దిగజారిపోయారు. చంద్రబాబు కోసం ఐతే రామాయణం..ఇతిహాసాలు... బైబిల్ ఖురాన్ సైతం చదవొద్దు అని చెప్పడానికి వాళ్ళు ఏమాత్రం వెనుకాడరు.👉ల్యాండ్ టైట్లింగ్ చట్టం సూపర్...అలాంటి చట్టం దేశంలో గతంలో రానేలేదు... అలాంటి చట్టాలు ఉంటే ప్రజలకు నిశ్చింత..భూములకు భద్రతా అంటూ టీడీపీ ఎమ్మెల్యే పబ్లిక్ ఎకవుంట్స్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కూడా ఆనాడు అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ చట్టం మంచిదని, పలు దేశాల్లో ఇలాంటి చట్టం ఉండడంవల్లనే అక్కడ భూతగాదాలు లేవని వివరించారు... ఇలాంటి చట్టం ఆంధ్రాలో కూడా రావాలని డిమాండ్ చేసారు.. దీంతో అయన వాగ్ధాటి,,విషయపరిజ్ఞానం చూసి టీడీపీ సభ్యులు బల్లలు చరిచారు.👉ఈనాడు వారి ఈటీవీలో సైతం ఆమధ్య ఈ చట్టం గొప్పది అంటూ కథనాలు ఇచ్చారు... ఇప్పుడు ఆ చట్టం పేరిట ప్రజలను భయపెట్టడంలో రామోజీ ముందున్నారు...ఈనాడు పేజీలన్నీ ఆ చట్టాన్ని భూతంలా చూపిస్తూ నింపేయగా...ఈటీవీలో గంటలకొద్దీ చర్చలు పెడుతున్నారు... ఆంటే చంద్రబాబుకు ఉపయుక్తం ఆంటే తన వైఖరి ఎలాగైనా మార్చుకునేందుకు రామోజీరావుకు ఎలాంటి సిగ్గు ఉండదు...👉ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి సైతం ల్యాండ్ టైట్లింగ్ చట్టం గొప్పతనాన్ని వివరిస్తూ ప్రసంగించారు... ఇప్పుడేమో ఆమె తన బంధువు చంద్రబాబు కోసం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయ్యారు... ఆంటే ఈ చట్టం గొప్పతనం..ప్రజలకు కలిగే మేలు గురించి ఈ ముగ్గురికీ తెలుసు కానీ...ఇప్పుడు చంద్రబాబుకు లబ్ది చేకూర్చడానికి ఆ ముగ్గురూ నాలుక మడతేశారు... జస్ట్ వారంలో జరిగే ఎన్నికల్లో ప్రజలు కుర్చీలు మడతేసి కొడితే ఆ ముగ్గురితో బాటు చంద్రబాబుకు సైతం జేజెమ్మ గుర్తొస్తుంది ..:::సిమ్మాదిరప్పన్న -
ఇలాంటి సంక్షేమాన్ని గతంలో చూశారా?: సీఎం జగన్
పల్నాడు, సాక్షి: మాట మీద నిలబడ్డ చరిత్ర చంద్రబాబుకి లేదని, మొన్నటి మేనిఫెస్టో చూస్తే బాబు చేయబోయే మోసం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఏపీలో 59 నెలల పాలనలో జరిగిన విప్లవాత్మక మార్పులను గమనించాలని ఏపీ ప్రజలను కోరారాయన. సోమవారం మధ్యాహ్నాం పల్నాడు జిల్లా మాచర్లలో జరిగిన ఎన్నికల ప్రచార భేరీలో ఆయన పాల్గొని ప్రసంగించారు.మాచర్ల.. సిద్ధమేనా?. ఎండను ఏమాత్రం లెక్క చేయకుండా చిక్కటి చిరునవ్వులు, ప్రేమా ఆప్యాయతలే కనిపిస్తున్నాయి. మీ అందరి ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, ఆత్మీయతల మధ్య మీ బిడ్డ ఇక్కడకు వచ్చిన ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకి, ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి సోదరుడికి, నా ప్రతి స్నేహితునికీ ..మీ అందరి ఆప్యాయతలకు, ప్రేమానురాగాలకు, మీ అందరి ఆత్మీయతలకు మీ జగన్ రెండు చేతులు జోడించి , హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.మరో వారం రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం కనిపిస్తోంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు రాబోయే ఐదేళ్ల మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. అదే చంద్రబాబుకు పొరపాటున ఓటు వేస్తే... పథకాలన్నీ ముగింపు. మళ్లీ మోసపోటమే.చంద్రబాబుకి ఏరోజు మాట మీద నిలబడిన చరిత్ర లేదు. సాధ్యంకాని రీతిలో ఆయన ఇప్పుడు ఇచ్చిన హామీలు.. ఆయన చేయబోయే మోసాల్ని కళ్లకు కడుతున్నాయి. కానీ, ఈ బిడ్డ జగన్ పాలనలో ఈ ఐదు సంవత్సరాల్లో.. 59 నెలల కాలంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా, చూడని విధంగా రూ.2 లక్షల 70 వేల కోట్ల రూపాయల్ని అక్కచెల్లెమ్మల కుటుంబాల బాగుండాలని వివిధ పథకాల రూపంలో 130 సార్లు బటన్ నొక్కాడు. మీ బిడ్డ తన పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. గతంలో.. ఎన్నికలయ్యాక మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేది చూశాం. మొట్టమొదటిసారిగా ఆ చెత్త బుట్టలో వేసే సంప్రదాయాన్ని మార్చి, గతంలో ఎప్పుడూ చూడని విధంగా దేశంలోనూ ఎక్కడా చూడని విధంగా.. మేనిఫెస్టోను ఒక బైబుల్ గా ఒక ఖురాన్గా ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99% హామీలు నెరవేర్చాం. 2 లక్షలకు పైగా ఉద్యోగాలిచ్చాం. ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత లేకుండా చేశాం.ఇప్పుడు నేను గడగడా కొన్ని పథకాల పేర్లు మచ్చుకు చెబుతాను. ఈ పథకాలన్నీ గతంలో ఎప్పుడైనా ఉన్నాయా? ఈ పథకాలన్నీ మీకు అందాయా అని మీరే ఆలోచించండి. గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో ట్యాబ్లు, బడులు తెరిచేసరికే విద్యాకానుక, బడుల్లో గోరుముద్ద, పిల్లల చదువులకు ఆ తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి.. గతంలో ఉన్నాయా? గతంలో జరిగిందా?. పూర్తి ఫీజులతో...ఏ అక్కా...ఏ చెల్లెమ్మా తన పిల్లల చదువుల కోసం అప్పులపాలు అవ్వకూడదని, పూర్తి ఫీజులతో ఒక జగనన్న విద్యాదీవెన, ఓ జగనన్న వసతి దీవెన..గతంలో ఎప్పుడైనా చూసారా?. నా అక్కచెల్లెమ్మలను వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడాలని, వాళ్లకు ఏదో ఒక ఆదాయాలు ఉండాలని, వాళ్లుకూడా ఎదగాలని, ఒక ఆసరా, చేయూత, సున్నావడ్డీ, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, నా అక్కచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ల స్థలాలు వారిపేరిట రిజిస్ట్రేషన్ చేయించే కార్యక్రమంతో పాటు అందులో 20 లక్షల ఇళ్లు కడుతున్న కార్యక్రమం కూడా చేపట్టాం. అక్కచెల్లెమ్మల కోసం ఇంతగా ఆలోచన చేసిన ప్రభుత్వం..మహిళా సాధికారత కోసం ఇంతగా పట్టించుకున్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూసారా?నా అవ్వాతాతలకు ఇంటికే రూ.3000 పెన్షన్ గతంలో ఎప్పుడైనా జరిగిందా?, రైతన్నలకు పెట్టుబడికి సహాయంగా రైతుభరోసా ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతున్నాను. రైతన్నలకు ఓ ఉచిత పంటలబీమా, సీజన్ ముగిసేలోగా ఇన్పుట్ సబ్సిడీ, పగటి పూటే 9 గం.ల ఉచిత విద్యుత్, ఒక ఆర్బీకే వ్యవస్థ...ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా? అని అడుగుతున్నాను.స్వయం ఉపాధికి అండగా తోడుగా ఉంటూ సొంత ఆటోలు, టాక్సీలు నడుపుతున్న డ్రైవరన్నలకు ఓ వాహన మిత్ర, నేతన్నలకో నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసాతో పాటు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్లకు, పక్కనే తోపుడు బళ్లలో ఉన్నవాళ్లకు, ఇడ్లీ కొట్టు పెట్టుకున్న వాళ్లకు, శ్రమజీవులకు తోడుగా ఉంటూ ఓ చేదోడు, ఓ తోడు అనే పథకం అందిస్తున్నాం. లాయర్లకు ఒక లా నేస్తం. ఇలా స్వయం ఉపాధి రంగంలో ఇంత మందికి తోడుగా ఉంటున్న పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగాయా?పేదవాడు ఆరోగ్యం కోసం అప్పులు పాలవ్వకూడదని.. పేదవాడు వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు. ఏకంగా ఆరోగ్యశ్రీని విస్తరించాం. రూ.25 లక్షల దాకా ఉచితంగా వైద్యం. పేదవాడికి ఆరోగ్య ఆసరా. గ్రామంలోనే విలేజ్ క్లినిక్. గ్రామంలోనే ఫ్యామిలీ డాక్టర్. ఇంటికే ఆరోగ్య సురక్ష. ఇన్ని విప్లవాత్మక మార్పులు పేదవాడి ఆరోగ్యం కోసం ఏ ప్రభుత్వమైనా ఎప్పుడైనా చేసిందా అని అడుగుతున్నాను.గ్రామ సచివాలయ వ్యవస్ధతో సమూల మార్పులు. గ్రామంలో అడుగు పెడుతూనే ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఏకంగా 600 రకాల సేవలు అదే గ్రామంలో అక్కడి ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 60-70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ. పథకాలు నేరుగా ఇంటికి వచ్చే కార్యక్రమం. పెన్షన్లు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమం. పౌరసేవలు నేరుగా ఇంటికొచ్చే కార్యక్రమాలు. రేషన్ బియ్యం నేరుగా ఇంటి వద్దకు వచ్చే కార్యక్రమాలు. గతంలో ఎప్పుడైనా జరిగిందా ? అని అడుగుతున్నాను.గ్రామంలోకి అడుగుపెడుతూనే ఒక సచివాలయ వ్యవస్థ. ఆ సచివాలయ వ్యవస్థ నుంచి నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చేయి పట్టుకు నడిపిస్తూ ఓ ఆర్బీకే. మరో నాలుగు అడుగులు ముందుకు వేస్తే ప్రతి పేదవాడికీ వైద్యంపరంగా అండగా ఉంటూ విలేజ్ క్లినిక్. ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే నాడునేడు ద్వారా బాగుపడ్డ ఇంగ్లీష్ మీడియం బడి. గ్రామానికే ఫైబర్ గ్రిడ్, గ్రామంలోనే డిజిటల్ లైబ్రరరీ. ఇవన్నీ కాక గ్రామంలోనే నా అక్కచెల్లెమ్మల రక్షణ కోసం మహిళా పోలీస్. అక్కచెల్లెమ్మల ఫోన్లో దిశ యాప్. ఇవన్నీ గతంలో ఉన్నాయా అని అడుగుతున్నాను. మునుపెన్నడూ చూడని విప్లవాలు.. మీ బిడ్డ పాలనలోనే జరిగాయి.మరో పక్క.. 14 ఏళ్లు సీఎంగా చేసానంటాడు చంద్రబాబు. మూడు సార్లు సీఎం అంటాడు. మరి ఇలాంటి చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా ఆయన చేసిన ఒక్కటైనా మంచి గుర్తుకు వస్తుందా?. చంద్రబాబు పేరు చెబితే ఏ పేదకైనా ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతున్నాను. అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు మోసాలు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు చంద్రముఖి. ఆయన మాయలు, ఆయన మోసాలు ఎలా ఉంటాయో.. 2014లో ఇచ్చిన పాంప్లెట్ చూస్తే మీకే అర్థమవుతుంది.ఈ పాంప్లెట్ గుర్తుందా? (2014 టీడీపీ మేనిఫెస్టో చూపిస్తూ).. 2014లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే ముగ్గురితో కలిసి కూటమిలో ఉన్న ఇదే ముగ్గురు పెద్దల ఫొటోలతో ముఖ్యమైన హామీలంటూ ఇంటింటికీ పంపించారు. వాళ్ల ఈటీవీ, టీవీ5, ఆంధ్రజ్యోతిలో ఊదరగొట్టించారు. 2014 నుంచి 2019 ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. మరి ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఇందులో చెప్పినవి ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా?..రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి రూ.87,612 కోట్ల వ్యవసాయ రుణాలకు సంబంధించిన మాఫీ జరిగిందా? పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తానన్నాడు. రూ.14,205 కోట్లు పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ జరిగిందా?. ఆడ బిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద రూ.25 వేలు మీ బ్యాంకుల్లో వేస్తామన్నాడు. రూ.25 వేల కథ దేవుడెరుగు ఇన్ని వేలమంది ఇక్కడ ఉన్నారు కదా? మీ అకౌంట్లలో కనీసం ఒక్క రూపాయి చంద్రబాబు వేశాడా?..ఇంటింటికీ ఉద్యోగం అన్నాడు. ఉద్యోగం ఇవ్వకపోతే నెల నెల రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు. ఐదేళ్లు అంటే 60 నెలలు, నెలకు రెండు వేలు చొప్పున ప్రతి ఇంటికీ రూ.1,20,000 ఇచ్చారా?.అర్హులందరికీ 3 సెంట్ల స్థలం అన్నారు. మీ అందరినీ కూడా నేను అడుగుతున్నా.. ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా ఇచ్చాడా? అని మీ బిడ్డ అడుగుతున్నాడు. రూ.10,000 కోట్లతో బీసీ సబ్ప్లాన్, చేనేత పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నాడు.. జరిగిందా?. విమెన్ ప్రొటెక్షన్ ఫోర్సు ఏర్పాటు చేస్తామన్నారు.. జరిగిందా? సింగపూరుకు మించి అభివృద్ధి చేస్తామన్నారు.. జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నారు.. జరిగిందా?. నేను మీ అందరినీ అడిగేది ఒక్కటే సాక్షాత్తు చంద్రబాబు సంతకం.. 2014లో స్వయంగా మీ ఇంటికి పంపారు. ముఖ్యమంత్రిగా పాలించారు. మరి ముఖ్యమైన హామీలంటూ ఆయన చెప్పినవి ఇందులో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా?.ప్రత్యేక హోదా అయినా ఇచ్చారా? అదీ అమ్మేశాడు. మరి నేను అడుగుతున్నాను. మళ్లీ ఇదే ముగ్గురూ.. మళ్లీ ఇదే చంద్రబాబు. ఇవాళ మళ్లీ కొత్త మేనిఫెస్టో అంట. సూపర్ సిక్స్ అంట.. నమ్ముతారా?, సూపర్ సెవెన్ అంట.. నమ్ముతారా? ఇంటింటికీ కేజీ బంగారం ఇస్తారంట.. నమ్ముతారా? ఇంటింటికీ బెంజికారు కొనిస్తారట నమ్ముతారా? మరి ఆలోచన చేయమని మీ అందరినీ కోరుతున్నాను.ఇలాంటి అబద్ధాలతో, మోసాలతో, వ్యక్తులతో మనం యుద్ధం చేస్తున్నాం. మళ్లీ వలంటీర్లు ఇంటికే రావాలన్నా.. పేదవాడి భవిష్యత్ బాగుపడాలన్నా.. పథకాలన్నీ కొనసాగాలన్నా.. లంచాలు, వివక్ష లేని పాలన జరగాలన్నా.. మన పిల్లలు, వారి బడులు, వారి చదువులు బాగుపడాలన్నా.. మన వ్యవసాయమూ, హాస్పిటల్ మెరుగుపడాలన్నా.. ఇవన్నీ జరగగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కితే 175 కు 175 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గేందుకు వీలే లేదు సిద్ధమేనా?.ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్లు ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాను ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ సింకులోనే ఉండాలి.మీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి , ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్లపైపై మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు వారిపై ఉంచాలని, ఓటేసి గెలిపించుకోవాలని సవినయంగా కోరుతున్నాను అని చెబుతూ సీఎం జగన్ తన ప్రసంగం ముగించారు. -
బస్సు, లారీ ఢీ
తల్లాడ: తల్లాడ మండలం పినపాక సమీపంలో ఆదివారం బస్సు, లారీ (కంటెయినర్) ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో 14 మందికి గాయాలయ్యాయి. మణుగూరు డిపోకు చెందిన బస్సు ఖమ్మం వెళ్తుండగా వైరా నుంచి తల్లాడ వైపు వస్తున్న లారీ పినపాక, డాన్బోస్కో పాఠశాల సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పాల్వంచకు చెందిన బొమ్మగాని శ్రావణి, ఖమ్మానికి చెందిన వందనపు ఝాన్సీరాణి, గార్లపాటి గీత, రమాదేవి, కె.ఉపేందర్రావు, ఎ.అరుణ, భార్గవి చింతకాని మండలం నేరడకు చెందిన వై.వెంకటేశ్వరరావు, అతని భార్య, ఎన్టీఆర్ జిల్లా అనిగండ్లపాడుకు చెందిన ఈలప్రోలు నరసింహారావు, లలిత, ఛత్తీస్గఢ్కు చెందిన సోను, బస్సు డ్రైవర్ అప్పారావు, వైరాకు చెందిన డి.విజయ్కు దెబ్బలు తగిలాయి. గాయపడిన వారిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని తల్లాడ ఎస్ఐ కొండల్రావు సిబ్బంది సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ స్తంభించడంతో జేసీబీ సాయంతో వాహనాలను తప్పించారు. పిడుగు పడి ఫర్నిచర్ దగ్ధం ఖమ్మంక్రైం: నగరంలో ఆదివారం సాయంత్రం పిడుగుపడి ఓ ప్రైవేట్ చిట్ఫండ్లో ఫర్నిచర్ దగ్ధం అయింది. షాదీఖానా వెనుక ఉన్న చిట్ఫండ్ భవనంపై ఒక్కసారిగా పిడుగుపడింది. కార్యాలయంలోని ఏసీలు, ఫర్నిచర్ దగ్ధం అయ్యాయి. సెలవు దినం కావటంతో కార్యాలయంలో ఎవరూ లేకపోవటం వల్ల ప్రమాదం తప్పింది. కార్యాలయం నుంచి పొగలు రావటంతో కింద ఉన్న దుకాణం వారు చిట్ఫండ్ వారికి, అగ్నిమాపక శాఖ వారికి సమాచారం అందించారు. ఖమ్మం అగ్నిమాపకశాఖాధికారి రాజేశ్వరరావు అధ్వర్యంలో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. బైక్ను తగలబెట్టిన దుండగులు నేలకొండపల్లి: బైక్ను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కై లాసపు నాగరాజు బైక్ను గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారు. ఆదివారం తెల్లవారుజామున డాబాపైన నిద్రిస్తున్న నాగరాజు కుటుంబ సభ్యులకు కాలుతున్న వాసన రావటంతో కిందకు దిగి చూశారు. అప్పటికే బైక్ (గ్లామర్) పూర్తిగా కాలిపోయింది. బాధితులు స్థానిక పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.