-
పకోడి కోసం మారాం
● కోపంతో కుమార్తెను కొట్టి చంపిన తల్లి ● హోల్ది గ్రామంలో విషాదంకొరాపుట్: పకోడి కోసం మారాం చేసిన కుమార్తెను తల్లి బలంగా కొట్టడంతో ఆ చిన్నారి మృత్యువాతపడింది. ఈ విషాద ఘటన నబరంగ్పూర్ జిల్లా రాయిఘర్ సమితి హోల్ది గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన లఖిరాం మజ్జి, త్రివేణి మజ్జిల కుమార్తె లఖిధర్ మజ్జి (9) చందాహండి సమితి ధర్మల్ ఆశ్రమ పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. వేసవి సెలవులకు ఇంటికి వచ్చింది. తల్లి త్రివేణి తన ముగ్గురు పిల్లలకు పకోడి తెచ్చి ఇచ్చింది. అయితే లఖిధర్ తనకు ఎక్కువ పకోడి కావాలని మారాం చేసింది. దాంతో ఆగ్రహించిన తల్లి అక్కడే ఉన్న వెదురు కర్రతో లఖిధర్ తలపై బలంగా కొట్టింది. ఆ దెబ్బకు లఖిధర్ అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఇంటి వెనుక నాళాలో లఖిధర్ మృతదేహం పడేసి డీజిల్ వేసి దగ్ధం చేసింది. అనంతరం తన కుమార్తె ఆత్మహత్య చేసుకుందని గ్రామస్తులను నమ్మించింది. విషయం తెలుసుకున్న రాయిఘర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. చిన్నారి ఆత్మహత్యపై అనుమానంతో దర్యాప్తు చేయగా జరిగిన విషయం త్రివేణి అంగీకరించింది. అనంతరం పోలీసులుత్రివేణిని అరెస్ట్ చేశారు. -
ఘనంగా ధ్యాన మందిర వార్షికోత్సవం
రాయగడ: జిల్లాలోని సదరు సమితి కొత్తపేట పంచాయతీ సింఘనాపూర్లొ గత ఏడాది నిర్మించిన సీతారామ ధ్యాన మందిరం ప్రథమ వార్షికోత్సవాన్ని శుక్రారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీచైతన్యరాంజీ ఆధ్వర్యంలో జరిగిన వార్షికోత్సవాల్లొ కొత్తపేట, జేకేపూర్, ఇరుకుబడి, పితామహాల్ పంచాయతీల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశేష నామార్చన, కుంకుమ, అభిషేక తదితర పూజా కార్యక్రమాలలు జరిగాయి. సంకీర్తనలు, భజన కార్యక్రమాలతో ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద కాపలా
పర్లాకిమిడి: స్థానిక శ్రీకృష్ణచంద్ర గజపతి కళాశాలలో ఈవీఎంలు, వీవీ ప్యాట్లు స్ట్రాంగ్ రూమ్లో ఉంచిన విషయం తెలిసిందే. దీంతో కళాశాల స్ట్రాంగ్ రూమ్ వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసినా, వివిధ పార్టీల అభ్యర్థులు తమ అనుచరులతో రాత్రివేళలో కాపలా ఉంటున్నారు. మోహనా నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే దాశరథి గొమాంగో, బీజేపీ అభ్యర్థి (మోహనా) ప్రశాంత్ మల్లిక్తో పాటు పర్లాఖెముండి నియోజికవర్గ కాంగ్రెస్, బీజేపీ నాయకులు స్ట్రాంగ్ రూమ్ బయట కాపలా కాస్తున్నారు. ఓట్ల లెక్కింపు వచ్చే 4న జరగనున్న దృష్ట్యా అధికార పార్టీపై అనుమానంతో కాపలాగా ఉంటున్నామని అభ్యర్థులు అంటున్నారు. -
శరవేగంగా రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు
పర్లాకిమిడి: స్థానిక రైల్వేస్టేషన్లో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి. స్టేషన్ ప్లాట్ఫారం ఎత్తు, టికెట్ కౌంటర్, రెస్ట్ షెడ్, వాష్ రూమ్, ఓవర్ బ్రిడ్జి నిర్మాణం వంటి పనుల వల్ల పర్లాకిమిడి మీదుగా పూరీ, భువనేశ్వర్, విశాఖపట్నం వెళ్లే పలు రైళ్లను రీ షెడ్యూల్ చేశారు. దీంతో ఈనెల 28 వరకు పలు రైళ్లు పలాస నుంచి తిరిగి వెళ్లనున్నాయి. పర్లాకిమిడిలో ట్రైన్లు ఆగుతుంటే ప్రయాణికులు బయటకు వెళ్లడానికి పలు సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ప్రయాణికుల సౌకర్యార్ధం రీ షెడ్యూల్ చేశారు. -
సామూహిక సత్యనారాయణ వ్రతాలు
భువనేశ్వర్: మహా వైశాఖి పురస్కరించుకుని గురువారం ఖుర్దారోడ్ ట్రాఫిక్ కాలనీ రామ మందిరంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. వైశాఖ మాసం సంపూర్ణ శక్తి ఈ పూర్ణిమ తిథిలో దాగి ఉన్నందున ఈ రోజున చేసిన సత్యనారాయణ వ్రతం పూర్ణ ఫలితాలు ప్రసాదిస్తుందని ప్రధాన అర్చకుడు పంతుల రఘునాథ శాస్త్రి తెలిపారు. సామూహికంగా నిర్వహించిన ఈ వ్రతంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాలుపంచుకున్నారు. ఈ ఏడాది తరచూ ఇటువంటి ఆధ్యాత్మిక, ధార్మిక, పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రామ మందిరం భక్త సమాజం వర్గం తెలిపింది. -
అన్వేష హాస్టల్లో అక్రమాలు
● నలుగురు అసిస్టెంట్ సూపరింటెండెంట్ల సస్పెన్షన్ ● ద్వితీచంద్ర సాహుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగింత ● కలెక్టర్ మనోజ్ సత్యవాన్ మహాజన్ ఆదేశాలురాయగడ: విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని పెట్టాల్సిన అధికారులు అందుకు భిన్నంగా వ్యవహించారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అధికారుల విచారణలో నిజమని తేలడంతో నలుగురు అసిస్టెంట్ సూపరింటెండెంట్లపై సస్పెన్షన్ వేటు వేశారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్ర సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక కొట్లాగుడ వద్ద అన్వేష హాస్టల్ను నిర్వహిస్తున్నారు. ఆదివాసీ హరిజన విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో నడుపుతున్న ఈ వసతి గృహంలో సుమారు వెయ్యిమంది విద్యార్థులు ఉంటున్నారు. పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇంగ్లిష్ మాధ్యమంలో చదువుకుంటూనే ఇక్కడ ఉండేవారు. మొత్తం నాలుగు వార్డుల్లో నివాసం ఉండే వీరందరికీ ప్రభుత్వం అందించే ఆహారం విషయంలో నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలు వచ్చాయి. దీంతో జిల్లా సంక్షేమ శాఖ అధికారి భరత్ భూషణ బిశ్వాల్ ఐదు నెలల క్రితం అన్వేష హాస్టల్ను సందర్శించి దర్యాప్తు చేశారు. ప్రతీ బుధవారం విద్యార్థులకు చికెన్ కూరతో కూడిన ఆహారాన్ని అందించాల్సి ఉన్నప్పటికీ దానికి బదులుగా పన్నీరు కూరతో భోజనం పెట్టినట్టు అధికారుల విచారణలో తేలింది. అలాగే నాణ్యమైన ఆహారాన్ని అందివ్వడం లేదని సంక్షేమ శాఖ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా జిల్లా కలెక్టర్ మనోజ్ సత్యవాన్ మహాజన్ చర్యలకు ఉపక్రమించారు. నలుగురు అసిస్టెంట్ సూపరింటెండెంట్లను సస్పెండ్ చేస్తూ గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. ఇన్చార్జి బాధ్యతలను ఉపాధ్యాయుడు ద్వితీ చంద్ర సాహుకు అప్పగిస్తున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. సస్పెన్షన్కు గురైన వారిలో హాస్టల్ ఒకటి, రెండు, మూడు, నాలుగు వార్డులకు చెందిన అసిస్టెంట్ సూపరింటెండెంట్లు రమాకాంత పట్నాయక్, గౌరీశంకర్ పిడిక, అరుంధతి పండ, ఎం.శివప్రసాదరావు ఉన్నారు. -
విద్యుదాఘాతంతో యువతి మృతి
రాయగడ: విద్యుదాఘాతంతో యువతి ప్రాణాలు కోల్పోయింది. మృతురాలిని జిల్లాలోని కొలనార సమితి సూరి పంచాయతీ పరిధి మునిసింగి గ్రామానికి చెందిన భాస్కర గౌడొ కూతురు లక్ష్మీగౌడొ (27)గా గుర్తించారు. శుక్రవారం ఉయదం చొటు చేసుకున్న ఈ సంఘటనకు సంబంఽధించి చందిలి పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్ష్మీగౌడొ తన ఇంట్లో బట్టలను ఇసీ్త్ర చేస్తుండగా ఇసీ్త్ర పెట్టెకు గల విద్యుత్ తీగ తగిలి షాక్కు గురైంది. దీంతో కుటుంబీకులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు ధ్రువీకరించారు. పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సాగర్ పనులపై అసంతృప్తి జయపురం: సబ్ డివిజన్లోని కొట్పాడ్ నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్(ఎన్.ఎ.సి) పరిధిలో దమయంతి సాగర్, దేవానిముండ చెరువుల పునరుద్ధరణ పనులపై కొట్పాడ్ ఎన్.ఎ.సి.చైర్మన్ ఎం.శంకరరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.20 కోట్లతో పనులు ప్రారంభమైనా సక్రమంగా జరగడం లేదని చెప్పారు. ప్రణాళిక లేకుండా ఇష్టారాజ్యంగా పనులు చేపడుతున్నారని, ఈ విషయమై ఇటీవల కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు వెల్లడించారు. స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి రాయగడ: రక్తదానం చేసేందుకు ప్రతీఒక్కరూ ముందుకు రావాలని స్థానిక బ్లడ్ బ్యాంక్ ఇన్చార్జి అధికారి డాక్టర్ గౌతం పట్నాయక్ అన్నారు. రాయగడ రక్తదాతల సంఘం ఐదో వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని రక్తనిధి కేంద్రంలో శుక్రవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్నవారికి ప్రాణదానం చేసినవారిమి అవుతామన్నారు. రక్తదానంపై ఉన్న అపోహలను విడనాడాలన్నారు. సంఘం అధ్యక్షులు విజయ్ చొలెట్, కార్యదర్శి అజయ్ అశ్రాని, డాక్టర్ అబ్దుల్ కలామ్ బ్లడ్ డొనేషన్ వ్యవస్థాపక సంఘం రాయగడ శాఖ అధ్యక్షుడు బి.రాజేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. చైల్డ్లైన్కు చిన్నారుల అప్పగింత మల్కన్గిరి: జిల్లాలోని పోడియ సమితి నీలిగూడ పంచాయతికి చెందిన 3 ఏళ్ల సుభద్రను జిల్లా న్యాయ సలహా కార్యాలయం వారు బాలిక రక్షణార్థం జిల్లా చైల్డ్లైన్ కార్యాలయానికి శుక్రవారం అప్పగించారు. వివరాల్లోకి వెళ్తే.. సుభద్ర తన తమ్ముడు బాబులితో కలిసి నీలిగూడ గ్రామంలో నివసిస్తుంది. వీరి తల్లిదండ్రులు చనిపోవడంతో సుభద్ర చదువు మానేసి తమ్ముడి కోసం ఇప్పపువ్వ ఏరడం, బీడీ ఆకులు అమ్మి వాటితో వచ్చిన డబ్బులతో తమ పొట్ట నింపుకుంటున్నారు. ఈ విషయం జిల్లా న్యాయ సలహా కార్యాలయం నాయ్యవాది అశోక్ కుమార్ పట్నాయక్కు ఈ విషయం తెలియడంతో ఇద్దరినీ వారి కార్యాలయానికి తీసుకొచ్చారు. అనంతరం ఈ చిన్నారులను జిల్లా శిశు సంరక్షణ కార్యాలయానికి అప్పగించారు. -
సంక్షేమ పథకాలపై మహిళలకు శిక్షణ
జయపురం: జయపురం చైల్డ్ ఫండ్ విభాగం ద్వారా లీడ్ మదర్ మహిళలకు స్థానిక పంచాయతీ సమితి కార్యాలయ సభాగృహంలో శిక్షణ శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. తల్లీబిడ్డల సంరక్షణ, ఆరోగ్య పరిరక్షణ, వివిధ ప్రభుత్వ పథకాలు అమలు చేయటంపై అవగాహన కల్పించారు. పంచాయతీల పరిధిలో పని చేస్తున్న సిబ్బంది మహిళలకు మంచిజరిగేలా పని చేయాలని అధికారులు వివరించారు. గొడొపొదర్, టంకువ, రొండాపల్లి, బరిణిపుట్ గ్రామ పంచాయతీల నుంచి 20 మంది లీడ్ మా మహిళలు శిక్షణలో పాల్గొన్నారు. శిశువులు, కిశోరీల ఆరోగ్యం, ప్రభుత్వ చేపట్టిన పథకాలపై శిక్షణ ఇచ్చామని నిర్వాహకులు తెలిపారు. రామణగుడ కమ్యూనిటీ వైద్య కేంద్రాధికారి డాక్టర్ సుధాకర బిశాయి లీడ్ మదర్ మహిళలకు శిక్షణ ఇచ్చారు. చెల్డ్ ఫండ్ విభాగ కోఆర్డినేటర్ పూర్ణిమా దాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అభినాశ్ సిన్హ, ప్రమీళ నాయక్, సీతామణి హంతాల్, మధుశ్మిత నాయక్, గౌరీ చరణ్ హంతాల్ పాల్గొన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా లీడ్ మా మహిళలకు తమ విధులపై మరింత అవగాహన ఏర్పడుతుందని కోఆర్డినేటర్ పూర్ణిమ దాస్ అన్నారు. -
మూడో విడత పోలింగ్ నేడే
భువనేశ్వర్: భువనేశ్వర్ అర్బన్ పోలీస్ డిస్ట్రిక్ట్ (యూపీడీ)లో 3వ దశ ఎన్నికల పోలింగు శనివారం జరగనుంది. యూపీడీ పరిధిలో పోలింగు కోసం 1,132 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రాంగణాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా యూపీడీ సమర్ధవంతమైన పోలీసు వ్యవస్థని ప్రవేశ పెడుతున్నట్లు డీసీపీ తెలిపారు. 51 మొబైల్ పెట్రోలింగ్ పార్టీలతో 3,000 మంది పోలీసులను మోహరిస్తున్నట్లు వివరించారు. భువనేశ్వర్ కమిషనరేట్ పోలీస్, ఒడిశా స్పేస్ అప్లికేషన్ సెంటర్ (ఒస్కాక్) పోలీస్ పెట్రోలింగ్, బూత్ మానిటరింగ్ సిస్టమ్ (పీపీబీఎంఎస్), వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ (వీటీఎస్) రెండు మొబైల్ అప్లికేషన్లను అభివృద్ధి చేశాయి. ఈ అప్లికేషన్ ద్వారా పోలింగ్ సమయంలో పెట్రోలింగ్ యూనిట్ల స్థానాన్ని పర్యవేక్షించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే అవసరమైన ప్రదేశానికి పంపవచ్చు. అంతేకాకుండా, ఈ అప్లికేషన్ ద్వారా, బూత్లో మోహరించిన సిబ్బంది నేరుగా బూత్ ప్రస్తుత స్థితి, పోలింగ్ స్థితి, క్యూలో వేచి ఉన్న ఓటర్ల సంఖ్య, అంతరాయం కలిగితే, వారు వెంటనే పూర్తి సమాచారాన్ని ఫోటోలు, వీడియోలతో తక్షణమే సమాచారం అందించగలిగే సదుపాయం కలిపించారు. మొబైల్ పార్టీలు పెట్రోలింగ్ చేయడానికి రూట్లు ముందే నిర్దేశించారు. ఆ మార్గంలో ఏదైనా మార్పు ఉంటే కంట్రోల్ రూమ్లోని డ్యాష్ బోర్డ్లో ఆఫ్–రూట్ హెచ్చరికను సూచిస్తుంది. 94,48,553 మంది ఓటర్లు.. ● ఈ విడత పోలింగులో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పోటీ చేస్తున్నారు. 42 అసెంబ్లీ స్థానాలకు 383 మంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. వీరిలో 339 మంది పురుషులు, 44 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. 6 పార్లమెంటరీ నియోజకవర్గాలకు 64 మంది ఎంపీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 55 మంది పురుష అభ్యర్థులు, 9 మంది మహిళా అభ్యర్థులు ఆరు లోక్సభ నియోజకవర్గాలకు పోటీలో ఉన్నారని సీఈవో వివరించారు. ● రాష్ట్రంలో 94,48,553 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 48.30 లక్షల మంది పురుషులు, 46.18 లక్షలు మహిళలు ఉన్నారు. ● 10,551 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ఏర్పాట్లు చేశారు. వీటిలో దాదాపు 200 ఆదర్శ పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. 2,000 పోలింగ్ స్టేషన్లు కీలకమైనవిగా గుర్తించారు. ● మహిళా పోలింగ్ సిబ్బంది ప్రత్యక్ష పర్యవేక్షణలో 1,500 పోలింగ్ కేంద్రాలు, దివ్యాంగుల పర్యవేక్షణలో 30 పోలింగ్ కేంద్రాలు పని చేస్తాయన్నారు. ఎన్నికల నిర్వహణకు 70 వేల మంది పోలింగ్ సిబ్బందిని నియమించనున్నట్లు సీఈఓ తెలిపారు. దేవ్గడ్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగు జరుగుతుందని, మిగిలిన అన్ని స్థానాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. హోమ్ ఓటింగ్.. భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మార్గదర్శకాల ప్రకారం బాలాసోర్ పార్లమెంటరీ నియోజక వర్గంలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించారు. ఈ ప్రక్రియలో 85 ఏళ్లు పైబడిప వయో వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్ద ఓటు వేసే సౌకర్యం కల్పిస్తున్నారు. అన్ని వర్గాల ఓటర్లు పోలింగు అత్యధిక సంఖ్యలో పాల్గొనేందుకు ప్రోత్సహించే దిశలో ఈసీఐ ఈ కార్యక్రమం చేపట్టింది. ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఓటు హక్కు వినియోగించుకోనున్న 94,48,553 మంది ఓటర్లు భువనేశ్వర్ యూపీడీలో ఓటింగ్కు సమర్థవంతమైన వ్యవస్థ -
ఎకై ్సజ్ అధికారుల ముమ్మర దాడులు
జయపురం: నాటుసారా తయారీ కేంద్రాలపై అబ్కారీశాఖాధికారులు శుక్రవారం ముమ్మరంగా దాడులు చేశారు. నవరంగపూర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ కమళ లోచన మిశ్ర, జిల్లా అబ్కారీశాఖాధికారి అభిరాం బెహరల ఆదేశాల మేరకు.. నవరంగపూర్ అబ్కారీశాఖ విభాగ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్ రథ్ పర్యవేక్షణలో నవరంగపూర్ అబ్కారీ స్టేషన్ అధికారి సుజిత్ నాగ్ తన సిబ్బందితో సారా బట్టీలపై దాడులు నిర్వహించారు. అబ్కారీ విభాగ బృందం సభ్యులు ఖతిగుడ పోలీసు స్టేషన్ పరిధి సవురాగుడ గ్రామం సమీప కొండ వాగు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. నాటు సారా వంటకానికి సిద్ధం చేసిన 2,400 లీటర్ల ఇప్ప ఊట, 750 లీటర్ల నాటు సారా పట్టుకొని వాటిని ధ్వంసం చేసినట్టు అధికారులు వెల్లడించారు. అలాగే తెంతులికుంటి పోలీసుస్టేషన్ పరిధిలో కొహియిగుడ గ్రామానికి చెందిన మధు బిశాయి అనే వ్యక్తి వద్ద 21 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్టు చేశారు. దాడుల్లో సబ్ఇన్స్పెక్టర్ త్రినాథ్ సౌర, మహిళ కానిస్టేబుల్ రంజీ జానీ, కానిస్టేబుల్ సుధాంశు శేఖర బాగ్, రంజిత్ సింహ, ఛతర గోండ్, అంశుమాన్ పొరిడ ఉన్నారు. 2,400 లీటర్ల ఇప్ప ఊట ధ్వంసం 750 లీటర్ల నాటుసారా ధ్వంసం -
ఘనంగా బుద్ధ జయంతి వేడుకలు
జయపురం: బుద్ధజయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. కొరాపుట్ జిల్లా సునాబెడ మున్సిపాలిటీతోపాటు నందపూర్ సమితిలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. సునాబెడ మున్సిపాలిటీ 20వ వార్డులో సెమిలిగుడ–నందపూర్ మార్గంలో సరస్వతి శిశువాటిక సమీపంలో బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్టించారు. మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రాజేంద్రకుమార్ పాత్రో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా బుద్ధ భగవానుడికి ధూప, దీప, ఫల, పుష్పాలతో పూజలు చేశారు. మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ.. బౌధ్ధ మతాన్ని స్థాపించి శాంతి, కరుణ, జ్ఞానమార్గాన్ని బుద్ధుడు ప్రబోధించారని గుర్తు చేశారు. విద్యార్థులు బుద్ధని మార్గంలో పయనించాలన్నారు. 20వ వార్డు కౌన్సిలర్ ప్రజ్ఞామయి నాయిక్, కౌన్సిలర్లు శంకర బిలాయి పొడియ, రవీంద్రకుమార్ ప్రధాన్, మనోజ్ సున, రామ బెనియ, బుద్ర అలంపొడియ, మమతా రాయ్, సురేంద్ర సెట్టి పాల్గొన్నారు. కొరాపుట్ జిల్లా నందపూర్ సమితి దొరాగుడ గ్రామంలో కూడా వేడుకలు జరిగాయి. బుద్ధ జయంతి సందర్భంగా ఆదివాసీ నాటకాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో కొరాపుట్ జిల్లా పుకాలీ, ఖినబరు, రంగినిగుడ, ఉమయిగంది, నందక గ్రామస్తులతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాలూరు, విశాఖ జిల్లా అరుకు ప్రాంతాల నుంచి ఆదివాసీ ప్రజలు పాల్గొన్నారు. రంగినిగుడ, ఉమయిగంది, దొరాగుడ గ్రామాల ప్రజలు సంయుక్తంగా లక్ష్మణ ఖింజయి అధ్యక్షతన బుద్ధ జయంతిని నిర్వహించారు. బుద్ధ పూర్ణిమ వేడుకల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికసాయం చేసినట్టు నిర్వాహకులు వెల్లడించారు. -
బావిలో పడిన వృద్ధుడు
భువనేశ్వర్: పూరీ జగన్నాథ ఆలయంలోని బహిరంగ బావిలో మంగళవారం రాత్రి పడిపోయిన వృద్ధ భక్తుడు అదృష్టవశాత్తు రక్షించబడ్డాడు. పశ్చిమ బెంగాల్కు చెందిన 65 ఏళ్ల ధ్రువ చక్రవర్తిగా గుర్తించబడిన వృద్ధ భక్తుడు అతని భార్యతో కలిసి స్వామివారి దర్శనం కోసం విచ్చేశాడు. గురువారం ఆలయానికి వెళ్లి సాయంత్రం రత్న వేదికపై కొలువుదీరిన మూల విరాటుల్ని దంపతులు దర్శించుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో తిరుగాడుతూ ఆనంద బజార్కు వెళ్లి మహా ప్రసాదం స్వీకరించారు. వారు నీరు కోసం ఆలయ ఉత్తర ద్వారం సమీపంలో ఉన్న బావి వద్దకు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రమాదవశాత్తు ధృవ చక్రవర్తి జారి బావిలో పడిపోయాడు. దీంతో అతని భార్య సాయం కోసం కేకలు వేయడంతో సేవకులు సంఘటనా స్థలానికి చేరుకుని సింహద్వారం ఠాణా పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బందితో పాటు పోలీసు బృందం బావి వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. దాదాపు గంటపాటు సహాయక చర్యలు చేపట్టి 70 అడుగుల లోతున్న బావిలో నుంచి ధ్రువను ప్రాణాలతో అగ్నిమాపక సిబ్బంది బయటకు తీశారు. అతనికి ఎలాంటి గాయాలు కానప్పటికీ వైద్యుల సంప్రదింపుల కోసం జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చేర్చారు. ఈ దుర్ఘటనకు దారితీసిన పరిస్థితులపై ఆలయ నిర్వాహకులు విచారణ జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
కొరియర్ పేరుతో సైబర్ మోసాలు
పార్వతీపురంటౌన్: ఫెడెక్స్ కొరియర్ పేరతో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని, ప్రతి ఒక్కరూ అప్రత్తంగా ఉండాల్సిందేనని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. స్థానిక విలేకరులతో ఆయన శుక్రవారం మాట్లాడారు. ఇన్నాళ్లూ ఉద్యోగం, వ్యాపారం, చలానాలు, ఆఫర్లు అంటూ మోసం చేసేవారని, ఇప్పుడు కొరియర్ పేరిట కొత్త మోసాలకు తెరతీస్తున్నారన్నారు. తాజాగా బెంగళూరుకు చెందిన ఓ న్యాయవాదికి ఫెడెక్స్ కొరియర్ సంస్థ నుంచి కాల్ చేస్తున్నాం... మీరు ముంబయి నుంచి థాయ్లాండ్కు పంపించిన పార్సిల్లో డ్రగ్స్తో పాటు ఇతర నిషేధిత వస్తువులు ఉన్నాయి.. వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. కేసు నుంచి తప్పించాలంటే డబ్బులు ఇవ్వాలంటూ దాదాపు రూ.15 లక్షలు కాజేశారన్నారు. తమ సంస్థ పేరుతో జరుగుతున్న మోసాలపై ఫెడెక్స్ సైతం స్పందించిందన్నారు. ఫోన్కాల్స్ ద్వారా తాము ఎప్పుడూ వ్యక్తిగత సమాచారం కోరబోమని తెలిపిందన్నారు. ఎవరైనా వ్యక్తిగత సమాచారం కోరుతూ ఫోన్లు, మెసేజ్ చేస్తే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇవి పాటించండి... ● అనుమానాస్పదంగా అనిపించే ఫోన్ కాల్స్కు రియాక్ట్ అవ్వొద్దు ● యూపీఐ పిన్, ఐడీ లాంటి సమాచారాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ షేర్ చేయొద్దు. ● అధికారిక ఫెడెక్స్ వెబ్సైట్లో మాత్రమే ప్యాకేజీ స్టేటస్ను చెక్ చేయాలి. ● సైబర్ నేరాలపై ఫిర్యాదు కొరకు 1930 నంబర్కు, లేదంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.సైబర్క్రైమ్.జీఓవీ.ఇన్లో ఫిర్యాదు చేయొచ్చు. అప్రమత్తంగా ఉండాల్సిందే... ఎస్పీ విక్రాంత్ పాటిల్ -
తొలిరోజు ప్రశాంతం
● టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం విజయనగరం అర్బన్: పదోతరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రశాంతంగా సాగాయి. జిల్లా వ్యాప్తంగా 19 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పదోతరగతి తెలుగు పరీక్షకు 1,218 మందికి 489 మంది మాత్రమే హాజరైనట్టు డీఈఓ ఎన్.ప్రేమకుమార్ తెలిపారు. ఇంటర్మీడియట్ సంప్లిమెంటరీ పరీక్షల్లో తొలి రోజు ఉదయం మొదటి సంవత్సర తెలుగు–1, సంస్కృతం–1, హిందీ–1, ఒకేషనల్–1 పరీక్షకు 3,542 మందికి 3,320 మంది హాజరయ్యారని ఆర్ఐఓ ఎం.ఆదినారాయణ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన రెండో సంవత్సరం తెలుగు–2, సంస్కృతం–2, హిందీ–2, ఒకేషనల్–2 సబ్జెక్టు పరీక్షలకు 969కి 883 మంది హాజరయ్యారు. సజావుగా డీఈఈ సెట్ జిల్లాలో శుక్రవారం నిర్వహించిన డీఈఈ సెట్–2024 ప్రవేశ పరీక్ష స్థానిక సీతం ఇంజినీరింగ్ కళాశాలలో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కంప్యూటర్ ద్వారా ఆన్లైన్ విధానంలో జరిగే పరీక్షకు 256 మంది హాజరుకావాల్సి ఉండగా 228 మాత్రమే పరీక్ష రాసినట్టు డీఈఓ ఎన్.ప్రేమకుమార్ తెలిపారు. -
Lok Sabha Election 2024: బీజేడీకి సవాల్!
ఒడిశాలో ఇప్పటిదాకా 9 లోక్సభ సీట్లకు, వాటి పరిధిలోని 63 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ పూర్తయింది. ఆరో విడతలో 6 లోక్సభ సీట్లకు శనివారం పోలింగ్ జరగనుంది. అధికార బిజూ జనతాదళ్, బీజేపీ హోరాహోరీగా తలపడుతుండగా కాంగ్రెస్ పూర్వ వైభవం కోసం శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో కీలక నియోజకవర్గాలపై ఫోకస్... సంభాల్పూర్... తొలిసారి కాషాయ జెండా 2019లో ఇక్కడ తొలిసారి కాషాయ జెండా ఎగిరింది. బీజేపీ నేత నరేశ్ గంగదేవ్ కేవలం 9,162 ఓట్ల తేడాతో బీజేడీ అభ్యర్థి నళినీకాంత ప్రధాన్ను ఓడించారు. ఈసారి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో దిగారు. కాంగ్రెస్ నుంచి నాగేంద్ర ప్రధాన్, బీజేడీ నుంచి ప్రణబ్ ప్రకాశ్ దాస్ పోటీలో ఉన్నారు. త్రిముఖ పోరు ఉత్కంఠ రేపుతోంది.కటక్... బీజేడీ కంచుకోటస్వాతంత్య్ర యోధుడు సుభాష్ చంద్ర బోస్ జన్మస్థలమిది, హొయలొలికించే మహానదీ తీరాన 900 ఏళ్లు కళింగ రాజధానిగా వెలిగింది. బీజేడీ దిగ్గజం భర్తృహరి మహతాబ్ 1998 నుంచి వరుసగా ఆరుసార్లు గెలిచారు. ఇటీవలే బీజేపీలో చేరి ఆ పార్టీ టికెట్పై బరిలోకి దిగారు. బీజేడీ నుంచి సంతృప్త్ మిశ్రా, కాంగ్రెస్ నుంచి సురేశ్ మహాపాత్ర రేసులో ఉన్నారు. కంచుకోటను కాపాడుకునేందుకు సీఎం నవీన్ పట్నాయక్ గట్టిగా ప్రయతి్నస్తున్నారు. కాంగ్రెస్కూ మంచి ఓటు బ్యాంకు ఉండటంతో త్రిముఖ పోరు ఉత్కంఠ రేపుతోంది.పూరి.. నువ్వా నేనా! సుందరమైన బీచ్లు, జగన్నాథుడి సన్నిధితో కళకళలాడే పూరిలో బీజేడీకి 2019లో బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర చుక్కలు చూపించారు. చివరిదాకా గట్టి పోటీ ఇచ్చి కేవలం 11,714 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈసారి మళ్లీ సవాలు విసురుతున్నారు. ఇక బీజేడీ సిట్టింగ్ ఎంపీ పినాకీ మిశ్రాకు బదులు ముంబై మాజీ పోలీస్ కమిషనర్ అరూప్ పట్నాయక్ను బరిలోకి దించింది. కాంగ్రెస్ నుంచి జయనారాయణ్ పటా్నయక్ పోటీలో ఉన్నారు. ఆ పారీ్టకి ఇక్కడ బలమైన ఓటు బ్యాంకుంది.భువనేశ్వర్... నవీన్కు సవాల్ ఈ టెంపుల్ సిటీలో గత ఎన్నికల్లో తొలిసారి బీజేపీ గెలిచింది. బీజేడీ అభ్యరి్థ, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ అరూప్ పటా్నయక్ను బీజేపీ తరఫున మాజీ ఐఏఎస్ అపరాజితా సారంగి ఓడించారు. ఈసారీ ఆమే బరిలో ఉన్నారు. బీజేడీ నుంచి మన్మథ రౌత్రే, కాంగ్రెస్ నుంచి యాసిర్ నవాజ్ పోటీలో ఉన్నారు. దాంతో త్రిముఖ పోటీ రసవత్తరంగా మారింది. ఇండియా కూటమి భాగస్వామి సీపీఎం కూడా పోటీలో ఉండటం కొసమెరుపు!కియోంజర్.. పోటాపోటీ ఈ ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం 2009 నుంచీ బీజేడీ గుప్పెట్లోనే ఉంది. 2019లో బీజేడీ నుంచి గెలిచిన చంద్రానీ ముర్ము యంగెస్ట్ ఎంపీగా రికార్డు సృష్టించారు. ఈసారి ధనుర్జయ సిద్దుకు బీజేడీ టికెటిచ్చింది. బీజేపీ నుంచి అనంత నాయక్, కాంగ్రెస్ నుంచి బినోద్ బిహారీ నాయక్ రేసులో ఉన్నారు. కియోంజర్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 బీజేడీ చేతిలోనే ఉండటం ఆ పారీ్టకి కలిసొచ్చే అంశం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఘనంగా ఆలయ వార్షికోత్సవం
రాయగడ: స్థానిక కస్తూరీనగర్లోని సత్యనారాయణ ఆలయ 13వ వార్షికోత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామి వారికి కుంకుమ అర్చనలు, అభిషేకాలు, సహస్రనామ పూజలతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరిపారు. కార్యక్రమంలో అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మావుడూరు కిశోర్శర్మ ఆధ్వర్యంలో వ్రత పూజలు చేశారు. సాయంత్రం స్వామివారి తిరువీధి కార్యక్రమం వైభవంగా జరిగింది. మధ్యాహ్నం సుమారు రెండు వేల మందికి అన్నప్రసాదాన్ని వితరణ చేశారు. -
కుసుమిలో ముగిసిన బలిజాతర
జయపురం: నవరంగపూర్ జిల్లా కుసుమి గ్రామంలో వ్యవసాయ సంబింధిత బలిజాతర బుధవారం సాయంత్రం విశాల జాతరతో ముగిసింది. గత 49 ఏళ్ల క్రితం బలిజాతర ఇక్కడ నిలిచిపోయింది. తిరిగి ఈ ఏడాది నుంచి ప్రారంభించినట్లు గ్రామస్తులు వెల్లడించారు. ప్రజల సుఖజీవనం, గ్రామ మంగళం, పంటలు బాగా పండాలని, గృహపాలిత పశుపక్షాదులు క్షేమంగా ఉండాలని కోరుతూ బలిజాతర జరిపినట్లు పేర్కొన్నారు. బలి జాతరలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన దేవతల లాఠీలు, దేవీ ఆసనాలైన కుర్చీలతో ప్రజలు పాల్గొన్నారు. గ్రామంలో ప్రజలు గ్రామ దేవత గుడిలో విత్తన మొలకల బుట్టలను తలలపె పెట్టుకొని ప్రజలు పాల్గొన్నారు. ఈ జాతరలో బలిజాతరలో త్రిలోచన పూజారి, గురుమాయి సమరి అమనాత్య, గ్రామ శిరా టిను నాయిక్, దిశారి సనాతన భొత్ర, రామ చంద్ర సమరథ్, జగదేవ్ దిశారి ప్రధాన భూమిక నిర్వహించారు. -
ఘనంగా తాళ్లపాక అన్నమయ్య జయంతి
పర్లాకిమిడి: పద కవితా పితామహుడు, తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుల జయంత్యుత్సవానిన పర్లాకమిడిలో గురువారం వైభవంగా నిర్వహించారు. సులలితా సంగీత భారతి అనే లలిత సంగీత పాఠశాల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాతపట్నం కిరణ్మయి విద్యాసంస్థల అధినేత తూలుగు తిరుపతిరావు హాజరయ్యారు. భాస్కరభట్ల కృష్ణమూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా.. వ్యాఖ్యాతగా వెల్లంకి కూర్మనాథరావు వ్యవహారించారు. అన్నమయ్య 14వ శతాబ్దంలోవేంకటేశ్వరునిపై 32 వేల గేయాలు, పదకవితలు రాసినప్పటికీ.. అందుబాటలో కేవలం 12 వేల అన్నమయ్య కీర్తనలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని మరో అతిథి.. విశ్రాంత ఉపాధ్యాయులు చెట్టి వేంకటేశ్వర్లు అన్నారు. ఈ సందర్భంగా కడప ఆలిండియా రేడియో విద్వాంసులు భాస్కరభట్ల కృష్ణమూర్తిని వేదికపై ముఖ్యఅతిథి తిరుపతి రావు మాస్టారు చేతుల మీదుగా దుశ్శాలువ, మెమెంటోతో సన్మానించారు. కార్యక్రమంలో అన్నమయ్య కీర్తనలను గుణశేఖర్ సుమధురంగా వినిపించగా కీబోర్డు ప్యాడ్పై రాజేష్ సహకరించారు. సులలితా సంగీత విభావరి విద్యార్థులకు మెమెంటోలను ముఖ్యఅతిథి తిరుపతిరావు అందజేశారు. కార్యక్రమంలో సులలితా సంగీత విభావరి పాఠశాల అధ్యక్షుడు డాక్టర్ ఆర్.ఆర్.రవి, కార్యదర్వి మరువాడ శివరామక్రిష్ణ, చైతన్య మహిళా సంఘం అధ్యక్షురాలు కోట్ని శోభారాణి పాల్గొన్నారు. -
పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది పయనం
భువనేశ్వర్: ఈ నెల 25న 3వ దశ పోలింగ్ భువనేశ్వర్ పార్లమెంటరీ నియోజక వర్గంలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సిబ్బందిని ఖుర్దా జిల్లాలో పలు పోలింగు కేంద్రాలకు తరలించారు. పోలింగు సంబంధిత ఏర్పాట్లు పూర్తయినట్లు ఖుర్దా జిల్లా ఎన్నికల యంత్రాంగం తెలిపింది. స్థానిక బీజేబీ అటానమస్ కాలేజీ ఆవరణలోని స్ట్రాంగ్రూమ్ నుంచి పోలింగ్ పార్టీ ఈవీఎంలతో పోలింగ్ బృందాలు కేటాయించిన కేంద్రాలకు తరలి వెళ్లాయి. తొలి విడత కింద పోలింగ్ బృందాలు గురువారం జయదేవ్, జట్నీ రెండు శాసన సభ నియోజకవర్గాల బూత్లకు తరలి వెళ్లాయి. జయదేవ్ నియోజక వర్గంలోని మొత్తం 236 పోలింగు కేంద్రాల్లో 164 కేంద్రాలకు సిబ్బంది పూర్తి సరంజామాతో చేరారు. మిగిలిన 72 కేంద్రాలకు పోలింగ్ బృందాలు శుక్రవారం చేరుతాయి. ఈ 72 కేంద్రాల్లో 49 సఖి బూత్లు, ఒక దివ్యాంగుల బూత్, 22 ఇతర బూత్లు ఏర్పాటు చేశారు. -
సైకిల్ దొంగ అరెస్టు
జయపురం: సైకిళ్లను దొంగిలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్టు పట్టణ పోలీసులు మంగళవా రం తెలిపారు. అతని నుంచి స్థానిక సునారీ వీధి బక్షి అపార్ట్మెంట్లో దొంగిలించిన సైకిల్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 18వ తేదీన స్థానిక సునారివీధి బక్షి అపార్ట్మెంట్లో ఉంటున్న కె.ఎం.అనిష్ కుమారుడు తన సైకిల్ ను ఇంటి ముందు పార్క్ చేసి లోనికి వెళ్లాడు. కొంచెం సమయం తరువాత ఇంటిలో నుంచి బయటకు వచ్చి చూడగా సైకిల్ కనిపించలేదు. దీంతో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశా రు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన ఏఎస్సై విష్ణు మడకామి.. చోరీకి పాల్పడిన ఎస్.ఆనంద (అలియాస్ ఉరఫ్ పటలా కిశోర్కుమార్)ను అరెస్టు చేయడంతో పాటు దొంగిలించిన సైకిల్ ను అతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. పదిరోజుల క్రితం ఆనంద ఒక సైకిల్ను దొంగిలించి పట్టుబడి జామీనుపై బయటకు వచ్చినట్టు వివరించారు. స్థానిక నొడియబెడ సాహిలో ఉంటున్న ఆనంద.. పట్టణంలో సైకిళ్లను దొంగి లి విక్రయించగా వచ్చే డబ్బులతో జల్సా చేస్తున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. -
పకడ్బందీగా రథయాత్ర నిర్వహణ
పర్లాకిమిడి: జూలై 7న జగన్నాథ గుండిచా రథయాత్ర అందరి సహకారంతో విజయవంతంగా నిర్వహిద్దామని కలెక్టర్ స్మృతిరంజన్ ప్రధాన్ అన్నారు. రథయాత్ర నిర్వహణపై కలెక్టరేట్ వద్ద గ్రామీణ స్వయం ఉపాధి కాన్ఫరెన్సు హాలులో బుధవారం కమిటీ చైర్మన్ సబ్ కలెక్టర్ అలోక్ పండా అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కమిటీ సభ్యులు పూర్ణచంద్ర మహాపాత్రో, డీఎస్పీ చంద్రశేఖర్ హోత్తా, డి.ఆర్.డి.ఎ. కార్యనిర్వహణాధికారి గుణనిధినాయక్, తహశీల్దారు నారాయణ బెహరా తదితరులు హాజరయ్యారు. పారిశుద్ధ్యం, తాగునీరు, అంబులెన్సు, రోడ్డు మరమ్మతులు, మీనాబజార్కు వేలంపాట, రథ నిర్మాణానికి కొత్త కలప తదితర అంశాలపై చర్చించారు. గత ఏడాది జరిగిన రథయాత్ర జమాఖర్చులను సబ్ కలెక్టర్ అలోక్ పండా వివరించారు. -
● ముగ్గురు అరెస్టు
జయపురం: మల్కన్గిరి నుంచి వ్యాన్లో జయపురం వస్తున్న బట్టల వ్యాపారిని అడ్డగించి అతని నుంచి రూ.1.80 లక్షలు దోచుకు పోయిన ముగ్గురు దుండగులను అరెస్టు చేశామని బొయిపరిగుడ పోలీసు అధికారి దీపాంజళి ప్రధాన్ బుధవారం తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.22,800 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక బైక్, మాస్క్లు, టీచొక్కాలను స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఈ నెల 18వ తేదీన జయపురం పట్టణానికి చెందిన బట్టల వ్యాపారి ఎ.సత్యనారాయణ గుప్త సంతలకు వెళ్లి వ్యాన్లో విజయవాడ– రాంచీ జాతీయ కారిడార్లో మల్కనగిరి నుంచి బొయిపరిగుడ మీదుగా జయపురం వస్తున్నారు. బొయిపరిగుడ–జయపురం మధ్య మహులి ఘాట్ రోడ్డులో మోటారుబైక్లపై ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా వచ్చి వ్యాన్ను అడ్డుకున్నారు. తాము ఫైనాన్స్ కంపెనీ నుంచి వచ్చామని చెప్పి వ్యాన్ తాళాలు తీసుకున్నారని పోలీసు అధికారి దీపాంజళీ ప్రధాన్ వివరించారు. కొంత సమయం తరువాత మరో ముగ్గురు ముఖానికి మాస్క్లు వేసుకొని వ్యాన్ వద్దకు వచ్చి మారణాయుధాలను బట్టల వ్యాపారి సత్యనారాయణగుప్తకు చూపించి డబ్బు ఇమ్మని డిమాండ్ చేశారు. ఇవ్వకపోతే చంపుతామని హెచ్చరించారు. వ్యాపారి నిరాకరించటంతో అతడిని దుండగులు కొట్టి బయటకు నెట్టి వ్యాన్లో ఉన్న డబ్బుతో పాటు రెండు మొబైల్ ఫోన్లను తీసుకొని దుండగులు పరారయ్యారు. దీంతో బాధిత వ్యాపారి బొయిపరిగుడ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దుండగులు జయపురం వాసులని వెల్లడైందని పోలీసు అధికారి పేర్కొన్నారు. జయనగర్ బబులా బాగ్ హరిజన్, సురేష్ హరిజన్, అలోక్ కుమార్ పంగిలను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి చెప్పారు. పట్టుబడిన దొంగలను గతంలో వివిధ కేసుల్లో జయపురం, నందపూర్ పోలీసులు అరెస్టు చేసి ఉన్నారన్నారు. ఈ కేసులో మిగతా వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని వెల్లడించారు. -
భద్రత కట్టుదిట్టం
భువనేశ్వర్: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల మూడో దశ పోలింగ్ కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 25న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో స్థానిక కమిషనరేట్ పోలీసులు రాజధానిలో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేశారు. పోలింగ్ సమయంలో హింసను నివారించడంలో భాగంగా పలు చర్యలు చేపడుతున్నట్లు పోలీసు కమిషనర్ సంజీవ్ పండా విలేకరులకు బుధవారం తెలిపారు. భువనేశ్వర్ కమిషనరేట్ పోలీస్ పరిధిలోని 1,132 పోలింగ్ కేంద్రాల్లో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ప్రతి ఒక్కరూ ఓటు వేసేందుకు పోలీసులు భద్రతా చర్యలను పెంపొందించారు. వీటిలో 145 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. 421 సఖి పోలింగ్ కేంద్రాల్లో సురక్షిత ఎన్నికల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు. 525 పోలింగ్ బూత్లలో వెబ్కాస్టింగ్ నిర్వహించనున్నారు. ఘర్షణలు నివారించడానికి 15 ఫ్లయింగ్ స్క్వాడ్లు, 15 వ్యూహాత్మక నిఘా బృందాల్ని రంగంలోకి దింపారు. అంతేకాకుండా, సమస్యాత్మక పోలింగు కేంద్రాల వద్ద కేంద్ర రిజర్వు పోలీసు దళం సీఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరిస్తారు. నేటితో ప్రచారానికి తెర రాష్ట్రంలో మూడో దశ పోలింగ్ పురస్కరించుకుని రాజకీయ పక్షాల ఎన్నికల ప్రచారం గురువారం సాయంత్రంతో ముగుస్తుంది. ఎన్నికల ప్రచారం ముగియడంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నారు. ఈ నేపథ్యంలో తనిఖీలు ముమ్మరం చేయనున్నట్లు పోలీసు కమిషనరు తెలిపారు. శాంతి, భద్రతల పరిరక్షణలో ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. -
శ్రామిక్ కాంగ్రెస్లో పలువురి చేరిక
భువనేశ్వర్: తూర్పు కోస్తా రైల్వే శ్రామిక్ యూనియ న్ నుంచి పలువురు కార్యకర్తలు శ్రామిక్ కాంగ్రెస్లో చేరారు. ఖుర్దారోడ్ రైల్వే మండలం తాల్చేరు శాఖ ముందంజ కార్యకర్తల ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో యూనియన్ కార్యకర్తలు తూర్పు కోస్తా రైల్వే శ్రామి క్ కాంగ్రెస్లో చేరడంపై ప్రధాన కార్యదర్శి రమేష్ చంద్ర సాహు అభినందించారు. వీరందరికీ శ్రామిక్ కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. కొత్తగా శ్రామిక్ కాంగ్రెస్లో చేరిన వారిలో శ్రామిక్ యూనియన్ తాల్చేరు శాఖ మాజీ కార్యదర్శి అమరనాథ్ ప్రసాద్, యువజన శాఖ మాజీ సహ సమన్వయకర్త విపిన్ మిశ్రా ప్రముఖులుగా పేర్కొన్నారు. వీరి నేతృత్వంలో పలువురు కార్యకర్తలు కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా ఖుర్దారోడ్ మండలం ఓపెన్ లైన్ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రామిక్ కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రమేష్ చంద్ర సాహు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. -
కొంటామల్లో రీపోలింగ్
భువనేశ్వర్: కంధమల్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కొంటామల్ ప్రాంతంలో రీపోలింగ్ నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఆదేశించింది. ఈ నెల 23న కొంటామల్ బూత్ నంబర్ 26, 28లో రీపోలింగ్ నిర్వహించనున్నారు. ఓటింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని ప్రధాన ఎన్నికల అధికారి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ఓటర్లు, అభ్యర్థులకు దీనిపై అవగాహన కల్పించాలని బౌధ్, కంధమల్ జిల్లాల కలెక్టర్లను భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. దిలీప్కుమార్ మహపాత్రోను బౌధ్ అదనపు కలెక్టర్గా, కొంటామల్ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారిగా కమిషన్ నియమించింది. కొంటామల్ నియోజకవర్గంలో బూత్ రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో భారత ఎన్నికల సంఘం అనుమతితో బౌద్ జిల్లాలోని కొంటామల్ అసెంబ్లీ నియోజక వర్గం పరిధిలోని రెండు పోలింగ్ బూత్లు 26 – కిరాసిరా, 28 – మహేశ్వరపిండ్లలో ఈ నెల 23న రీ–పోలింగ్ షెడ్యూల్ ఖరారు చేశారు. ఈ విషయమై రాజకీయ అభ్యర్థులు, ఏజెంట్లందరికీ లిఖితపూర్వకంగా తెలియజేయాలని, ఓటర్లకు అవగాహన కల్పించేందుకు తగిన ప్రచారం చేయాలని ఎన్నికల ప్రధాన అధికారి జిల్లా ఎన్నికల అధికారికి సూచించారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- బిస్కెట్ ప్యాకెట్ల బరువు తగ్గింది.. భారీ జరిమానా పడింది!
- సినిమాలకు దూరం : కానీ ఈ స్టార్కిడ్ నెట్వర్త్ తెలిస్తే ఆశ్చర్యపోతారు
- సన్రైజర్స్ కాదు..ఐపీఎల్ టైటిల్ కేకేఆర్దే: ఆసీస్ లెజెండ్
- మిగతా హీరోయిన్లకు నయనతారకు తేడా అదే.. అందుకే ఇన్నేళ్ల పాటు!
- Mangalagiri: రెండోసారి ఓటమికి సిద్ధమైన లోకేష్!
- డ్రగ్స్ కేసు: హేమతో పాటు వారందరికీ నోటీసులు జారీ
- హార్దిక్ పాండ్యా విడాకులు?.. భరణం కింద ఏకంగా అంత మొత్తమా?
- చిన్న కోడలికి నీతా అంబానీ వెడ్డింగ్ గిఫ్ట్: రూ.640 కోట్ల దుబాయ్ లగ్జరీ విల్లా
- TG: అకడమిక్ క్యాలెండర్ రిలీజ్.. దసరా, సంక్రాంతి సెలవులు ఎన్నంటే?
- బెంగళూరు రేవ్ పార్టీ కేసు: చిత్తూరు అరుణ్ కుమార్ అరెస్ట్
Advertisement