వైరా/కొణిజర్ల: వైరా నియోజకవర్గ కాంగ్రెస్లో చేరికల లొల్లి షురువైంది. ఇప్పటికే నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి చేరికలు ప్రారంభం కావడంతో కాంగ్రెస్లో ఇప్పటివరకు పనిచేసిన నాయకులు వారిని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్లో చేరేందుకు వరస కట్టిన ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పుడు తమ అవసరాల నిమిత్తం కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధమవుతుండగా.. ఏళ్లుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారు వ్యతిరేకిస్తున్నారు. ఆదివారం వైరా ఎమ్మెల్యే రాందాస్నాయక్ క్యాంపు కార్యాలయం వద్ద కొణిజర్ల మండల కాంగ్రెస్ నాయకులు పెద్దఎత్తున సుమారు 3 గంటలకు పైగా ఆందో ళన చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. విద్యుత్ కూడా తొలగించి బీఆర్ఎస్ నుంచి వచ్చే వారిని చేర్చుకోవద్దని స్పష్టం చేశారు. కొణిజర్ల మండలంలో సొసైటీ చైర్మన్ చెరుకుమల్లి రవి, బీఆర్ఎస్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా పని చేసిన చిరంజీవి, శ్రీనవాసరావు, మాజీ సర్పంచ్ ఒకరు, సీనియర్ నాయకులు పార్టీని వీడి కాంగ్రెస్లో చేరేందుకు యత్నిస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి.. మంత్రికి దగ్గరగా ఉండే మండల నాయకుడి ద్వారా కాంగ్రెస్ కండువా కప్పించు కోవాలని ప్రయత్నించారు. దీనిని మంత్రి పొంగులేటి వ్యతిరేకించి, ఎమ్మెల్యే సమక్షంలో చేరాలని సూచించినట్లు సమాచారం. దీంతో మండల కాంగ్రెస్ అధ్యక్షుడినని చెప్పుకుంటున్న ఓ వ్యక్తి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సిఫార్సుతో పార్టీలో చేరేందుకు వైరాలో ఆదివారం భారీ ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న కొణిజర్ల మండలానికి చెందిన కోసూరి శ్రీనివాసరావు నేతృత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన నిర్వహించారు. టెంట్లు పీకి రచ్చ చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మె ల్యే రాందాస్నాయక్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని కార్యకర్తలను సముదాయించారు. అయినప్పటికీ కార్యకర్తలు ఎమ్మెల్యేను పట్టించుకోకుండా గలాటా సృష్టించారు. బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరేందుకు ప్రోత్సహించిన కొణిజర్ల మండల నాయకుడు వడ్డె నారాయణరావు క్యాంపు కార్యాలయంలో ఉన్నాడని తెలుసుకుని విద్యుత్ సరఫరా నిలిపి వేశారు. సుమారు 3 గంటల పాటు కాంగ్రెస్ నాయకులకు ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం జరిగింది.