తల్లాడ: తల్లాడ మండలం పినపాక సమీపంలో ఆదివారం బస్సు, లారీ (కంటెయినర్) ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో 14 మందికి గాయాలయ్యాయి. మణుగూరు డిపోకు చెందిన బస్సు ఖమ్మం వెళ్తుండగా వైరా నుంచి తల్లాడ వైపు వస్తున్న లారీ పినపాక, డాన్బోస్కో పాఠశాల సమీపంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పాల్వంచకు చెందిన బొమ్మగాని శ్రావణి, ఖమ్మానికి చెందిన వందనపు ఝాన్సీరాణి, గార్లపాటి గీత, రమాదేవి, కె.ఉపేందర్రావు, ఎ.అరుణ, భార్గవి చింతకాని మండలం నేరడకు చెందిన వై.వెంకటేశ్వరరావు, అతని భార్య, ఎన్టీఆర్ జిల్లా అనిగండ్లపాడుకు చెందిన ఈలప్రోలు నరసింహారావు, లలిత, ఛత్తీస్గఢ్కు చెందిన సోను, బస్సు డ్రైవర్ అప్పారావు, వైరాకు చెందిన డి.విజయ్కు దెబ్బలు తగిలాయి. గాయపడిన వారిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని తల్లాడ ఎస్ఐ కొండల్రావు సిబ్బంది సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ స్తంభించడంతో జేసీబీ సాయంతో వాహనాలను తప్పించారు.
పిడుగు పడి ఫర్నిచర్ దగ్ధం
ఖమ్మంక్రైం: నగరంలో ఆదివారం సాయంత్రం పిడుగుపడి ఓ ప్రైవేట్ చిట్ఫండ్లో ఫర్నిచర్ దగ్ధం అయింది. షాదీఖానా వెనుక ఉన్న చిట్ఫండ్ భవనంపై ఒక్కసారిగా పిడుగుపడింది. కార్యాలయంలోని ఏసీలు, ఫర్నిచర్ దగ్ధం అయ్యాయి. సెలవు దినం కావటంతో కార్యాలయంలో ఎవరూ లేకపోవటం వల్ల ప్రమాదం తప్పింది. కార్యాలయం నుంచి పొగలు రావటంతో కింద ఉన్న దుకాణం వారు చిట్ఫండ్ వారికి, అగ్నిమాపక శాఖ వారికి సమాచారం అందించారు. ఖమ్మం అగ్నిమాపకశాఖాధికారి రాజేశ్వరరావు అధ్వర్యంలో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
బైక్ను తగలబెట్టిన దుండగులు
నేలకొండపల్లి: బైక్ను గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కై లాసపు నాగరాజు బైక్ను గుర్తు తెలియని దుండగులు తగలబెట్టారు. ఆదివారం తెల్లవారుజామున డాబాపైన నిద్రిస్తున్న నాగరాజు కుటుంబ సభ్యులకు కాలుతున్న వాసన రావటంతో కిందకు దిగి చూశారు. అప్పటికే బైక్ (గ్లామర్) పూర్తిగా కాలిపోయింది. బాధితులు స్థానిక పోలీస్స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.