ఆదిలాబాద్టౌన్: భారత రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక రాష్ట్ర కన్వీనర్, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆరోపించారు. జాగో తెలంగాణ ఆధ్వర్యంలో బీజేపీని ఓడించాలనే నినాదంతో చేపట్టిన రాష్ట్రవ్యాప్త బస్సుయాత్ర శనివారం జిల్లా కేంద్రానికి చేరుకుంది. యాత్రకు స్థానిక కార్మిక, ప్రజా సంఘాల నాయకులు స్వాగతం పలికారు. అనంతరం నేతాజీచౌక్లోని కార్మికుల అడ్డావద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక, కర్షకులు, ప్రజలకు వ్యతిరేకంగా, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. గడిచిన పదేళ్లలో జిల్లా అభివృద్ధికి కేంద్రం చేసిందేమీ లేదన్నారు. సీసీఐని తెరిపించలేదని, ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్కు ఎలాంటి నిధులు కేటాయించలేదని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు చూపలేదని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఇండియా కుటమి అభ్యర్థి సుగుణను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వివిధ కార్మిక, ప్రజాసంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.