అరకులోయ టౌన్: పేదలకు అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న జగన్మోహన్రెడ్డిని మళ్లీ సీఎం చేసేందుకు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం అరకులోయలో ఆర్ ఐటీఐ నుంచి అంబేడ్కర్ జంక్షన్ వరకు వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ స్థాయిలో నిర్వహించిన బైక్, ఆటో,కార్ల ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ జంక్షన్ వద్ద నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈనెల 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అరకు ఎంపీ అభ్యర్థి గుమ్మ తనూజారాణి, అసెంబ్లీ అభ్యర్థి రేగం మత్స్యలింగంను ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చేతులు జోడించి అడుగుతున్నామన్నారు. ఈ ఎన్నికలు పేదలకు పెత్తందారులకు మధ్య జరుతున్నవి అన్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్మోహన్ రెడ్డి పేదల పక్షాన నిలబడి, అనేక సంక్షేమ పథఽకాలు అమలు చేశారన్నారు. పేదల జీవితాలు నిత్యం సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. అమ్మ ఒడి ప్రవేశపెట్టి ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో రూ. 15 వేలు జమ చేస్తున్నారన్నారు. డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేసిన ఘనత జగనన్నకే దక్కుతుందన్నారు. మహిళలు వారి కాళ్లపై నిలబడేందుకు చేయుత పథకం ద్వారా ఐదేళ్లలో రూ. 75 వేలు వారి ఖాతాల్లో జమ చేశారన్నారు. వికలాంగులు, వృద్ధులకు ప్రతినెలా ఒకటో తేదీన ఉదయం ఏడు గంటలకే పింఛను అందేలా చర్యలు చేపట్టారన్నారు. మెరుగైన వైద్యం అందించే చర్యల్లో భాగంగా పాడేరులో రూ.500 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, వైద్య కళాశాల జగన్మోహన్రెడ్డి నిర్మించారన్నారు. అరకు పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల పరిధిలోని అన్ని ఆస్పత్రులు, పాఠశాలలు అత్యాధునికంగా తీర్చిదిద్దారన్నారు. పేదల వైద్యానికి ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 25 లక్షలకు పెంచారన్నారు. గ్రామాల్లోనే సేవలందించేందుకు సచివాలయ వ్యవస్ధ, రైతుల కోసం ఆర్బీకేలు నిర్మించామన్నారు. 2014 ఎన్నికల్లో జతకట్టిన టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు అనేక సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు మోసం చేసిన చరిత్ర వారిదన్నారు. మళ్లీ ఈ ఎన్నికల్లో అదే పార్టీలు జతకట్టి మళ్లీ రాష్ట్ర ప్రజలకు మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. ప్రజ లంతా అప్రమత్తంగా ఉండాలని, వారికి అవకాశం ఇవ్వకూడదన్నారు. ప్రస్తుతం అందుతున్న సంక్షేమ పథకాలు రాబోయే రోజుల్లో కూడా అందాలంటే మళ్లీ జగనన్న సీఎంను చేయాలన్నారు. ఎంపీ అభ్యర్థి డాక్టర్ గుమ్మ తనూజరాణి మాట్లాడుతూ గిరిజన ప్రాంత అభివృద్ధికి సీఎం జగన్మోహన్రెడ్డి అధిక ప్రాధాన్యమిచ్చారన్నారు. గతంలో కన్నా మరింత మెరుగైన పథకాలు ప్రవేశపెడుతూ మేనిఫెస్టోను ప్రకటించారన్నారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అందాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు. అసెంబ్లీ అభ్యర్థి రేగం మత్స్యలింగం మాట్లాడుతూ అసెంబ్లీ సీటు కేటాయించి ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని జగనన్న కల్పించారన్నారు. ప్రతిఒక్కరు ఫ్యాన్ గుర్తుపై ఓటేసి తనతోపాటు ఎంపీ అభ్యర్థి తనూజారాణిని గెలిపిస్తే మీకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తామన్నారు. ర్యాలీల్లో పార్టీ శ్రేణులు జై జగన్ నినాదాన్ని హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షురాలు కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఉమ్మడి విశాఖ జెడ్పీ చైర్పర్సన్ జల్లి పల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యే, అరకు అసెంబ్లీ పరిశీలకురాలు శోభ హైమావతి దేవి, మెడికల్ కౌన్సిల్ మెంబర్ నర్సింగరావు, ఆరు మండలాల ఎంపీపీలు, జెడ్పీటిసిలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎంపీ, అసెంబ్లీ అభ్యర్థులను గెలిపించండి
టీడీపీ, బీజేపీ, జనసేన నేతల మాటలు నమ్మి మళ్లీ మోసపోవద్దు
వైఎస్సార్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్
కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి
అరకులోయలో భారీ బైక్ ర్యాలీ
జైజగన్ నినాదంతో హోరెత్తిన
అరకులోయ