ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు లండన్‌లో ఘన స్వాగతం | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు లండన్‌లో ఘన స్వాగతం

Published Sun, May 19 2024 5:58 AM

లండన్‌లోని లూటన్‌ విమానాశ్రయం వద్ద సీఎం వైఎస్‌ జగన్‌

వాతావరణం అనుకూలించక 4 గంటలు ఆలస్యం  

తొలుత నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌లో ల్యాండ్‌ అయిన విమానం 

ఆ తర్వాత లండన్‌ చేరుకున్న సీఎం కుటుంబం 

జై జగన్‌ నినాదాలతో మార్మోగిన లూటన్‌ ఎయిర్‌పోర్టు 

వైఎస్సార్‌సీపీ లండన్‌ విభాగం సభ్యులను పేరుపేరున పలకరించిన సీఎం జగన్‌  

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కుటుంబ సమేతంగా శనివారం లండన్‌ చేరుకొన్నారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి శుక్రవారం రాత్రి 11 గంటలకు లండన్‌కు బయలుదేరారు. శనివా­రం ఉదయం 5.15 గంటలకు లండన్‌లోని లూటన్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకోవాల్సి ఉండింది. అయితే పొగ మంచు కారణంగా వాతావరణం అనుకూలించక పోవటంతో సీఎం జగన్‌ ప్రయాణిస్తున్న విమానం నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్డామ్‌ విమానాశ్రయంలో దిగాల్సి వచ్చింది. 

వాతావరణం చక్కబడిన అనంతరం ఆ విమానం తిరిగి లండన్‌ బయలుదేరింది. అందువల్ల నాలుగు గంటలు ఆలస్యంగా ఉదయం 9.15 గంటలకు సీఎం జగన్‌ కుటుంబం లండన్‌ (లూకే) చేరుకుంది. అక్కడి లూటన్‌ విమానాశ్రయంలో సీఎం జగన్‌కు ప్రవాసాంధ్రుల నుంచి అపూర్వ స్వాగతం లభించింది. సీఎం జగన్‌ను చూడగానే జై జగన్‌ అంటూ అక్కడి వారు చేసిన నినాదాలతో విమానాశ్రయం మారుమోగింది. ఈ సందర్భంగా తనను కలిసిన వైఎస్సార్‌సీపీ యూకే సోషల్‌ మీడియా సభ్యులను, అభిమానులను సీఎం జగన్‌ పేరుపేరున పలకరించారు.  



మళ్లీ సీఎంగా జగనన్నే.. 
జూన్‌ 4వ తేదీన కనీవినీ ఎరుగని రీతిలో ఎన్నికల ఫలితాల్ని ప్రపంచంలో తెలుగు వారంతా చూడబోతున్నారని వైఎస్సార్‌సీపీ యూకే సోషల్‌ మీడియా సభ్యులు భూమిరెడ్డి కార్తీక్, పాలెం క్రాంతికుమార్‌ రెడ్డిలు ‘సాక్షి’కి తెలిపారు. ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి మంచి చేసిన జగనన్న ప్రభుత్వాన్ని కొనసాగించుకునేందుకు పేదలు, మహిళలు, వృద్ధులు, సానుకూల ఓటింగ్‌తో తీర్పు ఇచ్చేశారని చెప్పారు. 

2019లో సాధించిన స్థానాల కంటే అధిక స్థానాలను వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకుంటుందని, వైఎస్‌ జగన్‌ను మళ్లీ సీఎంగా చూసేందుకు ప్రపంచంలో తెలుగు సమాజం అంతా ఎదురు చూస్తోందన్నారు. సీఎం జగన్‌ను కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ యూకే కోర్‌ కమిటీ సభ్యులు చింతపంటి జనార్ధన్, గుర్రం చలపతి రావు, కిరణ్‌ ఇస్లావత్, వేలూరు సాయితేజ, పి.అశోక్‌ కుమార్, ముడియాల కుమార్‌ రెడ్డి, దేవరపల్లి చాళుక్య, కొరముట్ల పునీత్, మద్దాలి కుమారస్వామి తదితరులు ఉన్నారు.    

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement