బి.కొత్తకోట : కర్ణాటకలోని బెంగళూరు నుంచి బి.కొత్తకోటకు వస్తున్న ఓ ప్రైవేటు బస్సు కింద మంటలు వ్యాపించగా గమనించిన చెక్పోస్టు సిబ్బంది అప్రమత్తం చేయడంతో ప్రమాదం తప్పిన ఘటన శనివారం జరిగింది. ఉదయం బెంగళూరులో బయలుదేరిన బస్సు చింతామణి నుంచి బట్లపల్లె, కానుగమాకులపల్లె మీదుగా బి.కొత్తకోటకు వస్తోంది. మండలంలోని వర్రోళ్లపల్లె చెక్పోస్టు వద్దకు రాగానే బస్సుకింద మంటలు వ్యాపించడం చెక్పోస్టు సిబ్బంది గమనించి బస్సును నిలిపివేయించారు. వెంటనే స్థానికులు, బస్సులోని ప్రయాణికులు మంటలపై నీళ్లు చల్లడంతో ఆరిపోయాయి. బస్సు స్టార్టర్ వైర్, బ్యాటరీ వైర్ షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చేలరేగినట్టు బస్సు సిబ్బంది తెలిపారు. ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాద సమయంలో 40 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్టు తెలిసింది.
వడదెబ్బతో వృద్ధురాలు మృతి
రాజంపేట రూరల్ : మండల పరిధిలోని మందరం పంచాయతీలోని రాచపల్లెకు చెందిన పద్మావతమ్మ (88) వడదెబ్బతో శనివారం మృతి చెందింది. ఈమె పట్టణంలోని నూనెవారిపల్లెలో పెద్దకుమారుడు వెలగచర్ల రామిరెడ్డి వద్ద ఉంటోంది. భానుడి వేడి తాళలేక వడదెబ్బ కారణంగా ఇంట్లోనే ఒక్కసారిగా ఊపిరాడక మృతి చెందినట్టు కుటుంబసభ్యులు తెలియజేశారు.
కుప్పకూలిన గోడ
చిట్వేలి : మండల కేంద్రమైన చిట్వేలి సింగనమల వీధిలోని కోదండరామాలయం ముందు నిర్మాణంలో ఉన్న భవనం సన్సైడ్ గోడ శనివారం అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో అక్కడ ఉన్న రెండు ద్విచక్రవాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఈ సందర్భంగా వాహనదారులు తమకు న్యాయం చేయాలని కోరారు.