రాయచోటి : పీఓ, ఏపీఓ, మైక్రో అబ్జర్వర్లకు ఆదివారం పౌస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉంటుందని, అలాగే పోలీసుశాఖ 33 అత్యవసర సేవల ఉద్యోగులకు సోమవారం పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించినట్లు జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్ కిషోర్ తెలిపారు. జిల్లాలో ఓటు హక్కు ఉన్న పీఓ, ఏపీఓ, ఓపీఓ, మైక్రో అబ్జర్వర్లుగా ఎన్నికల విధులలో పాల్గొనే ఉద్యోగులు ఈనెల 5వ నుంచి 10వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారి స్థానిక నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోచవ్చని తెలిపారు. అన్నమయ్య జిల్లాలో కాకుండా ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగిన పీఓ, ఏపీఓ, ఓపీఓ, మైక్రో అబ్జర్వర్లు ఆదివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జిల్లా కేంద్రమైన రాయచోటిలోని నేతాజీ సర్కిల్ వద్ద ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన జిల్లా ఫెసిలిటేషన్ కేంద్రంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు. అలాగే ఇతర జిల్లాలకు చెందిన పోలీసుశాఖతో పాటు 33 అత్యవసర సేవల ఉద్యోగులు ఈనెల 6వ తేదీ ఓటు హక్కు వినియోగించుకోవచ్చన్నారు. ఎవరైనా 5వ తేదీ పోస్టల్ బ్యాలెట్ ఓటును ఉపయోగించుకోలేని వారు 6వ తేదీ తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు.
నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసినఫెసిలిటేషన్ కేంద్రాలు ఇవే..
రాజంపేట నియోజకవర్గానికి చెందిన వారికి వత్తలూరు రోడ్డులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, రైల్వేకోడూరు నియోజకవర్గం వారికి తహశీల్దార్ కార్యాలయం పక్కన ఉన్న హెచ్ఎంఎం హైస్కూల్లో, రాయచోటి నియోజకవర్గానికి చెందిన వారికి ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ప్రభుత్వ డైట్ హైస్కూల్లో, తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన వారికి జిల్లా పరిషత్ హైస్కూల్ అంగళ్ళు, కురబలకోట మండలంలో, పీలేరు నియోజకవర్గానికి చెందిన వారికి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, మదనపల్లె నియోజకవర్గానికి చెందిన వారికి బీటీ ప్రభుత్వ కళాశాలలో ఎన్నికల విధులలో పాల్గొనే ఉద్యోగులు తమ పోస్టల్ బ్యాలెట్ను ఉపయోగించుకోచవ్చని తెలిపారు. ఓటు హక్కును వినియోగించుకోవాలంటే ఎన్నికల విధుల అపాయింట్మెంట్ ఆర్డర్, ఓటరు ఐడీకార్డు, ఆధార్ కార్డు తీసుకు వెళ్లాలని తెలిపారు.