రాయచోటి: ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఈనెల 5, 6 తేదీల్లో జరిగే పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్ కిషోర్ కోరారు. పీఓ, ఏపీఓ, ఓపీఓ, మైక్రో అబ్జర్వర్లకు మే 5న, పోలీసు శాఖ అలాగే 33 అత్యవసర సేవల ఉద్యోగులకు మే 6న పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఉంటుందన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్లో పాల్గొనవచ్చన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా 5వ తేదీన ఓటు హక్కు వినియోగించుకోలేకపోయిన వారు 6వ తేదీన ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు.
హోం ఓటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించండి
రామాపురం: జిల్లాలో హోం ఓటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ అధికారులకు సూచించారు. శనివారం మండల పరిధిలోని నల్లగుట్టపల్లెలో హోం ఓటింగ్ కార్యక్రమాన్ని ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మండలంలోని మేరదపల్లె చెక్పోస్టును తనిఖీ చేసి అక్కడి రిజిస్టర్ను పరిశీలించారు. వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రంగస్వామి, ఎన్నికల విభాగం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.