భద్రాచలం: శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలో మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చన జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం నిర్వహించారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. ఆదివారం కావడంతో పూజాది కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పెద్దమ్మతల్లికి
విశేష పూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి అమ్మవారి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. జిల్లాతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. అర్చకులు అమ్మవారికి విశేష పూజలు జరపగా, భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ జి.సుదర్శన్, భక్తులు పాల్గొన్నారు.
కిన్నెరసానిలో
పర్యాటకుల సందడి
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకుల సందడి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన సందర్శకులు డ్యామ్, జలాశయాన్ని, డీర్ పార్కును వీక్షించారు. దుప్పులు తదితర అటవీ జంతువులను చూస్తూ ఆనందోత్సాహాల నడుమ గడిపారు. 354 మంది పర్యాటకులు రాగా ప్రవేశ రుసుం ద్వారా వైల్డ్లైఫ్ శాఖ రూ.9,680 ఆదాయం, 250 మంది బోటు షికారు చేయగా, టూరిజం కార్పొరేషన్కు రూ.10,890 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
హోం ఓటింగ్ 162.. పోస్టల్ బ్యాలెట్ 78
అశ్వారావుపేటరూరల్: పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆదివారం కూడా హోం ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. అశ్వారావుపేట నియోజకవర్గంలో 85 ఏళ్లకు పైబడిన వృద్ధలు మొత్తం 172 మంది ఉండగా, తొలి రోజు 108 ఓట్లు పోలయ్యాయి. రెండో రోజు 54 ఓట్లు పోలుకాగా, మొత్తం 162 ఓట్లు నమోదయ్యాయని తహసీల్దార్ కృష్ణ ప్రసాద్ తెలిపారు. మరో 10 మంది ఓటు వేయాల్సి ఉందని పేర్కొన్నారు. నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 372 ఉండగా, ఇప్పటివరకు 78 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను వేశారు. ఈ కార్యక్రమంలో పోలింగ్ సిబ్బంది నవీన్, లక్ష్మి, హరిత, సందీప్, పద్మావతి, రామారావు, వీరయ్య, శ్రీశైలం, రాము, కిరణ్కుమార్, రాంసుందర్, గోపాల స్వామి శ్రీహరి పాల్గొన్నారు.