●
● శ్రీఘాకోళ్లపు, మట్టే శ్రీనుబాబు వెల్లడి
● పెద్దాపురంలో ఆత్మీయ సమ్మేళనం
సామర్లకోట: తమ మద్దతు వైఎస్సార్ సీపీకే ఉంటుందని పెద్దాపురం ఆర్యవైశ్య సంఘ నాయకులు తెలిపారు. పెద్దాపురం మట్టే ఆదినారాయణ, శ్రీమతి నాగలక్ష్మీ కల్యాణ వేదికలో ఆర్యవైశ్య కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం ఆదివారం రాత్రి జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీఐఐసీ మాజీ చైర్మన్ శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోనే ఆర్యవైశ్యులకు న్యాయం జరుగుతోందని అన్నారు. ఆయన హామీ ఇస్తే తప్పనిసరిగా అమలు చేసి చూపిస్తారని చెప్పారు. చంద్రబాబునాయుడి పాలనను 14 ఏళ్ల పాటు చూశామని, జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కోవిడ్లో పోయినా మూడేళ్లలో అనేక అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలను ఎటువంటి అవినీతికీ తావు లేకుండా అమలు చేశారని అన్నారు. అటువంటి నేతకు మరో పర్యాయం ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వడానికి ఆర్యవైశ్య ఆత్మీయ కలయిక ద్వారా మద్దతు తెలియజేస్తున్నామని చెప్పారు. ప్రముఖ పారిశ్రామికవేత్త మట్టే శ్రీనుబాబు మాట్లాడుతూ, స్థానికుడైన దవులూరి దొరబాబుకు వైఎస్సార్ సీపీ పెద్దాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం వచ్చిందని అన్నారు. అదేవిధంగా ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్కు స్థానిక పరిస్థితులపై పూర్తి స్థాయిలో అవగాహన ఉందని, వీరిద్దరికీ ఆర్యవైశ్య నాయకుల మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ మాట్లాడుతూ, కాకినాడ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తానని చెప్పారు. పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వారిని ప్రోత్సహిస్తానని తెలిపారు. దవులూరి దొరబాబు మాట్లాడుతూ, రాజకీయంగా ఉత్సాహం ఉన్న వారిని ప్రోత్సహిస్తామని, నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. సమావేశంలో కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ నాయకులు మట్టే ఆదేష్బాబు, కంతేటి కాశీ (మండపేట), మట్టే శ్రీనివాస్, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు కాపుగంటి కామేశ్వరరావు, మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.