కాళేశ్వరం: సూర్యుడు విశ్వరూపం చూపుతున్నాడు. జిల్లా వ్యాప్తంగా వేసవి ఎండలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలో కొన్ని రోజులుగా 40డిగ్రీల సెల్సియస్ను దాటి కొడుతున్న ఎండలతో జనం ఇళ్లకే పరిమితం అవుతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. గోదావరి, ప్రాణహిత నదుల తీరప్రాంతంలో ఇసుక మేటలు భారీగా ఉండడంతో కాళేశ్వరంతోపాటు పరిసర ప్రాంతాలన్ని హీటెక్కుతుండడంతో కాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయానికి భక్తుల రాక తగ్గిపోయింది.
భక్తుల రాకపై ప్రభావం..
నిత్యం కాళేశ్వరాలయానికి వేల సంఖ్యలో వచ్చే భక్తులు ఎండల తీవ్రతతో వందల సంఖ్యలోనే వస్తున్నారు. ఏప్రిల్ నుంచి భక్తుల రాక తగ్గుతూ వస్తోంది. ఎండ తీవ్రతకు ఉదయం 10గంటల లోపు వరకు, సాయంత్రం 5గంటల తర్వాత దర్శనానికి వస్తున్నట్లు అర్చకులు చెబుతున్నారు. ఏప్రిల్, మే మాసాల్లో ఆలయ ఆదాయం కూడా తగ్గుతుందని తెలిపారు.
పెరిగిన విద్యుత్ వినియోగం
భానుడు తన ప్రతాన్ని చూపడంతో జనం ఇళ్లనుంచి బయటకు రావడం లేదు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో కూలర్లు, ఏసీలతోపాటు, టీవీలతో కాలక్షేపం చేస్తున్నారు. తద్వారా జిల్లా వ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరిగింది. విద్యుత్ వినియోగం కూడా పెరిగిందని మార్చి– ఏప్రిల్లో 663.54లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగం కాగా.. ఏప్రిల్– మే(ఇప్పటివరకు) నెలలో 805.2లక్షల యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగినట్లు ఎన్పీడీసీఎల్ అధికారులు చెబుతున్నారు.
పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
రాత్రిసైతం తప్పని ఉక్కపోత
పెరిగిన విద్యుత్ వినియోగం
మండుతున్న సూరీడు
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. శుక్రవా రం జిల్లాలో గరిష్టంగా 46.3డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో 7మండలాలు రెడ్ అలర్ట్లోకి వెళ్లాయి. గణపురం మండలం చెల్పూర్, మొగుళ్లపల్లిలో 46.3, రేగొండ, తాడిచర్లలో 45.6, చిట్యాలలో 45.3, కాటారంలో 45.2, మల్హర్ మండలం మల్లారంలో 45.1, మహా ముత్తారంలో 45డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ వేడితో జనం ఇళ్లనుంచి బయటకు రావాలంటేనే బెంబేలెత్తుతున్నారు.