జిల్లాలో ఉదయం వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఉంటుంది. పలుచోట్ల ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది.
సమష్టి కృషితో
ఎన్నికలు విజయవంతం
● హర్షం వ్యక్తం చేసిన
కలెక్టర్ భవేష్మిశ్రా
భూపాలపల్లి: ప్రజలు, అధికారుల సమన్వయం, సమష్టి కృషితోనే పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంపై కలెక్టర్ భవేష్మిశ్రా హర్షం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మార్చి 16 నుంచి 13వ తేదీ వరకు ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల నిర్వహణలో జిల్లా ప్రజల సహాయ, సహకారాల భాగస్వామ్యం మరువలేనిదన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతీ ఒక్కరిని అభినందించారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతమైన జిల్లాలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం చాలా సంతోషమన్నారు. పోలింగ్ సమయం ఉదయం 7నుంచి సాయంత్రం 4 గంటల వరకే అయినప్పటికీ ఓటర్లు పెద్ద ఎత్తున ఎండను సైతం లెక్కచేయకుండా తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడంలో చైతన్యం చాటారని తెలిపారు. అందువల్ల గత పార్లమెంట్లో కంటే ప్రస్తుతం అధికంగా పోలింగ్ శాతం నమోదు అయిందని తెలిపారు.
ఉపాధ్యాయులపై దాడి అమానుషం
భూపాలపల్లి అర్బన్: నారాయణఖేడ్ జిల్లాలో ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయులపై పోలీసులు దాడి చేయడం అమానుషమని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్(టీఆర్టీఎఫ్) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మధుసూదన్, రవీందర్లు మంగళవారం ప్రకటనలో తెలిపారు. సిబ్బందికి వచ్చే డబ్బులు ఇవ్వాలని ఆర్డీఓను సంప్రదించగా వారిపై లాఠీచార్జ్ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులకు, ఎన్నికల సిబ్బందికి అన్ని జిల్లాల్లో సమాన గౌరవ వేతనం ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. అయినప్పటికీ ఎన్నికల నిబంధనల ఆసరాగా చేసుకొని ఉద్యోగ, ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేస్తూ తక్కువ గౌరవ వేతనం ఇస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపించారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఓపీవోలకు తక్కువ డబ్బులు ఇచ్చారని వివరించారు. జిల్లా అధికారులు పున:పరిశీలన చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.