నిజామాబాద్నాగారం : సమాచార హక్కు చట్టానికి డీఎంహెచ్వో అధికారులు తూట్లు పొడిచారు. పైగా సమాచారం అడిగిన దరఖాస్తుదారుకు బెదిరింపులు.. దీంతో హైద్రాబాద్ ఆర్టీఐ హైదరాబాద్ కమిషనర్ ఆఫీసులో గత డీఎంహెచ్వో అధికారిపై కేసు నమోదు. వివరాలు ఇలా ఉన్నాయి.
డిచ్పల్లి మండలంలోని మిట్టాపల్లి గ్రామానికి చెందిన సమీర్ హైమాద్ 2022 నవంబర్ 23న జిల్లా వైద్యారోగ్యశాఖలో ఆర్టీఐ యాక్టు ద్వారా అద్దెవాహనాల వివరాలు ఇవ్వాలని కోరారు. ఇందులో 2019 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అద్దె వాహనాలు ఎన్ని ఉన్నాయి? ఆర్బీఎస్కే, ఆల్ ప్రోగ్రామ్ ఆఫీసర్, టీ హబ్లో ఉన్న అద్దె వాహనాలకు సంబంధించి లాగ్బుక్, అకౌంట్స్, ట్యాక్సీ ప్లేట్ నంబర్, ఆర్సీబుక్ జిరాక్సు కాపీలను కోరారు. అధికారులు 30 రోజుల్లో వివరాలు అందించాల్సి ఉండగా ఏడాది గడిచిపోయినా నిర్లక్ష్యం వహించారు. దీంతో సమీర్ నేరుగా హైదరాబాద్ కమిషనర్ ఆఫీసులో 2023 జనవరి 20న ఫిర్యాదు చేశారు. తాజాగా దరఖాస్తుదారుకు డీఎంహెచ్వో అధికారులు 2024 ఏప్రిల్ 10న తప్పుడు సమాచారం ఇచ్చారు. తనను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని సమీర్ పేర్కొన్నారు. ఆర్బీఎస్కే జీవో కాపీలతో పాటు, వాహనాల నంబర్లు మాత్రమే ఇచ్చారని, ఇందులో టీ హబ్ వివరాలు ఇవ్వలేదన్నారు. ఈ మేరకు హైదరాబాద్ ఆర్టీఐ కమిషనర్ ఆఫీసులో ఫిర్యాదు చేయగా అప్పటి జిల్లా డీఎంహెచ్వో అధికారిపై కేసు నమోదు చేశారని సమీర్ తెలిపారు. ఈ సందర్భంగా తనను అధికారులు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. తాను మళ్లీ హైదరాబాద్ కమిషనర్ ఆఫీసుతో పాటు, పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేస్తానని,. తప్పుడు సమాచారం ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకునే వరకు పోరాడుతానన్నారు.
జిల్లా వైద్యశాఖ అధికారుల నిర్వాకం
ఆర్టీఐ దరఖాస్తుదారు ఆవేదన