సాక్షి,బళ్లారి: కేంద్రంలో కాంగ్రెస్ అఽధికారంలోకి వస్తే రైతులకు రుణమాఫీ చేస్తారని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఆయన ఆదివారం బెళగావి జిల్లాలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం అనంతరం విలేకరులతో మాట్లాడారు. దేశంలో ఈసారి ఎన్డీఏ అధికారంలోకి రాదని, బీజేపీకి 200 సీట్లు కంటే ఎక్కువ రావన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తందన్నారు. ఇండియా కూటమికి 300 సీట్లు కంటే ఎక్కువగా వస్తాయని, ఎన్డీఏ కూటమి 400 వస్తాయని కలలు కంటోందన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ చూస్తోందని, ఈ విషయాన్ని యావత్ దేశ ప్రజలు గమనించి బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలో పేదలు కడుపు నింపేందుకు బియ్యం అడిగినా, ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు గ్యారెంటీతో పేదలకు ఎంతో మేలు జరగుతుందన్నారు. ప్రతి నెల రూ.2 వేలు మహిళలకు, ఉచితంగా బస్సు ప్రయాణం, ఉచిత కరెంటు, 10 కేజీలు బియ్యం అందిస్తున్నామన్నారు. నరేంద్రమోదీ అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. గ్యారెంటీలను నిలుపుదల చేయాలని బీజేపీ చూస్తోందన్నారు. రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు వారికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తారన్నారు. రైతులకు రుణమాఫీ చేయడానికి మోదీకి చేతులు రాలేదని, అంబాని, అదానిలకు 16 లక్షల కోట్లు రుణమాఫీ చేశారన్నారు. రైతులకు రుణమాఫీ అంటే నోట్లు ప్రింట్ చేయడం లేదని అంటున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలకు పైగా గెలుస్తామన్నారు. ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ... ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రణదీప్ సింగ్ సూర్జివాలా మాట్లాడుతూ... వందలాది మహిళలపై అత్యాచారాలు చేసిన ప్రజ్వల్ రేవణ్ణను రక్షించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ విషయం తెలిసినా జేడీఎస్తో బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకున్నారని మండిపడ్డారు.
ప్రతి మహిళకు ఏడాదికి లక్ష
ఈసారి బీజేపీకి 200 సీట్లు కంటే పెరగవు : సీఎం సిద్దరామయ్య