సాక్షి,బళ్లారి: నగరంలో మళ్లీ రోడ్డు వెడల్పుపనులు ఊపందుకున్నాయి. ఇటీవల కనక దుర్గమ్మ గుడి సర్కిల్ వద్ద రోడ్డు వెడల్పు పనులు చేపట్టి పూర్తి చేశారు. శనివారం నగరంలోని సత్యనారాయణపేట ఫ్లై ఓవర్ కింద శబరి హోటల్ వద్ద నుంచి కేఈబీ సర్కిల్ వరకు సుమారు అర్ధ కిలోమీటర్కు పైగా రోడ్డు వెడల్పు పనులకు శ్రీకారం చుట్టారు. నగర కార్పొరేషన్ కమిషనర్ ఖలీల్సాబ్, జోనల్ కమిషనర్ గురురాజు, సంబంధిత ల్యాండ్ సర్వే అధికారులు, పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి రోడ్డు వెడల్పు పనులు చేపట్టారు. రెండు జేసీబీలు, ఒక హిటాచీ తదితర యంత్రాలు తీసుకొని రావడంతో జనం పెద్ద సంఖ్యలో చేరారు. అర్ధ కిలోమీటర్ పొడవునా రోడ్డుకు అటు వైపు, ఇటు వైపు 80 అడుగుల మేర రోడ్డు విస్తరించేలా భవనాలను కూల్చివేసే ప్రక్రియను చేపట్టారు. రోడ్డు మధ్యన ఉన్న పచ్చని చెట్లను కూడా కూల్చివేస్తున్నారు. కార్పొరేషన్ అనుమతి లేకుండా, రోడ్డును అక్రమించుకొని నిర్మాణాలు చేపట్టిన భవనాలను కూల్చివేస్తున్నట్లు కార్పొరేషన్ అధికారులు పేర్కొన్నారు. తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఉన్నఫళంగా జేసీబీలు, హిటాచీలు తీసుకొని వచ్చి కూల్చి వేయడం తగదని ఇళ్లు, భవనాల యజమానులు నితీన్, ఆనంద్, ఈరన్న ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులతో వాదించారు.
నోటీసులివ్వకుండా
కడుపు కొడుతున్నారని ఆగ్రహం
గతంలో కార్పొరేషన్ అనుమతి తీసుకొన్నామని తమ ఇంటి ముంగిట కార్పొరేషన్ డ్రైనేజీ కూడా ఏర్పాటు చేసిందని ప్రభుత్వ స్థలాన్ని వదిలి తాము కొనుగోలు చేసిన పట్టా స్థలంలోనే భవనాల నిర్మాణం చేపట్టామని, అయితే కార్పొరేషన్ అధికారులు ఎలాంటి ఆదేశాలు, నోటీసులు ఇవ్వకుండా తమ కడుపు కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోడ్డు గుండా కమర్షియల్ కాంప్లెక్స్లు ఉండటంతో తాము బాడుగలకు ఇచ్చి జీవనోపాధి పొందేవారమని, భవనాల కూల్చివేతతో ఉపాధి కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శబరి హోటల్ నుంచి కేఈబీ సర్కిల్ వరకు 80 అడుగుల విస్తీర్ణంతో రోడ్లు వెడల్పు చేసి అనంతరం రోడ్డును సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతామని, బాధితులకు కూడా ఎలాంటి అన్యాయం జరగదని, రోడ్డు వెడల్పు ప్రక్రియ పూర్తి అయిన తర్వాత రోడ్డు డివైడర్లు వేసి రోడ్డును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన తర్వాత బాధితులకు కూడా ప్రయోజనకరంగా కనిపిస్తుందన్నారు. కాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి గట్టి బందోబస్తు మధ్య రోడ్డు వెడల్పు పనులకు సహకరించారు.
ఈసారి ఎస్ఎన్పేటె ఫ్లై ఓవర్ నుంచి కేఈబీ సర్కిల్ వరకు
గట్టి పోలీసు బందోబస్తు మధ్య
అక్రమ భవనాల కూల్చివేత