● ప్రధాని నరేంద్ర మోదీ విజన్ ఉన్న నాయకుడు ● విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి నా ప్రాధాన్యాలు ● ఆరు గ్యారంటీలను ప్రజలు నమ్మడం లేదు .. ● బీజేపీని గెలిపించాలని ప్రజలు డిసైడ్ అయ్యారు ● బీఆర్ఎస్, కాంగ్రెస్లకు ప్రజల నుంచి స్పందన లేదు
●ప్రజాసేవ లక్ష్యంగా..
ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చా. 2014 నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వంటి ధార్మిక సంస్థల ద్వారా ఇన్స్పైర్ అయ్యా. స్పిరిచ్యువల్ కుటుంబంలో పుట్టిన నేను ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పెరిగా. సామాజిక సేవలోనే ఉన్నా. 2014 వరకు బిజినెస్లో కొంతమేర సెటిల్ అయ్యా. బిజినెస్ దాదాపుగా పక్కన పెట్టి.. పదేళ్లలో అనేక ఎన్జీవోస్లో పనిచేసిన అనుభవం, సంబంధాలతో ఖమ్మంను అభివృద్ధి చేయొచ్చనుకున్నా. ఆదిలాబాద్, వికారాబాద్, మెదక్లో జరిగిన అభివృద్ధి ఇక్కడ లేదు. ఇక్కడికి వచ్చి చూశాక అదే అర్థమైంది. జిల్లా బాగుపడాలంటే గ్రామ వికాసం ప్రధానం. ఇందుకు ప్రభుత్వం నుంచి పథకాలతో పాటు ఎన్జీవోల నుంచి కూడా యాక్టివిటీ ఉండాలి. కార్పొరేట్ సంస్థలు కూడా సీఎస్ఆర్ నిధులతో పనులు చేయాలి. అప్పుడే అభివృద్ధి జరుగుతుంది.
●రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం..
సర్వేలు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. ప్రజలు కచ్చితంగా నరేంద్రమోదీకి ఓటు వేయాలని డిసైడ్ అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాదని తెలిసి కూడా ఆరు గ్యారంటీలను ప్రచారం చేసింది. ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అంటే ప్రజలు తరిమికొడతారు. అందుకే వాటి జోలికి పోకుండా రిజర్వేషన్లు తీసేస్తారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దొంగ వీడియోలు, మార్ఫింగ్ వీడియోలను ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయి. వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. వారు అన్నింటికీ తెగించారు. శిక్ష పడినా ఏమవుతుందిలే.. ముందయితే పబ్బం గడుపుకోవాలనే ధోరణిలో ఉన్నారు.
●దేశం ఆర్థికంగా దూసుకెళ్తోంది..
పదేళ్ల క్రితం భారత ఆర్థిక వ్యవస్థ దిగువ ర్యాంకులో ఉంది. ఇప్పుడు ఐదో ర్యాంకులో ఉంది. రానున్న కాలంలో మూడో ర్యాంకుకు చేరుతుందని ప్రపంచ ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మాజీ సీఎం కేసీఆర్ మాత్రం బీజేపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరగడం లేదని విమర్శిస్తున్నారు. ప్రపంచ నిపుణులే చెప్పిన తర్వాత కేసీఆర్ ఎంత. ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో నరేంద్రమోదీ రాజకీయాల్లోకి వచ్చారు. నేను పదేళ్లుగా ప్రజాసేవ చేస్తున్నా. డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ను. నా సేవా తత్పరత చూసి ప్రజలు ఓటు వేస్తారు. స్కామ్లు చేసే వారికి అవకాశం ఇస్తే స్కామ్లే చేస్తారు. పని చేసే వారికి అవకాశం ఇస్తే పని చేస్తారు.
●అనుసంధానకర్తగా ఉంటా..
దక్షిణ అయోధ్యగా ఉన్న భద్రాచలం అభివృద్ధి చెందడం లేదంటున్నారు. ఇంకా అనేక సమస్యలు పరిష్కారం కావడం లేదంటున్నారు. అధికారంలో ఉన్న వారు కేంద్రాన్ని ఈ సమస్యలపై అడిగారా.? కేంద్రం ఏమైనా చేయాలంటే ఇక్కడ అధికారంలో ఉన్న వారు చొరవ తీసుకోవాలి. కేంద్ర మంత్రులను తీసుకురావాలి. వారికి సమస్యలు వివరించాలి. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు హామీలతో పనులు చేయడం లేదు. ఇక్కడి నుంచి నన్ను గెలిపిస్తే సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తా. ప్రజలకు, కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానకర్తగా ఉంటా.
●ప్రజాదరణ బాగుంది..
నేను ప్రచారం చేస్తుండగా ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. వారి నుంచి ఆదరణ కనిపిస్తోంది. ఖమ్మం, సత్తుపల్లి, మధిర, కొత్తగూడెం ఇలా ఎక్కడ నేను రోడ్షో చేసినా వేల మంది వచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్తో పోలిస్తే బీజేపీకే ఆదరణ ఎక్కువగా వస్తోంది. ఇక్కడ మూడు నెలల నుంచి తిరుగుతున్నా. మోదీతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలకు అర్థమైంది. అందుకే ఆయన పార్టీ అభ్యర్థిని గెలిపించాలని నిర్ణయించుకున్నారు. బస్తర్ మహరాజ్ కమల్బంజ్ నియో ప్రచారానికి వస్తున్నారు. నాలుగు రోజులపాటు ఇక్కడే ఉంటారు. మిగిలిన ఈ రోజుల్లో ప్రచారాన్ని మరింత ఉధృతంగా చేస్తాం. పార్టీ కేంద్ర మంత్రులు, రాష్ట్ర, జిల్లా నాయకులతో ప్రచారం ఇప్పటి వరకు జోష్గా సాగింది. పార్లమెంట్ పరిధిలోని నేతలు, పార్టీ కార్యకర్తలు ప్రచారంలో కదం తొక్కుతున్నారు.
సమస్యలపై దృష్టి పెడతా..
నన్ను గెలిపిస్తే సమస్యలపై దృష్టి పెడతా. కేంద్ర ప్రభుత్వం సోషల్ ఎంటర్ప్రెన్యూర్స్, ఎన్జీవోల ను ప్రోత్సహించేలా చూస్తా. రైతులకు మార్కెట్ ను అనుసంధానం చేయాల్సి ఉంది. వారికి సహజ వనరులు అందుబాటులో ఉండేలా చూస్తా. పామాయిల్ బోర్డు ఏర్పాటుకు కృషిచేస్తా. ఫుడ్ప్రాసెసింగ్ ఇండస్ట్రీతో అనేక ఉపయోగాలున్నాయి. ఫుడ్పార్క్లు, ఎస్ఈజెడ్లు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసేలా కృషిచేస్తా. కొత్తగూడెంలో ఎయిర్పోర్టు, కొవ్వూరు రైల్వేలైన్ , గోదావ రి నీళ్లు సత్తుపల్లికి తరలించేందుకు, సత్తుపల్లిలో ఓపెన్కాస్ట్తో ఏర్పడుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు, కొత్తగూడెం వరకు ప్యాసింజర్ రైళ్లను నడిపించేందుకు, శాతవాహన రైల్స్టాప్లు పెంచేందు కు నావంతు ప్రయత్నాలు చేస్తా. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధికి ప్రథమ ప్రాధాన్యం ఇస్తా.