ఖమ్మం సహకారనగర్ : నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ(ఎన్టీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) ఆదివారం జిల్లాలోని ఐదు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించగా ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలో 3, 260 మంది విద్యార్థులకు గాను 3,179 మంది హాజరు కాగా 81 మంది గైర్హాజరైనట్లు పరీక్షల జిల్లా కో ఆర్డినేటర్ ఆర్.పార్వతిరెడ్డి తెలిపారు.
ముందస్తుగానే కేంద్రాలకు..
పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు నిర్వహించగా, 11 గంటల నుంచి 1:30 గంటల వరకే కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పడంతో విద్యార్థులు ముందస్తుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఎండలు అధికంగా ఉంటున్న క్రమంలో విద్యార్థుల వెంట వచ్చిన తల్లిదండ్రులు, బంధువులు పరీక్ష కేంద్రాల సమీపంలో చెట్ల కింద సేదదీరారు. ఎండల తీవ్రత నేపథ్యంలో కేంద్రాల సమీపంలో టెంట్లు వేయడంతో పాటు తాగునీరు తదితర సౌకర్యాలు కల్పించారు.
నిబంధనలు కఠినం..
నీట్కు నిబంధనలు కఠినతరంగా ఉంటున్నాయి. ఈ క్రమంలో పరీక్ష కేంద్రాలకు చెవుల దిద్దులు, చైన్లు తదితర వస్తువులను ధరించి వచ్చిన వారిని అనుమతించని అధికారులు.. వాటిని తొలగించి రావాలని సూచించారు. దీంతో విద్యార్థులు చెవి దిద్దులు, షూ, చైన్లు, తదితర వస్తువులను తల్లిదండ్రులు, బంధువులకు అందించి పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లారు.