ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో ఆదివారం సూర్యోపాసన సేవ నిర్వహించారు. లోక సంరక్షణార్థం, సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ప్రతి ఆదివారం అమ్మ వారి సన్నిధిలో సూర్యోపాసన సేవ జరుగుతోంది. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్య భగవానుడి చిత్రపటానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ నిర్వహించగా, పలువరు ఉభయదాతలు తమ నామ గోత్రాలతో పూజ జరిపించుకున్నారు. అనంతరం భక్తులకు ప్రసాదాల వితరణ జరిగింది. సేవలో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు.
తమిళనాడు వాసి ఆత్మహత్య
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో తమిళనాడుకు చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి శనివారం సాయంత్రం నుంచి ఫుల్గా మద్యం తాగి తమిళంలో మాట్లాడుతూ మణిపాల్ సెంటర్, ఓల్డ్ టోల్గేట్, సీఎస్ఆర్ కళ్యాణ మండపం ప్రాంతాల్లో తిరుగుతు రాళ్లు విసురుతూ పిచ్చిపిచ్చిగా ప్రవర్తించాడు. రాత్రి 12 గంటల సమయంలో తనకు తానే బ్లేడుతో పీకమీద కోసుకుని రోడ్డుమీద అటూ ఇటూ తిరుగుతుండడంతో ఓల్డ్ టోల్గేట్ వద్ద ఉన్న చెక్ పోలీసులు విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స నిర్వహించి ఎటువంటి ప్రమాదం లేదని తెలిపారు. ఒకరోజు విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పడంతో ఆతడిని ఆసుపత్రిలో ఉంచగా తెల్లవారుజామున బయటకు వచ్చి ఆస్పత్రి ఆవరణలో తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జరిగిన ఈ ఘటనపై విజయవాడ పోలీసులు కేసు నమోదు చేసి మృతుడి వివరాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.