రెచ్చిపోయిన టీడీపీ గూండాలు | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన టీడీపీ గూండాలు

Published Sun, May 5 2024 5:50 AM

రెచ్చ

● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై హత్యాయత్నం

సి.బెళగల్‌: టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై హత్యాయత్నానికి తెగబడ్డారు. సి.బెళగల్‌ మండలం ఇనగండ్ల గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుంది. ఎస్‌ఐ తిమ్మారెడ్డి తెలిపిన వివరాల మేరకు.. శుక్రవారం సాయంకాలం వైఎస్సార్‌సీపీ కర్నూలు ఎంపీ, కోడుమూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీ నాయకులు మండలంలోని పోలకల్‌ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పోలకల్‌ ప్రచార కార్యక్రమానికి ఇనగండ్ల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులతోపాటు కార్యకర్తలుగా ఉన్న రాజు, సోముబాబు వెళ్లారు. ప్రచారం అనంతరం తిరిగి గ్రామానికి వస్తున్న సందర్భంలో ఇనగండ్లలో టీడీపీ అభ్యర్థి, పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామంలోకి బైక్‌పై వచ్చిన సోముబాబు, రాజులను గుర్తించిన టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. సోముబాబును బైక్‌పై నుంచి పక్కకు లాగి కిందకు తోశారు. అదేవిధంగా బైక్‌పై ఉన్న మరో వైఎస్సార్‌సీపీ కార్యకర్త రాజు కిందపడటంతో ఒక్కసారిగా పదుల సంఖ్యలో గుంపులుగా టీడీపీ మూకాలు సోముబాబు, రాజుపై అందుబాటులో ఉన్న కర్రలు, రాళ్లతో త్రీవంగా దాడులు చేసి గాయపరిచారు. గుండాల దాడుల నుంచి తీవ్ర రక్తగాయాలతో తప్పించుకున్న బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దారినపోయే తమపై టీడీపీ ప్రచారంలో పాల్గొన్న ఇనగండ్ల, గూడూరు మండలం జూలకల్‌, ఇతర గ్రామాలకు చెందిన వ్యక్తులు కర్రలు, రాళ్లతో దాడి చేసి చంపే ప్రయత్నం చేశారని బాధితులు పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. రాజు, సోముబాబుల ఫిర్యాదు మేరకు ఇనగండ్ల గ్రామానికి చెందిన చందన్న, అఖిల్‌, విజయరాజు, రవి, చిన్న నాగేంద్ర, ఈశ్వర్‌, ఎన్‌ రాజు, రఘురాముడు, బడేసావ్‌, ఎన్‌ రఘు.. తదితరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నుట్లు ఎస్‌ఐ తిమ్మారెడ్డి తెలిపారు. కాగా తీవ్ర గాయాలైన బాధితులను కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయించడంతో ప్రాణాపాయం తప్పినట్లు బాధితుల కుటుంబ సభ్యులు, వైఎస్సార్‌సీపీ నాయకులు తెలిపారు.

రెచ్చిపోయిన టీడీపీ గూండాలు
1/1

రెచ్చిపోయిన టీడీపీ గూండాలు

Advertisement
Advertisement