హజ్ యాత్రికులకు నేడు వ్యాక్సినేషన్
న్యూశాయంపేట : వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధి హజ్ యాత్రకు వెళ్లే వారికి నేడు(సోమవారం) రెండో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు హజ్ కమిటీ వ్యాక్సినేషన్ క్యాంప్స్ కో–ఆర్డినేటర్లు డాక్టర్ అనీస్ సిద్ధిఖీ, సర్వర్ మోహియొద్దీన్ ఘాజీ ఓ ప్రకటనలో తెలిపారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి ఎదురుగా ఉన్న ఐఎంఏ హాల్లో ఉదయం 9 గంటలకు వైద్యశాఖ ఆధ్వర్యంలో క్యాంపు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా జిల్లాల పరిధి యాత్రికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
దేవాదుల ఇన్టెక్వెల్ వద్ద చోరీ
● సిబ్బందిని బెదిరించి రాగితీగ అపహరణ
కన్నాయిగూడెం : మండలంలోని తుపాకులగూడెం పంచాయతీ పరిధిలోని గట్టలగంగారం వద్ద నిర్మించిన దేవాదుల చొక్కారావు ఎత్తిపోతల వద్ద ఉన్న విద్యుత్ సబ్స్టేషన్లో రెండు రోజుల క్రితం దుండగులు.. విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని కత్తులతో బెదిరించి చోరీకి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానిక ఎస్సై సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దేవాదుల ఎత్తిపోతల వద్ద ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్లోకి దుండగులు చొరబడి కత్తులతో అక్కడే విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ప్రాణాలు తీస్తామని బెదిరించారు. అనంతరం అక్కడ విలువైన సామగ్రి రాగితీగను అపహరించినట్లు తెలిపారు. దుండుగుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని, సమాచారం తెలిపిన వారికి రూ.10వేల బహుమతి ఇవ్వనున్నట్లు పోలీసులు తెలిపారు.
వడదెబ్బతో ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నలుగురు మృతి చెందారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది.
గార్ల: మహబూబాబాద్ జిల్లా గార్లలోని వాటర్ట్యాంక్ బజార్కు చెందిన జమాల్పూరి నాగేందర్(56) వడదెబ్బతో మృతిచెందాడు. కులవృత్తిలో భాగంగా నాగేందర్ గార్ల సమీపంలోని ఓ గ్రామంలో మటన్ కోసేందుకు వెళ్లి మధ్యాహ్నం ఎండలో ఇంటికి చేరుకొని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక సీహెచ్సీకి తరలించగా ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. రెక్కాడితే డొక్కాడని నాగేందర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని వివిధ పార్టీల నాయకులు కోరారు.
అశోక్నగర్లో ఒకరు..
ఖానాపురం : మండలంలోని అశోక్నగర్కు చెందిన భిక్షపతి(40) టెంట్ వేసే పనులకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో ఆదివారం టెంట్ వేసేందుకు వెళ్లగా వడదెబ్బకు గురై గ్రామంలో తెలిసిన వారి ఇంటి వద్ద ఆగాడు. అక్కడ కూర్చున్న భిక్షపతి అక్కడికక్కడే మృతి చెందాడు.
జనగామలో గుర్తుతెలియని వృద్ధుడు..
జనగామ రూరల్: వడదెబ్బతో గుర్తుతెలియని వృద్ధుడు ఆదివారం జనగామ రైల్వేస్టేషన్ వద్ద మృతి చెందాడు. 70 నుంచి 80 సంవత్సరాల వయసు గల వృద్ధుడు రైల్వేస్టేషన్ జ్యూస్ సెంటర్ వద్ద వడదెబ్బతో మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని ఏరియా అస్పత్రికి తరలించి భద్రపర్చారు. ఆకుపచ్చ లుంగీ, తెలుపు నిండు చొక్కా ధరించి తెల్లని గడ్డం కలిగిఉన్నాడు. ఆచూకీ తెలిసిన వారు 8712685260, 8712685032, 8712685202 నంబర్లలో సంప్రదించాలని పోలీసులు చెప్పారు.
రేగొండలో వృద్ధురాలి..
రేగొండ : మండల కేంద్రానికి చెందిన పోడేటి రామక్క(75) వడదెబ్బతో ఆదివారం మృతి చెందింది. ఎండ తీవ్రత తట్టుకోలేక వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన బాలుడు
బయ్యారం: గంజాయి రవాణా చేస్తూ ఓ బాలుడు ఆదివారం బయ్యారం పోలీసులకు చిక్కాడు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ బాలుడు చింతపండు సంచితో బయ్యారంలోని డీసీసీబీ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నాడు. ఈ సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్సై మౌలానా తన సి బ్బందితో కలిసి బాలుడి దగ్గర ఉన్న సంచిలో సో దాలు నిర్వహించగా చింతపండు మధ్యలో గంజా యి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. వెంటనే బాలుడిని అదుపులోకి తీసుకుని 9.560 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.