ములుగు: జిల్లాకేంద్రంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న బీరన్న బోనాలు కార్యక్రమంలో భాగంగా మూడో రోజు స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని ఆదివారం యాదవులు ఘనంగా జరుపుకున్నారు.తొలుత బైకాని మల్లయ్య ఇంటి వద్ద సుంకుపట్టి కులస్తులకు బియ్యం అందజేశారు. పట్టణంలోని యాదవులు ప్రతీ ఇంటి నుంచి నైవేద్యం సమర్పించేందుకు బోనాలతో తరలివెళ్లారు. బీరన్న పూజారులు యాదవ సాంప్రదాయం ప్రకారం బోనాల చుట్టూ గొర్రెను గావుపట్టి పూజా కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా డోలివాయిద్యాలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాలనీలు సందడిగా మారాయి. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం కులపెద్దలు గొర్రె కొంరయ్య, సారిగొల్ల ఇమ్మడి భిక్షపతి, గోపు చంద్రమల్లు, ఎల్లావుల సమ్మయ్య, గుండెబోయిన కుమార్, కొనుపుల కుమార్, సంపత్, కృష్ణ, గోపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
బొడ్రాయి
వార్షికోత్సవ పూజలు
వాజేడు: మండల పరిధిలోని ఏడ్జర్లపల్లి కొత్తూరులో ఆదివారం బొడ్రాయి వార్షికోత్సవ పూజలను నిర్వహించారు. బొడ్రాయి ఏర్పాటు చేసి ఏడాది కావడంతో గ్రామస్తులు అందరు కలిసి పూజారి అనికుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా పూజలను జరిపించారు.
వేణుగోపాల స్వామికి
వైద్యరత్న అవార్డు
గోవిందరావుపేట: మండల పరిధిలోని చల్వాయి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యులు కల్యాణపు వేణుగోపాల స్వామి కరోనా సమయంలో ప్రజలకు అందించిన వైద్య సేవలు గుర్తించి వైద్యరత్న అవార్డుకు ఎంపిక చేసినట్లు బహుజన సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ తెలిపారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో కల్యాణపు వేణుగోపాల స్వామి ఎంపికై నట్టు ప్రకటించి ఆయనను అభినందించారు. జూన్ 10న మహారాష్ట్రలోని పూనేలో నిర్వహించే బహుజన రైటర్స్ 4వ ఇండియా కాన్ఫరెన్స్ సందర్భంగా వేణుగోపాల్ స్వామికి అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు ఎంఎం.గౌతం, రాష్ట్ర కో ఆర్డినేటర్ హనుమండ్ల విష్ణు, అవార్డు సెలక్షన్ కమిటీ సభ్యులు తాటికొండ ఐలయ్యలు, వేణుగోపాల స్వామి హజరుకానున్నారు.
విద్యుత్ తీగలు అమరిస్తే
కఠిన చర్యలు
కాటారం: అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగలు అమరిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై మ్యాక అభినవ్ హెచ్చరించారు. కాటారం మండలం ప్రతాపగిరిలో వన్యప్రాణుల వేట నిర్మూలన, అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగల నివారణపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. వన్యప్రాణుల వేట చట్టరీత్య నేరం అన్నారు. ఎవరైనా అటవీ ప్రాంతంలో విద్యుత్ తీగలు అమరిస్తే కేసుల పాలవుతారని హెచ్చరించారు. విద్యుత్ వైర్లు అమర్చడం కారణంగా వన్యప్రాణులు, మూగజీవాలు, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు.
జెట్ విమానం చక్కర్లు
కాళేశ్వరం: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కొన్ని రోజులుగా గోదావరి, ప్రాణహిత, ఇంద్రావతి నదుల సరిహద్దు గ్రామాల్లో జెట్ విమానం చక్కర్లు కొడుతోంది. మహదేవపూర్, పలిమెల, మహాముత్తారం, కాటారం తదితర గ్రామాలపై నుంచి తరుచూ జెట్ విమానం చక్కర్లు కొడుతుండడంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. జెట్ విమానం ఎక్కడి నుంచి వస్తుంది..? ఎందుకు సంచరిస్తుంది..? ఎవరి కోసం చక్కర్లు కొడుతుందో అంతు చిక్కడం లేదు. ఆదివారం కాళేశ్వరం, పలుగుల, మద్దులపల్లి, అన్నారం ప్రాంతంలో జెట్ విమానం తిరిగింది. కాగా, ఇటీవల మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లలో ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి మావోయిస్టులు తెలంగాణలోకి అడుగు పెట్టారనే అనుమానంతో పోలీసులు జెట్ విమానంతో జల్లెడ పడుతున్నారని సమాచారం. ఈ విషయమై పోలీసులు మాత్రం ఎలాంటి వివరాలు తెలుపడం లేదు.