ఏటూరునాగారం: మండల పరిధిలోని ఆదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి రైతులు ఆగమాగం అయ్యారు. వివిధ గ్రామాల్లోని రైతులు కల్లాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసింది. ఆరుకాలం కష్టపడి పండించిన ధాన్యం తడవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. మిరప కల్లాల వద్ద కూడా కొంతమేర కాయలు తడిసిపోయాయి. అదే విధంగా గాలి దుమారానికి కోత దశకు వచ్చిన వరిపంట నేలమట్టమైంది. పంట చేతికొచ్చే సమయంలో నష్టం వాటిల్లడంతో పలువురు రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. పలు చోట్ల చెట్లు విరిగిపడిపోవడంతో విద్యుత్ వైర్లు తెగిపోయి విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో విద్యుత్ అధికారులు గంటల తరబడి శ్రమించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎండీ.దావూద్ డిమాండ్ చేశారు. స్థానిక మార్కెట్ యార్డులో ఆరబెట్టిన, కుప్పలు పోసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుకోకుండా ఒక్కసారిగా గాలిదుమారంతో కూడిన వర్షం వచ్చిందన్నారు. దీంతో పలువురు రైతులు ధాన్యంపై టార్ఫాలిన్లు కప్పుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని తెలిపారు. కోతకు వచ్చిన ధాన్యం కూడా నేలవాలిందని వివరించారు. పంటల పెట్టుబడికి అప్పులు తీసుకొచ్చిన రైతులు కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారని పేర్కొన్నారు.
తడిసిన ధాన్యం కుప్పలు