● రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మురళి ● ఖానాపూర్కు చేరిన బస్సుయాత్ర
ఖానాపూర్: పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే శక్తులను ఓడించాలని రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. జాగో తెలంగాణ, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఆధ్వర్యంలో చేపట్టిన బస్సుయాత్ర శనివారం ఖానాపూర్ పట్టణానికి చేరింది. సీపీఐఎంల్ మాస్లైన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి నంది రామయ్య అధ్యక్షతన స్థానిక బస్టాండ్ ఏరియాలో ఫారెస్ట్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఓటు చైతన్యయాత్రలో ఆయన మాట్లాడారు. ఈసారి రాజ్యాంగ విలువలకు తిలోదకాలిచ్చే వైపు ఎన్నికలు సాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజావ్యతిరేక, కార్మిక వ్యతిరేక ఎన్డీయే కూటమిని ఓడించాలని కోరారు. పదేళ్ల ప్రధాని మోదీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కిందన్నారు. రెండు కోట్ల ఉద్యోగాల కల్పన ఏమైందని ప్రశ్నించారు. ధరల నియంత్రణ, పక్కా ఇళ్లు, విద్య, వైద్యం హామీల ఊసే లేకుండానే రాష్ట్రంలో పాలన కొనసాగిందని ఆరోపించారు. 50శాతానికి పైగా వ్యవసాయంపై జీవించే రైతుల నడ్డివిరిచే మూడు రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చిందని విమర్శించారు. దేశ సంపద కార్పొరేట్ల వశమయ్యే చట్టాలను ప్రవేశపెట్టిందని ఆరోపించారు. యాత్ర సమన్వయ కర్త నైనాల గోవర్ధన్, సీపీఐ ఎంఎల్ (న్యూడెమోక్రసీ) రాష్ట్ర కార్యదర్శి టీ శ్రీనివాస్, సీపీఐ నాయకులు ఎస్ఎన్ రెడ్డి, ప్రొఫెసర్లు కే లక్ష్మీనారాయణ, పద్మజాషా, ఎన్ఆర్ఐ రాయదాస్, పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి మంగ, నాయకులు రామలక్ష్మణ్, జ్యోతి, అరుణ, కల్పన, నిర్మల, స్వరూప, శ్రీకాంత్, శ్రీను, రాజేశ్, రాజ్కుమార్, అశోక్, అంకుశ్రావు, లింగన్న, శంకర్, ప్రసాద్, వాహిద్, గౌస్, రాము, అంజి, వినయ్, శివ తదితరులున్నారు.