● అభ్యర్థి మార్పుతో జిల్లా కార్యాలయంలో సామగ్రి ధ్వంసం
భువనేశ్వర్: పూరీ సదర్ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిని ఏఐసీసీ మార్చడంతో పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో జిల్లా కార్యాలయంలో విధ్వంసానికి పాల్పడ్డారు. పూరీ సదర్ అసెంబ్లీ స్థానానికి తొలుత సుజిత్ మహాపాత్రో పేరును కాంగ్రెస్ ప్రతిపాదించింది. ఈ నియోజకవర్గం అభ్యర్థిని మార్చినట్లు ఆదివారం సవరణ జాబితా విడుదల చేయడంతో ఈ పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ సుజిత్ మహాపాత్రొ స్థానంలో పార్టీ సీనియర్ నేత ఉమా వల్లభ రథ్ని ప్రకటించింది. ఈ మార్పు సుజిత్ మహాపాత్రో అనుచరులు, మద్దతుదారులకు ఆగ్రహం తెప్పించింది. ఏఐసీసీ మార్పు ప్రకటించే సరికి సుజిత్ మహాపాత్రో తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఆగ్రహించిన మద్దతుదారులు పూరీ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పార్టీ పోస్టర్లు, జెండాలను చించివేసి, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.