మద్దిపాడు: రాబోయే ఎన్నికల్లో యువత సమరోత్సాహంతో ముందుకు నడుస్తోందని పార్టీకి మూల స్తంభాలు యువతే అని సంతనూలపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ అభ్యర్థి, మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. మండలంలోని ఏడుగుండ్లపాడు, సీతారాంపురం, నేలటూరివారిపాలెం, లింగంగుంట, పెదకొత్తపల్లి, నేలటూరు గ్రామాల్లో ఆదివారం ఆయన ఎన్నిక ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. నేలటూరు గ్రామంలో ప్రచారానికి వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోమారు ముఖ్యమంత్రిని చేసుకోవడానికి యువత సిద్ధంగా ఉందని అన్నారు. సీఎం వైఎస్ జగన్ విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు అవసరమని నమ్మి వాటికి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహించారన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసిన ఘనుడు చంద్రబాబు అన్నారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్తో భూములను కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడంటూ ముఖ్యమంత్రి పై అభాండాలు వేస్తూ తన పచ్చ ప్రసార సాధనాల్లో విషం చిమ్మారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలవడానికి మోసపూరిత హామీలు ఇస్తున్నాడని అన్నారు. ఇంటికి ఒక చిన్నారికే అమ్మ ఒడి పథకం అమలు చేస్తే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి శ్రీలంకలా మారుస్తున్నాడంటూ గగ్గోలు పెట్టిన ఈ పెద్దమనిషి ఇప్పుడు తన మ్యానిఫెస్టోలో ఇంటిలో అందరికీ అమ్మకు వందనం పథకంలో రూ.15 వేలు ఇస్తాననడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. పక్క రాష్ట్రాల నుంచి, వైఎస్సార్ సీపీ నుంచి పథకాలను కాపీ కొట్టిన చంద్రబాబు తన మ్యానిఫెస్టో అంటూ చెబుతున్నాడని.. కానీ గత ఎన్నికల్లో చెప్పిన మ్యానిఫెస్టో ఏమైందో అందరికీ తెలుసని అన్నారు. ర ముందుగా ప్రతి గ్రామంలో యువకులు బైకులతో ర్యాలీలు నిర్వహిస్తూ మేళతాళాలతో ఊరేగింపుగా మంత్రి మేరుగు నాగార్జునను తమ గ్రామాలకు ఆహ్వానించారు. కార్యక్రమంలో ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు మండవ అప్పారావు, పార్టీ ప్రధాన కార్యదర్శి ఎంపీటీసీ వాకా కోటిరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చుండూరి రవి, గొర్రెపాటి శ్రీను, పార్టీ సీనియర్ నాయకులు బాలాంజనేయరెడ్డి, గుడ్డపాతల రవి, మండవ బాల చంద్రమౌళి, మేకల కృష్ణారెడ్డి, కంచి శ్రీనివాసరెడ్డి అచ్యుత్, మందా చిన్న, జనార్దన్, శ్రీకాంత్, దుంపా సుబ్బారెడ్డి ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు యువత భారీగా పాల్గొన్నారు.
పార్టీ విజయానికి పాటుపడతామన్న యువత మంత్రి మేరుగు నాగార్జున ఎన్నికల ప్రచారం