కదిరి: బీసీలకు ఏ నాయకుడు ఇవ్వనంత ప్రాధాన్యం ఇచ్చి పాలనలో భాగస్వామ్యం చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఈ ఎన్నికల్లో బీసీలంతా మద్దతుగా నిలవాలని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. బీసీలకు అండ... వైఎస్సార్ సీపీ జెండానే అన్నారు. ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ బత్తల హరిప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక దత్తా ఫంక్షన్ హాలులో బీసీ నేత నరసింహగౌడ్ అధ్యక్షతన నిర్వహించిన బీసీల ఆత్మీయ సమావేశం గ్రాండ్ సక్సెస్ అయింది. బీసీలు పెద్ద సంఖ్యలో హాజరుకాగా, కదిరి పట్టణం వైఎస్సార్ సీపీ జెండాలతో రెపరెప లాడింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ..మన పిల్లల భవిష్యత్ కోసం బీసీలంతా ఈసారి ఎన్నికల్లో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి, వైఎస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపు నిచ్చారు. జగన్ను ఓడించేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఏకమయ్యాయన్నారు. కానీ జగన్ వెంట పేదలంతా ఉన్నారని, ఆయనకు దేవుడి దీవెనలు, ప్రజల ఆశీర్వాదాలు మెండుగా ఉన్నాయన్నారు. పేద పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో జగన్ ప్రభుత్వం ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడుతుంటే చంద్రబాబుతో పాటు ఆయనకు వత్తాసు పలికే ఇంకొందరు, ఎల్లో మీడియా అడ్డుకోవాలని చూసిందని ఆర్.కృష్ణయ్య గుర్తు చేశారు. బీసీలకు తెలివి తేటలు లేవు..బీసీలు జడ్జిలుగా పనికిరారు అని లేఖలు రాసిన వారు.. ఇప్పుడు మళ్లీ ఓట్ల కోసం బీసీల దగ్గరకు వస్తున్నారని, వారికి ఓటు ద్వారానే తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపు నిచ్చారు.
అన్నింటా బీసీలకు సగభాగం..
రాష్ట్ర బడ్జెట్లోనూ, రాజకీయాల్లోనూ అలాగే విద్యలో ఇలా ప్రతి దాంట్లో బీసీలకు 50 శాతం వాటా ఇచ్చి చేతల్లో చూపించిన ఘనత సీఎం వైఎస్ జగన్కే దక్కుతుందని ఆర్.కృష్ణయ్య అన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం బీసీలకు ఇసీ్త్ర పెట్టెలు, కత్తెర పెట్టెలు తాయిలాలుగా ఇస్తే బీసీల ఆత్మబంధువు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి మాత్రం బీసీలను అన్ని రంగాల్లో ఉన్నత స్థాయికి తెచ్చేందుకు కృషి చేశారని ఆయన కొనియాడారు.
వైఎస్సార్సీపీ పేదల పార్టీ..
బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బత్తల వెంకటరమణ, వైఎస్సార్ సీపీ బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డా.హరిప్రసాద్ మాట్లాడుతూ.. చంద్రబాబు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటే, జగన్ బీసీలకు పదవులిచ్చి పక్కన కూర్చోబెట్టుకున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రశ్నించిన నాయీబ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు బెదిరించారని వారు గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్రెడ్డి మాట్లాడుతూ.. ఐదేళ్లలో చంద్రబాబు ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదని, కానీ జగనన్న మాత్రం ఎంతోమంది బీసీలను రాజ్యసభకు పంపారని అన్నారు. వైఎస్సార్ సీపీ కదిరి అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జ్ పూల శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, బీసీ సభప్లాన్ కింద ఏడాదికి రూ.10 వేల కోట్లు చొప్పున ఇస్తానని చెప్పి చంద్రబాబు దగా చేస్తే, సీఎం జగనన్న ఏడాదికి రూ.15 వేల కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్బాషా మాట్లాడుతూ, బీసీలకు వైఎస్సార్ సీపీలోనే తగిన గుర్తింపు ఉందన్నారు. ఎస్కేయూ పాలక మండలి సభ్యుడు కొమ్ము భాస్కర్ మాట్లాడుతూ, ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా?అని చంద్రబాబు దళితుల పుట్టుకనే ఆవహేళన చేశారన్నారు. దీంతో సభలో ఉన్న వారంతా ‘బాయ్ బాయ్ బాబు’ అని గట్టిగా అరిచారు.
మద్దతు ఇవ్వండి
వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి శాంతమ్మ, కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి మక్బూల్ మాట్లాడుతూ, బీసీల సంక్షేమం కోరే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బీసీలంతా వెన్నుదన్నుగా నిలవాలన్నారు. బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన తమకు సీఎం జగన్ టికెట్లు ఇచ్చారని, మద్దతుగా నిలిచి గెలిపించాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర బీసీ నాయకులు దశరథనాయుడు, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి వేమల ఫయాజ్, సింగిల్విండో అధ్యక్షుడు జగదీశ్వర్రెడ్డి, ఆంజనేయులు, లీగల్సెల్ జోనల్ ఇన్చార్జ్ లోకేశ్వరరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ రాఘవయ్య, రామయ్య, రిటైర్డ్ డీఎస్పీ వేణుగోపాల్, పెద్ద సంఖ్యలో బీసీలు పాల్గొన్నారు.
బీసీలంతా జగన్కు బాసటగా నిలవాలి
ఫ్యాను గుర్తుకే ఓటేద్దాం..
జగన్కు జై కొడదాం
‘జయహో బీసీ’ సభలో
హోరెత్తిన జగన్నినాదం