తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి వరకు 77,848 మంది స్వామివారిని దర్శించుకోగా 39,317 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.2.95 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 12 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది.
నేటి నుంచి
వేసవి శిక్షణ తరగతులు
తిరుపతి సిటీ: శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో సనాతన ధర్మ సంస్కృతి సంప్రదాయ పరిరక్షణలో భాగంగా వేసవి శిక్షణ తరగతులను నిర్వహించనున్నట్లు వర్సిటీ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ తరగతులు సోమవరాం నుంచి మే 27 వరకు రోజూ ఉదయం 8 నుంచి 10.30గంటల వరకు, తిరిగి సాయంత్రం 5.30 నుంచి 7.30 వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. 16 ఏళ్లలోపు బాలబాలికలకు వివిధ దేవత సంబంధమైన ధ్యాన శ్లోకాలు, విష్ణు సహస్రనామ స్తోత్రం, లక్ష్మీ అష్టోత్తర శతకంలో శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. 16 ఏళ్లు పైబడిన విద్యార్థినీ, విద్యార్థులకు లలితా సహస్రనామ స్తోత్రం, వివిధ దేవతా స్తోత్రాలు, వ్రతాలు, నవవిధభక్తి మార్గాల పట్ల అవగాహన, సనాతన ధర్మం పట్ల అవగాహన, వేదాలకు సంబంధించి స్వశాఖాపరమైన సంధ్యావందనం నేర్పన్నట్లు తెలిపారు. ఆసక్తిగల వారు అడ్మిషన్ల కొరకు 9550071629, 9000850325 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
ప్రశాంతంగా నీట్
● తిరుపతిలో 9 పరీక్షా కేంద్రాల్లో నిర్వహణ
● 97.37 శాతం మంది హాజరు
తిరుపతి ఎడ్యుకేషన్ : ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు ఆదివారం తిరుపతిలోని 9 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన నీట్ అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నీట్ పరీక్షను ఎన్టీఏ ఆఫ్లైన్ విధానంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. తిరుపతిలోని విశ్వం హైస్కూల్, ఎడిఫై, శ్రీవిద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్, గీతమ్, లిటిల్ ఏంజల్స్, శ్లోకా బిర్లా, ఎస్జీఎస్ ఆర్ట్స్ కళాశాల, మార్గ్ చిన్మయ విద్యాలయా సీనియర్ సెకండరీ స్కూల్, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు సీసీ కెమెరాల నిఘాలో పరీక్షను నిర్వహించారు. నీట్ రాసేందుకు ఉదయం 11గంటల నుంచే విద్యార్థులు ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. వీరిని నిబంధనలకు అనుగుణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించారు. తిరుపతిలోని 9 పరీక్షా కేంద్రాల్లో 4,692 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవ్వాల్సి ఉండగా.. వీరిలో 105 మంది గైర్హారు కావడంతో 4,569(97.37శాతం) మంది విద్యార్థులు హాజరయ్యారు.