పెబ్బేరు రూరల్: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాలు తప్పకుండా అమలు చేస్తామని.. అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరేలా చూస్తామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని యాపర్ల, గుమ్మడం, గుమ్మడంతండా, తిప్పాయిపల్లి, అయ్యవారిపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కొన్ని పథకాలు అమలు చేయలేదని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి నాయకత్వంలో ఆగష్టు 15లోపు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రామన్పాడులో
నిలకడగా నీటిమట్టం
మదనాపురం: మండలంలోని రామన్పాడు జలాశయంలో నీటిమట్టం నిలకడగా ఉంది. ఆదివారం 1,012 అడుగుల నీటిమట్టం ఉన్నట్లు ఏఈ సింగిరెడ్డి రనీల్రెడ్డి తెలిపారు. జూరాల ఎడమ, సమాంతర కాల్వల ద్వారా నీటి సరఫరా లేదని.. తాగునీటి అవసరాలకు జలాశయం నుంచి రోజుకు 20 క్కూసెక్కుల నీటిని వినియోగిస్తున్నామని వివరించారు.
కూలి పెంచకపోతే పోరాటం తీవ్రం : ఇఫ్టూ
అమరచింత: బీడీ ఫ్యాక్టరీ యాజమాన్యాలు కూలి ఆశించిన మేర పెంచకపోతే తీవ్రమైన పోరాటాలకు కార్మికులు సిద్ధం కావాలని ఇఫ్టూ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, టీపీబీడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.సూర్యం పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని మార్క్ భవనంలో ఆదివారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెలలో రెండు దఫాలుగా జరిగిన చర్చల్లో కార్మిక సంఘాల డిమాండ్లను పక్కనబెట్టి యాజమాన్యం అతి తక్కువగా వేతనం పెంచుతామని చెప్పడం శోచనీయమన్నారు. రెండోదఫా చర్చల్లో ప్రస్తుతం ఇస్తున్న వెయ్యి బీడీల తయారీకి రూ.207కు మరో రూ.పది పెంచుతామని ప్రకటించడం కార్మికవర్గాన్ని అవమానించడమేనని తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో వెయ్యి బీడీల తయారీకి రూ.245.75 అమలైందని.. వాటిని కూడా పరిగణలోకి తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఈ నెల 9న మూడోదఫా చర్చల్లో తగినంత కూలి పెంచకపోతే పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్మికులకు చట్టపరంగా వేతనాలు, పీఎఫ్లో యాజమాన్య వాటా 50 శాతం అమలు చేయాలని, గ్రాట్యూటీ చట్ట ప్రకారం చెల్లించాలని, పీఎఫ్లో తప్పులను యాజమాన్యమే సరిచేయాలన్న డిమాండ్ల సాధనకు భవిష్యత్లో కార్మికవర్గం సంఘటితంగా బలమైన పోరాటాలకు కార్యాచరణ చేస్తున్నామని వెల్లడించారు. సమావేశంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సామేలు, అరుణ్కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి రాజు తదితరులు పాల్గొన్నారు.