భీమవరం: వైద్య విద్య కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) భీమవరంలో ఆదివారం ప్రశాంతంగా జరిగింది. పట్టణంలోని భారతీయ విద్యాభవన్స్ సంస్థలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 952 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 929 మంది హాజరయ్యారని సిటీ కో–ఆర్డినేటర్ ఎల్వీ రమాదేవి చెప్పారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు.
అవస్థలు పడ్డ అభ్యర్థినులు
నీట్ పరీక్ష రాసేందుకు కేంద్రానికి వచ్చిన అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు పలు అవస్థలు పడ్డారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల లోపే కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతిస్తామని అధికారులు ప్రకటించడంతో అభ్యర్థులు, తల్లిదండ్రులతో కలిసి ఉదయం 9 గంటలకే పెద్ద సంఖ్యలో పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు. నడిరోడ్డుపై క్యూలైన్లు ఏర్పాటు చేయడం, కేవలం ముగ్గురిని మాత్రమే విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు నియమించడంతో తీవ్రమైన ఎండలో అభ్యర్థులు క్యూలో నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి తోడు ఫార్మల్ దుస్తులు మాత్రమే ధరించిరావాలని, ఆభరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు వెంట తీసుకురాకూడదని నిబంధనలు విధించడంతో అభ్యర్థినులు మండుటెండలోనే జుట్టు ముడివేసుకోవడం, చెవిదిద్దులు, చైన్స్, కాళ్ల పట్టీలు తొలగించి బంధువులకు అప్పగించాల్సి ఉంది.