యాదగిరిగుట్ట : ఏకాదశిని పురస్కరించుకొని యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం లక్ష పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ముఖ మండపంలోని ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి వివిధ రకాల పుష్పాలతో అర్చన చేశారు. ఈ వేడుకలో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలు కొనసాగాయి. ఆలయ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహహోమం, గజవాహన సేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం సాయంత్రం వెండి జోడు సేవ నిర్వహించారు.
సబ్ జైల్, బాలసదన్లో వసతుల పరిశీలన
భువనగిరి క్రైం : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి వి.మాధవిలత శనివారం భువనగిరి సబ్ జైలును సందర్శించారు. ఖైదీలతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం జైలులో ఖైదీలకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి జైలు అధికారికి సూచనలు చేశారు. అలాగే ఖైదీలకు అందుతున్న న్యాయ సహాయంపై ఆరా తీశారు. అనంతరం బాలసదన్ను సందర్శించి బాలికల బాగోగులపై తెలుసుకున్నారు. వసతుల లేమిని గుర్తించి సమస్య పరిష్కరించాలని బాలసదన్ ఇన్చార్జిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ బండారు జయశ్రీ, డీసీపీఓ సైదులు, బాలసదన్ ఇన్చార్జి, సిబ్బంది పాల్గొన్నారు.
శిక్షణ తరగతులను
విజయవంతం చేయాలి
సూర్యాపేట: జూన్ 2, 3 తేదీల్లో సూర్యాపేటలో జరగనున్న ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యూ) రాష్ట్ర రాజకీయ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర మాజీ కార్యదర్శి చండ్ర అరుణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్.శిరోమణి పిలుపునిచ్చారు. శనివారం జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్లో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. నేటి సమాజంలో మహిళలు వివక్ష, అణచివేత, దోపిడీకి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలను చైతన్యం చేసేందుకే శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ శిక్షణ తరగతుల నిర్వహణకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో పీఓడబ్ల్యూ రాష్ట కోశాధికారి ఝాన్సీ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మారసాని చంద్రకళ, కొత్తపల్లి రేణుక, జిల్లా ఉపాధ్యక్షులు సూరం రేణుక, ఐతరాజు పద్మ, పద్మ తదితరులు పాల్గొన్నారు.