-
విద్వేష రాజకీయాలను తిప్పికొట్టడమే నివాళి!
భౌతికంగా మన మధ్యలేకపోయినా చరిత్ర పుటల్లో సజీవంగా నిలిచిపోయే వ్యక్తులు కొందరే ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తులలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య (పీఎస్) ఒకరు. నెల్లూరు జిల్లా అలగానిపాడు గ్రామంలో 1913 మే 1వ తేదీన భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. తొలినాళ్లలో ఆయన మీద గాంధీజీ ప్రభావం ఉండేది. 1930లో మాలపర్రు గ్రామంలో కాంగ్రెస్ సత్యాగ్రహ కార్యక్రమంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అయితే క్రమంగా ఆయనలో కాంగ్రెస్పై నమ్మకం సన్నగిల్లింది. మద్రాసు లయోలా కాలేజీలో చదువుతున్నప్పుడు కంభంపాటి సత్యనారాయణ, వీకే నరసింహన్, హెచ్డీ రాజాలతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో సోషలిస్ట్ సాహిత్యాన్నీ, కమ్యూనిస్ట్ మేనిఫెస్టోనూ అధ్యయనం చేశారు. అపుడే, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అమీర్ హైదర్ ఖాన్ కమ్యూనిస్ట్ పార్టీలో పని చేయాలని ఆహ్వానించారు. దీంతో డిగ్రీ అయిపోయిన తర్వాత పీఎస్ ఫుల్టైమర్గా పార్టీలో చేరారు. 1934లో అమీర్ హైదర్ ఖాన్ అరెస్ట్ కాగా ఆయన బొంబాయి వెళ్లారు. అక్కడే సోషలిస్ట్ భావాలుగల వ్యక్తుల వివరాలు సేకరించి కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణానికీ, విస్తరణకూ కృషి చేశారు. ఆ క్రమంలో 1938–1939లో ఇఎంఎస్ నంబూద్రిపాద్ కమ్యూనిస్ ్టపార్టీలో చేరారు. అలాగే తమిళనాడులో ఎంఆర్ వెంకట్రామన్, రామమూర్తి, తెలుగునాట మోటూరు హనుమంతరావు, లావు బాలగంగాధరరావు, తరిమెల నాగిరెడ్డి, ఈశ్వరరెడ్డి పార్టీలోకి వచ్చారు. 1940 ఆంధ్ర మహాసభ నుండి రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, చిర్రావూరి లక్ష్మీ నర్సయ్య, దేవులపల్లి వేంకటేశ్వరరావు, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ధర్మబిక్షం, కృష్ణమూర్తి, ఆరుట్ల రామచంద్రారెడ్డి ఇంకా మరెందరో నిజాం స్టేట్లో కమ్యూనిస్ట్ పార్టీ లోకి వచ్చారు. అంతకు ముందే కవి మగ్దూవ్ు మొహియుద్దీన్ కమ్యూనిస్ట్ పార్టీవైపు వున్నారు. 1946–1951 మధ్య జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వేలాది మంది కమ్యూనిస్ట్ యోధులు ప్రాణాలు కోల్పోయారు. 1947 ఆగస్టు 15న దేశం స్వాతంత్య్రం పొందినప్పటికీ తన సంస్థానం ప్రత్యేక రాజ్యంగా కొనసాగాలని నిజాం రాజు పట్టుపట్టాడు. ఈ స్థితిలో 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం నిజాం సంస్థానాన్ని విలీనం చేసుకోవడానికి యాక్షన్ ప్రారంభించింది. తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగా అప్పటికి ఖమ్మం, వరంగల్, కరీంనగర్లో కొంత భాగం; నల్లగొండ జిల్లాలో మూడు వేల గ్రామాలు నిజాం, దొరల పాలన నుండి విముక్తి పొందాయి. పది లక్షల ఎకరాల భూమిని దేశ్ముఖ్ల, భూస్వాముల నుండి స్వాధీనం చేసుకొని దున్నేవారికి పంచారు. ఆయా గ్రామాలలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన గ్రామ రాజ్యాల ఏర్పాటుతో నిజాం పాలన బలహీనపడింది, మరోవైపు భారతసైన్యం ప్రవేశించడంతో నిజాం రాజు విలీనానికి అంగీకరించాడు. విలీనం తర్వాత భారత సైన్యం కమ్యూనిస్ట్ దళాలతో తలపడి చాలామందిని చంపింది. కమ్యూనిస్ట్ నాయకులు, దళ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లారు. అత్యంత శిక్షణ పొందిన భారత సైన్యంతో సాధారణ ఆయుధాలతో పోరాడలేని పరిస్థితి వచ్చింది. ఈ స్థితిలో పోరాట విరమణకు సంబంధించి దళాలతో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి సుందరయ్య మారుపేరుతో రహస్యంగా పోరాట ప్రాంతాలలో పర్యటించారు. పలు మార్లు దళ సభ్యులూ, పార్టీ నాయకులతో మాట్లాడిన తర్వాత సాయుధ పోరు విరమించేందుకు నిర్ణయం తీసుకున్నారు. 1955 నుంచి 1957 వరకు మొదటి రెండేండ్లు ఆంధ్ర శాసన సభలో, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సభ్యుడిగా, ఇంతకు ముందు రాజ్యసభ సభ్యుడిగా సుందరయ్య పనిచేశారు. ఆయన సునిశిత పరిశీలన, అధ్యయనాలకు ‘సాయుధ తెలంగాణ పోరాటం– గుణ పాఠాలు’, ‘ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర నీటి పథకం’ రచనలు అద్దం పడతాయి.1934లో ఉమ్మడి పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆ తర్వాత 1964లో పార్టీ చీలిక తర్వాత ఏర్పడిన సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శిగా పీఎస్ బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా పని చేశారు. జీవితాంతం కమ్యూనిస్ట్ ఉద్యమ విస్తృతికి అవిశ్రాంతంగా పని చేసిన ఆయన 1985 మే 19న భౌతికంగా అస్తమించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న విద్వేష రాజకీయాలను తిప్పికొడుతూ సామరస్య జీవనాన్ని కాపాడుకోవడమే సుందరయ్యకు మన మిచ్చే నిజమైన నివాళి అవుతుంది. జాలకంటి రంగారెడ్డి వ్యాసకర్త సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ‘ 9490098349 -
కోవిడ్ టీకాను ఎలా చూడాలి?
‘ఆస్ట్రా–జెనెకా’ తన కోవిడ్–19 టీకాలను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకోవడం చర్చనీయాంశం అయింది. ఆ టీకా వల్ల రక్తం గడ్డకట్టడం లాంటి దుష్ప్రభావాలు అరుదుగానైనా కలగడమే ఆ నిర్ణయానికి కారణం. ఇదే టీకాను ‘కోవిషీల్డ్’ పేరుతో ఇండియాలో కోట్లాది డోసులు వేయడం సహజంగానే ఆందోళన కలిగిస్తుంది. కానీ ఈ టీకా కేవలం పది నెలల్లోనే ఆమోదం పొందిన వాస్తవాన్ని విస్మరించకూడదు. మహమ్మారులు దాడి చేసినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజారోగ్య నిపుణులు, ప్రభుత్వాలు ప్రమాదంలో ఉన్న జనాభాను కాపాడుకోవాల్సి ఉంటుంది. భారత్ లాంటి పెద్ద దేశంలో ఆసుపత్రుల్లో పడకలు కూడా అందుబాటులో లేని కాలంలో, ఈ టీకా లక్షలాది మందిని చనిపోకుండా నిరోధించిందని మరిచిపోరాదు.ఆంగ్లో–స్వీడిష్ ఔషధ తయారీదారు అయిన ‘ఆస్ట్రా–జెనెకా’ తన కోవిడ్–19 టీకాలను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకోవడం ప్రారంభించింది. భారతదేశంలో ‘కోవిషీల్డ్’ పేరుతో వచ్చిన ఈ టీకాను ఆస్ట్రా–జెనెకా సహకారంతో పుణెకు చెందిన ‘సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ తయారు చేసింది. దేశ వ్యాప్తంగా దాదాపు 175 కోట్ల టీకా డోసులను అందించారు. టీకాల ఉపసంహరణకు ‘భిన్న రకాల వేరియంట్లకు బహుళ టీకాల లభ్యత వల్ల కాలం చెల్లిన టీకాలు మిగిలిపోవడం’ కారణమని ఆస్ట్రా–జెనెకా సంస్థ పేర్కొంది. సరళంగా చెప్పాలంటే, తీవ్రమైన దుష్ప్రభావాల కేసులకు సంబంధించిన కోర్టు విచారణలు,కంపెనీ ఎదుర్కొంటున్న 100–మిలియన్ పౌండ్ల(సుమారు వెయ్యి కోట్ల రూపాయలు) మేరకు క్లాస్ యాక్షన్ వ్యాజ్యం(ఎక్కువమందికి సంబంధించిన కేసు) నేపథ్యంలో ఇది కేవలం వ్యాపార నిర్ణయం. కోవిడ్–19 టీకా ‘చాలా అరుదైన సందర్భాల్లో, టీటీఎస్కు కారణం కావచ్చు’ అని కంపెనీ, ఫిబ్రవరిలో అంగీకరించినట్లు నివేదించబడింది.‘టీటీఎస్’ అంటే థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్తో థ్రాంబోసిస్. ఇది శరీరంలో ప్లేట్లెట్లు పడిపోవడానికీ, రక్తం గడ్డకట్టడానికీ కారణమవుతుంది. ఊపిరి ఆడకపోవడం, ఛాతీ నొప్పి, తలనొప్పులు, సులభంగా గాయపడటం వంటి లక్షణాలు దీంట్లో ఉంటాయి. బ్రిటన్ లో చాలా మంది వ్యక్తులు తాము వివిధ రకాల గాయాలతో బాధపడుతున్నామని పేర్కొన్నారు. భారతదేశంలో కూడా, కొన్ని కుటుంబాలు ఆస్ట్రా–జెనెకాపై, సీరమ్ సంస్థపై చట్టపరమైన చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రభుత్వాలు ఏమి చేయాలని ప్రజారోగ్యం నిర్దేశిస్తుంది, భారతదేశంలో దీనికి ఏదైనా భిన్నంగా చేయగలిగి ఉండేవాళ్లమా అనేదాని గురించి నేను ఆలోచిస్తున్నాను. మాజీ ప్రజారోగ్య పాలనాధికారిగా నా అభిప్రాయాలను ఇచ్చే ముందు, ఇద్దరు అత్యంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తులతో మాట్లాడాను. నేను మొదటగా భారతదేశ ప్రముఖ మైక్రోబయాలజిస్టు, వైరాలజిస్టులలో ఒకరైన డాక్టర్ గగన్ దీప్ కాంగ్తో మాట్లాడాను. ఆమె సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలోని ట్రాన్స్లేషనల్, హెల్త్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్ స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నాకు తెలుసు. ఆమె అభిప్రాయం మేరకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ 2021 మార్చిలో అస్ట్రా–జెనెకా టీకా టీటీఎస్ దుష్ప్రభావం కలిగించే ప్రమాదం గురించి ప్రకటించింది. 2021 మే నాటికి దానిని ధ్రువీకరించింది. 2021 అక్టోబర్లో ‘కోవిషీల్డ్’కు సంబంధించిన ప్రమాద కారకాన్ని చేర్చడానికిగానూ సీరమ్ సంస్థ తన టీకా లేబుల్ను నవీకరించింది. టీటీఎస్ వల్ల, కొందరు రోగులు దుష్ప్రభావాలను ఎదుర్కొన్నట్లు, కొన్ని సందర్భాల్లో చివరికి మరణాలు సంభవించాయని మనకు పొడికథలుగా మాత్రమే తెలుసు. అలాంటప్పుడు టీకాను కొనసాగించడం లేదా కొనసాగించకపోవడం వల్ల కలిగే నష్టం ఏమిటి? మనకు ప్రత్యామ్నాయం ఉందా?గగన్దీప్ కాంగ్ మనకు తెలియని వాటి గురించి వివరించారు. ‘‘ప్రమాదం వయస్సుపై ఆధారపడి ఉంటుంది. ఇది భౌగోళికతపై కూడా ఆధారపడి ఉండొచ్చు. భౌగోళికత సమస్యను రోటావైరస్ టీకాల కోసం మనం చేసినట్లుగా ఫార్మావిజిలె¯Œ ్స ద్వారా మాత్రమే లెక్కించవచ్చు. నిష్క్రియాత్మకంగా అంటే ప్రజలు సమస్యను నివేదించే వరకు వేచి ఉండటం మరొక మార్గం. ఈ విధానంలో ఉన్న సమస్య ఏమిటంటే, టీకా వేసిన మొదటి కొన్ని గంటలలో లేదా రోజులలో దుష్ప్రభావం చూపకుంటే అది టీకాతో సంబంధం ఉన్నదిగా గుర్తించబడకపోవచ్చు.ప్రమాదం–ప్రయోజనం నిష్పత్తి, ముఖ్యంగా డెల్టా వేవ్ విషయంలో చూస్తే, ప్రయోజనమే ఎక్కువగా ఉండింది; ముఖ్యంగా వృద్ధులకు ఎక్కువగా, యువకులకు కొంత తక్కువగా. పాశ్చాత్య దేశాలను అనుసరించి, 40 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారికి కోవిషీల్డ్ను వేయడం నిలిపివేసి ఉంటే, మన ప్రత్యామ్నాయం ‘కోవాక్సిన్ ’ అయివుండేది. ఇది తక్కువ సరఫరాలో ఉంది. ఫలితంగా యువకులకు రోగనిరోధక శక్తి విస్తరించేది. భారతదేశానికి నిర్దిష్టంగా టీటీఎస్ డేటా లేనందున, పర్యవేక్షించడం కష్టంగా ఉండేది’’ అని ఆమె చెప్పారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్కు చెందిన సెంటర్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ ఆనంద్ కృష్ణన్ దీనిని విభిన్నంగా చెప్పారు: ‘‘అరుదైన దుష్ప్రభావం ప్రయోజనకరమైన కార్యక్రమాన్ని అడ్డుకోలేకపోవడానికి భారీస్థాయి ప్రజారోగ్య ప్రయోజనం కారణమైంది. దుష్ప్రభావాలపై దృష్టి కేంద్రీకరించడం వలన టీకా వేసుకోవాలా వద్దా అనే సంకోచం ఏర్పడుతుంది. అంటే మనం ఆ దుష్ప్రభావాలను దాచిపెట్టాలని కాదు... వెనక్కి చూసుకుంటే, మెరుగైన, మరింత సూక్ష్మమైన, సమతుల్యమైన సమాచారం సహాయపడి ఉండేదని చెప్పడం మెరుగు. అరుదైన దుష్ప్రభావాలను ఎదుర్కొన్న వారికి పరిహారం కోసం కూడా మనం ప్లాన్ చేసి ఉండవచ్చు.’’దుష్ప్రభావాల క్లెయిమ్లను పరిశీలించే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక పీడకలగా మారేదని చెప్పడానికి నాకు ఎలాంటి సంకోచమూ లేదు. టీకాలు అత్యంత వేగంగా పూర్తి చేయడానికి అవి పూర్తిగా కట్టుబడి ఉన్నాయి. మహమ్మారి దాడి చేసినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజారోగ్య నిపుణులు, ప్రభుత్వాలు ప్రమాదంలో ఉన్న జనాభాను కాపాడుకోవాల్సి ఉంటుంది. అత్యంత హాని కలిగే వారికి ప్రాధాన్యతనిచ్చి టీకాలు వేసేలా చూసుకోవాలి. భారతదేశంలో ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో లేని కాలంలో వేలాది మంది ప్రజలు చనిపోకుండా టీకాలు నిరోధించాయి.ఇక టీకాను అభివృద్ధి చేయడానికి తీసుకునే సాధారణ సమయం పదేళ్లు. దీనికి భిన్నంగా అస్ట్రా–జెనెకా టీకా కేవలం పది నెలల్లోనే ఆమోదం పొందిన వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. దానిని తప్పక గుర్తించి, గౌరవించాలి. ఇది కచ్చితంగా లక్షలాది మందిని తీవ్రమైన అనారోగ్యాలకు గురికాకుండా లేదా చనిపోకుండా నిరోధించింది. తీవ్రమైన దుష్ప్రభావాల గురించి బాగా అర్థం చేసుకుని, నిర్ణయాలు తీసుకున్నవారు పట్టించుకుని ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. కానీ అంతేనా? ఏదైనా నిపుణుల సంఘం ఇచ్చిన ప్రతికూల సలహా దేన్నయినా అణచిపెట్టారా? రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకోవాల్సిన ముఖ్యమైన, చర్య తీసుకోదగిన సమాచారం ఏదైనా ఉండిందా? అలా కాదంటే మాత్రం వ్యాక్సిన్ డ్రైవ్ను వేగవంతం చేయడానికి ప్రయోజనపు సమతూకం స్పష్టంగా అనుకూలంగా ఉంది.భారతదేశంలోని భారీ జనాభాకు టీకాలు వేయకుండా ఆటంకం కలిగించే శక్తిమంతమైన టీకా వ్యతిరేక ఉద్యమాన్ని మనం అదృష్టవశాత్తూ చూడలేదు. రద్దీగా ఉండే నగరాలు, ఆరు లక్షలకు పైగా గ్రామాలలో ప్రజలు చెదిరిపోయి ఉన్నందున ప్రజారోగ్య స్పందన అనేది సహజంగానే పెద్ద ఎత్తున వ్యాధిగ్రస్తులను మరియు మరణాలను నిరోధించడానికి ఉద్దేశించారు. అందులో చర్చకు తావులేదు. కుటుంబాలు, సంఘాల ఎంపికకు టీకాను వదిలేసివుంటే, లక్షలాదిమందిని ప్రమాదంలో పడేసేది. వయసు లేదా భౌగోళికతపై లేని డేటాను వెతుకుతూ పోతే, టీకా కార్యక్రమం పట్టాలు తప్పివుండేది. ఒక్కో జిల్లాలో దాదాపు 20 లక్షల జనాభా కలిగిన భారతదేశంలోని దాదాపు 800కు పైగా జిల్లాల్లోని జిల్లా ఆరోగ్య కార్యకర్తలు అప్పటికే తీవ్ర పని ఒత్తిడిలో ఉన్నారు.కొన్ని సమయాల్లో, మంచి (ఈ సందర్భంలో, దుష్ప్రభావాలను పర్యవేక్షించడం) అనేది కూడా గొప్ప శత్రువుగా (లక్షలాదిమందికి టీకాలు అందని అపాయం ఉండటం) మారవచ్చు. భారతదేశానికి సంబంధించి, ఈ క్షణపు వాస్తవం ఇది!- వ్యాసకర్త కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి; మాజీ ప్రధాన కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- శైలజా చంద్ర -
అనిశ్చితి కొనసాగితే అంతులేని నష్టం
ఏడాది తర్వాత కూడా మణిపుర్లో శాంతిభద్రతల పరిస్థితి మెరుగు పడలేదు. మణిపుర్ రాజధాని ఇంఫాల్తో నాగాలాండ్ను కలిపే జాతీయ రహదారి మీద ఉన్న వంతెనను దుండగులు పేల్చేశారు. మరో ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లను చంపేశారు. అరాచకం ఎంత స్థాయికి వెళ్లిందంటే, న్యూఢిల్లీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని భావించే శక్తులు ఉన్నాయి.పదునైన టీమ్ వర్క్ ఫలితంగా అస్సాంలో శాంతి యుగానికి నాంది పడింది. అస్సాంలో జరిగినట్లుగానే మణిçపుర్, నాగాలాండ్, దక్షిణ అరుణాచల్ ప్రదేశ్లకు ఏకీకృత కమాండ్ వ్యవస్థ (యూనిఫైడ్ కమాండ్ స్ట్రక్చర్)ను తక్షణమే ఏర్పాటు చేయడం మేలు. ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని, అనిశ్చితిని ఇలాగే కొనసాగనిస్తే, మణిపుర్ కోలుకోలేని విధంగా నష్టపోతుంది.హింస చెలరేగిన ఏడాది తర్వాత కూడా మణిపుర్లో శాంతిభద్రతల పరిస్థితి మరింత దారుణంగానే ఉంది. ఈ రాష్ట్రంలోని ప్రధాన శక్తులు ఏకతాటిపైకి వచ్చి తక్షణ దిద్దుబాటు కోసం ఒక మార్గాన్ని అన్వేషించడమే ఇప్పుడున్న ఏకైక పరిష్కారం.సైన్యం లక్ష్యంగా దాడిమణిపుర్లో ఇటీవల జరిగిన మూడు సంఘటనలను దృష్టిలో పెట్టుకోవాలి. ఏప్రిల్ 24న కాంగ్పోక్పి జిల్లాలోని జాతీయ రహదారి–2పై ఉన్న వంతెన మీద దుండగులు ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ వంతెన ఇంఫాల్ను నాగాలాండ్లోని దిమాపూర్తో కలుపుతుంది. ఈ రహదారి రాష్ట్రానికి ప్రధాన జీవనాధారం. రాష్ట్రం నిలువునా చీలిపోయిన కారణంగా మణిపుర్ ప్రజలకు అవసరమైన సామగ్రిని తీసుకువెళ్లే 100కు పైగా ట్రక్కులు అక్కడ నిలిచిపోవాల్సి వచ్చింది.ఏప్రిల్ 27న బిష్ణుపూర్ జిల్లాలోని నారాన్సీనా వద్ద జరిగిన దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. సీఆర్పీఎఫ్ జవాన్లు విడిది చేసి ఉన్న ప్రాంతానికి 200 మీటర్ల దూరంలోనే ఇండియా రిజర్వ్ బెటాలియన్ క్యాంపు (ఐఆర్బీ) ఉంది. ఐఆర్బీలో సిబ్బంది ప్రధానంగా మైతేయి కమ్యూనిటీకి చెందినవారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది తమ శిబిరాన్ని ఖాళీ చేసే పనిలో ఉన్నారనీ, అక్కడ ఒక ప్లాటూన్ మాత్రమే మిగిలి ఉందనీ తెలియవచ్చింది.దాడి చేసినవారు ఐఆర్బీలోని మైతేయి సభ్యులను లక్ష్యంగా చేసుకున్నారని భావించే అవకాశం ఉంది; రాత్రిపూట దాడి జరిగినందున, వారు సీఆర్పీఎఫ్ శిబిరాన్ని ఐఆర్బీ అని పొరపడి ఉండొచ్చు.అయితే, ఆ దాడి లక్ష్యం సీఆర్పీఎఫ్ కూడా అయి ఉండవచ్చు – 1990ల మధ్యకాలంలో, అస్సాంలోని హిందీ మాట్లాడే ప్రజలను యథేచ్ఛగా హతమార్చడానికి ప్రయత్నించిన తిరుగుబాటు బృందం యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ (ఉల్ఫా) కార్యాచరణను ఇది తలపింపజేస్తోంది. అప్పట్లో ఉల్ఫా కేంద్రప్రభుత్వ దృష్టిని ఆకర్షించడానికి గట్టిగా ప్రయత్నించింది. అందులో విజయవంతం అయింది కూడా. ఉత్తరప్రదేశ్, బిహార్ల నుండి కొంతమంది ఎంపీలు హిందీ మాట్లాడే తమ సోదరులకు సహాయం చేయడానికి వెంటనే అస్సాంలో దిగారు. బయటి వ్యక్తులు తమ రాష్ట్రంలో దుకాణాలు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించే ఒక వర్గం అస్సామీ జనాభాలో ఉండేది. అది ఇప్పటికీ అలాగే ఉంది.నారాన్సీనా ఘటనకు సంబంధించి, మణిçపుర్లో అరాచకం ఎంత తీవ్రస్థాయికి వెళ్లిందంటే, న్యూఢిల్లీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని భావించే శక్తులు ఉన్నాయి. కాకపోతే సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ వంటి కేంద్ర పారామిలిటరీ బలగాలను వీరు గతంలో లక్ష్యంగా చేసుకోలేదని గమనించడం ముఖ్యం.ఒకే తాటిపైకి వస్తేనే...వంతెనపై ఐఈడీ పేలుడు, సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడికి సంబంధించిన అనుమానపు చూపు ప్రధానంగా కుకీ మిలిటెంట్ల వైపు మళ్లింది. అయితే, అది చేసింది ఎవరైనా కావచ్చు. 2023 మే 3 నుండి నియంత్రణ లేకుండా ఉన్న రాష్ట్రంలో, దాదాపు ప్రతి సమూహం సైనికీకరించబడింది.మూడో విషయం రాజకీయ అండదండలతో కొనసాగుతున్న అరాచకానికి సంబంధించినది. అక్రమ ఆయుధాలతో ఉన్న అరామ్బాయీ తెంగోల్ సభ్యులను పట్టుకున్న తర్వాత, సైన్యానికి చెందిన కాస్పిర్ వాహనాన్ని మీరా పైబీలు(మహిళా బృందాలు) అడ్డగించారు. వందలాది మంది మీరా పైబీలు కాస్పిర్ను చుట్టుముట్టి సైనికులను దూషించారు. ఆ సమయంలో గనక సైనిక సిబ్బంది సంయమనం కోల్పోయి ఉంటే రక్తపాతం జరిగి ఉండేది.పదునైన టీమ్ వర్క్ ఫలితంగా అస్సాం శాంతి యుగానికి నాంది పలికింది. అస్సాంలో జరిగినట్లుగానే మణిçపుర్, నాగాలాండ్, దక్షిణ అరుణాచల్ ప్రదేశ్లకు ఏకీకృత కమాండ్ వ్యవస్థ (యూనిఫైడ్ కమాండ్ స్ట్రక్చర్)ను తక్షణమే ఏర్పాటు చేయడం మేలు. ఇది రంగాపహాడ్(నాగాలాండ్) కేంద్రంగా పనిచేసే 3 కోర్కు చెందిన జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మొత్తం నాయకత్వం కింద ఉండాలి. సహజంగానే సంప్రదింపుల తర్వాతే ఒక స్పష్టమైన స్వరం... శాంతి, సాధారణ స్థితికి రావడానికి కావాల్సిన వ్యూహాలు, మార్గాలు, సాధనాలపై దృష్టి పెట్టాలి. మణిçపుర్ విభజితమై ఉంది. రాష్ట్ర పోలీసు యంత్రాంగం దాదాపుగా పనిచేయడం లేదు. ఎటువంటి ఎదురూ లేని రాడికల్ మిలీషియా సంస్థకు పోలీస్ విభాగం తన బాధ్యతను వదిలేసుకుంది. కొంతమంది పోలీసులను ఆయుధాలు వదిలి వేయమని బలవంతం చేస్తూ అరామ్బాయీ తెంగోల్ ఒక డీఎస్పీని తీసుకెళ్లింది. ఇలాంటి తరుణంలో పోలీసులకు నాయకత్వం అవసరం. దురదృష్టవశాత్తు, అది పోలీసు శాఖ లోపల నుండి ఉద్భవించదు. దానిపై అధికారాన్ని 3 కోర్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ వంటి బలమైన సంస్థాగత మద్దతుతో కూడిన దృఢమైన నాయకుడికి అప్పగించాలి. అస్సాం రైఫిల్స్ అద్భుతంగా పని చేస్తోంది. కానీ అది పక్షపాత దృష్టితో ఉందని అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారు. మణిçపుర్ లోయ నివాసితులు దానిని తొలగించాలని కోరారు. మణిçపుర్లోని అనేక ప్రాంతాల నుండి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం తొలగించబడింది. దాంతో రాష్ట్రంలో ప్రభుత్వేతర శక్తులు చేస్తున్న చర్యలను ఎవరైనా చూడవచ్చు. అస్సాం రైఫిల్స్ ఇప్పటికే 3 కోర్ కార్యాచరణ కమాండ్ కింద ఉంది. కానీ దీనిని ఏకీకృత కమాండ్ వ్యవస్థ(యూసీఎస్)లో భాగం చేస్తే... ఆర్మీ, మణిపుర్ పోలీస్, కేంద్ర పారామిలిటరీ బలగాలతో దాని కార్యాచరణ కదలికలను క్రమాంకనం చేయడానికి అది వీలు కల్పిస్తుంది. అంతేగాక, యూసీఎస్ లోని ఇతర అంతిమ వినియోగదారులకు అనుగుణంగా పటిష్ఠమైన నిఘా వీలవుతుంది.అన్నీ కలగలిసే...మణిçపుర్, నాగాలాండ్, దక్షిణ అరుణాచల్లకు పరస్పరం ముడిపడి ఉన్న సమస్యలే దీనికి కారణం. ఉదాహరణకు, ప్రత్యేక అడ్మినిస్ట్రేటివ్ జోన్లను ఏర్పర్చిన తర్వాత, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్– ఇసాక్– ముయివా (ఎన్ఎస్సీఎన్–ఐఎమ్) సహాయంతో లోయ–ఆధారిత తిరుగుబాటు గ్రూపులు మణిçపుర్లోకి ప్రవేశించే సమస్యనుంచి ఎవరూ తప్పించుకోలేరు. అలాగే, ‘ఈస్టర్న్ నాగా నేషనల్ గవర్నమెంట్’ నుండి ఎన్ఎస్సీఎన్–ఐఎమ్కు లభిస్తున్న మద్దతు వెలుగులోనే, దక్షిణ అరుణాచల్లోని తిరప్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్ జిల్లాలలో జరిగే కుతంత్రాలను చూడాలి.భారత రాజ్యం, దాని సైన్యం చాలా శక్తిమంతమైనవి. అవి ఎలాంటి సవాలునైనా ఎదుర్కోగలవు. ఈ క్లిష్ట సమయంలో న్యూఢిల్లీ తీసుకోవాల్సిన ఏకైక చర్య తన బలగాలను బలోపేతం చేయడమే. అసాధ్యమైన వాటిని సాధించగల సామర్థ్యం సైన్యానికి ఉంది. ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని, అనిశ్చితిని ఇలాగే కొనసాగనిస్తే, మణిçపుర్ కోలుకోలేని విధంగా నష్టపోతుంది.- వ్యాసకర్త భద్రత – తీవ్రవాద వ్యవహారాల విశ్లేషకుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- జైదీప్ సైకియా -
గాజాలో కూలుతున్న జ్ఞాన వ్యవస్థలు
ప్రపంచ బ్యాంకు ప్రకారం పాలస్తీనా అక్షరాస్యత రేటు 97.51 శాతం. పాలస్తీనియన్లు ‘ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యావంతులైన శరణార్థులు’. అయితే గాజాలోని విశ్వవిద్యాలయాలు ఇప్పుడు ఇజ్రాయెల్ దాడిలో నాశనమయ్యాయి. ఇప్పటివరకూ సుమారు 90 మందికి పైగా ప్రొఫెసర్లు ఈ దాడుల్లో మరణించారు. గాజా పిల్లల విద్యావకాశాలను నిర్మూలిస్తూ... పాఠశాలలు, పుస్తకాల దుకాణాలు, లైబ్రరీలు ధ్వంసమయ్యాయి. పాలస్తీనా విజ్ఞానం, జ్ఞానాన్ని ఉత్పత్తి చేసే సంస్థల వినాశనం సమస్త జ్ఞానాన్ని అంతమొందించడం కంటే తక్కువేమీ కాదు! ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు దీనిని అర్థం చేసుకున్నారు. అమెరికా, ఇతర దేశాలలోని విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థుల ఆందోళనలకు కారణం అదే.గాజాలోని విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థలపై ఇజ్రాయెల్ దాడి పాలస్తీనా విజ్ఞాన, పర్యావరణ వ్యవస్థలను నాశనం చేయడానికి చేసిన ఉద్దేశపూర్వక ప్రయత్నంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు, మొత్తం 12 విశ్వవిద్యాలయాలు వైమానిక దాడులకు గురయ్యాయి. ఇజ్రాయెల్ లక్ష్యాలలో అల్–అజహర్ విశ్వవిద్యాలయం, ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ గాజా (ఐయూజీ) ఉన్నాయి. దీని ఫలితంగా పాలస్తీనా అధ్యాపకులు, పండితులు, విద్యార్థులు సంవత్సరాల తరబడి సాగించిన పరిశోధన ధ్వంసమైపోయింది.ఐయూజీ ప్రెసిడెంట్, వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ సుఫియాన్ తాయెహ్, ఆయన కుటుంబ సభ్యులు విశ్వవిద్యాలయ క్యాంపస్పై జరిగిన ఇజ్రాయెల్ దాడిలో మరణించారు. ఐయూజీ అనేది గాజాకు చెందిన ప్రముఖ విద్యాసంస్థ. ప్రొఫెసర్ తాయెహ్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పరిశోధకుడు. అలాగే, కొనసాగుతున్న దాడిలో మరణించిన 90కి పైగా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లలో ఐయూజీలో ఆంగ్ల సాహిత్యం బోధించే డాక్టర్ రెఫాత్ అలరీర్ మరొకరు.పాలస్తీనా విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2024 జనవరి 20 వరకు దాదాపు 4,400 మంది విద్యార్థులు మరణించారు, 7,800 మంది గాయపడ్డారు. 231 మంది ఉపాధ్యాయులు, నిర్వాహకులు మరణించారు, 756 మంది గాయపడ్డారు. అలాగే 378 ప్రభుత్వ నిర్వహణలోని పాఠశాలలతోపాటు, గాజాలో యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) నిర్వహణలోని పాఠశాలలు పూర్తిగా లేదా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. 2023 అక్టోబర్లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కనీసం 97 మంది జర్నలిస్టులు, మీడియా కార్యకర్తలతోపాటు 35,000కు పైగా ప్రజలు మరణించారు.‘‘దాదాపు 90,000 మంది పాలస్తీనియన్ విశ్వవిద్యాలయ విద్యార్థులు గాజాలోని విశ్వవిద్యాలయానికి హాజరు కాలేరు. 60 శాతానికి పైగా పాఠశాలలు, దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు, లెక్కలేనన్ని పుస్తకాల దుకాణాలు, లైబ్రరీలు దెబ్బతిన్నాయి లేదా ధ్వంసమయ్యాయి. గాజా పిల్లలు, యువకుల విద్యావకాశాలను నిర్మూలిస్తూ, యూనివర్సిటీల డీ¯Œ లు, ప్రముఖ పాలస్తీనా పండితులతో సహా... వందలాది మంది ఉపాధ్యాయులు, విద్యావేత్తలు చంపబడ్డారు’’ అని దక్షిణాఫ్రికా న్యాయపరమైన అంశాల ప్రతినిధి బ్లిన్నె నీ ఘ్రాలే అంతర్జాతీయ న్యాయస్థానంలో వెల్లడించారు.ప్రజల చిహ్నాలను, డాక్యుమెంట్ చరిత్రను తుడిచిపెడుతూ లైబ్రరీలు, ఆర్కైవ్లు, మ్యూజియంలతో సహా అనేక సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు కూడా ధ్వంసమయ్యాయి. పాలస్తీనా మేధావులు దీనిని ‘చరిత్ర నుండి పాలస్తీనా ఉనికిని తుడిచివేయడానికి’ చేసే ప్రయత్నంగా చూస్తున్నారు. కెనడియన్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్కు రాసిన లేఖలో కెనడాలోని మౌంట్ రాయల్ యూనివర్సిటీకి చెందిన సోషియాలజీ ప్రొఫెసర్ ముహన్నద్ అయ్యాష్ దీనిని ‘రాజకీయ పటం నుండి పాలస్తీనాను తుడిచిపెట్టే ప్రయత్నం’గా పేర్కొన్నారు. ‘పాలస్తీనా విజ్ఞానం, విజ్ఞాన నిర్మాతలు మరియు జ్ఞానాన్ని ఉత్పత్తి చేసే సంస్థల వినాశనం సమస్త జ్ఞానాన్ని అంతమొందించడం(ఎపిస్టెమిసైడ్) కంటే తక్కువేమీ కాదు’ అని వ్యాఖ్యానించారు.‘ఎపిస్టెమిసైడ్’ అంటే జ్ఞాన వ్యవస్థను చంపడం, మూగబోయేలా చేయడం, నాశనం చేయడం లేదా విలువ తగ్గించడం అని అర్థం. సోషియాలజిస్ట్ బోవెంచురా డి సౌసా శాంటోస్ ఈ పదాన్ని రూపొందించారు. ‘వలస పాలన, అణచివేత, మారణహోమాల కారణంగా అధీన సంస్కృతిలో సంభవించే విజ్ఞాన మరణంగా’ దీనిని ఆయన అభివర్ణించారు. ఇది సైనికపరంగా, సైద్ధాంతికపరంగా రెండు విధాలుగానూ ఉండొచ్చు. ఇది విముక్తి పేరుతో స్వాధీనం, శాంతి పేరుతో దురాక్రమణ, జీవన పవిత్రత పేరుతో జీవన విధ్వంసం, హక్కుల పరిరక్షణ పేరుతో మానవ హక్కులను ఉల్లంఘించే రూపంలో జరగవచ్చు.1948లో ఇజ్రాయెల్కు స్థానం కల్పించడం కోసం తాము వైదొలగాల్సి వచ్చిన తర్వాత పాలస్తీనియన్ విద్యావంతులైన ఉన్నతవర్గాలు పాలస్తీనా విద్యావ్యవస్థను పునర్నిర్మించడానికి అత్యంత ప్రాధాన్యమిచ్చాయి. వారు విద్యను తమ జీవితాలను పునర్నిర్మించడానికి, పురోగతిని సాధించడానికి ఒక చోదకశక్తిగా భావించారు. అర్థవంతమైన సాంస్కృతిక మార్పిడి, శాస్త్రీయ పురోగతి, చరిత్రపై అవగాహన, సృజనాత్మక సాహిత్య రచనలతో గాజాను పాలస్తీనా సమాజాన్ని అభివృద్ధి చేసే ప్రదేశంగా మార్చాలనే ఆశతో అనేక మంది పండితులు వివిధ ప్రాంతాల నుండి అక్కడికి వెళ్లారు. ఇందులో వారు విజయం సాధించారా లేదా అనేది చర్చనీయాంశం. కానీ కచ్చితంగా, పాలస్తీనా నేడు అత్యధిక అక్షరాస్యత రేటు ఉన్న ప్రాంతాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం పాలస్తీనా అక్షరాస్యత రేటు 97.51 శాతం. పాలస్తీనియన్లను ‘ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యావంతులైన శరణార్థులు’ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు దీనిని అర్థం చేసుకున్నారు. అమెరికా, ఇతర దేశాలలోని విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, విద్యార్థుల తిరుగుబాటు వెనుక ఉన్న కారణం అదే. పాలస్తీనా విద్యాసంస్థల్లో జరుగుతున్న ప్రతిధ్వనులు విదేశాల్లోని క్యాంపస్లలో వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ దురాక్రమణకు అమెరికా ప్రభుత్వం అందిస్తున్న నిరంతర ద్రవ్య, సైనిక, దౌత్య, నైతిక మద్దతును నిరసిస్తూ అనేక విశ్వవిద్యాలయాలలో శిబిరాలు ఏర్పాటైనాయి. దాదాపు 10 విశ్వవిద్యాలయాలలోకి పోలీసులను పిలిపించారు, 645 మందిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో చాలా మందిని తర్వాత విడుదల చేశారు. ఉన్నత స్థాయి కొలంబియా, బోస్టన్ విశ్వవిద్యాలయాలు నిరసనల కేంద్రాలుగా మారాయి. ఈ రెండు విశ్వవిద్యాలయాల క్యాంపస్ల నుండి 200 మందికి పైగా అరెస్టులు చేశారు. గాజాలో కాల్పుల విరమణ పిలుపులో గణనీయమైన సంఖ్యలో అధ్యాపకులు పాల్గొన్నారు లేదా మద్దతు ఇచ్చారు. కొన్ని యూనివర్సిటీలలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పాలనాధికారులు విరుచుకుపడ్డారు, వారిలో కొందరిని బహిష్కరించారు.లాస్ఏంజిల్స్లోని క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయం,ఇతర ప్రదేశాలలో పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ అనుకూల ప్రదర్శనకారుల మధ్య గొడవలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. పాలస్తీనా విద్యను విధ్వంసకరమైన విభజన దురదృష్టాల నుండి రక్షించడానికి ప్రపంచం తన స్వరాన్ని పెంచాలి. జ్ఞాన వ్యవస్థను నాశనం చేయడానికి వారాలు పడుతుంది. కానీ దానిని పునర్నిర్మించడానికి దశాబ్దాలు పడుతుంది.ఇజ్రాయెల్తో జట్టు కట్టిన దేశాలలోని కొన్ని విశ్వవిద్యాలయాలు దురదృష్టవశాత్తూ పాలస్తీనా సంస్థలతో విద్యా మార్పిడి ఒప్పందాలను కుదుర్చుకోవడానికి విముఖత చూపాయి. మరోవైపు, ఇజ్రాయెల్ విశ్వవిద్యాలయాల విద్యార్థులను అంతర్జాతీయ సహకారానికి చెందిన ప్రయోజనాలను ఆస్వాదించడానికి సాదరంగా స్వాగతించారు. ఇజ్రాయెల్ విశ్వవిద్యాలయాలు కెనడాకు చెందిన పోస్ట్–సెకండరీ సంస్థలతో ఇప్పటికే 60 విద్యా ఒప్పందాలను కలిగి ఉన్నాయి.ముఖ్యంగా అభివృద్ధి చెందిన ప్రపంచంలోని విద్యావేత్తలు, అధ్యాపక సంఘాలు, యూనియన్లు... అస్తవ్యస్తంగా ఉన్న పాలస్తీనా వ్యవస్థను పునర్నిర్మించడానికి వాగ్దానం చేయడంతో పాటు, యుద్ధాన్ని ముగించే వైపుగా ప్రజల అభిప్రాయాన్ని నిర్మించడానికి, ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఇది తగిన సమయం.- వ్యాసకర్త నార్తర్న్ బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెసర్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- అమర్జీత్ భుల్లర్ -
‘రక్షణ’కు ఒక దిగ్దర్శనం అవసరం!
బీజేపీ, కాంగ్రెస్ మేనిఫెస్టోలు జాతీయ భద్రతకు భిన్న మార్గాల్లో ప్రాధాన్యం ఇచ్చాయి. అయితే రెండూ కూడా అత్యాధునిక మిలటరీ ఆయుధాలను సమకూర్చుకోవటానికి ఏమంత ప్రాముఖ్యం ఇవ్వలేదు. దేశంలోని ఈ రెండు ప్రధాన జాతీయ పార్టీల మేనిఫెస్టోలు పరిశీలించిన తరువాత రక్షణ, భద్రత అంశాల విషయంలో కాంగ్రెస్ మేనిఫెస్టో కొంత మెరుగ్గా ఉన్నట్లు తోస్తోంది కానీ... త్రివిధ దళాల అధిపతులు, జాతీయ భద్రతా సలహాదారులు కలిసి ఉన్న డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ... జాతీయ భద్రత వ్యూహం ఒకదాన్ని రూపొందించే విషయం రెండు మేనిఫెస్టోల్లోనూ స్పష్టంగా లేదు. అంతేకాదు, మన రక్షణ రంగానికి ఇప్పుడు దిగ్దర్శనం చేసే ఒక ‘ప్రొఫెషనల్’ అవసరం కూడా ఎంతైనా ఉంది.బీజేపీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆత్మ నిర్భర్ భారత్’లో స్వావలంబనకు పెద్దపీట వేశారు కానీ... అత్యాధునిక మిలిటరీ ఆయుధాలను సమకూర్చుకోవడంపై మాత్రం దృష్టి పెట్టలేదు. జాతీయ భద్రత, రక్షణ వంటి విషయాల్లో భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో చాలా అంశాలను ప్రస్తావించింది కానీ... ఏవీ అంత సమగ్రంగా ఉన్నట్టు కనిపించవు. ‘మోదీకి గ్యారెంటీ ఫర్ సురక్షిత్ భారత్’ పేరుతో మోదీ ప్రభుత్వం తను సాధించిన విజయాలను వెల్లడించింది, భవిష్యత్తు కోసం కొన్ని హామీలను ఇచ్చింది. 2014 తరువాత దేశంలోని ఏ నగరంలోనూ ఉగ్రదాడి ఏదీ జరగలేదని బీజేపీ చెప్పుకుంటోంది. ఇందులో కీలకం ‘నగరం’ అన్న పదం. 2016లో పఠాన్కోట వైమానిక స్థావరం, యూరీలు; 2019లో పుల్వామా ఘటనల్లో ‘నగరాల’పై దాడులు జరగలేదు కాబట్టి తాము తప్పుగా ఏమీ చెప్పలేదని బీజేపీ సమర్థించుకోవచ్చు.దీంతోపాటే ఆర్టికల్ 370 రద్దు ప్రభావం జమ్మూ కశ్మీర్లో ఎలా ఉందో కూడా మేనిఫెస్టోలో ప్రస్తావించారు. వామపక్ష తీవ్రవాద సంబంధిత హింస 52 శాతం వరకూ తగ్గిందనీ, ఈశాన్య భారతదేశంలో చొరబాటుదారుల సమస్య 71 శాతం నెమ్మదించిందని కూడా ఇందులో వివరించారు. ఉగ్రవాదాన్ని అస్సలు సహించేది లేదని చెబుతూ మేనిఫెస్టోలో 2016 నాటి సర్జికల్ స్ట్రైక్స్, 2019 నాటి బాలాకోట్ దాడి గురించి చెప్పారు. చైనా, పాకిస్తాన్, మయన్మార్ సరిహద్దుల్లో అత్యాధునికమైన రీతిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామనీ, కార్యక్రమాలను వేగవంతం చేస్తామనీ, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో స్మార్ట్ ఫెన్సింగ్ వంటివి ఏర్పాటు చేస్తామని కూడా బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. అయితే.. మణిపుర్ కూడా మన దేశ సరిహద్దులో ఉన్నా దాని ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ‘మోదీకి గ్యారెంటీ ఫర్ గ్లోబల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్’ విభాగంలో రక్షణ రంగ ఉత్పత్తులను మరింత విస్తృత స్థాయిలో తయారు చేస్తామనీ, ‘మేడిన్ భారత్’ ఎగుమతులకు ఊతమిస్తామని కూడా చెప్పుకున్నారు. ఈ ప్రయత్నాల వల్ల వాయు, పదాతిదళాలకు అవసరమైన ఆయుధాలు, వ్యవస్థలను దేశీయంగానే తయారు చేసేందుకు ప్రోత్సాహం లభిస్తుందని వివరించారు. గత ఏడాది అంటే బీజేపీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు అయిన తరువాత ‘నేషన్ ఫస్ట్: ఫారిన్ పాలసీ అండ్ నేషనల్ సెక్యూరిటీ’ పేరుతో బీజేపీ ఒక బుక్లెట్ విడుదల చేసి. అందులో తాము సాధించిన ఘనతలను ప్రస్తావించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రక్షణ, అంతర్గత భద్రతను, బయటి నుంచి రాగల సవాళ్లను వేర్వేరుగా సమీక్షించారు. లద్దాఖ్ ప్రాంతంలో సుమారు రెండు వేల కిలోమీటర్ల వైశాల్యమున్న భారత భూభాగాన్ని, మొత్తం 65 పెట్రోలింగ్ పోస్టుల్లో 25 పోస్టులపై పట్టు కోల్పోయామన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రస్తావించింది. అధికారంలోకి వస్తే జాతీయ భద్రతా వ్యూహం (ఎన్ఎస్ఎస్) ఒకదాన్ని ఆవిష్కరిస్తామని ప్రకటించింది. అలాగే ఎప్పుడో 2009లో రక్షణ మంత్రి జారీ చేసిన ఆపరేషనల్ డైరెక్టివ్లను సమీక్షిస్తామనీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామక ప్రక్రియను పారదర్శకంగా, వ్యవస్థీకృతంగా చేస్తామని కూడా హామీలు ఇచ్చింది. రక్షణ శాఖకు తగినన్ని నిధులు కేటాయించడమే కాకుండా ఈ రంగంలో తిరోగమిస్తున్న అంశాలను మళ్లీ పట్టాలెక్కిస్తామని తెలిపింది. ‘అగ్నిపథ్’ పథకం రద్దుతో పాటుగా, జాతీయ భద్రతా కౌన్సిల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్లను పార్లమెంటు పర్యవేక్షణలో పనిచేసేలా మార్పులు చేస్తామనీ, వ్యూహాత్మక అవసరాలకు అంతర్జాతీయ స్థాయి సరుకు రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తామనీ ‘వన్ ర్యాంక్– వన్ పెన్షన్’ అమల్లోని లోపాలను సవరిస్తామనీ వివరించింది. వైకల్యం కారణంగా లభించే పెన్షన్పై పన్నులు రద్దు చేస్తామని కూడా చెప్పింది. అంతర్గత భద్రత విషయాలను ప్రస్తావిస్తూ ద్వేషపూరిత ప్రసంగాలు, హింసలకు తావు ఇవ్వమనీ, ఇతర మతాల నిరాదరణనూ సహించబోమనీ స్పష్టం చేసింది. ‘నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్’ను ఆచరణలోకి తేవడం, ఏడాది లోపు ‘నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్’ ఏర్పాటు తమ లక్ష్యాలని వివరించింది. దేశంలోని రెండు ప్రధాన జాతీయ పార్టీల మేనిఫెస్టోలు పరిశీలించిన తరువాత కాంగ్రెస్ మేనిఫెస్టో రక్షణ, భద్రత అంశాల విషయంలో కాస్త మెరుగ్గా ఉన్నట్లు తోస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... మన ప్రభుత్వం రక్షణ రంగానికి జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో రెండు శాతం కంటే తక్కువ నిధులు కేటాయిస్తూండటం! ఫలితంగా మన మిలటరీ సామర్థ్యాలను చైనాకు దీటుగా మార్చుకునే విషయంలో వెనుకబడిపోయాం. త్రివిధ దళాల ఆధునికీకరణకు మరిన్ని నిధుల కేటాయిస్తామని ప్రభుత్వం చెబుతున్నా అగ్నిపథ్ లాంటి పథకాల పుణ్యమా అని ఈ ఆధునికీకరణ మరో పదేళ్లకు కానీ పూర్తికాని పరిస్థితి ఏర్పడింది. వన్ ర్యాంక్– వన్ పెన్షన్ బకాయిలు 2002–23లో మిలటరీ ఆధునికీకరణకు కేటాయించిన నిధుల కంటే ఎక్కువ కావడం, మిలటరీ సిబ్బంది సంఖ్యను మదింపు చేయడం ద్వారా ఈ లోటును అధిగమిస్తామని బీజేపీ చెప్పడం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఈ చర్యల కారణంగా మన యుద్ధ సన్నద్ధత, సామర్థ్యం తగ్గిపోయాయి. 2022లో కేవలం ఒక్క ఆర్మీలోనే 1.18 లక్షల ఖాళీలు ఉన్నాయంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆత్మ నిర్భరత’ కార్యక్రమం కూడా స్వావలంబనపై ఎక్కువ దృష్టి పెట్టింది కానీ... అత్యాధునిక ఆయుధాలనూ, వ్యవస్థలనూ ఏర్పాటు చేసుకోవడంపై కాదు. ఈ విషయాన్ని దేశ తొలి సీడీఎస్, దివంగత జనరల్ బిపిన్ రావత్ గతంలోనే కచ్చితంగా అంచనా కట్టారు. తగినన్ని, నాణ్యమైన ఆయుధ వ్యవస్థలు లేకపోయేందుకు ప్రస్తుతం అవలబిస్తున్న ‘ఎల్1’ టెండర్ వ్యవస్థ కారణం. మిత్ర దేశాలకు లైన్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వడంతో రక్షణ రంగ ఎగుమతులు పెరిగాయి. ఈ దేశాలన్నీ ప్రాణాంతకమైనవి కాకుండా ఇతర పరికరాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. త్రివిధ దళాల అధిపతులు, జాతీయ భద్రతా సలహాదారులు కలిసి ఉన్న డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ జాతీయ భద్రత వ్యూహం ఒకదాన్ని ఇంకా రూపొందించాల్సి ఉంది. ముసాయిదా ఒకదాన్ని ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ 2021లోనే భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు ఇచ్చిన విషయం ప్రస్తావనార్హం. అప్పటి నుంచి ఇప్పటివరకూ దాన్ని అప్డేట్ చేస్తూనే ఉన్నారు.ఆర్మీ దళాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద, ముఖ్యమైన సమస్య వనరుల కొరత. దీంతోపాటే కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించక పోవటం కూడా. జాతీయ భద్రత విషయంలో 1980 మధ్య కాలం మిలటరీకి స్వర్ణయుగం అని చెప్పాలి. త్రివిధ దళాలు 15 ఏళ్ల రక్షణ ప్రణాళికను 1988లో పార్లమెంటులో ప్రస్తావించడం గమనార్హం. పదేళ్లలో బీజేపీ ఐదుగురు రక్షణ మంత్రులను నియమించింది. వీరిలో ఒకరు ఆర్థిక శాఖ మంత్రిగానూ పనిచేశారు. రెండుసార్లు రక్షణ మంత్రిత్వ శాఖను అదనపు బాధ్యతగా చేపట్టారు కూడా! మాజీ విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఎస్.జయశంకర్ను ఆ శాఖ మంత్రిగానూ నియమించింది ఈ ప్రభుత్వం. జయశంకర్ అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రభను వెలిగించారనడంలో సందేహం లేదు. అయితే దేశ రక్షణ రంగం కూడా ఇలాంటి ప్రొఫెషనల్ ఏర్పాటును కోరుకుంటోంది. రక్షణ మంత్రి లేదా ఆ శాఖ సహాయ మంత్రికైనా మిలటరీ విషయాలపై ఎంతో కొంత పట్టు ఉండాలి. దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడం సులువు అవుతుంది. పథకాల అమలు వేగవంతమవుతుంది. ఆత్మ నిర్భరత సాధ్యమవుతుంది.– వ్యాసకర్త మిలటరీ వ్యవహారాల వ్యాఖ్యాత- మేజర్ జనరల్ అశోక్ కె. మెహతా (రిటైర్డ్) -
వెచ్చని హృదయ రాగ సందేశం
ఇది నిన్ననే జరిగినట్లుగా నా జ్ఞాపకంలో స్పష్టంగా ఉంది. నిజానికైతే, నేను తొలిసారి ఫాదర్ టెర్రీ గిల్ఫెడర్ను కలిసింది నలభై ఏళ్ల కిందట! అది 1982 వేసవి చివరిలో... నిషా, నేను మా పెళ్లికి సిద్ధం అవుతున్న సమయం. ఒక క్యాథలిక్గా నిషా తను కోరుకున్న సంప్రదాయబద్ధమైన చర్చి వివాహానికి నేను నా అంగీకారాన్ని తెలిపినప్పుడు, స్థానిక పారిష్ చర్చి ప్రీస్ట్ను కలసి ఆయన చేత మూడు ఉపదేశాలు ఇప్పించుకోవలసి అవసరం ఏర్పడటం నన్ను చీకాకు పెట్టింది. కానీ వేరే దారి లేదు. వెదికితే, అతి దగ్గరగా నార్తంబర్లాండ్ అవెన్యూలో ఉన్న పునీత మేరీ మగ్దలీనా చర్చి ఒక్కటే నిషాకు ఒక క్రైస్తవేతరునితో వివాహం జరిపించేందుకు అంగీకరించింది, నిబంధనలకు లోబడి ఉండే షరతు మీద! సెప్టెంబరులో ఒక శనివారం, సాయంత్రం 6 గంటలప్పుడు నిషా, నేనూ ఫాదర్ టెర్రీ ఇంటి తలుపు తట్టాం. ఆయన తన డెస్క్ ముందు కూర్చొని ఉన్నారు. ఆయన కళ్లజోడు ముక్కు చివరికి దిగి ఉంది. ఆ చిన్న గదికి ఎదురుగా ఉన్న ఒక పాత, వెలసిపోయిన లెదర్ సోఫా మీద మేము కూర్చున్నాం. బయట ఎప్పుడూ లేనంత వేడిగా ఉంటే, లోపల వాతావరణం మంచులో ఉన్నట్లుగా ఉంది. నేను ఊరకే ఉండలేకపోతున్నాను. ‘‘షెర్రీ తీసుకుంటారా?’’ అని ఆయన అనటం నన్ను అమితంగా ఆశ్చర్యపరిచింది. ‘‘మీ ఇద్దరి గురించీ నాకు తెలియదు. కానీ నేను షెర్రీ పట్ల కొంత మొగ్గుగానే ఉన్నాను’’ అన్నారు.అది టియో పెపె. నాకు ఇష్టమైనది. షెర్రీ బ్రాండ్. కానీ ఆ రోజుల్లో లండన్లో అది చాలా అరుదుగా మాత్రమే దొరికేది. ఫాదర్ టెర్రీ వివేచనతో కూడిన అభిరుచి గల వ్యక్తి. నేను ఆయనతో యూఎస్ ఓపెన్ టెన్నిస్, నాటింగ్ హిల్ కార్నివాల్, రష్దీ ‘మిడ్నైట్ చిల్డ్రన్’ వంటివాటిపై చర్చిస్తూ ఉన్నాను– మేము చేసుకోబోయే వివాహం, మాకు పుట్టబోయే పిల్లలు ఏ మతాన్ని అనుసరించవలసి ఉంటుంది– అనేవి తప్ప... అన్నీ. ఫాదర్ టెర్రీ మా గ్లాసులను నింపుతూ సంభాషణను నడిపిస్తున్నారు. ఆయన నా వాదనను గ్రోలుతూనే, తన వాదనను సౌఖ్యంగా నిలిపి ఉంచుకుంటున్నారు. కాలం ఉల్లాసవంతమైన వేగంతో గడిచిపోయింది. వచ్చేవారం కలుద్దాం అనుకున్నాక, బయల్దేరేందుకు మేము లేచి నిలబడ్డాం. ఫాదర్ టెర్రీ మమ్మల్ని ఆపినప్పుడు మేము తలుపు దగ్గర ఉన్నాం. ‘‘మీరు ఆలోచించాలని నేను కోరుకుంటున్న విషయమై ఒక ప్రశ్న నా దగ్గర ఉంది’’ అన్నారు. ఆ ప్రశ్నకు సూచనగా చిరునవ్వొకటి విశాలమైన ఆయన గుండ్రటి ముఖం మీద నాట్యమాడింది. ఆయన కళ్లు సూటిగా మావైపే చూస్తున్నాయి. ‘‘మీరిద్దరూ కలిసి ఎందుకు సహజీవనం చేయకూడదు?’’ అన్నారు ఫాదర్ టెర్రీ. మా ముఖాల్లోంచి రక్తం చివ్వున చిమ్మిందేమో నేను కచ్చితంగా చెప్పలేను కానీ, మేమిద్దరం మాత్రం నోట మాట రాక అలా ఉండిపోయాం. నిజం ఏమిటంటే నిషా, నేను అప్పటికే సహజీవనంలో ఉంటూ ఆ వాస్తవాన్ని దాచటానికి ఉద్దేశపూర్వకంగానే ఫాదర్ టెర్రీకి వేర్వేరు చిరునామాలను ఇచ్చాం. అది ఆయన ఊహించారు. అందుకే తన పద్ధతిలో అదేం పెద్ద విషయం కాదన్నట్లు చెప్పారు. నిషా పూర్తి క్రైస్తవ సంప్రదాయంలో వివాహాన్ని కోరుకుంది. వరుడు క్రైస్తవుడు కాదు అనే విషయాన్ని పట్టించుకోకుండా ఫాదర్ టెర్రీ అందుకు సమ్మతించారు. ఆయన ఉపదేశ వాక్యం అందరి దృష్టిని ఆకర్షించింది. నరకం, అపరాధం, దైవం, çసచ్ఛీలత... వీటి గురించి ఆయన ఉపదేశించలేదు. ‘‘ఐ లవ్ యు’’ అనే మూడు చిన్న పదాల గురించి మాట్లాడారు. ‘‘కరణ్, నిషా...’’, ‘‘గుర్తుంచుకోండి. ‘ఐ’ నీ, ‘యు’నీ ‘లవ్’ జత కలుపుతుంది. కానీ అది వేరు కూడా చేస్తుంది. మీరిద్దరూ వేర్వేరు వ్యక్తులని మీరు మరచిపోయిన రోజున మీ బంధం విడిపోతుంది’’ అన్నారు ఫాదర్ టెర్రీ. అదొక వెచ్చని, తేలికపాటి, హృదయపూర్వక సందేశం. లాంఛనప్రాయమైన తంతు కంటే కూడా నిప్పు చుట్టూ కూర్చొని మాట్లాడుకోవటం వంటిది. కానీ అది పావు శతాబ్దం పాటు నా మదిలో వెలుగుతూనే ఉండిపోయింది. ఆరేళ్ల తర్వాత, ఆసుపత్రిలో నిషా చివరి ఘడియల్లో ఉన్నప్పుడు లైఫ్ సపోర్టును తొలగించటానికి కొన్ని నిమిషాల ముందు ఫాదర్ టెర్రీ ఆమె పక్కనే ఉన్నారు. ఆమెకు చివరి మతకర్మను నిర్వహించారు. అమ్మను కూడా హైందవ సంప్రదాయం ప్రకారం నిషా చెవిలో ప్రార్థనలు వినిపించమని ప్రోత్సహించారు. ఆ తర్వాత యంత్రాలు మెల్లగా, బాధగా మినుకు మినుకుమని కొడిగడుతున్నప్పుడు నిషా అంతిమ శ్వాసలో ఫాదర్ టెర్రీ నా పక్కన నిలబడ్డారు. నాకు తెలిసిన ఏకైక క్రైస్తవ మత గురువు టెర్రీ గిల్ఫెడర్. ఆయన ఒక వింత మనిషి అయినప్పటికీ ఒక గొప్ప వ్యక్తి. ఒరిస్సా, కర్ణాటకలలో క్రైస్తవులపై జరిగిన దాడి గురించి చదివిన ప్రతిసారీ నేను ఆయన గురించి ఆలోచిస్తాను. గాయపడిన హృదయాలను నయం చేసే పదాలను ఆయన కనుగొని ఉంటారని నేను నమ్ముతాను. అందుకు నిస్సందేహంగా ఆయనకు షెర్రీ సహాయపడి ఉంటుంది. కరణ్ థాపర్ – వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఆశల వసంతం... నిస్పృహల శిశిరం
అవినీతిపై యుద్ధం అని చెప్పి గెలిచిన ఎన్డీఏ కూటమి అవినీతిని అరికట్టలేకపోయింది. దానికి బదులు ఈ కూటమి పాలనా కాలంలో కొద్దిమందిగా ఉన్న కోటీశ్వరుల సంఖ పెరిగింది. ఇప్పుడు వారంతా మహా కోటీశ్వరులుగా మారారు. ఏడీఆర్ తాజా నివేదిక ప్రకారం... ఇక దేశంలో ‘ఆరుగాలమూ’ పాలనలో తిష్ఠవేసేది అవినీతిపరుల, కోటీశ్వరుల, మహాకోటీశ్వరుల పాలనేనని రుజువైంది. రాజ్యాంగాన్ని మార్చడం అనే విషయమూ ఎన్నికల కాలంలో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో తాము రాజ్యాంగాన్ని మార్చబోమని అధికార పార్టీవారు స్పష్టం చేయవలసివచ్చింది.‘‘తయారయ్యే ప్రతీ తుపాకీ, రంగంలో ఉన్న ప్రతీ యుద్ధనౌక, మనం ఉపయోగించే ప్రతీ రాకెట్టూ – ఆకలిదప్పులతో మలమల మాడుతున్న, మనం మాడ్చుతున్న పేదసాదల కష్టార్జితం నుంచి దోచుకున్నదే’’– అమెరికా మాజీ అధ్యక్షుడు ఐజెన్హోవర్ విస్పష్ట ప్రకటన‘‘నేటి భారతదేశంలోని లెజిస్లేటర్లలో 360 మంది నేర చరిత్రులేనని, 476 మంది కోటీశ్వరులని, ఒక అభ్యర్థి రూ. 5 వేల కోట్లతో అగ్రస్థానంలో ఉన్నారనీ, లోక్సభ నాలుగో విడత అభ్యర్థులపై తాజాగా ‘ఏడీఆర్’ (అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్) సాధికార నివేదిక వెల్లడించింది. మొత్తం 1,717 మంది పోటీ పడే అభ్యర్థుల్లో 1,710 మంది వాఙ్మూలాలను విశ్లేషించి ఈ నివేదికను విడుదల చేసింది.’’ఏడీఆర్ తాజా నివేదిక ప్రకారం... ఇక దేశంలో ‘ఆరుగాలమూ’ పాలనలో తిçష్ఠవేసేది అవినీతిపరుల, కోటీశ్వరుల, మహాకోటీశ్వరుల పాలనేనని రుజువైంది. కానీ మళ్లీ అదే ఎన్డీఏ ముఠా నినాదం – ‘వచ్చే అయిదేళ్ళు అవినీతిపై యుద్ధమే’నని! ఇప్పటిదాకా ఎన్డీఏ కూటమి ‘అవినీతిపై యుద్ధంలో’ సాధించిన విజయాలేమిటో మోదీ చెప్పగలరా? దేశ సమైక్యత అంటూనే దేశంలో విభజనకు ఎన్డీఏ అవకాశం కలిగేలా వ్యవహరిస్తోంది. ఉత్తర–దక్షిణ భారతాల మధ్య విభజన రేఖకు ప్రస్తుత కేంద్రం వ్యవహారశైలి దారి తీస్తుందనేది కొందరి వాదన.వేలాది గుజరాత్ దళిత పేదసాదలపై దారుణ హత్యాకాండకు కారకులైన నాటి బీజేపీ నాయకులు ఆ ఉన్మాద చరిత్రను దాచడానికి ప్రయత్నిస్తూ సుప్రీంకోర్టు విచారణను సహితం పక్కదారులు పట్టించారు. అయినా బీజేపీ–ఆరెస్సెస్ కూటమిగా ఉన్న ఎన్డీఏ ‘రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్టు’ పచ్చి అబద్ధమాడుతూ ఇప్పుడు తాజాగా సరికొత్త ఎదురుదాడికి సాహసిస్తోంది. పైగా, ‘భారత రాజ్యాంగాన్ని దాన్ని రూపొందించిన డాక్టర్ అంబేడ్కర్ కూడా మార్చలేరని’ తాజాగా ప్రధాని మోదీ బాహాటంగా ‘కోతల’కు దిగడం అత్యంత హాస్యాస్పదం! నిజానికి మనకు మోదీ హయాంలో రాజ్యాంగం అమలులో ఉందానిపిస్తోంది. ఉంటే, విదేశీ ‘పెగసస్’ సాఫ్ట్వేర్ ద్వారా దేశ యువకులను వేధించడానికి భారత పాలకులు సాహసించేవారు కాదు! రాజ్యాంగ నిర్మాతగా అంబేడ్కర్ తను రూపొందించిన రాజ్యాంగాన్ని ఏదో తానే మార్చేయబోతున్నట్టు మోదీ ఊహించుకుని అంబేడ్కర్ సహితం దాన్ని మార్చలేరని ‘ట్విస్టు’ ఇచ్చారు! పైగా ‘నేనింతవరకు ఈ స్థాయికి ఎదగడానికి సాయపడిన రాజ్యాంగానికి రుణపడి ఉన్నానని’ మరో ట్విస్టు ఇచ్చారు! బీజేపీ నాయకుల్లో కొందరు 400 లోక్సభా స్థానాలు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తామనే ప్రకటనలు ఇవ్వడం, దానిపై దేశవ్యాప్తంగా నిరసన గళాలు లేవడం తెలిసిందే. అందుకే మోదీ రాజ్యాంగాన్ని ఎవ్వరూ మార్చలేరని ప్రకటించాల్సి వచ్చింది.మనకో గొప్ప సామెత ఉంది – కంపు నోటి వాడు సంపాదిస్తే, కమ్మని నోటి వాడు ఎగేసుకుపోయాడని! తన సమకాలీన సమాజంలోని అంతరాల దొంతర్లను, అకృత్యాలను, అన్యాయాలనూ, మౌఢ్యాన్నీ చాటలతో చెరిగి ప్రజల సుఖదుఃఖాలకు అద్దంపట్టిన ఇంగ్లండ్ మహా రచయిత చార్లెస్ డికెన్స్ ‘రెండు మహానగరాలు’ అన్న రచనలో చెప్పిన మాటలు నేటికీ చిరస్మరణీయాలే! అపార దేశ సంపద మధ్యనే దారుణమైన దారిద్య్రం తాండవమాడుతోంది. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని దశాబ్దాలైనా సగటు మనిషి జీవితం దుర్లభం కావడం, కేవలం కొద్దిమందిగా ఉన్న కోటీశ్వరుల సంఖ్య అమాంతం పెరిగి మహా కోటీశ్వరులుగా మారిపోవడం చూస్తున్నాం. అందుకే డికెన్స్ మహాశయుడు తన కాలం నాటి ఇంగ్లండ్ పరిస్థితులను వర్ణించిన మహా వాక్యాలను తిలకించండి:‘‘అవి ఎంతో మంచి రోజులు. అలాగే అవి పరమ చెడ్డ రోజులు కూడా. అది జ్ఞానంతో కూడిన వివేచనా యుగం, అయినా అది మూర్ఖపు యుగం కూడా. అది విశ్వసించదగిన శకం, కానీ అది నమ్మలేని యుగం కూడా. అది అంధకారాన్ని చీల్చగలిగిన క్రాంతికి అరుదైన సమయం కూడా. అయినా అది అంధకారానికి ప్రతీక కూడా. అది ఆశల వసంతకాలం, కానీ అది నిరాశా నిస్పృహల శిశిరం కూడా. అన్నీ మా కళ్లముందే పరుచుకుని ఉన్నాయి, అయినా మా కళ్లముందు ఉండవు!’’విచిత్రమైన విషయం ఏమంటే– రాజ్యాంగాన్ని ఏదో అంబేడ్కర్ మార్చదలచినట్టు ‘భావించి’ ఒకవేళ ‘మార్చుదామనుకున్నా మార్చలేడ’ని, అలాగే ఎన్డీఏ–ఆరెస్సెస్ కూటమి మార్చుదామనుకున్నా మార్చలేదనీ ప్రకటించిన ఎన్డీఏ నాయకుడు ‘నేనీ స్థితికి (ప్రధాని పదవికి) వచ్చానంటే నన్నీ ఉన్నత స్థితికి తీసుకొచ్చింది రాజ్యాంగమే’నని ప్రకటించుకోవడం వింతలలో వింతగా ఉంది. కానీ భారత రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్లెవరూ ఫాసిస్టుల చేతుల్లో దాన్ని పెట్టి, భ్రష్టు పట్టించరు గాక పట్టించరు. మహాకవి జాషువా ఇవాళ కాదు, దశాబ్దాల క్రితమే ‘హైందవ నాగరాజు’ నీడల్ని పసికట్టి భారంగా ఒక సత్యాన్ని చాటాడు. ‘స్వాతంత్య్రంబును సర్వసౌఖ్యమున మా భాగంబు మాకిత్తురో, ఖాతాలేదని త్రోసిపుచ్చెదరో! వక్కాణింపవే చెల్లెలా!’ఈ ప్రశ్నలో అప్పటికీ ఇప్పటికీ పెద్ద మార్పు లేదు, ఎంతసేపటికీ దళితుల ఖాతాలు మార్చడం తప్ప, ఉమ్మడి సొత్తులో వారి ఖాతాలు ఈ రోజుకీ మెరుగుపర్చింది లేదు. ఎందుకంటే జాతి వివక్షా విధానంలో, కులం కుళ్లు అంతర్భాగమనీ, ఇండియాలో వర్గమూ, వర్ణమూ అవినాభావ సంబంధం కలిగి, కుల సమస్యగా, వర్ణ వివక్షా సమస్యగా మనిషి ఉనికినీ, ఉసురునూ, ఉపాధినీ దెబ్బతీసే వికృత సమస్యగా ఉంది. ఇదే విషయాన్ని 50 స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవోలు) 300 మంది కార్యకర్తలతో కలిసి ఒక ఫోరమ్గా ఏర్పడి ‘దర్బన్’ సభకు 18 పేజీల డాక్యుమెంట్ను సమర్పించారు. ఇది ఫోరమ్ స్థాయిలో సర్వాంగీకారం పొందిన పత్రం. ఈ దర్బన్ సభలో ‘పరివార్’ ప్రభుత్వ ప్రతినిధి పాల్గొని ‘కుల సమస్య’ దర్బన్ సభ ఎజెండాలోకి రాకుండా, వర్ణ వివక్షను పెంచి పోషిస్తున్న అమెరికా, తదితర పాశ్చాత్య రాజ్యాల అండతో సమస్యను దాటవేశారు. అలా బీజేపీ ఈ దాటవేతలో ‘జయప్రద’మయింది! చివరికి ఇప్పుడు మన దేశంలో ‘బీజేపీ పరివార్’ ప్రభుత్వం ఏ స్థాయికి ఎదిగిపోయింది? దేశ బడ్జెట్లు, బిల్లులు శాసన వేదికలో సరైన చర్చ లేకుండానే మూజువాణీ ఓటుతో ఆమోదించి ముద్ర వేసుకోవడమే! నేర చరిత్ర గల అభ్యర్థులను డబ్బు కోసం కక్కుర్తిపడి పాలక పక్షం సహా దాదాపు అన్ని పక్షాలూ (కొన్నే మినహాయింపులు) ఆశ్రయించి, ఆమోదించడం! ఇదీ మన శాసన వేదికల, అభ్యర్థుల చరిత్ర, భాగోతం!వివేకానందుడు, హరిదాస్ విహారిదాస్ దేశాయ్కి చికాగో నుంచి లేఖ రాస్తూ ఇలా అన్నారు: ‘అణగారిపోతున్న అసంఖ్యాక నిరుపేద కష్టజీవుల రక్త మాంసాలపై ఆధారపడి విద్యావంతుడై, కులాసా జీవితం గడిపే ప్రతి ఒక్కరినీ దేశ ద్రోహిగా పరిగణించాలి. మన సంస్కర్తలు అసలు ‘జబ్బు’ ఎక్కడుందో చూడరు. విగ్రహాల వల్ల లాభం లేదు. హిందువనీ, ముసల్మాన్ అనీ, క్రిస్టియన్ అనే పేర్ల చాటున ఆ మతాల పదఘట్టన కింద కకావికలమవుతున్న ప్రజా బాహుళ్యం... ధన సంచులున్న వాడి పాదాల కింద శాశ్వతంగా పడి నలిగి పోవడానికే తాము పుట్టామన్న భావనకు గురి కారాదు. విగ్రహాలు ఉంటాయో, ఊడతాయో, కులాలు మంచివా, చెడ్డవా ప్రశ్నలు మనకు అనవసరం. పేదల మనస్సుల్లో భావవ్యాప్తి జరిగిన మరుక్షణం, మిగతా కార్యాచరణను వారే పూర్తి చేస్తారు!’ఏబీకే ప్రసాద్సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
నూటికి తొంభై మార్కులు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా నమస్కారం! నా పేరు డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ. నేను పుట్టి పెరిగింది హిందూపురంలో. గత ఇరవై ఏళ్ళుగా అమెరికాలో, గత పదేళ్ళుగా టెక్సాస్లోని డాలస్ నగరంలో ఉంటున్నాం. వృత్తి రీత్యా అమెరికా ప్రభుత్వ వైద్యునిగా పని చేస్తున్నాను. నేను పుట్టి బుద్ధెరిగాక పట్టుకున్న మొదటి జెండా అన్నగారి ‘తెలుగుదేశం’ జెండానే! మా నాన్న హిందూపురంలో తెలుగుదేశం పార్టీ కోసం షామియానా వేసి, మైకుసెట్టు పెట్టి చేసిన ప్రచారం ఇంకా గుర్తుంది. అలాగే నేటికీ నలభై ఏళ్ళుగా గుండెల నిండా నింపుకున్న అభిమానంతో మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానిని కూడా! గత జనవరిలో నేను అనంతపురం వచ్చాను. అంతకు ముందు నేను పనిచేసిన పాతూరు ప్రభుత్వాసుపత్రిని సి.డి. ఆసుపత్రి అనేవారు. నేను పనిచేసినప్పుడు కానీ,గత రెండేళ్ళ వరకూ కానీ అది ఒక పాడుపడిన వందేళ్ళ నాటి పెంకుటిల్లులాంటి భవనంలో ఉండేది. రెండేళ్ళ క్రితం కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో రూపొందించిన ఒక నూతన భవనంలో నడుస్తోంది. ఐదారు మంది డాక్టర్లు, పాతికమంది వరకూ ఇతర ఉద్యోగులతో మంచి వైద్యకేంద్రంగా రూపొందింది. ఆ ఆసుపత్రిని ఇలా చూడడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. మరో ముఖ్యమైన అంశం ప్రభుత్వ విద్య. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని వచ్చినవాళ్ళం... ఏదో కొంత మంది మాత్రమే ఉన్న కొద్ది వనరులను ఉపయోగించుకొని జీవితంలో ఓ స్థాయికి చేరాము. అలా సార్వజనీనమైన అవకాశాలను అందిపుచ్చుకొని అందరూ అదే రకమైన విజయాన్ని అందుకోలేక పోయారు. అలాంటిది, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు జరుగుతున్న విద్యాబోధన, తెలుగుతో పాటు ఆంగ్లమాధ్యమంలో చదివించడం, చిన్న తనం నుంచే డిజిటల్ మీడియాతో వాళ్ళకు విద్యను బోధించడం చాలాచోట్ల చూసి ఆశ్చర్యపోయాను. అలాగే నీటైన యూనిఫాం, బ్యాగులు, పుస్తకాలు, కాళ్లకు షూస్తో సహా వాళ్లకు అందించి పిల్లలలో ఆ వయస్సు నుంచే ఒక ఆత్మ విశ్వాసాన్ని, స్థైర్యాన్ని పెంచి వారి వ్యక్తిత్వానికి మంచి పునాదులు పడేలా చేసింది. అభివృద్ధి అనేదానికి – పెద్ద నగరాల్లో ఓ పెద్ద ఐకియా స్టోర్, ఎంజాయ్ చేయడానికి పబ్బులు, పెద్ద పెద్ద బిల్డింగులు, విశాలమైన రోడ్లు – ఇవి మాత్రమే సూచికలు కాకూడదు. అభివృద్ధికి ఒక సూచిక ఏమిటంటే దారిద్య్ర రేఖ దిగువన ఉన్న ప్రజలు ఎంతవరకూ బాగుపడ్డారు? అది గత ఐదేళ్ళలో చూసుకుంటే సగటు ఆటోరిక్షా నడిపే కార్మికుడు, అరటికాయలు అమ్మి పొట్టపోసుకునే కార్మికురాలు, రోడ్డుసైడు మెకానిక్కు, ఒక సన్నకారు రైతు – వీళ్ళకు కనీస భరోసా లభిస్తోంది. ‘మా పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోంది, మాకు రోగమొస్తే ప్రభుత్వ ప్రాథమిక వైద్యకేంద్రాల్లో కనీస వైద్యం అందుతుంది, నాకు క్యాన్సర్ వచ్చినా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం దొరుకుతుంది’ అన్న భరోసా గత ఐదేళ్ళలో దొరికింది. మొన్ననే ధర్మవరంలో జిలేబీలు అమ్ముకునే కార్మికురాలి కూతురుకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడింది. దీనిపై నేనొక చిన్న ట్వీట్ పెడితే, సీఎంవోలో డా.హరికృష్ణారెడ్డి గారు స్పందించి రూ.20 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించే ఏర్పాటు చేశారు. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు నాకు తెలిసే ఉన్నాయి.2019 మేలో జగన్మోహన్రెడ్డి ఎన్నికలలో ఘన విజయం సాధించినప్పుడు నేను సామాజిక మాధ్యమాల్లో ‘మీ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యాలుగా ‘‘విద్య’ – ‘వైద్యా’లను ఎన్నుకొని, వాటి రూపురేఖల్ని సమూలంగా మారుస్తూ ప్రజలకు అందుబాటులోనికి తేవాలని’ కోరాను. ఈనాడు ప్రభుత్వం ఆ ముఖ్యమైన రెండు విషయాల్లోనూ చాలా సమర్థంగా పనిచేసిందని ప్రత్యక్షంగా గమనించాను. ‘పల్లెటూళ్ళే పట్టుగొమ్మలని’ మహాత్మాగాంధీ గారన్నారు. పల్లెల్లో అత్యంత దారుణమైన స్థితిలో ఉన్న దరిద్రనారాయణుడికి చేసే సేవే నిజమైన సేవ అని ఆయన భావించారు. అలా ప్రస్తుత ప్రభుత్వంలో సామాన్యుడికి కనీస అవసరాలైనా తీరుతున్నాయని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పేదేమిటంటే – నేనేదైతే ప్రభుత్వ ప్రాధమ్యాలుగా ఉండాలని, ప్రజలకు మెరుగ్గా సేవ చేయాలని భావించానో అవి నెరవేరాయి. నాకు తెలిసిన కొద్దిమందికి కూడా ఎంతో కొంత మేలు జరిగింది కాబట్టే ఇలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఏతావతా, చెప్పొచ్చేదేమిటంటే – అటూ ఇటూ జరిగిన కొన్ని సంఘటనలు ఉన్నా, విద్య–వైద్య పరంగా స్థూలంగా నేను ఈ ప్రభుత్వానికి వందకు 80–90 మార్కులు వేయ గలుగుతాను.ధన్యవాదాలు, జైహింద్.డా‘‘ ఇస్మాయిల్ పెనుకొండ వ్యాసకర్త అమెరికాలో వైద్యుడు -
పేదల ఊసు పెద్దలకు పట్టదా?
భారతదేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. పౌష్టికాహార లోపంతో పిల్లలు, స్త్రీలు, బాలింతలు బాధపడుతున్నారు. కోట్లాది కార్మికులకు పనిలేదు. ఉద్యోగాలు లేక యువతకు పెళ్లిళ్ళు కూడా జరగడం లేదు. ఇదొక సామాజిక సమస్యగా రూపుదిద్దుకుంటోంది. బీజేపీ ఇచ్చిన ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ అడ్రస్ గల్లంతైంది. మతం మనిషికి తిండి పెట్టదు అని ప్రజలు తెలుసుకుంటున్నారు. అలాంటి పార్టీతో చంద్రబాబు అంటకాగు తున్నారు. దేశంలో తమ పేరు మీద సాగుభూమి లేనివారు ఎందరో! ఊరు పేరేగాని ఊరిలో సెంటు భూమి లేదు. ‘ఇండియా’ కూటమి కూడా తన ప్రణా ళికలో భూమి పంపకాన్ని గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భూమి పంపకాన్ని నిరాకరించటం అంటే సామ్యవాదాన్ని నిరాకరించటమే!18వ సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఏడు విడతలుగా జరుగుతున్నాయి. తిరిగి మళ్లీ మూడోసారి అధికారంలోనికి రావడానికి మోదీ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఉత్తరప్రదేశ్ మీద అయితే వాళ్లు ఎక్కువ ఆధారపడి ఉన్నారో అక్కడ సామాజిక రాజకీయ చైతన్యం పెల్లుబికింది. ముఖ్యంగా ముస్లింలలో ఎంతో మార్పు రావడం వల్లే రాయబరేలీలో రాహుల్ గాంధీ నిలబడటానికి పూనుకున్నారు. మతోన్మాద దాడులు, మహిళా సాధికారతను పునాదులతో తొలిచే భావజాలం, కార్పొరేట్ శక్తులకు దేశాన్ని తాకట్టు పెడుతున్న బీజేపీ విధానాలు లౌకికవాదులను, ఓబీసీలను, దళితులను, స్త్రీలను ఆలో చింపజేస్తున్నాయని చెప్పక తప్పదు. ముఖ్యంగా 370 ఆర్టికల్ రద్దు ద్వారా జమ్మూ కశ్మీర్ శాసనసభను రద్దుచేసి, ఆ రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విడగొట్టిన ఉదంతాన్ని ప్రజాస్వామిక వాదులు అర్థం చేసుకుంటున్నారు. రాష్ట్రాల ఆదాయాన్ని తగ్గించి, జీఎస్టీ ద్వారా కేంద్రీకృత ఆర్థిక పెత్తనాన్ని పెంచి, రాష్ట్రాల ఉనికిని నామమాత్రం చేయా లని చేస్తున్న ప్రయత్నాలను కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రాలకు ప్రత్యేక హక్కులు కలిగిన భాష, సంస్కృతి, విద్య, విద్యుత్, మానవ వనరులపై కూడా కేంద్ర ప్రభుత్వమే పెత్తనం చేయాలనే చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాలు చైతన్యవంతంగా ఆలోచిస్తు న్నాయి. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన పత్రికల మీద చేస్తున్న దాడి బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా జరగలేదని జర్నలిస్టు మేధావులు వాపోతున్నారు.ఏప్రిల్ చివరి వారంలో వచ్చిన ‘గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్’ ప్రకారం, భారతదేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. పౌష్టికాహార లోపంతో పిల్లలు, స్త్రీలు, బాలింతలు బాధపడుతు న్నారు. అత్యధిక స్త్రీలు రక్తలేమితో ఇబ్బంది పడుతున్నారు. కోట్లాది మంది కార్మికులకు పనిలేదు. భారతదేశం మొత్తం వలసలతో అన్నా ర్తులై పొట్ట చేత పట్టుకుని నగర శివారుల్లోని మురికివాడలలో జీవిస్తు న్నారు. నిజానికి పంజాబ్ రైతులు చేసిన రైతు ఉద్యమ ప్రభావం భారతదేశం మొత్తం మీద ఉంది. సంయుక్త కిసాన్ మోర్చా హోరా హోరీ రైతు ఉద్యమాన్ని నడిపింది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టా లను రద్దు చేయాలనే డిమాండ్పై రాజీలేని పోరాటం చేసింది.ముఖ్యంగా అడవుల నరికివేత వల్ల, నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రోత్సాహం ఇవ్వకపోవడం వల్ల దేశంలో తీవ్రంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మండుటెండల్లో ప్రజలు ఆహారం కోసం పని చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. మతం మనిషికి అన్నం పెట్టదు అని ప్రజలు తెలుసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా భారతదేశంలో 75 సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత కూడా గ్రామాలలో మంచి నీళ్ళు దొరకడం లేదు. మద్యాన్ని అందించటంలో సఫలమైన ప్రభు త్వాలు, మంచినీళ్లు అందించడంలో విఫలమయ్యాయి.ఇకపోతే దేశంలో నిరుద్యోగం విలయ తాండవం చేస్తోంది. ఉద్యో గాలు లేక యువతకు పెళ్లిళ్ళు కూడా జరగడం లేదు. ఇదొక సామాజిక సమస్యగా రూపుదిద్దుకుంటోంది. కాగా ఎన్నికల నేపథ్యంలో నిరు ద్యోగం ప్రధాన అంశంగా చర్చకొస్తోంది. ప్రతిపక్ష నేతలు నిరుద్యోగ సమస్యపై నిలదీస్తుండగా అధికార బీజేపీ నేతలు సమస్యను పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్రధాని మోదీ ప్రసంగాలు, బీజేపీ మేనిఫెస్టో యువతకు భరోసా కల్పించలేదు. పైగా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ అడ్రస్ గల్లంతైంది. నిరుద్యోగ రేటు పెరగడం ఆందోళన కలిగించే విషయం. ఇకపోతే ‘ఇండియా’ కూటమి కూడా తన ప్రణాళికలో భూమి పంపకాన్ని గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో కోట్లాది మందికి సాగుభూమి సెంటు కూడా లేదు. ఊరు పేరేగాని ఊరిలో సెంటు భూమి లేదు. ఇంటి స్థలం లేదు. మంచినీళ్ల వసతి లేదు. చనిపోతే పాతిపెట్టడానికి శ్మశానం లేదు. దేశంలోని సుమారు 7 లక్షల గ్రామాల్లో అంటరానితనం కొనసాగు తూనే వుంది. భారతదేశంలో దళితులు ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయం లేక పేదరికంలో, అస్పృశ్యతలో, అవిద్యలో మగ్గిపోతున్నారు. బీటెక్లు, ఎంటెక్లు, బీఏలు, ఎంఏలు చదివినా నిరుద్యోగు లుగా, ఉపాధి హామీ కూలీలుగా జీవిస్తున్నారు. ఈ రోజున దళిత వాడల్లో విద్యార్థులు, స్త్రీలు నిరాశా నిస్పృహలలో జీవిస్తున్నారు. వారి కుటుంబానికి తలా రెండెకరాల భూమి ఇవ్వటం ద్వారా ఆర్థిక సాధికారతను కల్గిస్తాం అని ఏ ప్రభుత్వమూ చెప్పటం లేదు. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు అంబేడ్కర్ ఆలోచనకు భిన్నంగా ఉన్నాయి.భూమి పంపకాన్ని నిరాకరించటం అంటే సామ్యవాదాన్ని నిరాకరించటమే. ఇప్పుడు ఎన్నికల్లో ప్రకటించిన ఏ మేనిఫెస్టోలో కూడా భూమి పంపకం గురించి రాయక పోవటం, అస్పృశ్యతా నివా రణ ఒక ఎన్నికల ఎజెండాగా లేకపోవటం, కుల నిర్మూలన కార్యక్రమం ఎవరి లక్ష్యంగా లేకపోవటాన్ని దళిత మేధావులు, ఆలోచనాపరులు అర్థం చేసుకుంటున్నారు. రాజ్యాధికారమే వీటన్ని టికీ పరిష్కారం అని ఆలోచిస్తున్నారు. నిజానికి ప్రసిద్ధమైన కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో, ఐఐటీల్లో, వైద్య విశ్వవిద్యాలయాల్లో, అన్ని కళా శాలల్లో దళిత విద్యార్థులు ఎంతో వివక్షకు గురి అవుతున్నారు.మోదీ ఇంత తిరోగమన చర్యలతో ముందుకు వెళ్తుంటే, నారా చంద్రబాబు నాయుడు ఎన్డీయే కూటమిలో చేరటం ఆయనకున్న దళిత వ్యతిరేకతనూ, హిందూ మతోన్మాద భావజాలాన్నీ, కులాధి పత్య వైఖరినీ, మైనారిటీల పట్ల ద్వేషాన్నీ తెలియజేస్తున్నాయి. చంద్రబాబు నాయుడుకూ, మోదీకీ మధ్య భావజాలంలో, దళితులు, స్త్రీల పట్ల వ్యతిరేకతలో ఏ విధమైన తేడాలేదు అని అర్థం అవుతోంది. ముఖ్యంగా మోదీ యూనివర్సిటీల్లో జీవపరిణామ, మానవ పరిణామ చారిత్రక సిద్ధాంతాల బోధనకు భిన్నంగా మతవాద భావజాలాన్ని ప్రోత్సహించటం లౌకిక భావజాల వ్యాప్తికి గొడ్డలి పెట్టు అవుతుంది.ఇకపోతే అంబేడ్కర్ భావజాల ప్రచారంలో తమిళనాడు ముందుంది. తమిళనాడులోని అన్ని థియేటర్లలో సినిమా ప్రారంభంలో అంబేడ్కర్ జీవిత పోరాటం గురించి ఐదు నిమిషాల నిడివిగల డాక్యుమెంటరీ ప్రదర్శించాలని అక్కడి ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఆదేశించారు. అంబేడ్కర్ ఆ రాజ్యాంగం ద్వారానే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ముఖ్యమంత్రులు ప్రధానులు, రాష్ట్రపతులు అవుతున్నారని గ్రహించాలి.అంబేడ్కర్ రాజ్యాంగం భారతదేశ పునర్ నిర్మాణానికి ఆయువు పోసింది. ఏ దేశంలో స్త్రీ వ్యక్తిత్వంతో జీవిస్తుందో, ఏ దేశంలోకుటుంబ వ్యవస్థ బలంగా నిలబడుతుందో, ఏ దేశంలో స్త్రీ ఉత్పత్తి శక్తి దేశ సౌభాగ్యానికి ఊపిరి పోస్తుందో ఆ దేశం ఆర్థిక సంపదవున్న ప్రపంచ పంక్తిలో నిలబడగలుగుతుంది. నిజానికి అంబేడ్కర్ అడుగు అడుగులో స్త్రీ సమానత్వం కోసం పోరాడారు. వారి అభ్యున్నతి కోసం, వారి విద్యాభ్యాసం కోసం, వారి సాధికారిత కోసం, వారి భావ చైతన్యం కోసం, వారి రాజకీయ హక్కుల కోసం పోరాడారు. హిందూ కోడ్ బిల్లు విషయంలో మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా రాజీనామా చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి హిందూ కోడ్ బిల్లును సాధించారు. ఈనాడు ప్రభుత్వాలు స్త్రీ సాధికారితను నిలబెట్టాలి అంటే నిరుద్యోగులయిన స్త్రీలకు ఉద్యోగ వసతి కల్పించాలి. విధవరాండ్రకు నెలకు పది వేల రూపాయల పింఛన్ ఇవ్వ గలిగిన స్థాయికి రావాలి. ప్రతి దళిత స్త్రీకి రెండు ఎకరాల భూమి ఇచ్చి భారతదేశంలో వ్యవసాయ విస్తృతికి కృషి చేయాలి. ఇంటింటికీ మంచినీటి వసతి, విద్యుత్ వసతి కల్పించి, ఆరోగ్య సంరక్షణ కోసం పౌష్టికాహారాన్ని అందించి స్త్రీ శారీరక మానసిక శక్తిని పెంచి దేశ సౌభాగ్యానికి బాటలు వేయాలి. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
ఆదర్శనీయం... ఆచరణీయం
‘అనుచిత ఉచితాలకు నేడో రేపో భారీ మూల్యం చెల్లించడం ఖాయం’ అంటారు అమెరికన్ రచయిత విల్లీమన్. ఎన్నికల సమయంలో ఆ యా రాజకీయ పార్టీలు ఉచితాలతో కూడిన హామీలిస్తున్నాయి. అయితే పేదవారి కనీస అవసరాలు తీర్చే సముచిత ఉచితాలు కొంతకాలం అవస రమే. కానీ కేవలం అధికారంలోకి రావడం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే అనుచిత ఉచితాల పట్ల ప్రజలు ఆకర్షితులైతే ఆర్థిక సంక్షోభ సునామీలో కొట్టుకు పోవడం ఖాయం. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సముచిత ఉచితాలతో గరిష్ఠ స్థాయిలో సంక్షేమ పథకాల రూపంలో ఏటా సుమారు రూ. 80 వేల కోట్లు వ్యయం చేసినప్పటికీ... కొందరు కోరుకున్నట్లుగా రాష్ట్రం శ్రీలంక కాలేదు.అధికార దాహార్తితో అల్లాడుతున్న చంద్రబాబు వచ్చే ఎన్ని కల్లో ఎలాగైనా గెలవాలనే కోరికతో అనేక అనుచిత ఉచితాలు ప్రకటించారు. జగన్ ప్రభుత్వ పథకాలను కొనసాగిస్తూ చంద్రబాబు ఇచ్చిన అనుచిత ఉచితాలను అమలు చేయడానికి యేటా మరో రూ.70 వేల కోట్ల ఖర్చవుతుంది. అంటే వీటివల్ల రాష్ట్ర ఖజానాపై సుమారు రూ. లక్షా 50 వేల కోట్ల భారం పడుతుంది. నిజానికి రాష్ట్రానికి పన్ను, పన్నేతర ఆదాయాలు, కేంద్ర గ్రాంట్లు అన్నీ కలిపితే ఏడాదికి వస్తోంది సుమారు రెండు లక్షల కోట్ల రూపాయలు. దీనిలో ఉచితాలకు లక్షా 50 వేల కోట్ల రూపాయలు పోతే మిగిలేది రూ. 50 వేల కోట్లు. ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లకు ఏడాదికి సుమారు రూ.70 వేల కోట్లు అవసరమవుతాయి. ఇవి కాక వ్యవసాయం, ఇరిగేషన్, విద్య, వైద్యం లాంటి 21 శాఖలకు సుమారు లక్షా 30 వేల కోట్లు కేటా యించాలి. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ ఎకౌంట్లో సుమారు 56 వేల కోట్ల రూపాయల ద్రవ్య లోటు చూపించారు. చంద్రబాబు అనుచిత పథకాలను కూడా అమలు చేయాల్సి వస్తే ఈ లోటు లక్షా 26 వేల కోట్లకు పెరుగుతుంది. ఇదే జరిగితే ఈ లోటు రాష్ట్రాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టడం ఖాయం.మేనిఫోస్టోలకు మాతృక 1848లో లండన్లో కార్ల్మార్క్స్– ఫ్రెడెరిక్ ఏంగెల్స్ ప్రచురించిన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. అట్టడుగు శ్రామిక , పేద వర్గాలకు సంపద పంచడం, ఆర్థిక అసమానతలు తగ్గించడం ఈ మేనిఫెస్టోలోని అంశాల్లో ఒకటి. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి జగన్ చేసింది ఇదే. ముందు వారి ఆర్థిక అవస రాలు తీర్చడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయలు అందజేశారు. దీనిలో సుమారు రూ. 2.70 లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా అందజేశారు. మోదీ ప్రభుత్వం గత ఐదేళ్ళుగా ఈ పద్ధతి ద్వారా దేశ వ్యాప్తంగా సుమారు రూ. 22 లక్షల కోట్లు బదిలీ చేయగా దానిలో పదో వంతు పైనే ఏపీలో పంపిణీ జరగడం విశేషం. ఇలా ఇవ్వడం వల్ల ఈ నాలుగు లక్షల కోట్ల రూపాయలు నేరుగా స్థాని కంగా ఖర్చు చేయడంతో వస్తు, సేవలకు గిరాకీ ఏర్పడింది. ఫలితంగా ఉత్పత్తి, ఉపాధి పెరిగింది. ప్రతి లావాదేవీలోనూ కేంద్ర, రాష్ట్రాలకు పన్నుల రూపంలో రాబడి పెరిగింది. ఇదే మొత్తం బడా వ్యాపారులు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల చేతికి వెళితే దానిలో అత్యధికం నల్లధనంగా మారేది. పేదలను ఆర్థికంగా ఆదుకున్న జగన్ తర్వాత వారి సంపదను పెంచారు. సుమారు 31 లక్షల మంది మహిళలకు ఇళ్ళ స్థలాలు, లక్షన్నర గృహాలు ఉచితంగా అందజేశారు. పేదలకు ఇచ్చిన ఒక్కో ఇళ్ళ స్థలం విలువ కనీసం మూడు లక్షలు, ఇంటి విలువ పది లక్షల రూపాయల చొప్పున లెక్కిస్తే వాటి మొత్తం విలువ సుమారు పది లక్షల కోట్ల రూపాయలు. అంటే రాష్ట్ర బడ్జెట్ కన్నా ఇది నాలుగు రెట్లు ఎక్కువ. దేశంలో మరే రాష్ట్రం పేదల కోసం ఇటువంటి ఆలోచన చేయలేదు, ఇంత సంపద సమకూర్చలేదు.రాష్ట్రంలో అభివృద్ధి లేదు, సంక్షేమం లేదంటూ విపక్షాలు, వారి అనుకూల మీడియా విషప్రచారం చేశాయి. 2023–24లో దేశ జాతీయోత్పత్తి వృద్ధి రేటు సుమారు 8 శాతం కాగా రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి వృద్ధి రేటు 16.5 శాతం. దేశంలో ఎక్కువగా వృద్ధి రేటు నమోదు చేసిన రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. 2018–19లో స్థూల జాతీయోత్పత్తి విలువ రూ. 8.73 లక్షల కోట్లు కాగా అది 2023–24 నాటికి రూ. 16 లక్షల కోట్లకు పెరిగింది. తలసరి ఆదాయం రూ. 1,54,031 నుంచి రూ. 2. 60 లక్షలకు పెరిగింది. ఈ ఐదేళ్ళలో 122 భారీ పరిశ్రమలు, 5 లక్షల చిన్న తరహా పరి శ్రమలు వచ్చాయి. క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇండియా లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా గత నాలుగేళ్లుగా సుమారు రూ. 75 లక్షల కోట్ల రూపాయల మౌలిక వసతుల పనులు జరుగుతుంటే వాటిలో ఏపీలోనే సుమారు రూ. 6 లక్షల కోట్ల పనులు జరుగుతున్నాయి. దేశ ఎగుమతుల్లో 10.42 శాతం ఏపీ నౌకాశ్రయాల నుంచే జరుగుతున్నాయి. సామాజిక రంగ వ్యయం, ఫుడ్ ప్రాసెసింగ్, కోక్, పొగాకు, మత్స్య ఉత్పత్తులు, పండ్ల తోటల విస్తీర్ణం, పౌల్ట్రీ , ప్రభుత్వ ఆస్పత్రుల సంఖ్య , సినిమా హాళ్ళు, ఇంజనీరింగ్ టాలెంట్ తదితర రంగాల్లో ఏపీ దేశంలోనే అగ్ర స్థానంలో ఉంది. దేశంలో అతి తక్కువ నిరుద్యోగం (4.2 శాతం) ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటి. కాని రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవంటూ ప్రచారం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలు కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉపాధి లభించింది. దానికి ఉదాహరణ రాష్ట్రంలో పెరిగిన ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలే. కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం 2019లో రాష్ట్రంలో 44,85,974 పీఎఫ్ ఖాతాలుంటే అవి 2024 నాటికి 60,73,000కు పెరిగాయి. రాష్ట్రంలో గత మూడేళ్ళుగా కొత్తగా 18 లక్షల ఆదాయ పన్ను చెల్లింపుదారులు చేరారు. ఇదో జాతీయ రికార్డు.దేశంలో అత్యధిక సంఖ్యలో ఏడు వందలకు పైగా పౌర సేవలందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ ఐదేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం సుమారు 12 కోట్ల పౌర సేవా అర్జీలను పరిష్కరించి జాతీయ రికార్డు నెలకొల్పింది. నిజానికి ఈ ఐదేళ్ళలో అనేక రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే ఆదర్శంగా నిలిచింది. జగన్ ప్రభుత్వం మేనిఫోస్టోను పవిత్ర గ్రంథంగా భావించి త్రికరణ శుద్ధిగా అమలు చేసిందనడంలో సందేహం లేదు. గతంలో పసుపు– కుంకుమ వంటి తాయిలాలను తిరస్కరించిన రాష్ట్ర ఓటర్లు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం– జనసేన కూటమి అనుచిత ఉచితాల వలకు చిక్కే అవకాశం కనిపించడం లేదు.వి.వి.ఆర్. కృష్ణంరాజు వ్యాసకర్త ఎ.పి. ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్మొబైల్: 89859 41411 -
అందరివాడికే అందలం
తన వల్ల మేలు జరిగిందీ అంటేనే ఓటేయండి అని జగన్ అడిగిన తీరు ఎన్నడూ కననిదీ, విననిదీ. బహుశా దేశంలోనే ఏ నాయకుడు కూడా ఇంత ఆత్మవిశ్వాసంతో సూటిగా అడిగి ఉండరు. అన్ని వర్గాల ప్రజలూ వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులే అన్నది ఈ విశ్వాసానికి కారణం. దానికి రుజువే ఎన్నికల ప్రచారంలో ఆయనకు లభిస్తున్న అమితమైన ఆదరణ! ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మరోసారి ఆయన్ని అధికార పీఠం ఎక్కించడానికి ‘సిద్ధం’గా ఉన్నారని దీన్నిబట్టి అర్థమవుతోంది.‘కాణి’ ముత్యాలు ఇంటికే – మళ్లీ పట్టం జగన్కే!ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోమారు విస్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇవ్వనున్నారు. ఇది తెలుసుకోవడానికి ‘సర్వేశ్వరులను’ అడగనవసరం లేదు. గతంలో సర్వేలన్నీ సుప్రసిద్ధ మీడియా సంస్థలు నిర్వహించేవి. ఇప్పుడు ఎవరికి నచ్చిన విధంగా వారు సర్వేలు చేయించుకుంటూ ‘స్వింగ్’ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ప్రకటన వెలువడిన దగ్గర నుంచి ఇటు వైసీపీ, అటు కూటమి ప్రచార సరళి, అభ్యర్థుల ఎంపిక, ప్రజాస్పందన నిశితంగా పరిశీలిస్తే, తీర్పు ఎలా ఉండబోతోందో మనకే అర్థమవుతుంది.జగన్ అన్ని పార్టీల కంటే ముందుగానే విడతల వారీగా అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ, జనసేన అవగాహన కుదుర్చుకున్నా, చివరి వరకూ బీజేపీ జత కడుతుందో లేదో తెలియని సందిగ్ధం. అందుకే చాలాచోట్ల ముందుగానే అభ్యర్థుల్ని ప్రకటించేసుకున్నారు. తీరా బీజేపీ వచ్చి చేరాక, మళ్ళీ అభ్యర్థుల ప్రకటనలో కుస్తీ పట్టాల్సి వచ్చింది. ఆశించిన స్థాయిలో కాక అతి తక్కువ సీట్లు జనసేన తీసుకోవడం, బీజేపీ పూర్వ అధ్యక్షుడు సోము వీర్రాజుతో సహా సిసలైన బీజేపీ వారికి టికెట్లు దక్కకపోవడం వంటివి లుకలుకలకు కారణమయ్యాయి. పేరుకే మూడు పార్టీల జెండాలు. జన శ్రేణులు మాత్రం కలిసి పనిచేసే పరిస్థితి చాలా చోట్ల లేకుండా పోయింది.పోనీ నిలబెట్టిన టీడీపీ అభ్యర్థుల్లో ఆణిముత్యాల లాంటి వారు ఉన్నారా అంటే, అబ్బే! చాలావరకు కాణి ముత్యాలే! ఇంచుమించు చంద్రబాబు మహా దోపిడీలో భాగస్వాములు లేదా ఆ దోపిడీ నుంచి స్ఫూర్తి పొందినవారే. ఇటు బెజవాడ దుర్గమ్మ, అటు విశాఖ కనకమహాలక్ష్మి, ఆ పక్క అనకాపల్లి నూకాలమ్మ సాక్షిగా వీరంతా కాణి ముత్యాలు. ఇలాంటివాళ్లే చంద్రబాబుకు కావాలి. టిప్పర్ డ్రైవర్లు, కమతగాళ్లు అంటే ఆయనకు అసహ్యం. ఈ బాపతు కాణి ముత్యాల్ని జనం ఆదరించరని చరిత్ర చెబుతున్న సత్యం. అందుకే వీళ్ళు ఎక్కువగా ‘బ్యాక్ డోర్ పాలిటిక్స్’ నడుపుతుంటారు.ఇక ప్రచార తీరు పరిశీలిస్తే, తన వల్ల మేలు జరిగిందీ అంటేనే ఓటేయండి అని జగన్ అడిగిన తీరు... బహుశా దేశంలోనే ఏ నాయకుడు ఇంత ఆత్మ విశ్వాసంతో సూటిగా అడిగి ఉండరు. ఆయన ప్రచారాస్త్రాలు కూడా విలక్షణంగా ఉన్నాయని చెప్పాలి. ఎక్కడా నిగ్రహం కోల్పోకుండా విమర్శలకే పరిమితమయ్యారు తప్ప స్థాయి మరచి తిట్లులంకించుకోలేదు, హుందాతనాన్ని కోల్పోలేదు. మరి కూటమి విషయానికొస్తే– వెకిలితనం, బూతు పురాణం, కొట్టండి, చంపండి, నరకండి అని జనాల్ని ప్రేరేపించటం సభ్య సమాజాన్ని విస్తుపరిచాయి. జగన్పై విసిరిన రాయి దాడిని ఖండించాల్సింది పోయి ‘గులక రాయి’ అని వెకిలితనాన్ని ప్రదర్శించటం, వలంటరీ వ్యవస్థను కట్టడి చేయడం, పండు టాకుల, పుండు రెక్కలపై ఆక్రోశం వెలిబుచ్చి వాళ్ళ చావుకి కారణం కావడం, లేని భూయాజమాన్య హక్కు చట్టంపై దుష్ప్రచారానికి పూనుకోవడం వంటివి అన్నీ బూమరాంగ్ ఆయ్యాయి. అయితే జగన్ పని అయిపోయింది, ఇక తామే అధికారంలోకి వస్తున్నామనే ఫేక్ సర్వేలలో మాత్రం ముందున్నారు. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4 కోట్ల 13 లక్షలు. ఇందులో అర్బన్ ఓటర్లు కేవలం 87 లక్షలు. జగన్కు పెట్టని కోటల వంటి గ్రామీణ ఓటర్ల సంఖ్య 3 కోట్ల 20 లక్షలు. అందులో సంక్షేమ పథకాల లబ్ధిదారులే అధికం. ఇక కులాల ప్రాతిపదికగా చూస్తే... ఎస్సీలు 35 లక్షల 46 వేల 748, ఎస్టీలు 25 లక్షల 85 వేల 726, ముస్లింలు 23 లక్షల 84 వేల 449, బీసీ యాదవులు 25 లక్షలు, మత్స్యకారులు 15 లక్షల 74 వేల 868, గౌడలు 19 లక్షల 78 వేల 866,చంద్రబాబు చేత తీవ్ర అవమానాలకు గురైన రజకులు, నాయీ బ్రాహ్మణులు 8 లక్షల 41 వేల 400+ 4 లక్షల 15 వేల 520, బ్రాహ్మణులు 7 లక్షల 4 వేల 165. క్రైస్తవులు 3 లక్షల 15 వేల 320... ఈ సామాజిక వర్గాలలో అత్యధికులు జగన్ వైపే ఉన్నారు. అధిక శాతం ఉన్న మరొక వర్గం, గోదావరి జిల్లాల్లో నిర్ణయాత్మక శక్తి అని చెబుతున్న కాపులు, రాయలసీమలోని బలిజలు, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ ప్రాంతాల్లో ప్రధానంగా, ఇంకా ఇతర ప్రాంతాల్లో ఉన్న తూర్పు కాపులు, ఒంటరులు మొత్తం 52 లక్షల 97 వేల 748 మంది. వీరిలో జనసేన వైపు ఆశగా చూసి భంగపడిన వారు, చంద్రబాబు సామాజిక వర్గంతో దశాబ్దాల వ్యతిరేకత ఉన్నవారు, వైసీపీలోని కాపు నాయకుల వెంట ఉన్నవారు... ఇలా భిన్నాభిప్రాయాలతో అటూ ఇటూ ఉంటారు. ఇక రెడ్డి వర్గంలోని 26 లక్షల 748 మందిలో అధికులు జగన్ వైపు ఉండగా, కమ్మ వర్గంలోని 26 లక్షల 46 వేల 748 మందిలో అత్యధికులు చంద్రబాబు వైపు ఉంటారు. ఇతర బీసీలు, 13 లక్షల పైచిలుకు ఉన్న వైశ్యులు ఆయా ప్రాంతాల పార్టీ అభ్యర్థుల ప్రాతిపదికన రెండు వైపులా చీలతారు. మొత్తంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింలలో అధిక శాతం వైసీపీ వైపే ఉన్నారు. గెలుపును నిర్ణయించే మరో శక్తి, నారీ శక్తి. అలాంటి మహిళలు జగన్ వైపే ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. దీనిని బట్టి, ‘మళ్లీ పట్టం జగన్కే – కాణి ముత్యాలు ఇంటికే!’_వ్యాసకర్త పూర్వ సంపాదకుడు- పి. విజయబాబుముస్లింలు బీజేపీని ఓడించాలి – వైసీపీని గెలిపించాలి!ప్రధాని నరేంద్ర మోదీజీ, బీజేపీల నాయకత్వంలో పదేళ్ళుగా కేంద్రంలో అధికా రంలో వున్న ఎన్డీయే ప్రభుత్వం దేశ సంపదను అస్మదీయ కార్పొరేట్లకు కట్టబెడు తున్నది. ఒకవైపు భారతదేశాన్ని మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుస్తానంటూనే మరోవైపు దేశ ప్రజల్ని పేదరికం లోనికి నెట్టి వేస్తున్నది. దేశ ప్రజలంటే 80 శాతం హిందువులు, 14 శాతం ముస్లింలు, 6 శాతం క్రైస్తవులు, సిక్కులు, తదిత రులు. ఐక్యరాజ్య సమితి ప్రకటించిన హ్యాపీనెస్ రిపోర్టులో భారతదేశం 126వ స్థానంలో వుంది. భారత ప్రజలు సంతోషంగా లేరు. అణిచివేతకు గురవుతున్న ప్రతి ఆరుగురిలో ఒకరు మాత్రమే ముస్లిం, ఐదుగురు హిందువులు. దీని అర్థం ఏమంటే మోదీ పాలనకు ప్రధాన బాధితులు హిందువులు. ఈ వాస్తవాన్ని కప్పి పుచ్చడానికి, హిందూ–ముస్లింల మధ్య తగువుపెట్టి ఎన్నికల్ని ఒక మత యుద్ధంగా మార్చడానికిస్వయంగా మోదీజీ నడుం బిగించారు. 2019 లోక్ సభ ఎన్నికల్ని ఆ పార్టీ 1761 నాటి పానిపట్టుయుద్ధంతో పోల్చేది. ఆ యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలీ దుర్రానీ చేతుల్లో పీష్వా బాలాజీ బాజీరావు ఓడిపోవడంతో హిందువులు 250 ఏళ్లు అధికారాన్ని కోల్పోయారని గుర్తు చేసి, మళ్ళీ అలాంటి దుఃస్థితి వస్తుందని భయపెట్టింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్ని ఔరంగజేబ్, శివాజీ మహారాజ్ల మధ్య పోరాటంగా ప్రచారం చేసింది. గతేడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లో టిప్పూ సుల్తాన్కు ఓటేస్తారా? రాణి అబ్బక్కకు ఓటేస్తారా? అని అడిగింది.వివిధ రాష్ట్రాలు విద్యా, ఉపాధి రంగాల్లో ముస్లింలకు ఇస్తున్న రిజర్వేషన్లను రద్దు చేసి హిందూ సమా జంలోని కింది కులాలకు కేటాయిస్తామని బీజేపీ చెపుతున్నది. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ అంశాన్ని విస్తారంగా ప్రచారం చేశారు. ఆ రెండు రాష్ట్రాల ప్రజలూ ఈ మాటల్ని నమ్మలేదు. మత ప్రాతి పదికన రిజర్వేషన్లను బీజేపీ ఆమోదించదని మరో బూటకపు ప్రచారాన్ని ప్రధాని సాగిస్తున్నారు. నిజానికి మత ప్రాతిపదికనే కులాలుంటాయి. భారత రాజ్యాంగం కొన్ని సమూహాలకు ఇచ్చిన రిజర్వేషన్లు వాస్తవా నికి మత రిజర్వేషన్లే. మాల సామాజిక వర్గానికిచెందిన ఒక వ్యక్తి తాను హిందువుననిగానీ, సిక్కును అనిగానీ ప్రకటించుకుంటేనే ఎస్సీ రిజర్వేషను పొందు తాడు. క్రైస్తవుడినని ప్రకటించుకుంటే బీసీ రిజర్వేషను పొందుతాడు. ఏమిటి దీనర్థం? బీజేపీ ముస్లిం రిజర్వేషన్గా ప్రచారం చేస్తున్నది కూడా నిజానికి ముస్లిం రిజర్వేషన్ కాదు. ముస్లిం సమాజంలో ఓసీలుగా పరిగణించే సయ్యద్, పఠాన్, మొఘల్, బేగ్లకు బీసీ రిజర్వేషన్ వర్తించదు. మహా అయితే వాళ్ళు ఆర్థికంగా వెనుకబడిన సమూహాల (ఇడబ్ల్యూఎస్) కోటాలో లబ్ధి పొందవచ్చు. ముస్లింలను సాంస్కృతిక రంగంలో వివక్షకు గురి చేయడం, ఆర్థిక రంగంలో అతి క్రూరంగా బుల్ డోజర్లతో కూల్చి వేయడం బీజేపీ విధానంగా మారింది. ఏపీలో ప్రధాన పోటీదారులు అధికార వైఎస్సార్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం. ఆంధ్రప్రదేశ్ మొదటి నుండీ మత సామరస్యవాదుల నేల, సామ్యవాదుల భూమి. మతవిద్వేషాన్ని రగిల్చితే తప్ప రాజకీయ మనుగడ సాగించలేని బీజేపీ ఈ నేల మీద తనంత తానుగా మొలకెత్తలేని విత్తనం. 2019 ఎన్నికల్లో విడిగా పోటీచేస్తే బీజేపీకి ఒక్క శాతం ఓట్లు కూడ రాలేదు. లోక్ సభ, అసెంబ్లీల్లో ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. జాతీయ స్థాయిలో ఎన్డీయేకు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి మాత్రమే. ఏపీ ముస్లింలు ఈసారి ఒక లెక్క ప్రకారం కాంగ్రెస్కు మద్దతు పలకాలి. అయితే, కర్ణాటక, తెలంగాణాల్లా ఏపీలో కాంగ్రెస్ నిర్మాణం బలంగా లేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఎంచుకున్న ప్రాధాన్య తల్ని ఆ పార్టీ ఏపీ నాయకులు పట్టించుకుంటున్నట్టు లేదు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు బీజేపీని ఓడించాలనే పట్టుదల వున్నట్టు లేదు. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమిని గెలిపించాలా? బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమిని ఓడించాలా? అనేది ఏపీ ముస్లింల ముందున్న ప్రశ్న. రాష్ట్ర ఆర్థిక అవసరాల కోసమో, మరో కారణాలతోనో వైసీపీ జగన్ ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న ఎన్డీయేతో సఖ్యంగా వున్నారు. ఇప్పుడు ఆయనే ఏపీ నేల మీద బీజేపీని ఎదుర్కోవాల్సిన స్థితిలో పడ్డారు. ఎన్నికల ప్రచార ఘట్టం ముగిసేలోగా బీజేపీ, జగన్ల మధ్య పోరు మరింత వుధృతం అవుతుంది. భారత జాతీయ కాంగ్రెస్సా? వైఎస్సార్ కాంగ్రెస్సా? అనే ప్రశ్న మళ్ళా ముస్లింల ముందుకు వచ్చి నిలిచింది. ఇది రాజకీయ సమస్య మాత్రమే కాదు. ఒక విధంగా నైతిక సమస్య కూడా. ఆంధ్రప్రదేశ్ భౌతిక రాజకీయ సమీకరణలు, కాంగ్రెస్ ఏపీ యూనిట్ వాస్తవిక బలాబలాలు, పనితీరుల్ని పరిగణన లోనికి తీసుకుంటే ముస్లింలు వైసీపీకి మద్దతు ఇవ్వడమే మెరుగైన నిర్ణయం అవుతుంది. అది అవసరం కూడా. ఇటీవల విజయవాడలో ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ (ముస్లిం జేఏసీ), ముస్లిం ఆలోచనాపరుల వేదిక(ఎంటీఎఫ్) సంయుక్తంగా నిర్వహించిన ముస్లిం ఉలేమాలు, ఆలోచనాపరులు, అడ్వకేట్లు, డాక్టర్లు, ప్రొఫె షనల్స్తో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఈ మేరకు ఒక తీర్మానం చేసింది. -వ్యాసకర్త ముస్లిం ఆలోచనాపరుల వేదిక (ఎంటీఎఫ్) కన్వీనర్-ఏఎం ఖాన్యజ్దానీ డానీ -
పౌర సమాజం మేల్కోవాలి !
దేశంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ వైరి పక్షాల మధ్య మాటల యుద్ధం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది . కానీ మన రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఓటమి కళ్ల ముందు కనిపిస్తుండగా.. చంద్రబాబు కోసం కొన్ని పత్రికలు, ఛానళ్లు ఎన్నికల కురుక్షేత్రంలోకి దిగి తెలుగుదేశం కంటే కూడా ఎక్కువగా చావో రేవో అన్నట్లుగా వైఎస్సార్సిపి మీద తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. నిత్యం నీతులు వల్లించే రామోజీ ఇప్పుడు విలువలను విడిచి చంద్రబాబు కోసం గారడీలు చేయడం దీనికి పరాకాష్ట.నిజానికి రామోజీ మొదటి నుండీ వైయస్ కుటుంబానికి వ్యతిరేకంగా పని చేస్తూనే ఉన్నాడు, కాకపోతే పాతరోజుల్లో నగ్నంగా కనిపించకుండా ముసుగు వేసుకొని టీడీపీకి కొమ్ముకాసేవాడు. ఇప్పుడు ఈ ముసుగులన్నీ తొలగించి నగ్నంగానే విచ్చలవిడిగా అన్ని కట్టుబాట్లు గాలికొదిలేసి పుఖానుపుంఖాలుగా విషం చిమ్ముతున్నాడు. ఈనాడు పత్రికను చూస్తే.. అవసానదశలో కూడా రామోజీ ఎంత నీచ స్థాయికి దిగజారిపోయాడో అని ఆశ్చర్యంగా ఉంది. అంతెందుకు, నా సొంత అనుభవాన్నే తీసుకోండి. ఎటువంటి ఆధారాలూ లేకుండా "సీబీఐ వెతుకుతున్న నిందితుడు" అనే హెడ్లైన్ పెట్టి ఈనాడులో మూడ్రోజులు అడ్డమైన రాతలు రాయడం .. రామోజీ దిగజారుడు తనానికి పరాకాష్ట. విచిత్రంగా అసలు కేసు ఏమిటి? అది నిజంగా ఇంకా వుందా లేదా? ఒకవేళ ఉంటే ఏ స్థాయిలో వుంది? నోటీసులు ఇచ్చారా లేదా? ఇస్తే ఏ రకమైన నోటీసులు ఇచ్చారు? ఆ నోటీసులు ఇంకా అమల్లో ఉన్నాయా? ఇలాంటివేవీ ఆ మూడ్రోజుల రాతల్లో ఎక్కడా కనిపించలేదు. కనీసం కేసు తాలూకు వివరాలు తెలుసుకొనే ప్రయత్నం కూడా చేయలేదు .లుక్ అవుట్ అంటే ఏమిటి ? ఇంటర్పోల్ అంటే ఏమిటి? అవి ఏ ఏ దేశాలలో ఏ విధంగా పనిచేస్తాయో అన్న కనీస అవగాహన లేకుండా .. ఏదో అంతర్జాతీయ ఉగ్రవాది కేసు చేధించినట్లు పెద్ద పెద్ద అక్షరాలతో ప్రధాన వార్తగా అచ్చేశాడంటే .. రామోజీ ఎంత అభద్రతా భావంలో బ్రతుకుతున్నాడో తెలుస్తుంది. పేరు మార్చానంట... వేషం మార్చానంట. సినిమా వాళ్ళు కూడా ఇంత పకడ్భందిగా స్టోరీ అల్లలేరు. ఎవరో ఇచ్చిన స్టోరీని కనీసం నిజానిజాలు నిర్దారించుకోకుండా యధాతధంగా అచ్చేసి రామోజీ శునకానందం పొందటం తప్పితే ఇందులో ఎలాంటి నిజాలు లేవు.పుట్టినప్పుడు తల్లితండ్రులు పెట్టిన పేరుతోనే వున్నాను, వయస్సుతో వచ్చిన మార్పులు తప్పితే వేషంలో కూడా ఎలాంటి మార్పులు లేవు. జుట్టు ఊడిపోతే విగ్గురాజు లాగా విగ్గు ఎందుకులే అని స్టయిలిష్గా ఫుల్ షేవ్ చేస్తాను . నన్ను వ్యక్తిగతంగా ఎరిగిన ప్రతీ ఒక్కరికీ ఈ విషయాలు తెలుసు. నా మీద ఎలాంటి కేసులు లేవు, ఎలాంటి నోటీసులు లేవు . గుండుతో ఉంటే ఎయిర్పోర్టులో వదిలేస్తారా ? రామోజీకి మన వ్యవస్థల మీద ఎంత చిన్న చూపు వుందో అర్థం చేసుకోండి.నా మీద వార్త రాస్తున్న సమయంలోనే ప్లాన్ లో భాగంగా నా ఫేస్బుక్ అకౌంట్ మీద రిపోర్టులు కొట్టించి 24 గంటలు బ్లాక్ అయ్యేలా కుట్ర పన్నారు. పైగా "చూశారా, అకౌంట్ కూడా క్లోజ్ చేసాడని" అందరినీ నమ్మించే ప్రయత్నం చేశారు . నేను ఫేస్బుక్కి ఛాలెంజ్ ఆప్షన్ పెట్టి అకౌంట్ను వెనక్కి తెచ్చుకొని పోస్ట్ పెట్టేవరకూ యెల్లో మీడియా అంతా చెలరేగిపోయింది.చిన్నప్పటి నుండీ పత్రికల్లో రాతలకి, రోత రాజకీయాలకి , ఎన్నికలప్పుడు ప్రచారం చేసే పుకార్లకు అన్నిటికీ అలవాటు పడ్డవాళ్ళం కాబట్టి రామోజీ రాతలు చూసి మనకేదో పబ్లిసిటీ వచ్చిందిలే అని నవ్వుకున్నాం కానీ ... అదే నా స్థానంలో గీతాంజలి లాంటి అభాగ్యులు వుంటే అలాంటి వార్తలకు ఎంతమంది తట్టుకొని నిబ్బరంగా ఉండగలరు.? ఒకపక్క సోషల్ మీడియాలో వచ్చే నెగెటివ్ వార్తలకే ప్రాణాలు తీసుకొంటుంటే .. ఈనాడు లాంటి ప్రధాన పత్రికలో మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతో కధనాలు వస్తే ఎంతమంది తట్టుకొని నిలబడగలరు?ఇదే విషయమై మొన్న ఈనాడులో పనిచేసిన పాతతరం జర్నలిస్టులు కలిసినప్పుడు చర్చకి వస్తే వాళ్ళు చెప్పిన గత సంగతులు వింటే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే! వాళ్ళు చెప్పిన దాని ప్రకారం .. రామోజీ మాట వినని ప్రభుత్వ అధికారులమీద , వివిధ వ్యవస్థలలో ఉన్న అనేకమంది ప్రముఖుల మీద , ఆఖరికి సొంత వ్యవస్థలో పనిచేసే వాళ్ళ మీద కూడా ఇలాంటి దొంగ వార్తలు రాసి దారికి తెచ్చుకొనేవాడట . అలా తన దారికి రానివాళ్ళమీద మరింత విషపూరితంగా రాసి వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశాడట. ఇది రామోజీ దగ్గర అనేక సంవత్సరాలుగా దగ్గరగా పనిచేసిన సీనియర్ జర్నలిస్టులు చెప్పిన సంగతులు.రామోజీ ఇంత నీచస్థాయికి దిగజారటానికి కారణాలు ఏమిటి ?తరచి చూస్తే కారణాలు సుస్పష్టం. రామోజీ తన జీవితపు అవసాన దశలో ఉన్నాడు. నిజానికి ఈ వయస్సులో ఎవరైనా మరింత హుందాగా గౌరవం పొందాలని .. శత్రువులతో కూడా మంచి అనిపించుకోవాలని తాపత్రయపడతారు. నలభై ఏళ్లుగా తన టక్కుటమారా విద్యలతో ఒంటికి తెల్లని బట్టలు ముసుగుగా తొడిగి మీడియాని అడ్డం పెట్టుకొని వ్యవస్థలన్నిటినీ చెరబట్టాడు, అధికారం అండతో చెలరేగిపోయాడు. ముఖ్యంగా తనకి ఎదురు తిరిగిన ఎన్టీఆర్ ని దించి చంద్రబాబుని ఎక్కించటంలో సఫలీకృతుడు అవ్వటంతో ఇక తనకి ఎదురే లేదని, తానే సర్వాంతర్యామి అనే స్థాయికి చేరుకున్నాడు.చంద్రబాబు వెన్నుపోటు దిగ్విజయం అవ్వటంతో తాను తలచుకుంటే ముఖ్యమంత్రులను దించేయగలననీ .. అనుకుంటే ఎవరినైనా ముఖ్యమంత్రిని చేయగలనని భయపెట్టగలిగాడు. చంద్రబాబు హయాంలో రామోజీకి ఎదురు లేకుండా పోయింది. ఫిలింసిటీకి రూపకల్పన చేసి వేల ఎకరాలని దోచుకొని ఆఖరికి రాష్ట్రం విడిపోవటానికి బీజాలు కూడా వేసాడు. విడిపోయిన రాష్ట్రానికి తన మనిషి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వటం .. ఆ ఊపులోనే దేశంలో రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ రావటంతో ఇక తనకి తిరుగే లేదని .. తాను దేవేంద్రుడంతటి వాడినని తనకో రాజధాని కావాలనే ఉద్దేశ్యంతో దానికి అమరావతి పేరు పెట్టి ' ఇది మారాజ్యం / మా ఏలుబడిలో ఉన్న రాజ్యం ' అని చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలనే కుఠిల బుద్ధితో ఎన్నో అరాచకాలు చేసారు.2019 ఎన్నికల్లో చంద్రబాబును ప్రజలు ఈడ్చికొట్టడం, ఆ తరువాత మార్గదర్శి కేసులో విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడంతో రామోజీకి కళ్లు బైర్లు కమ్మినట్టయింది. మార్గదర్శి ఫైనాన్సియల్ మీద ఎంక్వయిరీ జరుగుతుండడంతో తన మోసాలు బట్టబయలు అవ్వటం ఖాయమని నిర్దారించుకున్నాడు రామోజీ. మార్గదర్శిలో అక్రమంగా డిపాజిట్లు సేకరించటమనేది కేసులో ఒక పార్శం మాత్రమే. వాస్తవానికి నిజమైన డిపాజిట్ దారులు 10 శాతం మంది మాత్రమే, మిగతా డబ్బంతా చంద్రబాబు బినామీదారులే... నల్ల డబ్బుని .. ఎల్లయ్య, పుల్లయ్య పేరులతో డిపాజిట్ దారులుగా రికార్డులు సృష్టించి మార్గదర్శిలో దాచుకున్నారు. అందుకే ఫిర్యాదు ఇచ్చే వాళ్లు కనిపించరు. ఎందుకంటే అక్కడ ఉన్నది 90 శాతం ఫేక్ డిపాజిట్ దారులే. కేసు ముందుకి వెళ్లే కొద్దీ ఈ అసలైన ఈ విషయం బయటకొస్తుంది. వీటన్నిటి నుండి రామోజీ తప్పించుకోవటం అసంభవం.రామోజీకి ఇప్పుడు 88 ఏళ్ళు. జీవితపు అవసాన దశలో ఉన్నాడు. కీర్తి ప్రతిష్టలు పతాక స్థాయిలో ఉన్నప్పుడు మరణిస్తే శాశ్వత కీర్తి వస్తుంది. ఎవరైనా అదే కోరుకొంటారు. కానీ రామోజీ విషయంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది . అందుకే రామోజీ కంపించిపోతున్నాడు. కేసులలో తనకి శిక్ష పడటం ఖాయమని.. సమాజానికి తన నిజ స్వరూపం బట్టబయలు అవ్వటంతో పాటుగా కేంద్రం ఇచ్చిన పద్మవిభూషణ్ కూడా తిరిగి తీసుకుంటారని .. ఇది దేశంలో మరెవ్వరికీ జరగని ఘోరమైన అవమానమని రామోజీ భయకంపితులవుతున్నాడు. అవమానభారంతో మరణిస్తే ఇన్ని రోజులు తన టక్కుటమారా విద్యాలతో నిర్మించిన సామ్రాజ్యం , సంపాదించిన పేరు ప్రఖ్యాతలు అన్నీ కుప్పకూలిపోవటం ఖాయమని , రామోజీ అనేది ఒక విషపురుగుగా చరిత్ర గుర్తు పెట్టుకుంటుందనే ఆందోళనలో రామోజీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు .ఇదంతా తప్పించుకోవాలంటే రామోజీ ముందున్న ఏకైక మార్గం మళ్ళీ చంద్రబాబుని ముఖ్యమంత్రి చెయ్యటం . అదొక్కటే రామోజీ ముందున్న పరిష్కారం . అందుకోసమే ఎన్నడూ లేనంతగా దిగజారి విషం చిమ్ముతున్నాడు . రాజకీయపార్టీల కంటే కూడా స్వయంగా తానే పోటీ చేస్తున్నట్లు భావిస్తూ పేపర్ మొత్తాన్ని విషంతో నింపేస్తున్నాడు. గడచిన కొద్ది నెలలుగా ప్రధాన శీర్షికలని గమనించండి. ఒక్కటంటే ఒక్క అక్షరం కూడా నిజం లేకుండా ప్రభుత్వం మీద మీద ఊహించనంత స్థాయిలో విషం చిమ్ముతూ తాను ఎంత ఆందోళనలో ఉన్నాడో చెప్పకనే చెప్తున్నాడు. విషయం చిన్నదా, పెద్దదా? నిజమా, అబద్దమా? అనే దానితో నిమిత్తం లేకుండా ఏదో రకంగా ఎదుటి పక్షానికి నష్టం చేయాలి .. ఈనాడు పరువుపోయినా ఫరావాలేదు .. కొద్దిమంది నమ్మినా అంతే చాలు .. అనే తరహాలో సిగ్గు విడిచేసి పుంఖానుపుంఖాలుగా వార్తలని వండి వారుస్తున్నాడు .అందుకే పౌర సమాజం మేల్కోవాలి , నిజాలని గ్రహించి సమాజపు భవిష్యత్ గురించి ఆలోచన చేయాలి. దానికి ఒక తేదీ ఉంది. జూన్ 4, 2024.శివ అన్నపురెడ్డి, అమెరికా -
వారికి ‘విధ్వంసం’గా కనిపిస్తున్నది ఏమిటి?
రాష్ట్రంగా ఏర్పడిన పదేళ్ళ తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉన్నది అని చూసినప్పుడు ఈ ఐదేళ్ళలో ఆసక్తికరమైన పరిణామ క్రమం కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల సభల్లో ‘రాష్ట్రంలో కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నది అందులో నేను అర్జునుణ్ణి’ అంటుంటారు. ఏదో ఒక ప్రతీకగా అన్నట్టుగా ఇది ఉన్నప్పటికీ, ఈ మాట వెనుక ఎంతో లోతైన విషయం ఉంది.అందులో పైకి కనిపించని రాజకీయ, ఆర్ధిక, భౌగోళిక, సామాజిక శాస్త్రముంది. దాని లోతులు-లూయిస్ టెల్లిన్ రాసిన ఆక్సిఫర్డ్ యూనివర్సిటి ప్రెస్ ప్రచురణ ‘రీ మ్యాపింగ్ ఇండియా: న్యూ స్టేట్స్ అండ్ దెయిర్ పొలిటికల్ ఆరిజన్స్’ గ్రంధం చూసినప్పుడు, మనకు అర్ధం అవుతుంది. అందులో ముందుమాటలోనే ఆమె- ‘రాష్ట్రాల సరిహద్దులు మన జీవితాల్లోని రాజకీయ, ఆర్ధిక అంశాల విషయంలో ఏ వర్గాల మధ్య పరస్పరం పోటీఉంది? ఏవి ఎవరి చేజారిపోతున్నాయి.. అనేది నిర్ధారిస్తుంది’ అంటారు.ఇటువంటి ‘ఇరు వర్గాల మధ్య పరస్పరం పోటీ’ గురించే,కొంతకాలంగా సీఎం జగన్ కూడా మాట్లాడుతున్నారు. ఆయన పరిపాలనలో సంక్షేమం అమలుకు ‘ఆన్ లైన్’ సాంకేతికతను, యుద్దభూమిలో ‘డాలు’ మాదిరిగా వాడుతూ విమర్శకుల దాడి తనను తాకకుండా చూసుకున్నారు. దాంతో ఒకప్పుడు ఆ ‘టెక్నాలజీ’ గురించే 24X7 మాట్లాడిన వారికి ఇప్పుడు దాన్ని తప్పుపట్టడానికి నోరు పెగలడం లేదు. ప్రతిపక్షవర్గాలకు ఇటువంటి నిస్సహాయతలో నుంచి వచ్చిందే ‘విధ్వంసం’ వంటి ఏకవాక్య వ్యాఖ్య. వాళ్ళు అ మాటకు వివరం ఏమిటో ఇంకా చెప్పలేదు.అయితే, జగన్ దాన్ని-‘పేదలకు పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధం’ అంటారు. రాజనీతి శాస్త్రంలో ఈ ‘పరస్పర పోటీ’సూత్రాన్ని ప్రతిపాదిస్తున్న ఈ రచయిత్రి ప్రస్తుతం లండన్ కింగ్స్ కాలేజిలో ‘ఇండియా ఇనిస్టిట్యూట్’తో పాటుగా ‘కేంబ్రిడ్జి’ ‘లండన్ స్కూల్ ఆఫ్ఎకనామిక్స్’ వంటి ప్రపంచ ప్రసిద్ద యూనివర్సిటిల్లో బోధిస్తున్నారు. ఈమె గతంలో బీబీసీ సౌత్ ఆసియా అనలిస్ట్ గాపనిచేసారు. ఈమె ఈ రచన 2014లోమన రాష్ట్ర విభజన నాటికివెలువడింది. ఉత్తరాదిలో ‘ఇండియా రీమ్యాపింగ్’కు దారితీసిన పరిస్థితులే దక్షణాదిలో మన వద్ద కూడా స్థూలంగా అవే చారిత్రిక, రాజకీయ, ఆర్ధిక, భౌగోళిక, సామాజిక పరిస్థితులు కారణం కావడం ఈ రచనలో చూస్తాము.ఇప్పుడు ఏమైంది 2000లో కొత్తగా ఉత్తరాఖండ్, చత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటుతో- ‘రీ మ్యాపింగ్ ఇండియా’వర్తమాన రాజకీయ నిర్ణయంగా ‘అకడమిక్’ చర్చగా మారి తెరమీదికి వచ్చింది. ఏమైంది, పదేళ్లకు ఇక్కడా అదే ‘సీన్ రిపీట్’ అయింది. అప్పుడు ఏమి జరగాలి? ‘రీ మ్యాపింగ్ ఆంధ్రప్రదేశ్’ మొదలవ్వాలి. ఎందుకంటే, ‘సరిహద్దులు మన జీవితాల్లోని రాజకీయ, ఆర్ధిక అంశాల విషయంలోవర్గాల మధ్య పోటీకి కారణం అవుతాయి’ అనేది సూత్రం అయినప్పుడు, నాయకుడు దాన్ని విధిగా ‘అడ్రెస్’ చేయాలి. అయితే నాయకుడు అక్కడ ఉత్పన్నం అయ్యే సవాళ్ళను ఎదుర్కోవాలి, అందుకు అతడు ధైర్యస్తుడై ఉండాలి.ఆ పనే జగన్ చేశాడు. ఆయన 13 జిల్లాలను 26 చేసి ఆ పని పూర్తిచేసాడు. రేపు చిన్నవో పెద్దవో సమస్యలు వస్తే వాటిని కూడా పరిష్కరిస్తాడు. ఒకప్పటి విజయనగరం జిల్లాలోని పార్వతీపురంను కొత్త జిల్లా చేయడానికి ఒడిస్సా సరిహద్దున ఉన్న 22 కొటియా గ్రామాల వివాదం ఒకటి చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. దాని పరిష్కారం కోసం నవంబర్ 2021లో మన ముఖ్యమంత్రి జగన్.. ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ను కలిసి రెండు రాష్ట్రాల మధ్య ‘పెండింగ్’ ఉన్న సరిహద్దు గ్రామాలు, నదీజలాల అంశాలు గురించి మాట్లాడాక, ఏప్రిల్ 2022న కొత్త జిల్లాలను ప్రకటించారు. తన మొదటి ‘టర్మ్’లోనే ఇటువంటి ‘రీ మ్యాపింగ్’ కసరత్తు తర్వాత ఈ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళబోతున్నది. ఔఏప్రిల్ మూడో తేదీన ‘నవ్యాంధ్ర పదేళ్ళ ప్రస్థానం’ అంశంపై బీబీసీ తెలుగు విజయవాడలో చర్చావేదిక ఏర్పాటుచేసి, నన్ను కూడా పిలవడంతో వెళ్ళాను. అన్ని పార్టీల ప్రతినిధులు సీనియర్ జర్నలిస్టులు వచ్చారు. సమన్వయకర్త చర్చ నాతోనే ప్రారంభిస్తూ ‘మీరీమధ్య తరుచూ ఇక్కడి అభివృద్దిపై వ్యాసాలు రాస్తున్నారు కదా, ‘డాట్స్’ ను కలిపి చూడాలి అంటారు. నవ్యాంధ్ర ఈ పదేళ్ళలో ఏమైనా ముందుకు వెళ్ళిందా? లేక వెనక్కి వెళ్ళిందా? మీరు ఏమనుకుంటున్నారు?’ అని అడిగారు.నేను చెప్పాను.. ‘వైఎస్సార్ కాలంలో మన్మోహన్ సింగ్ ఏపీలో తరచూ ‘రిఫార్మ్స్ విత్ హ్యూమన్ ఫేస్’ ‘ఏపీ మోడల్’ వంటి వ్యాఖ్యలు చేసేవారు. విభజన తర్వాత, అదే ఇక్కడ మరింత మెరుగైన రీతిలో కొనసాగుతూ, దాంతోపాటుగా-‘కోర్స్ కరక్షన్’ కూడా జరుగుతోందని చెప్పాను. ప్రస్థానం అనగానే అది ముందుకే వెళ్ళాలి అనుకుంటాం. అన్నిసార్లు అది అలాగే ఉండనక్కరలేదు. ఉన్నచోటే కొన్నాళ్ళు ఆగి, ప్రజల అవసరాలు చూస్తూ.. రేపు మనం వెళ్ళవలసిన మార్గాన్ని ముందుగా సరిచేసుకోవడం కూడా ఉంటుంది. అది ఆగిపోవడం కాదు, అది వెళ్ళాల్సిన మార్గంలో ఉన్న వ్యత్యాసాల ఎత్తుపల్లాలు సరిచేయడం అవుతుంది.కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం సరిహద్దులు (బోర్డర్స్) గురించిన స్పృహ మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ ఉండడం అనేది, ఎవ్వరు పెద్దగా గుర్తించలేదు గానీ అది అసాధారణమైన అంశం. అది ఉన్నప్పుడే- ‘రీ మ్యాపింగ్’ సాధ్యం అవుతుంది. మన సమాజంలో ‘బోర్డర్స్’లో ఉండేది ఎవరు? ఒక ఊళ్ళో ఊరి చివర ఉండేది ఎవరు? ఇటువంటి చివరి సమాజాల కోసం, ఈ ప్రభుత్వం కొత్త జిల్లాల కేంద్రాలను వీరి సమీపానికి చేర్చింది. కొందరు ఉంటారు, వారు ‘బోర్డర్స్’ను మరోలా చూస్తారు. వారు భద్రమైన నియోజకవర్గాల కోసం ‘బోర్డర్స్’కు వెళ్లి ఆ ప్రాంతం ఎదగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుని, దశాబ్దాలుగా ఆ ప్రజలమీద పడి బ్రతికేస్తుంటారు.ఉత్తరాంధ్ర ప్రముఖ కధకుడు అట్టాడ అప్పల నాయుడు 2007లో ‘షా’ అనే కథ రాసారు. ఇరిగేషన్ కాంట్రాక్టులు చేయడానికి కోస్తా నుంచి శ్రీకాకుళం వచ్చిన చౌదరి స్థానిక సంస్థల రాజకీయాల్లో జోక్యం చేసుకుంటాడు. దాని గురించి ఒక రాత్రి మందు పార్టీ వద్ద కొందరు రాజకీయ స్పృహ ఉన్న స్థానికులు మాట్లాడుకోవడం ఈ కథ. అయితే, ఇప్పుడు అది కథ కాదు. సరిహద్దుల్లో పరిష్కారం మొదలయింది. అదే ఇప్పుడు కొందరికి విధ్వంసంగా కనిపిస్తున్నది. రచయిత: అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత జాన్ సన్ చోరగుడి -
చరిత్ర పునరావృతం అవుతుంది...
ఎన్నికలు దగ్గర పడే కొద్దీ గెలుపుపై నమ్మకం సన్న గిల్లో, లేక చెప్పుకోడానికి మరేం లేకనో కొంతమంది రాజకీయ నాయకులు ద్వేషపూరిత ప్రసంగాలను ఆశ్రయించారు. విద్వేషాన్ని రగిలించే ఈ ప్రసంగాలు సత్యదూరమైన ఆరో పణలతో కూడినవి. ప్రధాన మంత్రి మోదీ మాట్లాడుతూ ఈ దేశంలోని ముస్లింలను చొర బాటుదారులుగా అభివర్ణించడం దారుణం. ముస్లిం ప్రజలందరికీ ఇది అవమానకరం. ప్రత్యర్థి పార్టీ మేనిఫెస్టోను ‘ముస్లిం లీగ్‘ మేనిఫెస్టోగా పెర్కొనడం ప్రధాని స్థాయికి తగినది కాదు.‘ఇండియా’ కూటమి వస్తే మీ ఇంటిలోని బంగారం, మంగళసూత్రాలతో సహా అంతా దోచి ముస్లింలకు కట్టబెడతారు అనడం అథమ స్థాయి వాదన.ఎన్నో సర్వేల్లో తేలిన వాస్తవాల ప్రకారం దేశం మొత్తం మీద ముస్లింల ఆర్థిక పరిస్థితి చాలా దయనీయం. దేశంలో జైళ్లలో మగ్గుతున్న వారిలో దళితులు, ఆదివాసీల లాగానే ముస్లింలు కూడా వారి జనాభా నిష్పత్తి కంటే ఎక్కువగా ఉన్నారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని ఆనాడు వైఎస్సార్ సారథ్యం లోని కాంగ్రెస్ ప్రభుత్వం దేశం లోనే మొట్ట మొదటి సారి ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించింది. మోదీ తన ప్రసంగంలో ముస్లిం రిజర్వేషన్ను ప్రస్తావిస్తూ ఇతర బీసీల రిజర్వేషన్లు తగ్గించి ముస్లింలకు ఇవ్వచూపు తున్నారు అని విమర్శించడం అవాస్తవమే గాక శోచనీయం.మోదీ బాటలో నడుస్తూ ఎన్డీఏ కూటమి భాగస్వామి పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్లో విద్వేషం వెదజల్లుతున్నారు. యాదృచ్ఛికంగానో, ఆకతాయి మూకల వల్లో జరిగిన ఆలయ రథ అగ్నిప్రమాదాన్నీ, ఒక విగ్రహానికి జరిగిన హానినీ ఆ యా ప్రాంతాల సభలలో ఒకటికి పది సార్లు ప్రస్తావిస్తూ ప్రభుత్వమే అటువంటివి చేయించింది అనే అర్థాన్ని స్ఫురించేలా అపోహలకి తెరలేపు తున్నారు.ఎటువంటి ఆధారాలు లేకుండా వందల కొద్దీ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయి అని బహిరంగ సభలలో అరవడం ఒక బాధ్యతా యుతమైన నేత పని అనిపించుకుంటుందా? మత విద్వేషాలు అనే ఊసు ఎప్పుడూ లేని ఉత్తరాంధ్రలో ప్రజలను రెచ్చగొట్టే ఇలాంటి ప్రసంగాలు చేయడం ఒక అమానుష చర్య. మరి కొన్ని సభల్లో ప్రజలను ‘మీకు సిగ్గు లేదా’, ‘పౌరుషం లేదా’ ‘మీరు రోడ్లు ఎక్కి వీళ్లకి బుద్ధి చెప్పరా’ అని అనడం వారిని ప్రత్యక్ష హింస వైపు ప్రేరేపించడమే. ఒక వైపు 2016లో చంద్ర బాబు హయాంలో జరిగిన కాపు రిజర్వేషన్ ఆందో ళన, తుని రైలు విధ్వంసం సంఘటనలను అప్పటి ప్రతిపక్షం వైసీపీ చేయించింది అనే నిందను వేశారు. అదే నోటితో జగన్ ప్రభుత్వం కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టిన సందర్బంగా 2022లో జరిగిన మంత్రి ఇల్లు దగ్ధం సంఘటనకు కూడా జగనే కారకుడు అనడంలో ఔచిత్యం ఏంటి? ఈ రెండు సునిశితమైన అంశాలను ఎన్ని కల వేళ మళ్ళీ తెర మీదకి తెచ్చి విద్వేషాలను రగిలించే తత్వం చాలా తప్పు. అసలు కాపు రిజర్వేషన్ సమస్యపై తనది, తన కూటమి వైఖరి ఏంటో చెప్పకుండా వైసీపీ లోని కాపు నేతలను కించ పరుస్తూ వారి నియోజక వర్గాల్లోనే అవమా నించడం ఒక అక్కసుతో, ద్వేషంతో కూడిన అజెండాలో భాగమే.14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఒక సిట్టింగ్ ముఖ్యమంత్రిని ‘కరుడు కట్టిన ఉగ్రవాది’ అని వర్ణించటం అత్యంత గర్హనీయ చర్య. ఈ మాటల్లో ఉక్రోషం కొట్టొచ్చినట్లు కనిపి స్తుంది. ప్రజలు వేసిన ఓట్లతో ముఖ్యమంత్రి అయిన జగన్ ఉగ్రవాది ఎలా అవుతారు? విధాన పరంగా విమర్శిస్తే ప్రజలు హర్షిస్తారు కానీ ఇటు వంటి మాటలు వాడితే ఎదురుదెబ్బ తగలడం ఖాయం.ఈ విధంగా కూటమి నేతలు మోదీ, పవన్ కల్యాణ్, చంద్రబాబు ముగ్గురూ విద్వేషాన్ని రగిలిస్తుంటే ముక్కున వేలేసుకోవాల్సిన పరిస్థితి ప్రజల దయ్యింది. ఇంతగా విలువలకు తిలోద కాలు ఇచ్చిన వైనం చూస్తే ఓటమి భయం వారిని వేధిస్తున్నట్టు అనిపిస్తోంది. ఇలాంటి విమర్శల నేపథ్యంలో వైఎస్సార్సీపీ తన మేనిఫెస్టో విడుదల చేసింది. గమనించాల్సిన విషయం ఏంటంటే కొత్తగా పెద్ద హామీలు ఏమీ ఇవ్వక పోవడం. ‘ఉన్న పథకాలనే కొనసాగిస్తాం, మెరుగు చేస్తాం’ అంటూ ముందుకు వచ్చిన జగన్ తన ఓటు బ్యాంకుపై ఆత్మ విశ్వాసం కలిగి ఉన్నా రని దీన్నిబట్టి అర్థమవుతోంది. ఇలాగే 2009లో అప్పటి వైఎస్ఆర్ కూడా 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నాక ఎటువంటి కొత్త హామీలు ఇవ్వకపోయినా ప్రజలు తమ నమ్మకాన్ని మళ్ళీ ఆయనపై ఉంచి ప్రతిపక్ష మహాకూటమిని చిత్తుగా ఓడించారు. మళ్లీ ఇప్పుడు సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టిన ఆ చరిత్ర పునరావృతం అవుతుందనిపిస్తోంది.డా‘‘ జి. నవీన్ వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులుnaveen.prose@gmail.com -
రంగును బట్టి రాజకీయాలా?
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లను పోలి ఉంటారన్న శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఆధునిక మానవుని ఆవిర్భావం తొలుత ఆఫ్రికాలోనే జరిగిందనీ, అక్కడి నుంచి వారు వివిధ ప్రాంతాలకు వలస పోయారనీ, అందులో ప్రస్తుత భారతదేశం కూడా ఒకటనీ శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. అలాంటప్పుడు ఆఫ్రికన్లతో పోలిక ఎవరికైనా ఎందుకంత ఉలికిపాటుకు గురి చేయాలి? వలసలు, సాంకర్యాల క్రమంలో మనుషులు తమ ఒరిజినల్ లక్షణాలలో కొన్నింటిని నిలుపుకొన్నారు, కొన్నింటిని కోల్పోయారు. ఇందుకు అనుగుణంగా దక్షిణ భారతీయుల రంగు ఉత్తరాదివారితో తేడాగా ఉండటం సహజం. ఆ చర్మపు రంగును గురించి, ‘వీరంతా ద్రవిడులు’ అనే ఈసడింపులు తెలిసిన విషయమే. ఈ విధమైన భావనలు ఏవీ దేశానికి మంచివి కావు.దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లను పోలి ఉంటా రంటూ శామ్ పిట్రోడా (ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్గా రాజీనామా చేశారు) చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం సాగుతున్నది. రాజకీయాలను పక్కన ఉంచి మానవ వికాస శాస్త్రాన్ని, మానవ వలసల కోణాలను పరిశీలిస్తే ఆ వ్యాఖ్యలలో తప్పే మిటో అర్థం కాదు. వానరాల నుంచి ఆధునిక మానవుని ఆవిర్భావం తొలుత ఆఫ్రికాలోనే జరిగిందనీ, అక్కడి నుంచి వారు భూగోళంలోని వివిధ ప్రాంతాలకు వలస పోయారనీ, అందులో ప్రస్తుత భారతదేశం కూడా ఒకటనీ శాస్త్రవేత్తలు అంగీకరిస్తున్నారు. ఈ సూత్రీకరణను ప్రపంచమంతా కూడా ఆమోదిస్తున్నది. మనకు మాత్రం సైన్సు కన్నా రాజకీయాలు ముఖ్యం గనుక పిట్రోడా మాటలపై భూమ్యాకాశాలను ఏకం చేసే హంగామాను సృష్టిస్తున్నాము.ఇంతకూ పిట్రోడా అన్నదేమిటి? ఆయన దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లను పోలి ఉంటారని మాత్రమే అనలేదు. దేశంలోని తూర్పు ప్రాంతాల వారు చైనీయులవలె, పశ్చిమ ప్రాంతాల వారు అరబ్బుల వలె, ఉత్తరాది వారు శ్వేతజాతీయులవలె ఉంటారని కూడా అన్నారు. ఈ పోలికలలో తక్కిన మూడింటిని వదలి, దక్షిణ భారతీయులు ఆఫ్రికన్ల వలె ఉంటారన్న మాట ఒక్కటే వివాదమైంది. వివాదమైంది అనటంకన్న వివాదంగా మార్చారనటం సరైనదవుతుంది. ఈ చర్చ లోకి వెళ్లే ముందు ఒక విషయం గుర్తు చేసుకోవాలి. స్వయంగా బీజేపీకి చెందిన తరుణ్ విజయ్ అనే నాయకుడు, తను రాజ్యసభ సభ్యునిగా, ‘పాంచజన్య’ పత్రిక సంపాదకునిగా ఉండినపుడు, ‘‘మనం (అనగా ఉత్తరాది వారం) దక్షిణాది వారితో కలిసి ఉండటం లేదా?’’ అని వ్యాఖ్యానించారు. అనగా, తాము తెల్లగా ఉంటామని, ఉత్తమ స్థాయి వారమని, దక్షిణాది వారు నల్లగా ఉంటారని, అధమ స్థాయి వారని, అయినప్పటికీ తమది ఉదార స్వభావం గనుక అటువంటి వారితో కలిసి జీవిస్తున్నామని అర్థం. వాస్తవానికి దక్షిణాది వారి చర్మపు రంగును గురించి, కను ముక్కుల తీరు గురించి, భాషా సంస్కృతుల గురించి, ‘వీరంతా ద్రవి డులు’ అనే పద్ధతిలో ఈసడింపులు చేయటం అందరికీ తెలిసిన విషయమే. ఎన్టీఆర్ రాక వరకు అందరూ కట్టగట్టి ‘మద్రాసీ’లే. ఈ ధోరణికి బీజేపీ, సంఘ్ పరివార్ సైతం మినహాయింపు కాదన్నది ఇక్కడ గుర్తించవలసిన విషయం. ప్రస్తుత వివాద సందర్భంలోనూ ఈ సంగతి గుర్తించాలి. పిట్రోడా కాంగ్రెస్ నేత అయినందున, ఆయన మాటలను వివాదం చేస్తే తమకు రాజకీయంగా లాభిస్తుందనే సంకుచిత ఆలోచన తప్ప, ఇందులో బీజేపీ వివేకం ఏమీ కన్పించదు. మనకు తెలిసి మానవ వికాస శాస్త్రం, ప్రపంచవ్యాప్తంగా వలసల చరిత్ర, ఇటీవలి సంవత్సరాలలో జరిగిన డీఎన్ఏ పరిశోధనలు చెప్తున్న విషయాలు కొన్నున్నాయి. ఇండియా, చైనా, ఉత్తర యూరప్లలో ప్రాథమిక స్థాయి మానవ జాతులు స్వల్ప స్థాయిలో రూపుదిద్దుకున్న ప్పటికీ, ఆధునిక మానవుని ఆవిర్భావం తొలుత జరిగింది ఆఫ్రికాలోని తూర్పు భాగాన గల రిఫ్ట్ వ్యాలీలో. వేలాది సంవత్సరాల కాలంలో అటువంటి ఆవిర్భావం ఏ విధంగా జరిగిందో శాస్త్రీయమైన పురావస్తు అధ్యయనాలు చెప్పాయి. వాటిపై కెన్యా రాజధాని నైరోబీ, ఇథియో పియా రాజధాని అడ్డిస్ అబాబాలలోని జాతీయ మ్యూజియాలలో గొప్ప ప్రదర్శనలున్నాయి. ఈ రెండింటినీ నేను స్వయంగా చూడటమే గాక, రిఫ్ట్ వ్యాలీలోని కొంత భాగంలో ప్రయాణించాను. ఆధునిక మానవుని ఆవిర్భావం పరిస్థితి ఇది కాగా, ఆ ప్రాంతం నుంచి మాన వులు రెండు లక్షల సంవత్సరాల క్రితం నుంచి మొదలుకొని ప్రపంచం నలువైపులా ఎట్లా వలస వెళ్లారో, ఆ విధంగా 70 వేల ఏళ్ల క్రితం ప్రస్తుతం మనం అంటున్న భారతదేశంలోకి ఏ విధంగా ప్రవేశించారో అనేక అధ్యయనాలున్నాయి.తర్వాత వేల సంవత్సరాలలో ప్రపంచమంతటా జరిగినట్లేఇండియాలో కూడా లెక్కలేనన్ని జాతి సాంకర్యాలు జరిగాయి. పైన చెప్పుకున్నట్లు అప్పటికే ఇక్కడ స్వల్ప స్థాయిలో ప్రాథమిక మానవులు ఉండగా, తర్వాత కాలాలలో తూర్పు ఆసియా నుంచి మంగోలాయిడ్లు, మధ్య ఆసియాలోని కాస్పియన్ సముద్ర ప్రాంతం నుంచి ఆర్యులు, పశ్చిమాసియా నుంచి అరబ్బులు, పారశీకుల పూర్వీకులు ఇటువైపు వలసలు వస్తూ పోయారు. తిరిగి వీరందరి మధ్య సాంక ర్యాలు, వలసలు వేలకు వేల సంవత్సరాల పాటు సాగాయి. దేశంలోని అన్ని ప్రాంతాల స్త్రీ, పురుషుల డీఎన్ఏలపై జరిగిన ఆధునిక శాస్త్ర పరిశోధనలు, పురావస్తు పరిశోధనలు తేల్చిన విషయాలివి. అయితే ఈ వలసలు, సాంకర్యాల క్రమంలో వేర్వేరు జాతులు, ప్రాంతాల మనుషులు తమ ఒరిజినల్ లక్షణాలలో కొన్నింటిని తరతరాలుగా నిలుపుకోవటం, కొన్నింటిని ఒక మేర కోల్పోవటం జరుగుతూ వస్తు న్నదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఉదాహరణకు అండమాన్, నికో బార్ ఆదిమవాసి తెగలు, దేశంలోని మారుమూల అడవులలో నివసించే ఆటవిక జాతులకు ఇతరులతో సాంకర్యం దాదాపు లేనందున, వారిలో ఇప్పటికీ ఆఫ్రికన్ డీఎన్ఏ యథాతథంగా కనిపిస్తుందంటారు. అటువంటి స్థితిలో ఆఫ్రికన్లతో పోలిక ఎవరికైనా ఎందుకంత ఉలికి పాటుకు, వ్యతిరేక భావనకు గురి చేయాలి?దక్షిణాది ప్రజలు, ఈశాన్య భారత లేదా తూర్పు భారత వాసులు, పశ్చిమ, ఉత్తర ప్రాంతాల వారి రంగు తేడాలకు మూలాలు దీనంతటిలో ఉన్నాయి. దక్షిణ–ఉత్తర భారత భాషలు, సంస్కృతులు, దేవతలు, ఆలోచనా ధారల మధ్య, చివరకు రాజకీయాల మధ్య కనిపించే వ్యత్యాసాలకు గల మూలాలను శాస్త్రీయంగా శోధిస్తూ పోతే బోధపడేది ఇదే. ఆధునిక మానవుల ఆవిర్భావానికి, వారి వలసలకు, పరస్పర సాంకర్యాలకు లక్షలాది, వేలాది సంవత్సరాల చరిత్ర ఉంది. ఇందుకు ప్రపంచంలోని ఏ ప్రాంతంగానీ, భారతదేశంగానీ ఎంత మాత్రం మినహాయింపు కావు. పైన చెప్పుకొన్నట్లు, ఈ పరిణామ క్రమం ఒకవైపు అనంతంగా సాగుతూనే, మరొకవైపు అనేకులు తమ ఒరిజినల్ డీఎన్ఏలోని, ఒరిజినల్ లక్షణాలలోని కొన్ని భాగాలను అదేవిధంగా నిలుపుకొన్నారు. అట్లా ఎవరెంత నిలుపుకొన్నారు, అవి ఏ మేరకు నిలిచి ఉన్నాయనేది అనేక పరిస్థితులపై ఆధారపడి సాగుతూ వస్తున్నది.ఇందుకు అనుగుణంగా దక్షిణ భారతీయుల రంగు కన్నా ఉత్తరాదివారు, పశ్చిమ, తూర్పువాసుల రంగు తేడాగా ఉండటం సహజం. కానీ దానినిబట్టి వివక్షలు ఏర్పడాలంటే, తక్కిన ముగ్గురి లోనూ ఆఫ్రికన్ డీఎన్ఏ ఉంది. వారి పూర్వీకులు సైతం ఆఫ్రికన్లే. అటువంటపుడు, ఇంకా ఒక మేర మిగిలి ఉన్న రంగును బట్టి తరుణ్ విజయ్ అనే పెద్దమనిషి గానీ, మరొకరుగానీ, తమవంటి పూర్వీకులే గల దక్షిణ భారత ప్రజలను చిన్నచూపు చూడటం విజ్ఞతగల పని అవుతుందా? ఇంతకూ పిట్రోడా ఆ మాటలన్నది ఎందుకో తెలియదు గానీ, మానవ వికాస శాస్త్రం దృష్టితో, ప్రపంచవ్యాప్త వలసల చరిత్ర దృష్టితో, డీఎన్ఏ పరిశోధనల దృష్టితో సరిగా ఇవే మాటలను ఇప్పటికి ఎందరో అన్నారు, రాశారు. ఎన్నికల సమయం గనుక ఇది అధికార పక్షానికి ఒక మంచి ఆయుధంగా మారింది.ఈ సందర్భంలో మరొకటి గుర్తుకు వస్తున్నది. ఆర్యుల, ఉత్తరాది వారి ఆధిపత్యంగల పార్టీలు, ప్రభుత్వాలు ద్రవిడుల దక్షిణాదిని రాజకీయంగా జయించాలని, తమ ఆధిపత్యం కిందకు తెచ్చుకోవా లని ప్రయత్నిస్తున్నాయని, నిరంతరం వివక్షకు గురి చేస్తున్నాయనే వాదనలు పెరియార్ రామస్వామి తర్వాత, హిందీ వ్యతిరేక, ఉత్తరాది వ్యతిరేక ఉద్యమాల తర్వాత ఇప్పటికీ ముందుకు వస్తుంటాయి. ఈ విధమైన భావనలు ఏవీ దేశానికి మంచివి కావు. టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
ఇది... భూ హక్కుకు భరోసా!
ప్రజల భూమి హక్కును కాపాడటం ప్రభుత్వాల రాజ్యాంగ బాధ్యత. ప్రస్తుతం చాలా ఉన్న సివిల్ కేసులకు, క్రిమినల్ కేసులకు కారణం భూమిపై యజమానికి వున్న హక్కును లేక టైటిల్ ను గుర్తించే చట్టబద్ధమైన వ్యవస్థ లేకపోవటం. వారసత్వం, కొనుగోలు, బదిలీ, కేటాయింపు ద్వారా భూమిపై యాజమాన్య హక్కు మార్పిడి జరుగుతుంది. రిజిస్ట్రేషన్ వ్యవస్థ భూమికి సంబంధించిన ఈ బదలాయింపు లావాదేవీలను రిజిస్టర్ చేస్తుంది. అంతేకాని లావాదేవీల ద్వారా పొందిన హక్కును రిజిస్టర్ చేయదు. అందువలన రిజిస్ట్రేషన్ విధానం భూమిపై సంపూర్ణ హక్కుకు రుజువు కాదు. అందుకే ఒకరు భూమిని కొని రిజిస్టర్ చేయించుకుంటే అదే భూమిని మరొకరు రిజిస్టర్ చేయించుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ‘డబుల్ రిజిస్ట్రేషన్’ అనే సమస్య ఎక్కువగా వింటున్నాం. ‘లాండ్ టైటిలింగ్ చట్టం –2022’ ఈ సమస్యకు పరిష్కారం. పట్టాదారు పాస్ బుక్, టైటిల్ డీడ్, 1బీ ఆడంగల్, మరే ఇతర రెవెన్యూ రికార్డులు కూడా భూమిపై యజమానికి ఉన్న యాజమాన్య హక్కును నిరూపించే పత్రాలు కావు (పి. కిశోర్ కుమార్ వర్సెస్ విట్టల్ కె పట్కర్, 2023). రెవెన్యూ రికార్డుల్లో వివరాలు పొందుపరచే ‘మ్యుటేషన్’ కేవలం భూమిశిస్తు కట్టటానికి ఉపయోగపడే పత్రం. ఈ మ్యుటేషన్ వలన భూమిపై హక్కులు కల్పించబడవు, ధ్రువీకరించ బడవు (సవర్ణి వర్సెస్ ఇందర్ కౌర్, 1996). ఆంధ్ర ప్రదేశ్ (భూమి హక్కులు మరియు పట్టాదార్ పాస్ పుస్తకాలు) చట్టం, 1971 చట్ట బద్ధంగా భూములకు సంబంధించిన హక్కుల రికార్డులను తయారు చేయడానికీ, ఆ రికార్డులను నిర్వహించడానికీ ఉద్దేశించిందే కాని యజమానికి భూమిపైన ఉన్న హక్కులను ధ్రువీకరించదు (సీతారామ్ పాటిల్ వర్సెస్ రాంచంద్ర నాగో పాటిల్, (1977). పట్టాదారు పాస్ బుక్ కూడా యాజమాన్య హక్కును నిర్ధారించదు (గౌసియా బేగమ్ వర్సెస్ బసిరెడ్డి రుక్మిణమ్మ, 2013). ఈ దేశంలో ఏ రెవెన్యూ రికార్డు కూడా భూమిపైన యజమానికి వున్న హక్కును లేదా టైటిల్ను సంపూర్ణంగా నిర్ణయించదు, నిర్ధారించదు. భూమిపైన యజమానులకు ఉన్న హక్కులను లేక టైటిల్ కాపాడే విధంగా, భూ యజమానికి ఉన్న హక్కును ధ్రువీకరించి, హక్కు భద్రతకు హామీని ఇచ్చే విధంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘లాండ్ టైటిలింగ్ చట్టం’ చేసింది. ఇది విప్లవాత్మకమైనది. భారత దేశంలో భూ యజమాని హక్కు(టైటిల్)ను చట్టబద్ధంగా గుర్తించిన మొట్ట మొదటి చట్టం ఇది. ఈ చట్టం లాండ్ టైటిలింగ్ అథారిటీనీ, స్థిరాస్తిపై హక్కునూ రిజిస్టర్ చేసే వ్యవస్థనూ ఏర్పాటు చేసి, టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారిని నియమిస్తుంది. ఈ చట్టం ప్రకారం నోటిఫై చేసిన ప్రాంతంలో ఉన్న భూమి వివరాలకు సంబంధించిన రికార్డును సిద్ధం చేసి, స్థిరాస్తి గుర్తింపు సంఖ్య కేటాయించి, దాని సరిహద్దులతో రికార్డ్లో నమోదు చేసుకోవాలి. ఈ రికార్డులు మూడు రకాలు. 1. రికార్డు ఆఫ్ టైటిల్ 2. రికార్డు ఆఫ్ చార్జ్ 3. వివాదాలలో వున్న భూమి రికార్డు. ప్రారంభంలో తాత్కాలిక టైటిల్ రికార్డును సిద్ధంచేసి, నోటిఫై చేసి, భూ హక్కు దారులకు ఆ రికార్డు పైన వున్న అభ్యంతరాలను స్వీకరించి, ఆ అభ్యంత రాలను నివృత్తి చేస్తారు. ఏ అభ్యంతరం లేని భూముల టైటిల్ను రికార్డు ఆఫ్ టైటిల్లో నమోదు చేస్తారు. ఈ రికార్డులో నమోదు చేసిన రెండు సంవత్సరాల తరువాత ఆ భూమిపై ఉన్న హక్కు యజమాని సంపూర్ణ హక్కుగా గుర్తించబడుతుంది. భూమికి సంబంధించి సివిల్ కోర్ట్లో లేక రెవెన్యూ కోర్ట్లో అయినా కేసు వుంటే, దాని తీర్పు ప్రకారం రెండు సంవత్సరాల తరువాత కూడా హక్కును నమోదు చేస్తారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న అన్ని రెవెన్యూ రికార్డుల స్థానంలో ఒకే ఒక్క రికార్డు ‘రికార్డు ఆఫ్ టైటిల్’ అమలులోకి వస్తుంది. ఈ రికార్డు భూ యజమానికి వున్న హక్కును సంపూర్ణ హక్కుగా ఈ చట్టం గుర్తిస్తుంది. భారత దేశంలో భూ యజమాని హక్కును (టైటిల్) చట్టబద్ధంగా గుర్తించిన మొట్టమొదటి చట్టం ఇది. చట్టంలోని సెక్షన్ 38... భూమి టైటిల్ హక్కుకు సంబంధించిన వివాదాలను సివిల్ కోర్ట్ పరిధి నుండి మినహాయించి, రెవెన్యూ కోర్ట్కు బదలాయించడం పట్ల అభ్యంతరం వ్యక్తమవుతున్నది. ఈ సెక్షన్ రాజ్యాంగ బద్ధతను గూర్చిన వివాదం ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత న్యాయ స్థాన పరిధిలో వుంది. సివిల్ కోర్ట్ అధికారాలను కొనసాగిస్తూ మధ్యంతర వుత్తర్వులు వెలువరించింది హైకోర్ట్. మరో వివాదాస్పద అంశం సెక్షన్ 14 ప్రకారం టైటిల్ రిజిస్టర్లో నమోదు కాబడిన లేక నమోదుకాని భూములకు సంంబంధించి అభ్యంతరాలు వున్నట్లయితే, సంబంధిత వ్యక్తులు టైటిల్ రిజిస్ట్రేషన్ అప్పీలేట్ అధికారికి అర్జీ పెట్టుకోవాలి. రెవెన్యూ అధికారి అప్పీలేట్ అధికారిగా వుంటాడు కాబట్టి ఈ చట్టం దుర్వినియోగం అవుతుంది అనేది ఒక వాదన. సివిల్ కోర్ట్లో భూవివాద పరిష్కారం ఆలస్యం అవుతుంది అని ఈ విధానాన్ని ఈ చట్టంలో అమలు చేశారు. రెవెన్యూ న్యాయస్థానాలు ఈ చట్టంలో కొత్తగా ఏర్పాటు చేసినవి కావు. అనేక ఏళ్లుగా అమలులో వున్న ఈ రెవెన్యూ కోర్టులను ఎప్పుడు ప్రజలు, న్యాయవాదులు వ్యతిరేకించలేదు. అమలుచేసే అధికారులు అధికారాన్ని దుర్వినియోగం చేస్తారనే అభియోగంతో చట్టాన్ని కొట్టి వేయటం న్యాయ శాస్త్ర ప్రాథమిక సూత్రానికి వ్యతిరేకం. భూమిని కొనుగోలు చేసినప్పుడు ఆ కొనుగోలు లావాదేవీలను రిజిస్టర్ చేయించినట్లే, సంబంధిత అధికారి దగ్గర హక్కును లేక టైటిల్ ను కూడా రిజిస్టర్ చేయించుకోవాలి. ఈ విధానం భూ యజమానికి వున్న భూమిపై వున్న హక్కుకు రక్షణ, భద్రత. కొనిన స్థలం చుట్టూ కంచ వేయించు, గోడ కట్టు అని మన శ్రేయోభిలాషులు చేసే హెచ్చ రికలు ఇక అవసరం లేదు. స్థిరాస్తిని టైటిల్ రికార్డులో నమోదు చేసిన తరువాత, హక్కును కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే. ఈ దేశంలో భూమి కొని దానిని టైటిల్ రిజిస్టర్లో నమోదు చేసుకొని విదేశాలకు వెళ్ళి ఎన్ని సంవత్సరాల తరువాత తిరిగి భారతదేశానికి వచ్చినా,వారి భూమి అన్యాక్రాంతం కాదు. ముఖ్యంగా ఈ చట్టం ’సెకండ్ రిజిస్ట్రేషన్’ సమస్యకు పరిష్కారం. దీనికి కారణం భూమి కొనిన యజమాని హక్కుకు ఈ చట్టం ప్రభుత్వాన్నే కాపలాదారునిగా చేస్తుంది. ప్రభుత్వం భూమిని పరిరక్షించటంలో విఫలమైనా, టైటిల్కి సంబంధించి సమస్య వచ్చినా భూమి యజమానికి ప్రభుత్వం బీమా చెల్లిస్తుంది. రెవెన్యూ రికార్డు లేకుండా చాలా కాలంగా భూమిని పండించుకుంటున్న బలహీన వర్గాలకు పంపిణీ చేసిన భూమిని కూడా వెంటనే రికార్డు ఆఫ్ టైటిల్లో నమోదు చేయాలి. వారి హక్కుకు భద్రత మరియు బీమా కల్పించాలి. ఈ చట్టం అమలు వలన బలహీన వర్గాల ప్రజలకు వారి అనుభవంలో వున్న భూమికి, వారికి బదలాయించే భూమి హక్కుకు భద్రత కల్పించ వలసిన బాధ్యత ప్రభుత్వంపై వుంటుంది. ఆ విధంగా పేద, బలహీన వర్గాల వారికి కూడా ఈ చట్టం వలన మేలు జరుగుతుంది.డా‘‘ నేలటూరి జేసు రత్న కుమార్ వ్యాసకర్త పూర్వ సహాయ సంచలకులు,ఏపీ జ్యుడీషియల్ అకాడెమీ ‘ 98857 20777 -
బీద పిల్లల గురించి ఆలోచించండి!
ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ వాళ్లు గ్రామీణ విద్యా వ్యవస్థను ప్రాంతీయ భాషామయం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు చదువుకునే ప్రభుత్వ యూనివర్సిటీలలో ఇంగ్లిష్ను క్రమంగా తీసేసి ప్రాంతీయ భాషను, ముఖ్యంగా హిందీని రుద్దుతున్నారు. కానీ పెట్టుబడిదారుల యూనివర్సిటీల్లో ఇంగ్లిష్ భాష, విదేశీ సిలబస్ ద్వారా చదువు చెప్పి తిరిగి దేశ నాయకత్వాన్ని మొత్తం వారి చేతికి అప్పజెప్పే కుట్ర జరుగుతోంది. జగన్ ప్రభుత్వం విద్యా సమానత్వం కోసం అన్ని రకాల కుట్రలకూ వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసి స్కూలు విద్యను మార్చింది. తెలుగుకు ప్రాధాన్యమంటూ ఇంగ్లిష్ మీడియం తీసివేస్తే పూర్తిగా నష్టపోయేది బీసీ, ఎస్సీ, ఎస్టీలు. జాగ్రత్తగా ఆలోచించి ఓటెయ్యకపోతే, బీద పిల్లల భవిష్యత్ అంధకారమౌతుంది.దేశంలో ఎన్నికలు మొదటిసారి ఓబీసీల (వెనుకబడిన తరగతుల) చుట్టూ తిరుగు తున్నాయి. ఓబీసీల్లో అన్ని శూద్ర కులాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని శూద్ర వ్యవసాయ కులాలు రిజర్వేషన్లలో లేకపోవచ్చు. కొన్ని రాష్ట్రాల్లో ఉండొచ్చు. ఉదాహరణకు రెడ్డి, కమ్మ, కోస్తా కాపు కులాలు రిజర్వేషన్లలో లేవు. కర్ణాటకలో, తమిళనాడులో అన్ని శూద్ర కులాలు రిజర్వేషన్లలో ఉన్నాయి. లింగాయత్, వక్కళిగ, నాయకర్ (పెరియార్ కులం) కులాలు కూడా ఆ రాష్ట్రాల్లో రిజర్వేషన్లలో ఉన్నాయి.చారిత్రకంగా వర్ణ వ్యవస్థలో నాలుగవ వర్ణం శూద్రులు. వేద కాలంలో వారు బానిసలు. తరువాత వ్యవసాయ, కుటీర పరిశ్రమ, పశుపోషణ వంటి అన్ని ఉత్పత్తి పనులు చేసి దేశాన్ని ఈ స్థితికి తెచ్చింది ఈ కులాలే. క్రమంగా వీరి నుండి విడగొట్టబడి అంటరాని వారుగా అణగదొక్కబడ్డవారు దళితులు. వీరు కాక అరణ్య జీవనం నుండి అందరిలో కలిసే ప్రయత్నం చేస్తున్నవారు ఆదివాసులు.ఇంగ్లిష్ మీడియం వంటి సమాన విద్యే ఈ కుల వ్యవస్థను కూల్చుతుందని మనకు ఈమధ్య కాలంలోనే అర్థమవుతోంది. అందుకు మంచి ఉదాహరణ ఈ సంవత్సరం 10వ తరగతిలో ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నవారు ఆంధ్రలో 91 శాతం పాస్ అయితే, తెలంగాణలో 93 శాతం పాసయ్యారు. తెలుగు మీడియంలో చదువుకున్నవారు 80 శాతంగానే పాసయ్యారు.రిజర్వేషన్ల మాటేమిటి?అయితే 2024 ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చడం, అందులో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లను క్రమంగా ఎత్తివేసే సవరణ చెయ్యడం గురించి చర్చ జరుగుతోంది. ఈ భయం బీజేపీ బయట ఉన్న వారికే కాదు, బీజేపీలో ఉన్నవారికి కూడా ఉన్నది. అయితే మరి మూడోసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయితే ఆయన బీసీ అని చెబుతున్నారు కనుక ఎలా తీసేస్తారు అనే ప్రశ్న ఉత్పన్నమౌతుంది? ఆరెస్సెస్ 1950లో రాజ్యాంగాన్ని డాక్టర్ అంబేడ్కర్ ఆనాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్కు అందించి అమలు చేసిన నాటి నుండి ఎస్సీ, ఎస్టీలకు అందులో పొందుపర్చిన రిజర్వేషన్ల పట్ల వ్యతిరేకతతో ఉంది. అంతకంటే ముఖ్యంగా 1955లో కాకా కాలేల్కర్ బీసీ రిజర్వేషన్ రిపోర్టును ఆనాటి నెహ్రూ ప్రభుత్వం తిరస్కరించినప్పుడు ఆరెస్సెస్ మంచి పని జరిగింది అనే ధోరణిలో ఉంది.అయితే 1990లో వీపీ సింగ్ ప్రభుత్వం బీపీ మండల్ రిపోర్టును అమలు చేసినప్పుడు ఆరెస్సెస్/బీజేపీ వ్యతిరేకించాయి. ఆనాడు కాంగ్రెస్ కూడా వ్యతిరేకించింది. కాంగ్రెస్లో ఉన్న బీసీ నాయకులు కొంతమందైనా బీసీ రిజర్వేషన్లను సపోర్టు చేశారు. కానీ బీజేపీలో ఉన్న బీసీల్లో ఒక్క ఉమాభారతి తప్ప వేరే ఏ ఒక్క బీసీ లీడర్ కూడా బీసీ రిజర్వేషన్లను సపోర్టు చెయ్యలేదు. నరేంద్ర మోదీ ఆనాడు రిజర్వే షన్లను సపోర్టు చెయ్యలేదు. ఆయన బీసీ అని కూడా ఎవ్వరికీ తెలియదు. గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక మాత్రమే ఆయన బీసీగా ప్రచారం ప్రారంభించారు.2014 ఎన్నికలకు ముందు ఆ ప్రచారాన్ని బాగా పెంచారు. ప్రధానంగా ఆనాడు బీసీల ఓట్లతో ఆయన గెలిచారు. అందుకు ఫలితంగా ఆయనగానీ, బీజేపీ/ఆరెస్సెస్ ప్రభుత్వంగానీ గత పదేండ్లలో బీసీలకు ఏమి ఇచ్చారు? మొత్తం శూద్ర సమాజం బతికేది వ్యవసాయ రంగం మీద. దాన్ని మొత్తంగా గుజరాత్–ముంబయి బడా పెట్టుబడిదారులకు అప్పగించేందుకు ఘోరమైన వ్యవసాయ వ్యతిరేక చట్టాలు తెచ్చారు. శూద్ర/బీసీలు ఇంతో అంతో బతికేది వ్యవసాయ ఉత్పత్తి, వ్యవసాయ మార్కెట్ల మీద. వాటిని బడా పెట్టుబడిదారులకు అప్పజెప్పాలని చట్టాలు చేస్తే శూద్ర/బీసీ రైతులు ఎంత పోరాటం చేశారో వ్యవసాయదారులందరికీ తెలుసు. బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లల స్కాలర్షిప్లు మొత్తం తగ్గించివేశారు. వీరు చదువుకునే ప్రభుత్వ యూనివర్సిటీలలో ఇంగ్లిష్ను క్రమంగా తీసేసి ప్రాంతీయ భాషను ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీల్లో హిందీని రుద్దుతున్నారు. కానీ పెట్టుబడిదారుల యూనివర్సిటీల్లో కేవలం ఇంగ్లిష్ భాష, విదేశీ సిలబస్ ద్వారా చదువు చెప్పి తిరిగి దేశ నాయ కత్వాన్ని మొత్తం వారి చేతికి అప్పజెప్పే కుట్ర జరుగుతోంది.చాలా విచిత్రంగా ఈ ఎన్నికల్లో ముస్లిం రిజర్వేషన్లను తీసేసి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇస్తామంటున్నారు. మోదీ, అమిత్ షా ఈ ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు. అసలు ముస్లింలకు రిజర్వేషన్లు యూపీ ఎస్సీలో ఉన్నాయా? కొన్ని రాష్ట్రాల్లో 4 శాతం లేదా అంతకంటే తక్కువ ఉన్నాయి. మొత్తం పారిశ్రామిక రంగాన్ని ప్రైవేటీకరిస్తూ, బీసీ, ఎస్సీ, ఎస్టీల పిల్లల్ని ఇంగ్లిష్ మీడియంలో చదువుకోవడాన్ని వ్యతి రేకిస్తూ ముస్లింలకు తగ్గించేది ఎక్కడ? బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చేది ఎక్కడ?ప్రధానమంత్రి బీసీని అని చెబుతూ నా సిద్ధాంతం ‘సనాతన ధర్మం’ అంటే ‘వర్ణధర్మం’ అంటున్నారు. బీసీలు శూద్ర వర్ణం వారు కదా! సనాతన ధర్మం వారిని దైవ పాదాల నుండి పుట్టించింది కదా! అయినా మళ్ళీ ఈ రాజ్యాంగాన్ని మార్చకుండా శూద్రులందరినీ ఏ దేవుని పాదాల్లో పుట్టిస్తారు? ఈ రాజ్యాంగం ఆ పాదాల, తొడల, భుజాల, తల పుట్టుకను రద్దు చేసి అందరి పుట్టుకను సమానం చేసింది. బీసీ ప్రధానమంత్రి చిన్నప్పుడు చాయ్ అమ్మి ఉండవచ్చు. కానీ మట్టి మోసి, మనుషుల మలాన్ని ఎత్తివేసే పనులు చేసే పిల్లల్ని కనీసం చాయ్ వ్యాపారంలోకి కూడా రానియ్యలేదే! దళితులు చాయ్ చేస్తే ఈ దేశంలో పై కులాలు ఇప్పటికీ తాగడం లేదే! మానవ మను గడకు మూలం వ్యవసాయం; ఆ పని చేసేవారంతా శూద్ర బీసీలు. వారికి బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, ఖత్రీలు, కాయస్తులతో సమాన విద్య, సమాన పని హక్కు కల్పించే ఈ రాజ్యాంగాన్ని మార్చకుండా మళ్ళీ సనాతన ధర్మాన్ని స్థాపించడం సాధ్యం కాదు. ఇక్కడే బీసీలు జాగ్రత్తగా ఆలోచించాలి. మే 5న ఆంధ్రప్రదేశ్ బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ, తమ ప్రభుత్వం రాగానే తెలుగుకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. తెలుగుకు ప్రాధాన్యమంటే, ఇంగ్లిషు మీడియం తీసేయడమా? మరి అమిత్ షా తన కొడుకు జయ్ షాను గుజరాతీ మీడియంలో ఎందుకు చదివించలేదు? అదే అమిత్ షా... ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో మరాఠీ/గుజరాతీ మీడియం ఎందుకు పెట్టించలేదు? ఆంధ్రప్రదేశ్ బీసీ, ఎస్సీ, ఎస్టీలు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వెయ్యకపోతే, బీద పిల్లల భవిష్యత్ అంధకార మౌతుంది.ఓటు వేసే ముందు... జగన్ ప్రభుత్వం విద్యా సమానత్వం కోసం అన్ని రకాల కుట్రలకు వ్యతిరేకంగా తీవ్రమైన పోరాటం చేసి స్కూలు విద్యను మార్చింది. ఇంగ్లిష్ మీడియం తీసివేస్తే పూర్తిగా నష్టపోయేది బీసీ, ఎస్సీ, ఎస్టీలు. అమిత్ షా ప్రకటన చాలా ప్రమాదకర హెచ్చరిక. ఈ మధ్య కాలంలోనే మోదీ తమ ఎంపీ అభ్యర్థులందరికీ ఉత్తరాలు రాస్తూ అమిత్ షాను ఆకాశానికి ఎత్తారు. మోదీ తరువాత అమిత్ షానే ప్రధానమంత్రి అనే డైరెక్షన్ ఇచ్చారు. ఆయన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఇంగ్లిష్ విద్య రానియ్యకూడదనే పట్టుదలతో ఉన్న వ్యక్తి.ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో గ్రామీణ విద్యా వ్యవస్థను ప్రాంతీయ భాషామయం చేశారు. కానీ పెద్ద పెట్టుబడిదారులు వారి పిల్లల్ని ఇంగ్లిష్ తప్ప మరో భాష రాకుండా చూసుకుంటున్నారు. వీరి నేతృత్వంలో రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడిస్తే, సమస్త భవిష్యత్ దెబ్బతింటుంది. గుజరాత్లో ఎప్పుడైనా ఆంధ్ర పాలకుల నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నడవగా చూశామా! ఆంధ్రప్రదేశ్లో కూటమికి ఓటు వేసే ముందు మొత్తం ప్రజలు ఆలోచించాల్సింది ఇదే.ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
రిజర్వేషన్లకు ఎవరు భరోసా?
రిజర్వేషన్ల మీద జాతీయ స్థాయిలో ఇంతటి ప్రస్తావన చోటు చేసుకోవడం ఒక మంచి పరిణామం. ఇది ప్రస్తావన మాత్రంగానే సాగుతున్న వ్యవ హారం కాబట్టి దీనిని చర్చ అనడం లేదు. ప్రస్తుతం జరుగు తున్న ఎన్నికల్లో (లోక్సభ ఎన్ని కలు–2024) బీజేపీకి పూర్తి స్థాయి మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తుందనీ, రిజర్వేషన్లను రద్దు చేస్తుందనీ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారానికి కమలనాథులు తీవ్ర కలవర పాటుకు గురౌతున్నారు. అర్ఎస్ఎస్ చేత కూడా ఖండన ప్రకటనలిప్పిస్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చే ఉద్దేశం కానీ, రిజర్వేషన్లను రద్దు చేసే ఆలోచన కానీ ఏ కోశానా లేవని చెప్పుకుంటున్నారు. రిజర్వేషన్లు జనాభాలో అత్య ధిక శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి నవి కాబట్టి బీజేపీ ఇంతగా ఇది అయిపోతోందని అర్థమవుతోంది. సామాజికంగా అణగారిన వర్గాలకు–అంటే సామాజికంగా, విద్యా పరంగా వెనుకబడిన వారికి మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అందుకు విరుద్ధంగా ఆర్థిక వెనుకబాటుతనాన్ని రాజ్యాంగంలో చేర్పించి ఆ వర్గానికి ఏకంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించిన చరిత్ర బీజేపీ పాలకులది. ఇందు కోసం అగ్ర వర్ణాలనుంచి ఒత్తిడి వర్గాలను రంగంలో దింపిన ఘనత బీజేపీది. దేశంలో శతాబ్దాలుగా కఠోరంగా అమల్లో గల కుల వ్యవస్థ, బ్రాహ్మణీయ వివక్ష వల్ల చదువుకీ, ఆస్తికీ, ఆత్మగౌరవానికీ బహు దూరంగా బతుకుతూ... అదే సమయంలో సకల శ్రామిక, సేవక వృత్తులు చేస్తూ సమాజ రథాన్ని నడిపిస్తున్న వేలాది కింది కులాల ప్రజలను చేయి అందించి ముందుకు తీసుకురావలసిన కర్తవ్యాన్ని గుర్తించి రాజ్యాంగ కర్తలు సానుకూల వివక్షకు అవకాశం కల్పించారు. విద్య, ఉద్యోగాల్లో కొంత శాతాన్ని ప్రత్యేక పరిగణన ద్వారా వారికి కేటాయించాలని నిర్ణయించారు. రాజ్యాంగ అధికరణలు 15(4), 46 ఇందుకే చోటు చేసుకున్నాయి. ప్రమోషన్లలో, భర్తీ కాకుండా మిగిలిపోయిన బ్యాక్ లాగ్ ఉద్యోగాలలో కూడా ఈ రిజర్వేషన్లు వర్తింపజేయడానికి వేర్వేరు రాజ్యాంగ సవరణల ద్వారా అవకాశం కల్పించారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ అందరికీ సమానంగా ఓటు హక్కును కల్పించడంతో దేశంలో సమతా భావన బలపడడం ప్రారంభించింది. అయినా ఇప్పటికీ వెలి గ్లాసులు, వెలి బావులు వంటివి కొనసాగుతున్నాయి. అగ్రవర్ణాలకు కేటాయించిన మంచినీటి కుండలోని నీరు తాగేడనే నెపం మీద పాఠశాలలో దళిత బాలుడిని కొట్టి చంపిన మాదిరి దారుణ ఉదంతాలు జరుగతున్నాయి. రిజర్వేషన్లు కల్పించి ఏడు దశాబ్దాలు దాటినా అణగారిన వర్గాల– ఎస్సీ, ఎస్టీ, బీసీల బతుకులు చాలీ చాలని గుడిసెల్లోనే కొనసాగుతున్నాయి. నిరుద్యోగం, అధిక ధరలు వారి బతుకులను మరింతగా అంచులకు ఈడ్చివేశాయి. అందుకే జనాభాలో తామెందరో... విద్య, ఉద్యోగాల్లో అంత శాతం వాటా తమకు రావాలనే డిమాండ్ ముందుకు వచ్చింది. కులగణన నినాదం బలం పుంజుకున్నది. కాంగ్రెస్ పార్టీ దీనిని ప్రధాన వాగ్దానంగా చేసుకుంది. ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా దామాషాను బట్టి రిజర్వేషన్లు వర్తిస్తుండగా దేశ జన సంఖ్యలో సగానికి పైగా ఉన్న బీసీలకు రిజర్వేషన్లను 27 శాతానికే కుదించారు. మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీం కోర్టు గీచిన హద్దు గీత, క్రీమీ లేయర్ నిబంధన బీసీల పాలిట శాపాలయ్యాయి. ఆర్థిక వెనుకబాటుతనం పేరిట అగ్రవర్ణ పేదలకు రాజ్యాంగ సవరణ ఆయుధంతో 10 శాతం కోటా కల్పించిన మోదీ ప్రభుత్వం రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని, క్రీమీ లేయర్ను తొలగించడానికి రాజ్యాంగ సవరణ ఎందుకు చేయలేదు? కులగణను బీజేపీ ఎందుకు వ్యతి రేకిస్తోంది? బీసీల దయనీయస్థితి అంకెల్లో అచ్చు గుద్ది నట్టు బయటపడి వారిని వాడుకుంటూనే తాను వారిని ఎంతగా వంచిస్తున్నదో బహిర్గతమవుతుందనే భయంతోనే కదా! బీజేపీ చరిత్రంతా రిజర్వేషన్ల వ్యతిరేక చరిత్రే. దశాబ్దాల క్రితం మండల్ నివేదిక అమలుకు తలపెట్టిన ప్పుడు చెలరేగిన రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం, మందిర్ ఆందోళన పరివార్ శక్తుల ప్రమేయంతో చెలరేగినవే కదా! సమ్మిళిత లక్షణంతో సెక్యులర్ సదాశయంతో వారి వారి అణగారినతనం ఆధారంగా హిందూయేతర మత స్థులలోని వారికీ రిజర్వేషన్ల కల్పనకు రాజ్యాంగం వీలు కల్పించింది. 2005 లో యూపీఏ ప్రభుత్వం నెలకొల్పిన జస్టిస్ రాజిందర్ సచార్ కమిటీ దేశంలో ముస్లింలు దయనీయ స్థితిలో ఉన్నారనీ, వారికి విశేష స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనీ సిఫారసు చేసింది. ఇప్పుడు ముస్లింలకు అరకొరగా ఉన్న రిజర్వేషన్లను కూడా రద్దు చేస్తామని ప్రధాని మోదీ తన ఎన్నికల ప్రచార సభల్లో కఠోర స్వరంతో ప్రకటిస్తున్నారు. రాజ్యాంగ ధర్మాన్ని కాల రాస్తున్నారు. ముస్లింల రిజర్వే షన్లను తెగనరుకుతానంటున్న బీజేపీ, ఆ తర్వాత వారికి దగ్గరగా ఉన్న ఎస్సీ, ఎస్టీల కోటాకు టాటా చెప్పాబోదనే హామీ ఎక్కడిది? ఈ ఎన్నికల్లో తమ పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి లోక్సభలో 400 సీట్లు వస్తే రిజర్వేషన్లను తొలగిస్తామనీ, రాజ్యాంగాన్ని మారుస్తామనీ రాజస్థాన్ మంత్రి కిరోరి లాల్ మీనా ప్రకటించినట్టు చూపించిన ఒక వీడియో గత నెలలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. బీజేపీ తన అభిమతాన్ని అధికారికంగా కాకుండా అనధికారిక మార్గాలలో వ్యక్తం చేస్తూ ఉంటుందనే అభిప్రాయం ఉంది. రిజర్వేషన్ల జోలికి వెళ్ళబోమనీ, అది తప్పుడు ప్రచారమనీ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పదే పదే చేస్తున్న ప్రకటనలను, ఇస్తున్న హామీలను నమ్మలేం. అర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ కూడా రంగ ప్రవేశం చేసి రిజర్వేషన్ల రద్దు జరగబోదని స్పష్టంగా ప్రకటించారు. అయితే గతంలో ఆయనొకసారి రిజర్వేషన్లను సమీక్షించాలని అన్నారు. 2015 లో బిహార్ ఎన్నికలకు కొద్ది వారాల ముందు మాట్లాడుతూ రిజర్వేషన్ విధానంపై సామాజిక సమీక్ష జరగాలని ప్రకటించారు. దాని మీద వివాదం చెలరేగడంతో ఇతర పేద వర్గాలకు కూడా మేలు చేసే ఉద్దేశంతోనే ఆయన అలా అన్నారని వివరణ వచ్చింది. ఆచరణలో బీజేపీ పదేళ్ల పాలనలో రిజర్వేషన్లు కను మరుగయ్యేలా ప్రైవేటైజేషన్ ముమ్మరించింది. సామా జికంగా, విద్యా విషయకంగా వెనుకబడిన బీసీలకు విధానపరంగా అది ఉపయోగపడింది శూన్యమే. బడు గులను కేవలం పేదలుగా, పైనుంచి నెలకు 5 కిలోల బియ్యం ‘ముష్టి’ వేస్తే అదే మహా ప్రసాదమని కళ్ళకు అద్దుకొనేవారుగా మాత్రమే బీజేపీ పరిగణిస్తూ ఉంది.హిందూ కుల వ్యవస్థ దశాబ్దాలుగా అణగదొక్కగా చదువు, ఆత్మగౌరవం పిసరంతైనా అంటని బానిస బతు కులు బతికినవారికి పరిహారంగా రిజర్వేషన్లను కల్పించడాన్ని తాము నెత్తిన పెట్టుకునే సనాతన నీతికి అవమా నమని వారు భావిస్తున్నారు. ఉదాహరణకు మహిళలపై గతంలో మోహన్ భాగవత్ వెలిబుచ్చిన అభిప్రాయా లను గమనించవచ్చు. ‘పెళ్లి ఒక కాంట్రాక్టు అని ఈ ఒప్పందం ప్రకారం నువ్వు నా ఇంటి బాధ్యతలు నెరవేరిస్తే నీ అవస రాలాన్నిటినీ నేను తీరుస్తాను, నిన్ను భద్రంగా కాపాడుతాను అని భర్త భార్యకు చెబుతాడు, భార్య ఈ ప్రకారం నడుచుకున్నంత కాలం భర్త ఆమె బాధ్యత వహిస్తాడు, ఆమె ఈ కాంట్రాక్టును ఉల్లంఘిస్తే ఆమెను అతడు వదిలేయవచ్చు’అని ఆయన అన్నారు. గ్రామీణ భారతంలో రేప్లు తక్కువనీ, పట్టణాల్లో, నగరాల్లోనే ఎక్కు వని కూడా అన్నారు. మహిళ ఆస్వతంత్రురాలుగా, పురుషుడి చేతుల్లో ఉండాలని ఆయన ప్రవచించారు. ఇటువంటి భావాలు గలవారి అధిపత్యంలో దేశం సెక్యులర్ రాజ్యాంగానికీ, రిజర్వేషన్లకూ స్వస్తి చెప్పి మనుస్మృతిని అమల్లోకి తెస్తుందనే భయాలు కలగడం సహజాతి సహజం.జి. శ్రీరామమూర్తి వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
ఎన్నో ఆటుపోట్లను భరించి ఒంటరిగా రాజకీయ పార్టీని స్థాపించారు. వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలు తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన నిజాయితీ గల ప్రజానాయకుడిగా ఎదిగారు. కనీవినీ ఎరుగని మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. కరోనా వల్ల రెండేళ్లు కలిసిరాక పోయినా ప్రజల్ని కంటిరెప్పల్లా కాపాడుకున్నారు. మిగిలిన కాలంలోనే పేద బిడ్డలకు కార్పొరేట్ స్థాయి ఆంగ్ల విద్యను అందుబాటులోకి తెచ్చారు. పేద తల్లిదండ్రులకు అద్భుతమైన ఆరోగ్య సేవలను అందించారు. వలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయాల ద్వారా పాలనను ప్రజల గడప వద్దకు తెచ్చారు. పెట్టుబడులను ప్రోత్సహించి పరిశ్రమలు వచ్చేట్టు చూశారు. ఒక్కమాటలో సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశారు. అందుకే జగన్ అంటే జనాల్లో అంత ఆదరణ! జగన్ అంటే ఒక నిజం, ఒక భావోద్వేగం, ఒక విజయ సంకేతం.వై.ఎస్. జగన్మోహన్రెడ్డి రాజకీయ ప్రవేశం చేసినప్పటినుంచీ పది సంవత్సరాలు ఆటుపోట్లతో నడిచింది. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం తరువాత రాజకీయంగా కాకలు తీరిన, కుట్రలు కుతంత్రాలు తెలిసిన నాయకులను ఎదిరించి ఒంటరిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. అప్పుడే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్కు బీజం పడింది. తరువాతి కాలంలో సోనియా గాంధీ కుట్రలకు బలైపోయి పదహారు నెలలు జైలు జీవితం గడిపారు. 2017 జూలైలో తూర్పు గోదావరి జిల్లా, వైరా మండలం చాపరాయి గ్రామంలో పదహారు మంది ఆదివాసీలు విషజ్వరాలతో వైద్య సదుపాయం అందక మరణించిన విషయం తెలిసిందే. అప్పుడు జగన్ పది కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో పోలీసు రక్షణ కూడా లేకుండా నడక దారిన వెళ్లి ఆ విషయాన్ని వెలుగులోకి తెచ్చి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. పేదల పక్షాన శాసనసభలో గళం వినిపించారు. ఇక జగన్ రాజకీయ జీవితంలో మరువలేని ప్రధాన ఘట్టం ప్రజా సంకల్ప యాత్ర పేరుతో 3,648 కిలోమీటర్లు ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు నడిచిన పాదయాత్ర. ఈ పాదయాత్రలో జగన్ ప్రజలతో మమేకమై వారి కష్టాలు చూసి చలించి ‘నేను చూశాను, నేను విన్నాను, నేను ఉన్నాను’ అంటూ ప్రజలకు భవిష్యత్తుపై నమ్మకం కలిగించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఒక బలమైన నిజాయితీ గల ప్రజానాయకుడిగా ఎదిగారు. 2019లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 175 స్థానాల్లో 151 గెలిచి ఏపీ ముఖ్యమంత్రిగా అశేష జన వాహిణి మధ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న యాభై ఎనిమిది నెలల పాలనా కాలంలో కరోనాతో 24 నెలలు ప్రజలను కంటికి రెప్పలా కాపాడు కోవడంలోనే గడిచింది. మిగిలిన దాదాపు మూడు సంవత్సరాల కాలంలో తన మేనిఫెస్టోలోని పథకాల ద్వారా ప్రజల ఆర్థిక అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. ఈ పథకాల ద్వారా మహిళా సాధికారతకు అడుగులు పడ్డాయి. వై.ఎస్.ఆర్. చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం వంటి పథకాలతో పేద ప్రజల బతుకులలో వెలుగులు ప్రసరించాయి. వడ్డీ లేని రుణాలు ఇప్పించడం వలన గ్రామీణ కుటుంబాలకు ఆర్థిక పుష్టి కలిగింది. ముప్పై ఒక్క లక్షల మంది నిరుపేద మహిళలకు జగన్ ప్రభుత్వం ఇంటి పట్టాలు మంజూరు చేసింది.అందులో ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లతో పదహారు లక్షల ఇల్లు... రోడ్లు, డ్రైనేజి, నీటి వసతి, వీధి దీపాలు వంటి పూర్తి మౌలిక సదుపాయాలతో ఏర్పాటయ్యాయి. ఒక్కో ఇంటి విలువ స్థలంతో కలిపి పది లక్షలనుండి పదుహైదు లక్షల వరకు చేరి, పేదవారికి సొంత ఇంటి కల నెరవేరింది.జగన్ సుపరిపాలనలో మరో ముందడుగు 2019 ఆగస్ట్ 15 నుంచి ప్రారంభమైన వలంటీర్ వ్యవస్థ. ఇక 2019 అక్టోబర్ 2న ప్రారంభించిన గ్రామ వార్డు సచివాలయాలు ఒక సువర్ణ అధ్యాయం. వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకే పెన్షన్, బియ్యం, ఇతర నిత్యావసర సరుకుల పంపిణీ జరుగుతోంది. సచివాలయాల ద్వారా ప్రజలకు రెవెన్యూ రికార్డులు, జనన మరణ ధ్రువీకరణ పత్రాలు, కుల ధ్రువీకరణ పత్రాలు, భూముల సర్వే సేవలు, ఆరోగ్యసేవలు ఏమాత్రం వ్యయ ప్రయాసలు లేకుండా, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా వేగవంతంగా లభిస్తున్నాయి. గ్రామ స్థాయిలో తెచ్చిన రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రైతులకు కావలసిన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యంత్ర సామగ్రి సేవలు మార్కెట్ కంటే తక్కువ ధరలకు అందుతున్నాయి.వైద్య రంగంలో జగన్ ప్రభుత్వం తెచ్చిన గొప్ప మార్పు ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు పైసా ఖర్చు లేకుండా అందించడం. నాడు నేడు పథకం కింద ప్రభుత్వ హాస్పిటల్స్ను ఆధునీకరించారు. మహానేత రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆరోగ్య శ్రీ సేవల పరిమితిని రూ.ఇరవై ఐదు లక్షలకు పెంచారు. చికిత్స సేవలు 1,059 నుంచి 3,250 వరకు పెంచారు. జగనన్న ఆరోగ్య సురక్ష, ఫ్యామిలీ డాక్టర్ కాన్పెప్ట్ ద్వారా ప్రజలకు గడప గడపకు వైద్య సేవలు అందు తున్నాయి. ఇవి కాక శ్రీకాకుళం జిల్లాలో దశాబ్దాలుగా ఉద్దానం ప్రాంతంలో ఉన్న కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా వంశధార నది నుంచి 100 కిలోమీటర్లు పైప్లైన్ ద్వారా 807 గ్రామాలలోని ఏడు లక్షల మంది ప్రజలకు రక్షిత మంచినీరు అందించడం జరుగుతోంది. పలాసలో జగన్ తన పాదయాత్రలో చెప్పిన మాట ప్రకారం 200 పడకల సూపర్ స్పెషాలిటీ మరియు కిడ్ని పరిశోధన హాస్పిటల్ నిర్మించడంతో అక్కడి ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందుతున్నాయి. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చేసేనాటికి రాష్ట్రంలో 7 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండేవి. ఆయన శ్రీకాకుళం, కడప, ఒంగోలులో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అందించడానికి కొత్తగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటవుతున్నాయి. ఇప్పటికే నంద్యాల, ఏలూరు, రాజ మండ్రి, మచిలీపట్నం, విజయనగరంలలో ప్రారంభించారు. మిగిలిన 12 వైద్య కళాశాలలు కూడా త్వరలో అందుబాటులోకి రానున్నాయి.పేద పిల్లల అభివృద్ధికి విద్య అత్యవసరం అని జగన్ విశ్వసించారు. ఈ దిశగా జగన్ ప్రభుత్వం సమూల మార్పులు చేసింది. నాడు నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు ఏర్పాటు చేసింది. పేద విద్యార్థులకు అందని ద్రాక్షగా ఉన్న ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులు ఐక్యరాజ్యసమితిలోని అధి కారులతో స్థిరమైన ఆర్థికాభివృద్ధిపై చర్చలో పాల్గొనడం సామాన్య మైన విషయం కాదు.పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చే సులభతర విధానంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తోంది. టీడీపీ ప్రభుత్వంలో ఏపీకి రూ.32,800 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రాగా, ప్రస్తుత ప్రభుత్వంలో రూ.1.03 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. చిత్తూరు జిల్లా కోటర్ల పల్లె గ్రామం దగ్గర స్మార్ట్ డీవీ ప్రాజెక్ట్, అనకాపల్లి అచ్యుతా పురం దగ్గర టైర్ల తయారీ కంపెనీ, తూర్పు గోదావరి జిల్లా బలభద్రపురం దగ్గర బిర్లా క్యాస్టిక్ సోడా యూనిట్, వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ దగ్గర సెంచ్యురీ ప్యానల్స్ లాంటి పరిశ్రమలు వచ్చాయి.ఇంకా, అరబిందో, దివీస్ సంస్థల విస్తరణలతో కాకినాడ ఫార్మా యూనిట్గా ఎదుగుతోంది. విశాఖపట్నంలో ఇన్పోసిస్, విప్రో, భారత్ ఎలక్టాన్రిక్స్ తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. ఆంధ్ర రాష్ట్రానికి 972 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉన్నా కొత్తగా పోర్టులు గానీ, ఫిషింగ్ హార్బర్లు గానీ ఇదివరకు రాలేదు. ప్రస్తుతం జువ్వలదిన్నె, నిజాంపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. వీటి వలన మత్స్యకార కుటుంబాల వారు చేపల వేటకు గుజరాత్ తీర ప్రాంతానికి వలసలు పోనవసరం లేదు. ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన పాలనలో పేద ప్రజలకోసం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరిస్తున్నారు. తన ప్రభుత్వం వలన తమ కుటుంబాలకు మంచి జరిగితేనే తనకు తోడుగా నిలవమని అడుగుతున్నారు. జగన్ ఒక సంఘ సంస్కర్తగా, ప్రజారంజక పాలకుడిగా పేరు పొందిన మాట వాస్తవం. ప్రజలతో జగన్ బంధం భావోద్వేగాలతో ముడిపడి ఉంది. అందుకే సిద్ధం యాత్రలో లక్షలాది మంది పిల్లలు, యువతీ యువకులు, వృద్ధులు, మహిళలు ఎర్రటి ఎండల్లో కూడా జగన్ కోసం నిరీక్షిస్తున్నారు. ఆయన కనబడితే కేరింతలు కొడుతూ జై జగన్ అని నినాదాలు చేస్తున్నారు. ఇవి జగన్ విజయానికి సంకేతాలు.– అమూరు రాఘవరెడ్డి ‘ జె.డి.ఎస్.డబ్ల్యూ. (రిటైర్డ్),– జి.సాంబశివారెడ్డి ‘ రిటైర్డ్ ప్రిన్సిపల్,యోగి వేమన యూనివర్సిటీ, కడప -
సమాన అవకాశాల... విద్యా విప్లవం
భారతీయ సమాజంలో అసమానతలు అధికంగా ఉండటానికి ప్రధాన కారణం అవకాశాలు అందరికీ సమానంగా లేకపో వడం. ముఖ్యంగా మంచి విద్యను అభ్యసించే అవ కాశం కొందరికే ఉండటం. దీన్ని గమనించిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కనివిని ఎరుగని రీతిలో విద్యావ్యవస్థ రూపురేఖలను మార్చేశారు. దీంతో ఎక్కడో కొండ కోనల్లో నివసించే ఆది వాసీ పిల్లలు సైతం పట్టణ ప్రాంత విద్యార్థులతో సమానంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిపుచ్చుకుంటు న్నారు. ఇదో విప్లవం. ఈ విప్లవ ఫలితాలు ఇప్పుడి ప్పుడే దృశ్యమానమవుతున్నాయి. కొండబారిడి గిరి జన గ్రామానికి చెందిన బాలిక మనస్విని ఐక్యరాజ్య సమితి దాకా వెళ్లడం ఇందుకు ఒక ఉదాహరణ.కొండబారిడి ఒక సవర ఆదివాసీ పల్లె. ఆరు దశాబ్దాల క్రితం ఇక్కడ వెంపటాపు సత్యం అనే బడి పంతులు భూమి కోసం, భుక్తి కోసం ఉద్యమించి సాయుధ విప్లవం సృష్టించాడు. నేడు అదే గ్రామంలో ఇపుడు చదువుల విప్లవం కూడా మొద లైంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నదే కొండ బారిడి. ఆ పల్లెకు చెందిన ఎస్. మనస్విని ఆంగ్లంలో అరుదైన ప్రతిభ చూపడంతో తనతో పాటు మరో 9 మంది విద్యార్థులను అమెరికాలోని ఐక్యరాజ్య సమితి ఆహ్వానించగా... అక్కడ ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ సంస్థల సదస్సులో పాల్గొని వచ్చింది.‘ఏపీలో విద్యావ్యవస్థపై ఐక్యరాజ్య సమితిలో మాట్లాడాను. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యావిధానం, ‘నాడు–నేడు’తో మా స్కూల్ స్వరూపమే మారిపోవడం గురించి వివరించాను. మన ప్రభుత్వం మాలాంటి పేదల చదువు కోసం చేస్తున్న కృషిని తెలుసుకొని వారు ఎంతో ఆశ్చర్య పోయారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను స్కూల్స్లో ఎలా ప్రవేశ పెడుతున్నారు? వాతావరణ మార్పుల ప్రభావం గురించి చెప్పాను. మారుమూల గిరిజన పల్లెకు చెందిన నాకు ఇదొక మరువలేని అనుభూతి’ అని సంతోషంగా చెప్పింది మనస్విని. సింగిల్ పేరెంట్కు చెందిన ఈ ఆదివాసీ బాలిక గుమ్మలక్ష్మిపురం, కేజీబీవీ స్కూల్లో 9వ తరగతి చదువుతోంది. సర్కారు బడుల్లో చదివే పేద పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించాలనే తప నతో ఆధునిక విద్యాబోధన, మౌలిక వసతుల కల్పన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘నాడు–నేడు’ కార్యక్రమంలో 44,512 ప్రభుత్వ బడులను బాగు చేసే కార్యక్రమాన్ని మూడు దశలుగా విభజించి ముందుకెళుతోంది. ‘అమ్మ ఒడి’ వంటి వినూత్న పథకాలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్స్ను పెంచాయి. దాదాపు 2,47,000 మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల నుంచి ప్రభుత్వ బడులకు మారడం ఇందుకు నిదర్శనం.అరకు నుండి డుంబ్రిగుడ వెళ్లేదారిలో జైపూర్ బస్స్టాప్ ఎదురుగా కొండల మధ్య ఇంద్రధను స్సులా మెరిసిపోతున్న కోట లాంటి రెసిడెన్షియల్ గిరిజన పాఠశాల దగ్గర ఆగాం. విశాలమైన ప్లేగ్రౌండ్లో ఆడుకుంటున్న తమ పిల్లలను చూడడా నికి వచ్చిన పేరెంట్స్ని పలకరించినపుడు...‘ప్రభుత్వం తన ఆలోచనలకు అనుగుణంగా చేపట్టిన పనులతో ఈ ప్రభుత్వ స్కూళ్లు కార్పొరేట్ స్కూళ్లను మించి మారిపోయాయి. మా పాపను ఈ స్కూల్లో చేర్పించడానికి సీట్లు లేక చాలా కష్ట పడాల్సి వచ్చింది. ప్రభుత్వ ప్రయత్నం బాగుంద’ని అన్నారు. ‘గిరిజన గ్రామాల్లో బడులను ఏకపక్షంగా ఇంగ్లిష్ మీడియంలోకి మార్చడం లేదు. ప్రతిదీ పద్ధతి ప్రకారం, శాస్త్రీయ విధానంలో సాగుతోంది. ప్రతి పుస్తకాన్నీ బైలింగ్యువల్ పద్ధతిలో... అంటే ఒక పేజీ ఇంగ్లిష్, పక్క పేజీ తెలుగులో ముద్రించారు . దీని వల్ల పిల్లలు తెలుగును మర్చిపోకుండా ఇంగ్లిషును నేర్చుకుంటున్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం వల్ల బడి మానేసే పిల్లల సంఖ్య పూర్తిగా తగ్గిపోయింద’ని పార్వతీపురం మన్యం జిల్లా, చాపరాయి బిన్నిడి పాఠశాల ఉపాధ్యాయుడు వివరించారు.రాష్ట్రవ్యాప్తంగా 40 వేల తరగతి గదుల్లో ఐఎఫ్బీలు ఏర్పాటు చేసినట్టు ఆమధ్య ఒక ఆంగ్ల ఛానెల్ జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్యూలో సీఎం వై.ఎస్. జగన్ చెప్పినపుడు అవి విద్యార్థులకు ఎలా ఉపయోగపడుతున్నాయో తెలుసుకుందామని, గుమ్మలక్ష్మీపురం గ్రామంలోని ఒక స్కూల్కి వెళ్లాం. అక్కడ విద్యార్థులకు బైజూస్ కంటెంట్తో ఉన్న ట్యాబ్స్ ఇచ్చారు. ఆరో తరగతి నుంచి, ఆపై తరగ తుల్లోని ప్రతి క్లాస్రూమ్లో ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ఏర్పాటు చేశారు. గుండె పనిచేసే విధా నాన్ని డిజిటల్ స్క్రీన్ మీద విద్యార్థులకు టీచర్లు బోధించడం చూశాం. ఇలా ఒక ప్రణాళికా బద్ధంగా పాఠశాల విద్యా రంగంలో వినూత్న మార్పులు మొదలై టీచర్లలో నైపుణ్యం, సామర్థ్యం పెంపుకు కూడా సర్కారు కృషి చేస్తున్నది. ఏపీ విద్యారంగం సరికొత్త మార్పు దిశగా అడుగులు వేస్తోంది. ఇందువల్ల సమాన విద్యావ కాశాలకు నోచుకుంటున్నారు బడుగులు. ఇంతకంటే కావలసినదేముంది?శ్యాంమోహన్ వ్యాసకర్త కార్టూనిస్ట్, జర్నలిస్ట్మొబైల్: 94405 95858 -
పుట్టుకతోనే మతం ముద్రా?!
డీఎన్ఏ వల్ల కలిగే శారీరక, మానసిక వైకల్యాలను సాంకేతికత ద్వారా గుర్తించవచ్చు, సరిదిద్దవచ్చు. కానీ ఒకరి విశ్వాస వ్యవస్థ వల్ల కలిగే బలహీనతలు శాశ్వతంగా ఉంటాయి. ఒక బిడ్డ జన్మించిన మతపు నమ్మకాలే అతడికి వాస్తవికంగా, నిజంగా మారిపోతాయి. పిల్లలు పెరిగే వాతావరణమే వారి మనస్తత్వాన్ని మలచే శక్తిని కలిగి ఉంటుంది. అందుకే పుట్టినప్పుడే పిల్లలకు మతాన్ని అంటగట్టడం అనేది తిరోగమనంతో కూడిన, ప్రమాదకరమైన పద్ధతి. పిల్లల మతాన్ని నమోదు చేయడాన్ని తప్పనిసరి చేసే చట్టం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుంది. అది పితృస్వామ్యాన్నీ, మెజారిటీ వాదాన్నీ ప్రోత్సహిస్తుంది. వారి స్వేచ్ఛపై పరిమితులను విధిస్తుంది. వారి ఎదుగుదలను ఆపివేస్తుంది. ఆ కోణంలో చూస్తే ఇది మానవ హక్కుల ఉల్లంఘనే. అందుకే మతాన్ని ‘వయోజనులకు’ సంబంధించిన అంశంగానే చూద్దాం.ఏప్రిల్ 5 నాటి ప్రముఖ వార్తాపత్రికలోని ఒక ప్రధాన శీర్షిక, ‘జననాల నమోదు కోసం తల్లిదండ్రుల మతాన్ని పొందుపరచనున్న ప్రభుత్వం’ అని చెబుతోంది. జనన మరణాల నమోదు (సవరణ) చట్టం, 2023ను గత ఏడాది ఆగస్టు 11న పార్లమెంటు ఆమోదించింది. జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్), ఓటర్ల జాబితాలు, ఆధార్ నంబర్, రేషన్ కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఆస్తి నమోదు, నోటిఫై చేసిన ఇతర అంశాలతో సహా వివిధ డేటాబేస్లను అప్డేట్ చేయ డానికి ఉపయోగించే జాతీయ స్థాయిలో జనన, మరణ డేటాబేస్ నిర్వహణను ఈ చట్టం తప్పనిసరి చేస్తోంది. పిల్లల మతానికి చెందిన కాలమ్లో తల్లిదండ్రులు వేర్వేరు మతాలకు చెందినవారైతే వారిద్దరి మతాన్ని నమోదు చేయడాన్ని కూడా ఈ సవరణ చట్టం తప్పనిసరి చేస్తోంది. ఇది, మోసపూరితంగా చట్టానికి ఉదారమైన రూపాన్ని ఇస్తోంది. కానీ మాకు సంబంధించి, పుట్టినప్పుడే పిల్లలకు మతాన్ని అంటగట్టడం అనేది తిరోగమనంతో కూడిన, ప్రమాదకరమైన పద్ధతి.వయోజనులు అనే అంశాన్ని ముందు స్పష్టం చేద్దాం. ఇది ఓటు వేయడానికి లేదా వివాహం చేసుకోవడానికి కావాల్సిన చట్టబద్ధమైన వయస్సు కాదు. ఇక్కడ వయోజనుడు అంటే వ్యక్తిగత నైతిక చట్రాన్ని అభివృద్ధి చేసుకునేంత స్థాయిలో ఎదిగిన వ్యక్తి అని అర్థం. మతం అనే పదం వ్యవస్థీకృతమైన మతాలను సూచిస్తుంది.చట్టపరంగా, వయోజనులు భౌతిక స్వభావం గల లక్షణాలను కలిగి ఉంటారు. అయితే, మతం పాక్షికంగా ఆధిభౌతికమైనది. పిల్లలు పొందిన డీఎన్ఏతో దానిని కలపడం అనేది వారి స్వేచ్ఛపై పరి మితులను విధిస్తుంది. వారి ఎదుగుదలను ఆపివేస్తుంది. ఆ కోణంలో చూస్తే ఇది మానవ హక్కుల ఉల్లంఘనే. ఇది ప్రమాదకరమైన చట్టం. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యపు విలువలను దెబ్బతీస్తుంది. అంతే కాక, మతతత్వం, పితృస్వామ్యం, మెజారిటీతత్వాలను ప్రోత్సహిస్తుంది. కొన్ని రాష్ట్రాలు ‘లవ్ జిహాద్’కు (హిందూ అమ్మాయితో ముస్లిం పురుషుడి సంబంధం లేదా వివాహం) వ్యతిరేకంగా చట్టాన్ని ఆమోదించిన వాస్తవాన్ని గమనిస్తే, ఆ నిబంధన అంత అమాయ కమైనది కాకపోవచ్చు. కనీసం, ఇది పితృస్వామికతతో కూడుకుని ఉన్నది.మొదటిది, మానవ హక్కులకు సంబంధించిన ప్రశ్న. ఓటింగ్ లేదా వివాహం గురించిన అవకాశాన్ని ఎంపిక చేసుకోవడానికి ఒక పిల్లవాడు యుక్తవయస్సుకు ఎదగవలసి ఉంటుంది. అయితే, ఓటు వేయమని లేదా వివాహం చేసుకోవాలని ఎవరినీ బలవంతం చేసే చట్టం లేదు. వయోజనుడైన బిడ్డకు ఎంపిక చేసుకోకుండా ఉండటానికి స్వేచ్ఛ ఉంది. కానీ వ్యవస్థీకృత మతం కొన్నిసార్లు ప్రచ్ఛన్నంగా, కానీ తరచుగా నేరుగానే చేయవలసినవీ, చేయకూడనివీ చెబుతుంటుంది. వాటితోపాటు, తప్పు ఒప్పులను విధిస్తుంది. పౌరాణిక సత్యాలు, తల్లిదండ్రులు, ఇతర పెద్దల సాంప్రదాయిక జ్ఞానం, సామాజిక ఒత్తిళ్లు, ‘సంస్కారం’ ఆశించే నియమాలు, ఆచారాలు, సంప్రదాయా లను అంగీకరించడం తప్ప అభాగ్యుడైన బిడ్డకు వేరే మార్గం లేదు. ఇటువంటి సూక్ష్మమైన, కానీ తీవ్రమైన బ్రెయిన్ వాష్ వల్ల, పిల్లల సహజసిద్ధమైన శాస్త్రీయ ఉధృతికి, ఆధ్యాత్మిక, వ్యక్తిత్వ పరమైన ఎదుగుదలకు ఆటంకం కలుగుతుంది.పిల్లల మెదడు అభివృద్ధిలో 80 శాతం జీవితంలో మొదటి 1,000 రోజులలోనే జరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ కాలంలో ఛాందస, ఉదారవాద పరిసరాలు పిల్లల జీవితకాలం చెరగని వైఖరులకు కారణమవుతాయి. పైగా అవి స్థూలంగా తిరోగ మనం, అణచివేత, అమానవీయమైనవి కూడా కావచ్చు. ఏది సరైనది ఏది తప్పు అనే సొంత నైతిక చట్రం ఆధారంగా పిల్లల అభివృద్ధిని వారి పరిసరాలు ప్రభావితం చేస్తాయి. డీఎన్ఏ వల్ల కలిగే శారీరక, మానసిక వైకల్యాలను సాంకేతికత లేదా వైద్య శాస్త్రాల ద్వారా గుర్తించవచ్చు, సరిదిద్దవచ్చు. అయితే ఒకరి విశ్వాస వ్యవస్థ, మానవత్వం, సున్నితత్వం, ప్రవర్తన, ముందుగా నిర్ణయించిన ‘సత్యాల’ వల్ల కలిగే బలహీనతలు శాశ్వతంగా ఉంటాయి. ఒక బిడ్డ జన్మించిన మతపు నమ్మకాలే అతడికి వాస్తవికంగా, నిజంగా మారిపోతాయి.30 ఏళ్ల వయస్సు తర్వాత తాను సాగించిన ప్రయాణంలో, గౌతమ బుద్ధునికి ‘నేను ఇంకా జీవించాల్సిన జీవితం, అది నా స్వభావానికి ప్రతిబింబంగా ఉండితీరాలి’ అనిపించింది. ‘నా భ్రాంతిమయమైన కచ్చితత్వాల ఆశ్రయం నుండి, నా సొంత సరి హద్దుల నుండి నేను విముక్తి పొందాల్సి ఉంటుంది’ అని ఆయన భావించాడు.గౌతముడు ఆధ్యాత్మిక పరిపక్వత సాధించకుంటే, ఆయన తన అసలైన స్వభావాన్ని గుర్తించడంలో విఫలమై, నిజంగా తన సొంతం కాని నమ్మకాలు, అంతర్దృష్టిలో తెలియకుండానే చిక్కుకుని ఉండే వాడు. పర్యవసానంగా, ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యా కులైన వ్యక్తులకు ఓదార్పును అందించి దిశానిర్దేశం చేసిన మానవీయ జీవిత తత్వశాస్త్రం ప్రపంచానికి నిరాకరించబడి ఉండేది. ప్రతి ఒక్కరూ గౌతమ బుద్ధుడిని అనుకరించలేరు కాబట్టి, వారి సొంత ప్రత్యేక మార్గాన్ని ఏర్పరచుకునే పిల్లల సామర్థ్యానికి సామాజిక నిబంధనలు, చట్టం అధిగమించ లేని అడ్డంకులను సృష్టించకూడదు.స్థాపితమైన మతం శాస్త్రీయ ఆలోచనాపరులు, స్వేచ్ఛా ఆలోచనా పరులు, మేధావుల పట్ల విపరీతమైన క్రూర త్వాన్ని ప్రదర్శిస్తుంది. ఉదాహరణకు, రోమన్ క్యాథలిక్ చర్చి, ఇటాలియన్ భౌతిక శాస్త్రవేత్త, ఖగోళ శాస్త్రవేత్త అయిన గెలీలియోను మతవిశ్వాసిగా ముద్ర వేసి శిక్షకు గురిచేసింది. 1633లో, గెలీలియోపై చర్చి... సూర్యుడు ప్రపంచానికి కేంద్రం మరియు నిశ్చలమనీ; భూమి దాని చుట్టూ తిరుగుతుందనీ... తప్పుడు, మత గ్రంథాలకు విరుద్ధంగా భావించే నమ్మకాన్ని ఆమోదించాడనీ ఆరోపించింది. హాస్యాస్పదంగా, గెలీ లియో పేర్కొన్న ఈ సంచలనాత్మక ఆవిష్కరణలు న్యూటన్, ఐన్ స్టీన్ సిద్ధాంతాలకు పునాది వేయడమే కాకుండా, ఈ రోజు మనకు తెలిసిన ఆధునిక భౌతికశాస్త్ర అభివృద్ధికి మార్గం సుగమం చేశాయి.‘ద చైల్డ్ ఈజ్ ఫాదర్ ఆఫ్ ద మ్యాన్’ అనే పదబంధం, విలియం వర్డ్స్వర్త్ కవిత ‘మై హార్ట్ లీప్స్ అప్’ నుండి ఉద్భవించింది. ఇది కేవలం కవిత్వ వ్యక్తీకరణ మాత్రమే కాదు. వరుసగా తరాలను రూపొందించడంలో పిల్లలు కీలకమైన పాత్ర పోషిస్తారనే లోతైన సత్యాన్ని ఇది వ్యక్తీకరుస్తుంది. పిల్లలు పెరిగే వాతావరణమే వారి మనస్తత్వాన్ని మలచే శక్తిని కలిగి ఉంటుంది. అంటే అదే వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ, ఈ ప్రభావం ద్వంద్వ స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఇది స్వధర్మం ముసుగులో ఉన్న మతతత్వం, కులతత్వం, ద్వేషపు తాలూకు హింసాత్మక వ్యక్తీకరణల వంటి విభజన భావజాలాలను పిల్లల్లో శాశ్వతంగా కలిగించడంలోనో లేదా బాధితులుగా మార్చడంలోనో గణ నీయమైన ప్రభావాన్ని కలిగివుంది. ఇటువంటి ధోరణులు మెజారిటీ వాదాన్ని పెంపొందించవచ్చు. సామాజిక, ఆర్థిక అసమానతలకు వ్యక్తులను స్పందించకుండా చేయవచ్చు. శతాబ్దాల తరబడి వారసత్వంగా వచ్చిన నమ్మకాల్లో స్థిరపడిన మంచి ఉద్దేశం ఉన్న తల్లిదండ్రులు కూడా అనుకోకుండా తమ పిల్లల నిజమైన సారాన్ని అణచివేయవచ్చు. ఇక, చట్టసభ సభ్యులు క్రూరత్వానికి చెందిన అటువంటి రూపాలను శాశ్వతం చేసి సంస్థాగతీకరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు.– అశోక్ లాల్ ‘ రచయిత, నాటకరంగ కళాకారుడు– నసీరుద్దీన్ షా ‘ హిందీ, ఉర్దూ నాటక రచయిత, నటుడు -
జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
పేదరికం అత్యంత బాధాక రమైనది. ప్రపంచంలో అత్యధి కులు పేదవారే. వారిని పేద రికం నుండి బయట పడేయ గలదీ, అభివృద్ధి వైపు నడప గలిగేదీ ప్రభుత్వ సంక్షేమ పథకాలే. దీనిని అర్థం చేసుకొన్నారు కాబట్టే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారు. ప్రజల విశ్వసనీయతను చూరగొన్నారు. ఇప్పుడు మరోమారు ప్రజా సేవ చేయడానికి అవకాశం ఇవ్వమని ఎన్నికల బరిలో దిగారు. పలు పబ్లిక్ మీటింగులూ, సుదీర్ఘ రాజకీయ యాత్రలతో విజయం వైపు నడుస్తున్నారు.ఇక ప్రతిపక్ష కూటమి నాయకుడు చంద్రబాబు మాత్రం అభద్రతా భావంతో ఎన్నికల్లో నానా తిప్పలు పడుతున్నారు. చెప్పుకోవడానికి ప్రజలకు తాను చేసింది ఏమీ లేదు కాబట్టి జగన్ ప్రభుత్వంపై దుష్ప్ర చారాలు చేస్తున్నారు. ఆయనకు ప్రజల్లో క్రెడిబిలిటీ లేదు. జనసేన – బీజేపీ నాయకులూ, ఆ యా పార్టీల పరిస్థితీ కూడా ఇదే. అందుకే, టీడీపీ 2024 ఎన్నికల్లో ఘోరంగా మరలా ఓడిపోవడం తథ్యం. పెన్షనర్లలో 90 శాతం, ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల ఆర్థిక లాభాలు పొందుతున్న 40–60 ఏళ్ల వయస్సు స్త్రీలలో 90 శాతం, డ్వాక్రా మహిళల్లో 80 శాతం, మొత్తంగా స్త్రీలలో 90 శాతం వైఎస్సార్సీపీకే ఓటు వేసే పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఎస్సీ, ఎస్టీలు, క్రిస్టియన్లు, ముస్లింలు, రెడ్లు, బ్రాహ్మణులు, అత్యధిక మంది బీసీలు వైఎస్సార్సీపీకే ఓట్లు వేసే పరిస్థితి ఉంది. కొంతమంది మధ్యతరగతి అర్బన్ ఓటర్లు మాత్రమే టీడీపీ కూటమికి ఓట్లు వేస్తారని అంటున్నారు. కాంగ్రెస్కు గతం కంటే అర శాతం మాత్రమే ఓట్లు పెరగవవచ్చు.అయోధ్యలో గుడి నిర్మాణం, కొన్ని జాతీయ రహదారులను నిర్మించడం తప్ప బీజేపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. ఏపీకి సంబంధించి... ఏపీకి స్పెషల్ స్టేటస్, రాయలసీమ – ఉత్తరాంధ్రకు ప్యాకేజీ, పోల వరానికి ని«ధులు వంటి అనేక వాగ్దానాలను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నెరవేర్చలేదు. ఇదీ బీజేపీ క్రెడిబిలిటీ!జVýæన్ మాత్రం పేదల ముఖ్య అవసరాల్ని తీరుస్తూ, అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని కూడా చేపడుతున్నారు. పేదల కొనుగోలు శక్తిని కోవిడ్ లాంటి క్లిష్ట సమయాల్లో కూడా పెంచగలిగారు. అందుకే 2019లో 12 శాతం ఉన్న పేదరికం 2024 నాటికి దాదాపు 4 శాతానికి తగ్గిపోయింది. జీఎస్టీ చెల్లింపుల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచారు జగన్. జగన్ ప్రభుత్వం పేదలకు డీబీటీ కింద రూ. 2,70,000 కోట్లను, నాన్–డీబీటీ కింద ఇండ్లు, స్థలాలు వంటి రూపాల్లో రూ. 1,00,000 కోట్లకు పైగా ఇచ్చారు. మొత్తంగా నాలుగున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చింది జగన్ ప్రభుత్వం. అంతేగాక పాలనా వ్యవస్థలో, సంక్షేమ సేవల్లో, అభివృద్ధిలో విప్లవాత్మక మార్పుల్ని తెచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిచేట్లు చేశారు వైఎస్ జగన్. ముఖ్యంగా గ్రామ/వార్డు సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థ, ఆరోగ్య శ్రీకి రూ. 25 లక్షల వరకూ ప్రభుత్వ సాయాన్ని పెంచడం, వృద్ధాప్య పింఛన్ను రూ. 3 వేల వరకు పెంచడం, స్త్రీ సాధికారత కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టడం; రాజకీయాల్లోనూ, ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లోనూ... మహిళలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం; వలంటీర్ వ్యవస్థ, రైతుభరోసా, ఉచిత పంటల భీమా, ఆక్వా రైతులకు తక్కువ ధరకు విద్యుత్, అమూల్ ద్వారా ఎక్కువ పాల ధర ఇవ్వడం, భూముల సర్వే, భూపట్టాల ధ్రువీకరణ, నాడు – నేడుతో పాఠశాలల రూపు మార్చడం, ఇంగ్లీష్ మీడియం విద్య, ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన, విద్యా కానుక... ఇలా ఎన్నో సంక్షేమ పథకాలతో ప్రజల మనసులను జగన్ దోచుకున్నారు.మరి చంద్రబాబు ఇలాంటి వేటినీ చేపట్టలేదు. ఇలాంటివి ఏ ఒక్కటీ చేశానని ఆయన చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. ఆయన ప్రతి ఎన్నికలప్పుడూ పలు పథకాల్ని ప్రకటించడం, ఎన్నికలు అయిపోయాక వాటి అమలు మరచిపోవడం చేసేవారు. అంతేగాక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల విషయంలో మాట్లాడ కూడని మాటలు మాట్లాడేవారు. అందుకే ఆయన జనంతో సంబంధాల్ని మానసికంగా కోల్పోయారు. రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పి చేయక పోవడం, పొదుపు సంఘాలకు రుణమాఫీ అమలు పరచక పోవడం, కొత్తగా జన్మించిన ఆడబిడ్డకు ‘మహాలక్ష్మి’ పథకం కింద ఇస్తానన్న డబ్బు ఇవ్వక పోవడం, ఇంటింటికీ ఒక ఉద్యోగం – ఉద్యోగం ఇవ్వలేకుంటే నెలకు రూ. 2 వేలు ఇస్తానని ఇవ్వక పోవడం; పేదలకు మూడు సెంట్ల నేల, ఇల్లు, బీసీలకు సబ్ ప్లాన్, స్త్రీ రక్షణ ఫోర్స్ ఏర్పాటు, పసుపు–కుంకుమ పథకం లాంటి వాటిని అమలు చేయకుండా జనాన్ని మోసగించారు. విద్యను, వైద్యాన్ని వ్యాపారీకరణ చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే బాబు వైఫల్యాలు ఎన్నో!బాబు ఘోర వైఫల్యం చెందిన అనంతరం పరి పాలనా పగ్గాలు చేపట్టిన జగన్ ఏపీలోని ప్రతి కుటుంబానికీ ఏదో ఒక రూపంలో మేలు చేశారు. అందుకే తాను ఏదైనా మేలు చేశానని నమ్మితేనే తనకు ఓటు వేయమని ఆయన ధైర్యంగా ప్రజలను అడుగు తున్నారు.ప్రొ‘‘ దేవిరెడ్డి సుబ్రమణ్యం రెడ్డి వ్యాసకర్త ఎస్వీ యూనివర్సిటీ చరిత్ర శాఖవిశ్రాంత ఆచార్యులు ‘ 98495 84324 -
ఇలాగేనా మాట్లాడేది?
‘‘ఇంతకుముందు వారి (కాంగ్రెస్) ప్రభుత్వం ఉన్నప్పుడు, దేశ సంపదపై మొదటి హక్కు ముస్లింలదే అని చెప్పారు. అంటే దీనర్థం ఈ సంపదనంతా పోగేసి, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి, చొరబాటుదారులకు పంచుతారని అర్థం. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును చొరబాటుదారులకు ఇవ్వాలా? అది మీకు సమ్మతమేనా?’’ అని ఒక లౌకికవాద దేశానికి ప్రధానమంత్రి తోటి పౌరుల గురించి మాట్లాడడం తగినదేనా? ‘వారు’ కూడా సమాన హక్కులు, సమాన స్వేచ్ఛ ఉన్న మనందరిలోని వారు కారా? లేదంటే వారు విదేశీయులు, గ్రహాంతరవాసులూనా? అలా మాట్లాడటాన్ని ఆయన్ని అభిమానించేవారు సమర్థిస్తున్నట్లు్ల అనిపిస్తోంది. లేకుంటే ఆయన అలా అనటాన్ని ఆపి ఉండేవారా? తనను సరిదిద్దుకునేవారా?ప్రధానమంత్రులు ఎల్లవేళలా సరైన, గౌరవ ప్రదమైన పనే చేస్తారన్న భావన ఉన్న యుగంలో నేను పెరిగాను. అంతేకాదు, ప్రధాని చెప్పారంటే ఇక అది సరైనది అయినట్లే! మాటల్లో పొల్లుపోవటం అత్యంత సహజం అయి నప్పటికీ, జవహర్లాల్ నెహ్రూకు కూడా అలా జరిగేదంటే నా తల్లి తండ్రులు అస్సలు నమ్మేవారు కారు. ఆ పాతకాలపు ప్రామాణికతకు ఆయనొక శ్రేష్ఠమైన నమూనాగా పరిగణన పొందారు. ‘యాభైలు’, ‘అరవైల’ నుంచి మనం చాలా దూరం ప్రయాణించి వచ్చాం. ఈ రోజుల్లో ఒక రాజకీయ నాయకుడి గురించి మీరు ఊహించరానిదేమీ ఉండదు. ఏ ఉత్కృష్టులైన వారినో పక్కన పెడితే ప్రధానమంత్రులూ ఇక ఏమాత్రం భిన్నమైన వ్యక్తులుగా మిగిలి లేరు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాతి దశాబ్దంలో వారి పట్ల కనిపించిన సహజమైన గౌరవభావన, వారంటే ఉండే కొద్దో గొప్పో ఆరాధన పూర్తిగా కనుమరుగయ్యాయి. ‘సబ్ చోర్ హై’ (అందరూ దొంగలే) అన్నదే ఎక్కువగా వ్యాప్తిలో ఉన్న నమ్మకం అయింది.ఇప్పటికి కూడా, నా అత్యంత నిరాశావాద, చీకటిమయ మనః స్థితుల్లో సైతం– తన సొంత, తోటి పౌరులలో ఒక గణనీయమైన వర్గం మీద ఒక ప్రధాని దాడి చేస్తూ, వారిని పిశాచాలుగా చూపటం వింటానని నేనెప్పుడూ అనుకోలేదు. అదేపనిగా అందుకోసం మార్గా లను కనుగొంటారని కూడా! ఆయనను అభిమానించేవారు తెలివిగా దీనిని... అదేపనిగా అని కాక, అనేకసార్లు అని అనవచ్చు. ఆయన అలా చేయటాన్ని వారు ఆనందిస్తున్నట్లు, సమర్థిస్తున్నట్లు, సహేతుక మేనని భావిస్తున్నట్లు అనిపిస్తోంది. లేకుంటే కచ్చితంగా ఆయన అలా చేయటాన్ని ఆపి ఉండేవారా? తనను తను సరిదిద్దుకునేవారా? బహుశా పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేసేవారా? కానీ అలా జరగక పోగా, అవి పునరుద్ఘాటనలు అవుతున్నాయి. బహిరంగంగా, శక్తిమంతంగా, స్థానాలను మార్చుకుంటూ కొనసాగుతున్నాయి. మొదట చెప్పినదానినే ఉన్నది ఉన్నట్లుగా మళ్లొకసారి చెబుతాను. నా ప్రతిస్పందన అర్థంచేసుకోదగినదా లేక అతిశయోక్తితో కూడినదా అని మీకై మీరు ఆలోచించండి. ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ పత్రికలో వచ్చిన దానిని బట్టి హిందీలో ఆయన మాట్లాడిన మాటలు సరిగ్గా ఇవే: ‘‘పెహ్లే జబ్ ఉన్కీ సర్కార్ థీ, ఉన్హోనే కహా థా కీ దేశ్ కీ సంపతీ పర్ పెహ్లా అధికార్ ముసల్మానోం కా హై. ఇస్కా మత్లబ్, యే సంపతీ ఇకఠ్ఠీ కర్కే కిస్కో బాటేంగే? జిన్కే జ్యాదా బచ్చే హై, ఉన్కో బాటేంగే, ఘుస్పైఠియోన్ కో బాటేంగే. క్యా ఆప్కీ మెహనత్ కీ కమాయి కా పైసా ఘుస్పైఠియోన్ కో దియా జాయేగా? ఆప్కో మంజూర్ హై యే?’’ (‘ఇంతకుముందు వారి (కాంగ్రెస్) ప్రభుత్వం ఉన్నప్పుడు, దేశ సంపదపై మొదటి హక్కు ముస్లింలదే అని చెప్పారు. అంటే దీనర్థం ఈ సంపదనంతా పోగేసి, ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి, చొరబాటుదారులకు పంచుతారని అర్థం. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును చొరబాటుదారులకు ఇవ్వాలా? అది మీకు సమ్మతమేనా?’)మరి, ‘ఎక్కువమంది పిల్లలను’ కలిగివున్న ఆ వ్యక్తులు ఎవరు? ‘చొరబాటుదారులు’ అని పిలవబడుతున్న ఈ వ్యక్తులు ఎవరు? స్పష్టంగానే ఉంది కదా, మొదటి వాక్యాన్ని బట్టి ఇంకా స్పష్టంగా లేదా? ఇంకా ఏమైనా సందేహమా? అలాగే పైన పేర్కొన్న ‘ముసల్మా నులు’ ఎవరు? వారు భారతదేశ ముస్లింలు కారా? మన తోటి పౌరులు కారా? సమాన హక్కులు, సమాన స్వేచ్ఛ కలిగి ఉన్న మనందరిలోని వారు కారా? లేదంటే వారు విదేశీయులు, బయటి వ్యక్తులు, గ్రహాంతరవాసులూనా?ఇప్పుడు చెప్పండి, నా ప్రశ్నకు మీ సమాధానం ఏమిటి? దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తే నేను అమాయకుడిని అవుతానా? ఇంకా చెప్పాలంటే కదిలిపోవటానికి ? లేదా ఆ విధమైన ఆరోపణలను మీరు మన ప్రధా నులు ఎవరినుంచైనా విని ఉన్నారా?డోనాల్డ్ ట్రంప్ తరచూ ఇలా మాట్లాడ్డం నాకు తెలుసు. ఆయన అలా మాట్లాడినప్పుడు మనకు వికారం పుడుతుంది. 1960లలో బ్రిటన్లో ఇనాక్ పావెల్ ఇలాగే మాట్లాడితే అక్కడి ఆధిపత్య సమాజ సమూహం ఆయన మాటల్ని పట్టించుకోలేదు. కానీ మన తరంలోని ప్రజ్ఞాసింగ్ ఠాకూర్లు, సాధ్వీ రుతంభరలు ఇటువంటి వాక్చాతు ర్యాన్ని ఆస్వాదిస్తారనడంలో సందేహమే లేదు. అయితే అందుకు వారు తిరిగి పొందేది ధిక్కారాన్ని, ఎగతాళిని మాత్రమే! నా బోళాతనం బహుశా మీ దృష్టిలో తీవ్రంగా దెబ్బతిని ఉంటుందని నేను అంగీకరిస్తున్నప్పటికీ, ఇప్పటికైతే నన్ను ఆశ్చర్యపరిచే విషయం వేరొకటి ఉంది. అది మన మీడియా స్పందన. ఒకవేళ అలాంటిదేమైనా ఉండివుంటే, నాకైతే ఆందోళన కనబడలేదు, ఏహ్యభావం కనబడలేదన్నదైతే నిశ్చయం. బహుశా నేను చదవాల్సిన పత్రికల్ని చదవలేదేమో! చూడాల్సిన టీవీ చానెళ్లను చూడలేదేమో! కానీ నాకు అనిపించింది ఏమిటంటే, చెప్పినదాన్ని మౌనంగా అంగీ కరించారని! అంగీకరించకపోయినా, కనీసం దానిమీద వ్యాఖ్యానించ నైనా లేదు. విమర్శ అయితే అసలు చేయలేదు. అది ఖండనార్హమైనది కాదని నేను అనుకుంటే తప్ప నాకది దాదాపుగా నమ్మకశ్యంగా లేదు. దీన్ని కూడా మీరు అంగీకరిస్తారా?క్షమించండి. నేను ఈరోజు చాలా ప్రశ్నలు సంధించి మీకు అతి కొద్ది సమాధానాలు మాత్రమే ఇచ్చాను. కానీ నా అభిప్రాయాలను మీపై రుద్దడం నాకు ఇష్టం లేదు. బదులుగా, మీరేం అనుకుంటున్నారో తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. కనుక మరొక చివరి ప్రశ్నకు నన్ను మన్నించండి: ఒక లౌకిక ప్రజాస్వామ్య దేశానికి ప్రధాన మంత్రి అయిన వారు భిన్న మత విశ్వాసాన్ని కలిగిన తోటి పౌరుల గురించి ఇలా మాట్లాడడం తగినదేనా? మరింత కచ్చితంగా అడగాలంటే, నైతికంగా సరైనదేనా?కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
శ్రామిక వర్గ మహోపాధ్యాయుడు
ప్రపంచాన్ని మలుపుతిప్పిన ఘటనల్లో ఒకటి కమ్యూనిస్ట్ సిద్ధాంతకర్త కారల్ మార్క్స్ జననం. జర్మనీ (ప్రష్యా)లో పుట్టిన ఆయన విద్యాభ్యాసం అనంతరం పాత్రికేయ వృత్తిని ఎంచుకున్నారు. కొంతకాలం తర్వాత ఫ్రాన్స్ వెళ్ళారు. అక్కడే ఆయన జీవితకాల ఉద్యమ సిద్ధాంత మిత్రుడు ఫ్రెడరిక్ ఏంగిల్స్ను కలుసు కున్నారు. ఫ్రాన్స్ ఆయన్ని దేశం నుంచి బహిష్కరించడంతో ముందు బెల్జియం ఆ తర్వాత ఇంగ్లండ్ (లండన్) వెళ్లి మిగిలిన జీవితమంతా తన భార్యాబిడ్డలతో అక్కడే గడిపారు. మార్క్స్ తన జీవితకాల మిత్రుడు, సహచరుడు, సిద్ధాంతకర్త అయిన ఫ్రెడరిక్ ఏంగిల్స్తో కలిసి ‘కమ్యూ నిస్టు లీగు’ ఏర్పాటు చేసి 1848లో ‘కమ్యూనిస్టు ప్రణాళిక’ను ఏంగిల్స్తో కలిసి రాశారు. 1867లో ‘దాస్ క్యాపి టల్’ మొదటి వాల్యూమ్ను ప్రచురించారు.మానవ సమాజ సమూహ సంబంధాలు అన్నిటినీ కార్ల్ మార్క్స్ ‘ఫ్రెడరిక్ ఏంగిల్స్లు శాస్త్రీయంగా నిరూ పించారు. ఆదిమ కమ్యూనిస్టు సమాజం నుండి బానిస సమాజం, బానిస సమాజం నుండి ఫ్యూడల్ సమాజం, ఫ్యూడల్ భూస్వామ్య సమాజం నుండి పెట్టుబడిదారీ సమాజం, పెట్టుబడిదారీ సమాజం నుండి సోషలిస్టు సమాజానికి మానవ సమాజం ఎలా పరిణామం చెందు తుందో... సోషలిస్టు సమాజం నుండి అంతిమంగా కమ్యూనిస్టు సమాజం వైపు వర్గహిత సమాజం వైపు ఎలా మానవ సమాజం ప్రయాణిస్తుందో శాస్త్రీయంగా మార్క్స్–ఏంగెల్స్లు నిరూపించారు, సిద్ధాంతీకరించారు. మానవ సమాజ పరిణామ క్రమంలో శ్రమ పాత్రనూ, శ్రమ ఔన్నత్యాన్నీ, సర్వసంపదలకు శ్రమే మూలం అన్న విషయాన్నీ మొట్టమొదటిసారిగా ప్రపంచంలో సిద్ధాంతీకరించిన తత్వవేత్తలు కారల్ మార్క్స్, ఏంగెల్స్లు. కార్మికుని అదనపు శ్రమే ‘పెట్టుబడి’ అనే విషయాన్ని బహుముఖ కోణాల నుంచి పరిశోధన చేసి ‘దాస్ క్యాపిటల్’ను ప్రపంచానికి అందించారు. గతి తర్కాన్ని, చారిత్రిక భౌతిక వాదాన్నీ, తలకిందులుగా ఉన్న హెగెల్ తత్వ శాస్త్రాన్నీ, అందులోని భావవాదాన్నీ సరిదిద్ది భౌతిక వాదం తన కాళ్ళ మీద తను నిలబడే టట్లుగా రూపొందించారు మార్క్స్. అభివృద్ధి నిరోధకమైన పాత వ్యవస్థ, అభివృద్ధి కరమైనటువంటి కొత్త వ్యవస్థను అనుమతించదు. అందుచే బల ప్రయోగం ద్వారా పాత అభివృద్ధి నిరోధక వ్యవస్థను నెట్టివేయాలనీ, కూలదోయాలనీ మార్క్స్ శాస్త్రీయంగా వివరించారు. మార్క్స్ తదనంతరం పెట్టుబడిదారీ వ్యవస్థ సామ్రాజ్యవాద రూపం తీసుకున్నది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నత రూపమే సామ్రాజ్యవాదం అని లెనిన్ సిద్ధాంతీకరించారు. మార్క్సిజాన్ని రష్యా పరిస్థితులకు అన్వయించి కార్మిక వర్గ నాయకత్వాన, కర్షకవర్గం మైత్రితో లెనిన్ సోషలిస్ట్ విప్లవాన్ని విజయవంతం చేశారు.– మన్నవ హరిప్రసాద్, సీపీఐ (ఎమ్ఎల్) రెడ్ స్టార్ పాలిట్ బ్యూరో సభ్యుడు(నేడు కారల్ మార్క్స్ జయంతి) -
దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి... రెండు పగ్గాలను ఒకే చేత్తో పట్టుకొని ప్రభుత్వాన్ని జనరంజకంగా నడపడం సాధారణ విషయం కాదు. గత ఐదేళ్లుగా రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నడకను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. తాను పాలన చేపట్టేనాటికి ఉన్న అస్తవ్యస్తమైన పాలనను గాడిలో పెట్టడమే గాక ప్రతి పథకాన్నీ ఒక విజన్తో రూపొందించడం జగన్ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. విద్య, వైద్యం, మౌలిక అవస్థా పనా సౌకర్యాల ఏర్పాటు, వ్యవసాయం, రైతు సంక్షేమం, బడుగు ప్రజలకు ఆవాసం... ఇలా ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా వాటి వెనుక సంక్షేమం, అభివృద్ధి అనే రెండు కాన్సెప్టులూ పడుగు పేకల్లా కలిసే కనిపిస్తాయి.రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ మాత్రమే మనకు మిగిలితే, ఆ సంఖ్యను రెట్టింపు చేసి 26 జిల్లాల రాష్ట్రంగా మార్చడంలో జగన్ విజన్ ఏమిటో మనకు స్పష్టమ వుతుంది. అధికార వికేంద్రీకరణ జరిగితేనే ప్రజల వద్దకు పాలన అనే విజన్ కార్యరూపంలోకి వస్తుంది గనుక జిల్లాలను విభజించి కలెక్టర్లు, ఎస్పీలు ప్రజలకు మరింత దగ్గరయ్యేట్లు చేశారు. గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ప్రభుత్వ పథకాలను ప్రజలముంగిటకు చేర్చారు. ఏ శ్రేయో రాజ్యంలోనైనా ఉద్యోగ కల్పన అనేది చాలా ముఖ్యమైన అంశం. ప్రజలకు ఎంత ఎక్కువగా ఉపాధి సమ కూరితే రాష్ట్రం అంత ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర విభజన తర్వాత మొదటి అయిదేళ్లలో టీడీపీ ప్రభుత్వం 34 వేల ఉద్యోగాలు మాత్రమే ఇవ్వగా, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు నాలుగు లక్షలకు పైనే ఉద్యోగాలు ఇచ్చింది. దీనికి అధికారికమైన లెక్కలు ఉన్నాయి. వాటిలో పర్మి నెంట్ ఉద్యోగాలే 2.31 లక్షలు ఉన్నాయంటే యువతకు ఉద్యో గాల కల్పన అంశానికి జగన్ ప్రభుత్వం ఎంతటి ప్రాధాన్యమిచ్చిందో అర్థమవుతుంది. సరైన విజన్ అంటే ఇదేకదా!!ఉద్యోగాలు ఇంత పెద్ద ఎత్తున ఇవ్వడమేకాదు, ముందు ముందు యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం వాటికి ‘నైపుణ్య శిక్షణ’ ఇచ్చే కార్యక్రమాలు రూపొందించడం మరింత ప్రత్యేకమైనదిగా చెప్పవచ్చు. ఇంజినీరింగ్, ఇతర విభాగాలలో విద్యార్థుల నైపుణ్యాలను మరింత మెరుగుపరచి వారిని వివిధ పరిశ్రమల్లో పనిచేయడానికి అర్హులుగా చేయడానికి ప్రతి పార్లమెంటు నియోజకవర్గ కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు, తిరుపతి, విశాఖ నగరాల్లో స్కిల్ డెవలప్మెంట్ వర్సి టీలు కూడా సంకల్పించారు. విద్యార్థులకు మెరుగైన భవిష్యత్తు ఇవ్వాలనుకొనేవారు ఏ విధంగా ఆలోచిస్తారో దీనిని బట్టి తెలుసు కోవచ్చు. సమాజంలోని వివిధ ప్రాధాన్య వర్గాలను బేరీజు వేసుకొని వారికి సరిపోయే ప్రణాళిక రూపొందించాలనేది సరైన విజన్ ఉన్న నేతకే సాధ్యమవుతుందని కూడా దీనిని బట్టి అర్థమవుతుంది.బడుగు ప్రజలు కూడా సమాజంలోని అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనీ, అభివృద్ధి ఫలితాలు వారు కూడా అందు కోవాలనే లక్ష్యంతో జగన్ తమ మొదటి మేనిఫెస్టోలోనే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రకటించారు. ‘నవరత్నాల’ను ప్రజలందరికీ అందించారు. కొద్ది రోజుల క్రితం విడుదల చేసిన రెండో మేనిఫెస్టోలో... గతంలో ఇచ్చిన హామీలను ఎలా నెరవేర్చారో తెలియజేసి, కొత్తగా మరికొన్ని పథకాలను ప్రతిపాదించారు. వాటిలో ముఖ్యంగా పేద పిల్లల చదువులకు ముఖ్యమంత్రి ఎంత ప్రాధాన్యమిచ్చారో చూస్తే అర్థమవుతుంది. ఆడపిల్లలు బాగా చదువుకోవాలనీ, అన్ని రంగాలలో ముందుకు వెళ్ళాలనే లక్ష్యంతో ప్రాథమిక విద్య నుంచి అనేక పథకాలను ప్రవేశపెట్టారు. ‘అమ్మఒడి’, ‘విద్యా దీవెన’ ‘కళ్యాణమస్తు’, వంటి పథకాలుఅందుకే ప్రజల ఆదరణను అంతగా చూరగొన్నాయి. ఆరోగ్యం, విద్య, జీవన ప్రమాణాలు... ఈ మూడు అంశా లలో రాష్ట్రం సాధించిన ప్రగతినే ‘వాస్తవ అభివృద్ధి’గా చెబుతారు. అందుకే ఈ అంశాలకు జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువ ప్రాధాన్యమిచ్చినట్లు కనిపిస్తుంది. మానవాభివృద్ధి పథ కాలు ఎంత ఎక్కువగా అమలైతే, సంక్షేమం అంత అభివృద్ధిగా మారుతుంది. ఇది తెలియని చాలా మంది సంక్షేమాన్ని అభివృద్ధిని వేర్వేరుగా చూస్తుంటారు. సంక్షేమం ముందుకు వెళ్తే అభివృద్ధిగా మారుతుందనే సిద్ధాంతాన్ని జగన్ నమ్మారు కనుకనే జగన్ అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయగలుగుతున్నారు. ప్రజలు ఆరోగ్యవంతులైతేనే ఎన్ని పనులైనా చేయగలుగుతారు. దానిని దృష్టిలో ఉంచుకొనే ఆరోగ్యరంగాభివృద్ధికి ప్రభుత్వంపలు కొత్త పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోంది. వైఎస్సార్ పేరిట, జగన్ పేరిట పలు పథకాలు అమలవు తున్నాయి. కొత్తగా పలువైద్య కళాశాలల ఏర్పాటుకు కృషి జరుగుతోంది.‘ఆరోగ్య శ్రీ’ ద్వారా రూ. 25 లక్షల విలువైన వైద్య చికిత్స అందించడానికి జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేశంలో పేరుపొందింది. పేదలు చికిత్స కోసం ఎలాంటి అప్పులు చేయ రాదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. ఆరోగ్యశ్రీ పరిధిని విస్తరించడం, ఉచిత సేవలను ఎక్కువ ఆసు పత్రులకు విస్తరించడం, చివరకు కేన్సర్ చికిత్స కూడా ఉచితంగా అందించడం ఎంతో విశేషం. చికిత్స అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయంలో ‘ఆరోగ్య ఆసరా’తో ఆదుకుంటున్నది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. వృద్ధాప్య పెన్షన్ పెంపు, ‘వైఎస్సార్ చేయూత’ వంటి పథకాల ద్వారా ఏ ఇంటిలోనూ ఎలాంటి సమస్యలు లేని వాతావరణం సృష్టించడంకంటే ‘శ్రేయోరాజ్య’నికి అసలైన అర్థం ఇంకేం ఉంటుంది?పాలనలో పిరమిడ్ నమూనాను పక్కన పెట్టి, చతురస్ర నమూనాను స్వీకరించడం జగన్ ప్రత్యేకత. ప్రభుత్వ పథకాలు అమలు అన్ని వైపులకు విస్తరించడానికి (అధికార యంత్రాంగం సమాజంలోని ఏ వర్గాన్ని వదలకుండా పథకాల ప్రయోజనాలు అందరికీ అందేట్లు చేయడం) ఈ చతురస్ర నమూనాను అనుస రించడం ఒక చక్కని ప్రయోగం. ఇలా ఒకటి రెండు కాదు, ‘జగన్’ను తెర మీద పరచే కార్యక్రమాలు, పథకాలు అనేకానేకం. అన్నీ ప్రజాదరణ పొందడం ఒక విశేషం. వాటన్నిటితో పాటు మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే మరింత కొత్త ‘విజన్’తో ముందుకు వస్తానని జగన్ ప్రకటించడం ముదావహం.- వ్యాసకర్త ఏపీ మాజీ శాసనసభ్యులు ‘ 98481 28844- అడుసుమిల్లి జయప్రకాష్
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
'జబర్దస్త్' కమెడియన్కి ప్రమాదం.. తుక్కు తుక్కయిన కారు!
బాటిల్స్ లో నో పెట్రోల్...ఈసీ ఆదేశం
తెలంగాణాలో మరో 3 రోజులు వర్షాలు
పదేళ్లలో ఫస్ట్టైమ్! టీసీఎస్ను మించిన మరో టాటా కంపెనీ..
చిరుత కదలికలపై టీటీడీ స్పెషల్ ఫోకస్
స్వాతి మలివాల్ కేసులో సాక్ష్యాలు మాయం?!
ఓటీటీలోకి వచ్చేస్తున్న హారర్ మూవీ.. ఈ నెలలోనే స్ట్రీమింగ్
HYD: జ్యువెల్లరీ షాప్ ఓపెనింగ్లో రాశీఖన్నా సందడి (ఫొటోలు)
సిట్ ఎంట్రీతో అజ్ఞాతంలోకి కొంతమంది అనుమానితులు
Virat Kohli: కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లి, అనుష్క.. వీడియో వైరల్
తప్పక చదవండి
- బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- Weekly Horoscope: ఈ రాశి వారికి చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు
- ఎయిర్పోర్ట్లో సీఎం జగన్ను అడ్డుకునేందుకు కుట్ర
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement