-
వసూళ్లపై విజిలెన్స్ ఆరా!
సాక్షి, విశాఖపట్నం : విద్యుత్ కనెక్షన్ల మంజూరులో వసూళ్ల పర్వానికి పాల్పడుతున్న వైనంపై విజిలెన్స్ అఽధికారులు ఆరా తీస్తున్నారు. గతేడాది కాలంగా ఎక్కడెక్కడ ఎన్ని వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేశారో.. దానికి సంబంధించిన వివరాలను విజిలెన్స్ సేకరిస్తోంది. ఉమ్మడి విశాఖలో తరచుగా జరుగుతున్న విద్యుత్ ప్రమాదాలపై ‘సమన్వయ లోపంతో షాక్’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై విజిలెన్స్ దృష్టిసారించింది. మరోవైపు కథనంపై ఈపీడీసీఎల్ సర్కిల్ అధికారులు స్పందిస్తూ విద్యుత్ భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించే విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. అదేవిధంగా సబ్బవరం, ఇతర మండలాల్లో రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చే విషయంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న సిబ్బందిపై దృష్టిసారిస్తున్నామనీ.. బాధ్యులపై చర్యలకు ఉపక్రమిస్తామని ఎస్ఈ మహేంద్రనాథ్ అన్నారు. రెండు నెలల కాలంలో జరిగిన ప్రమాదాల్లో మృతి చెందిన హెల్పర్స్.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మరమ్మతులు చేపట్టేందుకు వెళ్లడం వల్ల దురదృష్టకరమైన ఘటనలు చోటుచేసుకున్నాయన్నారు. ఈ విషయంలో మిగిలిన వారందరికీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఎస్ఈ తెలిపారు. అదేవిధంగా కశింకోట డివిజన్ పరిధిలో ప్రతి చోటా వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు కరపత్రాలు పంపిణీ చేస్తున్నామని డివిజన్ ఈఈ రామకృష్ణ తెలిపారు. విద్యుత్ అంతరాయాలు తలెత్తకుండా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని వివరించారు. భద్రతపై బాధ్యతగా వ్యవహరిస్తున్నాం.. వసూళ్లపై దృష్టిసారిస్తూ బాధ్యులపై చర్యలు తీసుకుంటాం ఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ అధికారులు -
ఘనంగా కన్యకాపరమేశ్వరి జయంతి
అనకాపల్లి: స్థానిక మెయిన్రోడ్డులోని శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జయంతి వేడుకలను ఆలయ కమిటీ అధ్యక్షుడు బిళ్ళపాటి కృష్ణకుమార్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జామున సంకీర్తనలతో వైభవంగా తిరువీధి మహోత్సవం జరిపారు. శ్రీనగరేశ్వరిస్వామి, శ్రీ జనార్దన స్వామివార్లకు అభిషేకాలు, అమ్మవారి ఉత్సవమూర్తికి ఆలయ ముఖమండపంలో ధాన్యాభిషేకం, అర్రెపు కామేశ్వరరావు లలితా దంపతులచే అమ్మవారికి లక్షమల్లెలతో అర్చన, శ్రీ వాసవీ పార్ధసారథి గీతా మహిళా సమాజం ఆధ్వర్యంలో సామూహిక లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, శ్రీధరాల సోమరాజు నిర్మల, కృష్ణపేర్రాజు శైలజా దంపతులచే నిరుపేదలకు చీరల పంపిణీ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం అమ్మవారి ఆలయం వద్ద అన్నసమారాధన, వాసవీ వనిత క్లబ్ ఆధ్వర్యంలో సాయంత్రం 102 రకాల స్వీట్లతో అమ్మవారికి నివేదన, రాత్రి కన్యకాపరమేశ్వరి ఉంజల్సేవ కార్యక్రమాన్ని బిళ్లపాటి కృష్ణకుమార్ గీతాపార్వతి దంపతులచే జరిపారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ కమిటీ కార్యదర్శి కొరుపోలు జగదీశ్వరరావు, కోశాధికారి శ్రీధరాల సోమరాజు, ఉత్సవ కమిటీ చైర్మన్ ఉప్పల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
సబ్ జైల్ను సందర్శించిన న్యాయమూర్తి
మాట్లాడుతున్న న్యాయమూర్తి మధుసూధనరావు నర్సీపట్నం: స్థానిక సబ్జైల్ను అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్.మధుసూధనరావు శనివారం సందర్శించారు. అందుతున్న సౌకర్యాల గురించి ఖైదీలను అడిగి తెలుసుకున్నారు. ఖైదీలకు ఇస్తున్న మెనూపై ఆరా తీశారు. అనంతరం ఖైదీలతో సమావేశమయ్యారు. వారి కేసుల వివరాలను అడిగి తెలు సుకున్నారు. బెయిల్ పెట్టుకునేందుకు ఆర్థికస్థోమతలేని వారికి మండల న్యాయసేవాధికార సంస్థ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. అటువంటి వారు ఎవరైనా ఉంటే జైలు సూపరింటెండెంట్కు వివరాలు ఇవ్వాలని సూచించారు. సీనియర్ న్యాయవాది పి.నాగేశ్వరరావు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
మరికొన్ని ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం: వేసవి సీజన్లో రైల్వే ప్రయాణికుల సౌకర్యార్ధం మరికొన్ని ప్రత్యేక రైళ్లు ఆయా మార్గాలలో నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ సందీప్ తెలిపారు. ● సంబల్పూర్–కాచిగూడ(08325) సమ్మర్ స్పెషల్ సంబల్పూర్లో ప్రతీ సోమవారం రాత్రి 9 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 7.20 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 7.25 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 9.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైలు జూన్ 24వ తేదీ వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో కాచిగూడ–సంబల్పూర్(08326) సమ్మర్ స్పెషల్ కాచిగూడలో ప్రతీ మంగళవారాలలో రాత్రి 11.20 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.30గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 12.35 గంటలకు బయల్దేరి బుధవారాలలో రాత్రి 11.45 గంటలకు సంబల్పూర్ చేరుకుంటుంది. ● సంబల్పూర్–బెంగళూరు(08321) సమ్మర్ స్పెషల్ ప్రతీ గురువారాలలో సాయంత్రం 6.45 గంటలకు సంబల్పూర్లో బయల్దేరి మరుసటిరోజు తెల్లవారు 4.55 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 5 గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 11.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైళ్లు జూన్ 27వ తేదీ వరకు నడుస్తాయి. తిరుగు ప్రయాణంలో బెంగళూరు–సంబల్పూర్(08322) సమ్మర్ స్పెషల్ ప్రతీ శనివారాలలో తెల్లవారు 1.15 గంటలకు బయల్దేరి అదేరోజు రాత్రి 8.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 8.35 గంటలకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం 6.30 గంటలకు సంబల్పూర్ చేరుకుంటుంది. ఈ స్పెషల్ రైళ్లు జూన్ 29వ తేదీ వరకు నడుస్తాయి. -
అంకితభావంతో పనిచేస్తే గుర్తింపు
● ఎస్పీ మురళీ కృష్ణ పదవీ విరమణ చేసిన హోంగార్డుకు చెక్కును అందజేస్తున్న ఎస్పీ మురళీకృష్ణ అనకాపల్లి: పోలీసుశాఖలో అంకితభావంతో పనిచేస్తే తప్పక గుర్తింపు లభిస్తుందని ఎస్పీ కె.వి.మురళీకృష్ణ తెలిపారు. హోంగార్డుగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఎం.రామలింగానికి జిల్లాలో హోంగార్డుల ఒక రోజువేతనం రూ.3,86,240 చెక్కును ఎస్పీ కార్యాలయంలో శనివారం ఆయన అందజేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ ఉమ్మడి జిల్లాలో వివిధ పోలీస్స్టేషన్లలో రామలింగం విధులు నిర్వహించినట్టు చెప్పా రు. ఈ కార్యక్రమంలో అడిషినల్ ఎస్పీ బి.విజయభాస్కర్, ఏవోబి.శారద, కార్యాలయం సిబ్బంది వరలక్ష్మి, రాజేష్ పాల్గొన్నారు. -
వాదోపవాదాలకు తావీయవద్దు
● ఎన్నికలపై ప్రజలకు అనకాపల్లి డీవైఎస్పీ సూచనప్రజలతో మాట్లాడుతున్న డివైఎస్పీ చోడవరం రూరల్: ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలకు సంబంధించి ఎటువంటి వాదోపవాదాలకు దిగరాదని, ఎలాంటి వదంతులను నమ్మరాదని అనకాపల్లి పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఎస్.అప్పలరాజు ప్రజలకు సూచించారు. శనివారం రాత్రి ఆయన మండలంలోని ముద్దుర్తి, గౌరీపట్నం ప్రజలతో సమావేశమయ్యారు. చోడవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ బి.శ్రీనివాసరావు, ఎస్ఐ సూర్యనారాయణలతో కలసి రెండు గ్రామాల్లో పర్యటించారు. అక్కడి రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో సమావేశాలు నిర్వహించారు. ముందుగా ప్రశాంత వాతావరణంలో సజావుగా ఎన్నికలు జరగడానికి సహకరించిన అన్ని వర్గాలవారికి కృతజ్ఙతలు తెలిపారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు ఎలా ఉన్నా, ప్రజలంతా సంయమనంతో మెలగాలని హితవు పలికారు. ప్రజాతీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. దీనికి సంబంధించి అనవసర చర్చలు, వాదనలు పెట్టుకోవద్దన్నారు. శాంతి భద్రతలను కాపాడటానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఇదే రీతిలో పలు గ్రామాల్లో ప్రజలను చైతన్య పరిచేందుకు సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఐ, ఎస్ఐలు తెలిపారు. -
జల సిరులు చేరువై...
సాక్షి, అనకాపల్లి: ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి పరిరక్షించుకోవాలి. వ్యవసాయానికి అనుకూలంగా.. ఆత్మబంధువుగా మలుచుకోవాలి. శివారు పంట పొలాలు సైతం నీరు లేక ఎండిపోయే పరిస్థితి ఉండకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యం. అందుకే ఏపీ సమీకృత సాగునీరు, వ్యవసాయ పరివర్తన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో 98 చెరువుల అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం అమలు పూర్తయితే చిన్న, సన్నకారు రైతులకు సాగునీటి ఇబ్బందులు తీరుతాయి. వాతావరణంలో మార్పుల కారణంగా వర్షాలు లేక సకాలంలో పంటలు పండించలేకపోతున్నారు. దీంతో అన్నదాతలు ఆశించినంత మేర ఆదాయం పొందలేని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఏపీ సమీకృత సాగునీరు, వ్యవసాయ పరివర్తన పథకం ద్వారా నిర్మాణం చేపడుతున్న చెరువులు రైతులకు ఆత్మబంధువుల్లా మారుతున్నాయి. వర్షాలు కురిసే సమయంలో చెరువుల్లో నీరు నిల్వ ఉంచితే అన్నదాతలకు అవసరమయ్యే సమయంలో ఉపయోగపడుతుంది. ముందస్తుగా తగిన నీటి సదుపాయం ఉంటే వ్యవసాయంలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. 7:3 నిష్పత్తిలో నిర్మాణం ప్రపంచ బ్యాంకు 70 శాతం, ఏపీ ప్రభుత్వం 30 శాతం నిధులతో సంయుక్తంగా ఈ పథకం ద్వారా చెరువుల నిర్మాణం చేపట్టారు. మొత్తం 98 చెరువుల నిర్మాణం, ఆధునికీకరణకు శ్రీకారం చుట్టగా..వాటిలో 42 చెరువుల నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయి. మరో 22 చెరువులు నిర్మాణ పను లు పురోగతిలో ఉన్నాయి. 34 చెరువుల నిర్మాణం పనులు టెండర్ దశలో ఉన్నాయి. రూ.28 కోట్లతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఒక్కో చెరువు నిర్మాణానికి రూ.30 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు కేటాయించారు. వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో శరవేగంగా పనులు నిర్వహిస్తున్నారు. ఇందులో స్వతంత్ర, గొలుసు కట్టు చెరువులు, పెద్ద చెరువులు, చిన్న చెరువులు ఉన్నాయి. ఐదు శాఖలు సంయుక్తంగా.. వాతావరణంలోని మార్పులను తట్టుకుని వ్యవసాయ ఉత్పాదకతను, ఆదాయాన్ని పెంచేవిధంగా రైతులు పంటలను పండించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని విస్తృతం చేశారు. వ్యవసాయ, భూగర్భజల, నీటిపారుదల, ఉద్యావన, మత్స్యశాఖ సంయుక్తంగా చెరువుల నిర్మాణాలు చేపడుతున్నాయి. కనీసం 100 ఎకరాల నుంచి గరిష్టంగా 150 ఎకరాల వరకూ సరిపడా సాగునీటిని నిల్వ ఉంచే సామర్థ్యం ఒక్కో చెరువుకు ఉంటుంది. చెరువుల్లో నీటి సాంద్రతను నెలవారీ పిజోమీటర్ డ్రిల్లింగ్ చేసి తెలుసుకునే సదుపాయం కూడా కల్పించారు. రెండు లక్షల మంది రైతులకు లబ్ధి అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో ఈ చెరువుల నిర్మాణం ద్వారా సుమారు రెండు లక్షల మందికి పైగా చిన్న, సన్నకారు రైతులు లాభపడనున్నారు. చెరువుల నిర్మాణం, అభివృద్ధితో భూగర్భ జలాల పెరుగుదల సాధ్యమవుతుంది. చెరువుల అభివృద్ధితో రైతులు సకాలంలో పంటలు వేసుకోవడంతో పాటు ఏడాదికి మూడు పంటలు పండించుకునే అవకాశం కలుగుతుంది. వ్యవసాయ సామర్థ్యాన్ని పెంచుకోవడం, వాతావరణ సానుకూల పద్ధతులను ప్రోత్సహించడం సాధ్యపడుతుంది. రైతు బాంధవులుగా చెరువుల నిర్మాణం అన్నదాతలకు ఉపయోగపడేలా చెరువుల నిర్మాణం, అభివృద్ధి పనులు సాగుతున్నాయి. ఏపీ సమీకృత సాగునీరు వ్యవసాయ పరివర్తన పథకం 2020లోనే ప్రారంభమైంది. కరోనా కారణంగా పనులు మందకొడిగా సాగాయి. ఆ తరువాత నుంచి శరవేగంగా పనులు జరుగుతూ వస్తున్నాయి. వచ్చే ఏడాది నవంబర్ నెలాఖరునాటికి పనులు పూర్తి చేయాలన్నది లక్ష్యం. గ్రామాల్లో వ్యవసాయానికి తోడ్పాటు అందించేవి చెరువులే. వర్షాలు పడేటప్పుడు నీరు నిల్వ ఉండేందుకు చెరువు లు ఉపయోగపడతాయి. వ్యవసాయానికి నీరు అందించే బోరుబావుల్లో వేసవి సమయాల్లో నీరు అడుగంటకుండా సహాయపడుతుంది. భూగర్భజలాలను నిల్వచేయడంతో పాటు చేపల పెంపకంతో మరింత ఆదాయ వనరులను పెంచుకోవచ్చు. ప్రధానంగా వ్యవసాయ సాగునీటి విస్తీర్ణం పెంచుకోవచ్చు. –కె.రమేష్బాబు, ఏపీఐఐఏటీపీ సహాయ ప్రాజెక్టు అధికారి ‘సమీకృత వ్యవసాయ పరివర్తన పథకం’ తో సాగునీటి ఇబ్బందులకు చెక్ అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో 98 చెరువుల నిర్మాణ పనులు ఇప్పటికే చివరి దశకు చేరుకున్న 42 చెరువుల నిర్మాణం ఒక్కోదాని అంచనా వ్యయం రూ.30 లక్షల నుంచి రూ. 60 లక్షలు మొత్తం నిర్మాణాల అంచనా వ్యయం రూ.28 కోట్లు 2025 నవంబర్ నాటికి ప్రాజెక్టు పూర్తికి ప్రణాళికలు -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
కశింకోట: మండలంలోని ఏఎస్ పేట వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. సీఐ ఎం. వినోద్కుమార్ అందించిన వివరాల ప్రకారం.. అనకాపల్లి నుంచి యలమంచిలి వైపు వెళుతున్న కారు వేగంగా ముందు వెళుతున్న ఆటోను ఢీకొంది. ఆ ఆటో ముందు వెళ్లే బైక్ను ఢీకొంది. దీంతో ఆటో డ్రైవర్ చిన్ని శ్రీనివాస్తోపాటు దానిలో ప్రయాణికుడు, బైక్ నడుపుతున్న వ్యక్తి గాయపడ్డారు. వారిని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామని, ఆటో డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
నర్సీపట్నం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. టౌన్ ఎస్ఐ సాంబశివరావు అందించిన వివరాలు. మున్సిపాలిటీ పరిధి బయపురెడ్డిపాలేనికి చెందిన వి.నానిబాబు అబిద్సెంటర్లో చెప్పులు కుట్టుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. నానిబాబు ద్విచక్రవాహనంపై శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వెళ్తుండగా బయపురెడ్డిపాలెం సమీపంలో కుక్క అడ్డంగా రావడంతో పడిపోయాడు. తలకు బలమైన గాయం తగిలింది. 108 వాహనంలో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు కేజీహెచ్కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పలకరించిన తొలకరి
● సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు ● 24 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధం ● రాయితీపై 768 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువులుమాడుగుల: ఈ ఏడాది తొలకరి కాస్త ముందుగానే పలకరించింది. దీంతో జిల్లాలో రైతులు దుక్కులతో పాటు, చెరకు ఉడుపులకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఖరీఫ్ సాగుపై ఆర్బీకేల ద్వారా రైతులకు సిబ్బంది సూచనలు అందించారు. ఈ మేరకు సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. ఆర్బీకేల్లో పచ్చి రొట్ట ఎరువులకు రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు. రెండు మూడు రోజుల్లో వీటిని రైతులకు అందించనున్నారు. ఆర్బీకేల ద్వారా విత్తనాలు వర్షాలు అనుకూలించడంతో ప్రస్తుతం రైతులు చెరకు ఉడుపులు ప్రారంభించారు. అపరాలు వేయడానికి మెట్ట దుక్కులు ముమ్మరంగా చేపడుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ వరి విత్తనాలు సుమారు 24 వేల క్వింటాళ్లు, పచ్చి రొట్ట ఎరువులు 768 క్వింటాళ్లు పంపిణీ చేసేందుకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసింది. గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల ద్వారా వీటిని సరఫరా చేయనున్నారు. గత ఏడాది 58 వేల ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగు చేయగా, ఈ ఏడాది సుమారు 70 వేల ఎకరాలకు సాగు పెంపు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం పచ్చి రొట్ట ఎరువులు వేయడం ద్వారా రసాయన ఎరువులు వాడకం తగ్గడంతో పాటు, అధిక దిగుబడులు రావడంతో రైతులు పచ్చి రొట్ట ఎరువులపై దృష్టి సారించారు. వ్యవసాయ శాఖ కూడా రైతులు ఆశించిన స్థాయిలో పచ్చిరొట్ట ఎరువులు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అగ్రి ల్యాబ్లలో విత్తన నాణ్యత పరీక్ష నియోజకవర్గానికి ఒక అగ్రి ల్యాబ్ ఏర్పాటుతో రైతులకు ఎంతగానో ప్రయోజనం కలుగుతోంది. విత్తన నాణ్యత పరీక్షలకు జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తప్పాయి. రైతులు నమూనా విత్తనాలు అందించిన వెంటనే నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నారు. త్వరిత గతిన నివేదికలు కూడా అందిస్తున్నారు. దీంతో మొలక శాతం బాగున్న విత్తనాల ఎంపిక రైతులకు సులభతరమవుతోంది. అగ్రి ల్యాబ్లు అందుబాటులోకి రావడంతో ప్రైవేట్ వ్యాపారులు కూడా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సరఫరా చేస్తున్నారని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు అండగా ఆర్బీకేలు తొలకరి వానలతో ఖరీఫ్ వరి నారు మడుల్ని సిద్ధం చేస్తున్నాంవేసవి దుక్కి లాభాలను ఆర్బీకే అధికారులు వివరించారు. పచ్చిరొట్ట ఎరువుల్ని భూముల్లో కలియ దున్నడం వల్ల రసాయన ఎరువుల వాడకం, పెట్టుబడి వ్యవయం తగ్గింది. అధిక దిగుబడులు కూడా వస్తున్నాయి. ఆర్బీకేల ఏర్పాటుతో రైతుల దశ తిరిగింది. – పర్రే రామునాయుడు, రైతు, గాదిరాయి సకాలంలో విత్తనాల పంపిణీ రెండు మూడు రోజుల్లో రైతులకు పచ్చిరొట్ట ఎరువులు రాయితీ ధరలపై సరఫరా చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేశాం. ఖరీఫ్ వరి విత్తనాలు కూడా త్వరలో ఆర్బీకేలా ద్వారా అందిస్తాం. రైతులకు అవసరమైన స్థాయిలో విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచేందుకు సిద్ధంగా ఉన్నాం. రైతులకు అన్ని దశల్లో తోడ్పాటు, సలహాలిచ్చేందుకు మా సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. – బి.మోహనరావు, జిల్లా వ్యవసాయాధికారి, అనకాపల్లి -
గ్రామం సుభిక్షంగా ఉండాలని..
● 24 గంటలు పూజా కార్యక్రమాలు నిర్వహించిన బ్రాహ్మణులు నాతవరం: మండలంలోని వైబీ ఆగ్రహారం గ్రామంలో పూర్వం నుంచి వస్తున్న సంప్రదాయం మేరకు శనివారం 24 గంటలపాటు ఆధ్యాత్మిక, పూజా కార్యక్రమాలు నిర్వహించి, బ్రాహ్మణులు తమ మాతృభూమిపై మక్కువ చాటుకున్నారు. గ్రామంలో పూర్వం అధిక శాతం బ్రాహ్మణులే ఉండేవారు. కాలక్రమంలో వీరిలో ఎక్కువ మంది ఉద్యోగ, వ్యాపార రీత్యా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. అయినప్పటికీ గ్రామంలో ఏ పని తలపెట్టాలన్నా వారి ప్రోత్సాహం తప్పనిసరి. అందులో భాగంగానే ఇటీవల సర్పంచ్ కోసూరి విజయ, భర్త కోసూరి బుజ్జి అధ్వర్యంలో గ్రామస్తులతో కలిసి రామాలయం, మైసమ్మతల్లి ఆలయాలు నిర్మించారు. గ్రామం ఏర్పడినప్పటి నుంచి బ్రాహ్మణులు ఏటా వేసవిలో గ్రామం సుభిక్షంగా, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఆకాంక్షిస్తూ పూజలు చేస్తుండేవారు. 1964లో వర్షాల్లేక కరవుతో అల్లాడిపోతుంటే సూరి ఆనంత విజయరామశర్మ ఆధ్వర్యంలో ఏకధాటిగా 24 గంటలపాటు భజనలు, పలు హోమాలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో వాతావరణంలో మార్పు వచ్చి వర్షాలు కురిశాయట. తర్వాతి నుంచి గ్రామంలో అన్ని వర్గాల ప్రజలకు బాగుందని పూర్వీకులు చెబుతున్నారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈసారి కూడా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ బ్రాహ్మణులు కుటుంబ సమేతంగా విచ్చేసి, 24 గంటల పాటు భజనలు, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో వింజుమూరి సుబ్రహ్మణ్యశర్మ, శ్రీరామచంద్రమూర్తి, పీవీఎన్ ప్రసాద్ సోదరులు, చాడ సన్యాసిధర్మరావు, సువర్ణల చంద్రశేఖర్, ఎం.వెంకటేశ్వర్లు, పట్టెం విశ్వేశ్వరరావు, చాడ భానుమూర్తి, గ్రామపెద్దలు పాల్గొన్నారు. -
సింహగిరి కిటకిట
సింహాచలం: సింహగిరి శనివారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. భక్తులతో దర్శన క్యూలు కిక్కిరిశాయి. మాడ వీధులన్నీ భక్తులతో నిండిపోయాయి. అన్నప్రసాద భవనం, ప్రసాద విక్రయశాల, కేశఖండనశాల వద్ద భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ కారణంగా అంతరాలయ దర్శనాలు రద్దు చేశారు. కేవలం నీలాద్రిగుమ్మం వద్ద నుంచే దర్శనాలు కల్పించారు. మరోపక్క సింహగిరిపై వాహనాల పార్కింగ్కు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ద్విచక్రవాహనాలు, కార్లు ఎక్కువగా రావడంతో పార్కింగ్ ప్రదేశాలన్నీ నిండిపోయాయి. దీంతో ఎక్కడ వాహనాన్ని పార్క్ చేయాలో తెలియక భక్తులు తికమక పడ్డారు. గజపతి సత్రం మార్గంలోను, మైక్రో టవర్కు వెళ్లే మార్గంలో భారీ ఎత్తున వాహనాలను పార్క్ చేశారు. అలాగే సింహగిరి ఘాట్రోడ్డులో తీవ్ర ట్రాఫిక్ సమస్య నెలకొంది. దీనికి తోడు ఒక కారు ఘాట్రోడ్డులో మరమ్మతుకు గురై నిలిచిపోవడంతో వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకుపోయాయి. ట్రాఫిక్ పోలీసులు వెంటనే నిలిచిపోయిన కారును పక్కకు తీసి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. అలాగే రెండో టోల్గేట్ ప్రవేశ ద్వారం వద్ద కూడా పెద్ద ఎత్తున వాహనాల రద్దీ నెలకొంది. కొండదిగువ తొలి పావంచా ఏరియా అంతా పెద్ద ఎత్తున వాహనాలతో నిండిపోయింది. దేవస్థానానికి రూ.53 లక్షల ఆదాయం శనివారం సాయంత్రానికి సింహాచలం దేవస్థానానికి సుమారు రూ.53 లక్షల ఆదాయం లభించింది. దర్శనాల టికెట్ల విక్రయాల ద్వారా సుమారు రూ.33 లక్షలు, ప్రసాదాల విక్రయం ద్వారా సుమారు రూ.13 లక్షలు, కేశ ఖండనశాల ద్వారా రూ.5.29 లక్షలు, సేవల ద్వారా రూ.93 వేలు, విరాళాల రూపంలో సుమారు రూ.80 వేలు వచ్చింది. రాత్రి 7.15 సమయానికి 42 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. సింహగిరికి అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఘాట్రోడ్డులో భారీగా నిలిచిపోయిన వాహనాలు కొండదిగువ పెద్ద ఎత్తున ట్రాఫిక్జామ్ ఒక్కరోజు రూ. 53 లక్షల ఆదాయం రాత్రి 7.15 గంటల్లోపు 42 వేల మంది భక్తుల స్వామిదర్శనం -
ఎల్బీ పురంలో వివాహిత ఆత్మహత్య
● అత్తింటి వేధింపులే కారణమని తండ్రి ఫిర్యాదు బుచ్చెయ్యపేట: మండలంలోని ఎల్బీ పురానికి చెందిన కిల్లి శ్రావణి(28) ఉరేసుకుని అనుమానాస్పదంగా మృతి చెందింది. అత్తింటి వేధింపులే తన బిడ్డ మరణానికి కారణమంటూ పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో మేడ మీద నిద్రపోయేందుకు శ్రావణి వెళ్లింది. శనివారం ఉదయం ఆమె ఎంతకీ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు చూసేసరికి ఇంట్లో ఉన్న ఫ్యాన్కు ఉరేసుకుని ఉంది. ఈమె భర్త ఢిల్లీలో ఆర్మీ విధుల్లో ఉన్నారు. శ్రావణి తల్లిదండ్రులతో కలిసి గాజువాకలో నివాసం ఉంటోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు అత్తవారింటికి వచ్చింది. అత్త పక్షవాతంతో మంచాన పడటంతో అప్పుడప్పుడు వచ్చి ఆమెకు సపర్యలు చేస్తుండేది. శుక్రవారం ఇంట్లో ఏం జరిగిందో తెలియదని, శనివారం ఆమె ఉరేసుకోవడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. మృతురాలికి నాలుగేళ్ల వయసున్న కొడుకు ఉన్నాడు. శనివారమే శ్రావణి తన భర్తను చూసేందుకు ఢిల్లీ వెళ్తానని చెప్పిందని, ఇంతలోనే ఈ దారుణం జరిగిందని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వాపోతున్నారు. శ్రావణి తండ్రి నాయుడుబాబు తన కుమార్తె చావుకు కారణం ఆమె మరిది, తోడికోడలు, ఆడపడుచులేనని బుచ్చెయ్యపేట పోలీసులకు అందించిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తరుచూ తన కుమార్తెను తిడుతూ, హింసించడం వల్లే భరించలేక ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ఎస్ఐ డి.ఈశ్వరరావు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. శ్రావణి మృతదేహాన్ని అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టమ్ నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. ఢిల్లీలో ఉన్న భర్త శనివారం రాత్రి ఇంటికి చేరడంతో శ్రావణి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. మృతి చెందిన కిల్లి శ్రావణి, పక్కన (ఫైల్) -
ప్రభుత్వ కాలేజీల్లో పిల్లల్ని చేర్చండి
రావికమతం: అత్యుత్తమ బోధన, ఉచిత సౌకర్యాలు న్న ప్రభుత్వ జూనియర్ కాలేజిలోనే మీ పిల్లలను చేర్పించాలంటూ కొత్తకోట జూనియర్ కళాశాల అధ్యాపకులు శుక్రవారం పలు గ్రామాల్లో టెన్త్ పాసైన పిల్లల ఇంటికి వెళ్లి, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిష్ణాతులైన అధ్యాపకులు, ఆధునిక వసతులతో కూడిన తరగతి గదులు, లైబ్రరీ, ల్యాబ్ సౌకర్యాలతో కార్పొరేట్ కాలేజీలను మించిన స్థాయిలో ఉన్నాయని వివరించారు. జెడ్.కొత్తపట్నం, దొండపూడి, టి.అర్జాపురం, నాయుడుపాలెం గ్రామాల్లో విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఓసారి తమ కళాశాలను సందర్శించి, నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా తమ కళాశాలలో ఉన్న వసతులు, ప్రయోజనాలపై రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ నెల 15 నుంచి అడ్మిషన్లు ప్రారంభించినట్లు వెల్లడించారు. టెన్త్ పాసైన విద్యార్థులు తమ మార్క్స్ మెమో, ఆధార్ తదితర ధ్రువపత్రాలు తీసుకొచ్చి, అడ్మిషన్లు పొందవచ్చని ప్రిన్సిపాల్ సత్యవతి తెలిపారు. వసతులు, బోధనపై అధ్యాపకుల ఇంటింట ప్రచారం -
పూరిల్లు దగ్ధం.. రూ.2 లక్షల ఆస్తి నష్టం
బుచ్చెయ్యపేట: మండలంలోని రాజాం గ్రామంలో పూరిల్లు దగ్ధమైంది. గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గొర్లె శ్రీను శుక్రవారం ఇంట్లో దేవుడి మూలన ప్రమిదలో నూనె దీపం పెట్టి పూజ చేశారు. ఈ దీపం పడిపోయి మంటలు వ్యాపించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మంటలు ఇంట్లో ఉన్న సామాన్లకు అంటుకుని ఇంట్లో ఉన్న తిండి గింజలు, బట్టలు, వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. అగ్ని ప్రమాదం జరిగినపుడు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ఇంట్లో గ్యాస్ సిలండర్ ఉండటంతో స్ధానికులు భయపడి, మండల్ని ఆపేందుకు ప్రయత్నించలేదు. సుమారు రూ.2 లక్షలకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. -
వరాహ నదిలో బయటపడిన అమ్మవారి విగ్రహం
ఎస్.రాయవరం: పెదఉప్పలం శివారు బసవపాడు సమీపంలో వరాహనదిలో బయటపడిన గంగమ్మతల్లి విగ్రహానికి మహిళలు శుక్రవారం పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. నదిలో రాయికి పాదంతో కూడిన ఆకారం కనిపించడంతో ముందుగా చూసిన యర్రంశెట్టి గంగరాజు బసవపాడు గ్రామస్తులను పిలిచి ఇసుకలో కప్పి ఉన్న అమ్మవారి రాతి ప్రతిమను వెలికి తీశారు. సుమారు 500 కిలోల బరువున్న రాయిపై అమ్మవారి విగ్రహం దర్శనమిచ్చింది. దుర్గమ్మ ఆకారంలో ఉన్న ఈ అమ్మవారు గంగపారే నదిలో దొరకడంతో గంగమ్మతల్లిగా పూజలు మొదలు పెట్టారు. నది గర్భంలో పురాతన విగ్రహం బయటపడటంతో తమ ప్రాంతాన్ని సంరక్షించడానికి అమ్మవారే బయటకు వచ్చారని స్థానికులు ఆనందంగా చెప్తున్నారు. విషయం తెలుసుకున్న పరసర గ్రామాలైన పెదఉప్పలం, వెంకటాపురం, లింగరాజుపాలెం, బసవపాడు, వమ్మవరం, అగ్రహారం, ఎస్.రాయవరం శివారు అగ్రహారం, ఎస్.రాయవరం తదితర గ్రామాలకి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున నది వద్దకు చేరుకున్నారు. అమ్మవారి దర్శించుకుని, పూజలు చేశారు. అప్పటికే బసవపాడు గ్రామానికి చెందిన పలువురు భక్తులు అమ్మవారు బయటపడిన ప్రదేశంలో చలువ పందిరి, భక్తులకు నీడనిచ్చేలా టెంట్లు ఏర్పాటు చేశారు. దీంతో ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. -
అలరించిన నాటిక పోటీలు
అనకాపల్లి: స్థానిక గవరపాలెం వీవీ రమణ రైతు భారతి ఫంక్షన్ హాల్లో శుక్రవారం ప్రదర్శించిన నాటికలు ఆహూతుల్ని అలరించాయి. జీవీఎంసీ మెయిన్రోడ్డు పెద్ద హైస్కూల్కు చెందిన 1974–75 టెన్త్ బ్యాచ్ విద్యార్థులు, జ్యోతి సరళ స్మారక కళాపరిషత్ ఆధ్వర్యంలో నాటిక పోటీలను ప్రారంభించారు. 17 నుంచి 19 వరకు ఈ పోటీలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ అనకాపల్లి పట్టణం కళలకు పుట్టినిళ్లని కొనియాడారు. ఏటా ఈ నాటిక పోటీలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. తొలి రోజు నాలోన నీవే, అమృత హస్తం నాటికలను ప్రదర్శించారు. ఆధునిక ఇల్లాలి కథ ‘నాలోన నీవే’ గుంటూరు ప్రాంతానికి చెందిన కరణం సురేష్ మెమోరియల్ థియేటర్స్ వారిచే ప్రదర్శించిన ‘నాలోన నీవే’నాటిక ఆహూతుల్ని ఎంతగానో అకట్టుకుంది. తల్లీ కొడుకుల బంధం, భార్య రాకతో కలిగిన కల్లోలం, భార్యలో మార్పు తెచ్చేందుకు భర్త ఆడిన నాటకం ప్రధాన ఇతివృత్తంగా నాలోన నీవే నాటిక ఆద్యంతం మెప్పించింది. తండ్రి చనిపోయిన శ్రీరామ్కు తల్లిపై ఉన్న అభిమానం, గౌరవం, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై ఉన్న ప్రేమ, తన భర్త ప్రేమ పూర్తిగా తనకే సొంతం కావాలనుకునే ఆధునిక ఇల్లాలి వ్యధ కల్లకు కట్టినట్టు ప్రదర్శించారు. అన్నాచెల్లెళ్ల బంధం ‘అమృత హస్తం’ ఒక తల్లి కడుపున పుట్టిన అన్నాచెల్లెళ్ల ప్రేమ, అనురాగం ఆధునిక సమాజంలో మృగ్యమైపోతున్న తరుణంలో ఆ బంధాల గొప్పతనం, నేటి సమాజానికి అవి ఎంత అవసరమే తెలిపేలా గుంటూరుకు చెందిన అమరావతి ఆర్ట్స్ బృందం ప్రదర్శించిన ‘అమృత హస్తం’నాటిక చాటిచెప్పింది. ప్రేమ పెళ్లి చేసుకుని భర్త దాష్టీకానికి గురవుతున్న చెల్లెల్ని భర్తతో సహా ఆదరించిన అన్న, ఆడపడుచు భర్త దురాశను ఆధునిక టెక్నాలజీతో చట్టం ముందు నిలబెట్టిన అతని భార్య తెలివి తేటలు ఇలా ప్రతి సన్నివేశం ప్రేక్షకుల మనసుల్ని దోచుకుంది. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కేఎం నాయుడు, పీసీహెచ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో నేడు, రేపు ప్రదర్శనలు -
బాలుడి అదృశ్యంపై ఫిర్యాదు
దేవరాపల్లి: స్థానిక కొల్లూరి వారి వీధికి చెందిన బాలుడు నాగేంద్ర(12) కనిపించట్లేదని తండ్రి దీవి ఈశ్వరరావు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు స్థానిక ఎస్ఐ డి.నాగేంద్ర తెలిపారు. వివరాలు. గురువారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో నాగేంద్ర బయటకు వెళ్లిపోయాడు. రాత్రయినా తిరిగి రాకపోవడంతో బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆరా తీశారు. అయినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో శుక్రవారం పోలీసులను ఆశ్రయించారు. అదృశ్యమైన బాలుడు తన పేరు తప్ప మరే ఇతర వివరాలు చెప్పలేడని పోలీసులకు కుటుంబ సభ్యులు తెలిపారు. చామన ఛాయ రంగు కలిగిన బాలుడు ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడు ఎరుపు రంగు చొక్కా, ఎరువు రంగు షార్ట్ ధరించాడు. బాలుడి ఆచూకీ లభించిన వారు 6369801257, 9440796092 నంబర్లలో సమాచారం అందించాల్సిందిగా ఎస్ఐ కోరారు. -
మరికొంత కాలం ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రస్తుతం నడుస్తున్న పలు సమ్మర్ స్పెషల్ రైళ్లను మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ● బెంగళూరు–ఖరగ్పూర్(06507) సమ్మర్ స్పెషల్ ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 3.50 గంటలకు బెంగళూరులో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 12.02 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు 2.45 గంటలకు ఖరగ్పూర్ వెళ్తుంది. ఈ స్పెషల్ను జూన్ 14 వరకు పొడిగించారు. తిరుగు ప్రయాణంలో ఖరగ్పూర్–బెంగళూరు (06508) సమ్మర్ స్పెషల్ ప్రతీ సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఖరగ్పూర్లో బయలుదేరి మరుసటిరోజు తెల్లవారు 2.38 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 2.40 గంటలకు అదేరోజు రాత్రి 7.50 గంటలకు బెంగళూరు వెళ్తుంది. ఈ స్పెషల్ను జూన్ 17 వరకు పొడిగించారు. ● ఎస్ఎంవీ బెంగళూరు–హౌరా(06585) సమ్మర్ స్పెషల్ ప్రతీ శుక్రవారం మధ్యరాత్రి 12.30 గంటలకు బెంగళూరులో బయలుదేరి అదే రోజు రాత్రి 7.25 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 7.27 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10 గంటలకు హౌరా వెళ్తుంది. ఈ స్పెషల్ జూన్ 14 వరకు నడుస్తుంది. హౌరా–ఎస్ఎంవీ బెంగళూరు(06586) సమ్మర్ స్పెషల్ ప్రతీ శనివారం మధ్యాహ్నం 1.05 గంటలకు హౌరాలో బయలుదేరి మరుసటి రోజు తెల్లవారు 3.03 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 3.05 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 8.10 గంలకు ఎస్ఎంవీ బెంగళూరు వెళ్తుంది. ఈ స్పెషల్ను జూన్ 15 వరకు పొడిగించారు. ● ఎస్ఎంవీ బెంగళూరు–గౌహతి (06569) సమ్మర్ స్పెషల్ ఎస్ఎంవీ బెంగళూరులో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 7.53 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 7.55 గంటలకు బయలుదేరి మంగళవారం తెల్లవారు 5.30 గంటలకు గౌహతి వెళ్తుంది. ఈ స్పెషల్ జూన్ 9వ తేదీ వరకు నడుస్తుంది. తిరుగు ప్రయాణంలో గౌహతి–ఎస్ఎంవీ బెంగళూరు(06570) సమ్మర్ స్పెషల్ గౌహతిలో ప్రతీ బుధవారం ఉదయం 6 గంటలకు బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 3.08 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 3.10 గంటలకు బయలుదేరి శుక్రవారం ఉదయం 10 గంటలకు ఎస్ఎంవీ బెంగళూరు వెళ్తుంది. ఈ స్పెషల్ను జూన్ 12వ తేదీ వరకు పొడిగించారు. ● ఎస్ఎంవీ బెంగళూరు– మాల్డా టౌన్(06563) స్పెషల్ రైలు ఎస్ఎంవీ బెంగళూరులో జూన్ 9 రాత్రి 11.40 గంటలకు బయలుదేరి మరుసటిరోజు సాయంత్రం 6.13 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 6.15 గంటలకు బయలుదేరి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు మాల్డా టౌన్ వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో మాల్డా టౌన్– ఎస్ఎంవీ బెంగళూరు(06564) స్పెషల్ జూన్ 12 సాయంత్రం 4 గంటలకు మాల్డా టౌన్లో బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 3.08 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 3.10 గంటలకు బయలుదేరి మరుసటిరోజు శుక్రవారం ఉదయం 9.30 గంటలకు ఎస్ఎంవీ బెంగళూరు వెళ్తుంది. ● మైసూరు–ముజఫర్పూర్(06221) స్పెషల్ జూన్ 10వ తేదీ సోమవారం మైసూరులో ఉదయం 10.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.18 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 7.20 గంటలకు బయలుదేరి మరుసటిరోజు బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ముజఫర్పూర్ వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో ముజఫర్పూర్–మైసూరు (06222) స్పెషల్ జూన్ 13వ తేదీ గురువారం ముజఫర్పూర్లో మధ్యాహ్నం ఒంటి గంటకు బయలుదేరి మరుసటి రోజు రాత్రి 7.18 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి 7.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.40 గంటలకు మైసూరు వెళ్తుంది. -
తీయగా..
వచ్చే సీజన్ మరింత● చెరకు సాగు పెరిగితేనే క్రషింగ్ లక్ష్యసాధన సాధ్యం ● రాయితీపై 40 లక్షల ఒంటికన్ను ముచ్చు విత్తనాలు అందిస్తున్న గోవాడ సుగర్స్ ● ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కార్యక్రమాలు ● ఈ ఏడాది 3 లక్షల టన్నుల చెరకు గానుగాడే దిశగా ముందస్తు చర్యలు చోడవరం: ఈ ఏడాది చెరకు సాగు విస్తీర్ణం పెంచేందుకు గోవాడ సుగర్ ఫ్యాక్టరీ ముందస్తు చర్యలు చేపట్టింది. గత ఏడాది చెరకు లేక క్రషింగ్ లక్ష్యం చేరుకోలేకపోవడంతో ఈ ఏడాది ఆ సమస్య రాకుండా ముందస్తుగా అప్రమత్తమయింది. రాయితీలు కల్పిస్తూ రైతులు చెరకు సాగుకు మొగ్గు చూపేలా కృషి చేస్తోంది. పెట్టుబడులు పెరిగిపోవడం, గిట్టుబాటు ధర దక్కకపోవడంతోపాటు.. భూ సారంలో మార్పులు, వాతావరణ కాలుష్యం కారణంగా చెరకు దిగుబడి తగ్గిపోవడంతో జిల్లాలో చెరకు విస్తీర్ణం గత పదేళ్లుగా తగ్గుతూ వస్తోంది. జిల్లాలో ఉన్న నాలుగు చక్కెర ఫ్యాక్టరీల్లో మూడు మూతబడిపోవడం, బెల్లం ఎగుమతులు కూడా అనుకున్న స్థాయిలో లేకపోవడంతో చెరకు సాగు తగ్గిపోయింది. అయితే ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా రైతులకు అండగా నిలవడంలో గోవాడ సహకార చక్కెర కర్మాగారం ఎక్కడా వెనకడుగు వేయలేదు. గడిచిన ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సుమారు రూ.80 కోట్ల వరకు సహకారం అందించడంతో ఈ ఫ్యాక్టరీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతోంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూ.150 కోట్ల వరకు అప్పుల ఊబిలోకి నెట్టినప్పటికీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏటా ఏదో రూపంలో గ్రాంట్ను ఇస్తూ ఫ్యాక్టరీని బతికించుకుంటూ వచ్చింది. కనీసం 3 లక్షల టన్నులైనా గానుగాడాలని.. గోవాడ సుగర్ ఫ్యాక్టరీకి ఐదు లక్షల టన్నుల చెరకు గానుగాడే సామర్ధ్యం ఉంది. ఈ ఏడాది క్రషింగ్ లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లోనైనా చేరుకోవాలన్న ఆశయంతో యాజమాన్యం ముందస్తుగా సాగు విస్తీర్ణం పెంచే చర్యలు చేపట్టింది. ఈ ఏడాది కనీసం 3 లక్షల టన్నులైనా గానుగాడాలని భావిస్తోంది. ఆ దిశగా చెరకు సరఫరా జరగాలంటే ఫ్యాక్టరీ పరిధిలో ఇప్పుడున్న విస్తీర్ణం కంటే మరో 5 వేల ఎకరాల్లో సాగు పెరగాల్సి ఉంది. అందుకే రైతుల్లో సాగుపై ఆసక్తి పెంచేలా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఫ్యాక్టరీ పరిధిలో 25 నుంచి 30 వేల ఎకరాల్లో చెరకు సాగు జరుగుతోంది. పాత రకం వంగడాలు నామమాత్రంగా దిగుబడి ఇస్తుండటంతో కొత్త రకాలపై రైతుల్లో అవగాహన పెంచి, ఆ విత్తనాన్ని రైతులకు అందిస్తోంది. రైతులు సాగులో వస్తున్న సాంకేతిక పద్ధతుల వైపు మొగ్గుచూపేలా వారిలో చైతన్యం పెంచేందుకు ఇప్పటికే అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తోంది. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు వచ్చే పద్ధతులను వారికి తెలుపుతోంది. అనకాపల్లి, కొండెంపూడి వ్యవసాయ పరిశోధన కేంద్రాలు చెరకులో కొత్త వంగడాలు, సాగులో కొత్త విధానాలను తెచ్చి రైతులు ఆచరించే విధంగా ఇప్పటికే చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నాయి. గత కొంత కాలంగా ఒంటికన్ను ముచ్చుతో శ్రీసాగు విధానంలో కేవలం అతి కొద్దిమంది మాత్రమే చెరకు తోటల పెంపకం చేస్తున్నారు. ఈ విధానాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఫ్యాక్టరీ కూడా రైతులకు అవగాహన సదస్సులు పెట్టింది. ఈ విధానంలో సాగు చేసేందుకు ఎక్కువ మంది సుముఖత వ్యక్తం చేయడంతో 2024–25 క్రషింగ్ సీజన్కు 40 లక్షల ఒంటికన్ను ముచ్చును ఫ్యాక్టరీ రైతులకు అందించేందుకు పలు ప్రాంతాల్లో నర్సరీలు పెంచి, అక్కడ నుంచి రైతులకు సరఫరా చేస్తున్నారు. మరోపక్క పాత చెరకు వంగడాలు ఎక్కువగా తెగుళ్ల బారిన పడి, భూమిలో సారం తగ్గిపోయి దిగుబడి పడిపోవడంతో కొత్త వంగడాలను కూడా రైతులకు ఇస్తున్నారు. విత్తనంపై 50 నుంచి 80 శాతం సబ్సిడీ ఇస్తూ రైతులను ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుండా సబ్సిడీపై ఎరువులు కూడా అందిస్తున్నారు. సాగు విస్తీర్ణం పెంచేందుకు అన్ని విధాలుగా చర్యలు ఈ ఏడాది క్రషింగ్ లక్ష్యం పెరిగేలా.. అందుకు తగ్గట్టుగా చెరకు సాగు విస్తీర్ణం పెరిగేలా చర్యలు చేపట్టాం. ఈ ఏడాది 40 లక్షల ఒంటికన్ను ముచ్చు విత్తనాలను రైతులకు సరఫరా చేసేందుకు సిద్ధం చేశాం. ఒక మొక్క తయారీకి రూపాయి 70 పైసలు ఖర్చవుతుండగా.. ఫ్యాక్టరీ 80 పైసలు భరిస్తోంది. రైతులు 90 పైసలు చెల్లించే విధంగా ఈ విత్తనాన్ని సరఫరా చేస్తున్నామన్నాం. నాటు విత్తనాన్ని కూడా రైతుల నుంచి కొనుగోలు చేసి సరఫరా చేస్తున్నాం. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో ఈ నెలలో మరింత ఎక్కువగా నాట్లు వేసేలా రైతులకు చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నాం. – సన్యాసినాయుడు, గోవాడ సుగర్స్ ఎండీ చెరకులో కొత్త రకం వంగడాలు ఇప్పటి వరకు రైతులు పాత రకాలు వేసినవే మళ్లీ మళ్లీ వేయడంతో భూమిలో సారం తగ్గి దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. దీనితో కొత్త రకాల వైపు ఆసక్తి చూపుతున్నారు. చెరకులో కొత్తగా 2009ఎ 107, 87ఎ298, 2003వి46, 2006ఎ81, 2006ఎ 252 రకాలు వేసేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. దీనితో ఈ రకాల్లోనే ఒంటికన్ను ముచ్చు విత్తనాన్ని గోవాడ ఫ్యాక్టరీ తయారు చేస్తోంది. -
No Headline
మాడుగుల: ఉత్తరాంధ్ర ఇలవేల్పు మాడుగుల మోదకొండమ్మ జాతరకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఆలయ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు తెలిపారు. శుక్రవారం నిర్వహించి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. ఈనెల 19న పండగ చాటింపు, 21న అమ్మ వారి కొలువు సతకం పట్టు వద్ద ఉంటుందన్నారు. వచ్చేనెల 18న అంగరంగ వైభవంగా అమ్మవారి పండగ నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 19న అమ్మవారి మాలాధారణ కార్యక్రమం ఉంటుందన్నారు. మాలధారణ చేసే భక్తులకు ఆలయ కమిటీ ఉచితంగా మాలలు అందజేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు దంగేటి సూర్యారావు, శ్రీనాథు శ్రీనివాసరావు, భీమరశెట్టి పైడియ్య నాయుడు, కుప్పిలి భవాని, శంకర్, ధర్మిశెట్టి అప్పారావు, డిల్లీ నానాజీ, పల్లేల రాము, ద్రాక్షారపు అచ్యుతరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏయూను సందర్శించిన అమెరికా ఆచార్యుడు
ఏయూ క్యాంపస్ (విశాఖ): ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ ఇండియానా పోలీస్కు చెందిన డాక్టర్ మంగిలాల్ అగర్వాల్ శుక్రవారం సందర్శించా రు. ఈ సందర్భంగా ఏయూ వీసీ ఆచార్య ప్రసాదరెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య ఎం.జేమ్స్ స్టీపెన్లతో సమావేశమయ్యారు. బోధన, పరిశోధన భాగస్వామ్యం, సంయుక్తంగా కోర్సుల నిర్వహణ, అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనే భావించే విద్యార్థులకు స్కాలర్షిప్లు, పీహెచ్డీ, పోస్ట్ డాక్టరల్ ప్రోగ్రాం, ఆన్లైన్ కోర్సులను ఏయూ సిబ్తో పాటు ఇతర విభాగాలతో సంయుక్తంగా నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఫార్మసీ కళాశాల ఆచార్యులు ఆచార్య జి.గిరిజా శంకర్, ఆచార్య కె.ఈశ్వర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ వీఆర్వో మృతి
అనకాపల్లి: విశాఖ కేజీహెచ్లో చికిత్స పొందుతూ మండలంలోని మాకవరం వీఆర్వో బి.కృష్ణారావు గురువారం మృతిచెందినట్లు పట్టణ పోలీసులకు ఫిర్యాదు అందింది. హెచ్సీ రామకృష్ణ కథనం మేరకు భీమునిపట్నం మండలం తాళ్లవలస గ్రామానికి చెందిన బి.కృష్ణారావు(62) అనకాపల్లి మండలం మాకవరం వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్నారు. విధినిర్వహణలో భాగంగా గత నెల 29న అనకాపల్లి ఆర్డీవో కార్యాలయానికి వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో కార్యాలయం వద్ద ఫిట్స్ వచ్చి పడిపోయారు. దీంతో కృష్ణారావు తలకు తీవ్ర గాయమైంది. హుటాహుటిన ఎన్టీఆర్ వైద్యాలయంలో చేర్చి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు మృతుడి అన్నయ్య పైడయ్యనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ వెల్లడించారు. -
యువత ఆధ్యాత్మిక మార్గంలో నడవాలి
కొమ్మాది: యువత ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని, ఆలయాల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పరివ్రాజక స్వామి పిలుపునిచ్చారు. సాగర్నగర్లోని ఇస్కాన్ మందిరంలో మూడు రోజులుగా జరుగుతున్న ఇస్కాన్ ఇండియా యూత్ కౌన్సిల్ (ఐఐవైసీ) సమావేశాలు గురువారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. నేటి యువత ఆధ్యాత్మిక భావనలు కలిగి ఉండి రేపటి తరానికి ఆదర్శంగా నిలవాలని కోరారు. ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి సనాతన ధర్మాన్ని బోధించే కార్యక్రమంలో భాగంగా విశాఖలో ఈ సమావేశాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ముందుగా ఆయన మందిరంలోని రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హరేకృష్ణ మహా మంత్రంతో ఇస్కాన్ టెంపుల్ మార్మోగింది. ఈ సమావేశాల్లో ఇస్కాన్ ఇండియా యూత్ కౌన్సిల్ చైర్మన్ సుందర్ గోపాల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువ రైతు మృతి
● భార్యకు తీవ్ర గాయాలు ● ఆస్పత్రిలో కోలుకుంటున్న వైనం ● వంట్ల మామిడి వద్ద బైక్ను ఢీకొన్న వాహనం బుచ్చెయ్యపేట: మండల కేంద్రం బుచ్చెయ్యపేటకు చెందిన యువ రైతు గాడి పరసయ్య(42) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. భార్య రవణమ్మ తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు. పాడేరు మోదకొండమ్మ పాదాల వద్ద గ్రామానికి చెందిన వ్యక్తి గురువారం మొక్కు తీర్చుకుని, వన భోజనాలు ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భార్యతో కలిసి పరసయ్య తన ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. మాడుగుల మండలం వంట్లమామిడి దాటిన తర్వాత వెనక నుంచి వచ్చిన వాహనం పరసయ్య బైక్ను ఢీకొంది. బైక్తో పాటు రోడ్డుపై పడిపోయిన పరసయ్య మీదుగా ఆ వాహనం వెళ్లడంతో ఆయన కాలు నుజ్జయింది. తీవ్ర రక్తస్రావంతో సంఘటనా స్ధలంలోనే పరసయ్య మృతి చెందాడు. వెనకాల కూర్చున్న భార్య రవణమ్మ వాహనం పైనుంచి తూలి పడి, తీవ్రంగా గాయపడ్డారు. ఆమె కుడి కాలు, కుడి చేయి విరిగిపోవడంతో స్థానికులు 108లో అనకాపల్లిలోని ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోంది. ప్రమాదం జరిగిన పది నిమిషాలు వరకు పరసయ్య కొన ఊపిరితోనే ఉన్నాడు. భార్యాభర్తలిద్దరూ తీవ్ర గాయాలతో పైకి లేవలేక, మాట్లాడలేక అచేతనంగా పడి ఉండటాన్ని చూసిన స్థానికులు చలించిపోయారు. పరసయ్య మృతదేహాన్ని పాడేరు ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. వీరికి టెన్త్ పాసైన కుమాడు హర్షవర్ధన్, 8వ తరగతి చదువుతున్న కుమార్తె హరిణి ఉన్నారు. ఉదయం పాడేరు వెళ్లి వస్తామని చెప్పిన తల్లిదండ్రుల్లో తండ్రి ఇక ఎప్పటికీ రాడని తెలిసిన పిల్లలు, కుటుంబ సభ్యుల రోదన స్థానికులను కన్నీరు పెట్టించింది. పరసయ్య ఆధునిక పద్ధతిలో పలు రకాల పంటలు పండిస్తూ స్థానిక రైతులకు ఆదర్శంగా నిలిచేవాడు. ఆధునిక విధానంలో పుచ్చకాయలు, బొప్పాయితో పాటు పలు రకాల కొత్త వంగడాలను తెచ్చి, ఈ ప్రాంత రైతులు సాగు చేసేలా ప్రోత్సహించేవాడు. వ్యవసాయంతో కలప అమ్మకాలు, కొనుగోలు చేస్తూ కుటుంబాన్ని పోషించికునేవాడు. ప్రమాద సంఘటనపై పాడేరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
- నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
- దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
- Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
- టైముకు తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
- తెలంగాణ ఈఏపీసెట్లో ఏపీ ప్రభంజనం
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
Advertisement