-
Vajrakarur: వజ్రాల వేట ప్రారంభం
వజ్రకరూరు మండల పరిసర ప్రాంతాల్లో వజ్రాల వేట ప్రారంభమయ్యింది. తొలకరి వర్షాలు ప్రారంభం కావడంతో స్థానికులతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాలు, కర్నూల్, కడప, కర్ణాటక, తెలంగాణ తదితర ప్రాంతాల నుంచి శనివారం వందల సంఖ్యలో ప్రజలు తరలివచ్చి వజ్రాలు వెతకడం ప్రారంభించారు. పలువురు కార్లలో వచ్చి వజ్రాలు వెతకడం కనిపించింది. చంటి బిడ్డలనుసైతం ఎత్తుకుని వచ్చి వజ్రాలు వెతకడం విశేషం. దీంతో ఆ ప్రాంతం జాతరను తలపించింది. ఇక్కడ లభించే చిన్న వజ్రమైనా రూ. లక్షల్లో విలువ చేస్తుంది. ఏటా ఈ ప్రాంతంలో 20 నుంచి 40 దాకా వజ్రాలు లభ్యమవుతాయని సమాచారం. -
తొమ్మిదేళ్ల బాలికతో దేవదేవుని వివాహం
రాయదుర్గంటౌన్: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో శ్రీప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీవారి కల్యాణం తొమ్మిదేళ్ల బాలికతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. దాదాపు ఆరు దశాబ్దాల నుంచి ఇక్కడ కొనసాగుతున్న విశిష్ట సంప్రదాయంలో భాగంగా అరవ తెగకు చెందిన బాలికతో దేవదేవుని కల్యాణం జరిపించారు. స్వామి వారిని వివాహమాడిన ఆ బాలికకు సుగుణ æసంపన్నుడైన భర్త లభిస్తాడని భక్తుల నమ్మకం. ఏటా బ్రహ్మోత్సవాల్లో భాగంగా పద్మశాలి వంశం అరవ తెగకు చెందిన బాలికతో శ్రీవారికి పెళ్లి చేసే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది.ఈ ఏడాది రాయదుర్గం పట్టణానికి చెందిన అరవ రమే‹Ù, జయమ్మ దంపతుల కుమార్తె మౌనికతో శ్రీవారి వివాహం జరిపించారు. పెళ్లి పెద్దలుగా శ్రీవారి తరఫున బ్రాహ్మణులు, ఆలయ పాలక కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు వ్యవహరించారు. శనివారం ఉదయం మేళతాళాలతో పెళ్లి కూతురు అయిన పద్మావతి (మౌనిక)ని ఊరేగింపుగా మార్కండేయస్వామి ఆలయానికి తీసుకొచ్చారు. అక్కడ పెళ్లికూతురిని అలంకరించి కోటలోని శ్రీవారి సన్నిధి వరకు ఊరేగింపుగా తెచ్చారు. అనంతరం శ్రీవారి ఉత్సవ విగ్రహం ముందు కూర్చోబెట్టారు.వేద మంత్రోచ్ఛారణ మధ్య వివాహం జరిపించారు. అభిజిత్ లగ్న శుభపుష్కరాంశమునందు పురోహితులు మంగళసూత్రాన్ని బాలిక మెడకు తాకించి శ్రీవారి పక్కనే ఉన్న పద్మావతి ఉత్సవ విగ్రహానికి కట్టారు. పసుపు కొమ్ముతో ఉన్న మంగళసూత్రాన్ని బాలిక మెడలో తల్లి కట్టడంతో పెళ్లితంతు ముగిసింది. -
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
అనంతపురం ఎడ్యుకేషన్: ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్ నగరంలోని కేఎస్ఆర్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కేంద్రాన్ని పరిశీలించారు. ట్రైనీ కలెక్టర్ బి.వినూత్న టూటౌన్ పోలీస్స్టేషన్లో ప్రశ్నపత్రాల పంపిణీని పర్యవేక్షించారు. తర్వాత కేఎస్ఆర్ బాలికల జూనియర్ కళాశాల, ఎస్ఎస్బీఎన్ జూనియర్ కళాశాల, శ్రీ సత్యసాయి బాలికల జూనియర్ కళాశాల కేంద్రాలను వినూత్న పరిశీలించి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం మొదటి సంవత్సరం పరీక్షకు 183 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 3,517 మందికి గాను 3,346 మంది హాజరయ్యారు. 171 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 207 మందికి గాను 195 మంది హాజరయ్యారు. 12 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు జనరల్ విద్యార్థులు 507 మందికి గాను 479 మంది హాజరయ్యారు. 28 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విద్యార్థులు 89 మందికి గాను 85 మంది హాజరయ్యారు. నలుగురు గైర్హాజరయ్యారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ కమిటీ జిల్లా కన్వీనర్ ఎం.వెంకటరమణనాయక్ 5 కేంద్రాలు, డీఈసీ సభ్యులు నాలుగు, ఫ్లయింగ్స్క్వాడ్ సభ్యులు ఆరు కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలోని 45 కేంద్రాల్లో శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తెలుగు పరీక్షకు 5,423 మంది విద్యార్థులకు గాను 2,576 మంది హాజరయ్యారు. 2,847 మంది గైర్హాజరయ్యారు. డీఈఓ వరలక్ష్మి గుంతకల్లులో రెండు కేంద్రాలు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవింద్నాయక్ అనంతపురంలో మూడు కేంద్రాలు పరిశీలించారు. -
బ్రహ్మ రథోత్సవాన్ని విజయవంతం చేద్దాం
ఉరవకొండ: అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం విజయంతం చేద్దామని తహసీల్దార్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం నిర్వహణపై అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 28న లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మ రథోత్సవం నిర్వహించనున్నారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు సరఫరా చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆలయ ఈఓ కె.విజయ్కుమార్ కోరారు. బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్యశిబిరం ఏర్పాటు చేయలన్నారు. ఆర్టీసీ అధికారులు బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక సర్వీసులు నడపాలన్నారు. అగ్నిమాపకశాఖ తమ అత్యవసర సర్వీసులను అందుబాటులో ఉంచాలని, పెన్నహోబిలం పరిసరాల్లో అక్రమ మద్యం అమ్మకుండా ఎకై ్సజ్ శాఖ వారు చర్యలు తీసుకోవాలని కోరారు. -
జిల్లాలో పలు చోట్ల వర్షాలు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలోని పలు మండలాల్లో శుక్రవారం సాయంత్రం వర్షం కురిసింది. కణేకల్లు, గుత్తి, కళ్యాణదుర్గం, బెళుగుప్ప, గుమ్మఘట్ట, ఉరవకొండ మండలాల్లో 40 – 50 మి.మీ వర్షపాతం నమోదైంది. శెట్టూరు, బొమ్మనహాళ్, యాడికిలో 20 నుంచి 30 మి.మీ, అనంతపురం, గార్లదిన్నె, బుక్కరాయసముద్రం, రాప్తాడు, రాయదుర్గం, బ్రహ్మసముద్రం, ఆత్మకూరు, పుట్లూరు, పెద్దవడుగూరు, కంబదూరు తదితర మండలాల్లో మోస్తరుగా వర్షం కురిసింది. నేడు ఉమ్మడి జిల్లాకు వర్ష సూచన తుపాను ప్రభావం ఒడిశా, పశ్చిమబెంగాల్కు మళ్లిపోవడంతో రాగల ఐదు రోజులు పొడి వాతావరణం ఉంటుందని రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త జి.సహదేవరెడ్డి, వాతావరణ విభాగం సీనియర్ శాస్త్రవేత్త జి.నారాయణస్వామి తెలిపారు. శనివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదు కావచ్చన్నారు. -
నిబంధనలు తప్పనిసరి
● ఓట్ల లెక్కింపుపై మార్గదర్శకాలు జారీ చేసిన ఎన్నికల సంఘంఅనంతపురం అర్బన్: సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు అంశంపై ఆర్ఓలు, ఏఆర్ఓలు, ఎన్నికల డీటీలు, కౌంటింగ్ సిబ్బంది విధులకు సంబంధించి ఎన్నికల సంఘం మార్గదర్శకాలు నిర్దేశించింది. ముఖ్యంగా స్ట్రాంగ్ రూమ్ లే అవుట్పై ఇన్చార్జ్ అధికారి అవగాహన కలిగి ఉండాలి. నోడల్ అధికారులు వారికి అప్పగించిన పనులు సక్రమంగా నిర్వర్తించాలి. సందేహాలు వచ్చినప్పుడు ఆర్ఓలతో మాట్లాడాలి. అంతే తప్ప సొంత నిర్ణయాలు తీసుకుంటే చర్యలకు గురవుతారు. పోస్టల్ బ్యాలెట్, స్ట్రాంగ్ రూమ్ నోడల్ అధికారులు, సీలింగ్ అధికారులు, రో–ఇన్చార్జ్లు అనుసరించాల్సిన విధి విధానాలను ప్రత్యేకంగా సూచించింది. పోస్టల్ బ్యాలెట్, ఈటీపీబీఎస్ ఓట్లు ఎలా లెక్కించాలి, వ్యాలీడ్, ఇన్వ్యాలీడ్ ఓట్లను ఎలా గుర్తించాలి అనేదానిపై సిబ్బందికి త్వరలో శిక్షణ ఇవనున్నారు.. చెక్లిస్ట్ ప్రకారం ఏర్పాట్లు చేసుకోవాలి ● ఓట్ల లెక్కింపు రోజున అధికారులు వారికి కేటాయించిన విధులకు సంబంధించి చెక్లిస్ట్ ప్రకారం ఏర్పాట్లు చేసుకోవాలి. ● ఏ అంశాలకు, ఏ వస్తువులు ఉండాలి. లెక్కింపు కేంద్రంలో ఏ విధమైన ఏర్పాట్లు చేయాలనే అంశంపై అధికారులు అవగాహన కలిగి ఉండాలి. జూన్ 3వ తేదీ సాయంత్రానికి కౌంటింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి. ఫలితాల ప్రకటనలో అప్రమత్తంగా ఉండాలి ● రౌండ్ల వారీగా ఫలితాలు నమోదు, వాటిని ప్రకటించే క్రమంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అంకెల్లో పొరపాటు జరగకూడదు. ● రిటర్నింగ్ అధికారి ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు నిర్వహించాలి. అలాగే సహాయ ఆర్ఓ ఆధ్వర్యంలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన స్థానిక తహసీల్దార్ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు నిర్వహిస్తారు. ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ తెరుస్తారు ● ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్రూమ్లు తెరుస్తారు. స్ట్రాంగ్రూమ్లో ఒక నోడల్ అధికారి ఉంటారు. ● కౌంటింగ్కు ఈవీఎంలను ఆయన సిద్ధం చేస్తుంటారు. ఈవీఎంలకు సంబంధించిన ట్యాగ్ సరిగ్గా ఉందా లేదా అనేది పరిశీలిస్తారు. అవగాహనతో ఉండాలి ● కౌంటింగ్లో తలెత్తే సమస్యలను పరిష్కరించుకోవాలంటే ఓట్ల లెక్కింపు ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. ● పోస్టల్ బ్యాలెట్, ఈటీపీబీఎస్లో సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకోవాలి. పోస్టల్ బ్యాలెట్ లెక్కించేందుకు ఒక ఏఆర్ఓ, కంప్యూటర్ అసిస్టెంట్, కంప్యూటర్ సూపర్వైజర్, సూక్ష్మ పరిశీలకుడు ఉంటారు. ఈసీ పరిశీలకుల నిఘా ● కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు కౌంటింగ్ ప్రక్రియను, ఫలితాల తయారీ, డిక్లరేషన్ను దగ్గరుండి పరిశీలిస్తారు. ● కౌంటింగ్ పూర్తయి తుది ఫలితాలు ప్రకటన చేయగానే గెలుపొందిన అభ్యర్థికి ఫారం 21–ఇని అందజేయాలి. ● ఆర్ఓలు, ఏఆర్ఓలు, కౌంటింగ్ సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలి. ఫలితాలు ప్రకటన పూర్తయే వరకు కౌంటింగ్ సిబ్బంది కేంద్రాల వద్దనే ఉండాలి. -
పోస్టల్ బ్యాలెట్లలో టపాకట్టేవి ఎన్ని?
అనంతపురం అర్బన్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకోవడం సర్వసాధారణం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యోగులకు సంబంఽధించి జిల్లావ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 24,454 ఉండగా 20,755 ఓట్లు పోలయ్యాయి. వీటిలో ఎన్ని చెల్లుబాటు అవుతాయనే దానిపై ఉద్యోగ వర్గాల్లోనే ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇందుకు కారణమూ లేకపోలేదు. 2019 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 59.86 శాతం ఓట్లు చెల్లుబాటు కాలేదు. అప్పటి ఎన్నికల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలోని 14 నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ విధులు నిర్వర్తించిన 48,721 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం ఫారం–12 తీసుకున్నారు. ఇందులో 47,531 మంది ఉద్యోగులు (98 శాతం) పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తీరా ఓట్ల లెక్కింపులో 28,452 (59.86 శాతం) ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇదే ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. 2019 ఎన్నికల్లో పోలైన పోస్టల్ బ్యాలెట్లు 47 వేలు ఇందులో చెల్లని ఓట్లు 28 వేలు ప్రస్తుత ఎన్నికల్లో పోలైన పోస్టల్ బ్యాలెట్లు 20 వేలు -
నమో వేంకటేశ..
రాయదుర్గంటౌన్: పట్టణంలోని కోటలో వెలసిన కలియుగదైవం ప్రసన్న వేంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం శ్రీవారు భక్తులకు హనుమద్ వాహనంపై దర్శనమిచ్చారు. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. హనుమద్ వాహనోత్సవ సేవలో భాగంగా సుగాలి సంఘం ఆధ్వర్యంలో మేళతాళాలతో సాయంత్రం స్వామి వారిని హనుమద్ వాహనంపై కొలువుదీర్చి ఆలయం వద్ద నుంచి కోట, మొలకాల్మూరు రోడ్డు, వినాయక సర్కిల్, పాతబస్టాండ్, లక్ష్మీబజార్ మీదుగా ఊరేగించి..తిరిగి ఆలయానికి చేర్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు పాలాక్షిరెడ్డి, ఈఓ నరసింహారెడ్డి పాల్గొన్నారు. శ్రీవారి పెళ్లికి భక్తులంతా అతిథులే రాయదుర్గం: కోటలోని ప్రసన్న వెంకటరమణుడి ఆలయంలో శనివారం విశిష్ట సంప్రదాయ పద్ధతులతో జరిగే శ్రీవారి కల్యాణోత్సవానికి భక్తులంతా అతిథితులుగా తరలిరానున్నారు. శుక్రవారం వరుడిగా వెంకటేశ్వరుడు, వధువుగా అరవ తెగకు చెందిన 14 ఏళ్ల బాలికను ముస్తాబు చేశారు. శనివారం ఉదయం కన్యాదాత స్వగృహం నుంచి వరుడు ఉండే వేంకటరమణుడి ఆలయం వరకు చేపట్టే ఊరేగింపునకు చేసిన ఏర్పాట్లను ఆలయ ఈఓ నరసింహారెడ్డి పరిశీలించారు. 11:30 గంటలకు జీలకర్ర, బెల్లం పెట్టి సంప్రదాయ పద్ధతి ప్రకారం కల్యాణం జరిపించనున్నారు. -
కౌంటింగ్ ప్రశాంతంగా సాగాలి
అనంతపురం అర్బన్: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జూన్ 4న చేపట్టే ఓట్ల లెక్కింపునకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్ తెలిపారు. కౌంటింగ్ నిర్వహణ, ఏర్పాట్లపై కలెక్టర్ శుక్రవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో ఎస్పీ గౌతమి శాలితో కలిసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకూ అభ్యర్థులు, రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని కోరారు. ఎన్నికల ఫలితాలను స్పోర్టివ్గా తీసుకోవాలని సూచించారు. అమలులో 144 సెక్షన్ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని కలెక్టర్ తెలిపారు. అదే విధంగా 133 సెక్షన్ కింద ఇతరులకు హాని కలిగించే ఆయుధాలు, రాళ్లు, కర్రలు, తదితర వస్తువులు కలిగి ఉండకూడదన్నారు. ఎన్నికల కోడ్ ముగిసే జూన్ 6వ తేదీ వరకు బాణసంచా అమ్మకాలు, కొనుగోలు, రవాణా, వినియోగంపై నిషేధం విధించామన్నారు. దీన్ని ఎవరూ ఉల్లంఘించకూడదన్నారు. హింసకు తావివ్వరాదు ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎక్కడా హింసకూ తావివ్వరాదని ఎస్పీ గౌతమి శాలి అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. హింస సృష్టించినా, సృష్టించాలని చూసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదని చెప్పారు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేందుకు అవసరమైన బందోస్తు ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని చెప్పారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎనిమిది మందిని జిల్లా నుంచి బహిష్కరణ చేశామన్నారు. గొడవలు చేస్తారని గుర్తించిన వారిని బైండోవర్ చేస్తున్నామన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వైఖోమ్ నిదియాదేవి, నగర పాలక కమిషనర్ మేఘ స్వరూప్, డీఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, ఏఎస్పీ విజయభాస్కర్రెడ్డి, రిటర్నింగ్ అధికారులు, అభ్యర్థులు, పార్టీల ప్రతినిధులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కౌంటింగ్కు 1,354 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) ప్రక్రియ నిర్వహించేందుకు 1,354 మంది సిబ్బందిని నియమించామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్ చెప్పారు. శుక్రవారం కలెక్టరేట్ ఎన్ఐసీలో కౌంటింగ్ సిబ్బందికి సంబంధించి ఒకటవ ర్యాండమైజేషన్ ప్రక్రియను కలెక్ట్టర్ నిర్వహించారు. ఈసీ ఆదేశాల మేరకు సీపీఎంఎస్ సాఫ్ట్వేర్లో ఆన్లైన్ ద్వారా పారదర్శకతతో కౌంటింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ చేపట్టామన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వైఖోమ్ నిదియాదేవి, అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డీఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, ఎన్ఐసీ డీఐఓ రవిశంకర్, అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. అభ్యర్థులు, రాజకీయ పార్టీలు సహకరించాలి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వినోద్కుమార్ -
సాగులో సలహాలు తీసుకోవాలి
గుమ్మఘట్ట: రైతులు సాగు సమయంలో అధికారుల సలహాలు, సూచనలను పరిగణనలో తీసుకోవాలని కలెక్టర్ వినోద్కుమార్ తెలిపారు. మండల కేంద్రం గుమ్మఘట్టలో సబ్సిడీ విత్తన వేరుశనగ పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా విత్తన వేరుశనగ పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలో ప్రతి రైతుకూ సబ్సిడీతో విత్తన వేరుశనగ అందించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఆలిండియా రేడియోలో ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని రెండు రోజుల్లో ప్రవేశపెట్టాలని జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మను ఆదేశించారు. ముందస్తుగా వర్షాలు కురుస్తున్న తరుణంలో రైతులు పొలాలను దుక్కిచేసుకోవాలని సూచించారు. సజ్జ, ఆముదం, ఉలవ, కొర్రలు, కందులు, పత్తి, పెసలు, అలసంద తదితర విత్తనాలను సబ్సిడీపై అందించేందుకు కృషి చేయాలని పలువురు రైతులు కలెక్టర్ను కోరారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న, ఆర్డీఓ సుస్మితరాణి, ఏడీఏ లక్ష్మానాయక్, ఏపీ సీడ్స్ మేనేజర్ సుబ్బయ్య, ఎంపీడీఓ గౌరీదేవి, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఏఓ నిర్మల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. సబ్సిడీ విత్తన పంపిణీ ప్రారంభం అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం 40 శాతం రాయితీపై విత్తన వేరుశనగ కాయల పంపిణీ ప్రారంభమైంది. గుమ్మఘట్టలో కలెక్టర్ వినోద్కుమార్ లాంఛనంగా ప్రారంభించగా మిగతా ప్రాంతాల్లో ఏడీఏలు, ఏఓలు, ఏపీ సీడ్స్ అధికారుల ఆధ్వర్యంలో పంపిణీ జరిగిందని జేడీఏ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. 388 ఆర్బీకేల పరిధిలో 76,710 క్వింటాళ్ల నాణ్యమైన విత్తన వేరుశనగ రైతులకు అందించనున్నట్లు వెల్లడించారు. అర్హత కలిగిన ప్రతి రైతుకూ విత్తనం అందిస్తామని తెలిపారు. ఒకవైపు విత్తన రిజిస్ట్రేషన్, మరోవైపు పంపిణీ కొనసాగిస్తామన్నారు. తొలిరోజు మధ్యాహ్నం తర్వాత పంపిణీ మొదలు పెట్టడంతో విత్తన పంపిణీ తక్కువగానే జరిగినట్లు ఆ శాఖ వర్గాలు తెలిపాయి. -
బీటీ ప్రాజెక్ట్ ఆధునికీకరణకు చర్యలు
గుమ్మఘట్ట: బైరవానితిప్ప ప్రాజెక్ట్ ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వినోద్కుమార్ స్పష్టం చేశారు. మండలంలోని బీటీపీ గ్రామ సమీపంలో ఉన్న ప్రాజెక్ట్ను అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న, ఆర్డీఓ రాణిసుస్మితతో కలసి శుక్రవారం ఆయన పరిశీలించారు. ప్రాజెక్టు స్థితిగతులపై జలవనరుల శాఖ ఈఈ నారాయణస్వామి నాయక్తో ఆరా తీశారు. రెండు టీఎంసీల సామర్థ్యంగల ప్రాజెక్టుకు ఎగువన కర్ణాటక నుంచి వేదవతి హగరి ద్వారా వరద వచ్చి చేరుతుందని ఈఈ తెలిపారు. అయితే ప్రాజెక్ట్ ఎగువన అక్రమ కట్టడాలతో నీరు సక్రమంగా అందడం లేదని వివరించారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లోని రెండు మండలాల్లో కుడి, ఎడమ కాలువల ద్వారా 12 వేల ఎకరాలకు రొటేషన్ పద్దతిలో సాగు నీటిని అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అయితే కాలువల్లో పూడిక తీతలో నిర్లక్ష్యం వహించడంతో దిగువన ఉన్న ఆయకట్టుకు నీరు అందడం లేదని రైతులు వాపోయారు. రిజర్వాయర్కు తగినంత సిబ్బందిని నియమించి, ముందస్తుగా కాలువల పూడిక తీత పనులు చేపట్టాలని కోరారు. అనంతరం ఆయకట్టు కాలువలను కలెక్టర్ పరిశీలించారు. ఉపాధి పథకం కింద కాలువల్లో పూడికతీత పనులు చేపడతామని రైతులకు భరోసానిచ్చారు. కార్యక్రమంలో ఆత్మ పీడీ మద్దిలేటి, జలవనరుల శాఖ డీఈ బలరాం, ఏఈలు సాయిరాం, హరీష్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ వినోద్కుమార్ -
హంస వాహనంపై నారసింహుడు
ఉరవకొండ:పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో శుక్రవారం హంసవాహనోత్సవ సేవ వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారు హంస వాహనంపై మాడవీధుల్లో దర్శనిమిచ్చారు. స్వామి వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. హంసను జ్ఞానానికి ప్రతీకగా పేర్కొంటారు. భక్తుల్లో నెలకొన్న అహంభావాన్ని తొలగించి జ్ఞానసిద్ధి, బ్రహ్మపద ప్రాప్తి ప్రసాదించేందుకు స్వామి వారు హంస వాహనంపై కన్పిస్తాడని పండితులు తెలిపారు. కార్యక్రమంలో ఈఓ విజయ్కుమార్, ఆలయ ప్రధాన అర్చకులు ద్వారకనాథాచార్యులు, బాలాజీస్వామి పాల్గొన్నారు. -
బాలింతలకు ఇన్ఫెక్షన్
● కుట్లు వేసిన ప్రాంతంలో చీము ● ప్రతి పది మందిలో ముగ్గురిది అదే పరిస్థితి ● ప్రస్తుతం జీజీహెచ్లో 15 మందికిపైగా బాధితులు అనంతపురం మెడికల్: ఉమ్మడి జిల్లాలోని ప్రజలకు పెద్ద దిక్కుగా సర్వజనాస్పత్రి (జీజీహెచ్)లో వైద్య సేవలు నానాటికీ నరకప్రాయమవుతున్నాయి. రోజు వారీ ఓపీ 2,500, ఐపీ 1,300 వరకు ఉంటోంది. నిర్వహణ లోపం కారణంగా సమస్యలు కుప్పలు తెప్పలుగా ఉత్పన్నమవుతున్నాయి. మొన్నటి మొన్న విద్యుత్ సరఫరాలో అంతరాయం చోటు చేసుకుని గంటల తరబడి వైద్య సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. తాజాగా గైనిక్ వార్డులో ఇన్ఫెక్షన్ కారణంగా పలువురు బాలింతలు పడుతున్న విషయం వెలుగుచూసింది. ఫలితంగా ప్రసవం జరిగిన తర్వాత రోజుల తరబడి ఆస్పత్రిలో అడ్మిషన్లోనే ఉంటున్నారు. ఈ క్రమంలోనే రెండోసారి సైతం బాలింతలకు కుట్లు వేయాల్సిన దారుణమైన పరిస్థితి నెలకొంది. ఆస్పత్రి ఉన్నతాధికారులు, గైనిక్ విభాగం వైద్యుల పర్యవేక్షణ.. సురక్షిత ప్రమాణాలు పాటించకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం ఆస్పత్రిలోని గైనిక్ విభాగంలో 15 మందికిపైగా బాలింతలు ఇన్ఫెక్షన్ సోకి తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఆస్పత్రిలో రోగులకందే సేవల్లో వైద్యుల బాధ్యతారాహిత్యంపై ఇప్పటికై నా కలెక్టర్ వినోద్కుమార్ స్పందించాలని పలువురు కోరుతున్నారు. ప్రతి పది మందిలో ముగ్గురు సర్వజనాస్పత్రిలోని ప్రసూతి విభాగంలో రోజూ 25 నుంచి 30 ప్రసవాలు జరుగుతాయి. ఇందులో 5 నుంచి 10 సిజేరియన్లు ఉంటున్నాయి. గత నెలన్నర రోజులుగా సిజేరియన్ కేసుల్లో ప్రతి పది మందిలో ముగ్గురు ఇన్ఫెక్షన్ బారిన పడినట్లుగా రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. ఇన్ఫెక్షన్ సోకడంతో బాలింతలకు కుట్లు వేసిన ప్రాంతంలో చీము వస్తోంది. సురక్షిత ప్రమాణాలు పాటించకపోవడమే ఇన్ఫెక్షన్కు కారణంగా వైద్యులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఫ్యుమిగేషన్ చేయిస్తున్నాం బాలింతలకు సిజేరియన్ చేసిన ఐదు రోజుల్లోపు పుండు(ఊండ్) మానాలి. అయితే ఇన్ఫెక్షన్ కారణంగా గాయం నయం కావడం లేదన్న మాట వాస్తవమే. దీనిపై మైక్రో బయాలజీ విభాగం సూచన మేరకు గైనిక్ విభాగంలోని ఓ వార్డును ప్యుమిగేషన్ చేయించాం. మరో వార్డును ఫ్యుమిగేషన్ చేయించి బాలింతలకు మెరుగైన సేవలందిస్తాం. – డాక్టర్ కేఎస్ఎస్ వెంకటేశ్వర రావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ -
‘ఏపీ మోడల్’లో ఇంటర్ దరఖాస్తులకు ముగిసిన గడువు
● రాయదుర్గంలో అత్యధికంగా 272 దరఖాస్తులు రాయదుర్గంటౌన్: జిల్లాలోని ఏపీ ఆదర్శ పాఠశాల( ఏపీ మోడల్ స్కూల్)ల్లో మొదటి సంవత్సరం ఇంటర్ ప్రవేశాలకు విశేష స్పందన లభించింది. ఇంటర్మీయట్లో వివిధ కోర్సుల ప్రవేశాలకు గురువారంతో గడువు ముగిసింది. జిల్లాలో మొత్తం 15 మోడల్ స్కూళ్లు ఉండగా ఆన్లైన్ ద్వారా మొత్తం 1,890 దరఖాస్తులు అందాయి. జిల్లాలో అత్యధికంగా రాయదుర్గం ఏపీ మోడల్ స్కూల్కు 272 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా తర్వాతి స్థానాల్లో గుత్తిలో 269, గార్లదిన్నెలో 210, పామిడిలో 208, కళ్యాణదుర్గంలో 196, తాడిపత్రిలో 163, రాప్తాడులో 149, పుట్లూరులో 148, ఉరవకొండలో 131, విడపనకల్లులో 89, కణేకల్లులో 78, శెట్టూరులో 70, వజ్రకరూరులో 62, యల్లనూరులో 59, యాడికి మోడల్ స్కూల్కు 58 మంది దరఖాస్తు చేసుకున్నారు. గడువు ముగియడంతో టెన్త్ ఫలితాల్లో మెరిట్ ప్రాతిపదికన అడ్మిషన్లు ప్రారంభించుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు రాయదుర్గం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటేశులు తెలిపారు. మోడల్ స్కూళ్లలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సులు ఆంగ్థ మాధ్యమంలో అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కోర్సులో 40 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నారు. పుస్తకాలందలేదనే ఫిర్యాదు రాకూడదు గుంతకల్లు: ప్రభుత్వం సరఫరా చేసే పాఠ్యపుస్తకాలు అందలేదనే ఫిర్యాదు రాకుండా చూసుకోవాలని డీఈఓ వరలక్ష్మి సూచించారు. పట్టణంలోని డాక్టర్ సర్వేపల్లి రాధకృష్ణన్ మున్సిపల్ హైస్కూల్లో ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలను భద్రపరిచారు. శుక్రవారం డీఈఓ తనిఖీ చేశారు. పట్టణంలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి? ఇండెంట్ ప్రకారం పాఠ్యపుస్తకాలు అందాయా? ఇంకా ఏమైనా పెండింగ్ ఉన్నాయా? అని ఎంఈఓలు మస్తాన్రావు, సుబ్బరాయుడులను అడిగి తెలుసుకున్నారు. 1–7 విద్యార్థుల పుస్తకాలు తక్కువ వస్తే జిల్లా మేనేజర్కు, 8–10 పుస్తకాలు తక్కువస్తే విజయవాడకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రతి విద్యార్థికీ సకాలంలో పుస్తకాలు అందజేయాలన్నారు. ప్రభుత్వ బడుల్లో అడ్మిషన్లు పెరగాలి కూడేరు: ప్రభుత్వ బడుల్లో ఎక్కువ మంది పిల్లలు చేరేలా చూడాలని డీఈఓ వరలక్ష్మి మండల విద్యాధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె కూడేరు ఎమ్మార్సీని సందర్శించారు. ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన నోట్, పాఠ్యపుస్తకాల గురించి అడిగి తెలుసుకున్నారు. స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేసుకుని విద్యా సామగ్రిని భద్రంగా నిల్వ ఉంచి, బడులు తెరిచాక విద్యార్థులందరికీ పంపిణీ చేయాలని మండల అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ బడుల్లో అందించే నాణ్యమైన విద్య గురించి పిల్లల తల్లిదండ్రులకు వివరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ–1 చంద్రశేఖర్, ఎంఈఓ–2 సాయికృష్ణ, సీఆర్పీలు రమణ, శివ, ఆదిలక్ష్మి పాల్గొన్నారు. నాలుగో రోజు కొనసాగిన సిట్ విచారణ తాడిపత్రి అర్బన్: ఎన్నికల సమయంలో, ఆ తర్వాత తాడిపత్రిలో చోటు చేసుకున్న అల్లర్లపై సమగ్ర విచారణ చేసి ప్రాథమిక నివేదికను అందజేసిన సిట్ అధికారులు... మరింత లోతైన విచారణలో భాగంగా రెండో విడత తాడిపత్రికి విచ్చేశారు. ఇప్పటికే మూడు రోజులుగా విచారణ కొనసాగింది. నాలుగో రోజు శుక్రవారం కూడా విచారణను అధికారులు చేపట్టారు. మూడు రోజులుగా రూరల్ పోలీస్ స్టేషన్లో మకాం వేసిన సిట్ బృందం అల్లర్లకు సంబంధించిన ఎఫ్ఐఆర్లను శుక్రవారం పరిశీలించింది. ఇప్పటి వరకూ నిందితుల్లో ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు. ఎంత మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు అనే అంశాలపై పరిశీలిస్తోంది. అంతేకాక అల్లర్లకు ముందు టీడీపీ వర్గీయులు భారీ సంఖ్యలో జేసీ నివాసం వద్దకు ఎలా చేరుకున్నారు అనే విషయంపై సిట్ బృందం లోతుగా విచారణ చేపట్టింది. పక్కా పథకం ప్రకారమే ముందుగానే ఆందోళనకారులు పట్టణంలోకి చొరబడ్డారా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. -
ఇసుక దిబ్బలను సందర్శించిన జీఐజెడ్ బృందం
కణేకల్లు: మండలంలోని వేదవతి హగరి నదీ పరీవాహక ప్రాంతంలోని ఇసుక దిబ్బలను జెసెల్ షాఫ్ట్ ఫర్ ఇంటర్నేషనల్ జుసమ్మెనర్బీట్ (జీఐజెడ్) బృందం సభ్యులు శుక్రవారం సందర్శించారు. కళేకుర్తి, మాల్యం, నాగేపల్లి, తుంబిగనూరు, గరుడచేడు, మీనహళ్లి, బిదరకుంతం గ్రామాల్లోని వ్యవసాయ భూముల్లో పర్వతాలను తలపించేలా ఏర్పడిన ఇసుక దిబ్బలను చూడగానే జీఐజెడ్ టెక్నికల్ ఎక్స్పర్ట్ గోపీనాథ్, అసిస్టెంట్ టెక్నికల్ నిపుణుడు సంతోష్, ప్లానింగ్ నిపుణుడు ప్రసాద్ ఆశ్చర్యపోయారు. వారి వెంట రాయదుర్గం ఏపీడీ అసిస్టెంట్ దేవరాజు, ఏపీఓ సుధాకర్ ఉన్నారు. ఈ సందర్భంగా రైతులతో సమావేశమై రోజురోజుకూ విస్తరిస్తున్న ఇసుక మేటల వల్ల కలిగే పంట నష్టాలపై, పంటల సాగుకు తలెత్తుతున్న అవాంతరాలను అడిగి తెలుసుకున్నారు. ఆషాఢంలో వేగంగా వీచే గాలి వల్ల ఇసుక తెరలు తెరలుగా లేచి పక్క భూముల్లో పడుతుందని రైతులు తెలిపారు. వేరుశనగ విత్తు మొదలు మొలకెత్తే వరకూ తామెంతో ఆందోళనతో గడపాల్సి వస్తోందన్నారు. ఇదే ఇసుక నల్లరేగడి భూములు, చౌడు భూములకు తరలించి ఆ భూమిపై పరిచి పంటలు సాగు చేస్తే మేలైన దిగుబడులు వస్తున్నాయని రైతులు తెలిపారు. అవసరమైన రైతులకు ఈ ఇసుకను తరలించే ప్రక్రియ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇసుక తరలింపుతోపాటు పలుచోట్ల రేగు, సరుగుడు, గోరింటాకు తదితర చెట్లను పెంచడం వల్ల కూడా ఎడారి నివారణకు సత్ఫలితాలిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం ఎడారి నివారణకు చేపట్టాల్సిన చర్యలపై నివేదిక సిద్ధం చేసి కలెక్టర్కు సమర్పించనున్నట్లు జీఐజెడ్ బృందం సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో బొమ్మనహళ్ ఏపీఓ రమేష్, టెక్నికల్ అసిస్టెంట్లు సోమన్నగౌడ్, హరి, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు. కార్మిక సమస్యలు పరిష్కరించండి ● డీఆర్ఎంకు ఎంప్లాయీస్ సంఘ్ విన్నపం గుంతకల్లు: రైల్వేలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలకు న్యాయపరమైన పరిష్కారం చూపాలని డీఆర్ఎం వినీత్సింగ్కు దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ గుంతకల్లు డివిజన్ ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. స్థానిక డీఆర్ఎం కార్యాలయంలోని మీటింగ్ హాల్ శుక్రవారం ఎంప్లాయీస్ సంఘ్ నాయకులతో డీఆర్ఎం పీఎన్ఎం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ... మహిళ ఉద్యోగులకు అన్ని రైల్వేస్టేషన్లు, పని చేసే ప్రదేశాల్లో ప్రత్యేక రెస్ట్ రూమ్లు, గ్యాంగ్మెన్స్కు రెస్ట్ కం టూల్బాక్స్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. రన్నింగ్ స్టాఫ్కు రన్నింగ్ రూమ్ల్లో ప్రత్యేక గదులు నిర్మించాలని కోరారు. గుత్తి రైల్వే ఆస్పత్రిలో అంబులెన్స్ సౌకర్యం కల్పించాలన్నారు. లోకోపైలెట్ పని గంటలు తగ్గించడంతోపాటు ఎలాంటి జాప్యం లేకుండా ప్రమోషన్లు కల్పించాలన్నారు. రైల్వే క్వాటర్స్ చాలా అధ్వానంగా ఉన్నాయని, వాటికి మరమ్మతులు చేయాలని సూచించారు. కొత్త క్వాటర్స్ను నిర్మించాలని కోరారు. సమ్యసలపై డీఆర్ఎం వినీత్సింగ్ సానుకులంగా స్పందించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఎంప్లాయీస్ సంఘ్ డివిజన్ అధ్యక్షుడు బాబు, నాయకులు మల్లికార్జున, కుళ్లాయప్ప, వెంకటేశ్వర్లు, సుభాష్బాబు, బాలకృష్ణ, అప్పారావు, రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు. మత్స్య శాఖ ఉద్యోగి ఆత్మహత్య గార్లదిన్నె: మండలంలోని పెనకచెర్ల డ్యాంలో ఉన్న మత్స్యశాఖ కేంద్రంలో ఫిషర్ మ్యాన్గా పనిచేస్తున్న అల్లాబకాష్ (54) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు పెనకచెర్ల డ్యాం నివాసి అయిన అల్లాబకాష్ మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక శుక్రవారం ఆయన మృతి చెందారు. మృతుడికి భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
తాడిపత్రిలో సిట్.. అల్లర్లపై కొనసాగుతున్న దర్యాప్తు
సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురం తాడిపత్రి అల్లర్ల ఘటనలపై సిట్ బృందం దర్యాప్తు చేపట్టింది. కేసుల వివరాలు, నిందితుల గుర్తింపు లాంటి అంశాలపై సిట్ ఆరా తీస్తోంది. మరోవైపు.. అరెస్టులు కొనసాగుతున్నాయి. పూర్తిస్థాయిలో విచారణ చేసిన తర్వాతే నివేదికను సిద్ధం చేయాలని సిట్ భావిస్తోంది.పల్నాడు జిల్లాలో పోలింగ్ డే ఘటనల్లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల్ని పోలీసులు గుర్తిస్తున్నారు. నిన్న(గురువారం) పల్నాడులో 60 మందికిపైగా అరెస్టులు జరిగాయి. 33 మంది పెట్రోల్ బాంబులతో దాడులకు తెగబడినట్లు నిర్ధారణ అయ్యింది. నిందితుల్ని నరసరావుపేట కోర్టులో హాజరుపరిచి.. నెల్లూరు జిల్లా జైలుకు పోలీసులు తరలించారు.పల్నాడుపై సిట్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. పల్నాడు జిల్లా పోలింగ్ నాటి హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తు చేస్తోంది. మరోవైపు.. ఈవీఎం ధ్వంసం ఘటనపై సిట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్లాల్ నేతృత్వంలోనే విచారణ కొనసాగుతోంది. ఎస్పీ ఆధ్వర్యంలో దర్యాప్తు సాగుతోంది.ఈవీఎం ధ్వంసం వెనుక కారణాలపై సిట్ ఆరా తీస్తోంది. పిన్నెల్లి వీడియోతో సంబంధం లేదని ఈసీ ప్రకటించగా, వీడియో బయటకు ఎలా వచ్చిందనేదానిపై సిట్ విచారణ చేపట్టనుంది. కుట్ర కోణాలు ఉన్నాయా? అనే అంశంపై సిట్ పరిశీలించనుంది. మాచర్ల, పల్నాడు ఈవీఎం ఘటనలపై సిట్ సమగ్ర నివేదిక సిద్ధం చేయనుంది. -
కౌంటింగ్ రోజు తాడిపత్రిలో కట్టుదిట్టమైన భద్రత
తాడిపత్రి అర్బన్: కౌంటింగ్ సందర్భంగా తాడిపత్రిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి, జిల్లా ఎస్పీ గౌతమి శాలి గురువారం పట్టణంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, టీడీపీ నేత జేసీ ప్రభాకర్రెడ్డి నివాస ప్రాంతాలు, జూనియర్ కళాశాల మైదానంతో పాటు ఫ్లై ఓవర్, పుట్లూరు రోడ్డులోని టీడీడీ కల్యాణ మండపం, యల్లనూరు రోడ్డులోని శివాలయం, కడప రోడ్డులోని ఐశ్వర్య విల్లాస్, సజ్జలదిన్నె క్రాస్, చుక్కలూరు క్రాస్, నందలపాడు, పెద్దపప్పూరు రోడ్డులో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులను పరిశీలించారు. అనంతరం డీఎస్పీలు జనార్దన్నాయుడు, శివారెడ్డి, బి.శ్రీనివాసులు, శివభాస్కర్రెడ్డితో మాట్లాడుతూ కౌంటింగ్ రోజున అనుమానితులెవ్వరూ పట్టణంలోకి ప్రవేశించకుండా శివార్లలో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. ముఖ్య నాయకుల ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ పకడ్బందీగా అమలు చేయాలన్నారు. కార్యక్రమంలో సీఐలు నాగేంద్రప్రసాద్, లక్ష్మీకాంత్రెడ్డి, ఎస్ఐలు గౌస్బాషా, సాగర్లు ఉన్నారు. -
కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్
అనంతపురం అర్బన్: వేరుశనగ విత్తనకాయల పంపిణీ, భారీ వర్షాల నేపథ్యంలో ఫిర్యాదుల స్వీకరణకు కలెక్టరేట్లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ వి.వినోద్కుమార్ తెలిపారు. వివరాలను ఆయన గురువారం వెల్లడించారు. విత్తనకాయల పంపిణీ క్రమంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నా, వర్షాల కారణంగా సమస్యలు ఎదురైనా తక్షణం కమాండ్ కంట్రోల్ రూమ్ నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చన్నారు. రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫోన్ నంబర్లు ● 18004258802 లేదా 08554– 234122 ● 18004258803 లేదా 08554– 239822 ● 18004258804 లేదా 08554– 231722 బీటెక్ ఫలితాల విడుదల అనంతపురం: జేఎన్టీయూ (ఏ) పరిధిలో మే నెలలో నిర్వహించిన బీటెక్ నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ ఈ. కేశవ రెడ్డి తెలిపారు. పరీక్ష ఫలితాల కోసం జేఎన్టీయూ అనంతపురం వెబ్సైట్లో చూడాలని కోరారు. -
కుంట.. ఇంకిపోదంట!
ఏ నీటి వనరులో నిల్వ ఉన్న నీరైనా ఎప్పటికో ఒకసారి ఇంకిపోతుంటుంది. నెలలు కావచ్చు, ఏళ్లు కావచ్చు కానీ నీరు ఖాళీ కావడం మాత్రం ఖాయం. కానీ, పుట్లూరు మండలం చాలవేముల సమీపంలోని జాజికొండపై ఉన్న నీటి కుంటలో మాత్రం నీరు అసలు ఇంకి పోవడమే లేదు. ఎత్తైన కొండపై చౌడేశ్వరీ అమ్మవారి ఆలయం పక్కనే ఈ కుంట ఉంది. రాతిబండపై సహజ సిద్ధంగా ఏర్పడిన ఈ కుంటలోని నీటి ద్వారా ఆలయానికి వచ్చే భక్తులతో పాటు మూగజీవాలు దప్పిక తీర్చుకుంటున్నాయి. వర్షాభావ పరిస్థితుల్లో సైతం ఈ కొండపై నీరు నిల్వ ఉంటోంది. రాతి బండ కావడం వల్లే నీరు ఏళ్ల తరబడి ఇంకిపోవడం లేదని కొందరు అంటుండగా, చౌడేశ్వరి అమ్మవారి మహిమ వల్లే ఎండిపోవడం లేదని భక్తులు చెబుతున్నారు. – పుట్లూరు: -
జిల్లాకు భారీ వర్ష సూచన
అనంతపురం అర్బన్: ‘రానున్న మూడు నాలుగు రోజుల్లో జిల్లాకు భారీ వర్ష సూచనలున్నాయి. వాన కారణంగా విపత్తులు సంభవిస్తే ఎదుర్కొనేందుకు అన్ని విధాల సిద్ధంగా ఉండాలి’ అని కలెక్టర్ వి.వినోద్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వర్షాలు కురవనున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలు, ఏర్పాట్లపై కలెక్టర్ గురువారం కలెక్టరేట్లోని రెవెన్యూభవన్లో అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. భారీ వర్షాలు కురిస్తే క్షేత్రస్థాయిలో ఎలా వ్యవహరించాలనే దానిపై అధికారులు తమ పరిధిలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయాలని ఆదేశించారు. అవసరమైన చోట్ల సహాయక చర్యలు అందించేందుకు సన్నద్ధంగా ఉండాలన్నారు. ఆర్డీఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలన్నారు. వరి, మొక్కజొన్న పంటలు కోత దశలో ఉన్నందున వాటిని కాపాడేందుకు రైతులతో కలిసి చర్యలు తీసుకోవాలని సూచించారు. పశువులను పాకల్లోనే ఉంచుకునేలా చూడాలన్నారు. ఈదురుగాలులు, భారీ వర్షాల కారణంగా విద్యుత్ స్తంభాలు పడిపోతే తక్షణం మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని చెప్పారు.భారీ వర్షాల కారణంగా చెరువులకు గండ్లు పడే ప్రమాదం ఉంటుందని,అప్రమత్తంగా ఉంటూ గండ్లు పూడ్చేందుకు అవసరమైన చర్యలను తక్షణం తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. గతంలో నీట మునిగిన ప్రాంతాల ప్రజలతో తహసీల్దార్లు సమావేశం నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు. రెవెన్యూ అధికారులు పోలీసు యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. చౌక ధరల దుకాణాలకు రేషన్ను 48 గంటల్లో సరఫరా చేయాలని ఆదేశించారు. నగర పాలక సంస్థలో ఒక బృందం ఏర్పాటు చేసి అత్యవసర స్పందన వాహనం సిద్ధంగా ఉంచుకోవాలని కమిషనర్ను ఆదేశించారు. కాలువల్లో పూడికతీత, పడిపోయిన చెట్ల తొలగింపు ఎప్పటికప్పుడు చేపట్టాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ వైఖోమ్ నిదియాదేవి, నగర పాలక కమిషనర్ మేఘ స్వరూప్, అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డీఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, ఏఎస్పీ విజయభాస్కర్రెడ్డి, ఆర్డీఓలు రాణి సుస్మిత, శ్రీనివాసులురెడ్డి, వెంకటేష్, డిప్యూటీ కలెక్టర్లు, ఇతర అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. విపత్తులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి అధికారులకు కలెక్టర్ వినోద్కుమార్ ఆదేశం అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు పిలుపు -
No Headline
అనంతపురం అగ్రికల్చర్: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం వేరుశనగ పంపిణీ ప్రారంభం కానుంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజాప్రతినిధులతో సంబంధం లేకుండా అధికారులు ఆర్బీకేల్లో విత్తన కాయల పంపిణీ ప్రారంభించనున్నారు. కలెక్టర్ వినోద్కుమార్ గుమ్మఘట్టలో లాంఛనంగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని జిల్లా వ్యవసాయాధికారిణి ఉమామహేశ్వరమ్మ తెలిపారు. వ్యవసాయశాఖ, ఏపీ సీడ్స్ ఆధ్వర్యంలో జిల్లాకు కేటాయించిన 76,710 క్వింటాళ్లలో ఇప్పటికే 30 వేల క్వింటాళ్లు ఆర్బీకేల్లో నిల్వ చేశారు. కే–6,టీసీజీఎస్–1694 రకం విత్తన వేరుశనగ పూర్తి ధర రూ. 9,500 కాగా, అందులో 40 శాతం అంటే 3,800 రాయితీ పోనూ రైతులు తమ వాటా కింద రూ.5,700 చెల్లించాల్సి ఉంటుంది. కదిరి–లేపాక్షి 1812 రకం ధర రూ.8,700 కాగా, 40 శాతం రూ.3,480 పోనూ రైతులు రూ.5,220 చెల్లించాలి. ఒక్కో రైతుకు గరిష్టంగా 90 కిలోలు (30 కిలోల బస్తాలు మూడు) పంపిణీ చేయనున్నారు. కే–6, టీసీజీఎస్–1694 రకం 30 కిలోల బస్తాకు రైతులు రూ.1,710 చెల్లించాలి. కదిరి–లేపాక్షి 1812 రకం అయితే రాయితీ పోనూ రూ. 1,566 ప్రకారం చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ రైతులకు ప్రాధాన్యం.. జిల్లాలో ఈ నెల 18 నుంచి ఆర్బీకేల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు. ఇప్పటి వరకు 40,704 మంది రైతులు 35,933 క్వింటాళ్లకు బయోమెట్రిక్, మొబైల్ ఓటీపీ విధానంలో పేర్లు నమోదు చేసుకున్నారు. విత్తన పంపిణీలో ఎస్సీ ఎస్టీ, కౌలు రైతులు, చిన్న సన్నకారు రైతులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. జిల్లాకు 76,710 క్వింటాళ్ల విత్తన వేరుశనగ కేటాయించగా, అందులో కదిరి–లేపాక్షి రకం 2 వేల క్వింటాళ్లు, టీసీజీఎస్–1694 రకం 1,765 క్వింటాళ్లు ఇవ్వగా మిగతా కే–6 ఇవ్వనున్నారు. అత్యధికంగా కళ్యాణదుర్గం డివిజన్కు 21,800 క్వింటాళ్లు కేటాయించగా, అనంతపురం డివిజన్కు 14,400 క్వింటాళ్లు, రాయదుర్గం డివిజన్కు 14,150, ఉరవకొండ డివిజన్కు 9,600, గుత్తి డివిజన్కు 9,200, తాడిపత్రి డివిజన్కు 2,400 క్వింటాళ్లు కేటాయించారు. మరికొంత బఫర్స్టాక్ కింద అందుబాటులో ఉంచనున్నట్లు వ్యవసాయశాఖ, ఏపీ సీడ్స్ అధికారులు తెలిపారు. 3.46 లక్షల హెక్టార్లలో ఖరీఫ్! ఈ ఖరీఫ్లో 3.46 లక్షల హెక్టార్లలో అన్ని రకాల పంటలు సాగులోకి రావచ్చని అంచనా వేశారు. అందులో ప్రధానంగా వేరుశనగ 1.98 లక్షల హెక్టార్లుగా లెక్కగట్టారు. పత్తి, కంది, ఆముదం, మొక్కజొన్న ఇతర ప్రధాన పంటలుగా గుర్తించారు. ఈ క్రమంలో వివిధ రకాల విత్తనాలు రాయితీపై 81,832 క్వింటాళ్లు పంపిణీ చేయనున్నారు. 76,710 క్వింటాళ్లు విత్తన వేరుశనగ, 2,300 క్వింటాళ్లు కందులు, 1,600 క్వింటాళ్ల విత్తన వరి, 700 క్వింటాళ్ల ఉలవలు, 200 క్వింటాళ్ల జీలుగ, 25 క్వింటాళ్ల పిల్లిపెసర, 7 క్వింటాళ్ల జనుము, 106 క్వింటాళ్ల అలసంద, 85 క్వింటాళ్ల పెసర, 46 క్వింటాళ్ల మినుము, 50 క్వింటాళ్ల కొర్రలు, నాలుగు క్వింటాళ్ల రాగులు రాయితీతో పంపిణీ చేయనున్నారు. జనుము, జీలుగ, పిల్లిపెసర లాంటి పచ్చిరొట్ట విత్తనాలపై 50 శాతం రాయితీ వర్తింపజేశారు. జనుము, జీలుగ విత్తనాలకు 50 శాతం రాయితీ పోనూ, క్వింటాకు రూ.4,400 ప్రకారం, పిల్లిపెసరకు రూ.6,700 ప్రకారం చెల్లించాల్సి ఉంటుంది. వర్షాలు పడుతున్నందున రైతులు సాగుకు సన్నద్ధమవుతున్నారు. జూన్ మొదటి వారంలోనే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనుండగా జూన్ 15 నుంచి జూలై ఆఖరు వరకు పంటల సాగుకు అనుకూలమని శాస్త్రవేత్తలు తెలిపారు. నేటి నుంచి ఆర్బీకేల్లో విత్తన వేరుశనగ పంపిణీ లాంఛనంగా ప్రారంభించనున్న అధికారులు 76,710 క్వింటాళ్ల పంపిణీకి ప్రణాళిక -
27 నుంచి పాలీసెట్ కౌన్సెలింగ్
అనంతపురం/కళ్యాణదుర్గం: పాలీసెట్ కౌన్సెలింగ్ ను ఈ నెల 27 నుంచి నిర్వహించనున్నట్లు అనంతపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సి. జయచంద్రా రెడ్డి, కౌన్సెలింగ్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం. రామకృష్ణా రెడ్డి, కళ్యాణదుర్గం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ వైఎస్ శ్రీధర్ కుమార్ తెలిపారు.అనంతపురం,తాడిపత్రి, కళ్యాణదుర్గం, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. ఈ నెల 24 (నేడు) నుంచి జూన్ 2 వరకు appolycet.nic.in వెబ్సైట్లో ఓసీ, బీసీ విద్యార్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.250 రుసుం చెల్లించి రసీదును పొందాలన్నారు. ఆప్షన్ల ఎంపిక... జూన్ 5 నుంచి ఆప్షన్లు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కళాశాలలో సీట్ల కేటాయింపు జూన్ 7న జరుగుతుంది. విద్యార్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు తీసుకు రావాలి. విద్యార్థులు తీసుకువాల్సిన పత్రాలు... ● కౌన్సెలింగ్ ఫీజు (ప్రాసెసింగ్ ఫీజు) రసీదు ● ఏపీ పాలీసెట్ హాల్టికెట్ ● పాలీసెట్ ర్యాంక్ కార్డు ● 10వ తరగతి మార్కుల జాబితా (ఒరిజినల్ లేదా నెట్ కాపీ) ● 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు ● ఓసీ కేటగిరీ వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ 2024–25 ఏడాదికి సంబంధించి.. ● ఇన్కం సర్టిఫికెట్ (01.01.2021 నుంచి) ● కులం సర్టిఫికెట్ ● ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ) -
ఒకే రోజు మూడు పరీక్షలు
● నేడు పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ, డీఈఈ సెట్ పరీక్ష అనంతపురం ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా శుక్రవారం మూడు పరీక్షలు జరగనున్నాయి. పదో తరగతి సప్లిమెంటరీ, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానుండగా, డీఈఈ సెట్ కూడా జరగనుంది. ఇందుకోసం విద్యాశాఖ, ఇంటర్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేశారు. పదో తరగతి పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 45 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 13,332 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష ఉంటుంది. జూన్ 3 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ● ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 34 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈనెల 30తో ప్రధాన పరీక్షలు ముగుస్తాయి. 31, జూన్ 1 మైనర్ సబ్జెక్టుల పరీక్షలుంటాయి. జిల్లాలో 22,510 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలుంటాయి. పరీక్షల సమయంలో నిమిషం ఆలస్యమైనా కేంద్రాల్లో అనుమతి ఉండదు. ● డీఈఈసెట్–2024 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు ఉంటుంది. మొత్తం 344 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. అనంతపురం నగర శివారులోని చిన్మయానగర్ ఎల్ఆర్జీ స్కూల్ పక్కన నేషనల్ కౌన్సిల్ ఫర్ చర్చ్ సోషియల్ యాక్షన్ ఇండియా (ఎన్సీపీఎస్ఏఐ)ను పరీక్ష కేంద్రంగా ఏర్పాటు చేసినట్లు డీఈఓ వరలక్ష్మీ తెలిపారు. అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని ఆమె సూచించారు. -
జూన్ 6 వరకూ బాణాసంచా వినియోగంపై నిషేధం
అనంతపురం అర్బన్: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అవాంఛ నీయ సంఘటనల నివారణ, శాంతిభద్రతలను కాపాడేందుకు జూన్ 6 వరకూ జిల్లాలో బాణా సంచా (టపాసులు) వినియోగం, రవాణాపై నిషేధం విధించారు. ఈ మేరకు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.వినోద్కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత గెలుపొందిన అభ్యర్థులు, వారి మద్దతుగా విజయోత్సవాలు నిర్వహించే క్రమంలో బాణాసంచా కాల్చడం ద్వారా తలెత్తే పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఎస్పీ నివేదిక ఆధారంగా బాణాసంచా తయారీ, అమ్మకం, కొనుగోలు, వినియోగం, రవాణాపై నిషేధం విధించినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు. బాణాసంచా దుకాణాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ఉల్లంఘిస్తే భారతీయ శిక్షాస్మృతి 1860లోని సెక్షన్ 436 ప్రకారం శిక్షార్హులవుతారని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండండి శింగనమల: కౌంటింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసు సిబ్బందిని ఎస్పీ గౌతమి శాలి ఆదేశించారు. గురువారం రాత్రి శింగనమల, బుక్కరాయసముద్రం సర్కిల్ పోలీస్ స్టేషనన్లను ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేశారు. సమస్యాత్మక గ్రామాలు, తాజా పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బైండోవర్లు త్వరిత గతిన పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. సమస్యాత్మక గ్రామాలను తరచూ సందర్శించాలన్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించాలన్నారు. కౌంటింగ్ తరువాత గ్రామాల్లో హింసకు తావులేకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఐ వెంకటేశులు, ఎస్ఐ చంద్రశేఖర్ పాల్గొన్నారు. 8 చోట్ల ఫ్లాగ్మార్చ్లు అనంతపురం: జిల్లాలో గురువారం పోలీసులు 8 చోట్ల ఫ్లాగ్మార్చ్లు, 5 ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు నిర్వహించారు. రాయదుర్గం, శింగనమల, పుట్లూరు, ఆత్మకూరు,తాడిపత్రి పట్టణాల్లో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టారు. సమస్యలు సృష్టించే వారిని, వారి స్థావరాల్లో జల్లెడ పట్టారు. 178 మంది రౌడీషీటర్లు, కిరాయి హంతకులు, ట్రబుల్ మాంగర్స్కు కౌన్సెలింగ్ ఇచ్చారు. సమస్యలు సృష్టించే అవకాశం ఉన్న 866 మందిని బైండోవర్ చేశారు. నారసింహా.. పాహిమాం ఉరవకొండ: పెన్నహోబిలం లక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీవారు భూదేవి, శ్రీదేవి సమేతంగా గోవాహనం, శేషవాహనంపై విహరించారు. ఉదయం స్వామికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సుప్రభాతం, మహాభిషేకం, అలంకరణ,అర్చన, ఉత్సవ నిత్యహోమం, బలిహరణ కార్యక్రమాలు చేపట్టారు.అనంతరం విశేషంగా అలంకరించిన గోవాహనం, శేష వాహనంపై ఊరేగుతూ స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో ఈఓ విజయ్కుమార్, ప్రధాన అర్చకులు ద్వారకానాథచార్యులు, బాలాజీస్వామి పాల్గొన్నారు. -
కట్టెతో తలపై మోది... కాలుతో గొంతు తొక్కి!
గుంతకల్లు రూరల్: మద్యానికి బానిసై కుటుంబసభ్యులను వేధింపులకు గురి చేస్తున్న జులాయి భర్తను కట్టుకున్న ఇల్లాలే హతమార్చింది. పోలీసులు తెలిపిన మేరకు... రాప్తాడుకు చెందిన శ్రీనివాసులు (52)కు కొన్నేళ్ల క్రితం గుంతకల్లుకు చెందిన సరస్వతితో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. దాదాపు 20 ఏళ్ల క్రితం కుటుంబంతో కలసి గుంతకల్లుకు వలస వచ్చిన శ్రీనివాసులు స్థానికంగా తోపుడు బండిపై పండ్లను అమ్ముతూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆ తర్వాత వ్యాపారం మానేసి రాప్తాడుకు వెళ్లి పొలం పనులు చూసుకుని వచ్చేవాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసై జులాయిగా మారాడు. రోజూ మద్యం మత్తులో ఇంటికి చేరుకుని భార్యాపిల్లలను వేధించేవాడు. అతని వేధింపులు తారాస్థాయికి చేరుకోవడంతో భార్యాపిల్లలు విసుగెత్తిపోయారు. బుధవారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న భర్త కుటుంబసభ్యులను నోటికొచ్చినట్లు దుర్భాషలాడుతూ భౌతికదాడికి తెగబడ్డాడు. దీంతో భార్య సరస్వతి తనకు అందుబాటులో ఉన్న కర్ర తీసుకుని భర్త తలపై మోదింది. కిందపడిన భర్త గొంతుపై కాలు వేసి తొక్కి పట్టింది. కాసేపటి తర్వాత భర్త మరణించాడని నిర్ధారించుకున్న తర్వాత సహజ మృతిగానే వీధిలోని వారందరినీ నమ్మించి, గురువారం ఉదయాన్నే అంత్యక్రియలకు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసింది. మృతుడు శ్రీనివాసులు తలపై ఉన్న దెబ్బ, గొంతుపై నల్లగా ఉన్న గుర్తును చూసిన తండ్రి ఆంజనేయులు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో గుంతకల్లు రూరల్ ఎస్ఐ సురేష్, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. ప్రాథమిక విచారణలో భర్త వేధింపులు తాళలేక భార్యనే హతమార్చినట్లు నిర్ధారించుకుని ఆ దిశగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్నిట్లు పోలీసులు తెలిపారు. వేధింపులు తాళలేక భర్తను హతమార్చిన భార్య
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
స్ట్రాంగ్ రూమ్ల తనిఖీ
ఏయూ డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల
అడ్డగోలుగా పార్కింగ్ చేస్తే.. అంతే
సరకు రవాణాలో సరికొత్త వ్యూహాలు
బాలికపై కేజీహెచ్ ఉద్యోగి లైంగిక వేధింపులు
India Meteorological Department: రాజస్తాన్లోని ఫలోదీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత
కేకే లైన్లో డీఆర్ఎం తనిఖీలు
జంతు సంరక్షణ చట్టం నోడల్ అధికారిగా ఏసీపీ శ్యామలరావు
కెమికల్ ఇంజినీరింగ్లో విస్తృత అవకాశాలు
తప్పక చదవండి
- బ్యాంక్ల్లో ఇబ్బందులా?, ఆర్బీఐకి ఫిర్యాదు చేయండిలా..
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి అఖిలేష్?
- మరో ఎంపీ లండన్లో ఉన్నా.. నన్ను టార్గెట్ చేశారు: స్వాతి మలివాల్
- మాకంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చుంటే రాజీనామా చేస్తా
- Malaysia Masters 2024: ఫైనల్లో పీవీ సింధు
- రాజ్కోట్లో పెను విషాదం
- ‘లైఫ్ ట్యాక్స్’కు ఎగనామం!
- Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం
- మీ ఇంటిని చక్కదిద్దుకోండి..!
- కలిసికట్టుగా ముందుకు..
Advertisement