-
జిల్లా క్రికెట్ జట్టుకు నందలూరు క్రీడాకారులు
నందలూరు: కడప జిల్లా సీనియర్స్ క్రికెట్ జట్టుకు నందలూరు క్రికెట్ సబ్ సెంటర్ నుంచి ఆరుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. జాఫర్ అలీఖాన్, ఆదిల్ హుస్సేన్, పృధ్వీరాజ్, మారుతీ శంకరాచారి, గిరీష్ తేజ, స్టాండ్బైగా హరిప్రసాద్ ఎంపికై నట్లు హెడ్కోచ్ గయాజ్ తెలిపారు. నందలూరు సబ్ సెంటర్ నుంచి గతంలో కూడా అండర్ 12, 14, 16, 19, 23 సీనియర్ విభాగాలలో రాష్ట్రస్థాయి క్రికెట్కు ఎంతోమంది క్రీడాకారులు ఎంపికయ్యారన్నారు. ఈ ఏడాది కూడా ఆరుగురు క్రీడాకారులు సీనియర్ జట్టుకు ఎంపిక కావడంపై అసిస్టెంట్ కోచ్ ఫిరోజ్ ఖాన్ లోడి, ట్రైనర్ శివకోటి, క్యూరేటర్ హరికృష్ణ హర్షం వ్యక్తం చేశారు. -
విద్యార్థులకు ప్రతిభా పురస్కారం
ప్రొద్దుటూరు కల్చరల్ : విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు పోవాలని సివిల్ సర్వీసెస్ ర్యాంకర్ కన్నెబోయిన శ్రీనివాసులు అన్నారు. స్థానిక పద్మశాలీయ కళ్యాణమండపంలో ఆదివారం ది బీసీ ప్రజా చైతన్య సమాఖ్య ఆధ్వర్యంలో పది, ఇంటర్మీడియట్లో ప్రతిభ చూపిన వారికి పురస్కారాలు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ఉంటూ బంగారు భవిష్యత్కు బాటలు వేసుకోవాలన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువకులు పత్రికల్లో ఎడిటోరియల్ పేజీ చదవాలని సూచించారు. ఎస్కేయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సీహెచ్.కృష్ణుడు మాట్లాడుతూ ఓటమితో కుంగిపోకుండా ధైర్యంగా ముందుకు పోవాలని చెప్పారు. ది బీసీ ప్రజాచైతన్య సమాఖ్య అధ్యక్షుడు బొర్రా రామాంజనేయులు మాట్లాడుతూ బీసీ విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 14 ఏళ్లుగా ప్రతిభా పురస్కారాలు అందిస్తున్నామన్నారు. అనంతరం 40 మంది విద్యార్థులకు రూ.1.60 లక్షల నగదు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సమాఖ్య ఉపాధ్యక్షుడు భాస్కర్యాదవ్, కోశాధికారి మడకా సంటెయ్య, భాస్కర్రావు, బీసీ నాయకులు పాణ్యం సుబ్బరాయుడు, కరుణాకర్ యాదవ్, వుట్టి వీరయ్య, మల్లెల భాస్కర్, జింకా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.సివిల్ సర్వీసెస్ ర్యాంకర్ శ్రీనివాసులు -
●రౌండ్ల వారీగా ఫలితాల వెల్లడి
సాక్షి రాయచోటి: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రోజురోజుకు అందరిలోనూ టెన్షన్ అధికమవుతోంది. ఓట్ల లెక్కింపు పూర్తయితే తప్ప ఉత్కంఠకు తెరపడదు. అయితే ఎక్కడ చూసినా గెలుపుపైన ఒకవైపు బెట్టింగ్ల పర్వం కొనసాగుతుండగా, మరోవైపు అన్ని పార్టీల్లోనూ నరాలు తెగే టెన్షన్ నెలకొంది. ఇంకోవైపు అధికార యంత్రాంగం కౌంటింగ్కు సన్నద్ధమవుతోంది. మరో వారం రోజుల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. కౌంటింగ్ సిబ్బంది నియామకం కౌంటింగ్ను పురస్కరించుకుని ఇప్పటికే సంబంధిత అధికారులు, సిబ్బందిని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ నియమించారు. ప్రధానంగా సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, సూక్ష్మ పరిశీలకులు, ఇతర సిబ్బంది నియామక ప్రక్రియ చేపట్టారు. కౌంటింగ్కు జిల్లాలో సుమారు 1500కు పైగా సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఎక్కడా కూడా చిన్నపాటి సమస్య కూడా ఉత్పన్నం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటూనే మరోవైపు సిబ్బందికి కౌంటింగ్పై శిక్షణ కూడా ఇస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా భారీ బందోబస్తు ఓట్ల లెక్కింపు జరిగే రాయచోటితోపాటు మిగతా అన్ని ప్రాంతాల్లో 144 సెక్షన్ ద్వారా పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. రాయచోటిలోని సాయి ఇంజినీరింగ్ కళాశాలలోని కౌంటింగ్ కేంద్రంలో కూడా మూడంచెల భద్రత కొనసాగుతోంది. కౌంటింగ్ రోజు రాయచోటి కడప రింగ్రోడ్డు సర్కిల్ నుంచి వేంపల్లె రోడ్డు సర్కిల్ వరకు మెయిన్రోడ్డును పూర్తిగా మూసివేయనున్నారు. ఈ రోడ్డులో కౌంటింగ్ కేంద్రం ఉండడంతో వాహనాల రాకపోకలను కౌంటింగ్ రోజు పూర్తిగా నియంత్రించి ట్రాఫిక్ను దారి మళ్లించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా 144 సెక్షన్తోపాటు ఇతర సమస్యాత్మక ప్రాంతాల్లో బందోబస్తు పరంగా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టనున్నారు. ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్ల పరిశీలన రాయచోటి టౌన్: జూన్ 4వతేదీ నిర్వహించే సార్వత్రిక ఎన్నికల ఓట్ల కౌంటింగ్ నిర్వహణ కార్యక్రమాన్ని అధికారులు పరిశీలించారు. ఆదివారం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలోని శ్రీ సాయి ఇంజినీరింగ్ కళాశాల ఆవరణంలో కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని డీఎస్పీ రామచంద్రరావు అధికారులకు సూచించారు. చిన్న పాటి పొరపాట్లకు కూడా తావు లేకుండా గట్టి భద్రత కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఆ ప్రాంతాన్ని తహసీల్దార్ జయన్న ఆధ్వర్యంలో మండల సర్వేయర్ మదనమోహన్రెడ్డి పరిశీలించారు. డిప్యూటీ తహసీల్దార్ రామాంజనేయులు, అర్బన్ సీఐ సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలో ఓట్ల లెక్కింపు అన్నమయ్య జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు రాజంపేట లోక్సభకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జిల్లా కేంద్రమైన రాయచోటిలో జూన్ 4న చేపట్టనున్నారు. పట్టణంలోని కలెక్టరేట్ సమీపంలో ఉన్న సాయి ఇంజినీరింగ్ కళాశాలలో ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 13వ తేదీ పోలింగ్ ప్రక్రియ ముగియగానే ఈవీఎంలను జిల్లా కేంద్రంలో భద్రపరిచారు. జిల్లా వ్యాప్తంగా 609 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా భారీ ఎత్తున ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈవీఎంలలో ఓటర్ల తీర్పు నిక్షిప్తమై ఉంది. ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 14 టేబుళ్ల కౌంటింగ్ పూర్తయ్యాక ఒక రౌండ్గా పరిగణించి ఫలితాలు వెల్లడిస్తారు. ఓట్ల లెక్కింపునకు యంత్రాంగం సన్నాహాలు జిల్లా కేంద్రమైన రాయచోటిలో ఆరు అసెంబ్లీ, ఒక పార్లమెంటు స్థానానికి కౌంటింగ్ కౌంటింగ్కు సుమారు 1500కు పైగా అధికారులు, సిబ్బంది అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కౌంటింగ్ కేంద్రం వద్ద భద్రత జిల్లా వ్యాప్తంగా కొనసాగనున్న 144 సెక్షన్ జిల్లాలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి రౌండ్ల వారీగా ఫలితాలను వెల్లడించేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో రైల్వేకోడూరుకు సబంధించి 18 రౌండ్లు, రాయచోటికి 21 రౌండ్లు, తంబళ్లపల్లె 17, పీలేరు 20, మదనపల్లె 18 లేదా 19, రాజంపేట 20 లేదా 21 రౌండ్లలో ఫలితాలను వెల్లడించనున్నారు. అందుకు సంబంధించి అధికార యంత్రాంగం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తోంది. కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా అన్ని చర్యలు చేపడుతున్నాం. ఎక్కడా కూడా చిన్నపాటి ఘటనకు కూడా తావు లేకుండా అధికారులను అప్రమత్తం చేశాం. ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ మొదలుకొని ఈవీఎంలోని ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. కౌంటింగ్ కేంద్రానికి వచ్చే పార్టీల ఏజెంట్లకు గుర్తింపు కార్డులను జారీ చేయనున్నాం. కౌంటింగ్ సిబ్బందిని కూడా ఇప్పటికే నియమించి శిక్షణ ఇచ్చాం. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా గొడవలు జరగకుండా అన్ని చర్యలు చేపడుతున్నాం. రాజకీయ పార్టీలతోపాటు ప్రజలు కూడా ప్రశాంత కౌంటింగ్కు సహకరించాలి. – ఎం.అభిషిక్త్ కిశోర్, జిల్లా ఎన్నికల అధికారి, రాయచోటి -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చిన్నమండెం : మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నరసింహులు(35) మృతి చెందినట్లు ఎస్ఐ రమేష్బాబు తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. దేవగుడిపల్లె హరిజనవాడకు చెందిన నరసింహులు ద్విచక్ర వాహనంలో వస్తున్నారు. మండల కేంద్రంలో గురు హోటల్ సమీపంలోని జాతీయ రహదారిపై లారీ ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడికి భార్య పల్లవి ఉన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. చెరువులో పడి..పెద్దతిప్పసముద్రం : మండలంలోని కందుకూరు వ్యాసరాయ చెరువు తూము సమీపంలో ఎర్రప్ప(70) మృతదేహాన్ని స్థానికులు ఆదివారం గుర్తించారు. చెరువు ఆహ్లాదకర వాతావరణాన్ని వీక్షించేందుకు వెళ్లిన పలువురు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ రవీంద్రబాబు సిబ్బందితో కలిసి చెరువు వద్దకు చేరుకుని శవాన్ని పరిసరాలు పరిశీలించారు. ఓ చెట్టు వద్ద లభ్యమైన దుస్తులు, ఽపాదరక్షలు, ఆధార్ కార్డుతో పాటు ఇటీవల చింతామణిలోని ఆసుపత్రిలో చికిత్స పొందిన ప్రిస్కిప్షన్ లభించాయి. మందులతో పాటు పురుగు మందు డబ్బాను తనిఖీ చేశారు. మృతి చెందిన వ్యక్తి కర్నాటక రాష్ట్రం కోలార్ జిల్లా శ్రీనివాసపురం సమీపంలోని సనకంవారిపల్లి గ్రామానికి చెందిన చిన్నమద్దన్న కుమారుడు ఎర్రప్పగా పోలీసులు నిర్ధారించారు. డీజిల్ చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్పీలేరురూరల్ : డీజిల్ చోరీ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ మోహన్రెడ్డి తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో నిందితుల అరెస్ట్ చూపిన అనంతరం సీఐ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా శాంతిపురం మండలానికి చెందిన సురేష్కుమార్, నాగరాజ, కార్తీక్ రోడ్డు రోలర్, ప్రొక్లెయిన్ ట్యాంక్ నుంచి డీజిల్ చోరీ చేస్తున్నారన్నారు. ముగ్గురుని అరెస్ట్ చేసి వారి వద్ద 200 లీటర్ల ఆరు క్యాన్లు, రూ.18,500 నగదు, ఇనుక కమ్మి, రబ్బరు పైపు, వాహనం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నరసింహుడు, సిబ్బంది పాల్గొన్నారు. -
మదనపల్లెలో దొంగల బీభత్సం
మదనపల్లె : మదనపల్లె పరిధిలోని ఇళ్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఇళ్లలో చొరబడి అందిన కాడికి దోచుకెళ్లారు. ఒకే రోజున రూ. లక్షల విలువగల నగదు, నగలు అపహరించుకుపోయారు. బాధితుల వివరాల మేరకు.. మదనపల్లె పట్టణంలోని రామిరెడ్డి లే అవుట్లో నివాసముంటున్న చంద్రశేఖర్ తన కుటుంబసభ్యులతో రాజానగర్లో బంధువుల ఇంటికి వెళ్లారు. ఇంటి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దొంగలు తలుపులు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి దొరికిన కాడికి దోచుకెళ్లారు. చంద్రశేఖర్ తిరిగి వచ్చి చూడగా తలుపులు బద్దలు కొట్టి ఉండడ, బీరువా తెరచి ఉండడంతో వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.25 లక్షల విలువగల భార్యకు సంబంధించిన అరకిలో బంగారు నగలు, రెండు కిలోల వెండి ఆభరణాలు, రూ.1.5 లక్షల నగదు చోరీకి గురైనట్లు చంద్రశేఖర్ పేర్కొన్నారు. అదే విధంగా పట్టణంలోని నీరుగట్టువారిపల్లె కోళ్లబైలు రోడ్డులోని నివాసముంటున్న రైతు ఓబుల్రెడ్డి తన బంధువుల ఆహ్వానం మేరకు ఆదివారం ఉదయం పెద్దమండ్యంలోని జాతరకు వెళ్లాడు. అతడి భార్య శాంతమ్మ మామడి గుంపులపల్లె వద్ద ఉన్న పొలానికి వెళ్లారు. అనంతరం ఓబుళ్రెడ్డి ఇంటికి తిరిగి వచ్చి చూడగా తలుపులు తెరచి ఉండడం, బీరువా తలుపులు తెరచి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో సుమారు 50 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.పది వేల నగదు చోరీకి గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వన్టౌన్ సీఐ వల్లిబసు, సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్టీం, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించి ఆధారాలు సేకరించారు. ఒకే రోజున రెండు భారీ చోరీలు జరగడంతో మదనపల్లె ప్రజలు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు కేసులు దర్యాప్తు చేస్తున్నారు. రూ.30 లక్షల విలువగల నగలు, నగదు అపహరణ క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్తో తనిఖీలు -
శేషాద్రి హత్య ఘటనపై దర్యాప్తు వేగవంతం
మదనపల్లె : పట్టణంలో సంచలనం సృష్టించిన పుంగనూరు శేషాద్రి హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. మంజునాథ కాలనీలోని హత్య జరిగిన ప్రదేశాన్ని డీఎస్పీ ప్రసాదరెడ్డి ఆదివారం మరోసారి పరిశీలించారు. స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. శేషాద్రి ఇంటిలో హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం హత్యలో భాగస్వామ్యులైన నిందితుల్లో నలుగురు లొంగిపోగా, విచారణలో భాగంగా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరిత మంది హత్యకేసులో పాల్గొన్నట్లు నిర్ధారణకు వచ్చి, వారికోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ● హత్యాస్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ ప్రసాదరెడ్డి ● పోలీసుల అదుపులో ఏడుగురు నిందితులు -
అనుమానాస్పదంగా ఉపాధ్యాయుడి మృతి
మియాపూర్ : అనుమానాస్పద స్థితిలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ దుర్గా రామలింగ ప్రసాద్ వివరాల మేరకు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన శ్రీనివాస్, సరస్వతి దంపతులకు కుమారుడు జయప్రకాష్ నారాయణ(35), కుమార్తె ప్రశాంతి ఉన్నారు. జయప్రకాష్ నారాయణ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని రాయచోటిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 22న నగరం లోని కూకట్పల్లి సమీపంలోని బాలాజీ నగర్లోని తన సోదరి ప్రశాంతి ఇంటికి వచ్చాడు. శనివారం ఉదయం వెళ్లి ఇంటికి రాకపోవడంతో సోదరి ప్రశాంతి కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జయప్రకాష్ నారాయణ శనివారం ఉదయం సోదరి ఇంటి నుంచి వచ్చి మియాపూర్ మదీనగూడలోని ప్లాగ్షిఫ్ ఓయో వెన్నెల రెసిడెన్సీలో రూమ్ తీసుకుని ఉండిపోయాడు. ఆదివారం మధ్యాహ్నం బయటకు రాకపోవడంతో లాడ్జి నిర్వాహకులు వెళ్లిచూడగా బెడ్పై అచేతన స్థితిలో ఉన్నాడు. వెంటనే లాడ్జి నిర్వాహకులు మియాపూర్ పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా అప్పటికే జయప్రకాష్ మృతి చెందాడు. అతని వద్ద ఆయుర్వేదిక్ మందులు ఉండడం గుర్తించారు. మృతుడి తల్లి సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అయితే జయప్రకాష్ నారాయణది ఆత్మహత్యా... హత్యా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
ముగ్గురు అరెస్టు
పీలేరురూరల్ : డీజిల్ చోరీ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ మోహన్రెడ్డి తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో నిందితుల అరెస్ట్ చూపిన అనంతరం సీఐ మాట్లాడుతూ చిత్తూరు జిల్లా శాంతిపురం మండలానికి చెందిన సురేష్కుమార్, నాగరాజ, కార్తీక్ రోడ్డు రోలర్, ప్రొక్లెయిన్ ట్యాంక్ నుంచి డీజిల్ చోరీ చేస్తున్నారన్నారు. ముగ్గురుని అరెస్ట్ చేసి వారి వద్ద 200 లీటర్ల ఆరు క్యాన్లు, రూ.18,500 నగదు, ఇనుక కమ్మి, రబ్బరు పైపు, వాహనం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.గడ్డివామి దగ్ధం నిమ్మనపల్లె : మండలంలోని రాచవేటివారిపల్లెలో ఆదివారం గడ్డివామి దగ్ధమై సుమారు రూ.30 వేల ఆస్తినష్టం జరిగింది. స్థానికుడు రవీంద్రనాథరెడ్డి పశువుల మేత కోసం వేయి కట్టలతో గడ్డివామి ఏర్పాటుచేశారు. గ్రామంలో టపాకాయలు పేల్చడంతో ప్రమాదవశాత్తూ గడ్డికి నిప్పంటుకుంది. మదనపల్లె అగ్నిమాపకశాఖ అధికారులకు సమాచారం అందించగా ఎస్ఐ నాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే అప్పటికే గడ్డి పూర్తిగా దగ్ధమైంది. -
మదనపల్లెలో ప్రజా సంఘాల భూదందా
కొంతమంది స్వార్థపరులు కొత్త ప్రజా సంఘాలు, సొంత సంఘాలను ఏర్పాటుచేసుకుని భూ వివాదాలతో సెటిల్మెంట్లు, దందాలు చేస్తున్నారు. బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలవాల్సిన వారు.. ధనార్జనే ధ్యేయంగా, అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రాత్రి మదనపల్లెలో జరిగిన బహుజన భీమ్సేన అధ్యక్షుడు శేషాద్రి హత్యే ఇందుకు అద్దం పడుతోంది. మదనపల్లె : పట్టణంలో పలు ప్రజా సంఘాలు బడుగు, బలహీన పేదలకు అండగా నిలబడుతూ, న్యాయం చేసేందుకు ఆందోళనలు, ఉద్యమాలు చేసి పోరాడుతూ, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కొన్ని ప్రజా సంఘాలు.... సివిల్, రెవెన్యూ, క్రిమినల్, కుటుంబ వ్యవహారాలు, పోలీస్ స్టేషన్లలో పంచాయతీలు, ప్రేమ వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు, ఇలా అన్ని వ్యవహారాల్లో తమదైన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ అమాయకులకు అన్యాయం చేస్తున్నారు. చట్టంలోని లొసుగులను అనుకూలంగా మార్చుకోవడం, అధికారుల అలసత్వం, అవినీతిని ఆసరాగా చేసుకోవడం వారికి వెన్నతో పెట్టిన విద్య. అన్నింటిలోనూ తమ మాటే నెగ్గేలా చూసుకొనేందుకు వ్యతిరేకించిన వారిని నయానా, భయానా బెదిరించి, భయపెట్టి లొంగదీసుకుంటున్నారు. ఎదురు తిరిగిన వారిని మట్టుబెడుతూ... సామాన్యుల్లో భయాన్ని ఉసిగొల్పేలా ప్రవర్తిస్తున్నారు. భూముల ధరలు పెరగడమే కారణం మదనపల్లె పట్టణం చుట్టుపక్కల వందల ఎకరాల్లో విలువైన ప్రభుత్వ భూములున్నాయి. వాటి విలువ అమాంతం పెరగడంతో కోట్లు వెచ్చించైనా ఆ స్థలాలు కొనుగోలు చేసేందుకు ఉద్యోగ, వ్యాపారస్థులు ముందుకు వస్తున్నారు. ఇదే ప్రజా సంఘాలకు ఆదాయవనరుగా మారుతోంది. ఎస్సీ, ఎస్టీ, మిలిటరీ, అసైన్డ్ భూములు, ఇందిరమ్మ ఇళ్లు, వైఎస్సార్ జగనన్న లేఅవుట్లకు సంబంధించి వివాదాలను సెటిల్మెంట్ చేయడంలో కొన్ని ప్రజా సంఘాలు కీలకంగా మారాయి. కోట్ల రూపాయలు సులువుగా వచ్చే మార్గం కావడంతో మెల్ల మెల్లగా ప్రజాసంఘాల మధ్య పోటీ ఏర్పడింది. యువతను పురిగొల్పుతూ.. ఒకప్పుడు గుర్తింపు పొందిన ప్రజాసంఘాల్లో పనిచేసి, తర్వాతి కాలంలో వేరుకుంపట్లు పెట్టుకుని జాతీయ, రాష్ట్ర అధ్యక్షులుగా చెలామణి అవుతున్నారు. యువకులను కూడగట్టి కొందరితో గ్యాంగ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉద్యమాల పేరుతో తమ స్వప్రయోజనాలకు వాడుకుంటూ, సెటిల్మెంట్లు, దందాల్లో గొడవలు, ఘర్షణలకు వినియోగిస్తున్నారు. రాజకీయ పార్టీల నాయకులకు సైతం తమ మద్దతు తెలుపుతూ.. క్షేత్ర స్థాయిలో తమ పరపతి, పలుకుబడిని పెంచుకుంటున్నారు. ఈ ఆధిపత్య పోరులో ఇటీవల హత్యకు గురైన ఓ ప్రజాసంఘం నాయకుడి మృతికి ఎలాంటి సానుభూతి వ్యక్తం కాలేదు. పోలీసులు సైతం ప్రజాసంఘాల నాయకులకు స్టేషన్లలో గౌరవమర్యాదలు కల్పించడంతో పాటుగా వారు మధ్యవర్తిత్వం చేసిన కేసులవైపే మొగ్గుచూపుతున్నారు. సబ్ రిజిస్ట్రార్, రెవెన్యూ, హౌసింగ్ తదితర ప్రభుత్వకార్యాలయాలను తమ దందాలకు వేదికలుగా మార్చుకుంటూ వారి వ్యాపారం మూడుపువ్వులు, ఆరుకాయలుగా కొనసాగిస్తున్నారు. పోలీసులు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టి, ప్రజాసంఘాలను నియంత్రించకపోతే, రానున్న రోజుల్లో మరిన్ని అసాంఘిక ఘటనలు జరిగే ప్రమాదం లేకపోలేదు. భూ తగాదాల్లో సభ్యుల మితిమీరిన జోక్యం చట్టాలను ఆసరాగా చేసుకుని అమాయకులపై పెత్తనం పరపతి, పలుకుబడితో మాట నెగ్గించుకునే ప్రయత్నం పుంగనూరు శేషాద్రి హత్యతో వెలుగుచూస్తున్న అక్రమాలు -
టార్గెట్ బాల్ అసోసియేషన్ సమావేశం
రాయచోటి టౌన్ : రాష్ట్ర స్థాయి టార్గెట్ బాల్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం శనివారం రాయచోటిలో నిర్వహించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య, కార్యదర్శి శ్రీనివాసులు, ట్రెజరర్ ఽచంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సీనియర్స్, జూనియర్స్, సబ్ జూనియర్స్ విభాగాలుగా నిర్వహించే పోటీలపై చర్చించారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి సీనియర్స్ ఆటలు కృష్ణా జిల్లాలో, జూనియర్స్ విభాగం అనంతరపురం జిల్లాలో, సబ్ జూనియర్స్ విభాగం నెల్లూరులో నిర్వహించాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు వీరాంజనేయులు, రాయచోటి అధ్యక్షుడు రెడ్డెయ్య, ఉపాధ్యక్షులు శివ, మురళియన్ స్వామి, సతీష్, గణేష్, పూర్ణాచలం తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్తు స్తంభాన్ని ఢీకొని ఇద్దరికి గాయాలు
రామాపురం : కర్నూలు–చిత్తూరు జాతీయ రహదారిపై బండపల్లె పంచాయతీలోని గన్సీదా దర్గా వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మస్తాన్, బుజ్జీలకు గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. వీరబల్లి మండలం సానిపాయికి చెందిన మస్తాన్, బుజ్జి రామాపురంలో జరిగే పశువుల సంతకు ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. మార్గమధ్యంలో గన్సీదా వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనే వేసిన విద్యుత్తు స్తంభాన్ని ఢీకొనడంతో మస్తాన్, బుజ్జిలు కిందపడి గాయాలయ్యాయి. 108లో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బుజ్జి పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వి.లక్ష్మీప్రసాద్రెడ్డి తెలిపారు. -
పాఠశాల వద్దకే పాఠ్యపుస్తకాలు చేర్చాలి
రాయచోటి అర్బన్ : పాఠశాలలు పునఃప్రారంభమయ్యేలోగా పాఠశాలల వద్దకే పాఠ్య పుస్తకాలను చేర్చాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు అంకం శివారెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎస్టీయూ నేతలతో కలిసి శనివారం డీఈవోను ఆయన కలిసి విన్నవించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఎస్సి స్పాట్–2024లో ఆంగ్లం, ఫిజిక్స్, బయాలజీ, మాథ్స్ టీచర్లకు పారితోషికం ఇచ్చినా, టీఏ, డీఏలు ఇవ్వలేదన్నారు. నాడు–నేడు ఫేస్–2 కింద పాఠశాలల్లోనూ, సార్వత్రిక ఎన్నికల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు మంజూరుచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ నాయకులు రవీంద్రనాథరెడ్డి, మున్వర్బాషా, వాసుదేవరెడ్డి, శంకర్రెడ్డి, ప్రదీప్, నాగరాజు, జగదీష్, గోపీక్రిష్ణ, భాస్కర్రెడ్డి, సునీర్బాషా, మధుసూధన్రెడ్డి, శివశంకర్ పాల్గొన్నారు. -
కడప అన్నమాచార్య కళాశాలకు ఎన్బీఏ గుర్తింపు
కడప కోటిరెడ్డిసర్కిల్: కడప నగర శివారులో స్వయంప్రతిపత్తి గల అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలకు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్ గుర్తింపు లభించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎ.సుధాకర్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల అధినేత డాక్టర్ చొప్పా గంగిరెడ్డితో కలిసి ప్రిన్సిపల్ మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఎన్బీఏ బృందం కళాశాలలో పర్యటించి అక్కడ అమలవుతున్న విద్యా విధానాలు, పలితాలు, ప్లేస్మెంట్స్, అధ్యాపకులు, పరిశోధన విభాగాలు, మౌలిక సౌకర్యాలు, విద్యార్థులకు అందుతున్న సదుపాయాలను పరీక్షించింది. ట్రిపుల్ఈ, ఈసీఈ, సీఎస్సీ విభాగాలకు ఎన్బీఏ గుర్తింపును ప్రధానం చేశారన్నారు. తమ కళాశాలకు ఎన్బీఏ గుర్తింపు రావడంతో విద్యా సంస్థల వైస్ చైర్మన్ చొప్పాయల్లారెడ్డి, ఈడీ చొప్పాఅభిషేక్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అన్ని విభాగాల అధిపతులు, అధ్యాపకులను అభినందించారు. -
ఓట్ల లెక్కింపు కేంద్రంలో ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లు
జిల్లా ఎన్నికల అధికారి ఎం అభిషిక్త్ కిషోర్ రాయచోటి: ఓట్ల లెక్కింపు కేంద్రంలో ప్రణాళిక బద్ధంగా ఏర్పాట్లు చేపట్టాలని అన్నమయ్య జిల్లా ఎన్నికల అధికారి ఎం.అభిషిక్త్ కిషోర్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం రాయచోటిలోని ఓట్ల లెక్కింపు కేంద్రమైన సాయి ఇంజినీరింగ్ కళాశాలలో రాజంపేట లోక్సభ, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ ఏర్పాట్లను ఆయన జిల్లా ఎస్పీ కృష్ణారావులతో కలిసి పరిశీలించారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి వచ్చే అభ్యర్థులకు, సిబ్బందికి, ఏజెంట్లకు, పోలీసులకు కౌంటింగ్ కేంద్రంలో వారికి కేటాయించిన గదులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వెళ్లేందుకు అవసరమైన సూచికల బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ గదులలో ఏజెంట్లు కూర్చోవడానికి ఎంపిక చేసిన స్థలానికి బారికేడింగ్ పటిష్టంగా అమర్చాల్ననారు. కౌంటింగ్ కేంద్రానికి బయట మీడియా కేంద్రాన్ని, ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయాలన్నారు. జూన్ 4న జరగబోయే కౌంటింగ్ ప్రక్రియ నిరంతరాయంగా జరిగేలా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు జరగాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ సత్యనారాయణరావు, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల ఆర్ఓలు, ఏఆర్ఓలు, వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఇసుకాసురులకు చెక్...!
గుర్రంకొండ : ఇసుకాసురుల ఆగడాలకు రెవెన్యూ అధికారులు చెక్ పెట్టారు. చెరువు నుంచి ఇసుక తరలించే మార్గంలో జేసీబీలతో గోతులు తీయించి అడ్డుకట్ట వేశారు. మండలంలోని తరిగొండ పంచాయతీ చెరువు మొరవపల్లె గ్రామానికి పక్కనే రామానాయిని చెరువు ఉంది. గత పదిరోజులుగా ఇసుకాసురులు జేసీబీలు పెట్టి పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నారు. స్థానిక రెవెన్యూ అఽధికారులు, సిబ్బంది అడ్డుకోబోగా దౌర్జన్యాలకు దిగిన సంఘటనలున్నాయి. ఇదేమిటని ప్రశ్నించే గ్రామస్తులపైనా దాడులకు దిగడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తహసీల్దారు శ్రీనాథ్ ఆదేశాలతో వీఆర్వో రెడ్డి శేఖర్ జేసీబీలతో దారుల్లో గోతులు తీయించి దారి లేకుండా చేశారు. దీంతో ఇసుకాసురుల ఆగడాలకు చెక్ పెట్టినట్లయిందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.దారులకు అడ్డంగా జేసీబీలతో ట్రెంచ్ ఏర్పాటు -
రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య
కురబలకోట : అనారోగ్యంతో రైలు కిందపడి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన విచారకర సంఘటన కురబలకోట మండలంలో చోటుచేసుకుంది. కుటుంబీకులు, పోలీసుల కథనం మేరకు..కురబలకోట మండలం సింగన్నగారిపల్లెకు చెందిన కన్నెమడుగు గిరిబాబు (37) నాయీబ్రాహ్మణ వృత్తితో జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి ఐదేళ్లుగా టీబీ ఉంది. వివాహం చేసుకోలేదు. క్రమేణా ఆరోగ్యం క్షీణి స్తుండడం, ఆశించిన విధంగా నయం కాకపోవడంతో మనస్థాపం చెందాడు. శుక్రవారం సా యంత్రం స్వగ్రామం నుంచి కురబలకోట రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. రైల్వే స్టేషన్కు సమీపంలో గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం ఉదయం స్థానికులు గుర్తించి కదిరి రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి వద్ద లభించిన ఆధారాలతో ఆచూకీ గుర్తించారు. మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రెండు మిిస్సింగ్ కేసులు నమోదుమదనపల్లె : మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు మిస్సింగ్ కేసులు నమోదు చేసినట్లు తాలూకా సీఐ ఎన్.శేఖర్ తెలిపారు. టీ.ఎన్.ఆర్ కాలనీకి చెందిన ఓ మహిళ (26) ఇంటి నుంచి ఈ నెల 23వతేదీ వెళ్లి తిరిగి రాలేదు. వెతికినా ఆచూకీ కన్పించకపోవడంతో ఆమె భర్త శనివారం తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా వైఎస్సార్ కాలనీకి చెందిన పదో తరగతి విద్యార్థిని (15) ఈ నెల 23 వతేదీ నుంచి కన్పించకపోవడంతో యువతి తల్లి తాలూకా పోలీసులకు ఫిర్యాదుచేశారు. -
మిద్దైపె నుండి పడి వ్యక్తి మృతి
రాజంపేట : పట్టణంలోని ఆకుల వీధికి చెందిన రామాయణం ఆంజి(45) ప్రమాదవశాత్తూ మిద్దైపె నుంచి పడి మృతిచెందినట్లుగా తెలుస్తోంది. చికిత్స నిమిత్తం తిరుపతి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం మృతిచెందారు. మృతుడి భార్య ఇటీవల జీవోనపాధికి కువైట్కు వెళ్లారు. మృతుడు ఒంటిరిగా ఉంటున్నారని స్థానికులు తెలిపారు. జిల్లాలో ఐదు ఆసుపత్రులకు తాఖీదులురాయచోటి అర్బన్ : అవసరానికి మించి శస్త్రచికిత్సలు నిర్వహించారనే కారణంతో జిల్లాలో ఐదు ఆసుపత్రులకు తాఖీదులు జారీచేసినట్లు డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ కొండయ్య తెలిపారు. విలేకరులతో శనివారం ఆయన మాట్లాడుతూ మదనపల్లె బాలాజీ మల్టీ స్పెషాలిటీ, దేశాయి, చంద్ర మోహన్ మల్టీస్పెషాలిటీ, ప్రసాద్ మల్టీ స్పెషాలిటీ, ఆనంద్బాబు ఆసుపత్రులకు నోటీసులిచ్చి సంజాయిషీ ఇవ్వాలంటూ ఆదేశించినట్లు తెలిపారు. సాధారణ కాన్పు జరిగే అవకాశమున్నా.. సిజేరియన్ చేసి పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వచ్చాయన్నారు. శస్త్ర చికిత్స ద్వారా ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతోపాటు డబ్బు గుంజుతున్నారనే విమర్శలున్నాయన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. సాధారణ కాన్పులతో బాలింతలు త్వరితగతిన ఆరోగ్యం పొందుతారని, దీర్ఘకాల సమస్యలను తగ్గించడంతో పాటు తల్లిబిడ్డల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునని పేర్కొన్నారు.డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ కొండయ్య -
మదనపల్లెలో గ్యాంగ్ వార్
భార్య, కుమార్తె చంపవద్దంటూ కాళ్లా వేళ్లా పడి వేడుకున్నా. కనికరం లేని కిరాతకులు వారి కళ్లెదుటే హతమార్చారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో దారుణం చోటుచేసుకుంది. వర్గాల ఆధిపత్య పోరుకు ప్రత్యర్థులు కలబడి బహుజన భీమ్సేన అధ్యక్షుడు పుంగనూరు శేషాద్రిని కిరాతకంగా నరికి చంపేశారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటనతో పట్టణవాసులు ఉలిక్కిపడ్డారు.మదనపల్లె : ఆధిపత్య పోరులో ప్రత్యర్థుల చేతిలో ఒకరు దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. పట్టణంలోని 2వ వార్డు మంజునాథ కాలనీ జగనన్న లే అవుట్లో బహుజన భీమ్సేన అధ్యక్షుడు పుంగనూరు శేషాద్రి(35) నివసిస్తున్నాడు. శేషాద్రి లారీడ్రైవర్గా పనిచేస్తున్న సమయంలో కలకత్తాకు చెందిన కమలను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి కుమార్తె రెడ్డి మహేశ్వరి ఉంది. కమలకు తెలుగు సరిగా రాదు. రాత్రి 11 గంటల సమయంలో గొల్లపల్లె దళితవాడకు చెందిన కొండుపల్లి ఆనంద్, అతడి అనుచరులు చరణ్, మణికంఠ, చెన్నారెడ్డి, కొందరు లావాదేవీల విషయమై చర్చించాలని మిద్దె పైకి తీసుకెళ్లారు. మాటా మాటా పెరిగి వివాదం తలెత్తడంతో శేషాద్రిపైనా కత్తులతో దాడికి పాల్పడ్డారు. చేతి వేళ్లు అడ్డుగా పెట్టడంతో తెగి కిందపడ్డాయి. ప్రాణ భయంతో శేషాద్రి వారి నుంచి తప్పించుకుని మిద్దైపెనుంచి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. దుండగులు తలుపులు పగల గొట్టి బెడ్ రూమ్లో దాక్కున్న శేషాద్రిని హాల్ లోకి లాక్కొచ్చారు. తన భర్తను చంపవద్దని శేషాద్రి భార్య కమల, కూతురు రెడ్డిమహేశ్వరి వేడుకుంటున్నా.. అరిస్తే చంపేస్తామని బెదిరించారు. వారి కళ్లెదుటే శేషాద్రిని విచక్షణా రహితంగా నరికి చంపారు. భర్తను కళ్లముందే చంపేయడంతో కమల షాక్కు గురైంది. కొద్దిసేపటి తర్వాత తేరుకుని రోదిస్తూ పోలీసులకు హిందీలో వివరించడం కలచివేసింది. స్థానికుల సమాచారం మేరకు డీఎస్పీ ప్రసాదరెడ్డి, సీఐలు వలీబాషా, యువరాజు ఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. భార్య కమల ఫిర్యాదు మేరకు కొండుపల్లె ఆనంద్, చరణ్, మణికంఠ, చెన్నారెడ్డిలతో పాటు ఆరుగురిపై ప్రాథమికంగా హత్యకేసు నమోదుచేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఆధిపత్య పోరులో భాగంగానే శేషాద్రి హత్య జరిగిందని, ఇందులో రాజకీయకోణం లేదని ఆయన స్పష్టం చేశారు.పోలీసుల అదుపులో నలుగురు?హత్యకు కుట్రదారుగా భావిస్తున్న కొండుపల్లె ఆనంద్ 2014, 2020లో జరిగిన రెండు హత్యకేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్నాడని డీఎస్పీ తెలిపారు. శేషాద్రి హత్యకేసులో దోషులు ఎంతమంది పాల్గొన్నారనే విషయమై లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితుల కోసం ప్రత్యేక గాలింపు బృందాలను ఏర్పాటుచేశామన్నారు. శనివారం ఉదయం శేషాద్రి ఇంటికి డాగ్స్క్వాడ్, క్లూస్టీం వెళ్లి ఆధారాలు సేకరించారు. అయితే హత్యచేసిన తర్వాత నలుగురు నిందితులు నేరుగా టూటౌన్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. ఆ సమయంలో వినియోగించిన ఏపీ–04ఏఎఫ్–5733 నెంబర్ ఇన్నోవా వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. నిందితులు లొంగిపోవడంపై పోలీసులు ఎలాంటి నిర్ధారణ చేయలేదు.ఆధిపత్యం కోసమే హత్యపుంగనూరు శేషాద్రి, కొండుపల్లె ఆనంద్ ప్రజా సంఘాల్లో సభ్యులుగా పనిచేస్తున్నారు. కొండుపల్లె ఆనంద్ ప్రధాన అనుచరుడిగా ఉన్న శేషాద్రి చిన్న దందాలు, సెటిల్మెంట్లు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొన్నేళ్ల కిందట శేషాద్రి మదనపల్లె ఎమ్మెల్యేకు పీఏ తానేనని చెబుతూ ఉద్యోగాలిప్పిస్తానని నిరుద్యోగులను మోసం చేసినట్లు టూటౌన్ పోలీస్ స్టేషన్లో అతడిపై 420 కేసు నమోదైంది. అనంతరం శేషాద్రి తన మకాం మంజునాథ కాలనీకి మార్చాడు. ఇతరుల ప్రమేయం లేకుండా సొంతంగా ల్యాండ్ సెటిల్మెంట్ చేయడం మొదలుపెట్టాడు. ఆనంద్కు పోటీగా బహుజన భీమ్ సేనను స్థాపించి కాలనీలో పట్టు సాధించే ప్రయత్నం చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 14న రామారావు కాలనీలో అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పాడు. దీంతో ఆనంద్, శేషాద్రి వర్గాల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఒకరినొకరు చంపేస్తామని బెదిరించుకోవడం, గొడవలు పడడం, సామాజిక మాధ్యమాల్లో పరస్పరం విమర్శించుకోవడం, పోలీస్ స్టేషన్లో రాజీప్రయత్నాలు జరగడం వెనువెంటనే జరిగిపోయాయి. దీంతో శేషాద్రిని ముట్టుబెట్టేందుకు ఆనంద్ వర్గం పథకం వేసింది. ప్రత్యర్థుల నుంచి ప్రాణహాని ఉందని, శుక్రవారం రాత్రి శేషాద్రి టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అనంతరం ఆనంద్ వర్గీయుల చేతిలో అర్ధరాత్రి దారుణహత్యకు గురయ్యాడు. -
సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం
రాయచోటి: జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటర్ పరీక్షలు ప్రారంభంమయ్యాయి. శుక్రవారం ఉదయం మొదటి సంవత్సరం, మధ్యాహ్నం రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. జిల్లాలో మొదటి సంవత్సరానికి 2446 మందికి 2317 మంది హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 478 మందికి 449 మంది హాజరయ్యారు. మొదటిరోజున తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం పరీక్షలు జరిగాయి. జిల్లా ఇంటర్మీడియట్శాఖ అధికారి ఆర్ కృష్ణయ్య పరీక్ష కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సంబంధించిన హాల్ టికెట్లను ఆయన పరిశీలించారు. పది పరీక్షలకు 1203 మంది గైర్హాజరు పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. శుక్రవారం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జిల్లాలోని 23 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు. 1720 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా కేవలం 517 మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు. 1203 మంది హాజరు కాలేదు. పరీక్షలను జిల్లా విద్యాశాఖ అధికారి శివప్రకాష్ రెడ్డి, స్క్వాడ్ సిబ్బంది పర్యవేక్షించారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పించినట్లు డీఈఓ తెలిపారు. -
ఎపీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
● డీఆర్ఓ సత్యనారాయణరావు రాయచోటి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ నియామకానికి ఈ నెల 25న నిర్వహిస్తున్న ఆన్లైన్ ప్రిలిమనరీ పరీక్షకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని డీఆర్ఓ సత్యనారాయణరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో పరీక్ష ఏర్పాట్లుపై వివిధ శాఖల అధికారులతో డీఆర్ఓ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో నాలుగు పరీక్ష కేంద్రాల ద్వారా 1011 మంది అభ్యర్థులకు ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనున్నట్లు డీఆర్ఓ చెప్పారు. పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 11.30 గంటల వరకు జరుగుతుందన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను ఉదయం 7.30 నుంచి 8.30 గంటల వరకు మాత్రమే కేంద్రాల్లోకి అనుమతిస్తారని చెప్పారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి సకాలంలో పరీక్ష కేంద్రానికి హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో ఆన్లైన్ పరీక్ష రాసేలా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ప్రతి కాలేజీకి రెవెన్యూ తరపున ఒక్కో లైజన్ అధికారిని ఏర్పాటు చేయనున్నట్లు డీఆర్ఓ చెప్పారు. సమావేశంలో కలెక్టరేట్ ఏఓ గోవిందుసింగ్, ఏపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్ మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరీక్ష కేంద్రాలు: ● ఆదిత్యా ఇంజినీరింగ్ కళాశాల, మదనపల్లె ● మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మదనపల్లె ● విశ్వం ఇంజినీరింగ్ కళాశాల, కురబలకోట, ● భాస్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, రామాపురం మండలం -
కట్టుదిట్టమైన భద్రత నడుమ కౌంటింగ్
జిల్లా ఎన్నికల అధికారి అభిషిక్త్ కిషోర్ రాయచోటి: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని కట్టుదిట్టమైన భద్రత నడుమ సజావుగా, పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ తెలిపారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో–2024 సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు, ఎంసీసీ అమలు, 144 సెక్షన్ పాటింపుపై రాజంపేట పార్లమెంట్ అభ్యర్థులు, ప్రతినిధులతో జిల్లా ఎస్పీ బి కృష్ణారావుతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ కేంద్రంలో అభ్యర్థులు, ఏజెంట్లు పాటించాల్సిన విధానాలపై ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన రాజకీయ పార్టీ అభ్యర్థులు, ప్రతినిధులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో చివరిఘట్టమైన ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని జూన్ 4వ తేదీన మూడెంచెల భద్రత నడుమ నిర్వహించేందుకు అన్నిరకాల చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలో నిఘా కెమెరాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. రాజంపేట పార్లమెంట్కు జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు పుంగనూరుతో కలిపి మొత్తం 79.12శాతం పోలింగ్ నమోదైందన్నారు. రాయచోటి సాయి ఇంజనీరింగ్ కలాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లతోపాటు పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లతో నిక్షిప్తమైన ఈవీఎంలను సురక్షితంగా భద్రపరించినట్లు చెప్పారు. ప్రతి అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్కు విడివిడిగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో 14 చొప్పున ఈవీఎం కౌంటింగ్ టేబుళ్లను ఏర్పాటు చేశామన్నారు. రాజంపేట పార్లమెంట్ పరిధిలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు ప్రత్యేకంగా ఒక కౌంటింగ్ కేంద్రంలో 20 టేబుళ్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. కౌంటింగ్ కేంద్రంలో ప్రతి టేబుల్కు ఒక ఏజెంట్ వంతున నియమించుకోవచ్చన్నారు. కౌంటింగ్కు మూడు రోజుల ముందే ఏజెంట్ల వివరాలు ఇవ్వాలన్నారు. ఏజెంట్లు అందరూ ఓట్ల లెక్కింపు రోజున ఉదయం 7 గంటలకు కౌంటింగ్ కేంద్రంలో ఉండాలన్నారు. వారికి కేటాయించిన నియోజకవర్గం కౌంటింగ్ కేంద్రంలో సంబంధిత టేబుల్ వద్ద ఏజెంట్లు కూర్చోవాలన్నారు. ఓట్ల లెక్కింపు రోజున ఉదయం 6 గంటలకు అబ్జర్వర్లు, అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్ రూములు ఓపెన్ చేస్తారన్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియ 8.30 గంటలకు ఈవీఎం కౌంటింగ్ మొదలు పెడతారని చెప్పారు. పార్లమెంట్ పరిధిలోకి వచ్చే పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించి చిత్తూరు జిల్లాలో లెక్కింపు చేసి వివరాలను ఇక్కడికి పంపుతారన్నారు. కౌంటింగ్ కేంద్రం ఉన్న ప్రాంతాన్ని నో డ్రోన్ ఫ్లైజోన్గా ప్రకటించినట్లు తెలిపారు. భద్రతా చర్యల్లో భాగంగా జూన్ 1నుంచి 6వ తేదీ వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి, 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. గెలుపు ఓటములను సమభావంతో తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎవరు కూడా క్షణికావేశాలకు లోనుకారాదని సూచించారు. విజయ యాత్రలు, బాణాసంచా కాల్చడం నిషేధం అన్నారు. అందరూ సహకరించి ఓట్లు లెక్కింపు ప్రక్రియలు విజయవంతం చేయాలని కోరారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద మూడు అంచల విధానంలో భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జూన్ 6వ తేదీ వరకు జిల్లాలో మోడల్ కోడ్ అమలులో ఉంటుందని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలన్నారు. ఎవరైనా గొడవలు, అల్లర్లు సృష్టించాలని చూస్తే ఎవరినైనా ఉపేక్షించమని, పరిధి దాటిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. వీలైతే అరెస్టు కూడా చేస్తామన్నారు. జూన్ 19వ తేదీ వరకు జిల్లాలో బీఎస్ఎఫ్ ఫోర్సు ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో డీఆర్ఓ సత్యనారాయణ రావు తదితరులు పాల్గొన్నారు. -
వర్షాధారం..నాణ్యతే ప్రామాణికం
సాక్షి రాయచోటి/పీలేరు రూరల్ : ఖరీఫ్ సీజన్కు సంబంధించి అందించే సబ్సిడీ వేరుశనగ కాయలు నాణ్యమైనవి అందిస్తేనే దిగుబడి పెరిగే అవకాశం ఉంది. అలా కాకుండా సబ్సిడీ..లొట్టలతోపాటు నాసిరకం అందిస్తే పంట దిగుబడులపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే ఏడాదిలో వర్షాధారం కింద సాగు చేసే అన్నదాతలకు ప్రతి ఏడాది వ్యవసాయశాఖ ఖరీఫ్లో సబ్సిడీపై విత్తనాలను అందించడం ఎన్నో ఏళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. అయితే ముందస్తుగా కొనుగోలు చేసి నాణ్యత కలిగిన కాయలను ఎంపిక చేసి రైతులకు అందించేవారు. ప్రస్తుతం యుద్ధప్రాతిపదికన ఎక్కడికక్కడే రైతులు, గోడౌన్ల వద్ద కొనుగోలు చేసి అందించే వేరుశనగ కాయలలో నాణ్యత ఉండదని రైతులు పెదవి విరుస్తున్నారు. అన్నమయ్య జిల్లాకు సబ్సిడీ వేరుశనగ కాయలు 55,383 క్వింటాళ్లు మంజూరయ్యాయి. జిల్లాలోని నియోజకవర్గాలతోపాటు మండలాల వారీగా పంపిణీకి వ్యవసాయశాఖ ప్రణాళిక రూపొందించింది. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడమే అలస్యం, వెంటనే పంపిణీకి చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటికే జిల్లాలోని ఆర్బీకేల ద్వారా అవసరమైన రైతులు రిజిస్టర్ చేసుకోవాలని పిలుపునిచ్చిన తరుణంలో పెద్ద ఎత్తున రైతులు నమోదు చేసుకుంటున్నారు. ● జిల్లాలో రైతులకు అందించే సబ్సిడీ వేరుశనగ కాయల విషయంలో నాణ్యతకు పెద్దపీట వేయాలని రైతులు కోరుతున్నారు. ఎందుకంటే ముందుగా విత్తన మొలకశాతంతోపాటు విత్తన పరిపుష్టి శాతాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి అందించాలని ఏపీ సీడ్స్ అధికారులు, వ్యవసాయశాఖ అధికారులను రైతులు కోరుతున్నారు. ఏడాదికి ఒకసారి వర్షాభావం కింద సాగు చేసే పంట కావడంతో ఏదైనా తేడా వస్తే నష్టపోవాల్సి వస్తుందని తెలియజేస్తున్నారు. నాణ్యతలో రాజీ పడే ప్రసక్తే లేదు: జేడీ రైతులకు సంబంధించి అందించే సబ్సిడీ వేరుశనగ విత్తనాల విషయంలో ఖచ్చితంగా నాణ్యతలో రాజీ పడే ప్రసక్తే లేదని జిల్లా వ్యవసాయశాఖ అధికారి చంద్రనాయక్ తెలియజేశారు. 74 శాతం అవుటన్ ఉంటేనే పాయింట్ల నుంచి విత్తనాలను తెస్తున్నామని తెలియజేశారు. ఏపీ సీడ్స్ ద్వారా జిల్లాలో ఆరు చోట్ల ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయని, అక్కడ తయారైన విత్తనాలను నాణ్యత, అవుటన్ పరిశీలించిన తర్వాతనే రైతులకు సరఫరా చేస్తున్నామన్నారు. నాణ్యత విషయంలో కఠినంగా ఉన్నామని, అలాంటి లాట్లతో బస్తాలు వచ్చినా వెంటనే వెనక్కి పంపుతాము తప్ప తీసుకోమన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) కూడా 10 మంది రైతులతో ఒక క్వాలిటీ టీం ఏర్పాటు చేశామని...దీంతో తేడా రాదన్నారు. ఒకవేళ ఏదైనా నాణ్యత విషయంలో తేడా వస్తే ఆర్బీకే అసిస్టెంట్, ఏఓ, ఏడీఏలపై చర్యలు తప్పవని ఆయన సాక్షికి తెలియజేశారు. పీలేరు ఎమ్మెల్యేను కలిసిన రైతులు ప్రస్తుతం ఖరీఫ్ సీజన్కు సంబంధించి ఏపీ సీడ్స్ ద్వారా అందిస్తున్న విత్తనాల విషయంలో నాణ్యత అనుమానాలు రావడంతో పలువురు రైతులు శుక్రవారం పీలేరులో ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఏపీ విత్తన అభివృద్ధి సంస్థ మేనేజర్, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి ఈ ప్రాంతంలో పండిన విత్తనాలు కొనుగోలు చేసి అవే తిరిగి రైతులకు పంపిణీ చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయన్నారు. వేరే ప్రాంతాల్లో అధిక దిగుబడులు వచ్చిన విత్తనకాయలు కొనుగోలు చేసి, అలాంటివి ఇవ్వాలని, దీంతో మంచి దిగుబడి వచ్చి రైతులు ఆర్థికాభివృద్ధి చెందుతారని అదికారులకు వివరించారు. నాణ్యమైన విత్తనాలతోనే దిగుబడి పెంపు అత్యుత్తమ విత్తనాలను అందించాలని అన్నదాతల డిమాండ్ -
నాడు–నేడు పనులు వేగవంతం
లక్కిరెడ్డిపల్లి : మండలంలో నాడు–నేడు పనులు వేగవంతం చేసి వెంటనే పూర్తిచేయాలని అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి శివప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. ఏపీ మోడల్ స్కూల్లో జరుగుతున్న పదో తరగతి పరీక్షా కేంద్రాన్ని ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. మాస్ కాపీయింగ్కు చోటు ఇవ్వకుండా పకడ్బందీగా పరీక్ష నిర్వహించాలని సూపరిటెండెంట్, డీఈఓలకు సూచించారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠ్య పుస్తకాలు ప్రతి పాఠశాలకు అందేట్లు చూడాలని ఎంఈఓలకు సూచించారు. మండల విద్యాశాఖ కార్యాలయంలో ఎంఈఓలు చక్రే నాయక్, వెంకట సుబ్బయ్యలతో ఆయన మాట్లాడుతూ ఈ జూన్ 12వ తేదీలోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రామాంజనేయులు, మల్లికార్జున, సీఆర్పీలు మోహన్ రావు, శశికళ, చంద్రకళ, సిబ్బంది పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి శివప్రకాష్రెడ్డి -
● రెండు విధాలుగా పుస్తకాల సరఫరా
మదనపల్లె సిటీ: గత తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి దయనీయంగా ఉండేది. పాఠ్యపుస్తకాల కోసం విద్యార్థులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. విద్యా సంవత్సరం ముగిసే దశలోనూ పూర్తి స్థాయిలో అందేవి కావంటే క్షేత్రస్థాయిలో సమస్య తీవ్రత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ తరుణంలో 2019లో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. నాడు–నేడుతో మౌలిక వసతులు.. విద్యాకానుక పేరుతో విద్యార్థులకు తొమ్మిది రకాల వస్తువులు.. జగనన్న గోరుముద్ద...తదితర పథకాలతో ప్రభుత్వ పాఠశాలల వైపు ఎక్కువ మంది మొగ్గు చూపేలా చర్య లు చేపట్టారు. తాజాగా పాఠశాలల పునః ప్రారంభం నాటికే పూర్థి స్థాయిలో పాఠ్యపుస్తకాలను అందించాలనే లక్ష్యంతో ముందుకెళుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుఽల ప్రమాణాల పెంపే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇందులో భాగంగా ఈ విద్యా సంవత్సరంలో స్కూళ్ల పునః ప్రారంభం నాటికే పాఠ్యపుస్తకాలను పూర్థిస్థాయిలో అందించేలా కసరత్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పుస్తకాలు జిల్లాలో మొదటి విడతలో రాజంపేట, పుల్లంపేట, ఓబులవారిపల్లె, రైల్వేకోడూరు, చిట్వేలి, పెనగలూరు, నందలూరు, గాలివీడు, లక్కిరెడ్డిపల్లె, రామాపురం, చిన్నమండ్యం, రాయచోటి, సంబేపల్లి, టి.సుండుపల్లి, వీరబల్లి మండలాలకు 1 నుంచి 7 తరగతుల పాఠ్యపుస్తకాలు 1,29,852 పంపారు. మరో నాలుగైదు రోజల్లో మరో 15 మండలాలకు పాఠ్యపుస్తకాలు మండల స్టాక్ పాయింట్లకు పంపనున్నారు. ఒకటి నుంచి పదోతరగతి వరకు ప్రతి పాఠ్య పుస్తకం కవర్పేజీలో మార్పులు చేసి, విద్యార్థులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. పాఠ్యపుస్తకంలో క్యూఆర్ కోడ్ను కూడా ముద్రించారు. దీని ద్వారా పాఠ్యాంశానికి సంబంధించిన అదనపు సమాచారాన్ని పొందవచ్చు. దశల వారీగా అన్ని తరగతులకు సెమిస్టర్ విధానం పుస్తకాల బరువుతో విద్యార్థుల వెన్నుముకపై భారం పడకుండా ఉండేందుకు సెమిస్టర్ విధానాన్ని అమలు చేస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో 1–9 తరగతి వరకు సెమిస్టర్ విధానం అమలు చేయగా, ఈ ఏడాది పదో తరగతికి కూడా అమలు చేశారు. గణితం, సైన్స్ సబ్జెక్టులను రెండు సెమిస్టర్లుగా విడదీశారు. సిలబస్ మొత్తాన్ని జూన్ నుంచి అక్టోబర్ వరకు సెమిస్టర్–1, నవంబర్ నుంచి మార్చి వరకు సెమిస్టర్–2 విభజించారు. దశలవారీగా అన్ని తరగతులకు సెమిస్టర్ విధానం అమలు చేశారు. 1–10 తరగతులకు పాఠ్యపుస్తకాలల్లో బైలింగ్విల్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఒక పేజీలో ఇంగ్లీషు, ఒక పేజీలో తెలుగు పాఠ్యాంశాన్ని ముద్రించి ఇవ్వడం వల్ల విద్యార్థులు సులువుగా అర్థం చేసుకుని చదువుకునే వీలుంటుంది. 1–10 తరగతుల విద్యార్థులకు పాఠ్యపుస్తకాల సంబంధించి 111 టైటిల్స్ సరఫరా చేస్తున్నారు. స్కూళ్ల పునః ప్రారంభానికి ముందే జిల్లాకు చేరిక 8 నుంచి పదో తరగతి వరకు నేరుగా మండల స్టాక్ పాయింట్లకు ఒకటి నుంచి ఏడు వరకు జిల్లా స్టాక్ పాయింట్కు నెలాఖరు నాటికి పూర్తిస్థాయిలో రాక తొలివిడత వచ్చినవి: 2,41,342 ఇప్పటి వరకు పంపిణీ చేసినవి: 1,29,852 పాఠశాలలు తెరిచిన రోజే పుస్తకాలు అందజేత పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులందరికి పుస్తకాలచ్చేలా చర్యలు చేపట్టాం. వచ్చే నెల 10 నాటికి మండల స్టాక్ పాయింట్ల నుంచి పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు చేరుస్తాం. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలతో పాటు వర్క్బుక్లు, ఆరు నుంచి పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు అందజేయనున్నాం. –శివప్రకాష్రెడ్డి, డీఈఓ, అన్నమయ్య జిల్లా గత విద్యా సంవత్సరం వరకు పాఠ్యపుస్తకాలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని 15 మండలాలకు తిరుపతి పుస్తక గోదాం నుంచి సరఫరా చేశారు. మరో 15 మండలాలకుల కడప పుస్తక గోదాం నుంచి సరఫరా చేశారు. అయితే ఈసారి కడప పుస్తక గోదాం నుంచి జిల్లా వ్యాప్తంగా సరఫరా చేస్తున్నారు. అయితే ఈసారి పాఠ్యపుస్తకాలు రెండు విధాలుగా సరఫరా చేస్తున్నారు. 1–7 తరగతులకు నేరుగా పాఠ్యపుస్తకాలు, వర్క్బుక్లు పుస్తక గోదాం నుంచి మండల స్టాక్పాయింట్లకు సరఫరా చేస్తున్నారు. 8–10 తరగతులకు ప్రభుత్వం అనుమతి పొందిన ప్రిటింగ్ ప్రెస్ల నుంచి నేరుగా మండల స్టాక్ పాయింట్లకు పంపిస్తున్నారు. ఆర్టీసీ కార్గో సర్వీసు ద్వారా మండల స్టాక్పాయింట్లకు సరఫరా ప్రారంభమైంది. -
ఖరీఫ్లో 1.70 లక్షల ఎకరాల్లో పంటల సాగు
ములకలచెరువు : జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో 1.70 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేయనున్నట్లు జేడీ చంద్ర నాయక్ తెలిపారు. శుక్రవారం ఆయన మొలకలచెరువులోని వేరుశనగ విత్తన కాయల ప్రాసెసింగ్ యూనిట్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ములకలచెరువు, బి. కొత్తకోట, గుర్రంకొండ, కలకడ మండలాల్లో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి విత్తన కాయలను రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. నాణ్యమైన విత్తనా కాయలు సరఫరా చేయకపోతే ప్రాసెసింగ్ యూనిట్ల లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. జిల్లా మొత్తానికి 55400 మెట్రిక్ టన్నులు వేరుశనగ విత్తనకాలు మంజూరైనట్లు చెప్పారు. అలాగే 40 వేల మెట్రిక్ టన్నులు ఎరువులు మంజూరు అయినట్లు తెలిపారు. ఈనెల 28వ తేదీ వరకు విత్తనకాయల కోసం రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నారు. 29వ తేదీ నుంచి విత్తన కాయలు పంపిణీ చేస్తామన్నారు. అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏఓ లీల కుమారి ఆయన వెంట ఉన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
● జిల్లాలో వరుస చోరీలు ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ● ఆందోళన చెందుతున్న ప్రజలు ● నిఘా పెంచిన పోలీసులు
వసతులు కల్పించాలని హిందూవాహిని వినతి
ఏటా రెండులారీల కోడి ఎరువు
సేంద్రియ ఎరువులకు డిమాండ్
ప్యాసింజర్ రైళ్లు.. నిర్లక్ష్యం ఎన్నేళ్లు?
‘బీజేపీపై బురదజల్లే ప్రయత్నం’
జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ‘నలిమెల’
పత్తి విత్తనం.. ధరలకేదీ కళ్లెం?
రైతులకు జీలుగ విత్తనాల కష్టాలు
వామ్మో.. హోటల్ ఫుడ్
తప్పక చదవండి
- జూన్ 1న ఇండియా కూటమి మీటింగ్!.. కీలక విషయాలపై చర్చ
- కేకేఆర్ విజయంతో బెంగాల్లో సంబరాలు మిన్నంటాయి: సీఎం మమత
- భారతీయుడు మళ్లీ వస్తున్నాడు.. అఫీషియల్ ప్రకటన
- తిరుపతి: చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం
- IPL 2024 Final: సన్రైజర్స్కు గుండెకోత.. చరిత్ర సృష్టించిన స్టార్క్
- మోదీని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలి: సీఎం నితీష్
- ఎవరు చంపారు..? ఎందుకీ దారుణం..?
- నేడు ‘హజ్ యాత్ర’ ప్రారంభం
- భారత్పే, ఫోన్పే మధ్య వివాదం పరిష్కారం
- గాలి బీభత్సం.. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం
Advertisement