-
గ్రూప్–2 అభ్యర్థులకు 25 నుంచి ఉచిత శిక్షణ
అమలాపురం రూరల్: ఈ నెల 25వ తేదీ నుంచి గ్రూప్–2 మెయిన్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు తూర్పుగోదావరి జిల్లాలోని బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు తూర్పుగోదావరి జిల్లా బీసీ స్టడీ సర్కిల్ సంచాలకుడు పిల్లి సత్య రమేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రూప్–2 ప్రిలిమ్స్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో శిక్షణ ఇస్తామన్నారు. శిక్షణ తరగతులతో పాటు ప్రతి సబ్జెక్టుకి ప్రాక్టీస్ టెస్టులు, గ్రాండ్ టెస్ట్లు నిర్వహస్తామని తెలిపారు. లైబ్రెరీ సౌకర్యం, స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉన్నాయన్నారు. గ్రూప్–2 మెయిన్స్ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన అభ్యర్థులు రాజమహేంద్రవరం ఏపీ బీసీ స్టడీ సర్కిల్కు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం 08832421129, 93939 34825, 86394 47339 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలన్నారు. -
ఇవి పాటించాల్సిందే..
రాయవరం: బడి బస్సుల భద్రతపై అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది.. వచ్చే నెల 12 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలల బస్సుల ఫిట్నెస్పై దృష్టి సారించింది. జిల్లాలో వివిధ రకాల ప్రైవేట్ విద్యా సంస్థలు 580 వరకూ ఉన్నాయి. ఆయా విద్యా సంస్థల విద్యార్థులు అధిక శాతం బస్సుల్లోనే ప్రయాణిస్తుంటారు. అయితే బస్సు సామర్థ్యం సరిగ్గా లేకుంటే ప్రమాదాలు జరిగే అవకాశముంది. అందుకే ఏటా మోటార్ వెహికల్ తనిఖీ అధికారులు బస్సు కండీషన్ చెక్ చేసి ఫిట్నెస్ సర్టిఫికెట్ జారీ చేస్తుంటారు. గతేడాది జారీ చేసిన ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు ఈ నెల 15వ తేదీతో ముగియడంతో, 17వ తేదీ నుంచి కొత్తగా ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రారంభమైంది. విద్యార్థులను సురక్షితంగా ఇంటి నుంచి పాఠశాలలకు, పాఠశాల నుంచి ఇంటికి చేరవేసే వాహనాల సామర్థ్యం (ఫిట్నెస్) ఎలా ఉందన్న విషయాన్ని తేల్చే పనిని రవాణా శాఖ అధికారులు చేపడుతున్నారు. ఆన్లైన్లో తేదీల ఖరారు జిల్లాలోని స్కూళ్లు, కళాశాలల బస్సుల సామర్థ్య పరీక్షలు చేపట్టడానికి మండపేట, రామచంద్రపురం, అమలాపురం రవాణా శాఖ కార్యాలయాలు సన్నద్ధమయ్యాయి. వాహనాలు ఎలా ఉండాలనే విషయమై పాఠశాల, కళాశాలల యాజమాన్యాలకు ఇప్పటికే తెలియజేశారు. వాహన ఫిట్నెస్ ధ్రువీకరణ కోసం ముందుగా ఆన్లైన్లో పాఠశాల/కళాశాలల యాజమాన్యాలు ఈ–ప్రగతి పోర్టల్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. అనంతరం రవాణాశాఖ కార్యాలయానికి ఎఫ్సీ చేయించుకునేందుకు ఓ తేదీని కేటాయిస్తారు. ఆ ప్రకారం వాహనాన్ని రవాణా శాఖ కార్యాలయానికి తీసుకొస్తే, అందరి సమక్షంలో వాహన ఫిట్నెస్ తనిఖీలు నిర్వహిస్తారు. జిల్లాలో మొత్తం 791 బస్సులు జిల్లాలో 791 వరకూ పాఠశాల, కళాశాలల బస్సులు ఉన్నాయి. మండలాల వారీగా పరిశీలిస్తే.. మండపేట 83, ఆలమూరు 21, కపిలేశ్వరపురం 8, రావులపాలెం 59, మలికిపురం 41, రాజోలు 45, పి.గన్నవరం 10, సఖినేటిపల్లి 19, మామిడికుదురు 50, ఆత్రేయపురం 6, రామచంద్రపురం 61, రాయవరం 12, కె.గంగవరం 10, అమలాపురం 263, ముమ్మిడివరం 18, అల్లవరం 41, ఉప్పలగుప్తం 5, ఐ.పోలవరం 11, అంబాజీపేట 7, కాట్రేనికోన 9, కొత్తపేట 9, అయినవిల్లి 5 బస్సులు ఉన్నాయి. ఫిట్నెస్ సర్టిఫికెట్ లేకుండా పాఠశాల/కళాశాల వాహనాలు రోడ్డుపై తిరగడానికి వీలులేదు. 2017 నుంచి స్కూల్ బస్సులకు స్పీడ్ గవర్నర్స్ ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి చేశారు. ఈ బస్సుల వేగం గంటకు 60 కిలోమీటర్లు మాత్రమే ఉండాలి. ఫ ముగిసిన ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు ఫ కొత్తగా జారీ ప్రక్రియ ప్రారంభం ఫ ప్రతి బస్సుకూ స్పీడ్ గవర్నర్లు తప్పనిసరి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం కళాశాలలు, పాఠశాలల వాహనాలు ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం వస్తున్నాయి. ప్రతి బస్సును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ బస్సుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తి లేదు. యజమానులూ వాహనాల భద్రతకు అత్యంత ప్రాధాన్యమిచ్చి, ఫిట్నెస్ సర్టిఫికెట్లు చేయించుకోవాలి. –ఆర్.రాజేంద్రప్రసాద్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, రామచంద్రపురం కండీషన్లో లేకుంటే సీజ్ ప్రతి స్కూల్ బస్సుకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తప్పనిసరి. అలాగే స్పీడ్ గవర్నర్స్ ఏర్పాటు చేసుకోవాలి. వచ్చే నెల 15వ తేదీ లోపు ఎఫ్సీ చేయించుకోవాలి. పాఠశాలలు తెరిచిన నాటి నుంచి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. గడువు ముగిసిన తర్వాత ఎఫ్సీ, పర్మిట్, కండీషన్ లేని బస్సులను సీజ్ చేస్తాం. – డి.అశోక్ ప్రతాప్రావు, డీటీఓ, అమలాపురం ఫ పాఠశాల బస్సును నడిపే డ్రైవర్కు బీపీ, షుగర్, కంటి సంబంధిత సమస్యలు లేవని సర్టిఫికెట్ సమర్పించాలి. ఫ బస్సుకు సంబంధించిన అన్ని లైట్లు పనిచేయాలి. రిఫ్లక్టివ్ టేపును బస్సుకు నాలుగు వైపులా అతికించాలి. బస్సుకు ఉన్న గ్లాసులన్నీ పటిష్టంగా ఉండేలా చూడాలి. ఫ బస్సు నుంచి అధిక మొత్తంలో బ్లాక్ స్మోక్ (పొగ) రాకుండా చూసుకోవాలి. బ్రేక్ కండిషన్లో ఉండాలి. హ్యాండ్ బ్రేక్, స్పీడో మీటర్ సక్రమంగా పనిచేయాలి. స్టీరింగ్, టైర్లు కండీషన్ సరిచూసుకోవాలి. ఫ బస్సు నడిపే డ్రైవర్కు ఐదేళ్ల అనుభవం, 60 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి. ఫ బస్సులో అత్యవసర ద్వారం, మంటలను ఆర్పే పరికరం ఏర్పాటు చేసుకోవాలి. అత్యవసర ద్వారం అని తెలిసేలా స్పష్టంగా కనిపించే విధంగా రాయించాలి. ఫ ప్రతి బస్సులో మందులు, పరికరాలతో కూడిన ప్రథమ చికిత్స బాక్స్ను అందుబాటులో ఉంచాలి. వారానికి ఒకసారి ప్రిన్సిపాల్ లేదా సంబంధిత అధికారి ఈ బాక్స్ను తనిఖీ చేయాలి. నెలకొకసారి పేరెంట్స్ కమిటీ చూసి, దీనికోసం ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించాలి. ఫ బస్సులో సీట్ల కింద బ్యాగులు ఉంచుకునేందుకు అరలు ఏర్పాటు చేయాలి. సైడ్ విండోలకు మధ్యలో మూడు అంగుళాలకు మించని దూరంలో అడ్డంగా మూడు లోహపు కడ్డీలు అమర్చాలి. ప్రతి విద్యా సంస్థ యాజమాన్యం, ట్రాన్స్పోర్ట్, పోలీస్, విద్యాశాఖల సౌజన్యంతో విద్యార్థులకు ఏడాదికి ఒకరోజు రోడ్ సేఫ్టీ తరగతులు నిర్వహించాలి. ఫ బస్సు ఫుట్బోర్డుపై మొదటి మెట్టు భూమి నుంచి 325 మి.మీ ఎత్తుకు మించరాదు. మెట్లు జారకుండా ఉండేలా లోహంతో చేయించాలి. ఫ బస్సులో ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు పట్టుకునేందుకు వీలుగా బస్సు ముందు తలుపు మెట్లకు సమాంతరంగా రెయిలింగ్లు ఏర్పాటు చేయాలి. ఫ విద్యార్థులు బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు బస్సు అటెండెంట్ పర్యవేక్షించాలి. ఫ పాఠశాల వద్ద బస్సుల పార్కింగ్కు ప్రత్యేక స్థలం కేటాయించాలి. బస్సులో అటెండర్ ఉండాలి. ఫ సీటింగ్ కెపాసిటీకి మించి విద్యార్థులను ఎక్కించకూడదు. బస్సు ఎడమవైపు ముందు భాగంలో యాజమాన్యం వివరాలు, స్కూల్ బాయ్ అండ్ గర్ల్ ఇమేజ్ పొందుపర్చాలి. ఫ బస్సు బయలుదేరే సమయం, ఆగే స్థలాల రూట్ ప్లాన్ ఉంచాలి. విద్యార్థుల సంఖ్య, వారి పూర్తి వివరాలు, అలాగే డ్రైవర్ వివరాలు బస్సులో ఏర్పాటు చేయాలి. ఫ ప్రతి నెలా బస్సు కండీషన్ను యాజమాన్యాలు, పాఠశాల పేరెంట్స్ కమిటీ తనిఖీ చేయాలి. బస్సులో ఫిర్యాదుల పుస్తకం ఉంచాలి. ఫ బస్సులో అటెండర్ తప్పకుండా యూనిఫామ్ ధరించాలి. ఫ వెనుక నుంచి వచ్చే వాహనాలను చూసేందుకు వీలుగా బస్సు డ్రైవర్కు కుడి, ఎడమ వైపు బయట, లోపల మిర్రర్స్ ఏర్పాటు చేయాలి. బస్సు ఎట్టి పరిస్థితుల్లో ర్యాంగ్ రూట్లో ప్రయాణించరాదు. -
ఇంటర్లో ప్రవేశాలకు ఆహ్వానం
రాయవరం: గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమాన్ని అందించాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదర్శ పాఠశాలల (మోడల్ స్కూల్స్)ను ఏర్పాటు చేశాయి. ఇందులో భాగంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి శంఖవరం, హంసవరంలో రెండు మోడల్ స్కూల్స్ ఉన్నాయి. మోడల్ స్కూల్స్లో 2024–25 విద్యా సంవత్సరంలో ఇంటర్లో ప్రవేశానికి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మోడల్ స్కూల్స్లో ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకూ తరగతులు నిర్వహిస్తుండగా, ఇప్పటికే ఆరో తరగతిలో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేయగా, దరఖాస్తు ప్రక్రియ పూర్తయ్యింది. ఎంపిక జాబితా విడుదల కావాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇంటర్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల కాగా, ఆన్లైన్లో దరఖాస్తుకు ఈ నెల 22 చివరి తేదీ అని పేర్కొన్నారు. మొత్తం ఎన్ని సీట్లంటే.. మోడల్ స్కూల్లో ఇంటర్ ఫస్టియర్కు ఒక్కో స్కూల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపులు ఉన్నాయి. ఒక్కో గ్రూపులో 40 సీట్ల చొప్పున ఒక్కో స్కూల్లో ఇంటర్ ఫస్టియర్కు 160 సీట్లను భర్తీ చేస్తారు. ఇంటర్ ఫస్టియర్ ప్రవేశానికి ఈ నెల 22వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు ఓసీ, బీసీ విద్యార్థులు రూ.200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.150 ఫీజు చెల్లించాలి. దరఖాస్తు తుది గడువు ముగిసిన అనంతరం రాష్ట్ర కార్యాలయం నుంచి ఈ నెల 23న వచ్చిన దరఖాస్తుల ఆధారంగా ఆయా జిల్లాలకు దరఖాస్తులు పంపిస్తారు. ఆన్లైన్లో స్వీకరించిన దరఖాస్తుల నుంచి మెరిట్ జాబితాను ఈ నెల 24న తయారు చేస్తారు. జిల్లా జాయింట్ కలెక్టర్ చైర్మన్గా, డీఈఓ వైస్ చైర్మన్గా, సభ్యులుగా ఇంటర్మీడియేట్ బోర్డు ఆర్ఐఓ, ఏపీ మోడల్ స్కూల్స్ ఏడీ ఉంటారు. మెంబర్ కన్వీనర్గా జిల్లా జాయింట్ కలెక్టర్తో నామినేట్ చేయబడిన ప్రిన్సిపాల్ ఉంటారు. ఎంపికై న విద్యార్థుల జాబితాను కమిటీ ఈ నెల 25న ప్రకటిస్తుంది. పాఠశాల స్థాయిలో ఈ నెల 27న ఎంపికై న విద్యార్థుల సర్టిఫికెట్లు పరిశీలిస్తారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఎంపికలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తారు. ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు ఆరు శాతం, బీసీలకు 29, ఓసీలకు 40, ఈడబ్ల్యూఎస్కు 10 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తారు. దరఖాస్తులు హెచ్టీటీపీఎస్://ఏపీఎంఎస్.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్సైట్లో లభ్యమవుతాయి. ఈ నెల 22వ తేదీలోగా నెట్ బ్యాంకింగ్/క్రెడిట్/డెబిట్ కార్డులను ఉపయోగించి గేట్వే ద్వారా అప్లికేషన్ రుసుం చెల్లించిన తర్వాత దరఖాస్తుదారులకు ఒక జనరల్ నంబరును కేటాయిస్తారు. జనరల్ నంబరు ఆధారంగా వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వివరాలకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ను లేదా సంబంధిత డీవైఈఓ/మండల విద్యాశాఖాధికారిని సంప్రదించాలి. ఫ మోడల్ స్కూల్స్లో విద్యకు దరఖాస్తులు ఫ ఆన్లైన్ ప్రక్రియకు ఈ నెల 22 చివరి తేదీ -
ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద పార్కింగ్ స్థలాల ఎంపిక
అమలాపురం రూరల్: వచ్చే నెల 4న సాధారణ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి చెయ్యేరు శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాల చుట్టుపక్కల పార్కింగ్ ప్రదేశాలను ఎంపిక చేస్తున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హిమాన్షు శుక్లా తెలిపారు. శనివారం చెయ్యేరులో శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాల చుట్టుపక్కల ప్రభుత్వ సిబ్బంది, ప్రజాప్రతినిధుల వాహనాల పార్కింగ్ కోసం నాలుగు స్థలాలను ఎంపిక చేశారు. ఈ కళాశాలలో అమలాపురం పార్లమెంట్ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎస్పీ శ్రీధర్తో కలసి ఆయన పరిశీలించారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్లకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న కౌంటింగ్ కేంద్రాల ఏర్పాట్లను వారు పరిశీలించి పలు సూచనలు చేశారు. ఓట్ల లెక్కింపు రోజున శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాల వద్ద ట్రాఫిక్ మళ్లించి, ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు. అమలాపురం ఆర్డీఓ, అసెంబ్లీ రిట ర్నింగ్ అధికారి జి.కేశవర్ధన్రెడ్డి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పథక సంచాలకుడు ఎస్.మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు. వచ్చే నెల నాలుగు వరకూ 144 సెక్షన్ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఈ నెల 14 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకూ జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. సాధారణ ఎన్నికల పోలింగ్ 13న నిర్వహించి, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను చెయ్యేరు శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచారన్నారు. అక్కడ కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నందున ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతను దృష్టిలో ఉంచుకుని 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు వివరించారు. చూసిన కన్నులదే భాగ్యం మామిడికుదురు: నిత్య కల్యాణం, పచ్చ తోరణంగా విరాజిల్లుతున్న అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారిని శనివారం భక్తులు తనివి తీరా దర్శించుకుని పులకించారు. శ్రీదేవి, ఽభూదేవి సమేతంగా కొలువుదీరిన స్వామివారి దివ్య మంగళ స్వరూపం దర్శనంతో మురిసిపోయారు. వేసవి సెలవులు కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. తొలుత పవిత్ర వైనతేయ గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామివారికి ముడుపులు, మొక్కుబడులు సమర్పించారు. భక్తుల రాకతో పాత గుడితో పాటు కొత్త గుడి రద్దీగా మారింది. స్వామివారికి వివిధ సేవల ద్వారా రూ.4.31 లక్షల ఆదాయం సమకూరిందని ఆలయ కార్యనిర్వహణాధికారి గ్రంధి మాధవి తెలిపారు. లడ్డూ ప్రసాదం, దర్శనం టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.3.15 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. నిత్యాన్నదాన ట్రస్టుకు భక్తులు రూ.1,15,603 విరాళాలుగా సమర్పించారన్నారు. 4,193 మంది స్వామివారిని దర్శించుకున్నారని, 3,278 మంది అన్న ప్రసాదం స్వీకరించారన్నారు. కాకినాడకు చెందిన దూనబోయిన నాగమల్లేశ్వరరావు, కోమలి దంపతులు నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.10,116 విరాళంగా అందించారు. ఇదిలాఉంటే అప్పనపల్లి ఆలయంలో హుండీల ఆదాయం లెక్కింపు ఈ నెల 22వ తేదీ బుధవారం జరుగుతుందని ఈఓ మాధవి తెలిపారు. ఉదయం తొమ్మిది గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. శనైశ్చరునికి తైలాభిషేకాలు కొత్తపేట: మందపల్లి గ్రామంలో ప్రసిద్ధి చెందిన ఉమా మందేశ్వర (శనైశ్చర) స్వామివారిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు, తైలాభిషేకాలు నిర్వహించారు. స్వామివారి ప్రాతఃకాల అర్చన అనంతరం భక్తులు తైలాభిషేకాలు, సర్వదర్శనాలు చేసుకున్నారు. దేవస్థానం ఏసీ అండ్ ఈఓ కె.విజయలక్ష్మి భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. టిక్కెట్లు, వివిధ సేవల ద్వారా రూ. 1,75,310, అన్నప్రసాద పథకానికి విరాళాల రూపంలో మరో రూ.68,548 వచ్చాయి. సిబ్బంది, పలువురు గ్రామస్తులు అన్నప్రసాద వితరణలో పాల్గొన్నారు. -
బహిరంగ మార్కెట్లో పెట్రోల్ విక్రయాల నిషేధం
అమలాపురం రూరల్: ఆంధ్రప్రదేశ్ పెట్రోలియం ప్రోడక్ట్ ఆర్డర్ 1980 ప్రకారం పెట్రోల్ బంకుల్లో మోటార్ సైకిల్స్, వెహికల్స్ ట్యాంకుల్లో కాకుండా విడిగా సీసాలు, క్యాన్లు, ఇతర పరికరాల్లో పెట్రోల్ నింపడం నిషేధమని జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ ఎల్లారావు అన్నారు. ఈ మేరకు పెట్రోలియం ప్రోడక్ట్ డీలర్లకు శనివారం ఆదేశాలు ఇచ్చారు. పెట్రోల్ బంకుల్లో కాకుండా ఇతర దుకాణాలు, బహిరంగ ప్రదేశాల్లో పెట్రోల్, డీజిల్ అమ్మకం నిషేధమని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. శృంగార వల్లభునికి రూ.4.04 లక్షల ఆదాయం పెద్దాపురం: తొలి తిరుపతి గ్రామంలో వేంచేసిన శృంగార వల్లభ స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. స్వామివారిని అర్చకులు ప్రత్యేకంగా అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుమారు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకుని, ముడుపులు, మొక్కుబడులు చెల్లించుకున్నారు. దర్శనం, కేశఖండన టికెట్లు, అన్నదానం విరాళాల ద్వారా స్వామి వారికి రూ.4,04,592 ఆదాయం సమకూరిందని ఆలయ కార్యనిర్వహణాధికారి వడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఆయనతో పాటు ఆలయ చైర్మన్ కర్రి వెంకట జగదీశ్వరరావు ఆధ్వర్యాన భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. భక్తులకు ప్రసాద వితరణ, అన్నదానంతో పాటు మజ్జిగ కూడా అందించామని ఈఓ తెలిపారు. -
బోధనలో మార్పులను ఆకళింపు చేసుకోవాలి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో ఆంధ్ర రాష్ట్ర కళాశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో మూడు రోజులుగా రాష్ట్రంలోని వివిధ డిగ్రీ కళాశాల అధ్యాపకులకు నిర్వహిస్తున్న క్రియేటివ్ ఈ– కంటెంట్ జనరేషన్ శిక్షణ శనివారంతో ముగిసింది. దీనికి కళాశాల ఆర్జేడీ డాక్టర్ చప్పిడి కృష్ణ హాజరై మాట్లాడుతూ ఉన్నత విద్య బోధనా విధానంలో వస్తున్న పెను మార్పులను కళాశాలల అధ్యాపకులు ఆకళింపు చేసుకోవాలన్నారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న కృత్రిమ మేధ(ఏఐ)ను ఉపయోగించి పాఠ్య ప్రణాళిక రూపొందించి, తదనుగుణంగా విద్యా బోధన సాగించాలన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర.ఆర్కే మాట్లాడుతూ డిజిటల్ పద్ధతులను అధ్యాపకులు తమ విద్యా బోధనలో ప్రవేశపెట్టాలన్నారు. ఉన్నత విద్యలో నిన్న, నేడు, రేపు అనే ప్రాతిపదికన వస్తున్న మార్పులను తెలుసుకోవాలన్నారు. ఈ పద్ధతులను ఏఐతో అనుసంధానించి విద్యా బోధన సాగించడంలో ఆర్ట్స్ కళాశాల ముందంజలో ఉందన్నారు. కృత్రిమ మేధ పద్ధతుల్లో ప్రవీణుడు డాక్టర్ సునీల్ మ్యాజిక్ స్కూల్ వంటి సాఫ్ట్వేర్లను ఉపయోగించి పాఠ్య ప్రణాళికను ఎలా రూపొందించాలో వివరించారు. బెంగళూరుకు చెందిన డాక్టర్ నాగేంద్ర పలు అంశాలు వివరించారు. శిక్షణకు బి.వెంకట్రావు సమన్వయకర్తగా, ఏపీసీసీఈకు చెందిన డాక్టర్ జె.జ్యోతి పర్యవేక్షకులుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఎన్.శ్రీనివాస్, సంజీవ్ కుమార్, కిరణ్ కుమార్, ప్రవీణ్ అధ్యాపకులు పాల్గొన్నారు. -
భక్తవత్సలా గోవింద..
ఆత్రేయపురం: వేసే ప్రతి అడుగులోనూ భక్తపరవశమే.. పెదవి నుంచి వచ్చే ప్రతి మాటలోనూ గోవింద నామస్మరణమే.. ఏడు సార్లు ఆ స్వామి ఆలయం చుట్టూ చేసే ప్రదక్షిణలతో ప్రతి మది నిండా సంబరమే.. కోనసీమ తిరుపతిగా ఖ్యాతికెక్కిన వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి ఆలయం శనివారం వేలాది మంది భక్తజనం మధ్య మురిసిపోయింది. ఎక్కడ చూసినా కిక్కిరిసిన జనంతో పరిసరాలు ఆధ్యాత్మిక శోభతో కనిపించాయి. గోవింద నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. తొలుత వాడపల్లి వెంకన్న స్వామివారిని ప్రత్యేక పుష్పాలతో అర్చకులు అలంకరించి, భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. ఉదయమే భక్తులు గౌతమీ గోదావరిలో స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తజనం స్వామివారితో పాటు ఆలయ ఆవరణలో అన్నపూర్ణా సమేత విశ్వేశ్వరస్వామిని దర్శించుకుంది. ఈ ఏర్పాట్లను డిప్యూటీ కమిషనర్, ఆలయ ఈఓ భూపతిరాజు కిశోర్కుమార్ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు. స్వామి వారికి ప్రత్యేక దర్శనం, అన్నప్రసాద విరాళాలు, వివిధ సేవలు, లడ్డూ ప్రసాదం విక్రయం, ఆన్లైన్ ద్వారా సుమారు రూ.38,41,181 ఆదాయం సమకూరిందని ఈఓ తెలిపారు. ఆలయం వద్ద స్వామివారి అన్నప్రసాదాన్ని వేలాది భక్తులు స్వీకరించారు. రద్దీ దృష్ట్యా ఎటువంటి ఇబ్బంది రాకుండా ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఫ వాడపల్లికి భక్తజన శోభ ఫ ఒక్కరోజే రూ.38.41 లక్షల ఆదాయం -
ఏర్పాట్లు షురూ..
రాయవరం: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేస్తోంది. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షలకు అవసరమైన ఏర్పాట్లలో నిమగ్నమైంది. జిల్లా వ్యాప్తంగా 21 కేంద్రాల్లో ఉదయం ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించనుంది. మధ్యాహ్నం పరీక్షలను ప్రభుత్వ కళాశాలలు ముమ్మిడివరం, ముక్తేశ్వరం, మామిడికుదురు, రాజోలు, కొత్తపేట, రావులపాలెం, ఆలమూరు, మండపేట, రాయవరం, రామచంద్రపురం, పామర్రుతో పాటు మలికిపురం ఏఎఫ్డీటీ జూనియర్ కళాశాల, పుల్లేటికుర్రు ఏవీఎస్ జూనియర్ కళాశాల, అమలాపురం ఎస్కేబీఆర్ కళాశాలల్లో మాత్రమే నిర్వహిస్తారు. మొత్తం 8,748 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో ఫస్టియర్, సెకండియర్ జనరల్ 7,733, ఒకేషనల్ ఫస్టియర్, సెకండియర్ 1,015 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఫస్టియర్ జనరల్ 6,438, సెకండియర్ జనరల్ 1,295, ఒకేషనల్ ఫస్టియర్ 696, సెకండియర్ 319 మంది పరీక్షలకు హాజరు కానున్నారు. 12 ప్రభుత్వ, ఒక ఎయిడెడ్, 8 ప్రైవేట్ అన్ఎయిడెడ్ జూనియర్ కళాశాలల్లో కేంద్రాలను ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కళాశాలల్లో పరీక్షలు తప్పిన, అత్యున్నత మార్కులను పొందేందుకు బెటర్మెంట్ కట్టిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పకడ్బందీ చర్యలు పరీక్షలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పరీక్షల నిర్వహణకు సంబంధించి సిబ్బందిని నియమించారు. 21 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, కస్టోడియన్లను నియమిస్తున్నారు. స్టోరేజ్ పాయింట్లలో ప్రశ్నపత్రాలను భద్రపర్చనున్నారు. డీవీఈఓ, హైపవర్ కమిటీ, సిటింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్స్ను ఏర్పాటు చేస్తున్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, వీటి ద్వారా ఇంటర్బోర్డు ఉన్నతాధికారులు పర్యవేక్షించేలా స్ట్రీమింగ్ చేశారు. రెండు సెషన్లలో.. ఈ నెల 24 నుంచి 31వ తేదీ వరకూ జరిగే పరీక్షలను రెండు సెషన్లుగా నిర్వహిస్తున్నారు. ఫస్టియర్ విద్యార్థులకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, సెకండియర్ విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు వారికి కేటాయించిన కేంద్రానికి అరగంట ముందుగా చేరుకోవాల్సి ఉంటుంది. ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అలాగే పరీక్ష కేంద్రాల్లో అవసరమైన వైద్య సిబ్బందిని నియమిస్తున్నారు. త్వరలో సమన్వయ సమావేశం ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై కలెక్టర్ హిమాన్షు శుక్లా నేతృత్వంలో త్వరలో అమలాపురంలో సమన్వయ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ఇంటర్ బోర్డు అధికారులతో పాటు, వైద్య ఆరోగ్య శాఖ, ఆర్టీసీ, పోలీసు, పోస్టల్, రెవెన్యూ, మున్సిపల్, డీఈఓ, డీపీవో తదితర ఎనిమిది శాఖలతో కూడిన సమావేశం జరగనుంది. ప్రధానంగా పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా డెస్క్లు, తాగునీరు, టాయిలెట్లు తదితర సౌకర్యాలను కల్పించే అంశంపై సమీక్షించనున్నారు. ముఖ్యంగా మండుతున్న ఎండలకు విద్యార్థులు అవస్థలు పడకుండా జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని చర్యలు చేపడుతుంది. పరీక్షల టైమ్టేబుల్ ఇదీతేదీ ఫస్టియర్/సెకండియర్ 24 సెకండ్ లాంగ్వేజ్ 25 ఇంగ్లిషు 27 గణితం, బోటనీ, సివిక్స్ 28 మేథ్స్, జువాలజీ, హిస్టరీ 29 ఫిజిక్స్, ఎకనామిక్స్ 30 కెమిస్ట్రీ, కామర్స్ సోషియాలజీ, మ్యూజిక్ 31 పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్, బ్రిడ్జికోర్సు, మేథ్స్ఫ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం ఫ ఈ నెల 24 నుంచి 31 వరకూ నిర్వహణ ఫ జిల్లాలో 8,748 మంది విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో.. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నాం. ముఖ్యంగా మౌలిక సదుపాయాలపై దృష్టి సారించాం. మండుతున్న ఎండల నేపథ్యంలో విద్యార్థులు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం. పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. – వనుము సోమశేఖరరావు, ఇంటర్మీడిమెట్ జిల్లా విద్యాశాఖ అధికారి, అమలాపురం -
గోదారమ్మ ఒడిలోకి..
కళ్ల ముందే కొట్టుకుపోయారు: కొమ్మర్తి రాజేష్ నలుగురూ కలసి గోదావరిలో స్నానం చేస్తుండగా నదీ ప్రవాహం ఎక్కువ కావడంతో ముగ్గురు కొట్టుకుపోయా రు. నేను అంతా గాలించినా ప్రయోజనం లేకపోవడంతో ఒడ్డుకు వచ్చి ఈ విషయాన్ని అక్కడున్న వారికి చెప్పాను. అయినా అప్పటికే వారు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారని స్నానానికి దిగి సురక్షితంగా బయట పడిన కొమ్మర్తి రాజేష్ తెలిపాడు. స్నేహితుల మృతితో తీవ్ర కలత చెందుతున్నాడు. ఫ ఉసురు తీసిన ఈత సరదా ఫ నదిలో స్నానానికి దిగి ఇద్దరి మృతి ఫ మరో యువకుడి గల్లంతు రావులపాలెం: ఈత సరదా.. నిండు ప్రాణాలనే మింగేసింది. అప్పటి వరకూ ఆనందంగా గడిపిన వారిని అనంత లోకాలకు తీసుకెళ్లింది.. యువకుల మృతి ఘటన ఆయా కుటుంబాల్లో పుట్టెడు శోకాన్ని మిగిల్చింది.. రావులపాలెం వద్ద గౌతమి పాత బ్రిడ్జి సమీపంలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. సీఐ ఎం.ఆంజనేయులు కథనం ప్రకారం.. రావులపాలెం చిన్న వంతెన సమీపంలో నివాసం ఉంటున్న సబ్బెళ్ల సత్యనారాయణరెడ్డి, ఈశ్వర్రెడ్డిలు అన్నదమ్ములు. వీరికి వరుసకు తమ్ముడయ్యే, పిన్ని కొడుకు సత్తి సంపత్రెడ్డి విజయనగరం నుంచి వేసవి సెలవులకు పెద్దమ్మ ఇంటికి వచ్చాడు. ఈ ముగ్గురితోపాటు స్థానికులైన మరో ఇద్దరు పెంట జయకుమార్, కొమ్మర్తి రాజేష్ మొత్తం ఐదుగురు కలసి సాయంత్రం సమయంలో గోదావరిలో స్నానం చేసేందుకు స్థానిక గౌతమి నది వద్దకు వెళ్లారు. పాత బ్రిడ్జి సమీపంలో నదీ ప్రవాహం వద్దకు చేరుకుని సత్యనారాయణరెడ్డి మినహా మిగిలిన నలుగురూ స్నానానికి దిగారు. సత్యనారాయణరెడ్డికి ఈత రాకపోవడంతో ఒడ్డున సెల్ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. కొంత సమయానికి రాజేష్ కంగారుగా ఒడ్డుకు రావడంతో ఏమైందని అడిగాడు. నదీ ప్రవాహంలో ముగ్గురు కొట్టుకుపోయారని చెప్పడంతో అక్కడ ఉన్న మరో ఇద్దరి సహాయంతో గోదావరిలో గాలించారు. ఎంతకీ ప్రయోజనం లేకపోవడంతో ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు ఫోన్లో తెలిపారు. దీంతో సమాచారం అందుకున్న బంధువులు, పోలీసులు, రెవెన్యూ, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలికి చేరుకుని రెండు బోట్లతో గాలింపు చర్యలు చేపట్టారు. కొంతసేపటికి సబ్బెళ్ల ఈశ్వర్రెడ్డి (20), పెంట జయకుమార్ (19)ల మృతదేహాలు లభ్యమయ్యాయి. అయితే గల్లంతైన సంపత్రెడ్డి కోసం చీకటి పడే వరకూ అధికారులు గాలింపు చర్యలు కొనసాగించారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో నదీ ప్రవాహానికి వలలు అడ్డంగా కట్టి గాలింపు నిలిపివేశారు. తిరిగి ఆదివారం గాలింపు చేపడతామని సీఐ తెలిపారు. అనంతరం మృతదేహాలను పోలీసులు కొత్తపేట ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుండెలు అవిసేలా రోదిస్తూ.. నదీ ప్రవాహంలో కొట్టుకుపోయి సొంత తమ్ముడు ఈశ్వర్రెడ్డి మృతి చెందడం, పిన్ని కొడుకు మరో తమ్ముడైన సంపత్రెడ్డి గల్లంతు కావడంతో సత్యనారాయణరెడ్డి సంఘటనా ప్రదేశంలో రోదించిన తీరు చూపరులను కంటతడి పెట్టింది. సరదాగా ఈత కోసం వచ్చామని, తనకి ఈత రాకపోవడంతో ఒడ్డునే కూర్చున్నానని, కళ్ల ముందే వారు గల్లంతయ్యారంటూ సత్యనారాయణరెడ్డి గుండెలు అవిసేలా రోదించాడు. కుటుంబ నేపథ్యాలివీ.. సూర్యనారాయణరెడ్డి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని చిన్న కొడుకు ఈశ్వర్రెడ్డి ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఈ ప్రమాదంలో ఈశ్వర్రెడ్డి మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని విషాదంలోకి నెట్టేసింది. సెలవుల కోసం విజయనగరం నుంచి వచ్చిన సూర్యనారాయణరెడ్డి భార్య చెల్లెలి కొడుకు సంపత్రెడ్డి పదో తరగతి పరీక్ష రాసి వేసవి సెలవుల కోసం రావులపాలెం వచ్చాడు. సంపత్రెడ్డి గల్లంతు కావడంతో ఈ విషయాన్ని విజయనగరంలో ఉన్న తల్లిదండ్రులకు ఫోన్లో తెలిపారు. సంపత్రెడ్డి తండ్రి దుర్గారెడ్డి అనపర్తి నుంచి ఫైనాన్స్ వ్యాపారం నిమిత్తం విజయనగరం వెళ్లి స్థిరపడ్డాడు. ఉన్న కూతురు, కొడుకులో చిన్నవాడైన సంపత్రెడ్డి మృతి చెందడంతో తీవ్రంగా విలపిస్తున్నారు. ఈ ఘటన ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. మరో మృతుడు జయకుమార్ తండ్రి సుబ్రహ్మణ్యం వడ్రంగి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సుబ్రహ్మణ్యానికి కూతురు, కొడుకు సంతానం. జయకుమార్ స్థానిక డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతూ ఖాళీ సమయంలో ఫొటో స్టూడియోలో పనిచేస్తూ కుటుంబానికి చేదోడుగా ఉంటున్నాడు. చేతికి అందివచ్చాడనుకున్న కొడుకు మృతి చెందడంతో ఆ తండ్రి విలపిస్తున్న తీరు అందరినీ కలచి వేసింది. ఆ ఘటన మరువక ముందే.. ఇటీవల ఆలమూరు మండలం మడికికి చెందిన ముగ్గురు మహిళలు బడుగువానిలంక సమీపంలో గోదావరి దాటుతూ నదీ ప్రవాహానికి ఊబిలో కూరుకుపోయి మృతి చెందారు. ఇది మరువక ముందే రావులపాలెం వద్ద గౌతమి పాత బ్రిడ్జి సమీపంలో ఈ ఘటన జరగడం గమనార్హం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు, పోలీసులు గ్రామాల్లో ప్రచారం నిర్వహించాలని అంతా కోరుతున్నారు. గోదావరిలో గాలిస్తున్న స్థానికులు, అధికారులు నిండు ప్రాణాలు.. -
అన్ని దారులూ అన్నవరానికే..
ఫ కల్యాణ తిలకం దిద్దుకున్న సత్యదేవుడు ఫ లోక కల్యాణానికి నేడే సుమూర్తం ఫ 24 వరకూ ఉత్సవాల నిర్వహణ అన్నవరం: కల్యాణ వీణ మోగింది.. సత్యదేవుని కల్యాణోత్సవాలకు అంకురార్పణ జరిగింది.. సరికొత్త కాంతులతో అన్నవరం సొబగులను అద్దుకుంది.. సత్యదేవుని దివ్య పరిణయోత్సవానికి శుభ సమయం ఆసన్నమవుతున్న వేళ, రత్నగిరి శోభాయమానంగా వెలుగొందుతోంది.. కల్యాణ తిలకం దిద్దుకున్న సత్యదేవుడు, ఆ అమ్మవార్లను చూసిన భక్తజనం మురిసిపోయింది.. కాకినాడ జిల్లాలోని అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో స్వామివారి కల్యాణోత్సవాలు శనివారం అట్టహాసంగా ఆరంభమయ్యా యి. భక్తవరదుడు, కోరిన కోర్కెలు తీర్చే రత్నగిరివాసుడు సత్యదేవుడే వరుడైన వేళ, సిరులొసంగే అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు వధువైన శుభవేళ రత్నగిరి పులకించింది. వారం రోజులపాటు అంగరంగ వైభవంగా జరుగనున్న శ్రీసత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలకు వైశాఖ శుద్ధ దశమి శనివారం సా యంత్రం రత్నగిరిపై పండితులు శ్రీకారం చుట్టారు. సీతారాములే పెళ్లి పెద్దలుగా... రత్నగిరి క్షేత్రపాలకులు శ్రీసీతారాములు పెళ్లి పెద్దలుగా వెంట రాగా, శ్రీసత్యదేవుడు, అమ్మవార్లను సాయంత్రం నాలుగు గంటలకు ఊరేగింపుగా అనివేటి మండపానికి తీసుకు వచ్చారు. అక్కడ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన కల్యాణ మండపంలో ప్రత్యేక ఆసనంపై సత్యదేవుడు, అమ్మవార్లను, పక్కనే మరో ఆసనంపై పెళ్లిపెద్దలు సీతారాములను ప్రతిష్ఠించి పండితులు ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛరణ మధ్య స్వామి, అమ్మవార్లను పండితులు పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెను చేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ కె.రామచంద్రమోహన్ దంపతులు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం శుభం కోరుతూ ముత్తయిదువలు పసుపు దంచారు. ఈ పూజలను దేవస్థానం వేదపండితులు గొల్లపల్లి ఘనాపాఠి, గంగాధరభట్ల గంగబాబు, యనమండ్ర శర్మ, చిట్టిశివ, ముష్టి పురుషోత్తం, ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యశర్మ, అర్చకులు తదితరులు నిర్వహించారు. స్వామి, అమ్మవార్లను వధూవరులను చేసిన అనంతరం రామారాయ కళావేదికపై సత్యదేవుడు, అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవం జరిపారు. రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ ఈ కార్యక్రమం సాగింది. నేడు అపురూప ఘట్టం వైశాఖ శుద్ధ ఏకాదశి ఆదివారం రాత్రి తొమ్మిది గంటల నుంచి సత్యదేవుడు, అమ్మవార్ల దివ్య కల్యాణోత్సవం రత్నగిరిపై ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ప్రజాప్రతినిధులకు ఎటువంటి ప్రత్యేకత లేకుండా భక్తులతో పాటు ఆహ్వానించారు. జిల్లా కలెక్టర్ నివాస్, ఇతర ఉన్నతాధికారులను కూడా ఆహ్వానించారు. స్వామివారి కల్యాణం తిలకించేందుకు సుమారు 20 వేల మంది భక్తులు విచ్చేస్తారని అంచనాతో ఏర్పాట్లు చేశారు. కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించేలా కల్యాణ వేదిక ముందు మండపంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. కల్యాణం అనంతరం భక్తులకు ప్రసాదం, అక్షతల ప్యాకెట్లను కల్యాణ వేదికకు ఎదురుగా ఉన్న సర్క్యులర్ మండపంతో పాటు పశ్చిమ రాజగోపురం వద్ద మరో నాలుగు చోట్ల పంపిణీ చేయనున్నారు. భక్తులకు అన్నదాన భవనంలో భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. భక్తుల వాహనాలను కొండ దిగువ కళాశాల మైదానం వరకే అనుమతిస్తారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సుల ద్వారా కొండపైకి వచ్చేలా చర్యలు తీసుకున్నారు. 300 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు. భక్తులకు మంచినీటి సరఫరాకు వలంటీర్లు, సేవా కార్యకర్తలను నియమించారు. ఏర్పాట్లపై ఈఓ సమీక్ష ఆదివారం జరుగనున్న సత్యదేవుని కల్యాణ మహోత్సవ ఏర్పాట్లపై దేవస్థానం ఈఓ కె.రామచంద్రమోహన్ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం సిబ్బందికి అప్పగించిన బాధ్యతలను నిర్వర్తించాలని ఆదేశించారు. ఉదాశీనంగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం
పది సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి జిల్లాలో ఏర్పాటు చేసిన 16 పరీక్షా కేంద్రాల్లో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యమిస్తున్నాం. ఫర్నీచర్, తాగునీరు, ఫ్యాన్లు తదితర సదుపాయాలు ఉండే విధంగా చర్యలు తీసుకున్నాం. సీఎస్, డీవోలకు అవసరమైన ఆదేశాలిచ్చాం. – ఎం.కమలకుమారి, డీఈవో, అమలాపురం. ఏర్పాట్లు పూర్తి పరీక్ష పేపర్లను పోలీస్టేషన్లలో భద్రపర్చాం. సీఎస్, డీవో, ఇన్విజిలేటర్ల నియామకం పూర్తి చేశాం. రెగ్యులర్ పరీక్షలు మాదిరిగానే సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నాం. – నక్కా సురేష్, ఏసీ, ప్రభుత్వ పరీక్షల విభాగం, అమలాపురం -
పకడ్బందీగా ఓట్ల లెక్కింపు
అధికారులను ఆదేశించిన కలెక్టర్ హిమాన్షుశుక్లా ముమ్మిడివరం: సాధారణ ఎన్నికలకు సంబంధించి వచ్చే నెల 4వ తేదీన నిర్వహించే ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి హిమాన్షుశుక్లా ఆధికారులను ఆదేశించారు. ముమ్మిడివరం శివారు శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాలలో ఓట్ల లెక్కింపు కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. అమలాపురం పార్లమెంట్, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించి, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి రాజకీయ పార్టీలకు చెందిన లెక్కింపు ఏజెంట్లు ఏవిధంగా ప్రవేశించాలి, లెక్కింపు సిబ్బంది ప్రవేశ ఏర్పాట్లపై కూడా సూచనలు చేశారు. అధికారులు ప్రతి అంశంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుందని, ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. నిఘా కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. జిల్లా ఎస్సీ ఎస్. శ్రీధర్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూముల వద్ద మూడంచెల భద్రత వ్యవస్థను అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.నుపూర్అజయ్, జిల్లా రెవెన్యూ అధికారి జి.కేశవరెడ్డి, పోలీసు అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
చక్కని జీవనశైలితో ఆరోగ్యం
● డీఎంఅండ్ హెచ్ఓ దుర్గరావు దొర ● ఎ.వేమవరంలో ప్రపంచ రక్తపోటు దినోత్సవ ర్యాలీ అమలాపురం రూరల్: ప్రజల ఆరోగ్య వంతమైన జీవనశైలి వారి మానసిక ఆరోగ్యానికి మార్గనిర్దేశం చేస్తుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎం.దుర్గారావు దొర తెలిపారు. శుక్రవారం ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని ఎ.వేమవరం గ్రామంలో ప్రపంచ రక్తపోటు దినోత్సవ ర్యాలీ నిర్వహించారు. హెల్త్ క్లినిక్ నుంచి ఉన్నత పాఠశాల వరకు రక్తపోటుపై ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంఅండ్ హెచ్ఓ దుర్గరావుదొర మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా రక్తపోటు దినోత్సవాన్ని పాటిస్తున్నారన్నారు. గుండె జబ్బులు, ఇతర ప్రధాన అనారోగ్యాలకు రక్తపోటు కారణమన్నారు. ప్రజలు తమ రక్తపోటును క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలన్నారు. మద్యపానం, ధూమపానం వ్యసనాలకు లోను కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలన్నారు. రక్తపోటు ఒత్తిడి 180/120 కంటే ఎక్కువగా ఉంటే తీవ్రంగా పరిగణిస్తారని అన్నారు. అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారు జీవన శైలిలో తగు మార్పులు చేసుకుంటూ నిత్యం కొద్దిపాటి వ్యాయామం చేస్తూ సుఖమయ జీవనాన్ని గడపాలని ఆకాంక్షించారు. అదనపు డీఎంఅండ్ హెచ్ఓ హెచ్వీ భరతలక్ష్మి, ఫ్యామిలీ డాక్టర్ ఫిజీషియన్ నోడల్ అధికారి డాక్టర్ ఎం.సుమలత, బండారులంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు స్వర్ణకమల, ఎంపీహెచ్ఓ కాశీన శేషుబాబు, కార్యదర్శి దుర్గాప్రసాద్, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆఫ్లైన్ ద్వారా ధాన్యం కొనుగోళ్లు
జిల్లా పౌర సరఫరాల మేనేజరు ఎల్లారావు సాక్షి అమలాపురం: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో రబీ సీజన్లో 2024 ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అకాల వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం ముంపునకు గురవకుండా త్వరగా కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకున్నామని జిల్లా పౌర సరఫరాల మేనేజరు డీవీఎస్ ఎల్లారావు తెలిపారు. తాత్కాలికంగా ఆఫ్లైన్ ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపట్టామని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం ‘సాక్షి’ దినపత్రికలో ‘వర్షాతిరేకాలు’ శీర్షికన భారీ వర్షాలకు ధాన్యం తడిసిన వైనాన్ని వివరిస్తూ ప్రచురించిన కథనంపై ఆయన స్పందించి ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం గురించి రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్లులకు తరలిస్తామని పేర్కొన్నారు. 4 వరకు పెట్రోల్ బంకుల్లో లూజ్ అమ్మకాలు వద్దు అమలాపురం రూరల్: పెట్రోల్ బంకుల్లో సీసాలు, క్యాన్లు, డబ్బాల్లో లూజ్ పెట్రోల్, డీజిల్ విక్రయించవద్దని పోలీసులు నోటీసులు జారీ చేయడంపై కోనసీమ పెట్రోల్ బంకు డీలర్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లాను కలిసి తమ సమస్యలను వివరించారు. ఆసుపత్రుల్లో జనరేటర్లకు, వరి చేను కోసే యంత్రాలకు, ట్రాక్టర్లకు వినియోగించేందుకు క్యాన్లు, డబ్బాల్లో లూజు పెట్రోల్, డీజిల్ ఎక్కువగా తీసుకెళతారని, ఈ విషయంలో ఆంక్షలు సడలించాలని కలెక్టర్ను కోరారు. ఈ ఆంక్షల వల్ల రైతులకు, ఆసుపత్రులకు, సెల్ఫోన్ టవర్ల నిర్వహణకు ఇబ్బందులు వస్తాయి అని వివరించారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజా భద్రత దృష్ట్యా జాన్ 4వ తేదీ వరకు మాత్రమే ఈ ఆంక్షలు విధించామని, అప్పటి వరకు అమ్మకాలు చేయవద్దని కలెక్టర్ హిమాన్షు శుక్లా వారికి తెలిపారు. పెట్రోల్ బంకు డీలర్ల సంఘ జిల్లా అధ్యక్షుడు డీఎస్ఎస్ రామకృష్ణ, సంఘం నాయకులు జవ్వాది తాతబాబు,తదితరులు కలెక్టర్ను కలిసిన వారిలో ఉన్నారు. రత్నగిరికి పోటెత్తిన భక్తులు అన్నవరం: రత్నగిరిపై సత్యదేవుని ఆలయానికి శుక్రవారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించారని ఆలయ అధికారులు తెలిపారు. స్వామివారి ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించి, పూజలు చేశారు. స్వామివారి వ్రతాలు 2,200 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.45 లక్షల ఆదాయం సమకూరింది. సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో సుమారు 4 వేల మందికి భోజనం పెట్టారు. ధనలక్ష్మిగా వాసవీ మాత ధవళేశ్వరం: గ్రామంలో కొలువైన వాసవీ కన్యకాపరమేశ్వరి అమ్మవారిని శుక్రవారం ధనలక్ష్మిగా అలంకరించారు. సుమారు రూ.6 లక్షల కొత్త నోట్లతో అమ్మవారికి, ఆలయానికి అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి సందర్భంగా శనివారం ఉదయం కన్యలతో పూజలు, సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించనున్నారు. -
మళ్లీ పదినిసలు
● టెన్త్ సప్లిమెంటరీకి సన్నద్ధం ● 24 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు ● ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ ● హాజరు కానున్న 3,007 మంది విద్యార్థులు రాయవరం: పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని వారికి నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు పది ఈ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఫలితాల వెల్లడి రోజునే షెడ్యూల్ విడుదల చేసింది. గతంలో మాదిరిగా కాకుండా సప్లిమెంటరీ విద్యార్థులను కూడా రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణించనున్నారు. కోనసీమ జిల్లాలో 16 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు చర్యలను చేపట్టారు. 3,007 మంది విద్యార్థులు కోనసీమ జిల్లాలో 18,787 మంది విద్యార్థులు ఈ ఏడాది మార్చి 18 నుంచి జరిగిన పది పరీక్షలకు హాజరు కాగా, 17,262 మంది ఉత్తీర్ణత సాధించారు. 1,525 మంది విద్యార్థులు వివిధ సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారు. ఈ ఏడాది ఉత్తీర్ణత సాధించని విద్యార్థులతో పాటుగా, గతంలో ఫెయిలైన విద్యార్థులు కలసి మొత్తం 3,007 మంది వివిధ సబ్జెక్టుల పరీక్షలను రాయనున్నారు. సైన్స్ పరీక్షకు అత్యధికంగా 2,120 మంది హాజరవుతుండగా, అత్యల్పంగా హిందీ పరీక్షకు 471 మంది హాజరుకానున్నారు. అన్ని సబ్జెక్టులకు కలిపి 3,007 మంది పరీక్షలు రాయనున్నారు. జిల్లాలో అమలాపురం, రామచంద్రపురం డివిజన్ల నుంచి 3,007 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరందరికీ 16 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే విద్యార్థులకు హాల్ టికెట్లను పరీక్షల విభాగం ఆయా పాఠశాలలకు పంపించగా, హాల్ టికెట్లను హెచ్ఎంలు డౌన్లోడ్ చేసి, విద్యార్థులకు ఇచ్చే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే గతేడాది మాదిరిగానే ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయులు ప్రతి రోజు ఉత్తీర్ణత సాధించేలా మెళకువలను నేర్పిస్తున్నారు. అవసరమైన ఏర్పాట్లు పరీక్షా కేంద్రాల నిర్వహణకు అవసరమైన చీఫ్ సూపరింటెండెంట్లు, డీవోలు, ఇన్విజిలేటర్ల నియామకం దాదాపుగా పూర్తయింది. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విద్యుత్, తాగునీరు, ఫర్నీచర్ తదితర అవసరాల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇదీ షెడ్యూల్ తేదీ పరీక్ష రాసే విద్యార్థులు మే 24 ఫస్ట్ లాంగ్వేజ్ 973 మే 25 సెకండ్ లాంగ్వేజ్ 471 మే 27 ఇంగ్లిష్ 558 మే 28 గణితం 1,619 మే 29 ఫిజిక్స్ 2,120 మే 30 బయాలజీ 2,120 మే 31 సోషల్ స్టడీస్ 927 జూన్1 ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్–2, ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ 26 పేపర్–1 జూన్ 3 ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ 26 పేపర్–2 -
రత్నగిరి.. కల్యాణసిరి..
ఇదీ కల్యాణోత్సవాల క్రమం ● 18.05.2024: సాయంత్రం 4 గంటలకు వధూవరులుగా అమ్మవారు, సత్యదేవుని అలంకరణ. రాత్రి 9 గంటలకు కొండ దిగువన వెండి ఆంజనేయ వాహనంపై పెళ్లిపెద్దలు సీతారాముల ఊరేగింపు. ● 19.05.2024: ఉదయం 9 గంటలకు అంకురార్పణ, ధ్వజారోహణం, కంకణధారణ, రుత్విక్కుల దీక్షావస్త్రధారణ. రాత్రి 7 గంటలకు కొండ దిగువన వెండి గరుడ వాహనంపై స్వామివారు, వెండి గజ వాహనంపై అమ్మవారు, వెండి పల్లకీపై సీతారాముల ఊరేగింపు. రాత్రి 9 గంటల నుంచి రత్నగిరి కల్యాణ వేదిక మీద సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవం. ● 20.05.2024: రాత్రి 7 గంటలకు అరుంధతీ నక్షత్ర దర్శనం. రాత్రి 9 గంటలకు కొండ దిగువన రావణబ్రహ్మ వాహనంపై స్వామి, అమ్మవార్ల ఊరేగింపు. ● 21.05.2024: మధ్యాహ్నం 2.30 గంటలకు అనివేటి మండపంలో పండిత సదస్యం. రాత్రి 9 గంటలకు: పొన్న వాహనంపై సత్యదేవుడు, అమ్మవారి ఊరేగింపు. ● 22.05.2024: సాయంత్రం 4 గంటలకు దేవస్థానం ఉద్యాన వనంలో సత్యదేవుడు, అమ్మవార్ల వనవిహారోత్సవం. సాయంత్రం 5 గంటలకు: నూతన టేకు రథంపై సత్యదేవుడు, అమ్మవార్ల గ్రామోత్సవం. ● 23.05.2024: ఉదయం 9 గంటలకు పంపా సరోవరంలో స్వామి, అమ్మవార్ల శ్రీచక్రస్నానం. సాయంత్రం 4 గంటలకు: నీలలోహిత గౌరీపూజ, నాకబలి, దండియాడింపు, ధ్వజావరోహణం, కంకణ విమోచన. ● 24.05.2024: రాత్రి 7.30 గంటలకు రత్నగిరిపై స్వామివారి నిత్యకల్యాణ మండపంలో స్వామివారి శ్రీపుష్పయాగం. అన్నవరంలో నేడు ● తెల్లవారుజామున 3.00: సుప్రభాత సేవ. ● ఉదయం 8.00: చతుర్వేద పారాయణ. ● సాయంత్రం 4.00: అనివేటి మండపంలో సత్యదేవుడిని, అమ్మవారిని పెండ్లి కుమారుని, పెండ్లికుమార్తెను చేయడం. ● రాత్రి 7.00: రత్నగిరిపై శ్రీరాజా వేంకట రామారా య కళామందిరంలో ఎదుర్కోలు ఉత్సవం. ● రాత్రి 9.00: కొండ దిగువన పెళ్లిపెద్దలు సీతారాములను వెండి ఆంజనేయ వాహనంపై ఊరేగింపు. ● ఉదయం 7.00 – 10.00, సాయంత్రం 5.00 – రాత్రి 11.00: రత్నగిరి కళావేదిక, కొండ దిగువన సాంస్కృతిక కార్యక్రమాలు.● నేటి నుంచి సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలు ● ముస్తాబైన అన్నవరం క్షేత్రం ● నేడు వధూవరులుగా అమ్మవారు, స్వామివారి అలంకరణ ● అనంతరం ఎదుర్కోలు ఉత్సవం ● కొండ దిగువన వెండి ఆంజనేయ వాహనంపై సీతారాముల ఊరేగింపు ● రేపు రాత్రి కల్యాణోత్సవంఅన్నవరం: ఇంట్లో వివాహమైనా, గృహప్రవేశమైనా, మరే ఇతర శుభకార్యమైనా సత్యదేవుని వ్రతమాచరించని తెలుగువారుండరంటే అతిశయోక్తి కాదు. తన వ్రతమాచరిస్తేనే కోరిన కోర్కెలు తీర్చే భక్తసులభుడు శ్రీ అనంతలక్ష్మీ సత్యవతీదేవీ సమేత శ్రీ సత్యదేవుడు. వివాహమైన వెంటనే నవదంపతులు పెళ్లి బట్టలతోనే రత్నగిరికి చేరుకుని, సత్యదేవుని వ్రతమాచరించడం ఆనవాయితీ. ఏటా 10 వేల మందికి పైగా కొత్త జంటలు ఈవిధంగా స్వామివారి వ్రతాలాచరిస్తున్నారంటే సత్యదేవునిపై వారి విశ్వాసం ఎటువంటిదో అర్థం చేసుకోవచ్చు. అటువంటి మహత్తు కలిగిన స్వామిని దర్శించినా భాగ్యమే. ఏడాదికొకసారి జరిగే ఆ సత్యదేవుని దివ్యకల్యాణం కన్నులారా వీక్షిస్తే మరెంత భాగ్యమో చెప్పనలవి కాదు. భక్తుల పాలిట కొంగుబంగారంగా కీర్తినందుకున్న అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామివారి వార్షిక దివ్యకల్యాణ మహోత్సవాలు ప్రారంభమవుతున్న శుభ వేళ.. అన్నవరం క్షేత్రం, స్వామివారిని తన శిరసున మోస్తున్న రత్నగిరి సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. భక్తులు కోరిన వెంటనే రత్నాల్లాంటి బిడ్డలను, సిరిసంపదలను, ఆయురారోగ్యాలను ప్రసాదించే సత్యమైన దైవంగా పేరొందిన సత్యదేవుడే వరునిగా.. దేవేరి శ్రీ అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవారు వధువుగా దర్శనమిచ్చే శుభతరుణం సమీపించిన వేళ.. రత్నగిరి కల్యాణ కాంతులతో ప్రకాశిస్తోంది. శ్రీకారం చుట్టుకుంటోందిలా.. కల్యాణోత్సవాలకు వైశాఖ శుద్ధ దశమి శనివారం శ్రీకారం చుట్టనున్నారు. సాయంత్రం 4 గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లను పెళ్లి కుమారుడు, పెళ్లి కుమా ర్తెలుగా అలంకరించే కార్యక్రమం కన్నుల పండువగా జరగనుంది. రత్నగిరిపై అనివేటి మండపంలో పండితుల వేదమంత్రోచ్చారణల నడుమ జరిగే ఈ కార్యక్రమంలో ముత్తయిదువులు శుభం కోరుతూ పసుపు దంచుతారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తారు. రాత్రి ఏడు గంటలకు రాజా రామారాయ కళావేదికపై స్వామి, అమ్మవార్లకు ఎదుర్కోలు ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పండితులు వధూవరుల తరఫున రెండుగా విడివడి, వధువు గొప్పతనాన్ని కొందరు, వరుడి వంశ ఖ్యాతిని మరికొందరు వివరిస్తూ వినోదాన్ని పంచుతారు. సీతారాములే పెళ్లిపెద్దలు సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాలకు రత్నగిరి క్షేత్ర పాలకులు శ్రీ సీతారాములే పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తారు. వెండి ఆంజనేయ వాహనం మీద సీతారాములను శనివారం రాత్రి కొండ దిగువన ఊరేగిస్తారు. ఈ సందర్భంగా సత్యదేవుని కల్యాణానికి రావాలని భక్తులకు, అన్నవరం గ్రామస్తులకు పెళ్లిపెద్దలు ఆహ్వానం పలుకుతారు. కల్యాణ వేదిక ముస్తాబు సత్యదేవుని దివ్య కల్యాణోత్సవాన్ని ఆదివారం రాత్రి 9 గంటల నుంచి రత్నగిరిపై రామాలయం పక్కన ఉన్న వార్షిక కల్యాణ వేదిక మీద వైభవంగా నిర్వహించనున్నారు. కల్యాణ వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. దీంతో పాటు కల్యాణ వేదిక ముందున్న విశ్రాంతి మండపం, ఆలయ ప్రాంగణం, అనివేటి మండపాన్ని సైతం సుగంధభరిత పుష్పమాలికలతో అలంకరిస్తున్నారు. వేదిక ముందున్న వారు మాత్రమే కాకుండా దూరంగా ఉన్నవారు కూడా కల్యాణోత్సవాన్ని తిలకించే అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు. వెనుకన ఉన్నవారు కూడా స్వామివారి కల్యాణం తిలకించేలా స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవ వాహనాలకు మెరుగులు కల్యాణ మహోత్సవాల సందర్భంగా సత్యదేవుడిని, అమ్మవారిని ఊరేగించే ఉత్సవ వాహనాలు, వెండి గజ, గరుడ, ఆంజనేయ వాహనాలకు మెరుగులు పెట్టించడంతో తళతళా మెరుస్తున్నాయి. వీటికి కాకినాడకు చెందిన జ్యూయలరీ వర్క్స్ అధినేత, గోల్డ్ అప్రైజర్ పీవీఎల్ మూర్తి ఉచితంగా మెరుగు పెట్టించారు. ఏటా ఉత్సవ వాహనాలతో పాటు, వెండి సింహాసనాలు, వెండి మకరతోరణం వంటి వాటికి తాను మెరుగు పెట్టిస్తానని ఆయన తెలిపారు. అలాగే, కొండ దిగువన రావణబ్రహ్మ, పొన్నచెట్టు చెక్క వాహనాలకు కూడా దేవస్థానం అధికారులు రంగులు వేయించి, ముస్తాబు చేయించారు.సత్యదేవుడు, అమ్మవారు -
నేటి నుంచి సబ్జెక్టు ఉపాధ్యాయులకు శిక్షణ
రాయవరం: సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) అమలు చేస్తున్న ప్రభుత్వ పాఠశాలల సబ్జెక్టు ఉపాధ్యాయులకు రెండు రోజుల శిక్షణ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యంలోని 12 పాఠశాలల్లో సీబీఎస్ఈని గత విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు. జెడ్పీ ఉన్నత పాఠశాల అల్లవరం, జెడ్పీహెచ్ఎస్, పేరూరు, జెడ్పీహెచ్ఎస్, కేశనపల్లి, జెడ్పీహెచ్ఎస్, తాపేశ్వరం, జెడ్పీహెచ్ఎస్, గొల్లవిల్లి, అల్లవరం మండలం గోడిలో ఉన్న ఏపీ సోషల్ వెల్ఫేర్ బాలురు, బాలికల పాఠశాల, ముమ్మిడివరంలోని ఏపీ సోషల్ వెల్ఫేర్ పాఠశాల, పి.గన్నవరం మండలం నరేంద్రపురంలోని ఏపీఎస్డబ్ల్యూఆర్ బాలుర పాఠశాల, రామచంద్రపురం మండలం వెలంపాలెంలో ఉన్న ఏపీఎస్డబ్ల్యూఆర్ బాలుర పాఠశాల, అమలాపురం మండలం సమనసలో ఉన్న ఎంజేపీఏపీ బీసీ బాలుర పాఠశాల, రాజోలు దొరగారితోటలోఉన్న ఏపీఎస్డబ్ల్యూఆర్ఎస్ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ను అమలు చేస్తున్నారు. ఈ పాఠశాలల్లో విధులు నిర్వర్తిస్తున్న సబ్జెక్టు ఉపాధ్యాయులకు రెండు రోజుల శిక్షణ నాన్ రెసిడెన్షియల్ మోడ్లో ఇస్తున్నారు. ఇంగ్లిషు, సోషల్, బయలాజికల్ సైన్స్ ఉపాధ్యాయులకు ఈ నెల 17, 18, గణితం, పీఎస్, కెమిస్ట్రీ సబ్జెక్టు ఉపాధ్యాయులకు ఈ నెల 20, 21 తేదీల్లో కాకినాడ శాలిపేటలో ఉన్న మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే శిక్షణకు ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు హాజరు కావాల్సి ఉందని, ఏ ఒక్కరికీ మినహాయింపులు లేవని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.కమలకుమారి తెలిపారు. -
వర్షాతిరేకాలు
సాక్షి అమలాపురం: నైరుతి రుతుపవనాల రాక చురుగ్గా ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన సమయంలోనే జిల్లాలో గురువారం తెల్లవారుజాము నుంచి ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల సామాన్యులు ఊరట చెందారు. ఉద్యాన, వాణిజ్య పంట రైతులు హర్షం వ్యక్తం చేశారు. కానీ వరి రైతులకు మాత్రం అకాల వర్షం కొంత ఇబ్బందిగా మారింది. కోతలు దాదాపు పూర్తవుతున్నా.. కొంత పంట పనల మీద ఉండడం, వాన వల్ల ధాన్యం రాశుల చుట్టూ ముంపు నీరు చేరడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం ఏకధాటిగా పడింది. భారీ వర్షానికి పల్లపు ప్రాంతాల్లో నీరు చేరింది. అమలాపురం పట్టణంతోపాటు పలు గ్రామాల్లో రోడ్లపై నీరు చేరింది. పది గంటల తరువాత తెరపి ఇవ్వడంతో ముంపునీరు వీడింది. జిల్లాలో బుధవారం ఉదయం ఎనిమిది గంటల వరకు సగటున 12.8 మిల్లీమీటర్ల వర్షం కురవగా, అత్యధికంగా ఉప్పలగుప్తం మండలంలో 45.2 మిల్లీమీటర్లు వర్షం కురిసింది. అత్యల్పంగా రాయవరం మండలంలో 1.4 మి.మీటర్ల వర్షం కురిసింది. అల్లవరం 30.6, మామిడికుదురు 28,8, కాట్రేనికోన 24.2, అమలాపురం 22.8, అయినవిల్లి 20.6, మలికిపురం 14.2, కె.గంగవరం 13.2, అంబాజీపేట 12.8, ఐ.పోలవరం 12.6, ముమ్మిడివరం 10.4, రామచంద్రపురం 9, రాజోలు 7.4, పి.గన్నవరం 5.8, ఆత్రేయపురంలో 5.4, ఆలమూరు 4.2, కపిలేశ్వరపురం, సఖినేటిపల్లి, రావులపాలెం 3.2, కొత్తపేట 2, మండపేటలో 1.6 మిల్లీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. ఎండల నుంచి ఉపశమనం ఈ ఏడాది సాధారణ వర్షపాతంతోపాటు పలు జిల్లాలో అధికంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో మండుతున్న ఎండల నుంచి ఉపశమనం కలిగిస్తూ జిల్లాలో తెల్లవారు జాము నుంచి ఉదయం పది గంటల వరకు ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వర్షం వల్ల ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల నుంచి 37 డిగ్రీల వరకు ఉంటుండగా, అది 31 డిగ్రీలకు తగ్గింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 29 నుంచి 30 వరకు నమోదవుతుండగా అవి 26 డిగ్రీలకు తగ్గింది. వాతావరణం చల్లబడడంతో సామాన్యులు సేద తీరారు. మధ్యాహ్న సమయంలో రోడ్ల మీద జన సంచారం అధికంగా కనిపించింది. మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ చెప్పడంతో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుతాయని జనం భావిస్తున్నారు. ఉద్యాన పంటలకు మేలు వర్షం ఉద్యాన పంటలకు, కూరగాయ పంటలకు మేలు చేసింది. కొబ్బరి, ఆయిల్పామ్, కోకో, పోక, అరటి, కంద, పసుపు వంటి పంటలతోపాటు గోదావరి లంకలు, మధ్యడెల్టాలో పలుచోట్ల కూరగాయ పంటలు పెద్ద ఎత్తున సాగు అవుతున్న విషయం తెలిసిందే. భారీ వర్షం కురిసిన ప్రాంతాల్లో దోమ, ఇతర రసం పీల్చే పురుగులు ఉధృతి తగ్గుతుందని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. పి.గన్నవరం, అయినవిల్లి, ముమ్మిడివరం, ఐ.పోలవరం, మామిడికుదురు మండలాల్లోని లంక గ్రామాల్లో కూరగాయ పంటలు పెద్ద ఎత్తున సాగవుతున్నాయి. ఈ పంటలకు సైతం వర్షం వల్ల మేలు జరుగుతుంది. జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం ఉష్ణోగ్రతలు తగ్గి సేద తీరిన సామాన్య జనం ఉద్యాన పంటల రైతులకు ఊరట అన్నదాతలకు కొంత ఇబ్బంది పనల మీద 203 ఎకరాల పంట ధాన్యం రాశుల చుట్టూ చేరిన వాన నీరు సగటున 12.8 మిల్లీమీటర్ల వర్షం -
మృతుల కుటుంబాలకు జెడ్పీ చైర్మన్ విప్పర్తి పరామర్శ
పి.గన్నవరం: మండలంలోని ఊడిమూడి గ్రామం వద్ద ఇటీవల ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నలుగురు జట్టు కార్మికుల కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆదుకుని, వారికి అండగా నిలుస్తామని వైఎస్సార్ సీపీ పి.గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. ప్రమాదంలో జి.పెదపూడికి చెందిన నూకపెయ్యి శివ, వాసంశెట్టి సూర్యనారాయణ, ఈరి కట్లయ్య, ఆదిమూలంవారిపాలేనికి చెందిన చిలకలపూడి మణిబాబు మృతి చెందిన విషయం విదితమే. మృతుల కుటుంబాలను జెడ్పీ చైర్మన్, పి.గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి వేణుగోపాలరావు, పార్టీ జిల్లా వాణిజ్య విభాగం నాయకుడు మంతెన రవిరాజు గురువారం పరామర్శించారు. అమలాపురం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిలకలపూడి సురేష్కు మెరుగైన వైద్యం అందించాలని విప్పర్తి కిమ్స్ యాజమాన్యానికి వారు విజ్ఞప్తి చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సురేష్ను పరామర్శించారు. పార్టీ నాయకులు అడ్డగళ్ల వెంకట సాయిరామ్, సాధనాల రమేష్, కొక్కిరి రవికుమార్, అడ్డగళ్ల శ్రీను పాల్గొన్నారు. -
భూముల శిస్తు పెంచొద్దని ప్రదర్శన
సఖినేటిపల్లి: అంతర్వేది దేవస్థానానికి అనుబంధంగా ఉన్న అంతర్వేది శివాలయం భూముల శిస్తులు పెంచొద్దంటూ గురువారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. అంతర్వేదిపాలెం పంచాయతీ వద్ద ఈ మేరకు రైతు సంఘ జెండాలతో పైసంఘాల జిల్లా ప్రతినిధులు ప్రదర్శన జరిపారు. భూముల్లో పంటలు పండించలేక, పండిన పంటకు తగిన గిట్టుబాటు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని నాయకులు అన్నారు. ఈ మేరకు రైతు సంఘం ఓ వినతి పత్రాన్ని అంతర్వేది దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణకు అందజేసింది. ఇప్పటికే పలువురు రైతులు శిస్తులు చెల్లించారని, మిగిలిన రైతులు బకాయిలు చెల్లించడానికి 10 రోజులు వ్యవధి ఇవ్వాలని ప్రతినిధులు అధికారులకు విజ్ఞప్తి చేశారు. దేవస్థానం భూములను పరిశీలించి, శిస్తులు తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ రైతు సంఘ గౌరవ అధ్యక్షుడు చెల్లుబోయిన కేశవశెట్టి, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి దేవ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద మూడంచెల భద్రత
అమలాపురం రూరల్: స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రతతో పటిష్ట చర్యలు చేపట్టినట్టు ఏలూరు రేంజ్ ఐజీ జీవీసీ అశోక్ కుమార్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఏలూరు రేంజ్ ఐజీ ఈశోక్కుమార్, జిల్లా ఎస్పీ ఎస్. శ్రీధర్తో ఈవీఎంల భద్రతపై సమీక్ష చేశారు. ఆయన మాట్లాడుతూ స్ట్రాంగ్ రూమ్ల మొదటి స్థాయిలో కేంద్ర సాయుధ బలగాలు, రెండవ స్థాయిలో ఆర్మ్డ్ రిజర్వుడు బలగాలు, మూడవ స్థాయిలో సీ విజిల్ పోలీసు బలగాలను మోహరింపచేశామని, స్ట్రాంగ్ రూమ్ల వద్ద 144వ సెక్షన్ అమలులో ఉందని చెప్పారు. ప్రతి స్ట్రాంగ్రూమ్, పరిసరాలలో సీసీ టీవీ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, స్ట్రాంగ్ రూమ్లకు ఉన్నత స్ధాయి అధికారులను ఇన్చార్జిలుగా నియమించామని తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు వరకూ జరుగుతున్న శాంతి భద్రతల పర్యవేక్షణ స్ట్రాంగ్రూమ్ల వద్ద భద్రతా విధుల దిశానిర్దేశం చేశారు. అనంతరం చెయ్యేరులో శ్రీనివాస ఇంజినీరింగ్ కాలేజీలో ఉన్న స్ట్రాంగ్రూమ్ల వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రతను ఆయన పరిశీలించారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని, అసాంఘిక శక్తులు, రౌడీ షీటర్లపై ప్రత్యేక పోలీసు నిఘా కొనసాగుతుందని తెలిపారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాజకీయ పార్టీల అభ్యర్థులు, పుకార్లు, అపోహలను నమ్మవద్దని, అపోహలు, తప్పుడు సమాచారాలు నమ్మి జిల్లాలో ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం కాట్రేనికోన మండలంలో సమస్యాత్మక పల్లం గ్రామాన్ని సందర్శించి అక్కడ ఉన్న పరిస్థితులు పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. ఆయన వెంట డీఎస్పీ మహేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ విజయ సారథి ఎస్పీ ఇన్స్పెక్టర్లు రాజశేఖర్రావు, శ్రీనివాస్, సోషల్ మీడియా ఇన్స్పెక్టర్ ఎ.వెంకటేశ్వరరావు ముమ్మిడివరం, కాట్రేనికోన ఎస్సైలు ఉన్నారు. -
ధాన్యం రాశుల చుట్టూ చేరిన వర్షం నీరు
ఈ అకాలవర్షం రబీ రైతులకు ఇబ్బందికరంగా మారింది. జిల్లాలో వరి కోతలు దాదాపుగా పూర్తయ్యాయి. మొత్తం 1.69 లక్షల ఎకరాల్లో వరిసాగు జరగగా, ఇప్పటి వరకు 1.63 లక్షల ఎకరాల్లో వరి కోతలు పూర్తయ్యాయి. 96 శాతం వరి కోతలు పూర్తి అయినందున భారీ వర్షం వల్ల రైతులకు పెద్దగా నష్టం లేదు. కానీ 230 ఎకరాల్లో వరి పనలు ఉండగా, ధాన్యం రాశులు చుట్టూ వర్షం నీరు చేరింది. నీరు తొలగించేందుకు రైతులు హైరానా పడ్డారు. తూర్పు డెల్టాలో ఆలమూరు, రామచంద్రపురం వ్యవసాయ సబ్ డివిజన్లలో దాదాపుగా వరి కోతలు పూర్తి కాగా, మధ్యడెల్టాలో కొత్తపేటలో సైతం కోతలు పూర్తయ్యాయి. పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు వ్యవసాయ సబ్ డివిజన్లలో కోతలు సాగుతున్నాయి. 80 శాతం మెషీన్ కోతలే కావడం విశేషం. ఈ ఏడాది మెషీన్ కోతల వల్ల అనుకున్న సమయం కన్నా ముందుగానే వరి కోతలు పూర్తయ్యాయి. దీనివల్ల పెద్దగా నష్టం లేదు. ఈ వర్షానికి నష్ట ప్రభావం పెద్దగా ఉండదని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. -
ముందు జాగ్రత్తలే ముఖ్యం
ప్రస్తుత కాలంలో ఆధునిక జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా అధిక రక్తపోటు బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాధిపై అవగాహన కలిగి ఉండి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో ఐదు గ్రాములకు మించి ఉప్పు తీసుకోకూడదు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. – డాక్టర్ ఎం.సుమలత, డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్, ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్, అమలాపురం -
No Headline
రాయవరం: సమాజంలో ప్రజలు ఉరుకులు పరుగుల జీవనాన్ని సాగిస్తున్నారు. ఆధునిక జీవన శైలి వల్ల పలు రకాల అనారోగ్యాలకు గురవుతున్నారు. వీటిలో ముఖ్యంగా హైపర్ టెన్షన్ అత్యంత ప్రమాదకరమైనది. అధిక రక్తపోటు(బీపీ) వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అధిక రక్తపోటు గుండె, మెదడు, నరాలు, కిడ్నీపై చెడు ప్రభావాన్ని చూపిస్తూ అనారోగ్యం బారిన పడేస్తోంది. ఒక్కోసారి పక్షవాతం, గుండెపోటు, ఇతర తీవ్ర అనారోగ్యాలతో ప్రాణాలకు హాని చేస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. చాలా మందికి బీపీ ఉందన్న విషయాన్ని గమనించే లోపు ఆ వ్యాధి వలన కలిగే అనర్థాలతో శరీరంలోని పలు అవయవాలు దెబ్బతింటున్నాయి. శుక్రవారం ప్రపంచ హైపర్ టెన్షన్ డే సందర్భంగా ప్రత్యేక కథనం... సైలెంట్ కిల్లర్ శరీరంలో రక్తాన్ని అన్ని రక్తనాళాలకు గుండె ఒత్తిడి(ప్రెజర్) చేసి పంపిస్తుంది. అధిక వేగంతో రక్తాన్ని ప్రసరింప చేసే శక్తినే బ్లడ్ ప్రెజర్గా పేర్కొంటారు. ఒక వ్యక్తి గుండె సాధారణ స్థితిలో బ్లడ్ ప్రెషర్(బీపీ) 120/80గా పేర్కొంటారు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పెద్ద వయసులో కొన్ని పరిస్థితుల్లో 140/90గా ఉన్నా సాధారణ స్థితిగానే పరిగణించాలని సూచించింది. అధిక రక్తపోటును సైలెంట్ కిల్లర్గా పిలుస్తారని వైద్యులు తెలిపారు. చాలామందికి రక్తపోటు లక్షణాలు ఉన్నట్టు కూడా తెలియక పోవడం వల్ల ఉన్నట్టుండి గుండెపోటు వచ్చి కుప్పకూలి పోతారు. తలనొప్పి, అలసట అనిపిస్తే ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్యులను సంప్రదించి బీపీ చెక్ చేయించుకోవాలి. నేటి ఆధునిక పరిస్థితుల్లో వచ్చిన మార్పులతో హైపర్ టెన్షన్ ప్రధాన అరోగ్య సమస్యగా మారింది. హైపర్ టెన్షన్లో అసాధారణ రీతిలో 160/100, 170/110, 200/120 చూపుతుంది. ఇలా బ్లడ్ ప్రెషర్ పెరిగితే ఆరోగ్య సమస్య ఏర్పడుతుంది. ఒక్కోసారి మెదడు, గుండెలోనూ నరాలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు. పక్షవాతం, కిడ్నీ సమస్యలు, నరాల సమస్యలు ఏర్పడే ప్రమాదముంటుంది. కరోనా అనంతరం మనిషి జీవన స్థితిగతులు మరింత జటిలం అయ్యాయని వైద్యులు చెబుతున్నారు. కరోనా అనంతరం యువతలో సైతం హైపర్ టెన్షన్ ప్రభావం అధికంగా ఉందనే అభిప్రాయం ఉంది. ఇటీవల 20–30 ఏళ్ల లోపు యువత గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ సమస్యలతో మృత్యువాత పడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కారణాలు సాధారణంగా అధిక రక్తపోటు వయసు మళ్లిన వారికి వస్తుంది. జన్యుపరమైన కారణాలతో కూడా వస్తుంది. ధూమపానం, ఊబకాయం, ఏ పనిచేయకుండా ఒకే చోట గంటల తరబడి ఉండడం, హైపోథెరాయిడ్, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లతో కంటికి సరిపడా నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, దీర్ఘకాలిక మూత్రపిండాల జబ్బు ద్వారా బీపీ వస్తుంది. 1,63,889 మంది హైపర్ టెన్షన్ బాధితులు జనరల్ ఫిజీషియన్, కార్డియాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్ల వద్దకు చికిత్స కోసం వెళ్లేవారిలో అధిక శాతం మంది అధిక రక్తపోటు బాధితులే ఉంటారు. వీరి వద్దకు చికిత్సకు వెళ్తున్న వారిలో 20 నుంచి 30 శాతం మంది అధిక రక్తపోటు బాధితులు ఉంటున్నారన్నది ఒక అంచనా. ప్రభుత్వం ఎన్సీడీ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా ఇంటింటికీ వైద్య సిబ్బంది ద్వారా పరీక్షలు చేయించి బీపీ బాధితులను గుర్తించి చికిత్స అందిస్తోంది. జిల్లాలో 14,85,148 మందిని స్క్రీనింగ్ చేయగా, వారిలో 1,63,889 మంది హైపర్ టెన్షన్ బాధితులు ఉన్నట్టు ఎన్సీడీ సర్వే ద్వారా గుర్తించారు. 1,07,053 మంది డయాబెటీస్ పేషెంట్స్, 70,491 మంది హైపర్ టెన్షన్, సుగర్ వ్యాధిని కలిగి ఉన్న వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు సర్వే ద్వారా తేలింది. ఉచితంగా ప్రభుత్వ సేవలు గత ప్రభుత్వాల్లో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల బలోపేతంపై దృష్టి సారించి గ్రామీణ ప్రాంతాల్లోనే బీపీ, సుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నారు. జనరల్ ఫిజీషియన్లను ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించి ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా వైద్య పరీక్షలు చేయించడంతో పాటు, మందులు కూడా అందజేస్తోంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే మేలు హైపర్ టెన్షన్తో బాధపడే రోగులు ముఖ్యంగా ఆహార పదార్థాల్లో ఉప్పును తక్కువగా వినియోగించాలి. మసాలాలు, నిల్వ పచ్చళ్లు, కారం తగ్గించాలి. ప్రతి రోజూ గంటపాటు సాధారణ వ్యాయామం, యోగా వంటివి చేయడం మంచిది. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. మత్తు పదార్థాలు, ఆల్కహాల్, సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉండాలి. హైపర్ టెన్షన్ లక్షణాలు మెడ నరాల లాగేస్తున్నట్టు ఉండడం. కళ్లు తిరగడం, ఆకస్మికంగా తూలిపోవడం, తరచుగా తలపోటు రావడం. ఒళ్లంతా చెమటలు పట్టడం. యూరిన్ తక్కువగా రావడం. కాళ్లు తిమ్మిర్లుగా ఉండడం. అధిక రక్తపోటుతో అనర్థాలు జాగ్రత్తలు తీసుకుంటే నియంత్రణ సాధ్యమే జిల్లాలో 1.63 లక్షల మంది హైపర్ టెన్షన్ బాధితులు నేడు వరల్డ్ హైపర్ టెన్షన్ డే -
ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులో శ్రీ షిర్డీసాయి విద్యార్థులకు జాతీయ ర్యాంకులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ యూనివర్సిటీల్లో బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ కోర్సులో ప్రవేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన పరీక్షలో తమ విద్యార్థులు సత్తా చాటారని రాజమహేంద్రవరం శ్రీ షిర్డీ సాయి జూనియర్ కళాశాల డైరెక్టర్ టి.శ్రీవిద్య గురువారం తెలిపారు. తమ డాఫ్నీ సివిల్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న మిజోరం రాష్ట్రానికి చెందిన ఐన్ల ఏవో ఆల్ ఇండియా 2వ ర్యాంకు సాధించిందన్నారు. జి.ప్రసన్నసాయి ఆల్ ఇండియా 328వ ర్యాంకు, ఎన్.భావన 504వ ర్యాంకు సాధించి ఫ్యాషన్ టెక్నాలజీలో ఉన్నత విద్య అభ్యసించడానికి అర్హత సాధించారన్నారు. దేశవ్యాప్తంగా 18 విశ్వవిద్యాలయాలలో కేవలం 4,051 సీట్లు మాత్రమే ఉంటాయని, అందులో ముగ్గురు తమ విద్యార్థులే కావడం ఆనందదాయకమన్నారు. శ్రీ షిర్డీసాయి విద్యాసంస్థల చైర్మన్ తంబాబత్తుల శ్రీధర్ మాట్లాడుతూ ఐఐటీ, నీట్ వంటి రెగ్యులర్ కోర్సులతో పాటు సివిల్స్, క్లాట్, ఐపీమ్యాట్, క్యూట్ వంటి కోర్సులను తమ విద్యార్థులు ఎంపిక చేసుకోవడం హర్షణీయమన్నారు. విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య అభినందించారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర
ఆ అవార్డు వస్తే సంతోషిస్తా: నటి కంగనా
ఆహా.. సూపర్ పవర్ భూమ్మీదకొచ్చిందా?.. వైరల్ వీడియోలు
కట్టెల పొయ్యిపై టీ పెట్టిన మెగా కోడలు..లావణ్య త్రిపాఠి ఫోటోలు వైరల్
కళ్ళు చెదిరే అద్భుత జ్యుయలరీ కలెక్షన్ (ఫోటోలు)
ఏపీలో మరో 7 రోజులు భారీ వర్షాలు
చాందీని అమ్మ! శ్రీదేవిలా డ్యాన్స్ చేయాలని..!
హడలెత్తించిన బంగారం, వెండి ధరలు నేడు ఇలా..
సాక్షి ఆఫీస్ లో టీ20 వరల్డ్ కప్..
IPL 2024: సీఎస్కే పై ఆర్సీబీ ఘన విజయం (ఫోటోలు)
తప్పక చదవండి
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- రేపే లోక్సభ ఐదో దశ పోలింగ్.. అందరి చూపు వీళ్లపైనే!
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- Weekly Horoscope: ఈ రాశి వారికి చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement