-
మళ్లీ చరిత్ర సృష్టించబోతున్నాం
అనంతపురం ఎడ్యుకేషన్: ‘రాష్ట్రంలో విశ్వసనీయత–మోసానికి మధ్య ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు విశ్వసనీయతకే పట్టం కట్టారు. ఉమ్మడి జిల్లాలో ఈ సారి 14 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లూ గెలుస్తున్నాం. మళ్లీ చరిత్ర సృష్టించబోతున్నాం’ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. శనివారం నగర శివారులోని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ హిందూపురంలో బాలకృష్ణ చాప చుట్టేశారన్నారు. కుప్పంలో చంద్రబాబు, పిఠాపురంలో పవన్ కల్యాణ్ కూడా ఓడిపోతున్నారన్నారు. కేవలం నాలుగు సీట్లకు చంద్రబాబు పరిమితం కాబోతున్నాడన్నారు. జనసేన–బీజేపీ కలిసి మరో ఏడు సీట్లు గెలవబోతున్నాయన్నారు. ‘సింహం విదేశాలకు వెళ్లింది, ఒకటో తేదీ దిగుతోంది. 4న జూలు విదిలించబోతోంది’ అంటూ సీఎం జగన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టీడీపీ జూదగాళ్లను నమ్మొద్దు వార్ ఇప్పటికే వన్సైడ్ అయితే, టీడీపీ జూదగాళ్లు మాత్రం కొత్త డ్రామాకు తెర తీశారని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి అన్నారు. ఆ పార్టీ గెలవబోతోందంటూ చోటా మోటా నాయకులకు ఆశలు కల్పించి వారితో అప్పులు చేయించి మరీ పందేలు కట్టిస్తున్నారని, మరోవైపు ఓడిపోతున్న ఆ పార్టీ అభ్యర్థులు మాత్రం వైఎస్సార్సీపీ తరఫున పందేలు కడుతున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఖర్చు చేసిన డబ్బు సంపాదించుకునేందుకు వారే వైఎస్సార్ సీపీ తరఫున పందేలు వేస్తున్నారన్నారు. నాయకుల మాటలు నమ్మి డబ్బు పోగొట్టుకోవద్దని, కుటుంబాలను ఇబ్బందుల్లోకి నెట్టొద్దని టీడీపీ కార్యకర్తలకు హితవు పలికారు. ఎన్నికల్లో కనీసం పోటీ ఇవ్వగలమనే ఆశతోనే చంద్రబాబు బీజేపీతో జత కట్టారన్నారు. బాబూ.. ఎన్ని సీట్లు గెలుస్తావో చెప్పు? ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ 152కు పైగా ఎమ్మెల్యే, 22కు పైగా ఎంపీ స్థానాలు గెలవబోతున్నామని సీఎం వైఎస్ జగన్ చేసిన ప్రకటనతో టీడీపీ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయన్నారు. చంద్రబాబుకు నిజంగా ప్రజల పట్ల విశ్వాసం ఉంటే ఎన్ని సీట్లు గెలుస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. బాబును నమ్మి అమాయకులైన చాలామంది కమ్మ వాళ్లు గత ఎన్నికల్లో పందేలు కాసి డబ్బు పోగొట్టుకున్నారన్నారు. కమ్మ కులానికి చంద్రబాబు చేటులాంటి వారన్నారు. రాజకీయ అజ్ఞాని అయిన తన కుమారుడు ఎక్కడ పత్తా లేకుండా పోతాడోననే భయంతో జనబలమున్న పలువురు కమ్మ యువతకు చంద్రబాటు టికెట్లు ఇవ్వలేదని ఆరోపించారు. పల్నాడులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దౌర్జన్యం చేస్తున్నాడంటున్న టీడీపీ నాయకులు ఎందుకు అక్కడ రీ పోలింగ్కు డిమాండ్ చేయడం లేదని ప్రశ్నించారు. దీన్ని బట్టే టీడీపీ రిగ్గింగ్కు పాల్పడిందనే విషయం అర్థమైపోతోందన్నారు. జూన్ 4 తర్వాత జగన్మోహన్రెడ్డి రెండోసారి ప్రమాణం చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ, బీజేపీ, జనసేన శ్రేణులు కావాలనే రెచ్చగొడుతున్నాయని, వైఎస్సార్సీపీ శ్రేణులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు నసనకోట ముత్యాలు, జూటూరు శేఖర్, చిట్రా వెంకటేష్, నరసింహగౌడ్, కుంటిమద్ది రమేష్, పేరూరు మోహన్ పాల్గొన్నారు. జిల్లాలోని 14 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లూ గెలుస్తున్నాం టీడీపీ కార్యకర్తలను నిండా ముంచేందుకు ఆ పార్టీ జూదగాళ్ల కొత్త డ్రామా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్రెడ్డి బాబుకు దమ్ముంటే ఎన్ని సీట్లు గెలుస్తారో చెప్పాలి: ఎంపీ మాధవ్ -
ఓట్ల లెక్కింపు పకడ్బందీగా సాగాలి
హిందూపురం: ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు పకడ్బందీగా సాగేలా ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అరుణ్బాబు ఆదేశించారు. శనివారం లేపాక్షిలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల, హిందూపురం బిట్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల్లో భద్రతా చర్యలను ఎస్పీ మాధవరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు కలెక్టర్ సూచనలిస్తూ కౌంటింగ్ కేంద్రాల వద్ద నియోజకవర్గాల సూచిక బోర్డులు, బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ హాలులోకి సెల్ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించరాదన్నారు. కంట్రోల్ రూమ్ తనిఖీచేసి ఈవీఎంల భద్రతను పరిశీలించారు. లేపాక్షి గురుకుల పాఠశాల డార్మెటరీ బ్లాక్, అలాగే బిట్ కళాశాల ఆవరణలో మీడియా కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఆర్ఓలను ఆదేశించారు. ఓట్ల లెక్కింపునకు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించడమే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటోందన్నారు. కార్యక్రమంలో డీఆర్వో కొండయ్య, ఆర్ఓలు భాగ్యరేఖ, వెంకటశివసాయిరెడ్డి, గౌరీశంకర్, డీఎస్పీలు, నియోజకవర్గ సహాయ ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. కౌంటింగ్ సిబ్బందికి విధుల కేటాయింపు పుట్టపర్తి అర్బన్: సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కౌంటింగ్ సిబ్బందికి మొదటి విడత ర్యాండమైజేషన్ ద్వారా విధులు కేటాయించినట్లు డీఆర్ఓ కొండయ్య పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ ఎన్ఐసీ కార్యాలయంలో మొదటి ర్యాండమైజేషన్ నిర్వహించారు. ఈ మొదటి విడతలో మొత్తం 915 మంది సిబ్బందికి విధులు కేటాయించారు. డీఆర్ఓ మాట్లాడుతూ కౌంటింగ్ సిబ్బందికి తహసీల్దార్ల ద్వారా నియామక ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఐటీ నోడలాఫీసర్ రామమోహన్రావు, నెట్వర్క్ ఇంజినీర్ విజయ్కుమార్, టెక్నికల్ అసోసియేట్ రవికృష్ణ, ఈడీఎం హరీష్కుమార్, టెక్నికల్ అసోసియేట్ శ్రీనివాసులు పాల్గొన్నారు. -
నయనానందకరం.. పుష్పయాగోత్సవం
● ముగిసిన లక్ష్మీచెన్నకేశవుని బ్రహ్మోత్సవాలు ధర్మవరం అర్బన్: శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వామి పుష్పయాగోత్సవం నయనానందకరంగా సాగింది. ధర్మవరంలో లక్ష్మీచెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఉదయం 9 గంటలకు ఉభయదారులు అన్నమయ్య సేవా మండలి అధ్యక్షుడు పొరాళ్ళ పుల్లయ్య కుటుంబ సభ్యులు 28 రకాల పుష్పాలను పురవీధుల్లో ఊరేగిస్తూ స్వామివారికి సమర్పించి పుష్పయాగం చేయించారు. బంతి, చామంతి, పారిజాతం, సంపంగి, సుగంధ, నీలాంబరి, కనకాంబరి, శ్రీకృష్ణ తులసి, రామ తులసి, గుండుమల్లి, సన్నజాజి, దవణం, గులాబీ తదితర పూలతో లక్ష్మీచెన్నకేశవునికి పూజలు చేశారు. సహస్ర నామాలతో అన్నమయ్య సంకీర్తనలను అన్నమయ్య సేవా మండలి సభ్యులు ఆలపించారు. సాయంత్రం ఆరు గంటలకు శయనోత్సవం (ఏకాంత సేవ) కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఆలయ కమిటీ అధ్యక్షుడు దాశెట్టి సుబ్రహ్మణ్యం, అర్చకులు కోనేరాచార్యులు, మకరందబాబు, భానుప్రకాష్, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
మడకశిరలో భారీ వర్షం
పుట్టపర్తి అర్బన్: జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం రాత్రి మడకశిరలో భారీ వర్షం కురిసింది. ఇక్కడ 72 మి.మీ. వర్షం కురవడంతో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు, చెక్డ్యాములకు నీరు చేరింది. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలవాలాయి. రాత్రి 9 నుంచి శనివారం మధ్యాహ్నం 2.30 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. జిల్లేడుగుంటలో కొబ్బరి చెట్టుపై పిడుగుపడటంతో మంటలు ఎగిసిపడ్డాయి. కొన్ని చోట్ల ఈదురుగాలులకు షెడ్ల పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా మడకశిర మండలం 72.2 మి.మీ, కనగానపల్లి 63.4, అమరాపురం 42.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఇక గుడిబండలో 37.8, ఓడీ చెరువు 26.2, అమడగూరు 25.4, రామగిరి 15.4, హిందూపురం 9.8, లేపాక్షి 9.6, చిలమత్తూరు 8.6, రొద్దం 8.2, గోరంట్లలో 7.2, తలుపుల, రొళ్లలో 5.4, పెనుకొండ 5, సీకే పల్లి 4.4, అగళి 4, ముదిగుబ్బ 1.8 మి.మీ వర్షం కురిసింది. ఈ వర్షాలకు జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. జిల్లాలోని 18 మండలాల్లో వానలు పొంగిన వాగులు, వంకలు -
టీబీ డ్యాంకు మొదలు కాని ఇన్ఫ్లో
బొమ్మనహాళ్: కర్ణాటకలోని హోస్పేట్ వద్ద ఉన్న తుంగభద్ర జలాశయానికి ఇన్ఫ్లో ఇంకా మొదలుకాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఇదే సమయంలో అకాల వర్షాల కారణంగా ఆడపాదడపా జలాశయానికి వరద నీరు చేరింది. గతేడాది మే 7 నుంచి డ్యాంలో నీటి చేరిక మొదలై ఈ సమయానికి 1.035 క్యూసెక్కుల నీరు డ్యాంలోకి వస్తుండగా 4.200 టీంఎసీలు నిల్వ ఉండేది. అయితే ఈ ఏడాది ఇప్పటికీ ఇన్ఫ్లో జీరో ఉండగా నీటి నిల్వ 3.365 ఎంసీటీలుగా ఉంది. జలాశయం నుంచి అన్ని కాలువలకు నీటి విడుదలను నిలిపి వేసి కేవలం రాయబసవన కాలువకు 12 క్యూసెక్కుల నీటిని మాత్రమే వదులుతున్నారు. కొద్ది రోజులుగా నీటి నిల్వలో మార్పు కనబడకపోగా ఆవిరి రూపంలో నీటి మట్టం తగ్గుతోంది. శనివారం డ్యాంలో 1577.47 అడుగుల వద్ద 3.365 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూన్ మొదటి వారం నుంచి జలాశయానికి నీటి చేరిక మొదలయ్యే అవకాశాలున్నట్లు టీబీ బోర్డు అధికారులు తెలిపారు. -
మహిళా చెస్ చాంపియన్షిప్ ఎంపిక పోటీలు ప్రారంభం
హిందూపురం: స్పార్టాన్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా చెస్ అసోసియేషన్, ఆంధ్రా చెస్ అసోసియేషన్ సౌజన్యంతో పట్టణంలో రాష్ట్ర మహిళా చెస్ చాంపియన్షిప్–2024 ఎంపిక పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి 45 మంది క్రీడాకారిణులు పోటీల్లో పాల్గొన్నట్లు ఇంటర్నేషనల్ ఆర్బిటర్, టోర్నమెంట్ చీఫ్ ఆర్బిటర్ అమ్మినేని ఉదయ్కుమార్నాయుడు తెలిపారు. మున్సిపల్ మాజీ చైర్మన్ బీఎస్ విద్యాసాగర్ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురంలో మొదటిసారిగా మహిళా చాపియన్షిప్ పోటీలు నిర్వహించడం హర్షణీయమన్నారు. టోర్నీ డైరెక్టర్ ఆరిఫుల్లాఖాన్ను అభినందించారు. పోటీల్లో ప్రతిభచూపిన టాప్–4 క్రీడాకారిణులను జాతీయ మహిళా చెస్ చాంపియన్షిప్–2024కు ఎంపిక చేస్తామని, వారు రాష్ట్రపోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ నాగార్జున తదితరులు పాల్గొన్నారు. దొంగ అరెస్టు గుంతకల్లుటౌన్: పట్టణంలో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న స్థానిక ఉమామహేశ్వర్నగర్కు చెందిన నల్లబోతుల వాసు అనే దొంగను వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వన్టౌన్ సీఐ రామసుబ్బయ్య తెలిపిన వివరాలు.. గతనెల 19న ప్రశాంతినగర్లోని రైల్వే క్వార్టర్స్లో చోరీ జరిగింది. నల్లబోతుల వాసు ఈ చోరీ చేసినట్లు పోలీసులు నిర్ధారించుకుని అతడిపై నిఘా పెట్టారు. పక్కా సమాచారం మేరకు శనివారం ఉదయం హజరత్ మస్తానయ్య దర్గా వద్ద దొంగలించబడిన ఓ హోండా యాక్టివాపై వెళ్తున్న వాసును సీఐ, సిబ్బంది పట్టుకుని విచారించారు. రైల్వే క్వార్టర్స్తో పాటు అనంతపురం త్రీటౌన్ పరిధిలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడినట్లు అతడు అంగీకరించాడు. చోరీ చేసిన 1.91 గ్రాముల బంగారు నగలు, 28.55 గ్రాముల వెండి, హోండా యాక్టివా వాహనం, సామ్సంగ్ ఎల్ఈడీ టీవీ, సామ్సంగ్ ట్యాబ్, మిక్సీ, కొత్తదుస్తులను స్వాధీనం చేసుకుని నిందితుడిని కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ తెలిపారు. -
ఖాద్రీశా.. కరుణించు స్వామీ!
కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం శనివారం భక్తులతో కిక్కిరిసింది. కదిరి పరిసర ప్రాంతాల నుంచే కాకుండా చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం జిల్లాలు, కర్ణాటక నుంచి భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఖాద్రీశా తమను చల్లగా చూడు స్వామీ అంటూ వేడుకున్నారు. పండ్ల తోటల పెంపకానికి దరఖాస్తుల ఆహ్వానం పుట్టపర్తి: ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉద్యాన పంటలు సాగు చేసుకునే రైతులకు ఉచితంగా పండ్ల మొక్కలు అందించనున్నట్లు ఏపీఓ రామకృష్ణారెడ్డి తెలిపారు. జాబ్కార్డు కలిగి ఉన్న సన్న, చిన్నకారు రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. పండ్ల మొక్కలు అందించటంతో పాటు మూడేళ్లపాటు వాటి నిర్వహణ కోసం రైతుకు డబ్బులు చెల్లిస్తామని తెలిపారు. మామిడి, చీనీ, జీడి మామిడి, నిమ్మ, జామ, తైవాన్ జామ, సపోట, కొబ్బరి, సీతాఫలం, దానిమ్మ, నేరేడు, చింత, రేగు, డ్రాగన్ ప్రూట్తో పాటు గులాబీ, మల్లె పూల తోటల పెంపకానికి ఈ పథకం కింద ప్రోత్సాహకాలందిస్తున్నట్లు వివరించారు. ఆసక్తి కలిగిన వారు ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సజావుగా ‘సప్లిమెంటరీ’ పరీక్షలు పుట్టపర్తి: జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు రెండోరోజు శనివారం సజావుగా జరిగాయని విద్యా శాఖాధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని డీవీఈఓ రఘునాథరెడ్డి, డీఈఓ మీనాక్షి తెలిపారు. -
No Headline
ధర్మవరం: ఐపీఎల్ క్రికెట్ ఫైనల్ మ్యాచ్ నేపథ్యంలో బెట్టింగ్ జోరందుకుంది. జిల్లాలోని ధర్మవరం, కదిరి, హిందూపురం, పెనుకొండ, మడకశిర తదితర నియోజకవర్గాలలో ఆన్లైన్, ఆఫ్లైన్ క్రికెట్ బెట్టింగ్లు ఊపందుకున్నాయి. జట్టు గెలుపుపైనే కాకుండా వేసే బంతిలో వచ్చే పరుగులపైనా, వికెట్ పడుతుందా లేదా అన్న అంశాలపై కూడా పందేలు కాస్తున్నారు. ఆదివారం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఈ జట్ల గెలుపోటములపై క్రికెట్ అభిమానులు ఆఫ్లైన్ విధానంలో అయితే ఫోన్ల ద్వారా బెట్టింగ్ ఆడుతున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తెలుగువారి సెంటిమెంట్తో ముడిపడటంతో తెలుగు రాష్ట్రాల్లో రూ.కోట్లల్లో బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. ముంచేస్తున్న ఆన్లైన్ యాప్లు.. ఆన్లైన్లో 10 దాకా క్రికెట్ బెట్టింగ్ యాప్లు ఉన్నాయి. ఇవి నిత్యం పేర్లు మార్చుకుంటూ బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. తొలుత భారీగా ఆఫర్లు ప్రకటిస్తూ యువతను ఆకర్షిస్తారు. మెల్లగా వారి ముగ్గులో పడి బెట్టింగ్కు అలవాటు పడగానే డబ్బులు కొల్లగొడతారు. దీంతో యువత బంగారు భవిష్యత్ను నాశనం చేసుకుంటోంది. అవగాహన కల్పించినా మార్పు శూన్యం.. జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రతి నియోజకవర్గంలోనూ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్, జూద కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలను తరచూ వివరిస్తూ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా ఫలితం కానరావడం లేదు. అనధికారికంగా బెట్టింగ్లు నిర్వహించే యాప్లపై పోలీసులు కొరడా ఝుళిపించి నిషేధిస్తే తప్ప ఫలితం ఉండదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. యువత భవితనుచిదిమేస్తున్న క్రికెట్ బెట్టింగ్ డబ్బులు కొల్లగొడుతున్న ఆన్లైన్ యాప్లు నేడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్పై రూ.కోట్లల్లో పందేలు ! ధర్మవరానికి చెందిన ఓ రెవెన్యూ ఉద్యోగి ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్కు బానిసై అధిక వడ్డీకి అప్పులు చేశాడు. అప్పులు తీర్చలేక అవమానాలు భరించలేక ఇటీవల ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పెద్ద మరణంతో ఆ కుటుంబం దిక్కులేనిదైంది. పుట్టపర్తికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆన్లైన్ క్రికెట్ యాప్లలో బెట్టింగ్ ఆడుతూ భారీగా అప్పులు చేశాడు. బెట్టింగ్లో పోగొట్టుకోవడమే తప్ప రాబడి లేక పోవడంతో అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఉద్యోగం వదిలి ఎటో వెళ్లిపోయాడు. ముదిగుబ్బకు చెందిన అబ్బాయి తమిళనాడులోని ఓ ప్రముఖ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అక్కడ క్రికెట్పై భారీగా పందేలు వేశాడు. తల్లిదండ్రుల ద్వారా తెప్పించుకున్న రూ.2 లక్షల నగదులో యూనివర్సిటీ ఫీజు కట్టకపోగా.. బయటి వ్యక్తుల వద్ద అప్పులు చేశాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. ఇవన్నీ మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. క్రికెట్ బెట్టింగ్ మాఫియా కోరల్లో చిక్కుకుని పలువురి జీవితాలు ఛిద్రమౌతున్నాయి. ఐపీఎల్ ట్వంటీ 20 క్రికెట్ మ్యాచ్లపై బెట్టింగులు వేసి ఎంతోమంది డబ్బు పోగొట్టుకుని అప్పుల అగాథంలో కూరుకుపోతున్నారు. -
కౌంటింగ్కు అప్రమత్తమైన పోలీస్
పుట్టపర్తి టౌన్: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తరహాలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా సాగేలా పోలీసు శాఖ అప్రమత్తమైంది. జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టింది. ఎస్పీ మాధవరెడ్డి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక గ్రామాలు, ప్రాంతాలు గుర్తించి స్థానిక పోలీస్ అధికారుల సమక్షంలో కార్డన్ సెర్చ్లు నిర్వహించింది. అనుమానిత వ్యక్తులతో పాటు రికార్డులు లేని వాహనాలను తమ ఆధీనంలోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. సోషల్ మీడియాపై నిఘా.. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా తదితర సోషల్ మీడియా ద్వారా వదంతులు, చట్ట వ్యతిరేక మెసేజ్లు, ఉద్రేకాలు, గొడవలు సృష్టించే అవకాశం ఉన్నందున పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. అలాంటి వారిని ముందస్తుగా గుర్తించి అనర్థాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఉండేలా గ్రామాల్లో సమావేశాలు, పల్లె నిద్రలు నిర్వహించి అవగాహన కల్పిస్తున్నారు. బంక్ యజమానులకు పోటీసులు.. అరాచకశక్తులు పెట్రోల్, బాంబులు, పేలుడు స్వభావం కలిగిన బాణసంచా సామగ్రితో అల్లర్లు సృష్టించే అవకాశం ఉన్నందున పెట్రోల్, డీజిల్ లూజు విక్రయాలు చేయకూడదని పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని బంక్ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. బాణసంచాపై కూడా ఆంక్షలు విధిస్తూ తయారీదారులకు హెచ్చరికలు జారీ చేశారు. ర్యాలీలు నిషేధం.. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంది. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, కౌంటింగ్ అనంతరం విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు చేయకూడదని, బాణసంచా కాల్చకూడదని ఆంక్షలు విధించారు. ఎక్కడా జనం గంపులుగా గుమికూడరాదు. గొడవలకు వెళ్లొద్దు.. ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) తరువాత గ్రామాల్లో ప్రజలు గొడవకు వెళ్లకుండా ప్రశాంతంగా ఉండాలి. శాంతిభద్రతలకు భంగం కలిగేవిధంగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవు. ఇప్పటికే జిల్లాలో సమస్యాత్మక గ్రామాలను గుర్తించి తనిఖీలు ముమ్మరం చేశాం. తనిఖీల్లో భాగంగా ఆర్సీ లేని ఆరు ద్విచక్రవాహనాలతో పాటు ఐదు వేటకొడవళ్లను సీజ్ చేశాం. అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టాం. గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. సమస్యలు సృష్టించినా, ప్రేరేపించినా, సమస్యలకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. – మాధవరెడ్డి, ఎస్పీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు బాణసంచా, పెట్రోల్, డీజిల్ లూజు అమ్మకాలపై నిషేధం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న కార్డన్ సెర్చ్లు అమలులో 144 సెక్షన్, 30 పోలీస్ యాక్ట్ -
గాలీవాన బీభత్సం
పావగడ: తాలూకా వ్యాప్తంగా శుక్రవారం రాత్రి గాలి వాన బీభత్సం సృష్టించింది. తాలూకా లోని లింగదహళ్లి, సాసలకుంటె, మల్లమ్మనహళ్లి, పోలేనహళ్లి గ్రామాల ప్రధాన రహదారిపై విద్యుత్ స్తంభాలు కూలి పోయాయి. లింగదహళ్లి, సాసలకుంటె గ్రామాల్లో రైతులు వీరాంజనేయ, భద్రావతి అంజినప్ప, పాపన్నకు చెందిన తోటల్లో అధిక సంఖ్యలో వక్క చెట్లు నేలకూలాయి. కొన్ని వక్క చెట్లు రహదారిపై పడి పోవడంతో వాహన రాకపోకలు నిలిచి పోయాయి. కాగా మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షం తో 150 వక్క తోటల్లో వందలాది వక్క చెట్లు నేల రాలి లక్షలాది రూపాయల ఆస్తి నష్టం తో అల్లాడిపోయిన అరసికెరె గ్రామం ఇంకా తేరుకోక ముందే సాసలకుంటె, పోలేనహళ్లి గ్రామాల్లో వరుణుడు మరో బీభత్సాన్ని సృష్టించాడు. శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ప్రారంభమైన వర్షం రాత్రి 12 గంటల వరకు ఏకధాటిగా కురిసింది. దీంతో సాసలకుంటె గ్రామంలో వంకలు పారాయి. అయితే గాలి వాన దెబ్బకు పోలేనహళ్లిలో కోళ్లఫారం షెడ్డు రేకులు పూర్తిగా ఎగిరి పోయి షెడ్డు లో ఉన్న 1,500 కోడి పిల్లలు మృత్యువాత పడ్డాయి. రూ.లక్షల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోళ్ల షెడ్డు యజమాని ఈశ్వర్ కోరాడు. పోలేనహళ్లిలో షెడ్డు కూలి 1,500 కోడి పిల్లల మృతి -
వపతిగృహ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోండి
అనంతపురం రూరల్: విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న వసతిగృహాల్లో 2024– 25 విద్యాసంవత్సరానికి సంబంధించి 3 వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈమేరకు ఆ శాఖ ఏడీ అబ్దుల్ రసూల్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతపురంలోని హెచ్చెల్సీ కాలనీలో ఉన్న బాలుర వసతి గృహంలో 100 సీట్లు, అరవింద్ నగర్లో ఉన్న బాలికల వసతిగృహంలో 50 సీట్లు ఉన్నాయని తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. వివరాలకు 9177766540, 94927760438 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
కర్ణాటక మద్యం ప్యాకెట్ల పట్టివేత
చెన్నేకొత్తపల్లి: ముష్టికోవెల గ్రామ సమీపంలో పోలీసులు కర్ణాటక మద్యాన్ని పట్టుకున్నారు. వివరాలు.. శుక్రవారం రాత్రి పోలీసులు కర్ణాటక సరిహద్దులో వాహనాల తనిఖీ చేపట్టారు. ఈసందర్భంగా పోలీసులను చూసి రెండు ద్విచక్రవాహనాలపై కర్ణాటక మద్యం తరలిస్తున్న వారు అక్కడి నుంచి పారిపోయారు. అయితే అందులో ఒకరిని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. నిందితుడు మండలంలోని మేడాపురం గ్రామానికి చెందిన గుజ్జల గంగయ్యగా గుర్తించారు. ఈసందర్భంగా రెండు ద్విచక్రవాహనాలతోపాటు 1,080 కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితుడిపై ఎకై ్సజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. -
తమిళుల సాంస్కృతిక వైభవం
ప్రశాంతి నిలయం: తమిళనాడు ప్రాంత భక్తులు ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదర్శనలతో తమ వైభవాన్ని చాటి చెప్పారు. పర్తియాత్రలో భాగంగా పడమటి, వాయువ్య చైన్నె, తిరువళ్లూరు ప్రాంతాలకు చెందిన సత్యసాయి భక్తులు ప్రశాంతి నిలయం చేరుకున్నారు. శనివారం ఉదయం సత్యసాయి మహాసమాధి చెంత చైన్నె సత్యసాయి భక్తులు సంగీత కచేరీ నిర్వహించారు. చక్కటి భక్తిగీతాలతో వారు ఆహూతులను మైమరపింపజేశారు. సాయంత్రం తమిళనాడు ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ సన్యాసి వళ్లలార్ జీవిత గాధ, పరమత సహనం పట్ల ప్రజలను చైతన్య వంతులను చేసిన విధానాన్ని వివరిస్తూ వళ్లలార్ సన్యాసి పేరుతో బాలవికాస్ విద్యార్థులు చక్కటి నాటిక ప్రదర్శించారు.18వ శతాబ్దంలో అయన భారతీయ సమాజంలో నెలకొన్న కుల,మతాంతరాలను తొలగించేందుకు చేసిన కృషిని చక్కగా వివరించారు. తర్వాత కురవంజి పేరుతో బాలవికాస్ చిన్నారుల నృత్య ప్రదర్శనతో అలరించారు. -
రైలులో వ్యక్తి మృతి
హిందూపురం అర్బన్: హిందూపురం రైల్వే స్టేషన్లో హిందూపురం– యశ్వంతపూర్ ప్యాసింజర్ రైలులో శనివారం ఓ వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే ఎస్ఐ బాలజీనాయక్ తెలిపారు. ఉదయం 8 గంటల సమయంలో రైలు తనిఖీ చేస్తుండగా వ్యక్తి మృతదేహం కనిపించిందన్నారు. మృతదేహం వద్ద ఉన్న టికెట్, ఇతర చీటీల ఆధారంగా మృతుడు బీజాపూర్కు చెందిన సంతోష్( 40)గా గుర్తించామన్నారు. కేసు నమోదు చేసుకొని మృతదేహన్ని హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించామన్నారు. సంతోష్ది సహజ మరణంగానే భావిస్తున్నామని, ఈ మేరకు మృతుడి బంధువులకు సమాచారం అందించినట్లు ఎస్ఐ తెలిపారు. అంతర్రాష్ట్ర రైల్వే దొంగ అరెస్టు ధర్మవరం అర్బన్: అంతర్రాష్ట్ర రైల్వే దొంగను ధర్మవరం రైల్వే పోలీసులు పట్టుకున్నారు. స్థానిక రైల్వే పోలీస్స్టేషన్లో శనివారం సాయంత్రం సీఐ నాగరాజు వివరాలు వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లా యాదగిరిటౌన్కు చెందిన సాంబన్న రైళ్లలో దొంగతనాలకు పాల్పడేవాడు. రైళ్లలో విలువైన వస్తువులను తీసుకెళుతున్న ప్రయాణికులే లక్ష్యంగా చోరీలకు తెగబడేవాడు. ప్రయాణికుల వద్దనున్న విలువైన సెల్ఫోన్లు, వస్తువులు దొంగతనం చేసి వాటిని అమ్మి సొమ్ము చేసుకునేవాడు. ఈక్రమంలో ధర్మవరం రైల్వే పరిధిలో రెండు దొంగతనాలు చేశాడు. రైలులో తిరుగుతున్న సాంబన్నను శనివారం అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. శతాధిక వృద్ధుడి మృతి లేపాక్షి: మానేపల్లికి చెందిన శతాధిక వృద్ధుడు భట్టికర చంద్రాయప్ప (101) శనివారం సాయంత్రం మృతి చెందారు. 1923లో భట్టికర చంద్రాయప్ప మానేపల్లిలో జన్మించారు. 18 ఏళ్ల వయసులో మహాత్మాగాంధీ పిలుపు మేరకు స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. గాంధీజీ హిందూపురంలో స్వాతంత్య్ర ఉద్యమ పర్యటనకు వచ్చినపుడు వెళ్లి చూసినట్లు ఆయన తరుచూ చెబుతుండేవారు. వందేళ్లు పూర్తి చేసుకున్నందుకు మానేపల్లి గ్రామ సచివాలయం నందు గతేడాది ఆయన్ను సన్మాంచారు. 1947లో స్వాతంత్య్రం సిద్ధించినపుడు చంద్రాయప్ప తన మిత్రులతో కలిసి గ్రామంలో పెద్ద ఎత్తున సంబరాలు జరిపినందుకు గుర్తుగా ఒక రాతి దిమ్మె శాసనాన్ని కూడా గ్రామ సచివాలయం ముందు ఏర్పాటు చేశారు. ఆయన అంత్యక్రియలు ఆదివారం జరుగుతాయని బంధువులు పేర్కొన్నారు. -
హమాలీ మృతి
బుక్కరాయసముద్రం: స్థానిక హమాలీ కాలనీ సమీపంలోని బర్దన్ కాలనీ వద్ద ఓ హమాలీ బ్రిడ్జిపై నుంచి కాలువలోకి పడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. బీకేఎస్ పంచాయతీ పరిధిలోని బర్దన్ కాలనీలో నివాసం ఉంటున్న నాగరాజు(58) నగరంలో హమాలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. నాగరాజు శుక్రవారం రాత్రి పనులు ముగించుకుని ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా బర్దన్ కాలనీ సమీపంలో హెచ్ఎల్సీ కెనాల్ బ్రిడ్జిపై నుంచి దాటుతుండగా ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స ఫలించకపోవడంతో అక్కడే మృతి చెందాడు. -
ఉపాధి కూలీల సంఖ్య పెరగాలి
మడకశిర: ఉపాధి పనుల్లో పండ్ల మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు డ్వామా పీడీ విజయేంద్రప్రసాద్ తెలిపారు. ఈ మేరకు రైతులకు కూడా అవగాహన కల్పించాలన్నారు. శుక్రవారం ఆయన పట్టణంలోని సీఎల్ఆర్సీ కార్యాలయంలో ఏపీడీ లక్ష్మీనారాయణ, ఏపీఓలు, ఈసీలు, టీఏలతో నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలాల వారీగా ఉపాధి పనులపై ఆరా తీశారు. ఎంత మంది కూలీలు ఉపాధి పనులకు వస్తున్నారు..ఎన్ని పనులు చేశారు.. తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున భూమి మెత్తగా మారి పనులు చేసేందుకు వీలుగా ఉంటుందన్నారు. అందువల్ల ప్రతి గ్రామంలోనూ పనులు చేపట్టి అడిగిన వారందరికీ ‘ఉపాధి’ పనులు కల్పించాలన్నారు. పనుల కల్పనలో ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ప్లాంటేషన్ మేనేజర్ వెంకప్ప, ఈసీ హరిబాబు పాల్గొన్నారు. -
బుద్ధం శరణం గచ్ఛామి
ప్రశాంతి నిలయం: బుద్ధుడి నామస్మరణతో ప్రశాంతి నిలయం ప్రతిధ్వనించింది. బుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని రెండురోజులుగా ప్రశాంతి నిలయంలో నిర్వహిస్తున్న వేడుకలు శుక్రవారం ముగిశాయి. ఉదయం సత్యసాయి మహాసమాధి చెంత నేపాల్ బౌద్ధ సన్యాసులు తమ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ‘జయమంగళగాత్’ను నిర్వహించారు. అనంతరం సత్యసాయిని, బుద్ధ భగవానుడిని కీర్తిస్తూ భక్తిగీతాలు ఆలపించారు. వక్తలు బుద్ధుడు, సత్యసాయి తత్వాలను భక్తులకు వివరిస్తూ ప్రసంగించారు. సాయంత్రం నేపాల్ బాలవికాస్ చిన్నారులు తమ సంస్కృతిని ప్రతిబింబించేలా జానపద నృత్యం నిర్వహించారు. కార్యక్రమం అనంతరం వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులు సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. ప్రశాంతి నిలయంలో ముగిసిన బుద్ధ పౌర్ణమి వేడుకలు -
దిగుబడుల్లేకే..
జిల్లాలో కూరగాయల దిగుబడి బాగా తగ్గింది. మరోవైపు వినియోగం పెరిగింది. దీంతో బెంగళూరు నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. రవాణా, ఇతర ఖర్చులు కలుపుకుంటేనే వ్యాపారికి గిట్టుబాటు అవుతోంది. ప్రసుత్తం కిలో పచ్చి మిర్చి రూ.140 నుంచి రూ.150 వరకూ విక్రయిస్తున్నాం. టమాట సైతం కిలో రూ.50 వరకూ విక్రయిస్తున్నాం. వర్షాలు పడి మళ్లీ దిగుబడులు వచ్చే వరకూ ధరలు ఇలాగే ఉంటాయి. – మోహన్, కూరగాయల వ్యాపారి, చిలమత్తూరు ఆచీతూచీ కొంటున్నాం మార్కెట్లో కూరగాయల ధరలన్నీ పెరిగాయి. రూ.500 నోటు తీసుకెళ్తే తప్ప కావాల్సినవి తీసుకురాలేని పరిస్థితి. కిలో టమాట, అరకిలో మిర్చి, ఇతర కూరగాయలు, ఆకుకూరలకే రూ.500 అవుతోంది. అందువల్లే ఆచీతూచీ కొనాల్సి వస్తోంది. – ప్రభావతి, గృహిణి, హిందూపురం -
డీఈఓ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
పుట్టపర్తి అర్బన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఈ నెల 25న సంస్కృతి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్న డీఈఓ ఇన్ ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఉద్యోగ పరీక్షకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు డీఆర్ఓ కొండయ్య తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన అర్బన్ డీఎస్పీ వాసుదేవన్తో కలిసి కలెక్టరేట్లోని కోర్టు హాలులో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్ఓ మాట్లాడుతూ, జిల్లాకు చెందిన 110 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారని తెలిపారు. శనివారం ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకూ పరీక్ష జరుగుతుందని, కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రంలోకి సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ విష్ణు, ఏపీపీఎస్సీ అధికారులు పాల్గొన్నారు. -
సెల్ఫోన్లకు అనుమతి లేదు
● ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు కౌంటింగ్ జరగాలి ● జిల్లా ఎన్నికల అధికారి అరుణ్బాబు పుట్టపర్తి అర్బన్: కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అరుణ్బాబు స్పష్టం చేశారు. కౌంటింగ్ ప్రక్రియ అంతా ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జరగాలన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో రిటర్నింగ్ అధికారులు, ఏఈఆర్ఓ, సహాయక సిబ్బందికి ఓట్ల లెక్కింపుపై తొలి విడత అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో వివిధ దశలు, పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన ఇచ్చారు. పొరపాట్లకు తావివ్వొద్దు.. కలెక్టర్ అరుణ్బాబు మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపు అత్యంత కీలకమన్నారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి లెక్కింపు ప్రక్రియను పగడ్బందీగా పూర్తి చేయాలన్నారు. చిన్న పొరపాటుకు సైతం తావివ్వొద్దన్నారు. హిందూపురం పార్లమెంట్తో పాటు 6 అసెంబ్లీ నియోజక వర్గాల కౌంటింగ్ జిల్లాలోనే జరుగుతుందన్నారు. జూన్ 4వ తేదీన ఉదయం 8 గంటలకే లెక్కింపు ప్రారంభమవుతుందని, కౌంటింగ్ విధులు కేటాయించిన ఉద్యోగులు, సిబ్బంది ఉదయం 6 గంటలకే కేంద్రాల వద్దకు చేరుకోవాలన్నారు. ఒక వైపు పోస్టల్ బ్యాలెట్లు, మరో వైపు ఈవీఎంల లెక్కింపు జరుగుతుందన్నారు. పోస్టల్ బ్యాలెట్లు అధికంగా పోలైనందున లెక్కింపునకు అధిక సమయం పడుతుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యేంత వరకూ వీడియో రికార్డింగ్ ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ గుర్తింపు కార్డు ధరించాలన్నారు. కౌంటింగ్ హాల్లో ఆర్ఓలదే సర్వాధికారమన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు పక్కాగా ఉండాలి.. జేసీ అభిషేక్ కుమార్ మాట్లాడుతూ, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా పార్లమెంట్ నియోజకవర్గానికి, అసెంబ్లీ నియోజకవర్గానికి పోలైన ఓట్లను ప్రత్యేకంగా లెక్కిస్తామన్నారు. అభ్యర్థులకు పోలైన పోస్టల్ బ్యాలెట్లను వివిధ దశల్లో పరిశీలన చేసి అన్నీ పక్కాగా ఉన్న వాటినే లెక్కింపులోనికి తీసుకుంటామన్నారు. సమావేశంలో పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, రిటర్నింగ్ అధికారులు భాగ్యరేఖ, వెంకటశివరామిరెడ్డి, గౌరీ శంకర్, సన్నీ వంశీకృష్ణ, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
డీఆర్ కాలనీలో చోరీ
హిందూపురం అర్బన్: స్థానిక డీఆర్ కాలనీలో నివాసముంటున్న హిందూపురం మండలం కొటిపి పంచాయతీ కార్యదర్శి సుహాసిని ఇంట్లో చోరీ జరిగింది. గురువారం ఇంటికి తాళం వేసి వ్యక్తిగత పనిపై ఆమె బెంగళూరుకు వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దుండగులు శుక్రవారం వేకువజామున ఇంటి తలుపులు బద్ధలుగొట్టి లోపలకు ప్రవేశించారు. బీరువాలోని 16 తులాల బంగారు నగలు, రూ.40 వేల నగదు అపహరించుకెళ్లారు. శుక్రవారం సాయంత్రం ఇంటికి చేరుకున్న సుహాసిని చోరీ విషయాన్ని గుర్తించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. ఘటనపై సీఐ రియాజుద్దీన్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. శతాధిక వృద్ధురాలి మృతి చెన్నేకొత్తపల్లి: మండలంలోని మేడాపురం పంచాయతీ పెద్ద మొగలాయపల్లికి చెందిన ఓబులమ్మ(110) శుక్రవారం మృతి చెందింది. ఈ మేరకు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతి చెందే వరకూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించిన ఆమెకు ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మొత్తం నాలుగు తరాల వారసులను చూసి ఎంతో సంతోషించేది. మత్స్య శాఖ ఉద్యోగి ఆత్మహత్య గార్లదిన్నె: మండలంలోని పెనకచెర్ల డ్యాంలో ఉన్న మత్స్యశాఖ కేంద్రంలో ఫిషర్ మ్యాన్గా పనిచేస్తున్న అల్లాబకాష్ (54) ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు పెనకచెర్ల డ్యాం నివాసి అయిన అల్లాబకాష్ మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే అనంతపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక శుక్రవారం ఆయన మృతి చెందారు. మృతుడికి భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. వృద్ధుడి అనుమానాస్పద మృతి రాయదుర్గం టౌన్: పట్టణంలోని భంభం స్వామి లే అవుట్లో నివాసముంటున్న వద్ది జయరాములు(65) అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. పట్టణ శివారు బళ్లారి రోడ్డులో ఉన్న నగర వనంలో శుక్రవారం ఉదయం జయరాములు మృతదేహాన్ని అటవీ శాఖ సిబ్బంది గుర్తించారు. మృతి చెంది నాలుగు రోజులైనట్లుగా తెలుస్తోంది. జయరాములుకు ఇద్దరు కుమారులున్నారు. గత ఆదివారం సాయంత్రం నుంచి తమ తండ్రి కనిపించడం లేదని అప్పట్లో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై స్థానిక పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం నగర వనంలో జయరాములు మృతదేహం లభ్యం కావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు రోజుల క్రితం కనిపించకుండా పోయిన జయరాములు ఆత్మహత్య చేసుకున్నాడా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోషంలో పోలీసులు విచారణ కొనసాగుతోంది. ఐరన్ మార్ట్లో చోరీ గుత్తి: స్థానిక అనంతపురం రోడ్డులోని సబిహా స్టీల్ అండ్ ఐరన్ మార్ట్లో చోరీ జరిగింది. గురువారం అర్ధరాత్రి తర్వాత ఓ దొంగ మార్ట్ షట్టర్ను ఐరన్ ర్యాడ్తో తెరచి లోపలకు ప్రవేశిస్తున్నట్లుగా సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమైంది. రెండు క్యాష్ బాక్స్ల్లోని సుమారు రూ. 33 వేలు నగదుతో పాటు ఓ సెల్ఫోన్ను దుండగులు అపహరించుకెళ్లాడు. ఘటనపై ఐరన్ మార్ట్ యజమాని కేఎస్ ఖాజా ఫిర్యాదు మేరకు సీఐ వెంకటరామిరెడ్డి, ఎస్ఐ నబీరసూల్ షాప్ను పరిశీలించి, కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఇసుక దిబ్బల పరిశీలనకణేకల్లు: మండలంలోని వేదవతి హగరి నదీ పరీవాహక ప్రాంతంలోని ఇసుక దిబ్బలను జెసెల్ షాఫ్ట్ ఫర్ ఇంటర్నేషనల్ జుసమ్మెనర్బీట్ (జీఐజెడ్) బృందం సభ్యులు శుక్రవారం సందర్శించారు. కళేకుర్తి, మాల్యం, నాగేపల్లి, తుంబిగనూరు, గరుడచేడు, మీనహళ్లి, బిదరకుంతం గ్రామాల్లోని వ్యవసాయ భూముల్లో పర్వతాలను తలపించేలా ఏర్పడిన ఇసుక దిబ్బలను చూడగానే జీఐజెడ్ టెక్నికల్ ఎక్స్పర్ట్ గోపీనాథ్, అసిస్టెంట్ టెక్నికల్ నిపుణుడు సంతోష్, ప్లానింగ్ నిపుణుడు ప్రసాద్ ఆశ్చర్యపోయారు. వారి వెంట రాయదుర్గం ఏపీడీ అసిస్టెంట్ దేవరాజు, ఏపీఓ సుధాకర్ ఉన్నారు. ఈ సందర్భంగా రైతులతో సమావేశమై రోజురోజుకూ విస్తరిస్తున్న ఇసుక మేటల వల్ల కలిగే పంట నష్టాలపై, పంటల సాగుకు తలెత్తుతున్న అవాంతరాలను అడిగి తెలుసుకున్నారు. ఆషాఢంలో వేగంగా వీచే గాలి వల్ల ఇసుక తెరలు తెరలుగా లేచి పక్క భూముల్లో పడుతుందని రైతులు తెలిపారు. వేరుశనగ విత్తు మొదలు మొలకెత్తే వరకూ తామెంతో ఆందోళనతో గడపాల్సి వస్తోందన్నారు. ఇదే ఇసుక నల్లరేగడి భూములు, చౌడు భూములకు తరలించి ఆ భూమిపై పరిచి పంటలు సాగు చేస్తే మేలైన దిగుబడులు వస్తున్నాయని రైతులు తెలిపారు. అవసరమైన రైతులకు ఈ ఇసుకను తరలించే ప్రక్రియ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇసుక తరలింపుతోపాటు పలుచోట్ల రేగు, సరుగుడు, గోరింటాకు తదితర చెట్లను పెంచడం వల్ల కూడా ఎడారి నివారణకు సత్ఫలితాలిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం ఎడారి నివారణకు చేపట్టాల్సిన చర్యలపై నివేదిక సిద్ధం చేసి కలెక్టర్కు సమర్పించనున్నట్లు జీఐజెడ్ బృందం సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో బొమ్మనహళ్ ఏపీఓ రమేష్, టెక్నికల్ అసిస్టెంట్లు సోమన్నగౌడ్, హరి, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రతిభా పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం
పెనుకొండ: పది, ఇంటర్లో ప్రతిభ చాటుకున్న వాల్మీకి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు జిల్లా వాల్మీకి ఉద్యోగుల సంఘం నాయకులు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. 2023–24 విద్యాసంవత్సరానికి గాను పదో తరగతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు 480కు పైబడి మార్కులు, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు 510కు పైబడి మార్కులు సాధించి ఉండాలి. అలాగే ఇంటర్లో ప్రభుత్వ కళాశాల విద్యార్థులు 800కు పైబడి, ప్రైవేట్ కళాశాల విద్యార్థులు 850కు పైబడి మార్కులు సాధించిన వారు అర్హులు. ఆసక్తి ఉన్న వారు మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ, సెల్ నంబర్, చిరునామాతో కూడిన వివరాలను 89191 21041 నంబర్కు వాట్సాప్ చేయాలి. ఎంపికై న వారికి జూన్ 16న హిందూపురంలోని వాల్మీకి భవన్లో పురస్కారాలను అందజేస్తారు. రెండో రోజూ హుండీల ఆదాయం లెక్కింపు కదిరి టౌన్: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన హుండీ కానుకల లెక్కింపు ప్రక్రియ రెండో రోజు శుక్రవారమూ కొనసాగింది. 50 రోజులకు గాను హుండీలు లెక్కించగా తొలి రోజు రూ.71,70,337, రెండో రోజు రూ.8,24,194 నగదుతో పాటు 21 గ్రాముల బంగారు, 480 గ్రాముల వెండి సమకూరినట్లు ఆలయ ఈఓ వి.శ్రీనివాసరెడ్డి తెలిపారు. గతంలో కంటే ఈసారి ఆదాయం ఎక్కువ వచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో హుండీల పర్యవేక్షణాధికారి రమేష్ బాబు, కదిరి ఎస్బీఐ శాఖ మేనేజర్ రాఘవేంద్ర, బ్యాంక్ సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నాలుగో రోజు కొనసాగిన సిట్ విచారణ తాడిపత్రి అర్బన్: ఎన్నికల సమయంలో, ఆ తర్వాత తాడిపత్రి చోటు చేసుకున్న అల్లర్లపై సమగ్ర విచారణ చేసి ప్రాథమిక నివేదికను అందజేసిన సిట్ అధికారులు... మరింత లోతైన విచారణలో భాగంగా రెండో విడత తాడిపత్రికి విచ్చేశారు. ఇప్పటికే మూడు రోజులుగా విచారణ కొనసాగింది. నాలుగో రోజు శుక్రవారం కూడా విచారణను అధికారులు చేపట్టారు. మూడు రోజులుగా రూరల్ పోలీస్ స్టేషన్లో మకాం వేసిన సిట్ బృందం అల్లర్లకు సంబంధించిన ఎఫ్ఐఆర్లను శుక్రవారం పరిశీలించింది. ఇప్పటి వరకూ నిందితుల్లో ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు. ఎంత మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు అనే అంశాలపై పరిశీలిస్తోంది. అంతేకాక అల్లర్లకు ముందు టీడీపీ వర్గీయులు భారీ సంఖ్యలో జేసీ నివాసం వద్దకు ఎలా చేరుకున్నారు అనే విషయంపై సిట్ బృందం లోతుగా విచారణ చేపట్టింది. పక్కా పథకం ప్రకారమే ముందుగానే ఆందోళనకారులు పట్టణంలోకి చొరబడ్డారా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. విద్యుదాఘాతంతో చిన్నారి మృతి కూడేరు: మండలంలోని మరుట్ల–1వ కాలనీకి చెందిన కిష్టప్ప కుమార్తె భానుప్రియ(10) విద్యుదాఘాతంతో మృతి చెందింది. పోలీసులు తెలిపిన మేరకు... గురువారం రాత్రి భానుప్రియ నీటిని వేడి చేసేందుకు హీటర్ స్విచ్ ఆన్ చేస్తుండగా షాక్కు గురై కుప్పకూలింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అనంతపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక ఆమె మృతి చెందింది. ఘటనపై సీఐ శివరాముడు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. -
‘108’లో ప్రసవం
పుట్టపర్తి అర్బన్: పురిటినొప్పులతో బాధపడుతున్న మహిళను 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆడశిశువుకు జన్మనిచ్చింది. వివరాలు... పుట్టపర్తి మండలం కర్ణాటక నాగేపల్లికి చెందిన సాకే వెంకటేష్ భార్య ముత్యాలమ్మకు శుక్రవారం మధ్యాహ్నం పురిటి నొప్పులు మొదలయ్యాయి. కుటుంబసభ్యుల నుంచి సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ ఈఎంటీ రామ్మోహన్, పైలెట్ శ్రీనివాసులు ఆగమేఘాలపై ఆ గ్రామానికి చేరుకున్నారు. అప్పటికే నొప్పులు భరించలేక ఇబ్బంది పడుతున్న ముత్యాలమ్మకు ధైర్యం చెప్పి అంబులెన్స్లో ఎక్కించుకుని ధర్మవరంలోని ఏరియా ఆస్పత్రిలో చేర్పించేందుకు బయలుదేరారు. మార్గమధ్యంలో కొత్తచెరువు మండలం ఆమిద్యాలకుంట వద్దకు చేరుకోగానే నొప్పులు తీవ్రం గాయడంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి ఆశ కార్యకర్త నాగమణి సహకారంతో 108 సిబ్బంది ఆమెకు ప్రసవం చేశారు. పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో తమ ఇంట మహాలక్ష్మి పుట్టిందని ఈ సందర్భంగా కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ ౖచైతన్య పాఠశాలలో పాఠ్య పుస్తకాలు సీజ్ కొత్తచెరువు: మండలంలోని శ్రీచైతన్య పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా అడ్మిషన్లు చేపట్టి, పాఠ్యపుస్తకాలు విక్రయిస్తున్నట్లు గుర్తించిన మండల విద్యాశాఖాధికారి జయచంద్ర శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించి పాఠ్య పుస్తకాలు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రగతిశీల విద్యార్థి సంఘం నాయకుడు నరేంద్ర మాట్లాడుతూ... ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వేసవి సెలవుల్లో ముందస్తు అడ్మిషన్లు చేపట్టి రూ.వేలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రైవేట్గా ముద్రించిన పాఠ్య పుస్తకాలు విక్రయిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను లూటీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐఎస్బీ జిల్లా కార్యదర్శి పోతులయ్య, నాయకులు మురళి, సంద కిషోర్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. -
అతిసారం నివారణకు చర్యలు చేపట్టాలి
రొళ్ల: గ్రామాల్లో అతిసార వ్యాధి ప్రబలకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆరోగ్య, పంచాయతీ రాజ్శాఖ సిబ్బందికి జిల్లా వైద్యాధికారి డాక్టర్ మంజువాణి, జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి విజయ్కుమార్ సూచించారు. రొళ్ల మండలం కాకి గ్రామంలో అతిసార ప్రబలి నాలుగు రోజులుగా 30 మందికి పైగా బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం గ్రామంలో వైద్య శిబిరాన్ని నిర్వహించి, చికిత్సలు అందజేశారు. శుక్రవారం ఉదయం డీఎంహెచ్ఓ, డీపీఓ కాకి గ్రామాన్ని సందర్శించారు. మరింత వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై పంచాయతీరాజ్ శాఖ సిబ్బందికి అవగాహన కల్పించారు. రక్షిత మంచినీటి కొళాయిలు, ట్యాంకుల శుభ్రం, పైప్లైన్ లీకేజీ వంటి సమస్యలపై ఆరా తీశారు. వాంతులు, విరేచనాలు ఉధృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలకు ఆరోగ్య సూత్రాలపై చైతన్య పరచాలన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. గ్రామాల్లో వాటర్ స్కీమ్ పథకం కింద వచ్చే నీటిని కాకుండా మండల కేంద్రం నుంచి శుద్ధి చేసిన నీటిని ప్రతి ఇంటికీ రోజుకు 80 లీటర్ల చొప్పున ఐదారు రోజుల పాటు ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని సూచించారు. వ్యాధి తగ్గు ముఖం పట్టిన నేపథ్యంలో ఇంకా రెండు మూడు రోజుల పాటు వైద్య శిబిరాన్ని కొనసాగించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు లక్ష్మి, వైస్ సర్పంచ్ రాజు, జేసీఎస్ మండల కన్వీనర్ లోకేష్, నాయకులు బసవరాజు, యర్రగుంటప్ప, ఆర్డబ్ల్యూఎస్ డీఈ మనునాయక్, ఇన్చార్జ్ ఎంపీడీఓ ప్రసాద్, ఫుడ్ సేప్టీ ఆఫీసర్ తస్లీమ్, డాక్టర్ సౌందర్య, పీహెచ్ఎన్ సుధారాణి, ఈఓఆర్డీ క్రిష్ణప్ప, ఇన్చార్జ్ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ విజయ్, ఎంపీహెచ్ఈఓ ఖాదర్వలి, కార్యదర్శులు శ్రీనాథ్, రచన, ఆరోగ్య సిబ్బంది, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ మంజువాణి, డీపీఓ విజయ్కుమార్ -
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరి ఆత్మహత్య
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ధర్మవరంలో ఒకరు, జీవితంపై విరక్తితో మరొకరు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. ధర్మవరం అర్బన్/పుట్టపర్తి టౌన్: ధర్మవరంలోని గుట్టకిందపల్లి సమీపంలో పవర్లూమ్స్ మగ్గాల యజమాని శుక్రవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు తెలిపిన మేరకు... పట్టణంలోని మారుతీనగర్కు చెందిన వరప్రసాద్(30) బీటెక్ పూర్తి చేసి పవర్లూమ్స్ మగ్గాలు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఉత్పత్తి చేసిన చీరలు అన్సీజన్ కారణంగా అమ్ముడు పోక నష్టాలు చవిచూడాల్సి వచ్చింది. దీంతో మనస్తాపానికి గురైన వరప్రసాద్ శుక్రవారం ఉదయం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య మమత, ఓ కుమార్తె ఉన్నారు. ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ● పుట్టపర్తి ప్రశాంతి నిలయం రైల్వేస్టేషన్ సమీనంలో హరినాథ (26) అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. హిందూపురం డివిజన్ రైల్వే ఎస్ఐ బాలాజీనాయక్ తెలిపిన మేరకు... కొత్తచెరువులోని బీసీ కాలనీకి చెందిన లక్ష్మీదేవి, వెంకట్రాముడు దంపతుల కుమారుడు హరినాథ్(26) కొన్ని నెలలుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే మతిస్థిమితం కోల్పోయిన ఆయన శుక్రవారం ప్రశాంతి నిలయం రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టనట్లు రైల్వే పోలీసులు తెలిపారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
స్ట్రాంగ్ రూమ్ల తనిఖీ
ఏయూ డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల
అడ్డగోలుగా పార్కింగ్ చేస్తే.. అంతే
సరకు రవాణాలో సరికొత్త వ్యూహాలు
బాలికపై కేజీహెచ్ ఉద్యోగి లైంగిక వేధింపులు
India Meteorological Department: రాజస్తాన్లోని ఫలోదీలో 50 డిగ్రీల ఉష్ణోగ్రత
కేకే లైన్లో డీఆర్ఎం తనిఖీలు
జంతు సంరక్షణ చట్టం నోడల్ అధికారిగా ఏసీపీ శ్యామలరావు
కెమికల్ ఇంజినీరింగ్లో విస్తృత అవకాశాలు
తప్పక చదవండి
- ఇన్సూరెన్స్ లైసెన్స్ అప్లికేషన్ను విత్ డ్రా.. పేటీఎం మరో కీలక నిర్ణయం
- బ్యాంక్ల్లో ఇబ్బందులా?, ఆర్బీఐకి ఫిర్యాదు చేయండిలా..
- పిల్లల ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ఆరుగురి శిశువుల మృతి
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి అఖిలేష్?
- మరో ఎంపీ లండన్లో ఉన్నా.. నన్ను టార్గెట్ చేశారు: స్వాతి మలివాల్
- Malaysia Masters 2024: ఫైనల్లో పీవీ సింధు
- రాజ్కోట్లో పెను విషాదం
- ‘లైఫ్ ట్యాక్స్’కు ఎగనామం!
- Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం
- మీ ఇంటిని చక్కదిద్దుకోండి..!
Advertisement