-
కొనసాగుతున్న జిందాల్ కార్మికుల ఆందోళన
కొత్తవలస: మండలంలోని అప్పన్నపాలెం గ్రామ సమీపంలోని జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ కర్మాగారం కార్మికుల ఆందోళన రెండోరోజు శనివారం కొనసాగింది. కర్మాగార యాజమాన్యం ప్రకటించిన లే ఆఫ్కు నిరసనగా కర్మాగారం ఎదుట కార్మికులు ఆందోళన తలపెట్టారు. వీరికి వివిధ రాజకీయ పార్టీల నాయుకులు సంఘీభావం తెలిపారు. మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి శిబిరాన్ని సందర్శించి కార్మికులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జిల్లా లేబర్ కమిషనర్ ఎన్.సుబ్రహ్మణ్యం కార్మికుల డిమాండ్లను అడిగి తెలుసుకున్నారు. వైఎస్సార్ టీయూసీ కార్మిక సంఘం నాయకుడు నెక్కల నాయుడుబాబు ఆధ్వర్యంలో కార్మికులు సుబ్రహ్మణ్యంకు వినతి పత్రం అందజేశారు. కర్మాగారం మూసివేసినంత కాలం కార్మికులకు పూర్తిగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. -
సీబీఎస్ఈ సిలబస్ బోధనపై ముగిసిన శిక్షణ
విజయనగరం అర్బన్: జిల్లాలో సీబీఎస్ఈ సిలబస్ అమలు చేస్తున్న 63 పాఠశాలలకు చెందిన 200 మంది సబ్జెక్టు టీచర్లకు బోధనపై రెండు రోజులపాటు నిర్వహించిన శిక్షణ శనివారంతో ముగిసింది. విజయనగరం మోడల్ స్కూల్లో సాగిన శిక్షణ తరగతులకు ముఖ్య అతిథిగా ఆర్జేడీ బి.విజయభాస్కరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న అంశాలను బోధనలో అమలు చేయాలని సూచించారు. విద్యార్థులకు అర్థమయ్యేలా సులభ పద్ధతుల్లో బోధించాలని సూచించారు. అవగాహనాయుత విద్యకు ప్రాధాన్యమివ్వాలన్నారు. డీఈఓ ఎన్.ప్రేమకుమార్ పర్యవేక్షణలో సాగిన శిక్షణ తరగతుల్లో డిప్యూటీ ఈఓలు కె.వి.రమణ, కె.మోహనరావు, డీసీఈబీ కార్యదర్శి టి. సన్యాసిరాజు, జిల్లా కో–ఆర్డినేటర్ ఎస్.త్రినాథ రావు, జె.పద్మలత, జీసీడీఓ టి.మాలతి, స్టేట్ మోనటరింగ్ ఆఫీసర్ కె.ధర్మకుమార్, ఎల్ఎఫ్ఈ రీజనల్ కో–ఆర్డినేటర్ కె.రమేష్బాబు, ఏఎంఓ ప్రసాదరావు, తదితరులు పాల్గొన్నారు. -
సంతోషపురం పరిసరాల్లో ఏనుగులు
గరుగుబిల్లి: మండలంలోని సంతోషపురం పంచాయతీ పరిసరాల్లో ఏనుగుల గుంపు శనివారం దర్శనమిచ్చింది. గత కొన్నేళ్లుగా కురు పాం నియోజకవర్గంలోని గరుగుబిల్లి, కొమరాడ, జియ్యమ్మవలస, కురుపాం మండలాల్లో ఏనుగులు సంచరిస్తూ ఈ ప్రాంతీయులను కలవరపెడుతున్నాయి. గిజబ, నందివానివలస, తోటపల్లి గ్రామాల మీదుగా సంతోషపురం చేరుకోవడంతో అక్కడి రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు నాశనం చేసే అవకాశం ఉందని, అటవీశాఖ అధికారులు స్పందించి ఏనుగుల గుంపును ఈ ప్రాంతం నుంచి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. తగ్గిన మామిడి ఎగుమతులు ● తగ్గిన దిగుబడి ● పెరిగిన ధర లక్కవరపుకోట: మామిడి పండ్లకు గిరాకీ ఉన్నా రైతుల్లో సంతోషం కనిపించడం లేదు. ఈ ఏడాది మామిడి పంటకు వాతావరణం అనుకూలించక పోవడం, దిగుబడులు తగ్గడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎగుమతి చేసేంత పంట లేక దిగాలు పడుతున్నారు. జిల్లాలో సుమారుగా 43,662 హెక్టార్లో మామిడి పంట సాగుచేస్తున్నట్టు ఉద్యానశాఖ అధికారుల రికార్డులు చెబుతున్నాయి. అత్యధికంగా గంట్యాడ మండలంలో 4,091 హెక్టార్లు, లక్కవరపుకోటలో 1109, కొత్తవలసలో 2,488, ఎస్.కోటలో 424, వేపాడలో 1018, జామి మండలంలో 2,114 హెక్టార్లలో మామిడి పంట సాగులో ఉంది. వాతావరణం అనుకూలిస్తే హెక్టారుకు సగటున 9 టన్నుల పైబడి దిగుబడి వస్తుంది. గతేడాది దిగుబడులు బాగుండడంతో జిల్లా నుంచి సుమారు 5,67,600 మెట్రిక్ టన్నుల మాడి పండ్లు, కాయలను ఢిల్లీ, ముంబయి, కోల్కతా తదితర ప్రాంతాలకు ఎగుమతి చేశారు. ఇక్కడ సాగుచేసే బంగినపల్లి, సువర్ణరేఖ, తోటపూరి, రసాలకు అంతర రాష్ట్ర మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే, ఈ ఏడాది పంట దిగుబడులు తగ్గడంతో ఆశించిన మేర ఎగుమతులు లేవని రైతులు, వ్యాపారులు చెబుతున్నారు. చేతికందిన అరకొర పంటను ఎగుమతి చేస్తున్నట్టు తెలిపారు. -
ఆర్బీకేలకు వరి విత్తనాలు
రేగిడి: జిల్లాలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయి. వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. వరి వెదలు, నారు మడులను సిద్ధం చేస్తున్నారు. రైతులకు కావాల్సిన వరి విత్తనాలను సమకూర్చే పనిలో వ్యవసాయ అధికారులు నిమగ్నమయ్యారు. ఊరూరా రైతులకు అండగా ఉన్న రైతు భరోసా కేంద్రాలకు విత్తనాలను చేర్చుతున్నారు. తొలుత ఎంటీయూ–1121, స్వర్ణమసూరి విత్తనాలను సరఫరా చేస్తున్నట్టు రేగిడి ఏఓ మురళీకృష్ణ తెలిపారు. పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు సిద్ధంగా ఉన్నాయని, కావాల్సిన రైతులకు 50 శాతం రాయితీపై విక్రయిస్తామని చెప్పారు. -
పవర్ లిఫ్టింగ్ పోటీలకు జీఎంఆర్ ఐటీ విద్యార్థులు
రాజాం సిటీ: ఈ నెల 20 నుంచి 25 వరకు తమిళనాడులోని ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో జరగనున్న అంతర్ విశ్వవిద్యాలయాల పవర్ లిఫ్టింగ్ పోటీలకు స్థానిక జీఎంఆర్ ఐటీ విద్యార్థులు జేఎన్టీయూ జీవీ విజయనగరం తరఫున ఎంపికయ్యారని పీడీ బీహెచ్ అరుణ్కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జీఎంఆర్ ఐటీలో జరిగిన ఎంపికల్లో కళాశాలకు చెందిన బి.హరివిష్ణు 75 కిలోల విభాగంలోను.. డి.చైతన్యకుమార్ 150 కిలోల విభాగంలో ఎంపికయ్యారన్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్ డాక్టర్ సీఎల్వీఆర్ఎస్వీ ప్రసాద్, ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ జె.గిరీష్, స్టూడెంట్స్ డీన్ డాక్టర్ వి.రాంబాబు, విద్యార్థులు అభినందించారు. -
టీఎస్ ఈఏపీసెట్లో.. ర్యాంకుల పంట
● పాలకొండ విద్యా‘జ్యోతి’ విద్యల కొండ.. పాలకొండ అనే నానుడి మరో మారు రుజువయింది. పరీక్ష ఏదైనా ఈ ప్రాంత విద్యార్థులు ప్రతిభ చూపడం సాధారణం. శనివారం విడుదలైన తెలంగాణా ఈఏపీ సెట్లో పాలకొండ మండలం యరకరాయపురం గ్రామానికి చెందిన సతివాడ జ్యోతి రాదిత్య స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించి అబ్బుర పరిచాడు. విద్యార్థి తండ్రి సతివాడ మోహనరావు సాంఘిక సంక్షేమశాఖలో సీనియర్ అసిస్టెంట్ (ఎచ్చెర్ల)గా పనిచేస్తుండగా, తల్లి హైమావతి ఆర్టీసీలో విధులు నిర్వర్తిస్తున్నారు. పిల్లల చదువుల కోసం వీరు శ్రీకాకుళంలో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. వీరి కుమార్తె ఉషశ్రీ ఇప్పటికే ఎంబీబీఎస్ చదువుతుండగా, కుమారుడు ఆదిత్య విజయవాడలో ఇంటర్మీడియట్ చదివి 954 మార్కులు సాధించాడు. తెలంగాణా రాష్ట్రం నిర్వహించిన ఈఏపీ సెట్లో ఫస్ట్ర్యాంకు సాధించడంతో తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. ప్రణాళికా బద్ధంగా చదవడం వల్లే మంచి ర్యాంకు వచ్చినట్టు జ్వోతిరాదిత్య తెలిపాడు. విద్యార్థికి యరకరాయపురం వాసులు అభినందనలు తెలిపారు. ● చదువుల శ్రీనిధి తెలంగాణ ఈఏపీ సెట్లో ఇంజినీరింగ్ విభాగంలో స్టేట్ 10వ ర్యాంకు సాధించిన శ్రీనిధి స్వగ్రా మం కొమరాడ మండలం దళాయిపేట. ఆమె తల్లిదండ్రులు శ్రీనివాసరావు, గేదెల సుశీల ఇద్దరూ ఉపాధ్యాయులే. ఉద్యోగ రీత్యా విజయనగరం పట్టణంలో నివసిస్తున్నారు. శ్రీనిధి సీబీఎస్ఈలో 490/500మార్కులు సాధించింది. జేఈఈ మొయిన్స్లో ఆల్ఇండియా ఓపెన్ కేటగిరీలో 261, ఓబీసీలో 35వ ర్యాంకు సాధించింది. జేఈఈ మొయిన్లో బీఆర్ విభాగంలో రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ర్యాంకు సొంతం చేసుకుంది. పెద్దకుమార్తె ధనుకొండ సాయి సుదీప్తి కూడా ట్రిపుల్ ఐటీలో బీటెక్ ఫైనల్ ఇయిర్ చదవుతోంది. కుమార్తెలిద్దరూ చదువులో రాణిస్తుండడంతో తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. శ్రీనిధిపై గ్రామస్తులు అభినందనల జల్లు కురిపించారు. ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన విద్యార్థులు టీఎస్ ఈఏపీ సెట్లో ప్రతిభ చూపారు. ర్యాంకుల పంట పండించారు. ఇంజినీరింగ్ విభాగంలో పాలకొండ మండలం యరకరాయపురం గ్రామానికి చెందిన సతివాడ జ్యోతిరాదిత్య ప్రథమ ర్యాంకు, విజయనగరం పట్టణానికి చెందిన ధనుకొండ శ్రీనిధి పదో ర్యాంకు సాధించారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో బలిజిపేట మండలం చిలకలపల్లి గ్రామానికి చెందిన నగుదాసరి రాధాకృష్ణ రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకును సొంతం చేసుకున్నాడు. – విజయనగరం అర్బన్/కొమరాడ/పాలకొండ/బలిజిపేట చిలకలపల్లి కుర్రాడు సత్తా చూపాడు తెలంగాణా ఈఏపీ సెట్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో బలిజిపేట మండలం చిలకలపల్లి గ్రామానికి చెందిన నగుదాసరి రాధాకృష్ణ సత్తా చూపాడు. రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకు సాధించాడు. విద్యార్థి 9, 10 తరగతులు విశాఖలోని ఓ ప్రైవేటు పాఠశాలలో, ఇంటర్మీడియట్ రాజమండ్రిలోని ప్రైవేటు కళాశాలలో చదివాడు. తెలంగాణా ఈఏపీ సెట్లో ప్రతిభ చూపి కుటుంబ సభ్యులు, గ్రామస్తుల అభినందనలు అందుకున్నాడు. తల్లిదండ్రులు కృష్ణవేణి, నారాయణరావులది వ్యవసాయ కుటుంబం. ముగ్గురు పిల్లల్లో చిన్నవాడైన రాధాకృష్ణ చదువులో ప్రతిభ చూపడంతో తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. తాత, విశ్రాంత హెచ్ఎం ఎన్.వి.జగన్నాథం, అన్నదమ్ములు, మేనమామ ప్రోత్సాహం వల్లే ర్యాంకు సాధించగలిగినట్టు రాధాకృష్ణ తెలిపాడు. ఇంజినీరింగ్ విభాగంలో 1, 10 ర్యాంకులు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో రెండో ర్యాంకు సాధన విద్యార్థులపై అభినందనల జల్లు -
కిర్గిస్తాన్లో అల్లర్లు... ఆందోళనలో రాజాం వాసులు
రాజాం సిటీ: కిర్గిస్తాన్లో జరుగుతున్న అల్లర్లు రాజాం వాసులను కలవరపెడుతున్నాయి. రాజాం ప్రాంతానికి చెందిన 12 మంది విద్యార్థులు ఆ దేశంలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుతం రష్యాలోని కిర్గిస్తాన్లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో తల్లిదండ్రులు ఒకింత ఆందోళనకు గురతున్నారు. పట్టణ పరిధి బాబానగర్, వాసవీనగర్, శ్రీకాకుళం రోడ్డు, అమ్మవారికాలనీ, లక్ష్మీపురం, లింగాలవలస ప్రాంతాలకు చెందిన ఎస్.భార్గవ్నాయుడు, టి.వినయ్, సీహెచ్ సురేంద్ర, బి.గ్రీష్మ, జి.సోమేశ్వరరావు తదితర విద్యార్థులు అక్కడ చదువుతున్నారు. ఆయా విద్యార్థులతో తల్లిదండ్రులు ఫోన్లో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పరిస్థితిలను అడిగితెలుసుకుంటున్నారు. అక్కడ ఉన్న విద్యార్థులంతా క్షేమంగానే హాస్టల్లో ఉన్నామంటూ చెబుతున్నా.. తల్లిదండ్రుల్లో టెన్షన్ తగ్గడంలేదు. మరో నెల రోజుల్లో కోర్సులు పూర్తిచేసుకుని వచ్చే సమయంలో ఇలా జరగడం ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం కల్పించుకుని ముందస్తు చర్యగా మా పిల్లలకు రక్షణ కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు రామకృష్ణ, ఉమామహేశ్వరరావు, కె.కృష్ణంనాయుడు, సూర్యనారాయణ కోరారు. -
యూజేఎఫ్ హ్యాండ్బుక్ ఉపయుక్తం..
విజయనగరం అర్బన్: ఆరు జిల్లాల సమగ్ర సమాచారంతో రూపొందించిన పుస్తకాన్ని ఉత్తరాంధ్ర జర్నలిస్ట్స్ ఫ్రంట్ (యూజేఎఫ్) రూపొందించిందిని, ఈ పుస్తకం జర్నలిస్టులకే కాకుండా ప్రతి ఒక్కరికీ ఉపయుక్తంగా ఉంటుందని సమాచార, పౌర సంబంధాల విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ డి.రమేష్ అన్నారు. యూజేఎఫ్ 2024 – 25 వార్షిక హ్యాండ్బుక్ను శనివారం ఆయన కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యూజేఎఫ్ అధ్యక్షుడు డాక్టర్ ఎంఆర్ఎస్ వర్మ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం తీసుకువస్తున్న ఈ హ్యాండ్బుక్ ప్రతి ఒక్కరికీ ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో ఏపీఆర్ఓ జానకమ్మ, యూజేఎఫ్ ప్రతినిధులు కె.శ్రీనివాస్, డి.హరనాథ్, ఎం.గణపతి, డి.శివకుమార్రెడ్డి, ఎస్.నారాయణరావు, భరత్కుమార్, బి.ఫల్గుణరావు, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. పౌరసంబంధాల శాఖ ఎ.డి రమేష్ -
ఆన్లైన్ మూల్యాంకనంపై అవగాహన
రాజాం సిటీ: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ మూల్యాంకనం ఈ ఏడాది నుంచి ఇంటర్మీడియట్ బోర్డు ఆధ్వర్యంలో ఆన్లైన్లో నిర్వహించనున్నట్టు ఆర్ఐఓ ఎం.ఆదినారాయణ స్పష్టంచేశారు. స్థానిక చైతన్య పాఠశాలలో పట్టణంలోని ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాల్స్, సిబ్బందికి ఆన్లైన్ విధానంపై శనివారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు ఆఫ్లైన్ విధానంలోనే మూల్యాంకనం జరిగిందని, ఆ సమయంలో రోజుకు 30 పేపర్లు మాత్రమే ఉండేవని, ఆన్లైన్ విధానంలో 60 పేపర్లు మూల్యాంకనం చేయాల్సి ఉంటుందన్నారు. దీనికోసం కంప్యూటర్ నాలెడ్జ్తో అధ్యాపకులు అందరూ సన్నద్ధం కావాలని సూచించారు. ఏటా అన్ని పరీక్షలకు సంబంధించి ఆన్లైన్లోనే మూల్యాంకనం జరుగుతుందన్నారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24 నుంచి జరగనున్నట్టు వెల్లడించారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అరగంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. జిల్లాలో ప్రథ మ సంవత్సరం పరీక్షలను 42 కేంద్రాల్లో నిర్వహించనున్నామని, 14,904 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాల్సి ఉందని పేర్కొన్నారు. ద్వితీయ సంత్సరం పరీక్షలకు సంబంధించి 21 కేంద్రాలను కేటాయించగా 7,927 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. ఇంటర్మీడియట్ ప్రవేశాలకు అడ్మిషన్లు జరుగుతున్నాయని తెలిపారు. ఈ నెల 15 నుంచి జూన్ 1 వరకు మొదటి విడత, జూన్ 10 నుంచి జూలై 1 వరకు రెండో విడత అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేశామని పేర్కొన్నారు. జిల్లాలో హైస్కూల్ ప్లస్గా ఆరు పాఠశాలలు ఎంపికయ్యాయని తెలిపారు. వీటిలో జామి, బొండపల్లి, గరివిడి, రామభద్రాపురం, బొబ్బిలి, ఆర్.ఆమదాలవలస మండలాలు ఉన్నాయన్నారు. విద్యార్థులు త్వరపడి ఆయా కళాశాలల్లో ప్రవేశాలు పొందాలని కోరారు. 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలో హాజరుకానున్న 22,831 మంది ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు ఆర్ఐఓ ఎం.ఆదినారాయణ -
కన్యకా పరమేశ్వరికి ప్రత్యేక పూజలు
విజయనగరం టౌన్: వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి శనివారం వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అమ్మవారు బంగారు చీర, వజ్ర కీరీటంతో భక్తులకు దర్శనమిచ్చారు. సుప్రభాత సేవ, మహాగణపతి పూజ, గణపతి హోమం, పుణ్యాహవచనం, సూర్య నమస్కారాలు, వాసవీ మూల మంత్ర జప సహిత హోమం, ఆయుష్య హోమం, పునర్వసు నక్షత్ర జపం, మహాన్యాసపూర్వక మహాలింగార్చన, సుందరకాండ పారాయణ, చండీహోమం, శ్రీదేవీ సప్తసతి పారాయణం, 108 కలశాలతో వాసవీమాతకు అభిషేకం చేపట్టారు. ఆర్యవైశ్య సంఘ జిల్లా అధ్యక్షుడు కుమ్మరిగుంట శ్రీనివాసరావు, వరలక్ష్మీ దంపతుల సౌజన్యంతో మధ్యాహ్నం అన్నసమారాధన నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి ఊంజల్ సేవ చేశారు. ఆలయ కమిటీ గౌరవాధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి ఉత్సవంలో పాల్గొని, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే గజవాహనంపై అమ్మవారి తిరువీధి ఉత్సవాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవం .. విజయనగరం టౌన్: కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్యుల ఆరాధ్య దైవమని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. శనివారం సాయంత్రం ఆయన అమ్మవారిని దర్శించుకుని, శోభాయాత్రను ప్రారంభించారు. స్థానిక ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు కిలో బంగారంతో తయారు చేయించిన చీరను డిప్యూటీ స్పీకర్ కోలగట్ల, ఆయన సతీమణి రమణి చేతుల మీదుగా అమ్మవారికి సమర్పించారు. ఆయన వెంట దేవస్థానం కమిటీ చైర్మన్ నారాయణం శ్రీనివాసరావు, ప్రతినిధులు కుమ్మరిగుంట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు
విజయనగరం క్రైమ్: లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యే విధంగా పోలీసులు చర్యలు చేపట్టాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కె.విజయ కల్యాణి అధికారులకు సూచించారు. శనివారం స్థానిక న్యాయ సేవాసదన్లో ఉమ్మడి జిల్లాలైన విజయనగరం, పార్వతీపురం పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న సీఐలు, ఎస్సైలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కాంపౌండబుల్ క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. రాబోయే జాతీయ లోక్అదాలత్లో ఎక్కువ సంఖ్యలో కేసులను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, నాయసేవాధికార సంస్ధ సిబ్బంది పాల్గొన్నారు. సీనియర్ సివిల్ జడ్జి విజయ కల్యాణి -
3,200 కిలోల పీడీఎస్ బియ్యం పట్టివేత
బొబ్బిలి: పట్టణం నుంచి పిరిడి వెళ్లే రహదారి జంక్షన్ వద్ద 3,200 కిలోల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు సీఎస్డీటీ అల్లు స్వర్ణలత తెలిపారు. శనివారం సాయంత్రం తమకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించగా.. పిరిడి గ్రామానికి చెందిన రేపాక శ్రీనివాసరావుకు చెందిన బియ్యంగా గుర్తించినట్టు సీఎస్డీటీ చెప్పారు. దాడుల్లో విజిలెన్స్ ఎస్సై రామారావు, సిబ్బంది లక్ష్మీనారాయణ, ఈశ్వర్ పాల్గొన్నారు. 21న అండర్ –16 జిల్లా క్రికెట్ జట్టు ఎంపికలు విజయనగరం: జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 21న అండర్ –16 బాలుర క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు ఎంఎల్ఎన్ రాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని విజ్జి స్టేడియంలో జరిగే ఎంపిక పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు 2008 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించిన వారై ఉండాలని పేర్కొన్నారు. అలాగే పోటీలకు హాజరయ్యే వారు ఒరిజినల్ ఆధార్కార్డు, జన్మదిన ధ్రువపత్రం, మూడేళ్ల స్టడీ సర్టిఫికెట్స్ తీసుకొని రావాలన్నారు. ఎంపికలు నిర్వహించే రోజు ఉదయం 6.30 గంటలకు వైట్ డ్రెస్, సొంత కిట్తో హాజరు కావాలని కోరారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు త్వరలో జరగనున్న జోనల్ స్థాయి పోటీల్లో జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తారని తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు బొండపల్లి: మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. డెంకాడకు చెందిన కనకల సత్యం (55) బొండపల్లి నుంచి విజయనగరం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో సత్యం తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు స్పందించి జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. తస్యం ఆర్టీలో విధులు నిర్వహిస్తున్నాడని ఎస్సై లక్ష్మణరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. చెత్తబుట్టలో పసికందు మృతదేహం విజయనగరం క్రైమ్: నెలలు నిండని పసికందు మృతదేహం చెత్తబుట్టలో పడేసిన సంఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... సుమారు ఐదారు నెలల వయసున్న ప్రీ మెచ్యూర్డ్ బేబీ మృతదేహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు బాక్సులో పెట్టి గంటస్తంభం సమీపంలో ఉన్న కార్పొరేషన్ చెత్తబుట్టలో శనివారం రాత్రి పడేశారు. చెత్త వేసేందుకు వెళ్లిన కొందరికి రక్తపు చారలు కనపడడంతో బాక్స్ ఓపెన్ చేసి చూడడంతో మృతదేహం బయటపడింది. దీంతో వెంటనే టూటౌన్ పోలీసులకు సమాచారమిచ్చారు. కొద్ది గంటల వ్యవధిలోనే ఎవరో తెచ్చి పడేసి ఉంటారని పోలీసులు, స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టూటౌన్ ఎస్సై దుర్గాప్రసాద్ పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించామని, సీసీ పుటేజ్ పరిశీలించి బాధితులపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ కోరాడ రామారావు తెలిపారు. మృతదేహం గుర్తింపు సీతంపేట: మండలంలోని పులిపుట్టి ఎర్రచెరువు వద్ద హత్యకు గురైన మహిళను ఒడిశా వాసిగా గుర్తించినట్లు పాలకొండ సీఐ ఎం. చంద్రమౌళి, ఎస్సై జగదీష్నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా వారు శనివారం విలేకరులతో మాట్లాడుతూ, డీఎస్పీ జీవీ కృష్ణారావు ఆదేశాల మేరకు పోలీసులు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారన్నారు. ఇందులో ఒక బృందం ఒడిశా వెళ్లి విచారణ చేయగా.. మృతురాలు గజపతినగరం జిల్లా గుమ్మ మండలం రుగడ గ్రామానికి చెందిన బుయన్ రుతగా గుర్తించారని చెప్పారు. -
దరఖాస్తుల ఆహ్వానం
పార్వతీపురం టౌన్: రాష్ట్ర సేవాధికార సంస్థకు మధ్యవర్తిత్వం (మీడియేటర్లు) వహించుటకు ఆసక్తిగల వ్యక్తుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విజయనగరం జిల్లా సేవాధికార సంస్థ కార్యదర్శి, సివిల్ జడ్జి కె. విజయకల్యాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన వ్యక్తులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్హులైన వ్యక్తులను ఎం ప్యానల్మెంట్ జాబితాలో చేర్చడం జరుగుతుందని, మే 25వ తేదీలోగా దరఖాస్తులు సమర్పించాలని కోరారు. విశ్రాంత న్యాయాధికారులు, బ్యూరోక్రాట్లు, న్యాయవాదులు, ఆచార్యు లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, మహిళా సంఘాల సభ్యులు, వివిధ రంగాలలో నిష్ణాతులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రేపటి నుంచి కౌన్సెలింగ్ సీతానగరం: ఏపీ గిరిజన సంక్షేమ ప్రతిభా గురుకుల పాఠశాల, కళాశాలల్లో ప్రవేశాలకు సోమవారం నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు జోగింపేట గిరిజన ప్రతిభా విద్యాలయం ప్రిన్సిపాల్ పోల వెంకటినాయుడు అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్వతీపురం మన్యం జిల్లాలోని గిరిజన గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశాలకు జోగింపేటలో పాఠశాలలో కౌనెల్సింగ్ నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ 7న నిర్వహించిన ప్రవేశ పరీక్షలో అర్హులైన అభ్యర్థులు కౌన్సెలింగ్కు హాజరుకావాల్సి ఉంటుందన్నారు. ఇప్పటికే అభ్యర్థులకు ఫోన్ ద్వారా, కాల్లెటర్ల ద్వారా సమాచారం అందించామని తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు జోగింపేట స్కూల్ ఆఫ్ ఎక్స్లెన్స్లో 8వ తరగతి, ఇంటర్మీడియట్లో.. మల్లి (పీజీటీ) కాలేజ్ ఆఫ్ ఎక్స్లెన్స్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తామన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చమగోదావరి, కృష్ణ ఉమ్మడి జిల్లాలకు చెందిన గిరిజన బాలురు కౌన్సిలింగ్కు హాజరుకావాలని కోరారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్తో హాజరుకావాలన్నారు. వివరాలకు 94909 57218, 94401 03332 నంబర్లను సంప్రదించాలని కోరారు. చెరువులో పడి బాలుడి మృతి దత్తిరాజేరు: చెరువులో పడి చిన్నారి మృతి చెందిన సంఘటన మండలంలోని ఆర్. రామచంద్రాపురంలో శనివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్. బూర్జవలస ఎస్సై లక్ష్మీ ప్రసన్నకుమార్ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన మండాది గౌతం (10) తోటి స్నేహితులతో కలిసి మల విసర్జనకు పప్పల చెరువుకు వెళ్లాడు. ఈ క్రమంలో కాలు జారి చెరువులో పడిపోవడంతో తోటి స్నేహితులు బయటకు తీసి విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. వెంటనే స్థానికులు చేరుకుని 108 సిబ్బందికి ఫోన్ చేయగా... వారు వచ్చి పరిశీలించారు. అయితే అప్పటికే చిన్నా రి మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించారు. తల్లి మృతి చెందడంతో గౌతం తాత ఇంటి వద్దనే ఉంటూ చదువుకుంటున్నాడు. మృతుడి తాత సాంబ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
24వ తేదీ నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
పార్వతీపురం: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి జూన్ 3 వరకు నిర్వహిస్తామని జిల్లా రెవెన్యూ అధికారి జి. కేశవనాయుడు అన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్లో పదో తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సప్లిమెంటరీ పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. పార్వతీపురం డీవీఎంఎం ఉన్నత పాఠశాల, సాలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్షలకు 659 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, పరీక్ష కేంద్రాల్లో కనీస సౌకర్యాలైన తాగునీరు, వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకునే విధంగా బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయని, తదనుగుణంగా బస్సులు నడపాలన్నారు. విద్యుత్ అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. పరీక్ష పేపర్లు నిర్దేశిత కేంద్రాలకు పంపించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని పోస్టల్ సిబ్బందని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ శాఖకు సూచించారు. ఓపెన్ స్కూల్ పరీక్షలకు 384 మంది.. ఓపెన్ స్కూల్ పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 384 మంది హాజరు కానున్నారని జిల్లా రెవెన్యూ అధికారి కేశవనాయుడు తెలిపారు. పార్వతీపురం కేవీఎం పాఠశాలలో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అలాగే ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షలు పార్వతీపురం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జరుగుతాయని.. ఈ పరీక్షలకు 288 మంది హాజరు కానున్నారని చెప్పారు. ఓపెన్ స్కూల్ పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయన్నారు. సమావేశంలో పరీక్షల సహాయ కమిషనర్ సుధాకర్, వైద్యారోగ్యశాఖ అధికారి ఎం. వినోద్, ఆర్టీసీ సహాయ మేనేజర్ బి. కృష్ణమూర్తి, సబ్ ఇన్స్పెక్టర్ సంతోష్కుమార్, పోస్టల్ ఇన్స్పెక్టర్, తదితరులు పాల్గొన్నారు. డీఆర్ఓ కేశవనాయుడు -
ఆయుష్షు పెరుగుతోంది..
● ఆస్పత్రుల్లో ‘జగనన్న హృదయ స్పందన’ ● గుండె నొప్పితో వచ్చే వారికి ప్రత్యేక చికిత్స ● గతేడాది సెప్టెంబర్ నెల నుంచి జిల్లాలో కార్యక్రమం అమలు ● సీహెచ్సీ, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో సేవలు.. ● రూ. 25 వేల విలువ చేసే ఇంజిక్షన్ ఉచితం ● సకాలంలో చికిత్స అందడంతో నిలుస్తున్న ప్రాణాలు విజయనగరం ఫోర్ట్: మానవుని జీవన శైలిలో మార్పులు చోటుచేసుకోవడం వల్ల వయసుతో సంబంధం లేకుండా అనేక మంది గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ఒకేచోట కూర్చోని గంటల తరబడి పనిచేయడం.. వ్యాయామం చేయకపోవడం.. జంక్ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ వంటివి ఎక్కువుగా తినడం వల్ల గుండె జబ్బులకు గురవుతున్నారు. గతంలో 50, 60 ఏళ్లు పైబడిన వారు గుండె జబ్బుల బారిన పడేవారు. కాని ఇప్పడు 25, 30 ఏళ్లకే గుండె జబ్బుల బారిన పడుతున్నారు. గుండె నొప్పి (హార్ట్ ఎటాక్) వచ్చే సమయంలో సకాలంలో (గోల్డన్ అవర్) చికిత్స అందించగలిగితే ప్రాణాపాయం తప్పుతుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గుండెనొప్పి, గుండె జబ్బుల బారిన పడిన వారికి సకాలంలో చికిత్స అందించి ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో జగనన్న హృదయ స్పందన అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో ఎంతోమంది ప్రాణాలు నిలబడుతున్నాయి. జగనన్న హృదయ స్పందన కార్యక్రమంలో అందించే సేవలు.. జగనన్న హృదయ స్పందన కార్యక్రమాన్ని జిల్లా ఆస్పత్రి, ఏరియా ఆస్పత్రి, సీహెచ్సీల్లో అమలు చేస్తున్నారు. ప్రతి ఆస్పత్రిలోనూ ప్రత్యేకమైన బెడ్ ఏర్పాటు చేశారు. ఛాతి నొప్పితో గాని అలసటతో గాని బాగా నీరసంతో గాని వచ్చే వారికి ఈసీజీ తీస్తారు. ఆ ఈసీజీ రిపోర్టును కార్డియాలజిస్ట్ ఉన్న ఆస్పత్రికి యాప్ ద్వారా పంపిస్తారు. వెంటనే ఆ రిపోర్టును కార్డియాలజిస్ట్ పరిశీలించి అవసరం ఉంటే రూ.25 వేల విలువ చేసే టీపీఏ ఇంజిక్షన్ ఇవ్వాలని సూచిస్తారు. వెంటనే సిబ్బంది ఇంజిక్షన్ ఇచ్చి, రోగి కోలుకున్న తర్వాత అవసరం అనుకుంటే కార్డియాలజిస్ట్ ఉన్న ఆస్పత్రికి రిఫర్ చేస్తారు. అక్కడ స్టంట్ వేయలా.. సర్జరీ చేయాలా, లేదా అన్నది నిర్ణయిస్తారు. వైద్యులు, సిబ్బందికి శిక్షణ.. గుండె సమస్య ఉన్న వారికి ఇచ్చే టీపీఏ ఇంజిక్షన్ ఏ విధంగా వేయాలన్న దానిపై వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ప్రభుత్వ వైద్య కళశాలలో శిక్షణ ఇచ్చారు. గతేడాది సెప్టెంబర్ నెలలో జగనన్న స్పందన హృదయ స్పందన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటి వరకు 65 మందికి టీపీఏ ఇంజిక్షన్ ఇచ్చారు. సకాలంలో చికిత్స అందడం వల్ల చాలా మంది ప్రాణాలు నిలబడ్డాయి. అందుబాటులో ఇంజిక్షన్లు.. ప్రతి ఆస్పత్రిలోనూ టీపీఏ వైల్స్ రెండు, మూడింటిని అందుబాటులో ప్రభుత్వం ఉంచింది. ఒక్కో ఇంజిక్షన్ ఖరీదు రూ. 25 వేలు కావడంతో దుర్వినియోగం కాకుండా వైద్యాధికారులు సక్రమంగా వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఆస్పత్రిలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయడంతో రోగులకు ఈసీజీ, టీపీఏ ఇంజిక్షన్లు ఇచ్చే విధానంపై ఉన్నతాధికారులు పరిశీలిస్తుంటారు. -
స్ట్రాంగ్రూమ్ల వద్ద మూడంచెల భద్రత
విజయనగరం క్రైమ్: సార్వత్రిక ఎన్నికల తర్వాత ఈవీఎంలను భద్రపరిచిన లెండి, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలల వద్ద భద్రతా ఏర్పాట్లను ఎస్పీ ఎం.దీపిక శనివారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈవీఎంలను భద్రపరిచిన ఇంజినీరింగ్ కళాశాలల వద్ద కేంద్ర బలగాలు, ఆర్మ్డ్ రిజర్వు, సివిల్ పోలీసులతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా కళాశాలలకు వెళ్లే మార్గాల్లో వాహన తనిఖీలు చేపట్టి, వాహనాలలో వెళ్లే వ్యక్తుల వివరాలను రిజిస్టర్లో నమోదు చేస్తున్నామని చెప్పారు. ఈవీఎంల భద్రతను అదనపు ఎస్పీ, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు నిరంతరం పర్యవేక్షిస్తుంటారన్నారు. ఎస్పీ దీపిక -
‘మిల్లెట్ సిస్టర్స్’ ఆదర్శం
సాక్షి, అమరావతి: నిజ జీవితంలో పేదరికం, సామాజిక, లింగ వివక్ష వంటి రుగ్మతలను సమర్థంగా ఎదుర్కొని తోటి మహిళలకు ఆదర్శంగా నిలిచిన విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన సరస్వతి మల్లువలస జాతీయ స్థాయి పురస్కారానికి ఎంపికయ్యారు. సీఐఐ ఫౌండేషన్ మహిళా సాధికారతను ప్రోత్సహించడంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం, సామాజిక లింగ – ఆధారిత వివక్షను ఎదుర్కొన్న అట్టడుగు మహిళా నాయకులను గుర్తించి ఎగ్జంప్లర్ పేరుతో అవార్డునిస్తోంది. ఇందులో భాగంగా సీఐఐ వుమెన్ ఫౌండేషన్ 19వ ఎడిషన్లో సూక్ష్మ మధ్య చిన్నతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) రంగంలో సరస్వతి ఎంపిక కాగా శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక బిజినెస్ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ అవార్డును అందించారు. మొత్తం మూడు విభాగాల్లో అవార్డులను ప్రకటించగా విద్యారంగం నుంచి మహారాష్ట్రకు చెందిన రంజిత పవార్, ఆరోగ్యరంగంలో బిహార్కు చెందిన రుమీ పర్వీన్, ఎంఎస్ఎంఈ రంగంలో మన రాష్ట్రానికి చెందిన సరస్వతి ఎంపికయ్యారు. అవార్డు గ్రహీతలకు ట్రోఫీ, సర్టిఫికెట్తో పాటు రూ.మూడు లక్షల నగదును అందజేశారు. ఈ అవార్డు కోసం దేశవ్యాప్తంగా మొత్తం 300మంది పోటీపడగా వాటిలో తుది పోటీకి 16మందిని ఎంపిక చేసి స్వయంగా వెళ్లి పరిశీలించి, వారిని ఇంటర్వ్యూ చేసి ఎంపిక చేసినట్లు సీఐఐ శుక్రవారం పేర్కొంది. మహిళా రైతులతో నెట్వర్క్విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన సరస్వతి మల్లువలస నిజజీవితంలో గృహ హింస, లింగ వివక్షను ఎదుర్కొన్నారు. ఆహార భద్రత, ఆర్థిక అవసరాల కోసం ఇతరులపై ఆధారపడాల్సి రావడమే ఈ వివక్షకు ప్రధాన కారణమని గుర్తించిన ఆమె ఇంకెవ్వరూ ఇలాంటి కష్టాలు ఎదుర్కోకూడదని మిల్లెట్ సిస్టర్స్ పేరుతో చిన్న స్థాయి మహిళా రైతుల నెట్వర్క్ను స్థాపించారు. దీని ద్వారా 20,000 మంది మహిళలకు ఆదాయాన్ని మెరుగుపర్చేలా జీవనోపాధిని కల్పించి ఆదర్శంగా నిలిచారు. మహిళా సాధికారితలో అయిదు ‘ఈ’లు ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ, ఎంప్లాయిమెంట్, ఎకనావిుక్ డెవలప్మెంట్, ఎంపవర్మెంట్ ప్రధానమైనవిగా గుర్తించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సీఐఐ 19వ ఎడిషన్లో ఎంపికైన 16 మందితో కలిపి ఇప్పటి వరకు 120 కంటే ఎక్కువ మందిని గుర్తించామని, వీరి ద్వారా 30 లక్షల మంది జీవితాల్లో స్పష్టమైన మార్పులను గమనిస్తున్నట్లు సీఐఐ పేర్కొంది. -
సంతోషి మృతికి టీడీపీ నాయకులే కారణం
విజయనగరం రూరల్: నిష్పక్షపాతంగా ప్రజలకు ఐదేళ్లపాటు సేవలందించిన గ్రామ వలంటీర్ బొబ్బాది సంతోషి మృతికి కారణమైన టీడీపీ నాయకులు ఆమె కుటుంబానికి రూ.కోటి నష్ట పరిహారం చెల్లించాలని దుప్పాడకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, గ్రామ వలంటీర్లు డిమాండ్ చేశారు. విజయనగరం మండలం దుప్పాడ గ్రామ సచివాలయం పరిధిలో వలంటీర్గా సేవలందిస్తున్న బొబ్బాది సంతోషి (36) శుక్రవారం గుండెపోటుతో మరణించింది. వైఎస్సార్సీపీ నాయకులు, గ్రామ వలంటీర్లు ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు. శ్మశానం సమీపంలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. టీడీపీ నేతల రాజకీయ కక్ష సాధింపులే సంతోషి మృతికి కారణమన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున సంతోషి ప్రచారం చేసిందంటూ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు అధికారులకు తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు. వారి ఫిర్యాదుతో విజయనగరం ఎంపీడీఓ విచారణ చేయకుండానే ఏకపక్షంగా చర్యలకు ఉపక్రమించడం.. పోలీసులు విచారణ పేరిట ఆమెకు ఫోన్లు చేయడం, పుట్టుమచ్చలు అడగడంతో పేద కుటుంబానికి చెందిన సంతోషి ఆందోళనకు గురై గుండెపోటుతో మరణించిందని ఆరోపించారు. ముఖ్యంగా మహిళా వలంటీర్లపైనే టీడీపీ నాయకులు ఫిర్యాదులు చేసి వేధింపులకు గురి చేశారన్నారు. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్న వలంటీర్ మరణానికి కారణమైన టీడీపీ నాయకులు ఆమె కుటుంబానికి తక్షణమే పరిహారం చెల్లించాలన్నారు. ఆమె కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు, జొన్నవలస పీఏసీఎస్ అధ్యక్షుడు కెల్ల త్రినాథ్, వైస్ సర్పంచ్ బద్రి భాస్కరనాయుడు, వైఎస్సార్సీపీ నాయకులు కరుమజ్జి రామలప్పుడు, చందక పరుశురాం, మాజీ ఉప సర్పంచ్ పైడిరాజు, గ్రామ వలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు. ఆమె కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలి వైఎస్సార్ సీపీ నాయకులు, దుప్పాడ గ్రామ వలంటీర్ల డిమాండ్ -
19 నుంచి వార్షిక కల్యాణ మహోత్సవాలు
గరుగుబిల్లి: తోటపల్లిలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఈనెల 19వ తేదీ నుంచి శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక కల్యాణ మహోత్సవాలు నిర్వహించనున్నట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి వి.వి.సూర్యనారాయణ తెలిపారు. ఈనెల 19 నుంచి 23 వరకు పాంచాణిక దీక్షతో ఆలయ అర్చకులు వి.వి.అప్పలాచార్యులు ఆధ్వర్యంలో శ్రీ కోదండ రామస్వామి వార్షిక కల్యాణ మహోత్సవం ఘనంగా జరుగుతుందన్నారు. కల్యాణ మహోత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. లెక్కలు చూపకుంటే చిక్కులే ● ఎన్నికల బరిలో నిల్చున్న అభ్యర్థులు ఖర్చు వివరాలు చెప్పాల్సిందే.. విజయనగరం: సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. అలా అని పోటీచేసిన అభ్యర్థులు రిలాక్స్ అయిపోదామంటే కుదరదు. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ నుంచి ప్రచారం పూర్తయ్యే వరకు ఎన్నికల ఖర్చును అభ్యర్థులు పక్కాగా ఎన్నికల సంఘానికి చూపాల్సిందే. లేకుంటే భవిష్యత్తులో చిక్కులు తప్పవు మరి. శాసనసభ ఎన్నికలకు ఎంత ఖర్చు చేయాలి, లోక్సభ ఎన్నికలకు ఎంత ఖర్చు చేయాలన్నది ప్రజాప్రాతినిథ్య చట్టం 1951 చట్టం సెక్షన్ 19లో వివరించారు. ప్రస్తుత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న అభ్యర్థి వ్యయ పరిమితి రూ.40 లక్షలుగా, ఎంపీ స్థానానికి పోటీచేసే అభ్యర్థి వ్యయ పరిమితి రూ.95 లక్షలుగా ఎన్నికల సంఘం నిర్ణయించింది. అభ్యర్థులు చేసే ఖర్చుపై వివరాలను ఎప్పటికప్పుడు షాడో అబ్జర్వేషన్ రిజిస్టర్లో నమోదు చేస్తుంటారు. నిర్ణీత వ్యయ పరిమితికి మించి ఒక్క రూపాయి ఖర్చు దాటి నా, అందుకు సంబంధించిన లెక్కలను సరైన ఆధారాలతో సమర్పించాలి. అలా, చూపకుంటే ప్రజాప్రాతినిథ్య చట్టం 1951 సెక్షన్ 10ఏ ప్రకారం పోటీ చేసిన వ్యక్తి అభ్యర్థిత్వాన్ని ఎన్నికల సంఘం రద్దు చేసే అవకాశం ఉంటుంది. దీంతో పాటు వచ్చే మూడేళ్ల పాటు స్థానిక, శాసనసభ ఎన్నికలు సహా ఏ ఎన్నికల్లోనూ పోటీ చేసేందుకు అవకాశం లేకుండా అనర్హత వేటు వేస్తుంది. ధైర్యలక్ష్మికి అభిషేకం విజయనగరం రూరల్: భారతీయ తత్వ దర్శన కేంద్రం శ్రీ క్షేత్రంలో కొలువైన అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ధైర్యలక్ష్మి అమ్మవారికి శుక్రవారం పంచామృతాభిషేకం చేశారు. ఆలయ అర్చకులు చామర్తి రమేష్ ఆచార్యులు, చామర్తి శ్రీనివాస రమేష్ ఆచార్యులు సంయుక్తంగా వేదమంత్రాల నడుమ ధైర్యలక్ష్మికి పంచామృతాభిషేకాలు, అర్చన, ప్రత్యేక పూజలు జరిపారు. అమ్మవారిని ఆలయ ధర్మకర్తలు దుర్గా బాలాజీ, ఉమాదేవి దంపతులతో పాటు వందలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ఒడిశా సరిహద్దుకు ఏనుగులు భామిని: ఏనుగుల గుంపు వంశధార నది ఆవల ఒడిశా సరిహద్దు గ్రామాలకు శుక్రవారం తరలివెళ్లాయి. ఒడిశా కాశీనగర్ బ్లాక్ బూదర, బొత్తవ, గొరిబంద గ్రామాల సమీపంలోకి ఏనుగుల గుంపు చేరుకున్నాయి. భామిని మండలం తాలాడ సమీపంలోని తోటలో కొద్ది నెలలుగా తిష్టవేసిన నాలుగు ఏనుగుల గుంపు తరలివెళ్లడంతో తాలాడ, బాలేరు, ఘనసర, కీసర, కోసలి గ్రామాల రైతులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ
విజయనగరం అర్బన్: నిరుద్యోగ యువకులకు ఉపాధి కలిగించే పలు కోర్సులకు ఉచిత శిక్షణ తరగతులను స్థానిక మహిళా ప్రాంగణంలోని స్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ వసతి గృహంలో నిర్వహించనున్నారు. కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్, హౌస్ వైరింగ్, సెల్ఫోన్ రిపేరింగ్ అండ్ సర్వీసెస్ వంటి కోర్సుల్లో 30 రోజులు శిక్షణ ఇస్తారు. వసతి, భోజన సౌకర్యాలను ఉచితంగా కల్పిస్తారు. తెలుపుకార్డు కలిగిన 45 ఏళ్లలోపు వయస్సుగల గ్రామీణ ప్రాంత మహిళలు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఆసక్తిగల అభ్యర్థులు వచ్చేనెల 1వ తేదీ లోగా దరఖాస్తులను కార్యాలయానికి పంపాలని సంస్థ డైరెక్టర్ రమణ కోరారు. పూర్తి వివరాల కోసం సెల్: 99595 21662, 99857 87820 నంబర్లను సంప్రదించాలన్నారు. ● వచ్చేనెల 1వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ -
సువర్ణ శోభితం
పాలకొండ ఏజెన్సీ ప్రాంతంలో గత రెండు రోజులుగా చిరు జల్లులు కురుస్తున్నాయి. శుక్రవారం సూర్యోదయానికి ముందే చిన్నచినుకులు కురవగా.. ఆకాశంలో విరిసిన ఇంద్ర ధనుస్సు చూపరులను ఆకట్టుకుంది. సువర్ణ శోభిత వర్ణంలో ఆకాశం కాసేపు ఆహ్లాదాన్ని పంచింది. ఈ సుందర దృశ్యాలను పాలకొండ వాసులు డాబాలపై నుంచి సెల్ ఫోన్లలో బంధించి మురిసిపోయారు. – పాలకొండ జీవనశైలిలో మార్పులే రక్తపోటుకు కారణం భానుడి లేలేత కిరణాలకు బంగారు వర్ణంలో కనిపిస్తున్న ఆకాశం విజయనగరం ఫోర్ట్: జీవనశైలిలోని మార్పులే రక్తపోటుకు కారణమని, సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామంతో రక్తపోటుకు దూరంగా, ఆరోగ్యంగా జీవించవచ్చని డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు అన్నారు. ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా విజయనగరం పట్టణంలో శుక్రవారం నిర్వహించిన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తపోటును ఎప్పటికప్పుడు పరీక్షించుకోవాలన్నారు. రక్తపోటు పెరిగితే పక్షవాతం, గుండె పోటు వచ్చే అవకాశం ఉందన్నారు. మద్యపానం, దూమపానం, కొవ్వు పదార్ధాలకు దూరంగా ఉండాలని తెలిపారు. ప్రతిరోజు వ్యాయమం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని చెప్పారు. బీపీ, సుగర్ వ్యాధిగ్రస్తులు వైద్యుల సూచనల మేరకు మందులు వాడాలన్నారు. కార్యక్రమంలో డీఎల్ఓ డాక్టర్ కె.రాణి, ఎపిడిమాలజిస్టు డాక్టర్ జి.వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ ఎస్.భాస్కరరావు -
బడిగంట మోగక ముందే..
–10లోజోరుగా ఇటుకల తయారీ జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్ జగనన్నకాలనీలు, భవన నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఇటుకలకు గిరాకీ పెరిగింది. కార్మికులకు ఉపాధి లభిస్తోంది. పాఠ్య పుస్తకాల ఇండెంట్లను సేకరించాం విద్యా సంవత్సరం ప్రారంభించిన రోజునే పాఠ్య పుస్తకాలు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. అందుకు తగ్గట్టు విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇప్పటికే తరగతుల వారీగా కావాల్సిన పుప్తకాల ఇండెంట్లు సేకరించాం. వాటి వివరాలను పై అధికారులకు పంపించాం. పుస్తకాలు వచ్చాక జాగ్రత్తగా భద్రపరిచి విద్యార్థులకు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. – ఎన్.ప్రేమకుమార్, డీఈఓ విజయనగరం అర్బన్: విద్యాసంవత్సరం ఆరంభానికి ముందే పాఠశాలలకు పాఠ్య పుస్తకాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రణాళికలు సిద్ధం చేసింది. పాఠశాలల పునఃప్రారంభంరోజునే పాఠ్య పుస్తకాలు అందించాలన్న లక్ష్యానికి అనుగుణంగా అడుగులు వేస్తోంది. గత ఐదేళ్లుగా విద్యార్థులందరికీ సకాలంలో ప్రభుత్వం పుస్తకాలు సమకూర్చింది. జగనన్న విద్యాకానుకలు కింద సమస్త అభ్యసన సామగ్రిని అందజేసింది. ఈ ఏడాది కూడా ఈ నెలలోనే స్టాక్ పాయింట్లకు పాఠ్యపుస్తకాలు చేర్చేపనిలో విద్యాశాఖ యంత్రాంగం నిమగ్నమైంది. ●● ఆకర్షణీయంగా పుస్తకాలు పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతోంది. పాఠ్య పుస్తకంలో విద్యార్థికి అవసరమైన అదనపు సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా క్యూ ఆర్ కోడ్ను కూడా ముద్రిస్తోంది. దీని సాయంతో పాఠ్యాంశానికి సంబంధించిన అదనపు సమాచారాన్ని పొందేందుకు వీలవుతుంది. పుస్తకాల భారం విద్యార్థుల వీపులపై పడకుండా ఉండేందుకు సెమిస్టర్ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. గత విద్యా సంవత్సరంలో కూడా రెండు సెమిస్టర్లుగా పాఠ్యపుస్తకాలను ముద్రించింది. గతేడాది 1–8 తరగతులకు సెమిస్టర్ విధానం అమలు చేయగా, ఈ ఏడాది 10వ తరగతికి కూడా సెమిస్టర్ విధానం తీసుకొచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం పాఠ్యపుస్తకాలను బైలింగ్విన్ విధానంలో ముద్రిస్తోంది. పుస్తకంలో పేజీకి ఒకవైపు ఇంగ్లిష్, మరో పేజీలో తెలుగు పాఠ్యాంశం ఉంటుంది. దీనివల్ల విద్యార్థులు సులభంగా చదువుకునేందుకు అవకాశం కలుగుతుంది. తెలుగు మీడియం విద్యార్థులకు కూడా పాఠ్యాంశాలు అర్థమవుతాయి. ● పుస్తకాల అవసరం ఇలా... జిల్లాలో 1వ తరగతి పుస్తకాలు 1,35,375, రెండో తరగతి 1,35,578, మూడో తరగతి 2,08,971, నాలుగో తరతి 2,17,973, ఐదో తరగతి 2,68,449, ఆరో తరగతి 2,81,555, ఏడో తరగతికి 2,76,796 పాఠ్య పుస్తకాలు అవసరం. 8 నుంచి పదో తరగతి పాఠ్యపుస్తకాల ప్రతిపాదనలను ఆయా పాఠశాల నుంచి ప్రింటింగ్ ప్రెస్లు నేరుగా తీసుకుంటున్నాయి. జిల్లాలో విద్యార్థుల సంఖ్య ఇలా... జిల్లాలో 1,803 పాఠశాలలు ఉండగా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు 1,404, ఉన్నత పాఠశాలలు 399 ఉన్నాయి. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏటా ఉచితంగా పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. జిల్లాలో ఒకటి నుంచి పదో తరగతి వరకు 1.9 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ పుస్తకాల సరఫరా ఉచితంగా, క్రమపద్ధతిలో చేస్తామని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. గతేడాది కంటే ఈ సారి 10 శాతం అదనంగా పుస్తకాలు అవసరమని విద్యాశాఖ అంచనా వేసింది. ముద్రణ ప్రారంభమయ్యాక దఫదఫాలుగా పుస్తకాలు సరఫరా కానున్నాయి. గతేడాది వరకు ప్రింటింగ్ ప్రెస్ నుంచి పుస్తక గొడౌన్కు, అక్కడ నుంచి మండల కేంద్రాలకు సరఫరా చేసేవారు. ఈ ఏడాది ప్రింటింగ్ ప్రెస్ నుంచి నేరుగా ఆయా మండలాలకు సరఫరా చేయనున్నట్టు సమాచారం. వేసవి సెలవులు ముగిసేనాటికి మండల స్టాక్ పాయింట్లకు చేరవేసి, పాఠశాలల పునఃప్రారంభించే రోజునే విద్యార్థులకు అందజేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాఠ్యపుస్తకాల పంపిణీకి ప్రభుత్వం చర్యలు జిల్లాలో ఏడో తరగతి వరకు 15.24 లక్షల పుస్తకాల అవసరం 8–10 తరగతులకు నేరుగా ప్రింటింగ్ ప్రెస్ నుంచే సరఫరా ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక పంపిన జిల్లా విద్యాశాఖ పాఠశాలల పునఃప్రారంభంరోజు విద్యార్థులకు అందజేసేందుకు సన్నాహాలు -
లేఆఫ్ ప్రకటించిన జిందాల్ స్టీల్
● ముడిసరుకు కొరతే కారణమంటూ నోటీస్ జారీ ● ఆందోళనకు దిగిన కార్మికులు ● యాజమాన్య ప్రతినిధులతో చర్చించిన కార్మిక సంఘాల నాయకులు కొత్తవలస: మండలంలోని అప్పన్నపాలెం గ్రామ సమీపంలోని జిందాల్ స్టీల్స్ కర్మాగార యాజమాన్యం శుక్రవారం తెల్లవారు జూమున లేఆఫ్ను ప్రకటించింది. దీనికి సంబంధించిన వివరాలతో కూడిన నోటీస్ను కర్మాగారం ప్రధానగేటు వద్ద అతికించింది. ప్రధాన గేటుకు తాళాలను వేయించింది. ఉదయం ఎ–షిఫ్టుకు వచ్చిన కార్మికులు నోటీస్ను చూసి కంగుతిన్నారు. ఈ విషయాన్ని మిగిలిన కార్మికులకు చేరవేయడంతో కార్మికులందరూ చేరుకుని గేటు వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. పరిశ్రమలో రెగ్యులర్ కార్మికులుగా 57 మంది, కాంట్రాక్ట్ కార్మికులుగా 280 మంది పని చేస్తున్నారు. గడిచిన అక్టోబర్ నెల నుంచి కర్మాగారానికి అవసరమైన ముడిసరుకు లభ్యం కాకపోవడం, ఉత్పత్తికి గిరాకీ లేకపోవడం తదితర కారణాలతో నష్టాలు వస్తున్నాయని, తప్పనిసరి పరిస్థితిలో కర్మాగారం మూసివేస్తున్నట్టు యాజమాన్యం ప్రకటించింది. ఇక్కడి కార్మికులకు జిందాల్కు చెందిన జోజ్పూర్లోని మరో యూనిట్లో పనికల్పిస్తామని పేర్కొంది. దీనికి తొలుత అభ్యంతరం తెలుపుతూ సుమారు 330 మంది కార్మికులు కర్మాగారం గేటు వద్ద ఆందోళన చేశారు. కర్మాగారం తెరిచి పనికల్పించాలని డిమాండ్ చేశారు. కర్మాగారం నష్ట్టాల్లో ఉన్నప్పుడు తక్కువ వేతనానికే పనిచేసిన విషయాన్ని గుర్తుచేశారు. సమాచారం అందుకున్న కొత్తవలస సీఐ ఎస్.చంద్రశేఖర్ కర్మాగారం వద్దకు చేరుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటుచేశారు. యాజమాన్యంతో చర్చలు జరిపిన కార్మిక సంఘ నాయకులు కర్మాగార యాజమాన్యం ప్రతినిధులైన యూనిట్ ఇన్చార్జి దినేష్శర్మ, హెచ్ఆర్ మేనేజర్ గోపాలకృష్ణతో కార్మిక సంఘాల నాయకుడు, వైఎస్సార్ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు నెక్కల నాయుడుబాబు, టీఎన్టీయూసీ, సీఐటీయూ సంఘాల నాయకులు బూసాల అప్పారావు, బి.సురేష్ చర్చలు జరిపారు. ప్రస్తుత నెలకు సంబంధించి కార్మికులకు పూర్తి జీతం ఇవ్వాలని, జోజ్పూర్ యూనిట్కు వెళ్లే కార్మికులకు జీతాలు పెంచాలని, భోజనం, వసతి సౌకర్యాలను సమకూర్చాలని డిమాండ్ చేశారు. ఇక్కడి యూనిట్కు ముడిసరుకు సమకూర్చితే 20 రోజుల వేతనానికి నెలంతా కార్మికులు పనిచేస్తారని స్పష్టంచేశారు. దీనిపై యాజమాన్య ప్రతినిధులు మాట్లాడుతూ ఈ అంశాలను యాజమాన్య ప్రతినిధులతో చర్చించి సాధ్యాసాధ్యాలను సోమవారం వెల్లడిస్తామని తెలిపారు. యాజమాన్యం తమ వైఖరి తెలిపే వరకు ఆందోళన కొనసాగుతుందని కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. అప్పట్లో 11 నెలలు మూతపడిన పరిశ్రమం 2020–21లో సుమారు 11 నెలల పాటు కర్మాగారం మూతపడింది. దీంతో ప్రభుత్వం రంగప్రవేశం చేసి ప్రత్యేక రాయితీలను కల్పించి తెరిచేందుకు సహకరించింది. ప్రస్తుతం కర్మాగారాన్ని ఆర్ధాంతరంగా మూసివేస్తే తమ కుటుంబాల పరిస్థితి ఏమిటని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. కర్మాగారంలో పనిచేసే కార్మికుల్లో 50 శాతం మంది రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నారు. ఈ సమయంలో వేరే రాష్ట్రంలోని యూనిట్లో పనికి పంపిస్తామంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. కార్మికుల ఆందోళనకు అప్పలన్నపాలెం, నిమ్మలపాలెం, ఉత్తరాపల్లి గ్రామాల సర్పంచ్లు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు పప్పల బంగారనాయుడు, లగుడు వామాలు, గాడి అప్పారావు, ఎన్.చిన్నబాబు, ఎస్.భీమయ్య, బి.రమణ, బి.ఈశ్వరరావు, బి.రాము, తదితరులు పాల్గొన్నారు. -
సెంచూరియన్లో ముగిసిన బూట్ క్యాంప్
నెల్లిమర్ల రూరల్: మండలంలోని టెక్కలి సెంచూరియన్ విశ్వ విద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న విద్యార్ధులకు నిర్వహించిన 72 గంటల బూట్ క్యాంప్ శుక్రవారం ముగిసింది. ఈ క్యాంప్లో మొత్తం 180 మంది విద్యార్ధులు పాల్గొని వివిధ అంశాలపై ప్రాజెక్టులు తయారుచేశారు. ముగింపు కార్యక్రమంలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్ ప్రశాంతకుమార్ మహంతి, రిజిస్ట్రార్ డాక్టర్ పల్లవి మాట్లాడుతూ విద్యార్ధుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. అనంతరం ప్రాజెక్టులపై విద్యార్థులు వివరణ ఇచ్చారు. కార్యక్రమంలో వర్సిటీ సిబ్బంది పాల్గొన్నారు. శతశాతం అడ్మిషన్లు జరగాలి● జిల్లాలో ఐటీఐ నోటిఫికేషన్ విడుదల ● ఉపాధికల్పన అధికారి వహీదా పార్వతీపురంటౌన్: ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో 2024లో శతశాతం అడ్మిషన్లు జరగాలని పార్వతీపురం మన్యం జిల్లా ఉపాధి కల్పనా అధికారి వహీదా అన్నారు. ఐటీఐ జిల్లా కమిటీ మెంబర్ల ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐటీఐ అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదలైందని, దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 10 వరకు అవకాశం ఉందని తెలిపారు. ఒకేషనల్ గైడ్లైన్స్ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో అడ్మిషన్లు జరగాలని, ప్రతి ఒక్కరూ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా వృత్తి విద్యా అధికారి మంజులావీణ, కన్వీనర్లు, కళాశాల ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు. 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు● డీవీఈఓ మంజులావీణ పార్వతీపురంటౌన్: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 24నుంచి జూన్ 1వరకు నిర్వహించనున్నట్లు పార్వతీపురం మన్యం జి ల్లా వృత్తివిద్యాధికారిణి మంజులావీణ తెలిపా రు. ఈ మేరకు శుక్రవారం స్థానిక డీవీఈఓ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో పరీక్ష తప్పిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు . జిల్లాలోని 17 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులు 2482మంది, ఒకేషనల్ విద్యార్థులు 483మంది, ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులు 840, ఒకేషనల్ విద్యార్థులు 269మంది వెరసి 4074మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని చెప్పారు. జిల్లాలో ప్రభుత్వ కళాశాలల్లో 12, ట్రైబల్ వెల్ఫేర్ 2, ప్రైవేట్ అన్టైడ్ 3 కేంద్రాలను పరీక్షల నిర్వహణకు ఎంపిక చేశామని, పరీక్షలు పకడ్బందీగా సీసీ కెమెరా సర్వేలెన్స్ పరీక్షా కేంద్రాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జంబ్లింగ్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నామని, ప్రతి పరీక్షా కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్ పర్యవేక్షణలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. 22న ఇంటర్మీడియట్లో ప్రవేశానికి కౌన్సెలింగ్పార్వతీపురం: ఏపీగిరిజన గురుకుల రెసిడెన్షియల్ కళాశాలల్లో 2024–25 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఆంగ్లమాధ్యమంలో ప్రవేశానికి ఈనెల 22న ఉదయం 10గంటలకు ఐటీడీఏ గిరిమిత్ర మీటింగ్ హాల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఐటీడీఏ పీఓ సి.విష్ణుచరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కౌన్సెలింగ్కు ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని కోరారు. రెండు బైక్లు ఢీకొని ముగ్గురికి గాయాలుసీతంపేట: మండలంలోని అడ్డాకుల గూడ దగ్గ ర ఎదురెదురుగా వస్తున్న ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో ప్రమాదం సంభవించి ముగ్గురు గాయాల పాలయ్యారు. ఈ ప్రమాదంపై ఏఎస్సై సంజీవ్ మాట్లాడుతూ సిరికొండకు చెందిన ప్రసాద్, సునీల్కుమార్తో పాటు మరొకరు ప్రమాదంలో గాయాల పాలవగా వారిని పాలకొండ ఏరియా ఆస్పత్రిలో చేర్పించినట్లు చెప్పారు. సునీల్కుమార్ను మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. -
గంగపుత్రులకు మత్స్యకార భరోసా
● వేట నిషేధ భృతి రూ.10 వేలు ● 3798 మత్స్యకారుల గుర్తింపు ● ప్రతిపాదనలు పంపిన అధికారులు ● జిల్లాలో 885 బోట్లకు వర్తింపు ● ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత అకౌంట్లలో నగదు జమ పూసపాటిరేగ: మత్స్యకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. ఏటా సముద్రంలో వేట నిషేధ సమయంలో గంగపుత్రులకు అందించే భృతి రూ.10 వేలకు పెంచడంతో పాటు డీజిల్ సబ్సిడీ పెంచి వారి అభ్యన్నతికి కృషి చేస్తోంది. ఈ ఏడాది కూడా మత్స్యకార భరోసా సాయం లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాల్లో వేసేందుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వరుసగా ఐదో ఏడాది కూడా నగదు జమకానుండడంతో మత్స్యకారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. సముద్రంలో వేట చేసే బోట్లకు అవసరమయ్యే ఇంధనం రాయితీపై సరఫరా చేయాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. ఆలోచన చేసిందే తడువుగా మత్యకారుల అవసరాలను గుర్తించిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వేట చేసే బోట్లకు వాడే డీజిల్కు లీటరుకు 9 రుపాయలు రాయితీ చొప్పున నెలవారీ వారి ఖాతాలకు 1634 మంది లబ్ధిదారులకు రాయితీగా ఇచ్చిన రూ.1.81 కోట్లు నగదును అకౌంట్లలో ఇప్పటికే జమచేశారు. జిల్లాలో పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో 27 కిలో మీటర్ల మేర తీరప్రాంతం వుంది. సముద్రంలో 584 సాంకేతిక బోట్లు, 274 సంప్రదాయ బోట్లలో మత్స్యకారులు వేటను సాగిస్తున్నారు. కొత్తగా మరో 27 బోట్లకు రిజిస్ట్రేషన్ జరిగింది. వాటితో కలిపి 885 బోట్లలో వేటకు వెళ్లే 3798 మందికి పథకం వర్తించడానికి ప్రతిపాదనలు చేశారు. గత ప్రభుత్వాలు మత్స్యకారుల సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రకృతి వైపరీత్యాలు సమయంలో, చేపలు వేట నిషేధ సమయంలో మత్స్యకారులు నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. మత్స్యకారుల కృతజ్ఞతలు 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిషేధసమయం దాటకముందే రూ.10 వేలు చొప్పున అకౌంట్లలోకి నగదు జమచేసింది. మత్స్యకారులకు రూ.2 లక్షలు ఉన్న ప్రమాద బీమాను 10 లక్షలు పెంచింది. 50 ఏళ్లు వున్న మత్స్యకారులకు పింఛన్ మంజూరు చేస్తున్నారు. దీంతో తమ జీవన విధానంలో సమూలమైన మార్పులు తీసుకువచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి మత్స్యకారులు కృతజ్ఙతలు తెలుపుతున్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
వైభవంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర
ఆ అవార్డు వస్తే సంతోషిస్తా: నటి కంగనా
ఆహా.. సూపర్ పవర్ భూమ్మీదకొచ్చిందా?.. వైరల్ వీడియోలు
కట్టెల పొయ్యిపై టీ పెట్టిన మెగా కోడలు..లావణ్య త్రిపాఠి ఫోటోలు వైరల్
కళ్ళు చెదిరే అద్భుత జ్యుయలరీ కలెక్షన్ (ఫోటోలు)
ఏపీలో మరో 7 రోజులు భారీ వర్షాలు
చాందీని అమ్మ! శ్రీదేవిలా డ్యాన్స్ చేయాలని..!
హడలెత్తించిన బంగారం, వెండి ధరలు నేడు ఇలా..
సాక్షి ఆఫీస్ లో టీ20 వరల్డ్ కప్..
IPL 2024: సీఎస్కే పై ఆర్సీబీ ఘన విజయం (ఫోటోలు)
తప్పక చదవండి
- 'సెలవులు'! ఒక మరపురాని జ్ఞాపకంగా రీచార్జ్గా చేసుకోండిలా..!
- Delhi: కేజ్రీవాల్ ఛాలెంజ్.. బీజేపీ హెడ్క్వార్టర్స్ వద్ద హైటెన్షన్
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- రేపే లోక్సభ ఐదో దశ పోలింగ్.. అందరి చూపు వీళ్లపైనే!
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- Weekly Horoscope: ఈ రాశి వారికి చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement