-
ప్రధాని ఇంటర్వ్యూలు ఇలా ఉన్నాయా?
ఒక ప్రధానమంత్రితో ముఖాముఖి అన్నది ఆయన విమర్శకులపై దాడి చేయటానికి వేదికగా ఉండకూడదు. అంతేకాదు, సరైన విమర్శలకు ఆయన్ని స్పందింపజేసేలా ఉండాలి. స్పందింప ‘చేయటం’ అనే క్రియ ముఖ్యం. ప్రశ్నడిగి వదిలేస్తే ఏ ప్రధాని అయినా ఆ ప్రశ్నను తప్పించటానికి, సమాధానాన్ని దాటవేయటానికి చూడొచ్చు. అలా చేయకుండా, సమాధానం కోసం పదే పదే ఒత్తిడి తేవడం ఇంటర్వ్యూ చేసేవారి బాధ్యత. అంతేకాదు, వీక్షకుల తరఫున ప్రశ్నలు అడుగుతున్నామన్న స్పృహను వారు కలిగి ఉండాలి. అలాగే ఇంటర్వ్యూ చేసేవారు బెరుకుగా, ప్రధానికీ తనకూ వ్యత్యాసం ఉందన్న గ్రహింపుతో ఉన్నట్లుగా ప్రశ్నలు అడగకూడదు. ప్రధానిని తను కఠినమైన ప్రశ్నలు కూడా అడగగలడు అనే భావన వీక్షకులలో కలిగించాలి.ఇప్పటి బి.బి.సి. చైర్మన్ సమీర్ షా ఒకప్పుడు ‘లండన్ వీకెండ్ టెలివిజన్’ లో నా మొదటి బాస్. టెలివిజన్ ఇంటర్వ్యూలలో ప్రశ్నలు అడగటం గురించి నాకు తెలిసిన చాలా విషయాలు ఆయన నేర్పించినవే. వాటిలో ముఖ్యమైన పాఠం... వీక్షకుల తరఫున ప్రశ్నలు అడుగుతున్నామన్న స్పృహను మనం కలిగి ఉండటం. అందుకే మీ ప్రశ్నలు సందర్భోచితంగా ఉండాలి. సమాధానం వచ్చేవరకు మీరు పట్టుపట్టి ఉండాలి. లేదంటే మీరు సమాధానం రాబట్టలేక పోతున్నారని వీక్షకులకు స్పష్టమైపోతుంది.కనుక టీవీలో ప్రధానమంత్రి ఇంటర్వ్యూలను చూస్తున్న ప్పుడు నేను ఏం వినాలని కోరుకుంటాను? ఏముందీ, వీక్షకుడిగా నా తరఫున ఆ ప్రశ్నలు అడుగుతున్నట్లుంటే కనుక, నా ప్రశ్నలు ఎలా ఉండి ఉండాలి అని ఆలోచిస్తుంటాను. ముందుగా, ప్రధాని వేటిని తన విజయాలుగా భావిస్తున్నారో వాటి గురించి తెలుసుకోవాలనుకుంటాను. ఆయనకు ఎదురైన సవాళ్లకు, బహిర్గతమైన వాస్తవాలకు, చేసిన తప్పులకు, కప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నాలకు ఆయన ఏ విధంగా స్పందిస్తారో కూడా తెలుసుకోవాలని అనుకుంటాను. సంభాషణ ఏకపక్షంగా కాకుండా రెండు వైపుల నుండీ ఉండాలని కోరుకుంటాను. కాబట్టి సంభాషణలో ప్రధానిని అంతరాయపరచటం ఉంటుంది. కొన్నిసార్లు అంతరాయాలు అవసరం కూడా! రెండోది – ఒక ప్రధానమంత్రితో ముఖాముఖి అన్నది ఆయన విమర్శకులపై దాడి చేయటానికి వేదికగా ఉండకూడదు. అంతేకాదు, సరైన విమర్శలకు ఆయన్ని స్పందింపజేసేలా ఉండాలి. స్పందింపచేయటం అనే క్రియ ముఖ్యం. ప్రశ్నడిగి వదిలేస్తే ఏ ప్రధాని అయినా ఆ ప్రశ్నను తప్పించటానికి, సమాధానాన్ని దాటవేయటానికి చూస్తారు. అలా చేయకుండా, సమాధానం కోసం ఒత్తిడి తేవడం ఇంటర్వ్యూ చేసేవారి బాధ్యత. మూడవది – ఇంటర్వ్యూ ఆసాంతం.. ఇంటర్వ్యూ చేసేవారు, ప్రధానీ ఇద్దరూ కూడా సమానమే. అలాంటప్పుడు మాత్రమే ఇంటర్వ్యూ ప్రధానిని బాధ్యుడిని చేస్తుంది. కనుక ఇంటర్వ్యూ చేసేవాళ్లు ఆయన్ని ‘సర్’ అని పిలవకూడదు. అలా అనడం అంటే ఆయన్ని ఉన్నత పీఠం మీద ఉంచినట్లు! అలాగే ఇంటర్వ్యూ చేసేవారు బెరుకుగా, ఆయనకూ తనకూ వ్యత్యాసం ఉందన్న గ్రహింపుతో ఉన్నట్లుగా ప్రశ్నలు అడగకూడదు. ప్రధానిని తను కఠినమైన ప్రశ్నలు కూడా అడగగలడు అనే భావన వీక్షకులలో కలిగించాలి. నాల్గవది – అడిగిన ప్రశ్నలకు సమాధానాలు తప్పనిసరిగా ఇంటర్వ్యూ చేసేవారు లేవనెత్తిన అంశాలకు సంబంధించినవై ఉండాలి. కొద్దిపాటి ఊకదంపుడును అర్థం చేసుకోవచ్చు కానీ, అడగని వాటికి జవాబు చెబుతూ, అడిగిన వాటికి విరుద్ధమైన సమాధానం ఇస్తూ పీఎం పూర్తిగా దారి మళ్లేందుకు అనుమతించకూడదు. అలా జరిగితే మర్యాదపూర్వకమైన బలవంతపు అంతరాయం అవసరం. పీఏం అదే పనిగా దారి మళ్లుతూ ఉంటే ఒకటి కంటే ఎక్కువసార్లు అంతరాయాలు ఉండొచ్చు. ఐదవది – ఇంటర్వ్యూయర్కు వ్యూహం అవసరం. ఏదో అడగటానికి అన్నట్లుగా ప్రశ్నలు అడగకూడదు. ఒక స్పష్టమైన లక్ష్యం ఉండాలి. ఎప్పుడూ కూడా అడగకూడని ఒక ప్రశ్నకు ఉదాహరణ: ‘ఈసారి మీరు కచ్చితంగా గెలుస్తారు, అయితే 2029లో కూడా గెలుస్తారా?’ఇప్పుడు, సంబంధిత పీఎం స్వభావం, వ్యక్తిత్వాలకు అనుగుణంగా స్పందించేందుకు తగిన సామర్థ్యాన్ని ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కలిగి ఉండాలి. ఉదాహరణకు, ఒక ప్రధాని తను చేసిన ప్రతి పనీ దేశం కోసమే చేశానని దేశభక్తి ఢంకాను బజాయిస్తుంటే... ప్రధాన మంత్రులందరి విషయంలోనూ అది సహజమే కదా అని అనండి. అలా అనడం ఆయన్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నిలిపి ఉంచదు. లేదా, అందరికీ తెలిసి ప్రధాని చెప్పిన ఒక విషయం గురించి, లేదా ఆయన చేసిన ఒక పని గురించి నిర్ద్వంద్వంగా ప్రధాని తాను అనలేదని, చేయలేదని వాదిస్తుంటే... అప్పుడు దానిని సమయ సందర్భ, స్థల కాలాలతో సహా గుర్తు చేసే స్థితిలో ఇంటర్వ్యూయర్ ఉండాలి. ఆ విషయంలో స్పష్టంగా ఉండాలి. ఎందుకంటే అది ప్రధానమంత్రిని సవాలు చేయటం వంటిది. ఇంటర్వ్యూయర్ సిద్ధపడి ఉండాల్సిన వాటిలో ఇదొక సహేతుకత కలిగి ఉండాల్సిన భాగం. కొన్నిసార్లు స్పష్టమైన ప్రశ్నలు లేవనెత్తాలి. ఎందుకంటే అవి ఆ ఇంటర్వ్యూ ఇస్తున్న ప్రధానికి సంబంధించినవై ఉంటాయి. వాటిని విస్మరించలేము. ఉదాహరణకు, ఆ ప్రధాని తను భగవంతుని వాహకమని విశ్వసిస్తుంటే ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కొంతవరకైనా ఆయన్ని శంకిస్తున్నట్లుగా.. అది మీకెలా తెలుసు? మీరలా అనడం హేతుబద్ధమేనా? అని అడిగి తీరాలి. లేదా, ప్రధానిని అనుకరిస్తూ జీవనం సాగించే హాస్యగాడికి ఆయనపై పోటీ చేసేందుకు అనుమతి లభించకపోతే మీరు అందుకు అనుమతిస్తారా అని ఆ ఇంటర్వ్యూయర్ అడగాలి. ఆయన చికాకు పడుతూ కోపగించుకుంటున్నా కూడా పట్టు వదలక అడిగి తీరాలి. అంతేకాదు, ప్రధాని ఎల్లప్పుడూ తనను తాను తృతీయ పురుషలోనే ఎందుకు చెప్పుకుంటారు? గొప్ప కోసమా? అని ఇంటర్వ్యూయర్ ప్రశ్నించాలి. చివరిగా – నేనిక్కడ రాసిన వాటిని ఒక స్వచ్ఛమైన మనసు గల, గౌరవనీయులైన ప్రధాని అంగీకరిస్తారన్న నమ్మకం నాకుంది. గుర్తుంచుకోండి! ప్రజలను ఆకట్టుకోవటానికి తన ఇంటర్వ్యూను ఉపయోగించుకోవాలని ఆయన అనుకుంటారు. వాళ్ళకు చీకాకు తెప్పించాలనుకోరు. ఆ సంగతి మర్చిపొవద్దు. సమీర్ నాతో చెప్పిన మరొక మాట ఇది.కరణ్ థాపర్వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ప్రశ్నించడం నేర్పిన తొలి మేధావులు
‘దేవుడు చెడును ఆపాలని కోరుకుంటున్నా ఆపలేకపోతున్నాడా? అలా అయితే, అతను సృష్టి లయలను తన అధీనంలో ఉంచుకున్నవాడు కాదు. అతను సమర్థుడే, కానీ ఆపాలని కోరుకోవడం లేదా? అయితే అతను పగ, ద్వేషమూ గలవాడన్న మాట! అతను చెడును ఆపాలని కోరుకునేవాడు, పైగా సమర్థుడూ అయితే... మరి చెడు ఎందుకు రాజ్యమేలుతోందీ?– సమాధానం కావాలి! పోనీ, అతను చెడును ఆపాలని కోరుకోవడమూ లేదు – పైగా సామర్థ్యమూ లేదా? ఇక ఎందుకండీ ఆయనకు ఆ దేవుడనే బిరుదూ?’ అని ప్రశ్నించాడు ఎపిక్యురస్ (క్రీస్తు పూర్వం 341–270) అనే పురాతన గ్రీకు తత్త్వవేత్త. ‘ఎపిక్యురిజమ్’కు ఆయనే సిద్ధాంతకర్త. ఆయన రచనలు సుమారు మూడు వందల రాత ప్రతులున్నట్లు తెలిసింది. ఆయనపై డెమోక్రైటస్ అరిస్టిప్పస్, పైరో లాంటి వారి ప్రభావం ఉంది. ఎపిక్యురస్ బోధనలు తొలి దశలో సైన్సుకు ఆధారమయ్యాయి. ఎందుకంటే ఆయన రుజువుల్ని యథార్థాలనే నమ్మాలన్నాడు. క్రీ.పూ. 800–200 మధ్య కాలాన్ని ఏగియల్ యుగంగా పరిగణించారు. ఆ యుగంలో వైజ్ఞానిక ధోరణితో ఆలోచించి శాస్త్రయుగ కర్తగా నిలిచినవాడు ఎపిక్యురస్! గ్రీస్లో లాగానే ఇలాంటి ఆలోచనా ధోరణి గల వారు ఇండియా, చైనా, ఇరాన్ లాంటి దేశాల్లో ఉన్నారని కార్ల్ జాస్పర్స్ (1883–1969) అనే జర్మనీ తత్వవేత్త పరిశీలనలో తేలింది. ఆయన పరిశీలనల్లో వాస్తవం ఉందనిపిస్తుంది. ఎందుకంటే సాధారణ శకానికి పూర్వమే మన భారత్లో చార్వాకులు, హేతువాదులు విస్తరించి ఉన్నారు. సమాజానికి ప్రశ్నించడం నేర్పారు.ఎపిక్యురస్ ఆనాటి మేధావులందరితో విభేదించినా, డెమోక్రైటస్ (క్రీ.పూ. 460–370) వెలుగులోకి తెచ్చిన అటమిక్ థియరీని బలపరిచాడు. ఈ విశ్వం అతి సూక్ష్మమైన అణువులతో రూపొందిందనీ, అవి ఒకదానితో ఒకటి ఢీ–కొట్టుకుంటూ, విడిపోతూ, మళ్ళీ దగ్గరవుతూ ఉంటాయనీ, ఇవి నాశనం కావనీ, వీటి వల్లనే ‘పదార్థం’ ఏర్పడుతుందనీ డెమోక్రైటస్ భావించాడు. ఈ ‘ఆటమిక్ థియరీ’ని ఎపిక్యురస్ గట్టిగా నమ్మాడు. అయితే డెమోక్రైటస్ ఈ సిద్ధాంతం తనదని చెప్పుకోలేదు. తనకు గురుతుల్యుడైన లుసిప్పస్ (క్రీ.పూ. 5వ శతాబ్దం) ప్రతిపాదించాడనీ, తను కేవలం ఆ ఆటమిక్ థియరీని వెలుగులోకి తెచ్చానన్నాడు. లుసిప్పస్ తత్వవేత్త. మెటాఫిజిస్ట్ ఆటమిక్ ధియరీ ఎవరిదైనా కావచ్చు. కానీ అది వాస్తవం! ఆనాడు డెమోక్రైటస్ ప్రభావం ఎపిక్యురస్ పైనే కాదు, ఆధునిక కాలపు కార్ల్మార్క్స్పైనా ఉంది. ఎపిక్యురస్కు కొంచెం అటు ఇటుగా దృష్టి సారిస్తే, మనకు మిలోస్కు చెందిన డయగోరస్, సైరిన్కు చెందిన థియడోరస్లు కనిపిస్తారు (క్రీ.పూ. 5వ శతాబ్దం) వీరిలో డయగోరస్ గ్రీకు కవి, హేతువాది. థియడోరస్ నాటి గ్రీకు గణిత శాస్త్రవేత్త. ఆయన పేరుతోనే ‘స్పైరల్ ఆఫ్ థియడోరస్’ అనే గణిత సూత్రం ఉంది. పశ్చిమాన పరిస్థితి అలా ఉంటే, మన తూర్పు దేశాల్లో బౌద్ధం, జైనం, టోయిజం వంటివి వ్యాపించి విగ్రహారాధనను నిరసించాయి. డయగోరస్ తర్వాత– థియడోరస్, యుథిమిరస్ వెలుగులోకి వచ్చారు. గ్రీస్లో నిరీశ్వర వాదం ఆ రోజుల్లో పెద్ద నేరం! తత్త్వవేత్త సోక్రటీస్ (క్రీ.పూ. 399)కు శిక్ష పడింది కూడా ఆ విషయం గురించే! నాటి సమాజం గుడ్డిగా నమ్ముతున్న దేవుళ్ళను సోక్రటీస్ తిరస్కరించాడు. అతని ప్రభావంలో పడి యువత చెడిపోతోందని పాలకులు అతనికి మరణశిక్ష విధించారు. ఆ ఆ శిక్షను నింపాదిగా, నిబ్బరంగా స్వీకరించాడు. ఫ్రెంచ్ విప్లవ నేపథ్యంలో యూరోప్లో హేతువాదం బాగా పుంజుకుంది. ఫ్రెంచ్ విప్లవ ప్రభావం యూరోప్ సమాజంపై బాగా పడిన తర్వాత, విశ్వాసానికి – విశ్వసనీయతకు ఘర్షణ జరిగింది. క్రైస్తవ రహిత సమాజం రూపుదిద్దుకో నారంభించింది.అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 19వ శతాబ్దంలో వచ్చిన సామాజిక ఉద్యమాల వల్ల అక్కడి సమాజంలో ‘స్వేచ్ఛాలోచన’ బాగా స్థిరపడింది. కేంబ్రిడ్జి యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం 1917 రష్యా విప్లవం ప్రభావంతో సమాజంలో హేతువాదం బాగా పెరిగింది. అందువల్ల మార్క్సిస్టు – లెనినిస్టుల ప్రభుత్వం ఏర్పడింది. సమాజంలో హేతుబద్ధత పెంచాలంటే, లక్షల సంఖ్యలో కార్యకర్తలు నడుం బిగించాలి. వేల సంఖ్యలో రచయితలు కలాలు పట్టాలి. అప్పుడు గానీ, వైజ్ఞానిక స్పృహ గల ప్రభుత్వాలు ఏర్పడవు. అమాయకులంతా మాయమాటలు చెప్పే మోసగాళ్ళనే నమ్ముతారు. దీనికి పరిష్కారమెక్కడుందీ? వాస్తవాలు తెలుసుకోవడంలో ఉంది. నిజాల్ని జీర్ణించుకోవడంలో ఉంది. డాక్టర్ దేవరాజు మహారాజు వ్యాసకర్త సాహిత్య అకాడెమీ అవార్డ్ గ్రహీత -
విభజన హామీలు ఎప్పుడు నెరవేరేను?
ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ 2014లో రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగింది. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకోకుండా, హడావిడిగా, తెలంగాణ రాష్ట్రానికి అనుకూల ఫలితాలను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతికూల ఫలితాలను ఇచ్చే విధంగా ఇది జరిగింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రధాన లక్ష్యం రెండు రాష్ట్రాలు విడివిడిగా సర్వతోముఖాభివృద్ధి సాధించడం. మరి అది జరుగుతోందా?పునర్విభజన అనంతరం ఏర్పడిన అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థికపరమైన, సంస్థాగతమైన మద్దతు ఇవ్వవలసి ఉండగా, కేంద్ర ప్రభుత్వం సమస్యల పరిష్కారానికి సరైన శ్రద్ధచూపకపోవడం వల్ల అనేక వివాదాలు, న్యాయపరమైన చిక్కులు తలెత్తాయి.చట్టంలోని సెక్షన్ 93 లోని షెడ్యూల్ 13 ప్రకారం... 8 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేయడం జరిగింది. వాటిలో 4 ప్రాజెక్టులు ఏర్పాటు చేయలేదు. 1. దుగరాజపట్నం ఓడరేవు ఏర్పాటు 2. సమగ్రమైన ఉక్కు కర్మాగారం ఏర్పాటు, 3. గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్, పెట్రోకెమికల్ కాంప్లెక్సు ఏర్పాటు, 4. విశాఖపట్టణంలోనూ, విజయవాడ–గుంటూరు–తెనాలి నగరాలలోనూ మెట్రోరైలు ఏర్పాటు చేయడం. ఇంకా మిగిలిన 4 ప్రాజెక్టులు అమలు దశలో ఉన్నాయి.విశాఖపట్టణం–చెన్నె పారిశ్రామిక కారిడార్, ప్రస్తుతం ఉన్న విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి విమానాశ్రమాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడం, ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త రైల్వేజోన్ ఏర్పాటు, కొత్తగా ఏర్పాటు చేయబడే రాజధానికి మంచి రోడ్డు, రైలు రవాణా సదుపాయాలను కల్పించడం వంటివి నెరవేర్చవలసి ఉంది. విశాఖపట్టణంలో క్రొత్త రైల్వేజోన్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని వారి ప్రకటనలను బట్టి అర్థమవుతోంది.ఇది వరలో పునర్విభజన చట్టాలలో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పన్నుల విషయంలో కొన్ని అసాధారణతలు చోటు చేసుకొన్నాయి. వాటిని సరిదిద్దడానికి చట్టంలో అవసరమైన సవరణలు చేయమని లేదా వాటివల్ల కలుగుతున్న నష్టం రూ. 3,820 కోట్లను మంజూరుచేయమని ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయం ఇంకా కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగానే ఉంది. ఏపీలో పారిశ్రామికీకరణ, ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించడానికి అవసరమైన రాయితీలతో కూడిన ప్రత్యేక ప్యాకేజీ ప్రతిపాదనలను ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 94(1) సెక్షన్ క్రింద కేంద్రప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. ఆ ప్రతిపాదనలు ఇంకా కేంద్ర ప్రభుత్వ పరిశీలనలోనే ఉన్నాయి. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు కావస్తున్నా, రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకం పూర్తవకపోవడం మరో ఇబ్బంది. పై విషయాలన్నింటినీ సూక్ష్మంగా పరిశీలిస్తే, కేంద్ర ప్రభుత్వానికి పునర్విభజన చట్టం అమలుకు సంబంధించి, తన బాధ్యతలను నెరవేర్చే విషయంలో పూర్తి చిత్తశుద్ధి లేదనే విషయం అర్థమౌతోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దానిలోని అనేక కార్పొరేషన్లు వాటి హక్కుల సాధన నిమిత్తం తెలంగాణ ప్రభుత్వంపై కోర్టులో అనేక వ్యాజ్యాలు (కేసులు) వేశాయి. ఆ కేసులన్నింటిలోనూ, ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా తీర్పులు వచ్చినప్పటికీ, తెలంగాణ రాష్ట్రం ఒక్క తీర్పును కూడా అమలు పరచలేదు. తెలంగాణ రాష్ట్రం, శ్రీశైలం ప్రాజెక్టు నీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క తాగునీరు, సాగునీటి అవసరాలకు నిర్లక్ష్యం చేస్తూ జలవిద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తోంది. ఈ పరిస్థితులలో గౌరవ సుప్రీంకోర్టు భారత రాజ్యాంగంలోని 3, 4 ఆర్టికల్స్ ప్రకారం సమగ్రమైన సూచనలను ఇవ్వాలనీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటువంటి సమస్యలను భవిష్యత్తులో కూడా ఎదుర్కొనే పరిస్థితిని నివారించాలని ఆశిద్దాం.కొవ్వూరి త్రినాథరెడ్డి వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ రిసోర్స్ పర్సన్ -
ఆ మూలసూత్రాలను అందుకుంటేనే...
భారతదేశం పునర్నిర్మాణంలో ప్రతి సందర్భంలోను డా‘‘ బి.ఆర్.అంబేడ్కర్ సూత్రాలే నిజమైన ప్రత్యామ్నాయాన్ని అందించగలుగుతున్నాయి. అంబేడ్కర్ నిర్మించిన రాజ్యాంగ సౌధాన్ని ఆయన సూత్రాలతోనే పునర్నిర్మించాలి అనే నూతన భావన మన నాయకులకు ఉంటే అంబేడ్కర్ కుల నిర్మూలన భావాన్ని, సామ్యవాద భావాల్ని తప్పక ఆచరించవలసిన చారిత్రక సందర్భం ఇది. నిజానికి దేశాన్ని రక్షించాల్సిన వారు దేశంలో నేడు మత వైరుద్ధ్యాలు పెంచడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అశోకుడు, అక్బరు వంటి మహా చక్రవర్తులే మత సామరస్యం కోసం ప్రయత్నం చేస్తే, ఇప్పటి నాయకులు మతాధిపత్యం కోసం ప్రచారం చేసి మత సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారని సామాజిక శాస్త్రవేత్తలు, రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నెల 13న జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో మహిళలు పోటెత్తి ఓటెయ్యడం ఒక సామాజిక, సాంస్కృతిక పరిణామం. మహిళకు రాజకీయ అస్తిత్వం పెరిగింది అనడానికి ఇది ఒక నిదర్శనం. మహిళలు ఎక్కడ చైతన్యవంతం అవుతారో అక్కడ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ పరిణామాలు త్వరితం అవుతాయని అంబేడ్కర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 81.86 శాతం ఓట్లు పోయ్యాయి. నడి ఎండలో కూడ ప్రజలు నిలబడి తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. మరోప్రక్క కుల, మతం, మద్యం, డబ్బు ప్రభావం కూడా బలంగానే ఎన్నికల మీద ఉంది. ఎన్నికల సంగ్రామంలో ఈసారి సోషల్ మీడియా కీలకపాత్ర పోషించింది. ఒక రకంగా సామాజిక వేదికలపై పెద్ద యుద్ధమే నడిచింది. పార్టీలు, అభ్యర్థుల వారీగా ఏర్పడ్డ గ్రూపుల్లో ఓటింగ్ సందర్భంగా రాతలతో కత్తులు దూశారు. ఫేక్ ఫోటోలు, ఫేక్ ఆడియోలతో పాటు ఫేక్ వార్తలను క్షేత్రస్థాయిలో వైరల్ చేశారు. సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారు అయోయయానికి గురయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలుగు రాష్ట్రాల పరిస్థితులు ఇలా వుంటే మొత్తం భారతదేశం వ్యాప్తంగా పెను వృక్షాలు కూలుతున్న చప్పుళ్లు వినబడుతున్నాయి. కొన్ని అధికార పీఠాలు బీటలు వారుతున్నాయి. మే 15న భువనేశ్వర్లోని భువనంగిరిలో ఇండియా కూటమి నాయకుడు రాహుల్గాంధీ ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో భాజపా నెగ్గితే ప్రభుత్వరంగ సంస్థలన్నీ ప్రైవేటుపరం అవుతాయని, దేశాన్ని 22 మంది బిలియనీర్లు పాలిస్తారని, రాజ్యాంగ పుస్తకాన్ని భాజపా చించి అవతల పారేస్తుందని అన్నారు. బడుగు వర్గాలకు ప్రయోజనాలు లభించటానికి కారణమే రాజ్యాంగం అని తమ చేతిలోని రాజ్యాంగ ప్రతిని చూపిస్తూ చెప్పారు. 22 మంది బిలియనీర్లు తీసుకున్న రూ. 16 లక్షల కోట్ల రుణాలను కేంద్ర సర్కారు మాఫీ చేసిందని, ఉపాధి హామీ పథకం కింద కూలీలకు 24 ఏళ్ల పాటు వేతనాలు చెల్లించేందుకు అయ్యే మొత్తంతో ఇది సమానమని వివరించారు. ‘‘రైతుల, విద్యార్థుల రుణాలను మాఫీ చేయలేదు. చిరు వ్యాపారులకు రుణాలే ఇవ్వలేదు. జీయస్టీ మొత్తమంతా ఇద్దరు ముగ్గురు వ్యక్తులకు వెళ్లిపోతోంది. మేం వచ్చాక కులగణనతో విప్లవాత్మక ప్రజాస్వామ్యాన్ని, ప్రజాపాలనను తీసుకువస్తాం. దేశంలో దేశంలో 50 శాతం మంది ఓబిసీలు, 15 శాతం దళితులు, 8 శాతం గిరిజనులు, 15 శాతం మైనార్టీలు, 5 శాతం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారున్నారు. ఈ 90 శాతం మందికిపైగా ప్రజలు మోదీ పాలనలో వంచితులయ్యారు. ఎన్ని రకాల అబద్ధాలను భాజపా చెప్పినా జూన్ 4 తర్వాత ప్రధాని పదవిలో మోదీ ఉండరు’’ అని రాహుల్ ఉద్ఘాటించారు.మోడీ ప్రభుత్వంలో రాజ్యం కంటే కూడా కార్పోరేట్ శక్తులు బలపడ్డాయి. విశ్వవిద్యాలయాలు అన్నింటిలో మతోన్మాద భావాలను ప్రచారం చేస్తూ శాస్త్ర జ్ఞానాన్ని వక్రీకరిస్తున్నాయి. అందుకే శ్రీనగర్లో మే 15న మాట్లాడుతూ నేషనల్ కాన్ఫరెన్స్ (ఎస్పీ)అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా ఇలా విమర్శించారు. భవిష్యత్తులో తాను పదవిలో లేకపోయినా దేశం మనుగడ సాగిస్తుందన్న విషయాన్ని ప్రధాని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. దక్షిణ కాశ్మీర్ అనంత్నాగ్లోని షాంగుస్ ప్రాంతంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘మనం కలిసి జీవించాలి. దేశాన్ని రక్షించాలి. పదవి ఎల్లకాలం ఉండదు. కానీ దేశం శాశ్వతం. ఆయన (మోడీ) ఏ దేశాన్ని తయారు చేయాలని ప్రయత్నిస్తున్నారో అది వినాశకరమైనది’’ అన్నారు.నిజానికి దేశాన్ని రక్షించాల్సిన ప్రధానమంత్రి దేశంలో మత వైరుధ్యాలు పెంచడం ఆశ్చర్యకరం. అశోకుడు, అక్బరు వంటి మహా చక్రవర్తులే మతసామరస్యం కోసం ప్రయత్నం చేస్తే, మోడీ ప్రభుత్వం మతాధిపత్యం కోసం ప్రచారం చేసి మత సామరస్యాన్ని దెబ్బతీసిందని సామాజిక శాస్త్రవేత్తలు, రాజకీయ విశ్లేషకులందరూ భావిస్తున్నారు. మోడీ ఆవేశపూరితమైన ప్రసంగాల్లో 400 సీట్లు వస్తున్నాయని చెప్పుకుంటున్నా 150 నుంచి 200కే పరిమితం అవుతారని కమ్యూనిస్టు నాయకులు చెబుతున్నారు. బీజేపీకి బలమైన ఉత్తరాది రాష్ట్రాల్లోనే ఈ ఎన్నికల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, బిహార్, మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లోనే బీజేపీకి ఎదురు గాలి వీస్తున్నది. పైకి డాంబికంగా 370–400 సీట్లు వస్తాయని గొప్పలు చెప్పుకుంటున్నా ఏ సర్వేలోనూ ఆఖరికి బీజేపీని బలపరిచే విశ్లేషకులు సైతం 250కి మించి రావని చెప్పాల్సిన పరిస్థితి. బీజేపీ ప్రభుత్వం ఈ దశాబ్దంలో ఏ సోషల్ మీడియాలోనైతే దళిత బహుజన మైనార్టీ స్త్రీల మీద, రాజ్యాంగం మీద, మానవ హక్కుల మీద, విద్యార్థుల ప్రతిభ మీద, దళితుల జీవన సంస్కృతి మీద, ముస్లింలు జీవించే హక్కు మీద దాడి చేసిందో అదే సామాజిక మాధ్యమాన్ని ఉపయుక్తం చేసుకొని ఈ సామాజిక శ్రేణుల అన్నింటిలో వున్న మే«ధావర్గం ఎదురుదాడి ప్రారంభించింది. నిజానికి మోడీ ద్వంద్వ భావజాల ఘర్షణలో ఇరుక్కుపోయారా అనిపిస్తుంది. ఏ ప్రజలైతే ఏ బడుగువర్గాలైతే అధిక ఓట్ల శక్తిగా ఉన్నాయో, ఆ వర్గాల జీవన వ్యవస్థలను ధ్వంసం చేస్తూ చేస్తూ, కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ ఈ వర్గాలను మతం పేరుతో ఓట్లు అడుగుతున్న సందర్భంగా, తమ కాళ్ల కింద పునాదులు తొలగిపోతున్న స్థితిలో కేవలం మతోన్మాద నినాదం ఫలిస్తుందా? అనేది ఇప్పుడు మోడీ ముందు నిలబడిన పెద్ద ప్రశ్నలా కనిపిస్తోంది.ఉత్తర ప్రదేశ్ కేంద్రంగా మొత్తం భారతదేశం గురించి మనం ఆలోచించినప్పుడు అన్ని మతాల్లో బానిసలుగా బతుకుతున్న వారికి సమాన గౌరవ జీవన వ్యవస్థ లేకపోవటం కనిపిస్తోంది. మతోన్మాద నినాదం గౌరవం ఇవ్వదు. ఆచరణ గౌరవం ఇస్తుంది. భారతదేశంలో కుల గణన చేయిస్తామని కాంగ్రెస్ పేర్కొన్నాక ఓబిసీలు ఆలోచనలో పడినట్లే ఉంది. తమకు రిజర్వేషన్ హక్కు వస్తుందని, రిజర్వేషన్ వల్ల విద్య, ఉద్యోగ హక్కులు విస్తృతం అవుతాయని ఓబిసీలు భావించడం ద్వారా భారతదేశంలో అతి పెద్ద సామాజిక తరగతి ‘ఇండియా’ కూటమి వైపు మొగ్గుతుందనక తప్పదు. ‘ఇండియా’ కూటమికి నూతన దశ వస్తున్న ఈ తరుణంలో అంబేడ్కర్ నిర్మించిన రాజ్యాంగ సౌధాన్ని ఆయన సూత్రాలతోనే పునర్నిర్మించాలి అనే నూతన భావన ఆ కూటమికి ఉంటే అంబేడ్కర్ కుల నిర్మూలన భావాన్ని, సామ్యవాద భావాల్ని తప్పక ఆచరించవలసిన చారిత్రక సందర్భం ఇది. ఆ పరిణతి మాత్రం ‘ఇండియా’ కూటమికి వచ్చినట్టు లేదు. అంబేడ్కర్ పరిశ్రమలను జాతీయం చేయండి, భూములను జాతీయం చేయండి అనే ప్రధాన సూత్రాన్ని ముందుకు తెచ్చారు. ఆయా రాష్ట్రాల ఆధిపత్య కులాల పార్టీ నుంచి వస్తున్న ‘ఇండియా’ కూటమి ఇంకా సామాజిక, సామ్యవాద భావాలను పరిపుష్టం చేయవలసిన అవసరం ఉంది. విశ్వవిద్యాలయాల్లో చారిత్రక, సాంస్కృతిక శాస్త్ర జ్ఞాన పునరుజ్జీవనానికి కూడా వీరు హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. మండల కమిషన్ రిపోర్ట్స్ను, సచార్ కమిటీ రిపోర్ట్స్ను, రిపబ్లికన్ పార్టీలోని మూల సూత్రాలను ‘ఇండియా’ కూటమి తీసుకోగలిగితే నిజమైన ప్రత్యామ్నాయంగా నిలబడుతుంది. భారతదేశం పునర్నిర్మాణంలో ప్రతి సందర్భంలోను డా‘‘ బి.ఆర్.అంబేడ్కర్ సూత్రాలే నిజమైన ప్రత్యామ్నాయాన్ని అందించగలుగుతున్నాయి. ఈసారైనా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ఒక దళిత ప్రధానమంత్రిని ప్రకటించగలిగిన విశాలతను సంతరించుకోవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా భారతదేశంలోని రాజకీయ నాయకుల వ్యక్తిత్వ నిర్మాణంలో నైతికత, అవినీతి రహిత, రుజువర్తన జీవన విధానం, మానవతా స్పృహ, సామాజిక విప్లవ భావన, ఆర్థిక స్వావలంబనా దృష్టి అనుసరణీయం అవ్వవలసి ఉంది. రాజకీయ నీతిశాస్త్ర అధ్యయనం ఈనాటి చారిత్రక కర్తవ్యం. అంబేడ్కర్ రాజకీయ జీవన మార్గమే దేశానికి దిక్సూచి.డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకుడు -
రైసీ మరణం రేపుతున్న ప్రశ్నలు
ఇజ్రాయెల్పై అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడుల నేపథ్యంలో... ఇజ్రాయెల్తో, అమెరికాతో ఇరాన్కు ప్రచ్ఛన్న ఘర్షణ జరుగుతున్న తరుణంలో ఆ దేశాధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హఠాన్మరణం ఇరాన్ కు అకాల ఘటనే అని చెప్పాలి. తాలిబాన్ పాలనలో ఉన్న అఫ్గానిస్తాన్, ఇరాన్ దేశాలు ఇజ్రాయెల్తో పోరాడటానికి తమ ప్రచ్ఛన్న ఘర్షణలను ముందుకు తీసుకువెళుతున్న దశ ఇది. ఇరాన్ పట్ల భారత్ సానుకూల వైఖరి చేపడుతున్న ఈ దశలో.. రైసీ మరణం అనేక ప్రశ్నలు రేపుతోంది. ఆంక్షల నుండి భారతదేశాన్ని మినహాయించడానికి అమెరికన్లు గతంలో కంటే తక్కువ సుముఖతనే ప్రదర్శిస్తారా అన్నది ప్రధాన ప్రశ్న. భారత్ – ఇరాన్ సంబంధాలపై రైసీ మరణం ఎలాంటి ప్రభావం చూపబోతోందన్నది మరొక కీలకమైన ప్రశ్న.హమాస్కి ధన, ఆయుధాల సరఫరాదారుగా, ప్రేరేపకురాలిగా ఇరాన్పై ఆరోపణలున్నాయి. ఇరాక్, సిరియా, లెబనాన్లో ఉంటున్న ఇరాన్ అనుకూల సాయుధ గ్రూపులు, ప్రత్యేకించి హిజ్బుల్లాను ఇందులో భాగస్వాములుగా పరిగణిస్తున్నారు. ఇజ్రాయెల్పై తన మొట్టమొదటి ప్రత్యక్ష క్షిపణి, డ్రోన్ దాడిని ఇరాన్ ఈ ఏప్రిల్ 13న ప్రారంభించింది. డమాస్కస్లోని ఇరాన్ దౌత్య భవనంపై ఇజ్రాయెల్ బాంబు దాడి చేయడం ఇరాన్ ని రెచ్చగొట్టటం అందుకు కారణం. పశ్చిమాసియాలో ఇరాన్ రహస్య కార్యకలాపాలను సమన్వయం చేస్తున్న కొంతమంది ఇరాన్ సైనిక కమాండర్లు ఈ దాడి ఘటనలో చనిపోయారు.బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, ఇరాన్ నుండి ఇరాక్, సిరియా, లెబనాన్ మీదుగా మధ్యధరా సముద్రం వరకు నడుస్తున్న షియా ప్రభావిత ప్రాంతంలో తన అణు కార్యక్రమాన్ని, వ్యూహాత్మక విస్తరణను నియంత్రించడానికి ఇరాన్ తో కలిసి పనిచేసే అవకాశాన్ని అమెరికా ఎంచుకుంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోని ఐదు శాశ్వత సభ్యదేశాలకు జర్మనీ మధ్య 2015లో అణు ఒప్పందం కుదిరింది. అయితే, అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2018లో ఇరాన్ పై ఆంక్షలు విధిస్తూ ఆ ఒప్పందం నుండి వైదొలిగారు. అదే సమయంలో, అమెరికా అనుసరించే ఇజ్రాయెల్ అనుకూల వైఖరిని మరింతగా పెంచి పోషించారు. ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో స్థావరాల ఏర్పాటును అరికట్టడానికి లేదా ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల మధ్య పరిష్కారం విషయంలో ఇజ్రాయెల్ వైపునుంచి నిబద్ధతను సాధించకుండా అమెరికా రాయబార కార్యాలయాన్ని ఏకపక్షంగా జెరూసలేంకు మార్చివేశారు. తదుపరి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ విధానాన్ని పునఃపరిశీలించడానికి ప్రయత్నించారు, కానీ మొదటగా కోవిడ్–19 మహమ్మారి, తరువాత ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఈ అంశంపై పెద్దగా దృష్టి సారించలేదు. ఈలోగా, ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో సంతకం చేసిన అబ్రహం ఒప్పందాలను ఉపయోగించి కొత్త పశ్చిమాసియా, గల్ఫ్ భద్రతా నమూనా అమలు గురించి అమెరికా ఊహించింది. ఇజ్రాయెల్తో సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకురావడానికి యూఏఈ, బహ్రెయిన్, మొరాకో, సౌదీ అరేబియా వంటి తన అనుకూల అరబ్ దేశాలను అమెరికా ప్రోత్సహించింది. ఇరాన్తో, పశ్చిమాసియాతో తన లోతైన రాజకీయ సంబంధాలను కొనసాగించడమే దీని లక్ష్యం. కానీ ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని కొత్త సంకీర్ణ ప్రభుత్వంతో, పాలస్తీనా ప్రాధాన్యాన్ని తగ్గించి వేయడాన్ని సమర్థిస్తున్న తీవ్ర మితవాద పార్టీలతో ఎదురయ్యే ప్రమాదాన్ని అమెరికా విస్మరించింది. ప్రాంతీయ భౌగోళిక రాజకీయాలలో పాలస్తీనియన్లు ప్రాముఖ్యం కోల్పోయారని నెతన్యాహు ఈ సందర్భంగా వాదించారు.ఈ కొత్త దృక్పథం ఆధారంగా భారత్, మధ్య ప్రాచ్యం, యూరప్ ఆర్థిక కారిడార్ (ఐఎమ్ఈసీ) ప్రతిపాదనకు వచ్చింది. యూఏఈ, సౌదీ అరేబియా, అమెరికా, భారతదేశ నాయకులు న్యూఢిల్లీలో జీ20 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఈ ప్రతిపాదనను ఘనంగా ఆవిష్కరించటం కోసం సమావేశమయ్యారు. కానీ అదానీ యాజమాన్యంలోని హైఫా ఓడరేవు ల్యాండ్ రూట్ ముగింపు కేంద్రంగా ఉన్న ఇజ్రాయెల్ని ఈ సందర్భంగా ప్రస్తావనలోకి తీసుకోలేదు. పాలస్తీనా సమస్యను పరిష్కరించే విషయంలో ఇజ్రాయెల్ నుంచి నిబద్ధత లేకుండా, అబ్రహం ఒప్పందాలపై సంతకం చేయడాన్ని సౌదీ స్పష్టంగానే ప్రతిఘటించింది. తర్వాత ఒక సంవత్సరం లోపే, ఇరాన్ ప్రేరేపిత గాజా సంక్షోభం ఐఎమ్ఈసీ ప్రాజెక్ట్ను ఎత్తివేసింది. యూఏఈ, బహ్రెయిన్ వంటి అబ్రహం ఒప్పందాలపై సంతకం చేసిన దేశాలు కూడా దేశీయ ప్రజాభిప్రాయాన్ని, అరబ్ ప్రజానీకం ఆగ్రహాన్ని సంతృప్తి పరచడానికి, ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా తమ బహిరంగ వైఖరిని కఠినతరం చేయవలసి వచ్చింది.అమెరికా–ఇజ్రాయెల్ ప్రణాళికలను చిత్తు చేసిన ఇరాన్ ఈ క్రమంలో రష్యా–చైనా కూటమికి దగ్గరైంది. రష్యాకు సాయుధ డ్రోన్ ల ప్రధాన సరఫరాదారుగా ఇరాన్ మారింది. ఈ దశలోనే రైసీ మరణం సంభవించింది. రైసీ తన నాలుగేళ్ల పదవీకాలంలో మూడో సంవత్సరంలో ఉన్నారు. ఇరాన్ న్యాయవ్యవస్థ మాజీ అధిపతిగా, ప్రజాస్వామ్య దేశాలలో ప్రధాన న్యాయమూర్తుల కంటే ఎక్కువ అధికారం ఉన్న పదవిలో, ఆయన రక్తపు మరకలతో కూడిన కలుషిత గతాన్ని కలిగి ఉన్నారు. 1980లలో రాజకీయ ఖైదీల సామూహిక మరణశిక్షను ఆయన పర్యవేక్షించారు. 2021లో తన ఎన్నిక సాధారణ ఇరాన్ అధ్యక్ష ఎన్నికల కంటే తక్కువ స్వేచ్ఛాయుతంగా జరిగింది. సాంప్రదాయికంగా సుప్రీం లీడర్, అతని సలహాదారులు అధ్యక్ష అభ్యర్థుల జాబితాను కత్తిరించడానికి గార్డియన్ కౌన్సిల్ను ఉపయోగిస్తారు. గతంలో ప్రజలకు కొంత ఎంపిక అవకాశాన్ని, ఎన్నికల స్వేచ్ఛను అందించడానికి దీన్ని తెలివిగా అమలు చేశారు. 1997లో మొహమ్మద్ ఖతామీ ఎన్నికైనప్పుడు, అతను వ్యవస్థానుకూలమైన, సంప్రదాయవాదులను ఓడించిన, గుర్తింపు పొందిన సంస్కరణ వాదిగా ఉండేవారు. పాశ్చాత్య ఆంక్షల కారణంగా ఏర్పడిన ఆర్థిక కష్టాల వల్ల ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి పెరుగుతున్న నేపథ్యంలో ఈ విధానాన్ని 2021లో నిలిపివేశారు. తరువాత, 2022 సెప్టెంబరులో పోలీసు కస్టడీలో మహ్సా అమిని అనే యువతి మరణం, ముఖ్యంగా మహిళల నుండి విస్తృతమైన నిరసనలను రేకెత్తించింది. వ్యవస్థ నైతిక అధికారం దెబ్బతినడంతో, 2021 ఓటింగ్ శాతం 60 శాతం లేదా అంతకంటే ఎక్కువ నుండి 49 శాతానికి పడిపోయింది. వాస్తవానికి, ఓటర్లు 13 శాతం వ్యతిరేక ఓట్లను వేయడం ద్వారా తమ నిరసన తెలిపారు. ఇది రైసీ ప్రత్యర్థులకు వచ్చిన ఓట్ల కంటే కూడా ఎక్కువ. ఇప్పుడు 50 రోజుల్లో కొత్త అధ్యక్ష ఎన్నికలు జరగాలి. ప్రస్తుత పరిస్థితి భారతదేశం–ఇరాన్ సంబంధాలపై ఎలా ప్రభావం చూపుతుందన్నది పెద్ద ప్రశ్న. చాబహార్ ఓడరేవు భారత్, ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాలకు ప్రధాన చిహ్నం. ఓడరేవును అభివృద్ధి చేయడానికి ఇటీవలి పదేళ్ళ ఒప్పందం తరువాత, అమెరికా ఆంక్షల హెచ్చరికను జారీ చేసింది. అఫ్గానిస్తాన్, ఇరాన్ దేశాలు ఇజ్రాయెల్తో పోరాడటానికి తమ ప్రతినిధులను ముందుకు తీసుకువెళుతున్నందున, అమెరికన్లు భారతదేశానికి మినహాయింపు ఇవ్వడానికి గతంలో కంటే తక్కువ సుముఖంగా ఉండవచ్చు.1996–2001 కాలంలో తాలిబాన్లు అఫ్గానిస్తాన్ ను నియంత్రించినప్పుడు ఇండో–ఇరానియన్ వ్యూహాత్మక కలయిక అత్యంత సన్నిహితంగా ఉండేది. రెండు దేశాలూ అహ్మద్ షా మసూద్ నేతృత్వంలోని ఉత్తర కూటమికి మద్దతు ఇచ్చారు. కానీ 2003 నుండి, ఇరాన్ రహస్య అణు కార్యక్రమం వెల్లడి, అమెరికాతోపాటు పాశ్చాత్య దేశాలు ఆంక్షలు విధించిన తర్వాత, భారతదేశం అమెరికాతో అణు ఒప్పందంపై చర్చలు ప్రారంభించింది. అప్పటి నుండి, ఇరు దేశాల మధ్య సంబంధాలు వ్యూహాత్మక అనుమానం, లావాదేవీలలో సహనం మధ్య హెచ్చుతగ్గులకు లోనయ్యాయి.రైసీ మరణం ఈ ప్రాథమిక అంశాలను మార్చదు. ఏది ఏమైనప్పటికీ, ఇరాన్ అత్యున్నత జాతీయ భద్రతా మండలిలోని సుప్రీం లీడర్, సలహాదారులు, ముఖ్యంగా దాని సెక్రటరీ జనరల్ అలీ అక్బర్ అహ్మదీయన్ ఇరాన్ విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తారు. కానీ రైసీ మరణం ఇరాన్ అంతర్గత రాజకీయ సమతుల్యతను ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే అధికార శూన్యతను పూరించడానికి ఎవరో ఒక నేతను పైకి లేపడం ప్రారంభం కానుంది. కేసీ సింగ్ వ్యాసకర్త ఇరాన్ మాజీ రాయబారి, మాజీ కార్యదర్శి, విదేశాంగ మంత్రిత్వ శాఖ -
సమితిపై సంస్కరణల ఒత్తిడి
భద్రతామండలి సంస్కరణలపై చాలాకాలంగా చర్చ సాగుతోంది. శాశ్వత సభ్యులు కానివారికీ చోటు కల్పించాలని 1960ల నుంచి డిమాండ్ ఉందన్న విషయాన్ని మనం గమనించాలి. ఈ నేపథ్యంలో ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలపై ఇటీవలే న్యూయార్క్ వేదికగా ప్రపంచ ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగాయి. ఇంకో పక్క భారత్ సభ్య దేశంగా ఉన్న ఎల్–69 కూటమి భద్రతామండలి శాశ్వత సభ్యుల సంఖ్యతోపాటు ఇతర సభ్యులను కూడా పెంచాలని ప్రతిపాదిస్తోంది. అదే సమయంలో కొత్త సభ్యులకు వీటో అధికారం ఇచ్చే విషయమై ఉదారంగా వ్యవహరించాలని కోరుతోంది. భద్రతా మండలి సంస్కరణలు వేగం పుంజుకోవడం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆందోళనలకు అద్దం పడుతోంది..అంతర్జాతీయ స్థాయిలో శాంతి సామరస్యాలను కాపాడే లక్ష్యంతో ఏర్పాటైన ఐక్యరాజ్య సమితిలో ఆసియా, ఆఫ్రికా ఖండాలకు ప్రాతినిధ్యం లేకపోవడం సమితి లక్ష్యసిద్ధిలో పెద్ద అడ్డంకి అని చెప్పక తప్పదు. ఈ అడ్డంకులను అధిగమించేందుకు కొన్ని దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నా అవి ఫలవంతం కావటం లేదు. సమితిలో సంస్కరణలు జరగాలని అధికశాతం దేశాలు డిమాండ్ చేస్తున్నప్పటికీ వీటో పవర్ ఉన్న దేశాలు సమితి కృషికి పీటముడులు వేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణలపై ఇటీవలే న్యూయార్క్ వేదికగా ప్రభుత్వాల మధ్య చర్చలు జరిగాయి. ఎవరికీ పెద్దగా తెలియని, అస్పష్టమైన దౌత్య ప్రక్రియ ఆ చర్చలన్నవి. అయినప్పటికీ ఈ ఏడాది చివరిలోగా ఓ చరిత్రాత్మక అంతర్జాతీయ ఒప్పందం కుదిరే దిశగా ఈ సమావేశం ముందడుగైతే వేసింది. భద్రతా మండలి సంస్కరణలు వేగం పుంజుకోవడం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆందోళనలకు కూడా అద్దం పడుతోంది. ఉక్రెయిన్, గాజా పరిణామాలు... ఐరాస వ్యవస్థ ప్రభావం తగ్గిపోతూండటం, అందరికీ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఐరాసకు లేకపోవడం వంటివి మళ్లీ మళ్లీ చర్చకు వచ్చేలా చేస్తున్నాయి. భద్రతా మండలిలోని ఐదు దేశాలకూ వీటో అధికారాలు ఉండటం అన్నది రెండో ప్రపంచ యుద్ధ విజేతలకు మాత్రమే ప్రాతినిధ్యం కల్పిస్తున్నట్లు అవుతోంది. ఇక ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలకు భాగస్వామ్యం లేదు. ఆ ప్రాంత దేశాల ప్రతినిధులు ఐరాసలో నామమాత్రపు పాత్ర పోషిస్తున్నారు అంతే. 1950లో ప్రపంచ జనాభాలో సగం ఆసియాలోనే ఉండగా... ఇరవై శాతం ఆర్థిక లావాదేవీలు ఇక్కడే జరుగుతున్నా భద్రతామండలిలో ప్రాతినిధ్యం మాత్రం ఒక్క దేశానికి మాత్రమే దక్కింది. ఇది అన్యాయమే. అలాగని ఆశ్చర్యపోవడానికీ ఏమీ లేదు. కాగా అప్పటితో పోలిస్తే ఇప్పుడు ప్రపంచం నిస్సందేహంగా చాలా మారి పోయింది. ప్రాతినిధ్యం విషయంలోనూ అన్యాయం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఆసియా జనాభా ప్రపంచ జనాభాలో 60 శాతం. ఆర్థిక వ్యవస్థలో 40 శాతం భాగస్వామ్యం కూడా ఈ ఖండానిదే. ఐరాస సభ్యదేశాల్లో 25 శాతం ఇక్కడివే. కానీ... భద్రతామండలిలో ప్రాతినిధ్యం మాత్రం 20 శాతమే. ఈ నేపథ్యంలోనే భద్రతామండలి సంస్కరణలపై చాలాకాలంగా చర్చ సాగుతోంది. శాశ్వత సభ్యులు కానివారికీ చోటు కల్పించాలని 1960ల నుంచి ఉన్న డిమాండ్ను మనం గుర్తు చేసుకోవాలి. దాదాపుగా ఈ సమయంలోనే ఆర్థిక, సామాజిక కౌన్సిల్ సభ్యత్వాన్ని 18 నుంచి 27కు, ఆ తరువాత 54కు పెంచారు. 2015లో కొన్ని నిర్దిష్ట సూచనలతో భద్రతా మండలి సంస్కరణలపై చర్చలు జరిపేందుకు ఒక అంగీకారం కుదిరింది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకూ అవి ముందుకు కదల్లేదు. చర్చల తీరుతెన్నులపై స్పష్టమైన ప్రణాళిక అన్నది లేకుండా పోవడం దీనికి కారణమైంది. ఈ ఏడాది జరిగిన శిఖరాగ్ర సమావేశం మాత్రమే ఈ ప్రక్రియ కాస్త ముందుకు కదిలేందుకు మార్గం చూపింది. కారణాలు అనేకం!భద్రతా మండలి సంస్కరణలు స్తంభించిపోయేందుకు అనేక కారణాలు కనిపిస్తాయి. ఇండియా, జర్మనీ, జపాన్ , బ్రెజిల్లతో కూడిన జి–4 కూటమి తమను (మరో ఇద్దరు ఆఫ్రికన్ ప్రతినిధులతో కలిపి) భద్రతా మండలి శాశ్వత సభ్యులుగా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. భారత్, జి–4 దేశాలు వీటో అధికారం లేకుండానే భద్రతామండలిలో చేరేందుకు ఓకే అనవచ్చు. ఈ అంశంపై 15 ఏళ్ల తరువాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉండేలా చూస్తారు. ఇంకో పక్క భారత్ కూడా సభ్య దేశంగా ఉన్న ఎల్–69 కూటమి భద్రతా మండలి శాశ్వత సభ్యుల సంఖ్యతోపాటు ఇతరులను కూడా పెంచాలని ప్రతిపాదిస్తోంది. అదే సమయంలో కొత్త సభ్యులకు వీటో అధికారం ఇచ్చే విషయమై ఉదారంగా వ్యవహరించాలని కోరుతోంది. ఐరాస సభ్యదేశాల్లో అత్యధికులు భద్రతా మండలి శాశ్వత, ఇతర సభ్యుల సంఖ్యను పెంచేందుకు అంగీకారం తెలుపుతూండగా కాఫీ క్లబ్గా పేరుగాంచిన ‘యునైటెడ్ ఫర్ కన్సెన్సస్’ గ్రూపు ఆ ప్రయత్నాలను తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఇటలీ, పాకిస్థాన్ , అర్జెంటీనా వంటి దేశాల నేతృత్వంలో పని చేస్తున్న ఈ గ్రూపు శాశ్వత సభ్యుల సంఖ్యను పెంచడాన్ని వ్యతిరేకిస్తోంది. భారత్, జర్మనీ, బ్రెజిల్ వంటి స్థానిక శత్రువులది పైచేయి కాకుండా అన్నమాట. ఇదిలా ఉంటే భద్రతా మండలి శాశ్వత సభ్యదేశాల్లో నాలుగు అమెరికా, యూకే, ఫ్రాన్ ్స, రష్యాలు మాత్రం శాశ్వత సభ్యుల సంఖ్యను పెంచేందుకు సూత్రప్రాయ అంగీకారం తెలిపాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇంకో అడుగు ముందుకేసి భద్రతా మండలి సంస్కరణలకు తాను కట్టుబడి ఉన్నట్లు ప్రకటనైతే చేశారు కానీ ఆచరణలో మాత్రం ఆయన ప్రభుత్వం భిన్నంగా వ్యవహరిస్తోంది. ఇంకో విషయం... ఆఫ్రికా గ్రూపులో ఏకాభిప్రాయం లేకపోవడంతో భద్రతామండలి సభ్యదేశంగా ఎవరిని ఎంపిక చేయాలన్నది సమితి నిర్ణయించుకోలేక పోతోంది. వివరంగా చర్చిస్తే భేదాభిప్రాయాలు వస్తాయని ఆఫ్రికా దేశాలు భయపడుతున్నాయి. అడ్డంకి ఉండనే ఉంది!భద్రతా మండలి శాశ్వత సభ్యత్వం పెరిగేందుకు, ఇతర సభ్యుల చేరికకు ఉన్న అతిపెద్ద అడ్డంకి చైనా. భద్రతామండలి విస్తరణపై వ్యాఖ్య చేయని శాశ్వత సభ్య దేశం ఇదొక్కటే. ఆసియాకు మెరుగైన ప్రాతినిధ్యం లభించేందుకు ఆసియా దేశమే ఒకటి అడ్డుగా నిలవడం విచిత్రం. ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని చూస్తే... అసలు రాజీ మార్గమన్నది ఏమాత్రం కనిపించకుండా పోతుంది. శాశ్వత సభ్యుల సంఖ్యను 11కు పెంచడం ఇందుకు ఒక మార్గం. ప్రస్తుత శాశ్వత సభ్యులు ఐదుగురితోపాటు జి–4 సభ్యులు, ఇద్దరు ఆఫ్రికా ప్రతినిధులు అన్నమాట. దీంతోపాటే ఇతర సభ్యుల సంఖ్యను కూడా తగుమాత్రంలో పెంచాల్సి ఉంటుంది. అలాగే పూర్తి వీటో అధికారం స్థానంలో కొంతమంది శాశ్వత సభ్యులకు అభ్యంతరం ద్వారా తీర్మానాన్ని అడ్డుకునే అధికారం కల్పించడం ఒక ఏర్పాటు అవుతుంది. ఇలాంటి ఏర్పాటు ప్రస్తుత శాశ్వత సభ్యులకూ అంగీకారయోగ్యం కావచ్చు. ఈ ఏర్పాటు ఒకటి రూపుదిద్దుకునేలోగా ఐరాస నిష్క్రియాపరత్వం పాటించడం కూడా ఐరాస ఏర్పాటు అసలు ఉద్దేశాన్ని నిర్వీర్యం చేసేదే. యుద్ధనష్టాలు భవిష్యత్ తరాలకు సోకకుండా కాపుకాయాల్సిన బాధ్యత ఐరాసాదే! అంతర్జాతీయ ఒప్పందాలు, ఒడంబడికల అమలు, సామాజిక పురోగతి, మానవీయతలను కాపాడటం కూడా ఐరాస ఏర్పాటు ఉద్దేశాలలో కొన్ని అన్నది మరచిపోరాదు. ఈ లక్ష్యాలన్నీ ఐరాస భద్రతా మండలి శాశ్వత సభ్యులుగా మారే ఆఫ్రికన్ గ్రూపు లేదా జి–20 వంటి వ్యవస్థలకూ వర్తిస్తాయి. గత ఏడాది భారత్ నేతృత్వంలో జరిగిన జి–20 సమావేశాల్లో చాలా అంశాలపై ఏకాభిప్రాయం సాధించగలగడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఐరాస తన పూర్వ వైభవాన్ని మళ్లీ పొందాలంటే ప్రపంచం మొత్తానికి ఏకైక ప్రతినిధిగా వ్యవహరించాల్సి ఉంటుంది. అంతేకానీ... ఎప్పుడో ఎనిమిది దశాబ్దాల క్రితం నాటి ప్రపంచానికి ప్రతినిధిగా కాదు.ధ్రువ జైశంకర్ వ్యాసకర్త ఎగ్జిక్యుటివ్ డైరెక్టర్, ఓఆర్ఎఫ్ అమెరికా(‘హిందూస్తాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
అధిక స్థాయిలోనే పెట్రోలు, డీజిల్ రేట్లు..
ముడి చమురు ధరలు రెండేళ్లుగా నిలకడగా ఉన్నా అధిక స్థాయిలోనే పెట్రోలు, డీజిల్ రేట్లు.. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల లాభాలు మాత్రం 4 రెట్లు పెరిగాయి!పశ్చిమాసియాలో అడపాదడపా ఉద్రిక్తతలు పెరిగి, వెంటనే చల్లబడుతున్నాయి. ప్రపంచ ఆర్థికవ్యవస్థను ఇప్పటికీ గట్టిగానే నడిపిస్తున్న ముడి చమురు ధరలు ఈ కారణంగా గత రెండేళ్లుగా పెద్ద మార్పులకు గురికాకుండా నిలకడగా ఉన్నాయి. ఫలితంగా దేశంలో శిలాజ ఇంధన మార్కెట్లో మూడొంతులకు పైగా వాటా కలిగి ఉన్న ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల (ఓఎమ్సీలు) లాభాలు మాత్రం 2023–2024 ఆర్థిక సంవత్సరంలో నాలుగు రెట్లు పెరిగాయని వార్తలొస్తున్నాయి.ఓఎమ్సీలకు లాభాలొస్తే వాటిలో అత్యధిక వాటాలున్న కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో కోట్లాది రూపాయలు అందుతాయనే విషయం చెప్పాల్సిన పనిలేదు. ఇతర సరకులు, సేవల ధరలు పెరుగుతున్న ఇలాంటి సమయంలోనైనా దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలనే ఆలోచన ఈ ప్రభుత్వరంగ కంపెనీలకు రావడం లేదు. అంతర్జాతీయ క్రూడాయిల్ మార్కెట్లో ధరలు బాగా పైకి ఎగబాగినప్పుడు ఇండియాలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలను వెంటనే పెంచేసే ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం వంటి ఓఎమ్సీలు దేశంలో పెట్రో ఉత్పత్తుల వినియోగదారులకు అవకాశం వచ్చినప్పుడైనా మేలు చేసే నిర్ణయాలు తీసుకోవచ్చు.ప్రపంచంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా, ధరలను శాసించే పశ్చిమాసియా ప్రాంతానికి చెందిన ఒపెక్ దేశాలు జూన్ 1న సమావేశమై ఈ విషయాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటాయని తెలుస్తోంది. దేశం లోపల అత్యధిక మొత్తాల్లో చమురు నిక్షేపాలు ఉన్నా కొన్ని దశాబ్దాలుగా వాటిని వెలికితీయకుండా పశ్చిమాసియా దేశాల నుంచి సరఫరాలపై అమెరికా ఆధారపడేది. అయితే, ఇటీవల ముడి చమురును భారీ స్థాయిలో వెలికితీసి వాడుకుంటోంది అమెరికా. దానికి తోడు కొవిడ్–19 మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభం నుంచి ఏకైక అగ్రరాజ్యం ఇంకా పూర్తిగా కోలుకోకపోవడం, ద్రవ్యోల్బణం సాధారణ స్థాయికి చేరుకోకపోవడం, నిరుద్యోగం మామూలు స్థాయికి ఇంకా పడిపోకపోవడంతో ముడి చమురుకు డిమాండ్ రెండేళ్ల క్రితంలా లేదు.దీనికి తోడు మరో ప్రపంచ ఆర్థికశక్తి చైనా వేగం తగ్గడం కూడా శిలాజ ఇంథనాల వాడకం తగ్గిపోవడానికి మరో పెద్ద కారణం. దాదాపు 45 నెలలుగా క్రూడాయిల్ టోకు ధరలు నిలకడగా ఉన్నా భారతదేశంలో పెట్రో ఉత్పత్తుల వినియోగదారులకు ఆ నిష్పత్తిలో ప్రయోజనం అందించకపోవడం సబబు కాదనే అభిప్రాయం ఆర్థిక నిపుణుల్లో వెల్లడవుతోంది.- విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
నిబంధనల అమలులోనే అసలు చిక్కు!
భారతీయ మసాలాలపై హాంకాంగ్ ఈమధ్యే నిషేధం విధించింది. మూడు బ్రాండ్లపై ఈ నిషేధం వేటు పడింది. సింగపూర్లోనూ ఇంకో భారతీయ మసాలా కంపెనీపై ఇలాంటి క్రమశిక్షణ చర్యలే తీసుకున్నారు. ఎథిలీన్ ఆక్సైడ్ అనే కేన్సర్ కారక రసాయనం పరిమితికి మించి ఉన్నట్లు తేలడంతో ఆయా దేశాల నియంత్రణ సంస్థలు ఈ చర్యలకు పాల్పడ్డాయి. మాల్దీవులు చర్యలకు సిద్ధమవుతూండగా... అమెరికా, ఆస్ట్రేలియా ఆహార నియంత్రణ సంస్థలు కూడా మసాలాల్లో కలుషితాలపై నివేదికలను అధ్యయనం చేసే పనిలో ఉన్నాయి. నిజానికి ఇలాంటి చర్యలు భారతీయ కంపెనీలకు కొత్తేమీ కాదు. అమెరికా చేరుతున్న భారతీయ ఉత్పత్తుల్లో ఏటా కొన్ని వందలు నాణ్యత ప్రమాణాల లేమి కారణంగా తిరస్కరణకు గురవుతూనే ఉంటాయి. ఆయుర్వేద మందులపై కూడా ఎఫ్డీఏ తరచూ హెచ్చరికలు జారీ చేస్తూంటుంది. సీసం వంటి ప్రమాదకర భారలోహాలు, పదార్థాలు పరిమితికి మించి ఉంటాయన్నది వీరు తరచూ వ్యక్తం చేసే అభ్యంతరం. చిన్న పిల్లల ఆహారం విషయంలో ఇటీవలే అంతర్జాతీయ కంపెనీ నెస్లే భారత్లో మాత్రమే అధిక చక్కెరలు వాడుతున్న విషయం బయటపడ్డ సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు అన్నింటిలోనూ ఒక నిర్దిష్ట క్రమం కనిపిస్తుంది. కంపెనీ భారత్ది అయినా, విదేశీయులది అయినా సరే మా తప్పేమీ లేదని ప్రకటిస్తాయి. తయారు చేసిన దేశం లేదా ఎగుమతి చేస్తున్న దేశం నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తున్నామని కూడా చెబుతాయి. భారతీయ నియంత్రణ సంస్థలు ఇచ్చే సమాధానం కూడా పద్ధతిగా ఉంటుంది. ‘పరిస్థితిని అధ్యయనం చేస్తున్నాం’ అనేసి చేతులు దులిపేసుకుంటాయి. విదేశీ సంస్థలు సమచారం పంచుకోలేదన్న ఆరోపణ కూడా ఉంటుంది. ఎగుమతి ప్రోత్సాహక వ్యవస్థలు, కంపెనీలు రెండూ తాము బాధితులమని వాదిస్తూంటాయి. భారతీయ ఎగుమతులను మాత్రమే పాశ్చాత్య దేశాలు అడ్డుకుంటున్నాయని వాపోతాయి కూడా. ఈ మొత్తం వ్యవహారంలో నిస్సహాయంగా మిగిలిపోయేదెవరూ అంటే... వినియోగదారుడు మాత్రమే. కొంచెం సద్దుమణిగిన తరువాత అంతా షరా మామూలుగానే నడిచిపోతూంటుంది. కల్తీ, హానికారక, కాలుష్యాలతో కూడి ఆహార పదార్థాలు విదేశాలను చేరుతున్న విషయంలో అసలు సమస్య ఏమిటన్నది ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆహార నియంత్రణ వ్యవస్థ నిబంధనల్లోని లోటుపాట్లు సరి చేసే ప్రయత్నం జరగడం లేదు. ఇంకో ముఖ్యమైన విషయం పరిశ్రమలను, ఎగుమతులను కాపాడుకోవాలనే నెపంతో ప్రభుత్వాలు చేసే ప్రయత్నాలు. తప్పు చేసినా వాటి ప్రభావం నుంచి తప్పించేందుకు ప్రయత్నించడం. ఈ క్రమంలోనే వీళ్లు ప్రజారోగ్యాన్నీ; వినియోగదారులు, పౌర సమాజ నిపుణుల అభిప్రాయాలనూ తోసిపుచ్చుతూంటారు. వివాదాల్లో చిక్కుకున్న కంపెనీలు భారత్లోని ఫుడ్సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ)’ నిర్దేశించిన ప్రమాణాలను పాటిస్తున్నట్లు చెప్పుకుని ఎలాగోలా తప్పించుకుంటాయి. నెస్లే విషయంలో ఈమధ్య జరిగింది ఇదే. కాబట్టి... ఆహార రంగంలో ఎగుమతులకు సంబంధించి ప్రమాణాలను స్పష్టంగా నిర్వచించడం చాలా అవసరం. ఎఫ్ఎస్ఎస్ఏఐలో ఆహార ఉత్పత్తుల (పానీయాల నుంచి సముద్ర ఉత్పత్తుల వరకూ) ప్రమాణాలపై సమాచారం ఇచ్చేందుకు, నిర్దేశించేందుకు 26 శాస్త్రీయ కమిటీలు ఉన్నాయి. 2008లో ఎఫ్ఎస్ఎస్ఏఐ ఏర్పాటు జరిగినప్పుడు ఏర్పాటైన ఈ ప్యానెల్స్లో భారతీయ, విదేశీ కంపెనీ ప్రతినిధులు ఉన్నారు. ఈ విషయంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగడంతో వీటి పునర్వ్యవస్థీకరణ జరిగినప్పటికీ ఆహార కంపెనీల ప్రతినిధుల పెత్తనమే ఇప్పటికీ కొనసాగుతోంది. కొన్నేళ్ల తరువాత ఇది కూడా మారింది. ప్రస్తుతం ఈ ప్యానెళ్లలో ఎక్కువగా శాస్త్రవేత్తలు, రిటైర్ అయిన వాళ్లు ఉంటున్నారు. అయినప్పటికీ నిబంధనల రూపకల్పనలో పరిశ్రమల ప్రభావం లేదని కచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. ప్రస్తుతమున్న ప్యానెళ్ల కూర్పును మచ్చుకు తరచి చూస్తే చాలామందికి ఇప్పుడు, లేదంటే గతంలో... పరిశ్రమలతో ఏదో ఒక లింకు కచ్చితంగా కనిపిస్తుంది. ఎఫ్ఎస్ఎస్ఏఐ ముందు ఈ ప్యానెళ్ల సభ్యుల పూర్వాపరాలను కచ్చితంగా బహిరంగపరచాలి. దీనివల్ల వినియోగదారుడికి తాను తినే ఆహారానికి సంబంధించి ఎవరు రూల్స్ తయారు చేస్తున్నారో స్పష్టంగా తెలుస్తుంది. అలాగే సీఐఐ, హిందుస్థాన్ లీవర్ వంటి సంస్థలతో ఎఫ్ఎస్ఎస్ఏఐ భాగస్వామ్యం వంటి ఏర్పాటు పలు సమస్యలకు దారితీస్తున్న విషయాన్ని గుర్తించాలి. నిష్పాక్షిక, పారదర్శక సంస్థగా ప్రజల మద్దతు పొందే ప్రయత్నం చేయడం అవసరం, మేలు కూడా. చాలా ఏళ్లు వినియోగదారు సమూహాలు, ఆరోగ్య నిపుణులు ఉప్పు, చక్కెర, కొవ్వులు అధికంగా ఉన్న ఆహార పదార్థాలపై ప్రత్యేకమైన లేబుల్ ఒకటి వేయాలని కోరుతున్నాయి. అయితే ఫుడ్ సేఫ్టీ అథారిటీ, పరిశ్రమ వర్గాలు రెండూ దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఇంకోవైపు ఎఫ్ఎస్ఎస్ఏఐ పరిశ్రమలు చేసే డిమాండ్లను నెరవేర్చడంలో చాలా చురుకుగానే ఉంటోంది. విటమిన్లు ఇతర పోషకాలను చేర్చిన ఆహారానికి ప్రత్యేకమైన లేబుల్ ఉండాలన్న పరిశ్రమ డిమాండ్ను ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆగమేఘాలపై ఒప్పేసుకోవడం ఒక ఉదాహరణ.ఆహార పదార్థాల విషయంలో నియంత్రణ అధ్వాన్నంగా ఉంటే... పరిశ్రమ వర్గాల నిబంధనల పాలన కూడా అంతే తక్కువ అని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) స్వయంగా గుర్తించిన విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. కాగ్ 2017 లోనే ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రమాణాలను నిర్దేశించేందుకు సమయ బద్ధమైన ప్రణాళిక ఏదీ పాటించడం లేదని విమర్శించింది. అసంపూర్తిగా ఉన్న సమాచారం ఆధారంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ కంపెనీలకు లైసెన్సులు ఇచ్చింది, ఆహార పదార్థాలను పరిశీలించే ల్యాబొరేటరీలు 72లో 56 ల్యాబ్స్కు తగిన అక్రిడిషన్ సర్టిఫికెట్లు కూడా లేనవి ఎత్తి చూపింది. పార్లమెంటరీ కమిటీ ఒకటి కూడా ఆహార పదార్థాలకు సంబంధించిన నియమ నిబంధనల రూపకల్పన విషయంలో మరింత పారదర్శకత తీసుకు రావాల్సిన అవసరాన్ని తన నివేదిక రూపంలో స్పష్టం చేసిన విషయం గమనార్హం. ఆహార పదార్థాల విషయంలో కొంత జాగరూకతతో వ్యవహరించాలన్నది ఇప్పటికైనా గుర్తిస్తే అది ప్రజారోగ్యానికి మంచి చేయగలదని అర్థం చేసుకోవాలి. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ అంశాల వ్యాఖ్యాత (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ఎన్నికల నైతికత నెలకొనేనా?
ఎన్నికల రంగంలో సాధారణంగా జరగాల్సిన నైతిక ప్రచారం... తమ పార్టీ గెలిస్తే ఏం చెయ్యబోతోందో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం. జగన్ తన పార్టీ బహిరంగ సభల్లో తను గత ఐదేండ్లు చేసిన పనులు, గెలిస్తే చెయ్యబోయే పనులు చెబుతూ తిరిగారు. అనైతిక భాషను ఎవరి మీదా వాడటం కనిపించలేదు. కానీ చంద్రబాబు గానీ, ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్లో మీటింగుల్లో పాల్గొన్న మోదీ గానీ ఆ నైతికతను పాటించలేదు. ఎదుటి నాయకుడిని నిందించే నైతికతను మాత్రమే పాటించారు. ఎన్నికల కమిషన్కు కూడా ఎన్నికల్లో ఏ చర్చ నీతివంతమైనది, ఏది కాదు అనే అంశంపై స్పష్టత లేదు. ఎన్నికల మొరాలిటీ, ప్రచారంలో వాడాల్సిన భాష మొదలగు అంశాలపై ఇంకా చాలా చర్చ జరగాల్సి ఉంది.ప్రపంచంలో ఓటు ద్వారా ప్రజలు తమ పాలకులను ఎన్నుకోవడం మొదలైన దగ్గరి నుండి సమాజ నైతిక జీవనంలో గణనీయంగా మార్పు వచ్చింది. అంతకుముందు గుంపు నైతికతను మతం బోధించే ప్రయత్నం చేసింది. కానీ ఆ నైతికతకు జవాబుదారీతనం అనేది ఏమీ లేదు. రాజ్యవ్యవస్థలో రాజులు, నియంతలు ప్రజలకు జవాబుదారీగా లేరు. కండబలం– అంటే నిర్మిత సైన్యబలం, ప్రజల మధ్య కల్పించిన భయ వాతావరణం రాజ్యాలను నడిపించాయి. భారతదేశంలో మతం–కులం ఒకదానికొకటి అండగా ఉండటం వల్ల, మత వ్యవస్థ ఎన్నడూ ఇక్కడ సోషల్ మొరాలిటీ(సామాజిక నైతికత)ని ప్రజల మధ్య ప్రచారం చెయ్యలేదు. కులాధిపత్యాన్ని, మతాధిపత్యాన్ని తద్వారా కుల మొరాలిటీని ప్రజలమధ్య ప్రచారం చేసి, ఉత్పత్తి శక్తులకు విద్య, మానవ సమానత్వం అందకుండా చాలా జాగ్రత్తగా నీతి రహిత సమాజ నిర్మాణాన్ని దైవ సృష్టి నిర్మాణంగా కొనసాగించారు. ఈ విధమైన నీతి రహిత సమాజ జీవనాన్ని ఎలక్షన్ మొరాలిటీ (ఎన్నికల నైతికత) ద్వారా మార్చవచ్చు అని అంబేడ్కర్ భావించారు. ఆ మార్పునకు మూలం రాజ్యాంగం.అయితే భారతదేశంలో 1952 నుండి చాలాకాలం కాంగ్రెస్, కమ్యూనిస్టు– సోషలిస్టుల మధ్య ఎన్నికల పోరాటం జరిగింది. కాంగ్రెస్ దేశంలో చాలా సులభంగా ఎన్నికల్లో గెలవడం వల్ల, కమ్యూనిస్టులు అసలు రాజ్యాంగం మీదనే నమ్మకం లేని ఎన్నికల పోరాటంలో ఉన్నందువల్ల ఎన్నికల మొరాలిటీపై అసలు చర్చ జరగలేదు. ఈ దశ అంతా కూడా ఉత్పత్తి కులాల్లో బాగా చదువుకున్న యువకులు ఎక్కువగా లేనందున ఎన్నికల మొరాలిటీపై పత్రికల్లో కూడా చర్చ జరగలేదు. కమ్యూనిస్టులలో సిద్ధాంత పట్టు ఉన్నప్పటికీ, శ్రమ జీవుల పట్ల ప్రేమ ఉన్నప్పటికీ ఎన్నికల ద్వారా రాజకీయ నైతికతనీ, సామాజిక నైతికతనీ సమాజంలో పెంచవచ్చని వారు భావించలేదు. కాంగ్రెస్కు ప్రతిపక్షంగా ఆర్ఎస్ఎస్ పునాదిగా ఎదుగుతూ వచ్చిన జనసంఘ్/బీజేపీ ఎన్నికల వ్యవస్థను మతాధిపత్య రాజకీయంతో ముడెయ్యడం వల్ల దేశంలో కాంగ్రెస్, బీజేపీ నాయకత్వాల మధ్య ఎన్నికల మొరాలిటీపై చర్చ జరగలేదు. ఈ క్రమంలో విభిన్న రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. జాతీయ స్థాయి ఎన్నికల మొరాలిటీపై చర్చ చేసే అవకాశం వాటికి అంతగా లేదు. కానీ రాష్ట్రాల స్థాయిలో ఉత్పత్తి కులాల నుండి వచ్చిన ప్రాంతీయ పార్టీల నాయకులు ఎదిగాక, ఎన్నికల నైతికతపై కొంత చర్చ మొదలుపెట్టారు. అయితే ఈ ఎన్నికల మొరాలిటీ, ప్రచారంలో వాడాల్సిన భాష మొదలగు అంశాలపై ఇంకా చాలా చర్చ జరగాల్సి ఉంది. ఎన్నికల కమిషన్కు కూడా ఎన్నికల్లో ఏ చర్చ నీతివంతమైనది, ఏది కాదు అనే అంశంపై స్పష్టత లేదు. 2024 ఎన్నికల్లో నాయకులు ప్రచార సభలలో వాడిన భాషను ఒక్కసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు ఒక బహిరంగ సభలో జగన్మోహన్రెడ్డిని ఉద్దేశించి వాడిన ‘నీ అమ్మ మొగుడు చేశాడా’ లాంటి భాష ఏ ప్రజాస్వామ్య దేశంలో ఉపయోగించినా ఆయన్ని ఎన్నికల నుండి బహిష్కరించడమే కాక, తీవ్రమైన శిక్ష విధించే విలువలు ఉంటాయి. పాకిస్తాన్ వంటి అస్థిరమైన ప్రజాస్వామ్యంలో కూడా ఇటువంటి భాషను బహిరంగంగా వాడటాన్ని ప్రజల విలువలు ఒప్పుకోవు. కానీ ఇండియాలో ఇటువంటి భాష, దీని అనుసంధాన ప్రవర్తన ఎన్నికల రంగంలో మామూలుగా కనిపిస్తుంది. జగన్ ఇటువంటి భాషను బహిరంగ సభల్లో ఎవరి మీదా వాడటం కనిపించలేదు. అదే చంద్రబాబు ‘సైకో, సైకో’ అంటూ జగన్ను తిట్టగా చూశాం. ఎన్నికల రంగంలో సాధారణంగా జరగాల్సిన నైతిక ప్రచారం... తమ పార్టీ గెలిస్తే ఏం చెయ్యబోతోందో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడం. దీన్నే మనం మ్యానిఫెస్టో అంటాం. జగన్ తన పార్టీ బహిరంగ సభల్లో తను గత ఐదేండ్లు చేసిన పనులు, గెలిస్తే చెయ్యబోయే పనులు చెప్పుతూ తిరిగారు. కానీ చంద్రబాబు గానీ, ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్లో మీటింగుల్లో పాల్గొన్న దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గానీ ఆ నైతికతను పాటించలేదు. ఎదుటి నాయకుడిని నిందించే నైతికతను మాత్రమే పాటించారు. ప్రధానమంత్రిగా మోదీ దేశ స్థాయిలో కూడా తన మ్యానిఫెస్టో గురించి గానీ, తను గత పదేండ్లుగా చేసిన పనుల గురించి గానీ చెప్పలేదు. రాహుల్ గాంధీ మీద ‘శహజాదా’ (యువరాజు) అనే పదజాలంతో నిరంతరం దాడి చేశారు. అంతకంటే ఘోరంగా ముస్లింలను ఉద్దేశించి ‘ఎక్కువమంది పిల్లల్ని కనేవాళ్ళు’ అనే పదజాలంతో దాడి చేయడం ఎన్నికల నైతికతకు పూర్తిగా భిన్నమైంది. ఈ దేశంలో ముస్లిమేతురులు, ముఖ్యంగా బీదవారు కూడా చాలామంది పిల్లల్ని కంటారు. ఆయనే స్వయంగా తన తల్లిదండ్రులకు ఆరుగురిలో ఒకరు. ఈ రచయిత తన తల్లిదండ్రులకు ఎనిమిది మంది పిల్లల్లో ఒకడు. ఈ భాష మతం ఎన్నుకొని పుట్టని పిల్లలపై దాడి చేస్తుంది. ఒక దేశ ప్రధానమంత్రి ఇలాంటి భాష వాడినప్పుడు అలా ఎక్కువ సంతానం ఉన్న అన్ని కుటుంబాల్లో, ముఖ్యంగా చిన్న పిల్లల్లో సైతం భయాందోళన మొదలవుతుంది. ఇది అటువంటి పిల్లలను జీవితాంతం భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఎన్నికల నైతికతలో పిల్లల్ని, అమాయకుల్ని భయభ్రాంతుల్ని చేసే భాష అసలుండకూడదు. కానీ దేశ ప్రధానమంత్రే బహిరంగ సభల్లో ఇలా మాట్లాడితే, ఆ భాషకు ఎన్నికల కమిషన్ నుండి కూడా చెక్ లేకపోతే దేశంలో ఎన్నికల వ్యవస్థ కొనసాగడం కష్టం. క్రమంగా ఈ దేశ రాజ్యాంగానికీ, ప్రజాస్వామ్యానికీ ప్రమాదం ఇటువంటి ధోరణుల నుండే వస్తుంది. ఈ ఎన్నికల్లో రాజ్యాంగానికీ, రిజర్వేషన్లకూ ప్రమాదమున్నదనే ప్రచారాన్ని కాంగ్రెస్ పెద్ద ఎత్తున చేసింది. రాహుల్ గాంధీ ప్రతి బహిరంగ సభలో రాజ్యాంగాన్ని చూపిస్తూ బీజేపీ తిరిగి గెలిస్తే ప్రమాదముందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అందుకు విరుగుడు రిజర్వేషన్లను కాపాడటం, పెంచడంలో ఉందని మొదటిసారి కాంగ్రెస్ ప్రచారం చేసింది. నిజంగానే ఆర్ఎస్ఎస్–బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని క్రమంగా రద్దు చేసే అవకాశముందా? ఈ రాజ్యాంగాన్ని 1950లో ఆమోదించినప్పుడు ఆర్ఎస్ఎస్ ఒక పక్క, ఆనాటి కమ్యూనిస్టులు మరో పక్క వ్యతిరేకించారు. ఈ రాజ్యాంగం భారతీయ సంస్కృతిని (అంటే బ్రాహ్మణీయ సంస్కృతిని) ప్రతిబింబించదనీ, అది పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబిస్తుందనీ ఆర్ఎస్ఎస్ స్పష్టంగా చెప్పింది. కమ్యూనిస్టులేమో శ్రామికవర్గ నియంతృత్వ రాజ్యాంగం కావాలి, ఇటువంటి బూర్జువా రాజ్యాంగం వద్దని ప్రకటించారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్– బీజేపీ బయటకు చెప్పేది వారి అసలైన అభిప్రాయం కాదు. 400 పైన స్థానాల్లో గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని కొంతమంది ఎన్నికలకు ముందు ప్రకటించారు. ఈ రాజ్యాగ రక్షణకు మోదీ గ్యారెంటీ లాంటి వ్యక్తిగత ప్రకటనలు పనికిరావు. వంద సంవత్సరాల నుండి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏం చెబుతోంది అనేది లోతుగా చూడాలి. ఈ మధ్యకాలంలో సనాతన ధర్మాన్ని కాపాడాలని ఆర్ఎస్ఎస్, బీజేపీల్లోని పై కులస్థులతోపాటు ఓబీసీ అయిన మోదీ కూడా చాలాసార్లు మాట్లాడారు. సనాతన ధర్మం అంటే ఇప్పుడు అందరూ అనుకునే హిందూయిజం కాదు. సనాతన ధర్మం ప్రధానంగా వర్ణ ధర్మం (కుల వ్యవస్థ) కలిగివుంది. ఆర్ఎస్ఎస్, బీజేపీల్లోని బీసీ, ఎస్సీలు... మళ్లీ వర్ణ ధర్మం పాత పద్ధతిలో నెలకొల్పాలంటే ఈ రాజ్యాంగాన్ని రద్దు చెయ్యకుండా సనాతన ధర్మాన్ని తిరిగి స్థాపించడం సాధ్యం కాదు అని అర్థం చేసుకోవాలి. ఆ నిర్మాణాల్లో ఉన్న శూద్రులు, బీసీలు, ఎస్సీలు, ఆదివాసులు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం లోతు చూడకపోతే తాము మునిగి దేశాన్ని కూడా ముంచే అవకాశముంది. ప్రొ‘‘ కంచ ఐలయ్య షెపర్డ్ వ్యాసకర్త ప్రముఖ రచయిత, సామాజిక కార్యకర్త -
సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు రక్షణ కవచం
‘సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలే యువతకు ఉద్యోగాలు కల్పిస్తాయి’ –వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని తీసుకొచ్చిన చట్టం ‘ఎంఎస్ఎమ్ఈ డెవలప్మెంట్ చట్టం–2006’. తయారీదారు దగ్గర కొనని వ్యాపారస్తుని ఈ చట్టం ఎలాంటి ఇబ్బందీ పెట్టదు. తయారీదారు వద్ద కొనుగోలు చేసినవాళ్లే ఈ చట్టం పరిధిలోకి వస్తారు. భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత 15 కోట్ల మందికి ఉపాధిని కల్పిస్తూ దేశ ఆర్థిక ప్రగతిలో 40 శాతం మేర పాలు పంచుకోవడం సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల విశిష్ఠత.పల్లెలు, పట్టణాలు అని తేడా లేకుండా విస్తరించిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఆర్థిక అసమానతలను తొలగించేందుకు తోడ్పడుతున్నాయి. పెట్టుబడుల కొరతను ఈ తరహా పరిశ్రమలు అధిగమించడానికి కేవలం వ్యక్తిగత హామీలతో బ్యాంకులు ఋణం అందిస్తున్నాయి. అందుకే ఇవి మనుగడ సాగిస్తున్నాయి. పీఎమ్ఈజీపీ, సీజీటీఎమ్సీ కింద ఇచ్చే రుణాలతో పాటు ముద్రా ఋణాలూ ఇటువంటి పరిశ్రమల స్థాపనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.ఒక వ్యక్తి కాని, వ్యాపార సంస్థ కాని (కొనుగోలుదారు) వస్తువులు లేక సేవలు సూక్ష్మ, చిన్న పరిశ్రమలను నడిపేవారి (అమ్మకందారు) నుంచి పొందినట్లయితే... వారు అమ్మకందారుకు నగదు ఠంచనుగా చెల్లించాలనేది ఈ చట్టం చెప్తుంది. అమ్మకందారుకు, కొనుగోలుదారుకు మధ్య ఒప్పందం ఉండాలి. ఆ ఒప్పందం గడువు 45 రోజులు మాత్రమే ఉండాలి. దాని కోసం అమ్మకందారు ‘ఉద్యమ్ ఆధార్’లో నమోదు పొందిన తయారీదారుడు కావాల్సిన అవసరం లాంటి కొన్ని పరిమితులు నిర్దేశించడం ఈ చట్టంలోని ఒక సుగుణం. అలా ఒప్పంద పత్రం లేకపోతే ‘నియమించిన గడువు’ అనే అంశం పరిగణనలోకి వస్తుంది. వస్తువులను లేదా సేవలను అంగీకరించిన రోజు నుంచి 15 రోజుల లోపల నగదు చెల్లించాల్సి రావడమే ‘నియమించిన రోజు’గా చట్టం చెబుతోంది. సూక్ష్మ, చిన్న పరిశ్రమల తయారీదారుకు కొనుగోలుదారుకు మధ్య ఒప్పంద పత్రం రాతపూర్వకంగా ఉండాల్సి ఉంటుంది. అలా కానప్పుడు కొనుగోలుదారుడు 15 రోజుల్లోపల నగదు చెల్లించాల్సి ఉంటుంది. కొనుగోలుదారుడు భారతదేశంలో ఏ ప్రాంతంలోని వారైనా ఈ చట్టం వర్తిస్తుంది. ఒప్పుదల పత్రంలో గడువు ఎక్కువ రోజులు రాసుకొన్నప్పటికీ ప్రభుత్వం ఎమ్ఎస్ఎమ్ఈ డెవలప్మెంట్ చట్టం –2006 సెక్షన్ 15 ప్రకారం విధించిన గడువు కేవలం 45 రోజులే. ఇది సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల నుంచి కొనుగోలుచేసిన వ్యక్తులకు, సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది. పెట్టుబడి ఒక కోటి రూపాయలు లోపల ఉండి రూ. 5 కోట్ల అమ్మకాలు సాగిస్తే దానిని సూక్ష్మ తరహా పరిశ్రమగా పరిగణిస్తారు. అదే పెట్టుబడి 10 కోట్ల రూపాయల లోపల ఉండి అమ్మకం రూ. 50 కోట్ల లోపల ఉంటే చిన్న తరహ పరిశ్రమగా పరిగణిస్తారు. తయారీ లేకుండా కేవలం అమ్మకం (ట్రేడింగ్) జరిపే వ్యాపారులకు ఈ చట్టం వర్తించదు. కొన్న వస్తువులకు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల చట్టప్రకారం వస్తువులు లేక సేవలు పొందిన ఏ వ్యక్తి అయినా సెక్షన్ 15లో చెప్పిన విధంగా చెల్లింపు జరపని కారణంగా అమ్మకందారునికి ‘వడ్డీ’ చెల్లించాలి. అదీ చక్రవడ్డీ! వడ్డీ రేటు రిజర్వు బ్యాంకు, తన కింది బ్యాంకులకు సూచించిన రేటుకు మూడురెట్లుగా నిర్దేశించారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు మూలధన లభ్యత పెరిగి అవి సజీవంగా మనుగడ సాగించడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. కొనుగోలుకు చెల్లింపులు జరపడంలో ఆలస్యానికి కట్టే వడ్డీని ఆదాయపు పన్ను లెక్కలో ఖర్చుల క్రింద పరిగణించకపోవడం మరో విశేషం. అయితే బకాయిలు చెల్లించిన సంవత్సరంలో ఖర్చు కింద చూపే వెసులుబాటు చట్టంలో కల్పించారు. ఈ చట్టం భారతదేశ కొనుగోలుదారులకే కాకుండా విదేశీ కొనుగోలు దారులకు సైతం వర్తిస్తుంది. ఇక్కడ వివాదాల్ని పరిష్కరించడానికీ, చట్టాలు అమలు చేయడానికి దేశ దౌత్యవేత్తల కార్యాలయాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఆదాయపు పన్ను సెక్షన్ 43బీ(హెచ్)కు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల చట్టం సెక్షన్ 15ను కలిపి చదివితేనే మనకు ఈ చట్టంపై సంపూర్ణ అవగాహన కలుగుతుంది. ప్రతి సంస్థ చట్టాలకు లోబడి ఆస్తి, అప్పుల పట్టీని తయారుచేసి లెక్కలు తనిఖీ చేయించాల్సి ఉంటుంది. అయితే, ఏ సంస్థ అయితే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు సకాలంలో చెల్లించలేదో, వాటి బకాయిలను చెల్లించాల్సిన వడ్డీని బహిర్గతం చేయాలి. కంపెనీ అయితే కంపెనీ చట్టాలకు లోబడీ, ఇతరత్రా అయితే ఆ చట్టాలను అనుసరించీ!2006 చట్టంగా వచ్చినప్పటికీ, అమలు చేయడంలో చర్యలు ఇప్పుడిప్పుడే ప్రారంభ మయ్యాయి. ఆదాయపు పన్ను చట్టంతో ముడిపెట్టడం వల్ల చట్టం విలువ పెరిగి దాని ప్రాముఖ్యాన్ని గుర్తించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రస్తుత తరుణంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల మనుగడకు ఈ చట్టం ఒక రక్షణ కవచంగా నిలుస్తున్నదనేది కాదనలేని నిజం.చిన్ని శ్రావణ్ కుమార్ వ్యాసకర్త చార్టర్డ్ అకౌంటెంట్ -
అప్పుడు జరిగినట్టే... ఇప్పుడవుతుందా?
2014లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన అవినీతి వ్యతిరేక ఉద్యమం బీజేపీకి బాగా కలిసొచ్చింది. 2019లో పుల్వామా ఉగ్రదాడులకు ప్రతిగా జరిగిన సర్టికల్ స్ట్రయిక్స్తో ఓటర్లలో బీజేపీ జాతీయభావన రేకెత్తించింది. ఫలితంగా రెండు పర్యాయాల్లోనూ బీజేపీ అనుకూల వేవ్ కనబడింది. మోదీకి ఉన్న ప్రజాదరణ, రామ మందిర ప్రతిష్ఠాపన వల్ల ఈసారి కూడా ఆ ఫలితమే పునరావృతం అవుతుందని బీజేపీ ఆశిస్తోంది. కానీ చాలా రాష్ట్రాల క్షేత్రస్థాయి నివేదికలు బీజేపీకి అనుకూలంగా లేవు. భారీ మెజారిటీ కాకపోయినా, తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉందన్న భావన కాషాయ శిబిరంలో ఉంది. కాంగ్రెస్ గెలిచిన 2004 లేదా బీజేపీ అఖండ విజయం సాధించిన 2019... ఏ ఫలితాలు వస్తాయన్నది ప్రశ్న!2014లో, దేశవ్యాప్తంగా నరేంద్ర మోదీ గాలి కనిపించినప్పటికీ, బీజేపీ సొంతంగా పూర్తి మెజారిటీతో అధికారం చేపడుతుందని ఎన్నికల నిపుణులు, రాజకీయ పండితులు కచ్చితంగా భావించలేదు. చివరకు కాషాయ పార్టీ కూడా సాధారణ మెజారిటీ మార్కును దాటగలననే నమ్మకంతో లేదు. మరోవైపున కాంగ్రెస్ పార్టీ అంత తక్కువ స్థానాలు సాధిస్తానని అసలు ఊహించలేదు. ప్రధానంగా అన్నా హజారే నేతృత్వంలోని ‘ఇండియా ఎగైనెస్ట్ కరప్షన్’ ఉద్యమం కారణంగా వచ్చిన కాంగ్రెస్ వ్యతిరేక ఓటుతో బీజేపీ భారీగా లాభపడింది. దాన్ని తిప్పి కొట్టే ప్రచారం లేకపోవడంతో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయింది.పనికి ఆహార పథకం, ఆహార హక్కు చట్టం, విద్యా హక్కు చట్టం, సమాచార హక్కు చట్టం, లక్షలాది మందిని పేదరికం నుండి బయటపడేసిన అధిక ఆర్థిక వృద్ధి వంటి పదేళ్ల యూపీఏ పాలనలో సాధించిన విజయాలను కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పుకోలేదు. కాంగ్రెస్ పార్టీ మీది అవినీతి ఆరోపణలు, అధిక ద్రవ్యోల్బణం అంశాలను మోదీ చక్కగా ఉపయోగించుకున్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏను గద్దె దించాలంటూ మార్పు, సమగ్ర అభివృద్ధి గురించి ప్రచారం చేశారు. 2014 ఎన్నికలు... మార్పు కోసం జరిగిన ఎన్నికలు, అదే సమయంలో ఆశావహ ఎన్నికలు. 56 అంగుళాల ఛాతీ గల హీరో దేశాన్ని రక్షిస్తారన్న కథనం బాగా ఆకట్టుకుంది.2019లో, బీజేపీకి వ్యతిరేకంగా చాలా విషయాలు ఉన్నాయి... పెద్దనోట్ల రద్దు, హడావుడిగా విధించిన జీఎస్టీ, నెరవేర్చని అనేక వాగ్దానాల వంటివి. కాంగ్రెస్ నుండి గట్టి సవాలును ఎదుర్కొంటున్న బీజేపీ హిందీ రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో సీట్లను కోల్పోతుందన్న అంచనా ఉండేది. 2019 ఫిబ్రవరి మధ్యలో పుల్వామా ఉగ్రదాడి, ప్రతీకారంగా బాలాకోట్ వైమానిక దాడులు జరిగాయి. ప్రతి ఎన్నికల ర్యాలీలోనూ ప్రధాని మోదీ రేకెత్తించిన జాతీయవాద భావన క్షీణిస్తున్న బీజేపీ అదృష్టాన్ని మార్చేసింది. 2014, 2019 రెండూ వేవ్ ఉన్న ఎన్నికలు. అయితే 2024 ఎన్నికలు వేవ్ రహితం మాత్రమే కాదు, పేలవమైనవి కూడా. 2019లో రికార్డు స్థాయిలో ఓటింగ్ బీజేపీకి విపరీతంగా ఉపయోగపడింది. మోదీకి ఉన్న ప్రజాదరణ, ఈ సంవత్సరం ప్రారంభంలో రామ మందిర ప్రతిష్ఠాపన వల్ల ఈసారి కూడా ఆ ఫలితమే పునరావృతం అవుతుందని బీజేపీ ఆశిస్తోంది. కానీ అలా జరిగేలా కనిపించడం లేదు. ఎన్నికల విశ్లేషకులకు ఎన్నికల్లో గెలిచే పార్టీగా ఇప్పటికీ బీజేపీనే ఫేవరేట్గా ఉన్నప్పటికీ, ఆ పార్టీ నాయకులు ఒక విచిత్రమైన భయాందోళనలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఎందుకంటే, పార్టీ ఊహించిన విధంగా ఎన్నికలు జరగడం లేదు. ఇండియా కూటమి బీజేపీకి ఆందోళన కలిగిస్తోంది. నివేదికల ప్రకారం, ఈ సవాలును తటస్థీకరించడం బీజేపీకి చాలా కష్టంగా ఉంది.వాస్తవానికి, తీవ్ర పోరాటం జరుగుతున్న రాష్ట్రాలైన బిహార్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ నుండి వివిధ క్షేత్రస్థాయి నివేదికలు బీజేపీకి అనుకూలంగా లేవు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి కొన్ని హిందీ బెల్ట్ రాష్ట్రాల ఎన్నికల డైనమిక్స్ బీజేపీకి వ్యతిరేకంగా మారాయనీ, హిందుత్వ పార్టీకి తగిన మెజారిటీ పొందడం కష్టంగా ఉందనీ సూచిస్తున్నాయి. ఆత్మవిశ్వాసం నుండి గాభరాగా మారిన మోదీ ప్రవర్తన, ప్రచారాల్లో ఇది స్పష్టంగా కనిపిస్తోంది. గత పదేళ్లలో ఆయన సాధించిన విజయాలను, వరుసగా మూడోసారి బీజేపీ మేనిఫెస్టోలో అందించిన హామీలను ప్రచారం చేయడం మానేశారు. కాంగ్రెస్ పార్టీ, ముస్లింల పట్ల మెజారిటీ వర్గాలను భయపెట్టి, అసహ్యించుకునేలా చేసే దిశగా ప్రచారం మారడానికి ఇదే కారణం. దీనిని భయాందోళనలకు, నిరాశకు చిహ్నంగా రాజకీయ విశ్లేషకులు అర్థం చేసుకుంటున్నారు.గత ఒకటిన్నర నెలల్లో, దేశ రాజకీయ రంగస్థలంలో చాలా జరిగాయి. పోలింగులో తక్కువ ఓటింగ్ శాతం ప్రధానమంత్రిని, ఆయన ప్రచార నిర్వాహకులను కలవరపరిచింది. బీజేపీ, దాని మిత్రపక్షాలు గెలవగలవా అనే ప్రశ్నను లేవనెత్తింది. మోదీకి ఉన్న ప్రజాదరణ, సంక్షేమ పథకాలు, రామ మందిర ప్రారంభోత్సవం లాంటిని దృష్టిలో ఉంచుకుని ఒపీనియన్ పోల్స్ అంచనా వేసినట్లుగా, పార్లమెంటులోని 543 సీట్లలో నాలుగింట మూడొంతులు బీజేపీ కైవసం అవుతాయనే భావన ప్రమాదంలో పడింది. తొలి మూడు దశల పోలింగులో ఓటింగ్ ఊపందుకోకపోవడం, ఆ పార్టీకి భారీ మెజారిటీపై ఆశలు సన్నగిల్లేలా చేసినప్పటికీ, తిరిగి అధికారాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉందన్న భావన కాషాయ శిబిరంలో ఉంది.ఓటింగ్ శాతం అంచనాల కంటే తక్కువగా ఉన్నప్పటికీ, మొత్తం ఫలితాలపై పెద్దగా ప్రభావం చూపదని రాజకీయ విశ్లేషకులు, కాషాయ పార్టీ పట్ల సానుభూతిపరులైన ఎన్నికల పండితులు అభిప్రాయ పడుతున్నారు. అయితే, రాజకీయంగా తటస్థులైన విశ్లేషకులు చాలామంది దీనిని వ్యతిరేకిస్తున్నారు. మీడియా పండితులు, రాజకీయ నిపుణుల అభిప్రాయాలు చాలా వరకు ఊహించిన స్థాయిలోనే ఉన్నాయి: వీరి అభిప్రాయం ప్రకారం ‘ఏ విధంగానైనా మోదీ గెలుస్తారు’. అయితే చాలామంది ‘మోదీ గెలుస్తారు, కానీ తక్కువ మెజారిటీతో’ అంటూ తమ అభిప్రాయాన్ని ప్రకటిస్తూ హెచ్చరిస్తున్నారు. ఈ అభిప్రాయంతో సమస్య ఏమిటంటే, జీవనోపాధి సమస్యలపై ఓటర్లలో నిశ్శబ్దంగా చెలరేగుతున్న కోపాన్ని ఇది విస్మరిస్తోంది. జాతీయ సమస్యలపై కథనానికి తావు లేనప్పుడు, మోదీ డజన్ల కొద్దీ స్థానిక సమస్యలను, సామాజిక అసంతృప్తిని ఎదుర్కొంటారు. దేశమంతటా ప్రతిధ్వనించే ఒక చుట్టుముట్టే కథనాన్ని బీజేపీ ఈ ఎన్నికల్లో ఎందుకు కనుగొనలేకపోయిందో అది వివరిస్తోంది.ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలలో, ఉద్యోగాలు లేనప్పుడు నిరుద్యోగ సమస్యపై ఎలా స్పందించాలి, స్తబ్ధుగా ఉన్న వేతనాలు, వ్యవసాయ సంక్షోభం గురించి విమర్శలను ఎలా ఎదుర్కోవాలి, ధరలతో సతమతమవుతున్న మహిళా ఓటర్లను ఎలా ఆకర్షించాలి అనేవి మోదీ అతిపెద్ద సమస్యలు. ఒక అంశం నుండి మరో అంశానికి స్థిరత్వం లేకుండా సాగుతున్న ప్రధాని అసంబద్ధ ఎన్నికల ప్రచారం చీకటిలో కాల్పులు జరిపే కసరత్తుగా మారిపోయింది. ఏడు దశల ఎన్నికలలో ఐదు దశలలో, చాలా సంప్రదాయ అంచనాలు తలకిందులు అయినాయి. పైగా ఓటరు సెంటిమెంటును అర్థం చేసుకుంటే, విషయాలు బీజేపీకి అనుకూలంగా లేవని తెలుస్తుంది.ఏమైనప్పటికీ, ఈ ఎన్నికలు పోటాపోటీగానే ఉన్నాయి. మోదీ ప్రభుత్వంపై ఉన్న అధికార వ్యతిరేక సెంటిమెంట్, ఓటర్ల నిరాసక్తత వంటివి ఇండియా కూటమి మెజారిటీ మార్కును చేరుకోవడానికి కారణం అవుతాయో లేదో అంచనా వేయడం కష్టం. ఎన్నికల ఫలితాలపై రెండు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి, బీజేపీకి దాదాపు 300 సీట్లు వచ్చే అవకాశం ఉంది. రెండు, బీజేపీకి సాధారణ మెజారిటీ వచ్చే అవకాశం లేదు. పైగా మొత్తంగా ఎన్డీయే 272 మార్కుకు చేరుకుంటుందా అనే సందేహాలు ఉన్నాయి. దీనర్థం రెండు అవకాశాలు ఉన్నాయి. బీజేపీ తన 2019 పనితీరును పునరావృతం చేస్తుంది. లేదా 2024లో 2004 ఫలితాలు పునరావృతం అయ్యే అవకాశం ఉంది. ఎన్నికల వ్యూహకర్తగా మారిన రాజకీయ కార్యకర్త ప్రశాంత్ కిశోర్ మాత్రం బీజేపీ గెలుచుకునే సీట్ల సంఖ్యలో అర్థవంతమైన క్షీణతను చూడటం లేదు. మరోవైపు, రాజకీయ కార్యకర్తగా మారిన సెఫాలజిస్ట్ యోగేంద్ర యాదవ్ బీజేపీకి కనీసం 50 నుండి 60 సీట్లు తగ్గుముఖం పట్టనున్నట్లు చెబుతున్నారు. యాదవ్ అభిప్రాయం సరైనదే కావచ్చు. ఎందుకంటే ఈ నిర్ణయానికి రావడానికి ఆయన హిందీ బెల్టులో విస్తృతంగా ప్రయాణించారు మరి!అలీ చౌగులే వ్యాసకర్త సీనియర్ స్వతంత్ర పాత్రికేయుడు(‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
రాయని డైరీ.. నవీన్ పట్నాయక్ (ఒడిశా సీఎం)
‘‘జూన్ 9న ప్రమాణ స్వీకారం పెట్టుకుందాం నవీన్ జీ! ఫిక్స్ చేసేశాను’’ అన్నారు పాండియన్!నవ్వాన్నేను.ఇద్దరం ఎప్పటిలా మొక్కలకు నీళ్లు పెడుతూ, ఒడిశా ప్రజల ఆశలను నెరవేర్చే ఆలోచనలకు పాదులు తీసుకుంటూ గార్డెన్లో మెల్లగా నడుస్తూ ఉన్నాం. అతిశయోక్తిగా ఉండొచ్చు కానీ, అక్కడున్న మొక్కలు నాకెప్పుడూ మొక్కల్లా అనిపించవు! అర్జీలను పట్టుకుని నేరుగా తమ ముఖ్యమంత్రి ఇంటికే వచ్చేసి, ఇక్కడి గార్డెన్లో నీడపట్టున వేచి ఉన్న నిరుపేదల విన్నపాలకు ప్రతిరూపాల్లా ఉంటాయి అవి.‘‘జూన్ 9న ప్రమాణ స్వీకారం పెట్టుకుందాం నవీన్ జీ! ఫిక్స్ చేసేశాను’’ అని పాండియన్ అన్నప్పుడు నేను నవ్వడానికి కారణం. పాండియన్ ఆ మాటను నాతో అనడానికి ముందే ప్రతిపక్షాలకు ప్రకటించేశారు. అదీ తొలివిడత పోలింగ్ మొదలు కావటానికి వారం ముందే!ఒకే విడతలో ముగిసిపోయే ఒడిశాలోని మొత్తం 147 అసెంబ్లీ సీట్లకు, 21 లోక్ సభ సీట్లకు నాలుగు విడతల పోలింగ్ని నిర్ణయించేసింది ఎలక్షన్ కమిషన్! మే 13న తొలివిడత అయింది. రేపు మే 20న రెండో విడత పోలింగ్. మే 25, జూన్ 1 మూడు, నాలుగు విడతలు. జూన్ 4న ఫలితాలు.‘‘ఒడిశా ప్రజల ఆశీస్సులతో మా నాయకుడు నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా వరుసగా ఆరోసారి జూన్ 9న మధ్యాహ్నం 11.30– 1.30 మధ్య ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఉచిత విద్యుత్ ఫైల్ మీద మొదటి సంతకం చేస్తారు’’ అని పాండియన్ చెయ్యెత్తి జై కొట్టినట్లుగా ప్రకటించడానికి కారణం అసలు మోదీజీనే.‘‘ఒడిశాలో బీజేడీ ప్రభుత్వానికి జూన్ 4 ఎక్స్పైరీ డేట్’’ అని మోదీజీ అనకుండా ఉండి ఉంటే పాండియన్ జూన్ 9న ప్రమాణ స్వీకారం అనే మాట అనివుండే వారే కాదు. పాండియన్ నా ఆప్తుడు. నన్నెరిగిన వాడు. నా రెండో నేను!ఎన్నికల ప్రచారంలో ఇలాంటి పోటాపోటీ పైచేయి మాటలు ఒడిశాకు అలవాటు లేదు. మోదీజీ వచ్చాకే మొదలయ్యాయి. ఎన్నికల ముందు వరకు స్నేహితుల్లా ఉండి, ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఎందుకు ఒకరికొకరం శత్రువులం అయిపోవాలి? గెలుపు కోసమే అయితే ఆ సంగతి ప్రజలు కదా చూసుకుంటారు!మోదీజీ ఢిల్లీ నుంచి వచ్చి, ‘‘నవీన్ పట్నాయక్ దేశంలోనే పాపులర్ సీఎం అని; వికసిత్ భారత్కి, ఆత్మనిర్భర్ భారత్కి శక్తినిచ్చే రాష్ట్రం ఒడిశా’’ అని ప్రశంసించారని బీజేడీకి ఓటు వేసి, ‘‘నవీన్ ప్రభుత్వానికి జూన్ 4 ఎక్స్పైరీ డేట్ అని; ఒడిశాలో బీజేపీ రాబోతున్నదనీ, బీజేడీ పోబోతున్నదనీ...’’ మోదీజీ జోస్యం చెప్పారని బీజేడీకి ఓటు వేయకుండా ఉంటారా ఒడిశా ప్రజలు?!‘‘ఒడిశా నవీన్ పట్నాయక్కి గుడ్ బై చెప్పబోతోంది’’ అని అమిత్ షా, ‘‘ఒడిశా ప్రజలు నవీన్ పట్నాయక్కి రెస్ట్ ఇవ్వబోతున్నారు’’ అని నడ్డా, ‘‘ఒడిశాలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాబోతోంది’’ అని రాజ్నాథ్ సింగ్ ప్రచారం చేస్తున్నారు!మేము వారిని ఒక్క మాటా అనటం లేదు. పాండియన్ అనిన ఆ ఒక్క మాటా వారు అనిపించుకున్నదే!‘‘గాలికి ఎగిరొచ్చి పాదుల్లో పడి ఎరువుగా మారే పండుటాకులు, ఎండు పుల్లల లాంటివి వారి మాటలు పాండియన్! అవి మనకే మేలు చేస్తాయి’’ అన్నాను గార్డెన్లో మరోవైపునకు నడుస్తూ!అవును కదా అన్నట్లు పాండియన్ నవ్వారు. గెలుపోటములన్నవి నాయకులు ఒకర్నొకరు అనుకునే మాటల్ని బట్టి మారిపోవు. ‘నాయకుడు’ అని తాము అనుకున్న వ్యక్తినే ప్రజలు గెలిపిస్తారు. ఎన్నేళ్ల వరకైనా గెలిపిస్తూనే ఉంటారు. మాధవ్ శింగరాజు -
‘బుల్డాగ్’ తీరు వేరుగా ఉండేది!
ప్రధాని తన ప్రసంగంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని వచ్చిన ఆరోపణలపై ఎన్నికల కమిషన్ ఇంతవరకూ చర్య తీసుకోలేదు. మోదీ స్టార్ క్యాంపెయినర్ అనే బలహీనమైన కారణంతో నేరుగా ఆయనకు కాకుండా బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు లేఖ రాసింది. పేర్కొన్న తేదీ లోగా స్పందించటంలో పార్టీ విఫలం అయినప్పుడు, కమిషన్ మరొక వారం పొడిగింపునకు అంగీకరించింది. ఆ తర్వాత ఇంకొక వారం పొడిగించింది. స్పందన వచ్చిన తర్వాత కూడా నిర్ణయం తీసుకోవడానికి తొందర పడటం లేదు. ప్రస్తుత కమిషనర్లు ఎన్నికల కమిషన్కు అప్రతిష్ఠను తెచ్చిపెట్టారు. అదే టి.ఎన్. శేషన్ అయితే ఏం చేసి ఉండేవారు? ప్రధానిని నిష్కర్షగా, నిస్సంకోచంగా పిలిపించి ఉండేవారు.‘‘నేను నిక్కచ్చిగా, నిష్కర్షగా ఉంటే ఉండొచ్చు. అయితే నేను ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఉంటాను. మీరు చూసేదే మీకు కనిపిస్తుంది. నాలో మాత్రం ఏ పార్శా్వలూ లేవు.’’ – ఎన్నికల కమిషన్ను తన పనితీరుతో ప్రశంసనీయమైన గట్టి వ్యవస్థగా తయారు చేశారని పేరుగాంచిన ఎన్నికల ప్రధాన అధికారి టి.ఎన్.శేషన్ తన గురించి తాను ఇలా చెప్పేవారు. ‘‘నేను ఈ కుర్చీలో కూర్చున్నప్పుడు నేను చేయవలసిన పని ఒకటి ఉంటుంది. ఆ పనిని నేను నా సామర్థ్యం మేరకు అత్యుత్తమంగా చేస్తాను. ఏవీ నన్ను ఆపలేవు’’ అనేవారు శేషన్. ఇక ఆయన ‘బుల్డాగ్’ అని ముద్దుగా పేరు పడటంలో ఆశ్చర్యం ఏముంటుంది? పైగా ఇది ఆయనను ఉల్లాసపరిచిన పేరు కూడా!దురదృష్టం... నేటి ఎన్నికల సంఘం ఎంతో భిన్నమైన జంతువులా ప్రవర్తిస్తోంది. ఈ పోలికను పొడిగించాలనుకుంటే కనుక ఇప్పుడది కాపలా కుక్క కంటే కూడా గారాల పెంపుడు కుక్కగానే ఎక్కువగా నడుచుకుంటోంది. నిష్పాక్షికత, పారదర్శకతల అవసరాన్ని అది మరిచిపోయినట్లుగా కనిపిస్తోంది. ఇకపై తాను – కోరలతో తీవ్రంగా ప్రతిఘటించవలసిన సమయాల్లో సైతం – తన పని తాను చేయవలసి అవసరం లేదని అది నిర్ణయించుకుంది. బదులుగా, బయట పడేందుకు సులభమైన దారులను వెతుకుతోంది. ప్రధానమంత్రి బాంస్వాడా(రాజస్థాన్)లో ప్రసంగించి నెల దాటింది. నిజానికి నేటి నుంచి ఇంకో పదమూడు రోజులలో ఓటింగ్ ముగియనుంది కూడా. ప్రధాని తన ప్రసంగంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని బహిరంగంగా ఉల్లంఘించారని వచ్చిన ఆరోపణలపై కమిషన్ ఇంతవరకు చర్య తీసుకోకుండా ఏం చేస్తున్నదో గమనించండి. కె. చంద్రశేఖరరావు, ఎ. రాజా, సుప్రియా శ్రీనేత్, రణ్దీప్ సూర్జేవాలా కేసులలో మాదిరిగా... మోదీకి ప్రత్యక్షంగా నోటీసు జారీ చేయకూడదని కమిషన్ నిర్ణయించుకుంది. బదులుగా, మోదీ స్టార్ క్యాంపెయినర్ అనే ఒక బలహీనమైన కారణంతో ఆయనకు కాకుండా బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు లేఖ రాసింది. నోటీసులో ప్రధానమంత్రి పేరును, హోదాను పేర్కొనలేదు. అనుబంధ పత్రాలలో మాత్రమే అవి ఉన్నాయి. లేఖలో కమిషన్ పేర్కొన్న తేదీ లోగా స్పందించటంలో పార్టీ విఫలం అయినప్పుడు, కమిషన్ మరొక వారం పొడిగింపునకు వెంటనే అంగీకరించింది. ఆ తర్వాత కూడా గడువును ఇంకొక వారానికి పొడిగించింది. స్పందన వచ్చిన తర్వాత కూడా కమిషన్ ఒక నిర్ణయం తీసుకోవడానికి తొందర పడటం లేదు. ఉద్దేశపూర్వకమైన ఈ వాస్తవ దాటవేత కాలయాపన కోసమేనని అర్థమవుతోంది. ఇంతకీ, ప్రధాని ఏం చేశారు? ఓబీసీలు, ఎస్టీలు, ఎస్సీలకు ఉద్దేశించిన రిజర్వేషన్లను వారి నుంచి లాక్కుని ముస్లింలకు ఇవ్వటం జరుగుతుందని దాదాపు ప్రతిరోజూ ఆయన పదేపదే ఆరోపిస్తూ హిందువుల దృష్టిలో ముస్లింలను దయ్యాలుగా చిత్రీకరిస్తున్నారు. చివరికి మంగళ సూత్రాలు, స్త్రీధనం – మీకు రెండు గేదెలు ఉంటే వాటిలో ఒకటి – మీనుంచి లాక్కుని ముస్లింలకు ఇస్తారు అని కూడా ప్రధాని అన్నారు. ప్రధాని జాగ్రత్తగా, ఉద్దేశపూర్వకంగా పదే పదే ఇలా అనడం నియమావళిని తీవ్రంగా ఉల్లంఘించటమే కదా? కమిషన్ అధికారాన్ని లెక్కచేయకపోవటం కమిషన్ను పరిగణనలోకి తీసుకోకపోవటమే కదా?ఈ విషయంలో కమిషన్ చేయగలిగిందల్లా వెనక్కు జారగిలబడి కూర్చోవటం, వినటం, చేతి బొటనవేళ్లు నొక్కుకోవటం అన్నట్లే ఉంది. కమిషన్ ఎందుకు కఠినచర్య తీసుకోలేదు? తనకై తాను సూమోటోగా ఎందుకు ముందుకు రాలేదు? ప్రధాన మంత్రిని, కనీసం బీజేపీని ఈ కొనసాగింపు, నిజానికి ఈ నిరంతరాయమైన ఉల్లంఘనపై ఎందుకు పిలిపించలేదు? రాజ్యాంగంలోని 324వ అధికరణం కమిషన్కు అవసరమైన అన్ని అధికారాలనూ ఇస్తోంది. కానీ వాటిని ఉపయోగించటానికే కమిషన్ ఇష్టపడటం లేదు. దానర్థం నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించే నిబద్ధత కమిషన్లో కొరవడింది. న్యాయంగా, సమానంగా, పారదర్శకంగా వ్యవహరించే నైతిక అత్యవసరత కమిషన్లో లోపించింది. అదే టి.ఎన్. శేషన్ అయితే ఏం చేసి ఉండేవారో ఒక్కక్షణం ఊహించండి. ఆయన ప్రధానిని నిష్కర్షగా, నిస్సంకోచంగా, బాహాటంగా పిలిపించి ఉండేవారు. రెండు లేదా మూడు రోజులు ఎన్నికల ప్రచారం నుంచి ఆయన్ని దూరంగా ఉంచేవారు. ఆ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి, ఇంటర్వ్యూలు ఇచ్చి తను తీసుకున్న చర్యను సమర్థిస్తూ, వివరణ ఇచ్చేవారు. ప్రతిస్పందనగా దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేసి ఉండేవారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు తక్షణం ఆగిపోయేవి. మనకున్న అత్యంత ప్రామాణిక చరిత్రకారులు, సూక్ష్మగ్రాహ్యత గల ప్రజా వ్యాఖ్యాతలలో ఒకరైన రామచంద్ర గుహ... ‘‘ప్రస్తుత ముగ్గురు కమిషనర్లు ఎన్నికల కమిషన్కు అగౌరవాన్ని, అప్రతిష్ఠను తెచ్చిపెట్టారు’’ అని అన్నారంటే అందులో ఆశ్చర్యం లేదు. కమిషన్ చరిత్ర రాసినప్పుడు ఆ ముగ్గురూ చరిత్రహీనులుగా గుర్తుండిపోతారని ఆయన అన్నారు. అది నిజం. అయితే ఈ చేదు నిజం మరింత లోతైనది. మొదట మన ప్రజాస్వామ్యానికి గాయం అయింది. ప్రపంచంలోనే మనది అది పెద్ద ప్రజాస్వామ్యం అయినందుకు మనం గర్విస్తూ ఉంటాం. కానీ మనకు ఏదైతే గర్వకారణమై ఉన్నదో దానికి ఎన్నికల సంఘం తూట్లు పొడుస్తోంది. ప్రపంచం గమనించలేదని అనుకోకండి! పైనుంచి వేయి కళ్లతో చూస్తూనే ఉంటుంది. అంతిమంగా, ఎలాగూ మూల్యం చెల్లించవలసింది మనమే... ‘భారత ప్రజలమైన మనం’! చర్య తీసుకోవటంలో విఫలం అవటం ద్వారా కమిషన్ మనందరినీ లోకువ చేసేసింది.కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
విచ్చలవిడిగా సైబర్ క్రైమ్స్
సైబర్ నేరాలకు, మోసాలకు అడ్డుఆపు లేకుండా పోతోంది. ప్రతిరోజూ కొత్త కొత్త రూపాలలో ఈ నేరాలు వెలుగుచూస్తున్నాయి. పోలీస్ డ్రెస్ వేసుకొని, పోలీస్టేషన్ ఆఫీస్ బ్యాంక్ గ్రౌండ్లో కూర్చొని పోలీసులమని చెబుతూ నేరగాళ్ళు అమాయకులతో ఆడుకుంటున్నారు. మీమీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయని, మీ పేరుతో మొబైల్ నెంబర్ తీసుకున్నట్లు సమాచారం వుందని, ఆ నెంబర్ నుంచి నేరమయమైన కమ్యూనికేషన్ ఉందని, మీ ఆధార్ కార్డుతో బ్యాంక్ అకౌంట్ ఉందని, అందులో కోట్లాదిరూపాయల లావాదేవీలు జరిగాయని, మనీ ల్యాండరింగ్ కేసు బుక్ అయిందని, విదేశాల లావాదేవీలు కూడా జరిగాయని, మీరు వెంటనే ముంబయి పోలీస్ స్టేషన్కు రావాలని, మిమ్మల్ని అరెస్టు చేయాలని, మీరు మాకు సహకరిస్తే, మిమ్మల్ని ఈ మోసం నుంచి కాపాడుతామని చెబుతూ, అమాయకుల నుంచి బ్యాంక్ వివరాలు, ఆధార్ కార్డు వివరాలు తీసుకోవడం మొదలైన చర్యలు ఈ నేరగాళ్ళు చేస్తున్నారు.పోలీసులు వేషాలతో, పోలీసులు కార్యాలయం నుంచి మాట్లాడుతున్నట్లుగా వాట్సాప్లో వీడియో కాల్లో మాట్లాడుతూ అమాయకులతో ఆడుకుంటున్నారు. పోలీస్ వేషంలో ఉండడంతో, నిజమైన పోలీసులే ఆనుకొని, తమ నిజాయితీని నిరూపించుకొనే దిశగా అమాయకంగా సమాచారం ఇస్తూ సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.ఉద్యోగాలు ఇప్పిస్తామని, లాటరీ అని, ఇలా ఎన్నో రకాలుగా సైబర్ నేరగాళ్ళు చెలరేగిపోతున్నారు. ఇటువంటి ఫేక్ కాల్స్ ఎదుర్కొంటున్నవాళ్ళలో మేధావులు, చదువుకున్నవాళ్ళు కూడా ఉండడం గమనించదగిన అంశం. జర్నలిస్టులు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్ వేర్ ఉన్నత ఉద్యోగులు కూడా ఉన్నారని తెలుస్తోంది. ప్రజల్లో అవగాహన కలిపించే దిశగా పోలీసులు, సైబర్ సాంకేతిక నిపుణులు, సంబంధిత వర్గాలు, మేధావులు, సామాజిక బాధ్యత కలిగిన పౌరులు కృషి చేస్తూనే వున్నారు.కమ్యూనికేషన్ రంగం విస్తృతంగా ప్రజలకు చేరుతోంది. దానికి తగ్గట్టుగా విజ్ఞానం, మెలుకువలు పెరగడం లేదన్నది వాస్తవం. దేశంలోనూ,ప్రపంచ వ్యాప్తంగా ప్రతి రోజూ కొన్ని లక్షల మంది సైబర్ మోసాలకు బలవుతున్నారు. మోసపోతున్నవారిలో నిరక్షరాస్యులే కాదు అక్షరాస్యులు కూడా ఉంటున్నారు. ఆ మధ్య మహారాష్ట్రలో జరిగిన సంఘటన ఈ తీరుకు అద్దం పట్టింది. న్యాయస్థానంలో సూపరింటెండెంటుగా పనిచేసి రిటైరయిన ఓ మహిళ ఏకంగా కోటి రూపాయలకు పైగా పోగొట్టుకుంది.కేవలం సోషల్ మీడియాలో పరిచయాలు, తదనంతర పరిణామాలు ఈ మోసానికి ఆసరాగా నిలిచాయి. బంగారం బహుమతులుగా అందుకోండని యూకే నుంచి వచ్చిన ఫోన్ కు ఆమె చిక్కుకున్నారు. కస్టమ్స్ పన్ను చెల్లించాలని చెప్పగానే వెంటనే 1.12 కోట్లు ఆమె ట్రాన్స్ఫర్ చేశారు. ఆ తర్వాత ఆ వ్యక్తి నుంచి ఎటువంటి స్పందన లేకపోగా, ఫోన్ కు కూడా అందకుండా ఉన్న పరిస్థితి ఎదురైంది. మోసపోయానని గ్రహించిన తర్వాత ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. బహుమతులు వచ్చాయి, పన్ను కట్టాలని ఫోన్ వచ్చినప్పుడే పోలీసులను సంప్రదించి వుంటే? ఆమె నష్టపోయేది కాదు.చేతిలో ఫోన్ ఉంది కదా! అని ముక్కుముఖం తెలియనివారితో స్నేహం చేయడమే మొదటి తప్పు. మనకు సంబంధించిన సమాచారం అందరితో పంచుకోవడం రెండో తప్పు. బహుమతులకు ఆశపడడం ఇంకో తప్పు. ఇటువంటి ఫోన్స్, మెసేజెస్ వచ్చినప్పుడు ముందుగానే పోలీసుల దృష్టికి తీసుకెళ్ళక పోవడం అంతకు మించిన తప్పు.జరగాల్సిన నష్టం జరిగిన తర్వాత ఎవరినన్నా ఏమీ ప్రయోజనం లేదు. ఇలా ఎన్నో మోసాలు ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి. బ్యాంకులు కూడా ఈమెయిల్స్, మెసేజెస్ రూపంలో ప్రతిరోజూ ఖాతాదారులను అప్రమత్తం చేస్తూనే ఉన్నాయి. ఇక లోన్ యాప్ ల దారుణాలు అన్నీ ఇన్నీ కావు. మెసేజెస్ రావడమే ఆలస్యం వెంటనే క్లిక్ చేసి కొంతమంది దొరికిపోతున్నారు.లక్ష పెట్టుబడితో కేవలం 8 నెలల్లోనే 4 కోట్లు సొంతం చేసుకోండని కనిపించిన యాప్ను చూసి వెంటనే డబ్బులు కట్టేసి ఎంతోమంది మోసపోయిన వార్త ఆ మధ్య బయటకు వచ్చింది. ఆన్ లైన్ ట్రేడింగ్లో ఆ భారీ మోసం జరిగింది. ఈ మోసం విలువ 100కోట్ల పైనేనని ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. పూర్తిగా దర్యాప్తు జరిగితే మోసాల చిట్టా మరింత బయటపడుతుంది. ఇలాంటి సంస్థలు దేశ వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.మోసపోయాక లక్షలాది మంది రోడ్డు మీదకు వస్తున్నారు. సాధారణంగా ఆన్ లైన్ ట్రేడింగ్కు సెబీ గుర్తించిన సాంకేతికతను వినియోగించాలి. ప్రజలవ్వేమీ చూసుకోవడం లేదు. మొదటిది అవగాహన లేకపోవడం, రెండోది అత్యాశ. ఫోన్స్ హ్యాక్ చేస్తూ కోట్లాది రూపాయలు కొట్టేసిన ఉదంతాలు కూడా మనం వింటూనే ఉన్నాం. నకిలీ యాప్స్ తో పాటు నకిలీ పేర్లతో సోషల్ మీడియా వేదికలు కూడా నిర్మించి మోసాలకు తెరతీస్తున్నారు. నకిలీ మెయిల్స్ కూడా సృష్టిస్తున్నారు.వాట్సాప్ స్టేటస్లు చూసి కొందరు మోసపోతున్నారు. ముఖ్యంగా ప్రజల ఆధార్ కార్డు అనేక విభాగాలతో అనుసంధానమై ఉండడం వల్ల కూడా ఇటువంటి నేరాలకు అవకాశం ఇస్తోందనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఆధార్ కార్డును కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడంపై విమర్శలు పెరుగుతున్నాయి. మొత్తంగా చూస్తే సామాన్యుల రక్షణ ప్రశ్నార్ధకమవుతోంది. బ్యాంకుల్లో డబ్బులు ఉంచుకోవాలా? లేదా అనే సందేహాలు కూడా ప్రజల్లో వస్తున్నాయి.ఈ సైబర్ మోసాలు ఇన్నిన్ని కాదయా! అని చెప్పవచ్చు. అన్ని వేళలా అప్రమత్తంగా ఉండడం, అత్యాశకు పోకుండా ఉండడం, అందరినీ నమ్మకుండా ఉండడం, ముందుగానే పోలీసులను, సంబంధిత అధికారులను సంప్రదించడం తప్ప వేరు మార్గాలు లేవు. కోట్లాదిగా పెరిగిపోతున్న నకిలీ సైబర్ వ్యవస్థలను పూర్తిగా నియంత్రించే శక్తి ఏ ప్రభుత్వాలకు ఉండదు. స్వయం నియంత్రణ కూడా అవసరం.-మాశర్మ -
విద్వేష రాజకీయాలను తిప్పికొట్టడమే నివాళి!
భౌతికంగా మన మధ్యలేకపోయినా చరిత్ర పుటల్లో సజీవంగా నిలిచిపోయే వ్యక్తులు కొందరే ఉంటారు. అలాంటి అరుదైన వ్యక్తులలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య (పీఎస్) ఒకరు. నెల్లూరు జిల్లా అలగానిపాడు గ్రామంలో 1913 మే 1వ తేదీన భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. తొలినాళ్లలో ఆయన మీద గాంధీజీ ప్రభావం ఉండేది. 1930లో మాలపర్రు గ్రామంలో కాంగ్రెస్ సత్యాగ్రహ కార్యక్రమంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. అయితే క్రమంగా ఆయనలో కాంగ్రెస్పై నమ్మకం సన్నగిల్లింది. మద్రాసు లయోలా కాలేజీలో చదువుతున్నప్పుడు కంభంపాటి సత్యనారాయణ, వీకే నరసింహన్, హెచ్డీ రాజాలతో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో సోషలిస్ట్ సాహిత్యాన్నీ, కమ్యూనిస్ట్ మేనిఫెస్టోనూ అధ్యయనం చేశారు. అపుడే, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అమీర్ హైదర్ ఖాన్ కమ్యూనిస్ట్ పార్టీలో పని చేయాలని ఆహ్వానించారు. దీంతో డిగ్రీ అయిపోయిన తర్వాత పీఎస్ ఫుల్టైమర్గా పార్టీలో చేరారు. 1934లో అమీర్ హైదర్ ఖాన్ అరెస్ట్ కాగా ఆయన బొంబాయి వెళ్లారు. అక్కడే సోషలిస్ట్ భావాలుగల వ్యక్తుల వివరాలు సేకరించి కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణానికీ, విస్తరణకూ కృషి చేశారు. ఆ క్రమంలో 1938–1939లో ఇఎంఎస్ నంబూద్రిపాద్ కమ్యూనిస్ ్టపార్టీలో చేరారు. అలాగే తమిళనాడులో ఎంఆర్ వెంకట్రామన్, రామమూర్తి, తెలుగునాట మోటూరు హనుమంతరావు, లావు బాలగంగాధరరావు, తరిమెల నాగిరెడ్డి, ఈశ్వరరెడ్డి పార్టీలోకి వచ్చారు. 1940 ఆంధ్ర మహాసభ నుండి రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, చిర్రావూరి లక్ష్మీ నర్సయ్య, దేవులపల్లి వేంకటేశ్వరరావు, భీమిరెడ్డి నరసింహారెడ్డి, ధర్మబిక్షం, కృష్ణమూర్తి, ఆరుట్ల రామచంద్రారెడ్డి ఇంకా మరెందరో నిజాం స్టేట్లో కమ్యూనిస్ట్ పార్టీ లోకి వచ్చారు. అంతకు ముందే కవి మగ్దూవ్ు మొహియుద్దీన్ కమ్యూనిస్ట్ పార్టీవైపు వున్నారు. 1946–1951 మధ్య జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వేలాది మంది కమ్యూనిస్ట్ యోధులు ప్రాణాలు కోల్పోయారు. 1947 ఆగస్టు 15న దేశం స్వాతంత్య్రం పొందినప్పటికీ తన సంస్థానం ప్రత్యేక రాజ్యంగా కొనసాగాలని నిజాం రాజు పట్టుపట్టాడు. ఈ స్థితిలో 1948 సెప్టెంబర్ 13న భారత సైన్యం నిజాం సంస్థానాన్ని విలీనం చేసుకోవడానికి యాక్షన్ ప్రారంభించింది. తెలంగాణ సాయుధ పోరాట ఫలితంగా అప్పటికి ఖమ్మం, వరంగల్, కరీంనగర్లో కొంత భాగం; నల్లగొండ జిల్లాలో మూడు వేల గ్రామాలు నిజాం, దొరల పాలన నుండి విముక్తి పొందాయి. పది లక్షల ఎకరాల భూమిని దేశ్ముఖ్ల, భూస్వాముల నుండి స్వాధీనం చేసుకొని దున్నేవారికి పంచారు. ఆయా గ్రామాలలో కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన గ్రామ రాజ్యాల ఏర్పాటుతో నిజాం పాలన బలహీనపడింది, మరోవైపు భారతసైన్యం ప్రవేశించడంతో నిజాం రాజు విలీనానికి అంగీకరించాడు. విలీనం తర్వాత భారత సైన్యం కమ్యూనిస్ట్ దళాలతో తలపడి చాలామందిని చంపింది. కమ్యూనిస్ట్ నాయకులు, దళ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లారు. అత్యంత శిక్షణ పొందిన భారత సైన్యంతో సాధారణ ఆయుధాలతో పోరాడలేని పరిస్థితి వచ్చింది. ఈ స్థితిలో పోరాట విరమణకు సంబంధించి దళాలతో చర్చించి నిర్ణయం తీసుకోవడానికి సుందరయ్య మారుపేరుతో రహస్యంగా పోరాట ప్రాంతాలలో పర్యటించారు. పలు మార్లు దళ సభ్యులూ, పార్టీ నాయకులతో మాట్లాడిన తర్వాత సాయుధ పోరు విరమించేందుకు నిర్ణయం తీసుకున్నారు. 1955 నుంచి 1957 వరకు మొదటి రెండేండ్లు ఆంధ్ర శాసన సభలో, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సభ్యుడిగా, ఇంతకు ముందు రాజ్యసభ సభ్యుడిగా సుందరయ్య పనిచేశారు. ఆయన సునిశిత పరిశీలన, అధ్యయనాలకు ‘సాయుధ తెలంగాణ పోరాటం– గుణ పాఠాలు’, ‘ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర నీటి పథకం’ రచనలు అద్దం పడతాయి.1934లో ఉమ్మడి పార్టీలో కేంద్ర కమిటీ సభ్యుడిగా ఆ తర్వాత 1964లో పార్టీ చీలిక తర్వాత ఏర్పడిన సీపీఐ(ఎం) జాతీయ ప్రధాన కార్యదర్శిగా పీఎస్ బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా పని చేశారు. జీవితాంతం కమ్యూనిస్ట్ ఉద్యమ విస్తృతికి అవిశ్రాంతంగా పని చేసిన ఆయన 1985 మే 19న భౌతికంగా అస్తమించారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న విద్వేష రాజకీయాలను తిప్పికొడుతూ సామరస్య జీవనాన్ని కాపాడుకోవడమే సుందరయ్యకు మన మిచ్చే నిజమైన నివాళి అవుతుంది. జాలకంటి రంగారెడ్డి వ్యాసకర్త సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ‘ 9490098349 -
కోవిడ్ టీకాను ఎలా చూడాలి?
‘ఆస్ట్రా–జెనెకా’ తన కోవిడ్–19 టీకాలను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకోవడం చర్చనీయాంశం అయింది. ఆ టీకా వల్ల రక్తం గడ్డకట్టడం లాంటి దుష్ప్రభావాలు అరుదుగానైనా కలగడమే ఆ నిర్ణయానికి కారణం. ఇదే టీకాను ‘కోవిషీల్డ్’ పేరుతో ఇండియాలో కోట్లాది డోసులు వేయడం సహజంగానే ఆందోళన కలిగిస్తుంది. కానీ ఈ టీకా కేవలం పది నెలల్లోనే ఆమోదం పొందిన వాస్తవాన్ని విస్మరించకూడదు. మహమ్మారులు దాడి చేసినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజారోగ్య నిపుణులు, ప్రభుత్వాలు ప్రమాదంలో ఉన్న జనాభాను కాపాడుకోవాల్సి ఉంటుంది. భారత్ లాంటి పెద్ద దేశంలో ఆసుపత్రుల్లో పడకలు కూడా అందుబాటులో లేని కాలంలో, ఈ టీకా లక్షలాది మందిని చనిపోకుండా నిరోధించిందని మరిచిపోరాదు.ఆంగ్లో–స్వీడిష్ ఔషధ తయారీదారు అయిన ‘ఆస్ట్రా–జెనెకా’ తన కోవిడ్–19 టీకాలను ప్రపంచవ్యాప్తంగా ఉపసంహరించుకోవడం ప్రారంభించింది. భారతదేశంలో ‘కోవిషీల్డ్’ పేరుతో వచ్చిన ఈ టీకాను ఆస్ట్రా–జెనెకా సహకారంతో పుణెకు చెందిన ‘సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’ తయారు చేసింది. దేశ వ్యాప్తంగా దాదాపు 175 కోట్ల టీకా డోసులను అందించారు. టీకాల ఉపసంహరణకు ‘భిన్న రకాల వేరియంట్లకు బహుళ టీకాల లభ్యత వల్ల కాలం చెల్లిన టీకాలు మిగిలిపోవడం’ కారణమని ఆస్ట్రా–జెనెకా సంస్థ పేర్కొంది. సరళంగా చెప్పాలంటే, తీవ్రమైన దుష్ప్రభావాల కేసులకు సంబంధించిన కోర్టు విచారణలు,కంపెనీ ఎదుర్కొంటున్న 100–మిలియన్ పౌండ్ల(సుమారు వెయ్యి కోట్ల రూపాయలు) మేరకు క్లాస్ యాక్షన్ వ్యాజ్యం(ఎక్కువమందికి సంబంధించిన కేసు) నేపథ్యంలో ఇది కేవలం వ్యాపార నిర్ణయం. కోవిడ్–19 టీకా ‘చాలా అరుదైన సందర్భాల్లో, టీటీఎస్కు కారణం కావచ్చు’ అని కంపెనీ, ఫిబ్రవరిలో అంగీకరించినట్లు నివేదించబడింది.‘టీటీఎస్’ అంటే థ్రాంబోసైటోపెనియా సిండ్రోమ్తో థ్రాంబోసిస్. ఇది శరీరంలో ప్లేట్లెట్లు పడిపోవడానికీ, రక్తం గడ్డకట్టడానికీ కారణమవుతుంది. ఊపిరి ఆడకపోవడం, ఛాతీ నొప్పి, తలనొప్పులు, సులభంగా గాయపడటం వంటి లక్షణాలు దీంట్లో ఉంటాయి. బ్రిటన్ లో చాలా మంది వ్యక్తులు తాము వివిధ రకాల గాయాలతో బాధపడుతున్నామని పేర్కొన్నారు. భారతదేశంలో కూడా, కొన్ని కుటుంబాలు ఆస్ట్రా–జెనెకాపై, సీరమ్ సంస్థపై చట్టపరమైన చర్యలను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ప్రభుత్వాలు ఏమి చేయాలని ప్రజారోగ్యం నిర్దేశిస్తుంది, భారతదేశంలో దీనికి ఏదైనా భిన్నంగా చేయగలిగి ఉండేవాళ్లమా అనేదాని గురించి నేను ఆలోచిస్తున్నాను. మాజీ ప్రజారోగ్య పాలనాధికారిగా నా అభిప్రాయాలను ఇచ్చే ముందు, ఇద్దరు అత్యంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తులతో మాట్లాడాను. నేను మొదటగా భారతదేశ ప్రముఖ మైక్రోబయాలజిస్టు, వైరాలజిస్టులలో ఒకరైన డాక్టర్ గగన్ దీప్ కాంగ్తో మాట్లాడాను. ఆమె సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలోని ట్రాన్స్లేషనల్, హెల్త్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్ స్టిట్యూట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నాకు తెలుసు. ఆమె అభిప్రాయం మేరకు, ప్రపంచ ఆరోగ్య సంస్థ 2021 మార్చిలో అస్ట్రా–జెనెకా టీకా టీటీఎస్ దుష్ప్రభావం కలిగించే ప్రమాదం గురించి ప్రకటించింది. 2021 మే నాటికి దానిని ధ్రువీకరించింది. 2021 అక్టోబర్లో ‘కోవిషీల్డ్’కు సంబంధించిన ప్రమాద కారకాన్ని చేర్చడానికిగానూ సీరమ్ సంస్థ తన టీకా లేబుల్ను నవీకరించింది. టీటీఎస్ వల్ల, కొందరు రోగులు దుష్ప్రభావాలను ఎదుర్కొన్నట్లు, కొన్ని సందర్భాల్లో చివరికి మరణాలు సంభవించాయని మనకు పొడికథలుగా మాత్రమే తెలుసు. అలాంటప్పుడు టీకాను కొనసాగించడం లేదా కొనసాగించకపోవడం వల్ల కలిగే నష్టం ఏమిటి? మనకు ప్రత్యామ్నాయం ఉందా?గగన్దీప్ కాంగ్ మనకు తెలియని వాటి గురించి వివరించారు. ‘‘ప్రమాదం వయస్సుపై ఆధారపడి ఉంటుంది. ఇది భౌగోళికతపై కూడా ఆధారపడి ఉండొచ్చు. భౌగోళికత సమస్యను రోటావైరస్ టీకాల కోసం మనం చేసినట్లుగా ఫార్మావిజిలె¯Œ ్స ద్వారా మాత్రమే లెక్కించవచ్చు. నిష్క్రియాత్మకంగా అంటే ప్రజలు సమస్యను నివేదించే వరకు వేచి ఉండటం మరొక మార్గం. ఈ విధానంలో ఉన్న సమస్య ఏమిటంటే, టీకా వేసిన మొదటి కొన్ని గంటలలో లేదా రోజులలో దుష్ప్రభావం చూపకుంటే అది టీకాతో సంబంధం ఉన్నదిగా గుర్తించబడకపోవచ్చు.ప్రమాదం–ప్రయోజనం నిష్పత్తి, ముఖ్యంగా డెల్టా వేవ్ విషయంలో చూస్తే, ప్రయోజనమే ఎక్కువగా ఉండింది; ముఖ్యంగా వృద్ధులకు ఎక్కువగా, యువకులకు కొంత తక్కువగా. పాశ్చాత్య దేశాలను అనుసరించి, 40 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారికి కోవిషీల్డ్ను వేయడం నిలిపివేసి ఉంటే, మన ప్రత్యామ్నాయం ‘కోవాక్సిన్ ’ అయివుండేది. ఇది తక్కువ సరఫరాలో ఉంది. ఫలితంగా యువకులకు రోగనిరోధక శక్తి విస్తరించేది. భారతదేశానికి నిర్దిష్టంగా టీటీఎస్ డేటా లేనందున, పర్యవేక్షించడం కష్టంగా ఉండేది’’ అని ఆమె చెప్పారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్కు చెందిన సెంటర్ ఆఫ్ కమ్యూనిటీ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ ఆనంద్ కృష్ణన్ దీనిని విభిన్నంగా చెప్పారు: ‘‘అరుదైన దుష్ప్రభావం ప్రయోజనకరమైన కార్యక్రమాన్ని అడ్డుకోలేకపోవడానికి భారీస్థాయి ప్రజారోగ్య ప్రయోజనం కారణమైంది. దుష్ప్రభావాలపై దృష్టి కేంద్రీకరించడం వలన టీకా వేసుకోవాలా వద్దా అనే సంకోచం ఏర్పడుతుంది. అంటే మనం ఆ దుష్ప్రభావాలను దాచిపెట్టాలని కాదు... వెనక్కి చూసుకుంటే, మెరుగైన, మరింత సూక్ష్మమైన, సమతుల్యమైన సమాచారం సహాయపడి ఉండేదని చెప్పడం మెరుగు. అరుదైన దుష్ప్రభావాలను ఎదుర్కొన్న వారికి పరిహారం కోసం కూడా మనం ప్లాన్ చేసి ఉండవచ్చు.’’దుష్ప్రభావాల క్లెయిమ్లను పరిశీలించే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక పీడకలగా మారేదని చెప్పడానికి నాకు ఎలాంటి సంకోచమూ లేదు. టీకాలు అత్యంత వేగంగా పూర్తి చేయడానికి అవి పూర్తిగా కట్టుబడి ఉన్నాయి. మహమ్మారి దాడి చేసినప్పుడు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజారోగ్య నిపుణులు, ప్రభుత్వాలు ప్రమాదంలో ఉన్న జనాభాను కాపాడుకోవాల్సి ఉంటుంది. అత్యంత హాని కలిగే వారికి ప్రాధాన్యతనిచ్చి టీకాలు వేసేలా చూసుకోవాలి. భారతదేశంలో ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో లేని కాలంలో వేలాది మంది ప్రజలు చనిపోకుండా టీకాలు నిరోధించాయి.ఇక టీకాను అభివృద్ధి చేయడానికి తీసుకునే సాధారణ సమయం పదేళ్లు. దీనికి భిన్నంగా అస్ట్రా–జెనెకా టీకా కేవలం పది నెలల్లోనే ఆమోదం పొందిన వాస్తవాన్ని మనం విస్మరించకూడదు. దానిని తప్పక గుర్తించి, గౌరవించాలి. ఇది కచ్చితంగా లక్షలాది మందిని తీవ్రమైన అనారోగ్యాలకు గురికాకుండా లేదా చనిపోకుండా నిరోధించింది. తీవ్రమైన దుష్ప్రభావాల గురించి బాగా అర్థం చేసుకుని, నిర్ణయాలు తీసుకున్నవారు పట్టించుకుని ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. కానీ అంతేనా? ఏదైనా నిపుణుల సంఘం ఇచ్చిన ప్రతికూల సలహా దేన్నయినా అణచిపెట్టారా? రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకోవాల్సిన ముఖ్యమైన, చర్య తీసుకోదగిన సమాచారం ఏదైనా ఉండిందా? అలా కాదంటే మాత్రం వ్యాక్సిన్ డ్రైవ్ను వేగవంతం చేయడానికి ప్రయోజనపు సమతూకం స్పష్టంగా అనుకూలంగా ఉంది.భారతదేశంలోని భారీ జనాభాకు టీకాలు వేయకుండా ఆటంకం కలిగించే శక్తిమంతమైన టీకా వ్యతిరేక ఉద్యమాన్ని మనం అదృష్టవశాత్తూ చూడలేదు. రద్దీగా ఉండే నగరాలు, ఆరు లక్షలకు పైగా గ్రామాలలో ప్రజలు చెదిరిపోయి ఉన్నందున ప్రజారోగ్య స్పందన అనేది సహజంగానే పెద్ద ఎత్తున వ్యాధిగ్రస్తులను మరియు మరణాలను నిరోధించడానికి ఉద్దేశించారు. అందులో చర్చకు తావులేదు. కుటుంబాలు, సంఘాల ఎంపికకు టీకాను వదిలేసివుంటే, లక్షలాదిమందిని ప్రమాదంలో పడేసేది. వయసు లేదా భౌగోళికతపై లేని డేటాను వెతుకుతూ పోతే, టీకా కార్యక్రమం పట్టాలు తప్పివుండేది. ఒక్కో జిల్లాలో దాదాపు 20 లక్షల జనాభా కలిగిన భారతదేశంలోని దాదాపు 800కు పైగా జిల్లాల్లోని జిల్లా ఆరోగ్య కార్యకర్తలు అప్పటికే తీవ్ర పని ఒత్తిడిలో ఉన్నారు.కొన్ని సమయాల్లో, మంచి (ఈ సందర్భంలో, దుష్ప్రభావాలను పర్యవేక్షించడం) అనేది కూడా గొప్ప శత్రువుగా (లక్షలాదిమందికి టీకాలు అందని అపాయం ఉండటం) మారవచ్చు. భారతదేశానికి సంబంధించి, ఈ క్షణపు వాస్తవం ఇది!- వ్యాసకర్త కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి; మాజీ ప్రధాన కార్యదర్శి (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- శైలజా చంద్ర -
అనిశ్చితి కొనసాగితే అంతులేని నష్టం
ఏడాది తర్వాత కూడా మణిపుర్లో శాంతిభద్రతల పరిస్థితి మెరుగు పడలేదు. మణిపుర్ రాజధాని ఇంఫాల్తో నాగాలాండ్ను కలిపే జాతీయ రహదారి మీద ఉన్న వంతెనను దుండగులు పేల్చేశారు. మరో ఘటనలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లను చంపేశారు. అరాచకం ఎంత స్థాయికి వెళ్లిందంటే, న్యూఢిల్లీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని భావించే శక్తులు ఉన్నాయి.పదునైన టీమ్ వర్క్ ఫలితంగా అస్సాంలో శాంతి యుగానికి నాంది పడింది. అస్సాంలో జరిగినట్లుగానే మణిçపుర్, నాగాలాండ్, దక్షిణ అరుణాచల్ ప్రదేశ్లకు ఏకీకృత కమాండ్ వ్యవస్థ (యూనిఫైడ్ కమాండ్ స్ట్రక్చర్)ను తక్షణమే ఏర్పాటు చేయడం మేలు. ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని, అనిశ్చితిని ఇలాగే కొనసాగనిస్తే, మణిపుర్ కోలుకోలేని విధంగా నష్టపోతుంది.హింస చెలరేగిన ఏడాది తర్వాత కూడా మణిపుర్లో శాంతిభద్రతల పరిస్థితి మరింత దారుణంగానే ఉంది. ఈ రాష్ట్రంలోని ప్రధాన శక్తులు ఏకతాటిపైకి వచ్చి తక్షణ దిద్దుబాటు కోసం ఒక మార్గాన్ని అన్వేషించడమే ఇప్పుడున్న ఏకైక పరిష్కారం.సైన్యం లక్ష్యంగా దాడిమణిపుర్లో ఇటీవల జరిగిన మూడు సంఘటనలను దృష్టిలో పెట్టుకోవాలి. ఏప్రిల్ 24న కాంగ్పోక్పి జిల్లాలోని జాతీయ రహదారి–2పై ఉన్న వంతెన మీద దుండగులు ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ వంతెన ఇంఫాల్ను నాగాలాండ్లోని దిమాపూర్తో కలుపుతుంది. ఈ రహదారి రాష్ట్రానికి ప్రధాన జీవనాధారం. రాష్ట్రం నిలువునా చీలిపోయిన కారణంగా మణిపుర్ ప్రజలకు అవసరమైన సామగ్రిని తీసుకువెళ్లే 100కు పైగా ట్రక్కులు అక్కడ నిలిచిపోవాల్సి వచ్చింది.ఏప్రిల్ 27న బిష్ణుపూర్ జిల్లాలోని నారాన్సీనా వద్ద జరిగిన దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు మరణించారు. సీఆర్పీఎఫ్ జవాన్లు విడిది చేసి ఉన్న ప్రాంతానికి 200 మీటర్ల దూరంలోనే ఇండియా రిజర్వ్ బెటాలియన్ క్యాంపు (ఐఆర్బీ) ఉంది. ఐఆర్బీలో సిబ్బంది ప్రధానంగా మైతేయి కమ్యూనిటీకి చెందినవారు. సీఆర్పీఎఫ్ సిబ్బంది తమ శిబిరాన్ని ఖాళీ చేసే పనిలో ఉన్నారనీ, అక్కడ ఒక ప్లాటూన్ మాత్రమే మిగిలి ఉందనీ తెలియవచ్చింది.దాడి చేసినవారు ఐఆర్బీలోని మైతేయి సభ్యులను లక్ష్యంగా చేసుకున్నారని భావించే అవకాశం ఉంది; రాత్రిపూట దాడి జరిగినందున, వారు సీఆర్పీఎఫ్ శిబిరాన్ని ఐఆర్బీ అని పొరపడి ఉండొచ్చు.అయితే, ఆ దాడి లక్ష్యం సీఆర్పీఎఫ్ కూడా అయి ఉండవచ్చు – 1990ల మధ్యకాలంలో, అస్సాంలోని హిందీ మాట్లాడే ప్రజలను యథేచ్ఛగా హతమార్చడానికి ప్రయత్నించిన తిరుగుబాటు బృందం యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ (ఉల్ఫా) కార్యాచరణను ఇది తలపింపజేస్తోంది. అప్పట్లో ఉల్ఫా కేంద్రప్రభుత్వ దృష్టిని ఆకర్షించడానికి గట్టిగా ప్రయత్నించింది. అందులో విజయవంతం అయింది కూడా. ఉత్తరప్రదేశ్, బిహార్ల నుండి కొంతమంది ఎంపీలు హిందీ మాట్లాడే తమ సోదరులకు సహాయం చేయడానికి వెంటనే అస్సాంలో దిగారు. బయటి వ్యక్తులు తమ రాష్ట్రంలో దుకాణాలు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించే ఒక వర్గం అస్సామీ జనాభాలో ఉండేది. అది ఇప్పటికీ అలాగే ఉంది.నారాన్సీనా ఘటనకు సంబంధించి, మణిçపుర్లో అరాచకం ఎంత తీవ్రస్థాయికి వెళ్లిందంటే, న్యూఢిల్లీకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని భావించే శక్తులు ఉన్నాయి. కాకపోతే సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ వంటి కేంద్ర పారామిలిటరీ బలగాలను వీరు గతంలో లక్ష్యంగా చేసుకోలేదని గమనించడం ముఖ్యం.ఒకే తాటిపైకి వస్తేనే...వంతెనపై ఐఈడీ పేలుడు, సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడికి సంబంధించిన అనుమానపు చూపు ప్రధానంగా కుకీ మిలిటెంట్ల వైపు మళ్లింది. అయితే, అది చేసింది ఎవరైనా కావచ్చు. 2023 మే 3 నుండి నియంత్రణ లేకుండా ఉన్న రాష్ట్రంలో, దాదాపు ప్రతి సమూహం సైనికీకరించబడింది.మూడో విషయం రాజకీయ అండదండలతో కొనసాగుతున్న అరాచకానికి సంబంధించినది. అక్రమ ఆయుధాలతో ఉన్న అరామ్బాయీ తెంగోల్ సభ్యులను పట్టుకున్న తర్వాత, సైన్యానికి చెందిన కాస్పిర్ వాహనాన్ని మీరా పైబీలు(మహిళా బృందాలు) అడ్డగించారు. వందలాది మంది మీరా పైబీలు కాస్పిర్ను చుట్టుముట్టి సైనికులను దూషించారు. ఆ సమయంలో గనక సైనిక సిబ్బంది సంయమనం కోల్పోయి ఉంటే రక్తపాతం జరిగి ఉండేది.పదునైన టీమ్ వర్క్ ఫలితంగా అస్సాం శాంతి యుగానికి నాంది పలికింది. అస్సాంలో జరిగినట్లుగానే మణిçపుర్, నాగాలాండ్, దక్షిణ అరుణాచల్ ప్రదేశ్లకు ఏకీకృత కమాండ్ వ్యవస్థ (యూనిఫైడ్ కమాండ్ స్ట్రక్చర్)ను తక్షణమే ఏర్పాటు చేయడం మేలు. ఇది రంగాపహాడ్(నాగాలాండ్) కేంద్రంగా పనిచేసే 3 కోర్కు చెందిన జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మొత్తం నాయకత్వం కింద ఉండాలి. సహజంగానే సంప్రదింపుల తర్వాతే ఒక స్పష్టమైన స్వరం... శాంతి, సాధారణ స్థితికి రావడానికి కావాల్సిన వ్యూహాలు, మార్గాలు, సాధనాలపై దృష్టి పెట్టాలి. మణిçపుర్ విభజితమై ఉంది. రాష్ట్ర పోలీసు యంత్రాంగం దాదాపుగా పనిచేయడం లేదు. ఎటువంటి ఎదురూ లేని రాడికల్ మిలీషియా సంస్థకు పోలీస్ విభాగం తన బాధ్యతను వదిలేసుకుంది. కొంతమంది పోలీసులను ఆయుధాలు వదిలి వేయమని బలవంతం చేస్తూ అరామ్బాయీ తెంగోల్ ఒక డీఎస్పీని తీసుకెళ్లింది. ఇలాంటి తరుణంలో పోలీసులకు నాయకత్వం అవసరం. దురదృష్టవశాత్తు, అది పోలీసు శాఖ లోపల నుండి ఉద్భవించదు. దానిపై అధికారాన్ని 3 కోర్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ వంటి బలమైన సంస్థాగత మద్దతుతో కూడిన దృఢమైన నాయకుడికి అప్పగించాలి. అస్సాం రైఫిల్స్ అద్భుతంగా పని చేస్తోంది. కానీ అది పక్షపాత దృష్టితో ఉందని అన్యాయంగా ఆరోపణలు చేస్తున్నారు. మణిçపుర్ లోయ నివాసితులు దానిని తొలగించాలని కోరారు. మణిçపుర్లోని అనేక ప్రాంతాల నుండి సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం తొలగించబడింది. దాంతో రాష్ట్రంలో ప్రభుత్వేతర శక్తులు చేస్తున్న చర్యలను ఎవరైనా చూడవచ్చు. అస్సాం రైఫిల్స్ ఇప్పటికే 3 కోర్ కార్యాచరణ కమాండ్ కింద ఉంది. కానీ దీనిని ఏకీకృత కమాండ్ వ్యవస్థ(యూసీఎస్)లో భాగం చేస్తే... ఆర్మీ, మణిపుర్ పోలీస్, కేంద్ర పారామిలిటరీ బలగాలతో దాని కార్యాచరణ కదలికలను క్రమాంకనం చేయడానికి అది వీలు కల్పిస్తుంది. అంతేగాక, యూసీఎస్ లోని ఇతర అంతిమ వినియోగదారులకు అనుగుణంగా పటిష్ఠమైన నిఘా వీలవుతుంది.అన్నీ కలగలిసే...మణిçపుర్, నాగాలాండ్, దక్షిణ అరుణాచల్లకు పరస్పరం ముడిపడి ఉన్న సమస్యలే దీనికి కారణం. ఉదాహరణకు, ప్రత్యేక అడ్మినిస్ట్రేటివ్ జోన్లను ఏర్పర్చిన తర్వాత, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్– ఇసాక్– ముయివా (ఎన్ఎస్సీఎన్–ఐఎమ్) సహాయంతో లోయ–ఆధారిత తిరుగుబాటు గ్రూపులు మణిçపుర్లోకి ప్రవేశించే సమస్యనుంచి ఎవరూ తప్పించుకోలేరు. అలాగే, ‘ఈస్టర్న్ నాగా నేషనల్ గవర్నమెంట్’ నుండి ఎన్ఎస్సీఎన్–ఐఎమ్కు లభిస్తున్న మద్దతు వెలుగులోనే, దక్షిణ అరుణాచల్లోని తిరప్, చాంగ్లాంగ్, లాంగ్డింగ్ జిల్లాలలో జరిగే కుతంత్రాలను చూడాలి.భారత రాజ్యం, దాని సైన్యం చాలా శక్తిమంతమైనవి. అవి ఎలాంటి సవాలునైనా ఎదుర్కోగలవు. ఈ క్లిష్ట సమయంలో న్యూఢిల్లీ తీసుకోవాల్సిన ఏకైక చర్య తన బలగాలను బలోపేతం చేయడమే. అసాధ్యమైన వాటిని సాధించగల సామర్థ్యం సైన్యానికి ఉంది. ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని, అనిశ్చితిని ఇలాగే కొనసాగనిస్తే, మణిçపుర్ కోలుకోలేని విధంగా నష్టపోతుంది.- వ్యాసకర్త భద్రత – తీవ్రవాద వ్యవహారాల విశ్లేషకుడు (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- జైదీప్ సైకియా -
జగన్కు ఏపీ ఎందుకు జై కొట్టిందంటే..?
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టించబోతున్నారు. భారత ఎన్నికల చరిత్రను తిరగ రాయబోతున్నారు. దేశ రాజకీయాల్లో బలమైన ముద్ర వేయబోతున్నారు. 'జగన్ జనాలను ఎంత బలంగా నమ్మారో.. జనం కూడా జగన్ను అంతే బలంగా నమ్మారు'. ఇరువురికి ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకమే 81.6 శాతం పోలింగ్. ఇప్పటి వరకు 4 దశల్లో దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరిగాయి. ఏ రాష్ట్రంలోనూ ఆ స్థాయి పోలింగ్ నమోదు కాలేదు. 2014లో 78.41 శాతం, 2019లో 79.77 శాతం పోలింగ్ నమోదైంది. ఇప్పుడు అంతకు మించి పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళి, తన పాలనపై ఉన్న నమ్మకం, ప్రజల్లో విశ్వసనీయతే.. ముఖ్యమంత్రి జగన్ 151 సీట్ల మార్కును అధిగమిస్తారన్న ప్రకటనకు మూలం అని కనిపించింది.81.6 శాతం పోలింగ్ నమోదు కావడానికి చాలా కారణాలున్నాయి. పాజిటివ్ ఓటు, నెగిటివ్ ఓటు పోలింగ్ బూతుల్లో పోటీ పడ్డప్పటికీ పాజిటివ్ ఓటు ప్రభావం అధికంగా ఉన్నట్లు పోలింగ్ సరళిని బట్టి అర్థం చేసుకోవచ్చు. మే 13న ఏపీలో పోలింగ్ జరిగింది. సోమవారం పోలింగ్ జరిగింది. హైదరాబాద్ నుంచే కాక బెంగళూరు, చెన్నై, ఇతర రాష్ట్రాల నుంచి ఓటర్లు శుక్రవారం నుంచే ఆంధ్రప్రదేశ్కు రావడం మొదలు పెట్టారు. హైదరాబాద్ నుంచి వచ్చిన వారిలో 25 శాతం మంది కార్లలో వస్తే 75 శాతం మంది బస్సులు, రైళ్లలో స్వగ్రామాలకు చేరుకుని ఓట్లు వేశారు. వీరిలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, ఉద్యోగులు, మధ్ యతరగతి, దిగువ మధ్య తరగతి, బీపీఎల్ ప్రజలున్నారు. హైదరాబాద్లో వాచ్మెన్లుగా పని చేసేవారు, తాపీ పని చేసేవారు కూడా ఆదివారానికే ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. వీరు అత్యధికంగా వైఎస్సార్సీపీ వైపు మొగ్గు చూపారనే అంచనాలు వెలువడుతున్నాయి.వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఏపీలోని గ్రామాల స్వరూపం మారిపోయింది. గ్రామ స్వరాజ్యం సీఎం జగన్ తీసుకొచ్చారు. గాంధీ జీ కలలు కన్నా స్వరాజ్యాన్ని సీఎం జగన్ అత్యంత వేగంగా అమల్లోకి తీసుకురాగలిగారు. అభివృద్ది అంటే హైటెక్ సిటీ లాంటి బిల్డింగ్లు కాదని, అభివృద్ది అంటే గ్రామాల అభివృద్ధి అని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పడంలో సీఎం జగన్ సక్సెస్ అయ్యారు. గ్రామ సచివాలయాలు, 50 నుంచి 70 కుటుంబాలకు ఒక వాలంటీర్, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీలు ఈ రోజున ఏపీలోని గ్రామాల్లో దర్శనమిస్తున్నాయి.57 నెలల్లో సీఎంగా జగన్ ఇవన్నీ చేస్తే.. 14 ఏళ్లు పాలించిన చంద్రబాబు ఎందుకు చేయలేకపోయాడు అనేది సామాన్యుడు వేసుకున్న ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానమే 81. 6 శాతం ఓటింగ్. ఏపీలోని గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా ఉన్నాయి. నాడు నేడు కింద 46 వేల ప్రభుత్వ పాఠశాలలను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు సీఎం జగన్. దీని కోసం రూ.15 వేల కోట్లు ఖర్చు చేశారు. 8వ తరగతి నుంచి ట్యాబ్లు ఇస్తున్నారు. ఒక్క విద్యా రంగానికే రూ.72 వేల కోట్లు సీఎం జగన్ ఖర్చు చేశారు. 2014-19 మధ్య చంద్రబాబు 7 వేల ప్రభుత్వ పాఠశాలలు మూసేస్తే.. సీఎం జగన్ ప్రతి ఒక్కరిని చదివించడం తన బాధ్యత అని ప్రకటించి ఫస్ట్ క్లాస్ నుంచే నాణ్యమైన చదవు అందిస్తున్నారు. ఈ ఎఫెక్ట్ పోలింగ్ సరళిలో కచ్చితంగా కనిపించింది. పేద, దిగువ మధ్య తరగతి తల్లిదండ్రులు సీఎంగా మళ్లీ జగనే రావాలంటూ ఓటు వేసినట్లు కనిపించింది.కూటమిని ప్రజలు నమ్మలేదు. చంద్రబాబును అస్సలు నమ్మలేదు. పవన్ కల్యాణ్ను ప్రజలు ఛీదరించుకునే పరిస్థితి ఏర్పడింది. 2014లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చాయి. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు మేనిఫెస్టోలో 10 శాతం హామీలు కూడా అమలు చేయలేదు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణ మాఫీ చేయలేదు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి మోదీపై చంద్రబాబు చేసిన విమర్శలు ప్రజలు మరిచిపోలేదు. 2014 ఎన్నికల్లో బాబు హామీలు తన బాధ్యతన్న పవన్ తరువాత పట్టించుకోలేదు. ఇవన్నీ ప్రజలు మరిచిపోయారని కూటమి నేతలు అనుకుంటే పొరపాటు.2024లో ఏర్పడిన కూటమిని ప్రజలు నమ్మకపోవడానికి ఇవే కారణాలు. బాబు మేనిఫెస్టోను పట్టుకోవడానికి కూడా ఏపీ బీజేపీ ఇంచార్జి సిద్దార్థ్ ఇష్టంపడలేదంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు.. బాబు సూపర్ సిక్స్ హామీల గురించి ఏపీలో చర్చే జరగలేదు. కానీ.. జగన్ మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంటే మాత్రం IPL మ్యాచ్లు చూసినట్లు గ్రామీణ ప్రాంతాల్లో జనం టీవీల ముందు కూర్చొని చూశారు. ఇది జగన్ మీద ప్రజలకున్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. రైతు భరోసా, అమ్మ ఒడి పథకాలకు డబ్బులు పెంచిన జగన్.. మిగతా పథకాలకు పెంచకుండానే కొనసాగిస్తానన్నారు. అయినా.. ప్రజలు జగన్ వెంటే నిలబడినట్లు కనిపిస్తోంది. చంద్రబాబు "సంపద సృష్టి" హామీలను ప్రజలు పట్టించుకోను కూడా పట్టించుకోలేదు. చంద్రబాబు కూటమి కట్టింది తమ కోసం కాదని వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడానికే అని ప్రజలు బలంగా విశ్వసించారు.ఇచ్ఛాపురం (శ్రీకాకుళం) నుంచి కుప్పం (చిత్తూరు) దాకా ఫ్యాన్ గాలి బలంగా వీచినట్లు కనిపించింది. అత్యధికంగా దర్శిలో 90 శాతం పోలింగ్ నమోదైంది. కుప్పంలో 89 శాతం నమోదైంది. ఈ పోలింగ్ శాతాన్ని విశ్లేషిస్తే కుప్పంలో చంద్రబాబు పరిస్థితి అగమ్యగోచరంగా కనిపిస్తోంది. పిఠాపురంలో కూడా 85 శాతం పోలింగ్ నమోదైంది. పథకాల లబ్ధిదారులు ఓటేయ్యడం వల్లనే ఈ స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది. అంటే.. పిఠాపురంలో కూడా పవన్ ఓడిపోయే అవకాశాలు చాలా ఎక్కువుగా ఉన్నాయి.ఇక.. మంగళగిరి, హిందూపూర్ల్లో మామ, అల్లుళ్లు గెలిస్తారా..? లేదా..? అనే దానిపై సర్వేలు రకరకాలుగా చెబుతున్నాయి. మంగళగిరిలో ఎవరు బయటపడ్డ 2, 3 వేల ఓట్ల తేడా ఉంటుందంటున్నారు. ఇక... ఉమ్మడి గోదావరి జిల్లాల్లో కూటమి అనుకున్నట్లు ఓటు ట్రాన్సఫర్ కాలేదు. జనసేన ఓటర్లు టీడీపీకి వేయలేదు. టీడీపీ ఓటర్లు జనసేనకు వేయలేదు. బీజేపీ ఓటర్లు ఈ రెండు పార్టీలకు వేయలేదు. కొందరు ఎంపీ స్థానాలకు వేయలేదు. బీజేపీ - జనసేన పోటీ చేసిన 30 స్థానాల్లో వైసీపీ 25 స్థానాలు తక్కువ గాకుండా గెల్చుకుంటుందని చెబుతున్నారు. అత్యంత కీలకమైన విషయం ఏంటంటే... కాపులు కీలెరిగి వాతపెట్టారు. తమను ఓటు బ్యాంకు చేసి రాజకీయాలు చేయాలనుకున్నవారికి ఓటుతో సమాధానం చెప్పారు. గోదావరి జిల్లాల్లో కాపుల ఓట్లు సగానికంటే ఎక్కువ ఫ్యాన్వైపు మళ్లినట్టు సర్వేలు చెబుతున్నాయి.సీఎం జగన్ పాజిటివ్ ప్రచారం ముందు.. చంద్రబాబు నెగిటివ్ ప్రచారం నిలవలేకపోయింది. సిద్ధం సభల నుంచి ప్రచారంలో సీఎం జగన్ తన సత్తా చాటితే.. చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యక్తి గత విమర్శలతో ప్రజల నుంచి ఛీత్కారాలు ఎదుర్కొన్నారు. వివేకా హత్య గురించి ఒకసారి, దీని కోసం షర్మిల, సునీతలను తీసుకొచ్చినా అనుకున్న ఫలితం చంద్రబాబుకు కనిపించలేదు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా చంద్రబాబును రాజకీయంగా బతికించలేకపోయింది. సీఎం జగన్ టీవీకి ఇచ్చిన 2 గంటల 20 నిమిషాల ఇంటర్వ్యూ చాలా మంది మేధావులు, న్యూట్రల్స్ను ఫ్యాన్కు ఓటు పడేలా చేసింది.జగన్ ఇచ్చిన క్లారిటీ మేధావులను, న్యూట్రల్ పీపుల్ను ఆకట్టుకుంది. సంక్షేమం, అభివృద్ధిని సీఎం జగన్ బ్యాలెన్స్ చేసే విధానం, ఆర్ధిక వ్యవస్థపై ఆయనకున్న పట్టు, ప్రతి అంశంపై ఆయన మాట్లాడిన తీరు హైదరాబాద్ నుంచి చాలా మంది ఏపీకి వచ్చి ఓటేసేలా చేసింది. అదే సమయంలో చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూ ఏదో యథాలాపంగా జరిగిందని టీడీపీ నేతలే చెప్పుకున్నారు. జగన్ సంక్షేమ పథకాలకు ఏడాదికి రూ.70 వేల కోట్లు ఇస్తుంటేనే వామ్మో వాయ్యే అని గుండెలు బాదుకున్న టీడీపీ నేతలు, ఎల్లో మీడియా అంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తానన్న బాబును ప్రశ్నించకపోవడంపై సామాన్యులు పెదవి విరిచారు. చంద్రబాబు చెప్పిన సంక్షేమ పథకాలు అమలు కావాలంటే ఏడాదికి రూ.1.67 లక్షల కోట్లు కావాలి. ఈ డబ్బులు ఎక్కడ నుంచి తెస్తారన్న సీఎం జగన్ ప్రశ్నకు చంద్రబాబు నుంచి సరైన సమాధానం ఇప్పటికీ లేదు.57 నెలల తన పాలనలో సీఎం జగన్ చేసిన అభివృద్ది కళ్ల ముందు కనిపిస్తుంది. సంక్షేమం ప్రతి గడప తొక్కింది. జగన్ను ప్రజలు తమ బిడ్డ అనుకున్నారు. జగన్తోనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమని బలంగా నమ్మారు. మహిళలైతే జగన్తోనే తమ పిల్లలు బంగారు భవిష్యత్తు సాధ్యమని బలంగా విశ్వసించారు. కొత్తగా వచ్చిన ఓటర్లు కూడా జగన్ వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. విద్యా సంస్కరణలు, గ్రామీణ సచివాలయాలు, ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక వ్యవస్థను సరిదిద్దడం, కరోనా కాలంలో రాష్ట్ర ప్రజలను కంటికి రెప్పలా చూసుకోవడం యువతను ఆకట్టుకున్న అంశాలుగా తెలుస్తుంది. అలానే.. జాబ్ మేళాలు కూడా యువతలో బలమైన ముద్ర వేశాయి.అన్ని వర్గాల ప్రజలు ఓటు వేయడానికి కదిలి రావడం వల్లనే పోలింగ్ 80 శాతం దాటింది. పోలింగ్ సరళిని బట్టి పాజిటివ్ ఓటుగా సెఫాలజిస్ట్లు పరిగణిస్తున్నారు. పోలింగ్ తరువాత వెలువడిన సర్వేలు కూడా వైఎస్ఆర్ సీపీదే గెలుపని చెబుతున్నాయి.- వైవి రెడ్డి, సీనియర్ జర్నలిస్టు -
గాజాలో కూలుతున్న జ్ఞాన వ్యవస్థలు
ప్రపంచ బ్యాంకు ప్రకారం పాలస్తీనా అక్షరాస్యత రేటు 97.51 శాతం. పాలస్తీనియన్లు ‘ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యావంతులైన శరణార్థులు’. అయితే గాజాలోని విశ్వవిద్యాలయాలు ఇప్పుడు ఇజ్రాయెల్ దాడిలో నాశనమయ్యాయి. ఇప్పటివరకూ సుమారు 90 మందికి పైగా ప్రొఫెసర్లు ఈ దాడుల్లో మరణించారు. గాజా పిల్లల విద్యావకాశాలను నిర్మూలిస్తూ... పాఠశాలలు, పుస్తకాల దుకాణాలు, లైబ్రరీలు ధ్వంసమయ్యాయి. పాలస్తీనా విజ్ఞానం, జ్ఞానాన్ని ఉత్పత్తి చేసే సంస్థల వినాశనం సమస్త జ్ఞానాన్ని అంతమొందించడం కంటే తక్కువేమీ కాదు! ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు దీనిని అర్థం చేసుకున్నారు. అమెరికా, ఇతర దేశాలలోని విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థుల ఆందోళనలకు కారణం అదే.గాజాలోని విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థలపై ఇజ్రాయెల్ దాడి పాలస్తీనా విజ్ఞాన, పర్యావరణ వ్యవస్థలను నాశనం చేయడానికి చేసిన ఉద్దేశపూర్వక ప్రయత్నంగా కనిపిస్తుంది. ఇప్పటివరకు, మొత్తం 12 విశ్వవిద్యాలయాలు వైమానిక దాడులకు గురయ్యాయి. ఇజ్రాయెల్ లక్ష్యాలలో అల్–అజహర్ విశ్వవిద్యాలయం, ఇస్లామిక్ యూనివర్సిటీ ఆఫ్ గాజా (ఐయూజీ) ఉన్నాయి. దీని ఫలితంగా పాలస్తీనా అధ్యాపకులు, పండితులు, విద్యార్థులు సంవత్సరాల తరబడి సాగించిన పరిశోధన ధ్వంసమైపోయింది.ఐయూజీ ప్రెసిడెంట్, వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ సుఫియాన్ తాయెహ్, ఆయన కుటుంబ సభ్యులు విశ్వవిద్యాలయ క్యాంపస్పై జరిగిన ఇజ్రాయెల్ దాడిలో మరణించారు. ఐయూజీ అనేది గాజాకు చెందిన ప్రముఖ విద్యాసంస్థ. ప్రొఫెసర్ తాయెహ్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పరిశోధకుడు. అలాగే, కొనసాగుతున్న దాడిలో మరణించిన 90కి పైగా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లలో ఐయూజీలో ఆంగ్ల సాహిత్యం బోధించే డాక్టర్ రెఫాత్ అలరీర్ మరొకరు.పాలస్తీనా విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2024 జనవరి 20 వరకు దాదాపు 4,400 మంది విద్యార్థులు మరణించారు, 7,800 మంది గాయపడ్డారు. 231 మంది ఉపాధ్యాయులు, నిర్వాహకులు మరణించారు, 756 మంది గాయపడ్డారు. అలాగే 378 ప్రభుత్వ నిర్వహణలోని పాఠశాలలతోపాటు, గాజాలో యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) నిర్వహణలోని పాఠశాలలు పూర్తిగా లేదా పాక్షికంగా ధ్వంసమయ్యాయి. 2023 అక్టోబర్లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కనీసం 97 మంది జర్నలిస్టులు, మీడియా కార్యకర్తలతోపాటు 35,000కు పైగా ప్రజలు మరణించారు.‘‘దాదాపు 90,000 మంది పాలస్తీనియన్ విశ్వవిద్యాలయ విద్యార్థులు గాజాలోని విశ్వవిద్యాలయానికి హాజరు కాలేరు. 60 శాతానికి పైగా పాఠశాలలు, దాదాపు అన్ని విశ్వవిద్యాలయాలు, లెక్కలేనన్ని పుస్తకాల దుకాణాలు, లైబ్రరీలు దెబ్బతిన్నాయి లేదా ధ్వంసమయ్యాయి. గాజా పిల్లలు, యువకుల విద్యావకాశాలను నిర్మూలిస్తూ, యూనివర్సిటీల డీ¯Œ లు, ప్రముఖ పాలస్తీనా పండితులతో సహా... వందలాది మంది ఉపాధ్యాయులు, విద్యావేత్తలు చంపబడ్డారు’’ అని దక్షిణాఫ్రికా న్యాయపరమైన అంశాల ప్రతినిధి బ్లిన్నె నీ ఘ్రాలే అంతర్జాతీయ న్యాయస్థానంలో వెల్లడించారు.ప్రజల చిహ్నాలను, డాక్యుమెంట్ చరిత్రను తుడిచిపెడుతూ లైబ్రరీలు, ఆర్కైవ్లు, మ్యూజియంలతో సహా అనేక సాంస్కృతిక వారసత్వ ప్రదేశాలు కూడా ధ్వంసమయ్యాయి. పాలస్తీనా మేధావులు దీనిని ‘చరిత్ర నుండి పాలస్తీనా ఉనికిని తుడిచివేయడానికి’ చేసే ప్రయత్నంగా చూస్తున్నారు. కెనడియన్ అసోసియేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్కు రాసిన లేఖలో కెనడాలోని మౌంట్ రాయల్ యూనివర్సిటీకి చెందిన సోషియాలజీ ప్రొఫెసర్ ముహన్నద్ అయ్యాష్ దీనిని ‘రాజకీయ పటం నుండి పాలస్తీనాను తుడిచిపెట్టే ప్రయత్నం’గా పేర్కొన్నారు. ‘పాలస్తీనా విజ్ఞానం, విజ్ఞాన నిర్మాతలు మరియు జ్ఞానాన్ని ఉత్పత్తి చేసే సంస్థల వినాశనం సమస్త జ్ఞానాన్ని అంతమొందించడం(ఎపిస్టెమిసైడ్) కంటే తక్కువేమీ కాదు’ అని వ్యాఖ్యానించారు.‘ఎపిస్టెమిసైడ్’ అంటే జ్ఞాన వ్యవస్థను చంపడం, మూగబోయేలా చేయడం, నాశనం చేయడం లేదా విలువ తగ్గించడం అని అర్థం. సోషియాలజిస్ట్ బోవెంచురా డి సౌసా శాంటోస్ ఈ పదాన్ని రూపొందించారు. ‘వలస పాలన, అణచివేత, మారణహోమాల కారణంగా అధీన సంస్కృతిలో సంభవించే విజ్ఞాన మరణంగా’ దీనిని ఆయన అభివర్ణించారు. ఇది సైనికపరంగా, సైద్ధాంతికపరంగా రెండు విధాలుగానూ ఉండొచ్చు. ఇది విముక్తి పేరుతో స్వాధీనం, శాంతి పేరుతో దురాక్రమణ, జీవన పవిత్రత పేరుతో జీవన విధ్వంసం, హక్కుల పరిరక్షణ పేరుతో మానవ హక్కులను ఉల్లంఘించే రూపంలో జరగవచ్చు.1948లో ఇజ్రాయెల్కు స్థానం కల్పించడం కోసం తాము వైదొలగాల్సి వచ్చిన తర్వాత పాలస్తీనియన్ విద్యావంతులైన ఉన్నతవర్గాలు పాలస్తీనా విద్యావ్యవస్థను పునర్నిర్మించడానికి అత్యంత ప్రాధాన్యమిచ్చాయి. వారు విద్యను తమ జీవితాలను పునర్నిర్మించడానికి, పురోగతిని సాధించడానికి ఒక చోదకశక్తిగా భావించారు. అర్థవంతమైన సాంస్కృతిక మార్పిడి, శాస్త్రీయ పురోగతి, చరిత్రపై అవగాహన, సృజనాత్మక సాహిత్య రచనలతో గాజాను పాలస్తీనా సమాజాన్ని అభివృద్ధి చేసే ప్రదేశంగా మార్చాలనే ఆశతో అనేక మంది పండితులు వివిధ ప్రాంతాల నుండి అక్కడికి వెళ్లారు. ఇందులో వారు విజయం సాధించారా లేదా అనేది చర్చనీయాంశం. కానీ కచ్చితంగా, పాలస్తీనా నేడు అత్యధిక అక్షరాస్యత రేటు ఉన్న ప్రాంతాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం పాలస్తీనా అక్షరాస్యత రేటు 97.51 శాతం. పాలస్తీనియన్లను ‘ప్రపంచంలోనే అత్యుత్తమ విద్యావంతులైన శరణార్థులు’ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యావేత్తలు దీనిని అర్థం చేసుకున్నారు. అమెరికా, ఇతర దేశాలలోని విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు, విద్యార్థుల తిరుగుబాటు వెనుక ఉన్న కారణం అదే. పాలస్తీనా విద్యాసంస్థల్లో జరుగుతున్న ప్రతిధ్వనులు విదేశాల్లోని క్యాంపస్లలో వినిపిస్తున్నాయి. ఇజ్రాయెల్ దురాక్రమణకు అమెరికా ప్రభుత్వం అందిస్తున్న నిరంతర ద్రవ్య, సైనిక, దౌత్య, నైతిక మద్దతును నిరసిస్తూ అనేక విశ్వవిద్యాలయాలలో శిబిరాలు ఏర్పాటైనాయి. దాదాపు 10 విశ్వవిద్యాలయాలలోకి పోలీసులను పిలిపించారు, 645 మందిని అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిలో చాలా మందిని తర్వాత విడుదల చేశారు. ఉన్నత స్థాయి కొలంబియా, బోస్టన్ విశ్వవిద్యాలయాలు నిరసనల కేంద్రాలుగా మారాయి. ఈ రెండు విశ్వవిద్యాలయాల క్యాంపస్ల నుండి 200 మందికి పైగా అరెస్టులు చేశారు. గాజాలో కాల్పుల విరమణ పిలుపులో గణనీయమైన సంఖ్యలో అధ్యాపకులు పాల్గొన్నారు లేదా మద్దతు ఇచ్చారు. కొన్ని యూనివర్సిటీలలో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పాలనాధికారులు విరుచుకుపడ్డారు, వారిలో కొందరిని బహిష్కరించారు.లాస్ఏంజిల్స్లోని క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయం,ఇతర ప్రదేశాలలో పాలస్తీనా అనుకూల, ఇజ్రాయెల్ అనుకూల ప్రదర్శనకారుల మధ్య గొడవలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. పాలస్తీనా విద్యను విధ్వంసకరమైన విభజన దురదృష్టాల నుండి రక్షించడానికి ప్రపంచం తన స్వరాన్ని పెంచాలి. జ్ఞాన వ్యవస్థను నాశనం చేయడానికి వారాలు పడుతుంది. కానీ దానిని పునర్నిర్మించడానికి దశాబ్దాలు పడుతుంది.ఇజ్రాయెల్తో జట్టు కట్టిన దేశాలలోని కొన్ని విశ్వవిద్యాలయాలు దురదృష్టవశాత్తూ పాలస్తీనా సంస్థలతో విద్యా మార్పిడి ఒప్పందాలను కుదుర్చుకోవడానికి విముఖత చూపాయి. మరోవైపు, ఇజ్రాయెల్ విశ్వవిద్యాలయాల విద్యార్థులను అంతర్జాతీయ సహకారానికి చెందిన ప్రయోజనాలను ఆస్వాదించడానికి సాదరంగా స్వాగతించారు. ఇజ్రాయెల్ విశ్వవిద్యాలయాలు కెనడాకు చెందిన పోస్ట్–సెకండరీ సంస్థలతో ఇప్పటికే 60 విద్యా ఒప్పందాలను కలిగి ఉన్నాయి.ముఖ్యంగా అభివృద్ధి చెందిన ప్రపంచంలోని విద్యావేత్తలు, అధ్యాపక సంఘాలు, యూనియన్లు... అస్తవ్యస్తంగా ఉన్న పాలస్తీనా వ్యవస్థను పునర్నిర్మించడానికి వాగ్దానం చేయడంతో పాటు, యుద్ధాన్ని ముగించే వైపుగా ప్రజల అభిప్రాయాన్ని నిర్మించడానికి, ఆత్మపరిశీలన చేసుకోవడానికి ఇది తగిన సమయం.- వ్యాసకర్త నార్తర్న్ బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెసర్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)- అమర్జీత్ భుల్లర్ -
‘రక్షణ’కు ఒక దిగ్దర్శనం అవసరం!
బీజేపీ, కాంగ్రెస్ మేనిఫెస్టోలు జాతీయ భద్రతకు భిన్న మార్గాల్లో ప్రాధాన్యం ఇచ్చాయి. అయితే రెండూ కూడా అత్యాధునిక మిలటరీ ఆయుధాలను సమకూర్చుకోవటానికి ఏమంత ప్రాముఖ్యం ఇవ్వలేదు. దేశంలోని ఈ రెండు ప్రధాన జాతీయ పార్టీల మేనిఫెస్టోలు పరిశీలించిన తరువాత రక్షణ, భద్రత అంశాల విషయంలో కాంగ్రెస్ మేనిఫెస్టో కొంత మెరుగ్గా ఉన్నట్లు తోస్తోంది కానీ... త్రివిధ దళాల అధిపతులు, జాతీయ భద్రతా సలహాదారులు కలిసి ఉన్న డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ... జాతీయ భద్రత వ్యూహం ఒకదాన్ని రూపొందించే విషయం రెండు మేనిఫెస్టోల్లోనూ స్పష్టంగా లేదు. అంతేకాదు, మన రక్షణ రంగానికి ఇప్పుడు దిగ్దర్శనం చేసే ఒక ‘ప్రొఫెషనల్’ అవసరం కూడా ఎంతైనా ఉంది.బీజేపీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆత్మ నిర్భర్ భారత్’లో స్వావలంబనకు పెద్దపీట వేశారు కానీ... అత్యాధునిక మిలిటరీ ఆయుధాలను సమకూర్చుకోవడంపై మాత్రం దృష్టి పెట్టలేదు. జాతీయ భద్రత, రక్షణ వంటి విషయాల్లో భారతీయ జనతా పార్టీ తన మేనిఫెస్టోలో చాలా అంశాలను ప్రస్తావించింది కానీ... ఏవీ అంత సమగ్రంగా ఉన్నట్టు కనిపించవు. ‘మోదీకి గ్యారెంటీ ఫర్ సురక్షిత్ భారత్’ పేరుతో మోదీ ప్రభుత్వం తను సాధించిన విజయాలను వెల్లడించింది, భవిష్యత్తు కోసం కొన్ని హామీలను ఇచ్చింది. 2014 తరువాత దేశంలోని ఏ నగరంలోనూ ఉగ్రదాడి ఏదీ జరగలేదని బీజేపీ చెప్పుకుంటోంది. ఇందులో కీలకం ‘నగరం’ అన్న పదం. 2016లో పఠాన్కోట వైమానిక స్థావరం, యూరీలు; 2019లో పుల్వామా ఘటనల్లో ‘నగరాల’పై దాడులు జరగలేదు కాబట్టి తాము తప్పుగా ఏమీ చెప్పలేదని బీజేపీ సమర్థించుకోవచ్చు.దీంతోపాటే ఆర్టికల్ 370 రద్దు ప్రభావం జమ్మూ కశ్మీర్లో ఎలా ఉందో కూడా మేనిఫెస్టోలో ప్రస్తావించారు. వామపక్ష తీవ్రవాద సంబంధిత హింస 52 శాతం వరకూ తగ్గిందనీ, ఈశాన్య భారతదేశంలో చొరబాటుదారుల సమస్య 71 శాతం నెమ్మదించిందని కూడా ఇందులో వివరించారు. ఉగ్రవాదాన్ని అస్సలు సహించేది లేదని చెబుతూ మేనిఫెస్టోలో 2016 నాటి సర్జికల్ స్ట్రైక్స్, 2019 నాటి బాలాకోట్ దాడి గురించి చెప్పారు. చైనా, పాకిస్తాన్, మయన్మార్ సరిహద్దుల్లో అత్యాధునికమైన రీతిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామనీ, కార్యక్రమాలను వేగవంతం చేస్తామనీ, సాంకేతిక పరిజ్ఞానం సాయంతో స్మార్ట్ ఫెన్సింగ్ వంటివి ఏర్పాటు చేస్తామని కూడా బీజేపీ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. అయితే.. మణిపుర్ కూడా మన దేశ సరిహద్దులో ఉన్నా దాని ప్రస్తావన లేకపోవడం గమనార్హం. ‘మోదీకి గ్యారెంటీ ఫర్ గ్లోబల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్’ విభాగంలో రక్షణ రంగ ఉత్పత్తులను మరింత విస్తృత స్థాయిలో తయారు చేస్తామనీ, ‘మేడిన్ భారత్’ ఎగుమతులకు ఊతమిస్తామని కూడా చెప్పుకున్నారు. ఈ ప్రయత్నాల వల్ల వాయు, పదాతిదళాలకు అవసరమైన ఆయుధాలు, వ్యవస్థలను దేశీయంగానే తయారు చేసేందుకు ప్రోత్సాహం లభిస్తుందని వివరించారు. గత ఏడాది అంటే బీజేపీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు అయిన తరువాత ‘నేషన్ ఫస్ట్: ఫారిన్ పాలసీ అండ్ నేషనల్ సెక్యూరిటీ’ పేరుతో బీజేపీ ఒక బుక్లెట్ విడుదల చేసి. అందులో తాము సాధించిన ఘనతలను ప్రస్తావించడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రక్షణ, అంతర్గత భద్రతను, బయటి నుంచి రాగల సవాళ్లను వేర్వేరుగా సమీక్షించారు. లద్దాఖ్ ప్రాంతంలో సుమారు రెండు వేల కిలోమీటర్ల వైశాల్యమున్న భారత భూభాగాన్ని, మొత్తం 65 పెట్రోలింగ్ పోస్టుల్లో 25 పోస్టులపై పట్టు కోల్పోయామన్న విషయాన్ని కాంగ్రెస్ ప్రస్తావించింది. అధికారంలోకి వస్తే జాతీయ భద్రతా వ్యూహం (ఎన్ఎస్ఎస్) ఒకదాన్ని ఆవిష్కరిస్తామని ప్రకటించింది. అలాగే ఎప్పుడో 2009లో రక్షణ మంత్రి జారీ చేసిన ఆపరేషనల్ డైరెక్టివ్లను సమీక్షిస్తామనీ, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామక ప్రక్రియను పారదర్శకంగా, వ్యవస్థీకృతంగా చేస్తామని కూడా హామీలు ఇచ్చింది. రక్షణ శాఖకు తగినన్ని నిధులు కేటాయించడమే కాకుండా ఈ రంగంలో తిరోగమిస్తున్న అంశాలను మళ్లీ పట్టాలెక్కిస్తామని తెలిపింది. ‘అగ్నిపథ్’ పథకం రద్దుతో పాటుగా, జాతీయ భద్రతా కౌన్సిల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్లను పార్లమెంటు పర్యవేక్షణలో పనిచేసేలా మార్పులు చేస్తామనీ, వ్యూహాత్మక అవసరాలకు అంతర్జాతీయ స్థాయి సరుకు రవాణా వ్యవస్థను అభివృద్ధి చేస్తామనీ ‘వన్ ర్యాంక్– వన్ పెన్షన్’ అమల్లోని లోపాలను సవరిస్తామనీ వివరించింది. వైకల్యం కారణంగా లభించే పెన్షన్పై పన్నులు రద్దు చేస్తామని కూడా చెప్పింది. అంతర్గత భద్రత విషయాలను ప్రస్తావిస్తూ ద్వేషపూరిత ప్రసంగాలు, హింసలకు తావు ఇవ్వమనీ, ఇతర మతాల నిరాదరణనూ సహించబోమనీ స్పష్టం చేసింది. ‘నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్’ను ఆచరణలోకి తేవడం, ఏడాది లోపు ‘నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్’ ఏర్పాటు తమ లక్ష్యాలని వివరించింది. దేశంలోని రెండు ప్రధాన జాతీయ పార్టీల మేనిఫెస్టోలు పరిశీలించిన తరువాత కాంగ్రెస్ మేనిఫెస్టో రక్షణ, భద్రత అంశాల విషయంలో కాస్త మెరుగ్గా ఉన్నట్లు తోస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... మన ప్రభుత్వం రక్షణ రంగానికి జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో రెండు శాతం కంటే తక్కువ నిధులు కేటాయిస్తూండటం! ఫలితంగా మన మిలటరీ సామర్థ్యాలను చైనాకు దీటుగా మార్చుకునే విషయంలో వెనుకబడిపోయాం. త్రివిధ దళాల ఆధునికీకరణకు మరిన్ని నిధుల కేటాయిస్తామని ప్రభుత్వం చెబుతున్నా అగ్నిపథ్ లాంటి పథకాల పుణ్యమా అని ఈ ఆధునికీకరణ మరో పదేళ్లకు కానీ పూర్తికాని పరిస్థితి ఏర్పడింది. వన్ ర్యాంక్– వన్ పెన్షన్ బకాయిలు 2002–23లో మిలటరీ ఆధునికీకరణకు కేటాయించిన నిధుల కంటే ఎక్కువ కావడం, మిలటరీ సిబ్బంది సంఖ్యను మదింపు చేయడం ద్వారా ఈ లోటును అధిగమిస్తామని బీజేపీ చెప్పడం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయాలు. ఈ చర్యల కారణంగా మన యుద్ధ సన్నద్ధత, సామర్థ్యం తగ్గిపోయాయి. 2022లో కేవలం ఒక్క ఆర్మీలోనే 1.18 లక్షల ఖాళీలు ఉన్నాయంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆత్మ నిర్భరత’ కార్యక్రమం కూడా స్వావలంబనపై ఎక్కువ దృష్టి పెట్టింది కానీ... అత్యాధునిక ఆయుధాలనూ, వ్యవస్థలనూ ఏర్పాటు చేసుకోవడంపై కాదు. ఈ విషయాన్ని దేశ తొలి సీడీఎస్, దివంగత జనరల్ బిపిన్ రావత్ గతంలోనే కచ్చితంగా అంచనా కట్టారు. తగినన్ని, నాణ్యమైన ఆయుధ వ్యవస్థలు లేకపోయేందుకు ప్రస్తుతం అవలబిస్తున్న ‘ఎల్1’ టెండర్ వ్యవస్థ కారణం. మిత్ర దేశాలకు లైన్ ఆఫ్ క్రెడిట్ ఇవ్వడంతో రక్షణ రంగ ఎగుమతులు పెరిగాయి. ఈ దేశాలన్నీ ప్రాణాంతకమైనవి కాకుండా ఇతర పరికరాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. త్రివిధ దళాల అధిపతులు, జాతీయ భద్రతా సలహాదారులు కలిసి ఉన్న డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ జాతీయ భద్రత వ్యూహం ఒకదాన్ని ఇంకా రూపొందించాల్సి ఉంది. ముసాయిదా ఒకదాన్ని ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ 2021లోనే భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు ఇచ్చిన విషయం ప్రస్తావనార్హం. అప్పటి నుంచి ఇప్పటివరకూ దాన్ని అప్డేట్ చేస్తూనే ఉన్నారు.ఆర్మీ దళాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద, ముఖ్యమైన సమస్య వనరుల కొరత. దీంతోపాటే కేటాయించిన నిధులను సక్రమంగా వినియోగించక పోవటం కూడా. జాతీయ భద్రత విషయంలో 1980 మధ్య కాలం మిలటరీకి స్వర్ణయుగం అని చెప్పాలి. త్రివిధ దళాలు 15 ఏళ్ల రక్షణ ప్రణాళికను 1988లో పార్లమెంటులో ప్రస్తావించడం గమనార్హం. పదేళ్లలో బీజేపీ ఐదుగురు రక్షణ మంత్రులను నియమించింది. వీరిలో ఒకరు ఆర్థిక శాఖ మంత్రిగానూ పనిచేశారు. రెండుసార్లు రక్షణ మంత్రిత్వ శాఖను అదనపు బాధ్యతగా చేపట్టారు కూడా! మాజీ విదేశీ వ్యవహారాల కార్యదర్శి ఎస్.జయశంకర్ను ఆ శాఖ మంత్రిగానూ నియమించింది ఈ ప్రభుత్వం. జయశంకర్ అంతర్జాతీయ స్థాయిలో భారత్ ప్రభను వెలిగించారనడంలో సందేహం లేదు. అయితే దేశ రక్షణ రంగం కూడా ఇలాంటి ప్రొఫెషనల్ ఏర్పాటును కోరుకుంటోంది. రక్షణ మంత్రి లేదా ఆ శాఖ సహాయ మంత్రికైనా మిలటరీ విషయాలపై ఎంతో కొంత పట్టు ఉండాలి. దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడం సులువు అవుతుంది. పథకాల అమలు వేగవంతమవుతుంది. ఆత్మ నిర్భరత సాధ్యమవుతుంది.– వ్యాసకర్త మిలటరీ వ్యవహారాల వ్యాఖ్యాత- మేజర్ జనరల్ అశోక్ కె. మెహతా (రిటైర్డ్) -
వెచ్చని హృదయ రాగ సందేశం
ఇది నిన్ననే జరిగినట్లుగా నా జ్ఞాపకంలో స్పష్టంగా ఉంది. నిజానికైతే, నేను తొలిసారి ఫాదర్ టెర్రీ గిల్ఫెడర్ను కలిసింది నలభై ఏళ్ల కిందట! అది 1982 వేసవి చివరిలో... నిషా, నేను మా పెళ్లికి సిద్ధం అవుతున్న సమయం. ఒక క్యాథలిక్గా నిషా తను కోరుకున్న సంప్రదాయబద్ధమైన చర్చి వివాహానికి నేను నా అంగీకారాన్ని తెలిపినప్పుడు, స్థానిక పారిష్ చర్చి ప్రీస్ట్ను కలసి ఆయన చేత మూడు ఉపదేశాలు ఇప్పించుకోవలసి అవసరం ఏర్పడటం నన్ను చీకాకు పెట్టింది. కానీ వేరే దారి లేదు. వెదికితే, అతి దగ్గరగా నార్తంబర్లాండ్ అవెన్యూలో ఉన్న పునీత మేరీ మగ్దలీనా చర్చి ఒక్కటే నిషాకు ఒక క్రైస్తవేతరునితో వివాహం జరిపించేందుకు అంగీకరించింది, నిబంధనలకు లోబడి ఉండే షరతు మీద! సెప్టెంబరులో ఒక శనివారం, సాయంత్రం 6 గంటలప్పుడు నిషా, నేనూ ఫాదర్ టెర్రీ ఇంటి తలుపు తట్టాం. ఆయన తన డెస్క్ ముందు కూర్చొని ఉన్నారు. ఆయన కళ్లజోడు ముక్కు చివరికి దిగి ఉంది. ఆ చిన్న గదికి ఎదురుగా ఉన్న ఒక పాత, వెలసిపోయిన లెదర్ సోఫా మీద మేము కూర్చున్నాం. బయట ఎప్పుడూ లేనంత వేడిగా ఉంటే, లోపల వాతావరణం మంచులో ఉన్నట్లుగా ఉంది. నేను ఊరకే ఉండలేకపోతున్నాను. ‘‘షెర్రీ తీసుకుంటారా?’’ అని ఆయన అనటం నన్ను అమితంగా ఆశ్చర్యపరిచింది. ‘‘మీ ఇద్దరి గురించీ నాకు తెలియదు. కానీ నేను షెర్రీ పట్ల కొంత మొగ్గుగానే ఉన్నాను’’ అన్నారు.అది టియో పెపె. నాకు ఇష్టమైనది. షెర్రీ బ్రాండ్. కానీ ఆ రోజుల్లో లండన్లో అది చాలా అరుదుగా మాత్రమే దొరికేది. ఫాదర్ టెర్రీ వివేచనతో కూడిన అభిరుచి గల వ్యక్తి. నేను ఆయనతో యూఎస్ ఓపెన్ టెన్నిస్, నాటింగ్ హిల్ కార్నివాల్, రష్దీ ‘మిడ్నైట్ చిల్డ్రన్’ వంటివాటిపై చర్చిస్తూ ఉన్నాను– మేము చేసుకోబోయే వివాహం, మాకు పుట్టబోయే పిల్లలు ఏ మతాన్ని అనుసరించవలసి ఉంటుంది– అనేవి తప్ప... అన్నీ. ఫాదర్ టెర్రీ మా గ్లాసులను నింపుతూ సంభాషణను నడిపిస్తున్నారు. ఆయన నా వాదనను గ్రోలుతూనే, తన వాదనను సౌఖ్యంగా నిలిపి ఉంచుకుంటున్నారు. కాలం ఉల్లాసవంతమైన వేగంతో గడిచిపోయింది. వచ్చేవారం కలుద్దాం అనుకున్నాక, బయల్దేరేందుకు మేము లేచి నిలబడ్డాం. ఫాదర్ టెర్రీ మమ్మల్ని ఆపినప్పుడు మేము తలుపు దగ్గర ఉన్నాం. ‘‘మీరు ఆలోచించాలని నేను కోరుకుంటున్న విషయమై ఒక ప్రశ్న నా దగ్గర ఉంది’’ అన్నారు. ఆ ప్రశ్నకు సూచనగా చిరునవ్వొకటి విశాలమైన ఆయన గుండ్రటి ముఖం మీద నాట్యమాడింది. ఆయన కళ్లు సూటిగా మావైపే చూస్తున్నాయి. ‘‘మీరిద్దరూ కలిసి ఎందుకు సహజీవనం చేయకూడదు?’’ అన్నారు ఫాదర్ టెర్రీ. మా ముఖాల్లోంచి రక్తం చివ్వున చిమ్మిందేమో నేను కచ్చితంగా చెప్పలేను కానీ, మేమిద్దరం మాత్రం నోట మాట రాక అలా ఉండిపోయాం. నిజం ఏమిటంటే నిషా, నేను అప్పటికే సహజీవనంలో ఉంటూ ఆ వాస్తవాన్ని దాచటానికి ఉద్దేశపూర్వకంగానే ఫాదర్ టెర్రీకి వేర్వేరు చిరునామాలను ఇచ్చాం. అది ఆయన ఊహించారు. అందుకే తన పద్ధతిలో అదేం పెద్ద విషయం కాదన్నట్లు చెప్పారు. నిషా పూర్తి క్రైస్తవ సంప్రదాయంలో వివాహాన్ని కోరుకుంది. వరుడు క్రైస్తవుడు కాదు అనే విషయాన్ని పట్టించుకోకుండా ఫాదర్ టెర్రీ అందుకు సమ్మతించారు. ఆయన ఉపదేశ వాక్యం అందరి దృష్టిని ఆకర్షించింది. నరకం, అపరాధం, దైవం, çసచ్ఛీలత... వీటి గురించి ఆయన ఉపదేశించలేదు. ‘‘ఐ లవ్ యు’’ అనే మూడు చిన్న పదాల గురించి మాట్లాడారు. ‘‘కరణ్, నిషా...’’, ‘‘గుర్తుంచుకోండి. ‘ఐ’ నీ, ‘యు’నీ ‘లవ్’ జత కలుపుతుంది. కానీ అది వేరు కూడా చేస్తుంది. మీరిద్దరూ వేర్వేరు వ్యక్తులని మీరు మరచిపోయిన రోజున మీ బంధం విడిపోతుంది’’ అన్నారు ఫాదర్ టెర్రీ. అదొక వెచ్చని, తేలికపాటి, హృదయపూర్వక సందేశం. లాంఛనప్రాయమైన తంతు కంటే కూడా నిప్పు చుట్టూ కూర్చొని మాట్లాడుకోవటం వంటిది. కానీ అది పావు శతాబ్దం పాటు నా మదిలో వెలుగుతూనే ఉండిపోయింది. ఆరేళ్ల తర్వాత, ఆసుపత్రిలో నిషా చివరి ఘడియల్లో ఉన్నప్పుడు లైఫ్ సపోర్టును తొలగించటానికి కొన్ని నిమిషాల ముందు ఫాదర్ టెర్రీ ఆమె పక్కనే ఉన్నారు. ఆమెకు చివరి మతకర్మను నిర్వహించారు. అమ్మను కూడా హైందవ సంప్రదాయం ప్రకారం నిషా చెవిలో ప్రార్థనలు వినిపించమని ప్రోత్సహించారు. ఆ తర్వాత యంత్రాలు మెల్లగా, బాధగా మినుకు మినుకుమని కొడిగడుతున్నప్పుడు నిషా అంతిమ శ్వాసలో ఫాదర్ టెర్రీ నా పక్కన నిలబడ్డారు. నాకు తెలిసిన ఏకైక క్రైస్తవ మత గురువు టెర్రీ గిల్ఫెడర్. ఆయన ఒక వింత మనిషి అయినప్పటికీ ఒక గొప్ప వ్యక్తి. ఒరిస్సా, కర్ణాటకలలో క్రైస్తవులపై జరిగిన దాడి గురించి చదివిన ప్రతిసారీ నేను ఆయన గురించి ఆలోచిస్తాను. గాయపడిన హృదయాలను నయం చేసే పదాలను ఆయన కనుగొని ఉంటారని నేను నమ్ముతాను. అందుకు నిస్సందేహంగా ఆయనకు షెర్రీ సహాయపడి ఉంటుంది. కరణ్ థాపర్ – వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఆశల వసంతం... నిస్పృహల శిశిరం
అవినీతిపై యుద్ధం అని చెప్పి గెలిచిన ఎన్డీఏ కూటమి అవినీతిని అరికట్టలేకపోయింది. దానికి బదులు ఈ కూటమి పాలనా కాలంలో కొద్దిమందిగా ఉన్న కోటీశ్వరుల సంఖ పెరిగింది. ఇప్పుడు వారంతా మహా కోటీశ్వరులుగా మారారు. ఏడీఆర్ తాజా నివేదిక ప్రకారం... ఇక దేశంలో ‘ఆరుగాలమూ’ పాలనలో తిష్ఠవేసేది అవినీతిపరుల, కోటీశ్వరుల, మహాకోటీశ్వరుల పాలనేనని రుజువైంది. రాజ్యాంగాన్ని మార్చడం అనే విషయమూ ఎన్నికల కాలంలో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో తాము రాజ్యాంగాన్ని మార్చబోమని అధికార పార్టీవారు స్పష్టం చేయవలసివచ్చింది.‘‘తయారయ్యే ప్రతీ తుపాకీ, రంగంలో ఉన్న ప్రతీ యుద్ధనౌక, మనం ఉపయోగించే ప్రతీ రాకెట్టూ – ఆకలిదప్పులతో మలమల మాడుతున్న, మనం మాడ్చుతున్న పేదసాదల కష్టార్జితం నుంచి దోచుకున్నదే’’– అమెరికా మాజీ అధ్యక్షుడు ఐజెన్హోవర్ విస్పష్ట ప్రకటన‘‘నేటి భారతదేశంలోని లెజిస్లేటర్లలో 360 మంది నేర చరిత్రులేనని, 476 మంది కోటీశ్వరులని, ఒక అభ్యర్థి రూ. 5 వేల కోట్లతో అగ్రస్థానంలో ఉన్నారనీ, లోక్సభ నాలుగో విడత అభ్యర్థులపై తాజాగా ‘ఏడీఆర్’ (అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్) సాధికార నివేదిక వెల్లడించింది. మొత్తం 1,717 మంది పోటీ పడే అభ్యర్థుల్లో 1,710 మంది వాఙ్మూలాలను విశ్లేషించి ఈ నివేదికను విడుదల చేసింది.’’ఏడీఆర్ తాజా నివేదిక ప్రకారం... ఇక దేశంలో ‘ఆరుగాలమూ’ పాలనలో తిçష్ఠవేసేది అవినీతిపరుల, కోటీశ్వరుల, మహాకోటీశ్వరుల పాలనేనని రుజువైంది. కానీ మళ్లీ అదే ఎన్డీఏ ముఠా నినాదం – ‘వచ్చే అయిదేళ్ళు అవినీతిపై యుద్ధమే’నని! ఇప్పటిదాకా ఎన్డీఏ కూటమి ‘అవినీతిపై యుద్ధంలో’ సాధించిన విజయాలేమిటో మోదీ చెప్పగలరా? దేశ సమైక్యత అంటూనే దేశంలో విభజనకు ఎన్డీఏ అవకాశం కలిగేలా వ్యవహరిస్తోంది. ఉత్తర–దక్షిణ భారతాల మధ్య విభజన రేఖకు ప్రస్తుత కేంద్రం వ్యవహారశైలి దారి తీస్తుందనేది కొందరి వాదన.వేలాది గుజరాత్ దళిత పేదసాదలపై దారుణ హత్యాకాండకు కారకులైన నాటి బీజేపీ నాయకులు ఆ ఉన్మాద చరిత్రను దాచడానికి ప్రయత్నిస్తూ సుప్రీంకోర్టు విచారణను సహితం పక్కదారులు పట్టించారు. అయినా బీజేపీ–ఆరెస్సెస్ కూటమిగా ఉన్న ఎన్డీఏ ‘రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నట్టు’ పచ్చి అబద్ధమాడుతూ ఇప్పుడు తాజాగా సరికొత్త ఎదురుదాడికి సాహసిస్తోంది. పైగా, ‘భారత రాజ్యాంగాన్ని దాన్ని రూపొందించిన డాక్టర్ అంబేడ్కర్ కూడా మార్చలేరని’ తాజాగా ప్రధాని మోదీ బాహాటంగా ‘కోతల’కు దిగడం అత్యంత హాస్యాస్పదం! నిజానికి మనకు మోదీ హయాంలో రాజ్యాంగం అమలులో ఉందానిపిస్తోంది. ఉంటే, విదేశీ ‘పెగసస్’ సాఫ్ట్వేర్ ద్వారా దేశ యువకులను వేధించడానికి భారత పాలకులు సాహసించేవారు కాదు! రాజ్యాంగ నిర్మాతగా అంబేడ్కర్ తను రూపొందించిన రాజ్యాంగాన్ని ఏదో తానే మార్చేయబోతున్నట్టు మోదీ ఊహించుకుని అంబేడ్కర్ సహితం దాన్ని మార్చలేరని ‘ట్విస్టు’ ఇచ్చారు! పైగా ‘నేనింతవరకు ఈ స్థాయికి ఎదగడానికి సాయపడిన రాజ్యాంగానికి రుణపడి ఉన్నానని’ మరో ట్విస్టు ఇచ్చారు! బీజేపీ నాయకుల్లో కొందరు 400 లోక్సభా స్థానాలు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చివేస్తామనే ప్రకటనలు ఇవ్వడం, దానిపై దేశవ్యాప్తంగా నిరసన గళాలు లేవడం తెలిసిందే. అందుకే మోదీ రాజ్యాంగాన్ని ఎవ్వరూ మార్చలేరని ప్రకటించాల్సి వచ్చింది.మనకో గొప్ప సామెత ఉంది – కంపు నోటి వాడు సంపాదిస్తే, కమ్మని నోటి వాడు ఎగేసుకుపోయాడని! తన సమకాలీన సమాజంలోని అంతరాల దొంతర్లను, అకృత్యాలను, అన్యాయాలనూ, మౌఢ్యాన్నీ చాటలతో చెరిగి ప్రజల సుఖదుఃఖాలకు అద్దంపట్టిన ఇంగ్లండ్ మహా రచయిత చార్లెస్ డికెన్స్ ‘రెండు మహానగరాలు’ అన్న రచనలో చెప్పిన మాటలు నేటికీ చిరస్మరణీయాలే! అపార దేశ సంపద మధ్యనే దారుణమైన దారిద్య్రం తాండవమాడుతోంది. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని దశాబ్దాలైనా సగటు మనిషి జీవితం దుర్లభం కావడం, కేవలం కొద్దిమందిగా ఉన్న కోటీశ్వరుల సంఖ్య అమాంతం పెరిగి మహా కోటీశ్వరులుగా మారిపోవడం చూస్తున్నాం. అందుకే డికెన్స్ మహాశయుడు తన కాలం నాటి ఇంగ్లండ్ పరిస్థితులను వర్ణించిన మహా వాక్యాలను తిలకించండి:‘‘అవి ఎంతో మంచి రోజులు. అలాగే అవి పరమ చెడ్డ రోజులు కూడా. అది జ్ఞానంతో కూడిన వివేచనా యుగం, అయినా అది మూర్ఖపు యుగం కూడా. అది విశ్వసించదగిన శకం, కానీ అది నమ్మలేని యుగం కూడా. అది అంధకారాన్ని చీల్చగలిగిన క్రాంతికి అరుదైన సమయం కూడా. అయినా అది అంధకారానికి ప్రతీక కూడా. అది ఆశల వసంతకాలం, కానీ అది నిరాశా నిస్పృహల శిశిరం కూడా. అన్నీ మా కళ్లముందే పరుచుకుని ఉన్నాయి, అయినా మా కళ్లముందు ఉండవు!’’విచిత్రమైన విషయం ఏమంటే– రాజ్యాంగాన్ని ఏదో అంబేడ్కర్ మార్చదలచినట్టు ‘భావించి’ ఒకవేళ ‘మార్చుదామనుకున్నా మార్చలేడ’ని, అలాగే ఎన్డీఏ–ఆరెస్సెస్ కూటమి మార్చుదామనుకున్నా మార్చలేదనీ ప్రకటించిన ఎన్డీఏ నాయకుడు ‘నేనీ స్థితికి (ప్రధాని పదవికి) వచ్చానంటే నన్నీ ఉన్నత స్థితికి తీసుకొచ్చింది రాజ్యాంగమే’నని ప్రకటించుకోవడం వింతలలో వింతగా ఉంది. కానీ భారత రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్లెవరూ ఫాసిస్టుల చేతుల్లో దాన్ని పెట్టి, భ్రష్టు పట్టించరు గాక పట్టించరు. మహాకవి జాషువా ఇవాళ కాదు, దశాబ్దాల క్రితమే ‘హైందవ నాగరాజు’ నీడల్ని పసికట్టి భారంగా ఒక సత్యాన్ని చాటాడు. ‘స్వాతంత్య్రంబును సర్వసౌఖ్యమున మా భాగంబు మాకిత్తురో, ఖాతాలేదని త్రోసిపుచ్చెదరో! వక్కాణింపవే చెల్లెలా!’ఈ ప్రశ్నలో అప్పటికీ ఇప్పటికీ పెద్ద మార్పు లేదు, ఎంతసేపటికీ దళితుల ఖాతాలు మార్చడం తప్ప, ఉమ్మడి సొత్తులో వారి ఖాతాలు ఈ రోజుకీ మెరుగుపర్చింది లేదు. ఎందుకంటే జాతి వివక్షా విధానంలో, కులం కుళ్లు అంతర్భాగమనీ, ఇండియాలో వర్గమూ, వర్ణమూ అవినాభావ సంబంధం కలిగి, కుల సమస్యగా, వర్ణ వివక్షా సమస్యగా మనిషి ఉనికినీ, ఉసురునూ, ఉపాధినీ దెబ్బతీసే వికృత సమస్యగా ఉంది. ఇదే విషయాన్ని 50 స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవోలు) 300 మంది కార్యకర్తలతో కలిసి ఒక ఫోరమ్గా ఏర్పడి ‘దర్బన్’ సభకు 18 పేజీల డాక్యుమెంట్ను సమర్పించారు. ఇది ఫోరమ్ స్థాయిలో సర్వాంగీకారం పొందిన పత్రం. ఈ దర్బన్ సభలో ‘పరివార్’ ప్రభుత్వ ప్రతినిధి పాల్గొని ‘కుల సమస్య’ దర్బన్ సభ ఎజెండాలోకి రాకుండా, వర్ణ వివక్షను పెంచి పోషిస్తున్న అమెరికా, తదితర పాశ్చాత్య రాజ్యాల అండతో సమస్యను దాటవేశారు. అలా బీజేపీ ఈ దాటవేతలో ‘జయప్రద’మయింది! చివరికి ఇప్పుడు మన దేశంలో ‘బీజేపీ పరివార్’ ప్రభుత్వం ఏ స్థాయికి ఎదిగిపోయింది? దేశ బడ్జెట్లు, బిల్లులు శాసన వేదికలో సరైన చర్చ లేకుండానే మూజువాణీ ఓటుతో ఆమోదించి ముద్ర వేసుకోవడమే! నేర చరిత్ర గల అభ్యర్థులను డబ్బు కోసం కక్కుర్తిపడి పాలక పక్షం సహా దాదాపు అన్ని పక్షాలూ (కొన్నే మినహాయింపులు) ఆశ్రయించి, ఆమోదించడం! ఇదీ మన శాసన వేదికల, అభ్యర్థుల చరిత్ర, భాగోతం!వివేకానందుడు, హరిదాస్ విహారిదాస్ దేశాయ్కి చికాగో నుంచి లేఖ రాస్తూ ఇలా అన్నారు: ‘అణగారిపోతున్న అసంఖ్యాక నిరుపేద కష్టజీవుల రక్త మాంసాలపై ఆధారపడి విద్యావంతుడై, కులాసా జీవితం గడిపే ప్రతి ఒక్కరినీ దేశ ద్రోహిగా పరిగణించాలి. మన సంస్కర్తలు అసలు ‘జబ్బు’ ఎక్కడుందో చూడరు. విగ్రహాల వల్ల లాభం లేదు. హిందువనీ, ముసల్మాన్ అనీ, క్రిస్టియన్ అనే పేర్ల చాటున ఆ మతాల పదఘట్టన కింద కకావికలమవుతున్న ప్రజా బాహుళ్యం... ధన సంచులున్న వాడి పాదాల కింద శాశ్వతంగా పడి నలిగి పోవడానికే తాము పుట్టామన్న భావనకు గురి కారాదు. విగ్రహాలు ఉంటాయో, ఊడతాయో, కులాలు మంచివా, చెడ్డవా ప్రశ్నలు మనకు అనవసరం. పేదల మనస్సుల్లో భావవ్యాప్తి జరిగిన మరుక్షణం, మిగతా కార్యాచరణను వారే పూర్తి చేస్తారు!’ఏబీకే ప్రసాద్సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
నూటికి తొంభై మార్కులు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా నమస్కారం! నా పేరు డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ. నేను పుట్టి పెరిగింది హిందూపురంలో. గత ఇరవై ఏళ్ళుగా అమెరికాలో, గత పదేళ్ళుగా టెక్సాస్లోని డాలస్ నగరంలో ఉంటున్నాం. వృత్తి రీత్యా అమెరికా ప్రభుత్వ వైద్యునిగా పని చేస్తున్నాను. నేను పుట్టి బుద్ధెరిగాక పట్టుకున్న మొదటి జెండా అన్నగారి ‘తెలుగుదేశం’ జెండానే! మా నాన్న హిందూపురంలో తెలుగుదేశం పార్టీ కోసం షామియానా వేసి, మైకుసెట్టు పెట్టి చేసిన ప్రచారం ఇంకా గుర్తుంది. అలాగే నేటికీ నలభై ఏళ్ళుగా గుండెల నిండా నింపుకున్న అభిమానంతో మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానిని కూడా! గత జనవరిలో నేను అనంతపురం వచ్చాను. అంతకు ముందు నేను పనిచేసిన పాతూరు ప్రభుత్వాసుపత్రిని సి.డి. ఆసుపత్రి అనేవారు. నేను పనిచేసినప్పుడు కానీ,గత రెండేళ్ళ వరకూ కానీ అది ఒక పాడుపడిన వందేళ్ళ నాటి పెంకుటిల్లులాంటి భవనంలో ఉండేది. రెండేళ్ళ క్రితం కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో రూపొందించిన ఒక నూతన భవనంలో నడుస్తోంది. ఐదారు మంది డాక్టర్లు, పాతికమంది వరకూ ఇతర ఉద్యోగులతో మంచి వైద్యకేంద్రంగా రూపొందింది. ఆ ఆసుపత్రిని ఇలా చూడడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. మరో ముఖ్యమైన అంశం ప్రభుత్వ విద్య. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని వచ్చినవాళ్ళం... ఏదో కొంత మంది మాత్రమే ఉన్న కొద్ది వనరులను ఉపయోగించుకొని జీవితంలో ఓ స్థాయికి చేరాము. అలా సార్వజనీనమైన అవకాశాలను అందిపుచ్చుకొని అందరూ అదే రకమైన విజయాన్ని అందుకోలేక పోయారు. అలాంటిది, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు జరుగుతున్న విద్యాబోధన, తెలుగుతో పాటు ఆంగ్లమాధ్యమంలో చదివించడం, చిన్న తనం నుంచే డిజిటల్ మీడియాతో వాళ్ళకు విద్యను బోధించడం చాలాచోట్ల చూసి ఆశ్చర్యపోయాను. అలాగే నీటైన యూనిఫాం, బ్యాగులు, పుస్తకాలు, కాళ్లకు షూస్తో సహా వాళ్లకు అందించి పిల్లలలో ఆ వయస్సు నుంచే ఒక ఆత్మ విశ్వాసాన్ని, స్థైర్యాన్ని పెంచి వారి వ్యక్తిత్వానికి మంచి పునాదులు పడేలా చేసింది. అభివృద్ధి అనేదానికి – పెద్ద నగరాల్లో ఓ పెద్ద ఐకియా స్టోర్, ఎంజాయ్ చేయడానికి పబ్బులు, పెద్ద పెద్ద బిల్డింగులు, విశాలమైన రోడ్లు – ఇవి మాత్రమే సూచికలు కాకూడదు. అభివృద్ధికి ఒక సూచిక ఏమిటంటే దారిద్య్ర రేఖ దిగువన ఉన్న ప్రజలు ఎంతవరకూ బాగుపడ్డారు? అది గత ఐదేళ్ళలో చూసుకుంటే సగటు ఆటోరిక్షా నడిపే కార్మికుడు, అరటికాయలు అమ్మి పొట్టపోసుకునే కార్మికురాలు, రోడ్డుసైడు మెకానిక్కు, ఒక సన్నకారు రైతు – వీళ్ళకు కనీస భరోసా లభిస్తోంది. ‘మా పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతోంది, మాకు రోగమొస్తే ప్రభుత్వ ప్రాథమిక వైద్యకేంద్రాల్లో కనీస వైద్యం అందుతుంది, నాకు క్యాన్సర్ వచ్చినా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం దొరుకుతుంది’ అన్న భరోసా గత ఐదేళ్ళలో దొరికింది. మొన్ననే ధర్మవరంలో జిలేబీలు అమ్ముకునే కార్మికురాలి కూతురుకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం పడింది. దీనిపై నేనొక చిన్న ట్వీట్ పెడితే, సీఎంవోలో డా.హరికృష్ణారెడ్డి గారు స్పందించి రూ.20 లక్షల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించే ఏర్పాటు చేశారు. ఇలాంటి ఎన్నో ఉదాహరణలు నాకు తెలిసే ఉన్నాయి.2019 మేలో జగన్మోహన్రెడ్డి ఎన్నికలలో ఘన విజయం సాధించినప్పుడు నేను సామాజిక మాధ్యమాల్లో ‘మీ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యాలుగా ‘‘విద్య’ – ‘వైద్యా’లను ఎన్నుకొని, వాటి రూపురేఖల్ని సమూలంగా మారుస్తూ ప్రజలకు అందుబాటులోనికి తేవాలని’ కోరాను. ఈనాడు ప్రభుత్వం ఆ ముఖ్యమైన రెండు విషయాల్లోనూ చాలా సమర్థంగా పనిచేసిందని ప్రత్యక్షంగా గమనించాను. ‘పల్లెటూళ్ళే పట్టుగొమ్మలని’ మహాత్మాగాంధీ గారన్నారు. పల్లెల్లో అత్యంత దారుణమైన స్థితిలో ఉన్న దరిద్రనారాయణుడికి చేసే సేవే నిజమైన సేవ అని ఆయన భావించారు. అలా ప్రస్తుత ప్రభుత్వంలో సామాన్యుడికి కనీస అవసరాలైనా తీరుతున్నాయని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పేదేమిటంటే – నేనేదైతే ప్రభుత్వ ప్రాధమ్యాలుగా ఉండాలని, ప్రజలకు మెరుగ్గా సేవ చేయాలని భావించానో అవి నెరవేరాయి. నాకు తెలిసిన కొద్దిమందికి కూడా ఎంతో కొంత మేలు జరిగింది కాబట్టే ఇలా ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. ఏతావతా, చెప్పొచ్చేదేమిటంటే – అటూ ఇటూ జరిగిన కొన్ని సంఘటనలు ఉన్నా, విద్య–వైద్య పరంగా స్థూలంగా నేను ఈ ప్రభుత్వానికి వందకు 80–90 మార్కులు వేయ గలుగుతాను.ధన్యవాదాలు, జైహింద్.డా‘‘ ఇస్మాయిల్ పెనుకొండ వ్యాసకర్త అమెరికాలో వైద్యుడు -
పేదల ఊసు పెద్దలకు పట్టదా?
భారతదేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. పౌష్టికాహార లోపంతో పిల్లలు, స్త్రీలు, బాలింతలు బాధపడుతున్నారు. కోట్లాది కార్మికులకు పనిలేదు. ఉద్యోగాలు లేక యువతకు పెళ్లిళ్ళు కూడా జరగడం లేదు. ఇదొక సామాజిక సమస్యగా రూపుదిద్దుకుంటోంది. బీజేపీ ఇచ్చిన ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ అడ్రస్ గల్లంతైంది. మతం మనిషికి తిండి పెట్టదు అని ప్రజలు తెలుసుకుంటున్నారు. అలాంటి పార్టీతో చంద్రబాబు అంటకాగు తున్నారు. దేశంలో తమ పేరు మీద సాగుభూమి లేనివారు ఎందరో! ఊరు పేరేగాని ఊరిలో సెంటు భూమి లేదు. ‘ఇండియా’ కూటమి కూడా తన ప్రణా ళికలో భూమి పంపకాన్ని గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. భూమి పంపకాన్ని నిరాకరించటం అంటే సామ్యవాదాన్ని నిరాకరించటమే!18వ సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు ఏడు విడతలుగా జరుగుతున్నాయి. తిరిగి మళ్లీ మూడోసారి అధికారంలోనికి రావడానికి మోదీ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఉత్తరప్రదేశ్ మీద అయితే వాళ్లు ఎక్కువ ఆధారపడి ఉన్నారో అక్కడ సామాజిక రాజకీయ చైతన్యం పెల్లుబికింది. ముఖ్యంగా ముస్లింలలో ఎంతో మార్పు రావడం వల్లే రాయబరేలీలో రాహుల్ గాంధీ నిలబడటానికి పూనుకున్నారు. మతోన్మాద దాడులు, మహిళా సాధికారతను పునాదులతో తొలిచే భావజాలం, కార్పొరేట్ శక్తులకు దేశాన్ని తాకట్టు పెడుతున్న బీజేపీ విధానాలు లౌకికవాదులను, ఓబీసీలను, దళితులను, స్త్రీలను ఆలో చింపజేస్తున్నాయని చెప్పక తప్పదు. ముఖ్యంగా 370 ఆర్టికల్ రద్దు ద్వారా జమ్మూ కశ్మీర్ శాసనసభను రద్దుచేసి, ఆ రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విడగొట్టిన ఉదంతాన్ని ప్రజాస్వామిక వాదులు అర్థం చేసుకుంటున్నారు. రాష్ట్రాల ఆదాయాన్ని తగ్గించి, జీఎస్టీ ద్వారా కేంద్రీకృత ఆర్థిక పెత్తనాన్ని పెంచి, రాష్ట్రాల ఉనికిని నామమాత్రం చేయా లని చేస్తున్న ప్రయత్నాలను కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ముఖ్యంగా రాష్ట్రాలకు ప్రత్యేక హక్కులు కలిగిన భాష, సంస్కృతి, విద్య, విద్యుత్, మానవ వనరులపై కూడా కేంద్ర ప్రభుత్వమే పెత్తనం చేయాలనే చర్యలపై రాష్ట్ర ప్రభుత్వాలు చైతన్యవంతంగా ఆలోచిస్తు న్నాయి. ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన పత్రికల మీద చేస్తున్న దాడి బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా జరగలేదని జర్నలిస్టు మేధావులు వాపోతున్నారు.ఏప్రిల్ చివరి వారంలో వచ్చిన ‘గ్లోబల్ రిపోర్ట్ ఆన్ ఫుడ్ క్రైసిస్’ ప్రకారం, భారతదేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. పౌష్టికాహార లోపంతో పిల్లలు, స్త్రీలు, బాలింతలు బాధపడుతు న్నారు. అత్యధిక స్త్రీలు రక్తలేమితో ఇబ్బంది పడుతున్నారు. కోట్లాది మంది కార్మికులకు పనిలేదు. భారతదేశం మొత్తం వలసలతో అన్నా ర్తులై పొట్ట చేత పట్టుకుని నగర శివారుల్లోని మురికివాడలలో జీవిస్తు న్నారు. నిజానికి పంజాబ్ రైతులు చేసిన రైతు ఉద్యమ ప్రభావం భారతదేశం మొత్తం మీద ఉంది. సంయుక్త కిసాన్ మోర్చా హోరా హోరీ రైతు ఉద్యమాన్ని నడిపింది. కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టా లను రద్దు చేయాలనే డిమాండ్పై రాజీలేని పోరాటం చేసింది.ముఖ్యంగా అడవుల నరికివేత వల్ల, నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రోత్సాహం ఇవ్వకపోవడం వల్ల దేశంలో తీవ్రంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. మండుటెండల్లో ప్రజలు ఆహారం కోసం పని చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. మతం మనిషికి అన్నం పెట్టదు అని ప్రజలు తెలుసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా భారతదేశంలో 75 సంవత్సరాల స్వాతంత్య్రం తరువాత కూడా గ్రామాలలో మంచి నీళ్ళు దొరకడం లేదు. మద్యాన్ని అందించటంలో సఫలమైన ప్రభు త్వాలు, మంచినీళ్లు అందించడంలో విఫలమయ్యాయి.ఇకపోతే దేశంలో నిరుద్యోగం విలయ తాండవం చేస్తోంది. ఉద్యో గాలు లేక యువతకు పెళ్లిళ్ళు కూడా జరగడం లేదు. ఇదొక సామాజిక సమస్యగా రూపుదిద్దుకుంటోంది. కాగా ఎన్నికల నేపథ్యంలో నిరు ద్యోగం ప్రధాన అంశంగా చర్చకొస్తోంది. ప్రతిపక్ష నేతలు నిరుద్యోగ సమస్యపై నిలదీస్తుండగా అధికార బీజేపీ నేతలు సమస్యను పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్రధాని మోదీ ప్రసంగాలు, బీజేపీ మేనిఫెస్టో యువతకు భరోసా కల్పించలేదు. పైగా ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ అడ్రస్ గల్లంతైంది. నిరుద్యోగ రేటు పెరగడం ఆందోళన కలిగించే విషయం. ఇకపోతే ‘ఇండియా’ కూటమి కూడా తన ప్రణాళికలో భూమి పంపకాన్ని గురించి మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో కోట్లాది మందికి సాగుభూమి సెంటు కూడా లేదు. ఊరు పేరేగాని ఊరిలో సెంటు భూమి లేదు. ఇంటి స్థలం లేదు. మంచినీళ్ల వసతి లేదు. చనిపోతే పాతిపెట్టడానికి శ్మశానం లేదు. దేశంలోని సుమారు 7 లక్షల గ్రామాల్లో అంటరానితనం కొనసాగు తూనే వుంది. భారతదేశంలో దళితులు ఆర్థిక సామాజిక రాజకీయ న్యాయం లేక పేదరికంలో, అస్పృశ్యతలో, అవిద్యలో మగ్గిపోతున్నారు. బీటెక్లు, ఎంటెక్లు, బీఏలు, ఎంఏలు చదివినా నిరుద్యోగు లుగా, ఉపాధి హామీ కూలీలుగా జీవిస్తున్నారు. ఈ రోజున దళిత వాడల్లో విద్యార్థులు, స్త్రీలు నిరాశా నిస్పృహలలో జీవిస్తున్నారు. వారి కుటుంబానికి తలా రెండెకరాల భూమి ఇవ్వటం ద్వారా ఆర్థిక సాధికారతను కల్గిస్తాం అని ఏ ప్రభుత్వమూ చెప్పటం లేదు. రాజకీయ పార్టీల మేనిఫెస్టోలు అంబేడ్కర్ ఆలోచనకు భిన్నంగా ఉన్నాయి.భూమి పంపకాన్ని నిరాకరించటం అంటే సామ్యవాదాన్ని నిరాకరించటమే. ఇప్పుడు ఎన్నికల్లో ప్రకటించిన ఏ మేనిఫెస్టోలో కూడా భూమి పంపకం గురించి రాయక పోవటం, అస్పృశ్యతా నివా రణ ఒక ఎన్నికల ఎజెండాగా లేకపోవటం, కుల నిర్మూలన కార్యక్రమం ఎవరి లక్ష్యంగా లేకపోవటాన్ని దళిత మేధావులు, ఆలోచనాపరులు అర్థం చేసుకుంటున్నారు. రాజ్యాధికారమే వీటన్ని టికీ పరిష్కారం అని ఆలోచిస్తున్నారు. నిజానికి ప్రసిద్ధమైన కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో, ఐఐటీల్లో, వైద్య విశ్వవిద్యాలయాల్లో, అన్ని కళా శాలల్లో దళిత విద్యార్థులు ఎంతో వివక్షకు గురి అవుతున్నారు.మోదీ ఇంత తిరోగమన చర్యలతో ముందుకు వెళ్తుంటే, నారా చంద్రబాబు నాయుడు ఎన్డీయే కూటమిలో చేరటం ఆయనకున్న దళిత వ్యతిరేకతనూ, హిందూ మతోన్మాద భావజాలాన్నీ, కులాధి పత్య వైఖరినీ, మైనారిటీల పట్ల ద్వేషాన్నీ తెలియజేస్తున్నాయి. చంద్రబాబు నాయుడుకూ, మోదీకీ మధ్య భావజాలంలో, దళితులు, స్త్రీల పట్ల వ్యతిరేకతలో ఏ విధమైన తేడాలేదు అని అర్థం అవుతోంది. ముఖ్యంగా మోదీ యూనివర్సిటీల్లో జీవపరిణామ, మానవ పరిణామ చారిత్రక సిద్ధాంతాల బోధనకు భిన్నంగా మతవాద భావజాలాన్ని ప్రోత్సహించటం లౌకిక భావజాల వ్యాప్తికి గొడ్డలి పెట్టు అవుతుంది.ఇకపోతే అంబేడ్కర్ భావజాల ప్రచారంలో తమిళనాడు ముందుంది. తమిళనాడులోని అన్ని థియేటర్లలో సినిమా ప్రారంభంలో అంబేడ్కర్ జీవిత పోరాటం గురించి ఐదు నిమిషాల నిడివిగల డాక్యుమెంటరీ ప్రదర్శించాలని అక్కడి ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఆదేశించారు. అంబేడ్కర్ ఆ రాజ్యాంగం ద్వారానే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ముఖ్యమంత్రులు ప్రధానులు, రాష్ట్రపతులు అవుతున్నారని గ్రహించాలి.అంబేడ్కర్ రాజ్యాంగం భారతదేశ పునర్ నిర్మాణానికి ఆయువు పోసింది. ఏ దేశంలో స్త్రీ వ్యక్తిత్వంతో జీవిస్తుందో, ఏ దేశంలోకుటుంబ వ్యవస్థ బలంగా నిలబడుతుందో, ఏ దేశంలో స్త్రీ ఉత్పత్తి శక్తి దేశ సౌభాగ్యానికి ఊపిరి పోస్తుందో ఆ దేశం ఆర్థిక సంపదవున్న ప్రపంచ పంక్తిలో నిలబడగలుగుతుంది. నిజానికి అంబేడ్కర్ అడుగు అడుగులో స్త్రీ సమానత్వం కోసం పోరాడారు. వారి అభ్యున్నతి కోసం, వారి విద్యాభ్యాసం కోసం, వారి సాధికారిత కోసం, వారి భావ చైతన్యం కోసం, వారి రాజకీయ హక్కుల కోసం పోరాడారు. హిందూ కోడ్ బిల్లు విషయంలో మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వంలో న్యాయ శాఖ మంత్రిగా రాజీనామా చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి హిందూ కోడ్ బిల్లును సాధించారు. ఈనాడు ప్రభుత్వాలు స్త్రీ సాధికారితను నిలబెట్టాలి అంటే నిరుద్యోగులయిన స్త్రీలకు ఉద్యోగ వసతి కల్పించాలి. విధవరాండ్రకు నెలకు పది వేల రూపాయల పింఛన్ ఇవ్వ గలిగిన స్థాయికి రావాలి. ప్రతి దళిత స్త్రీకి రెండు ఎకరాల భూమి ఇచ్చి భారతదేశంలో వ్యవసాయ విస్తృతికి కృషి చేయాలి. ఇంటింటికీ మంచినీటి వసతి, విద్యుత్ వసతి కల్పించి, ఆరోగ్య సంరక్షణ కోసం పౌష్టికాహారాన్ని అందించి స్త్రీ శారీరక మానసిక శక్తిని పెంచి దేశ సౌభాగ్యానికి బాటలు వేయాలి. డా‘‘ కత్తి పద్మారావు వ్యాసకర్త దళితోద్యమ నాయకులు ‘ 98497 41695 -
పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
మా అమ్మమ్మ వాళ్ల ఊరు పాత మెదకర్ జిల్లా ఒక చిన్న పల్లెటూరు. ఏ సెలవులు అయినా అప్పటి తరం గడిపింది అమ్మమ్ల ఊర్లలోనే కదా!. సిద్ధిపేటలో పెరిగిన నాకు కులాల గురించి అస్సలు తెలియదు. 70 వదశకంలో అదొక పెద్ద మార్పు అని తెలియు. రోజంతా ఊర్లోని మట్టి రోడ్లమీద పొలాల గట్ల మీద ఈత బావుల్లో గడిచిపోయేది. మాదిగోళ్ల ఇళ్లు, వడ్లోళ్ల సందు, కమ్మరోళ్ల గల్లీ..ఏ తేడా తెలియకుండా ఆడుకునేది. పశువుల మందలు కొట్లాలకి చేరుకునే సందెపొద్దుకి ఇంటికి మా అడుగులు తడపడేవి. అప్పటి వరకు లేని పట్టింపులు ఇంటి వరండాకి చేరుకునేసరికి అమ్మమ్మకు గుర్తుకొచ్చేది. ఒక బిందె నీళ్లు మా నెత్తిమీద కుమ్మరించి పొడిబట్టలు ఇచ్చేది. అలా మైల పోతుందని ఆమె అనుకునేది. మాకు ఆమె నమ్మకం వింతగా చిరాకుగా కూడా ఉండేది. అప్పట్లో అది సామాజికి మనిషి అని. ఆర్థిక అంతరాలుకు ఒక కొలమానం అని పెత్తందారుల పోకడలకు నిలువటద్దం అని తెలియదు. కానీ చాలా అసహనంగా ఉండేది మనసులో. అదొక్కటే అమ్మమ్మ వాళ్ల ఊర్లో ఉన్నన్ని రోజుల్లో గొంతులో ఏదో అడ్డపడ్డట్టుగా ఉండేది. దాదాపు అయిదు దశాబ్దాల తర్వాత కూడా గొంతులో ఏదో అడ్డంపడుతున్నట్లుగానే ఉంది. ఆంధ్రప్రదేశ్లో జరిగిన, జరుగుతున్న వరుస సంఘటనలు చూస్తున్నప్పుడు ఓట్ల కోసం కావచ్చు అధికారం చేజారిపోకూడదన్న రాజకీయతత్వం కావచ్చు. మరేదైనా కారణం కావచ్చు. బడులు కొత్తరూపును సింగారించుకున్నాయి. పిల్లలు నోట్లోంచి నాలుగు ఇంగ్లీషు ముక్కలు రాలుతున్నాయి. చాలిచాలని విదిలించనట్లుండే స్కూలు యూనిఫాంలు అద్దంలో అందంగా కనపడుతున్నాయి. క్లాస్రూంలోకి అంతర్జాతీయ స్థాయి విద్య క్రమంగా అందుబాటులోకి వస్తోంది. ఆత్మనూన్యతను ఆత్మవిశ్వాసం తరిమేస్తోంది. పదిసంవత్సరాల్లో ఒక్క కొత్తతరం మరింత ధైర్యంగా, రొమ్ము విరుచుకుని తలెత్తుకుని నిలబడబోతుంది.వంగిన నడుములు నిటారుగా నిలబడబోతున్నాయి. నేలచూపులు ప్రశ్నించేందుకు సూటిగా చూస్తున్నాయి. నేల బారు చదువులు వానాకాలపు పాఠాలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఒక కొత్తతరం ఉరకలు వేసేందుకు ప్రశ్నించేందుకు తమ బతుకులు దిద్దుకునేందుకు ఆర్థిక బలవంతుల్ని తమ చదువులతో ఢీ కొట్టేందుకు అడుగులు వేయడం నేర్చుకుంటోంది. నాలుగు సంస్కృతం ముక్కలు నేర్చుకున్నందుకు నాలుక మీద వాతలు పెట్టించుకున తరం నుంచి కొండల మీద కూర్చొని వికటాట్టహాసం చేస్తున్న వర్గాల అహం మీద గట్టి దెబ్బ తగులుతోంది. దీన్ని అడ్డుకోవడానికి అహంకార వర్గాలు గత నాలుగు అయిదు సంవత్సరాలుగా చేసినా, చేస్తున్న ప్రయత్నాలు వాళ్ల పీఠాలు కదలిపోతాయోమో అన్న భయం స్పష్టంగా కనపడుతోంది. అభద్రతాభావంతో కుట్రలు కుతంత్రాలకి తెరలేపారు. ఇంగ్లీషు చదువులు మీకెందుకురా..! అంటూ బహిరంగంగానే కూశారు. తెలుగు భాష చచ్చిపోతుందనే దొంగ ఏడుపులు..మాతృభాషకు వీరే బాధ్యులయినట్టు సమస్య భాష కాదు..సమస్య అసమానతలు తొలిగిపోతే..రేప్పొద్దున తమకు ఊడిగం చేసే వర్గాలు లేకపోతే ..అన్ని పనులు తామే చేసుకోవాల్సి వస్తే..ఇప్పటిదాక బాంచన్ దొర అన్న మాటలు వినపడకపోతే.. తమకన్నా ఉన్నత స్థానాల్లో నిలబడితే..తామే తలలు పైకెత్తి చూడాల్సి వస్తే అహంకారంతో విసురుగా ఆడిన చేతులు జోడించాల్సి వస్తే..ఇది ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలంగా ఉన్న వర్గాలకి మింగుడు పడని విషగుళిక. అందుకే అన్ని శక్తులు ఏకమై ఇప్పుడిప్పుడే విచ్చుకుంటున్న మొగ్గల్ని..సూటిగా చూస్తున్న కళ్లని నిటారుగా నిలబడుతున్న నడుముల్ని అణచడానికి చేయని ప్రయత్నాలు లేవు. అథఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు ఇది కాదు అని పలికి గొంతు తొక్కాలనుకుంటుంది రాజకీయ ప్రత్యర్థులను కాదు..తమకు తరతరాలుగా వంగి వంగి దండాలు పెట్టి..ఇపుడిపుడే వస్తున్న కొత్తతరాన్ని..ఇందులో ఎవరైనా పుట్టాలనుకుంటారా..ఇంగ్లీషు చదివితే ఎటుకాకుండా పోతారని భయపెట్టి..తమ కదలిపోతున్న పునాదుల్ని మళ్లీ నిలబెట్టుకోవాలనే దుర్మార్గపు ఆలోచనతోనే.పెట్టుబడిదారులు ఖద్దరు చొక్కా వేసుకొని ముందుకు వస్తే..ఆర్థిక, సామాజికి కారణాలు బయటకు కనిపిస్తూనే ఉంటాయి. కాశ్మీరో, కన్యాకుమారో అవసరం లేని వర్గం తమ కాళ్లమీద తాము నిలబడటానికి 75 ఏళ్ల తర్వాత ఒక ఊతం దొరికింది. పాదాలు నరికేస్తామని భయపడితే ఒక తరం తర్వాతితరాలు నష్టపోతాయి. చనిపోయేవరకు మా అమ్మమ్మలో మార్పు రాలేదు. కులం నరాల్లో ఇంకిపోయిన కోస్తాంధ్ర పెట్టుబడిదారుల జాత్యాహంకార వర్గాల్లో కూడా మార్పు రాలేదు..రాదుకూడా నిలబటం నేర్చుకుంటున్న ఈ తరం తమ కోసమే కాదు..ముందు తరాల కోసం నడవటం, పరుగెత్తి గెలవడం కూడా నేర్చుకోవాలి. కుట్రలు ఉంటాయి. అడ్డంకులు ఉంటాయి. పడిపోతే లేచి నిలబడాలి..లేకపోతే పాక్కుంటూ అయిన గీత దాటాలిసిరా..(చదవండి: గ్యాంగ్ ఆఫ్ పెత్తందార్స్)
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
● జిల్లాలో వరుస చోరీలు ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ● ఆందోళన చెందుతున్న ప్రజలు ● నిఘా పెంచిన పోలీసులు
వసతులు కల్పించాలని హిందూవాహిని వినతి
ఏటా రెండులారీల కోడి ఎరువు
సేంద్రియ ఎరువులకు డిమాండ్
ప్యాసింజర్ రైళ్లు.. నిర్లక్ష్యం ఎన్నేళ్లు?
‘బీజేపీపై బురదజల్లే ప్రయత్నం’
జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ‘నలిమెల’
పత్తి విత్తనం.. ధరలకేదీ కళ్లెం?
రైతులకు జీలుగ విత్తనాల కష్టాలు
వామ్మో.. హోటల్ ఫుడ్
తప్పక చదవండి
- రికార్డుల ర్యాలీ కొనసాగొచ్చు
- ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు
- మాక్ డ్రిల్.. పవర్ఫుల్
- బుల్లి చేపలతో భలే మేలు!
- మీషో కూపన్ల పేరిట సైబర్మోసం
- Lok Sabha Election 2024: డమ్ డమ్లో... విజయఢంకా మోగించేదెవరో!
- గింజ సన్నబియ్యం కొనలేదు.. పైసా ఖర్చు చేయలేదు: మంత్రి ఉత్తమ్
- Lok Sabha Election 2024: ఓటింగ్... ప్చ్!
- ‘పౌర సరఫరా’లో రూ.1,000 కోట్ల స్కాం!: కేటీఆర్
- Gujarat High Court: మానవ తప్పిద మహావిషాదం
Advertisement