-
పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తిచేయాలి
కాళోజీ సెంటర్ : పాఠశాలలు పునఃప్రారంభం కాకముందే అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పాఠశాలల అభివృద్ధి పనుల పురోగతిపై డీఈఓ వాసంతి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, పాటు సంబంధిత అధికారులతో శనివారం సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 459 ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధ్ది పనులు చేపట్టగా.. 131 పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయని తెలిపారు. మిగిలిన పాఠశాలల్లో త్వరితగతిన పూర్తి చేయాలని ఆమె సూచించారు. సమీక్షలో ఇంజనీరింగ్ అధికారులు సంజయ్కుమార్, రవికిరణ్, సారంగం, రంగారావు పాల్గొన్నారు. -
చట్ట సభల గౌరవం పెంచే వారినే ఎన్నుకోవాలి
హన్మకొండ: చట్టసభల గౌరవం పెంచే వ్యక్తిని శాసన మండలికి ఎన్నుకోవాలని నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాకేశ్రెడ్డి మాట్లాడుతూ.. మాయగాళ్లు, మోసగాళ్లు చట్ట సభలో ఉండకూడదని, బెదిరించే అభ్యర్థి ఎమ్మెల్సీగా గెలిస్తే విద్యా సంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలను, వ్యాపారవేత్తలను ఏం చేస్తారో ఆలోచించాలన్నారు. ప్రభుత్వానికి వత్తాసు పలికే వారిని కాకుండా ప్రభుత్వాన్ని నిలదీసే తనను ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలన్నారు. తాను రైతు బిడ్డనని, కష్టాలు, సమస్యలు ఎలా ఉంటాయో తనకు తెలుసన్నారు. అధికారం కోసం కాదు ఆశయం కోసం పని చేస్తానన్నారు. జీఓ 46 రద్దుకు మడమ తిప్పని పోరాటం చేస్తానన్నారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఓటర్ల నుంచి అనూహ్య స్పందన వస్తోందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డిని గెలిపించాలని పట్టభద్రులు రెట్టింపు ఉత్సాహంతో ఉన్నారన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్, నాయకులు రవీందర్సింగ్, కె.వాసుదేవరెడ్డి, తాళ్లపల్లి జనార్దన్, నయీముద్దీన్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేశ్రెడ్డి -
చనిపోయిన వ్యక్తికి బుల్లెట్ బండి రుణం
నల్లబెల్లి: బ్యాంక్ రుణం కావాలంటే అధికారులు పలు షరతులు విధిస్తారు. అందుకు అవసరమైన పూర్తి డాకుమెంట్స్ అందించాలని కోరుతారు. ఆపై వెరిఫికేషన్ పూర్తి చేసి సంతృప్తి చెందిన తరువాతే రుణం మంజూరు చేస్తారు. కానీ అందుకు విరుద్ధంగా మృతి చెందిన వ్యక్తికి బుల్లెట్ (రాయల్ ఎన్ఫీల్డ్) బండికి ఖమ్మం బ్రాంచ్కి చెందిన కొటాక్ మహీంద్రా బ్యాంక్ రుణం మంజూరు చేసింది. వాయిదాలు చెల్లించాలని బ్యాంక్ అధికారులు ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని నందిగామలో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబ సభ్యులు, కలెక్షన్ మేనేజర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ గ్రామానికి చెందిన భూక్య సునీత, నగేష్ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు రాకేష్ 2022, జనవరి 23న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, కోటక్ మహేంద్రా బ్యాంక్ ఖమ్మం బ్రాంచ్ అధికారులు.. 2023 అక్టోబర్ 18న భూక్య రాకేష్ పేరుమీద రాయల్ ఎన్ఫీల్డ్–350 ద్విచక్ర వాహనానికి సుమారు రూ.3 లక్షల రుణం మంజూరు చేశారు. ఇందుకు రూ.7,150 చొప్పున 48 నెలలపాటు కిస్తీలు చెల్లించాలని ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు మూడు వాయిదాలు చెల్లించాడు. ఆ తరువాత వాయిదాలు చెల్లించకపోవడంతో రుణం రికవరీ కోసం కలెక్షన్ మేనేజర్ శ్రీనివాస్, వెరిఫికేషన్ ఏజెంట్ అరవింద్ నందిగామకు చేరుకున్నారు. వాయిదా బకాయి డబ్బులు చెల్లించాలని కోరారు. రెండున్నరేళ్ల క్రితం మృతిచెందిన తమ కుమారుడికి రుణం ఎలా ఇచ్చారని వారిని నిలదీశారు. తీసుకున్న వ్యక్తి వివరాలు తెలియజేసేవరకు ఇక్కడినుంచి కదలనియ్యమని చుట్టుముట్టారు. రుణం తీసుకుని ఇలా ఎందుకు బుకాయిస్తున్నారని ఉద్యోగులు ప్రశ్నించగా, చనిపోయి రెండున్నరేళ్లు అవుతుందని చెప్పితే అర్థంకావడం లేదని స్థానికులు ఉద్యోగులను మందలించారు. పోలీసుల కు సమాచారం అందించి ఉద్యోగులను అప్పగించా రు. మృతిచెందిన తన కుమారుడి పేరిట రుణం మంజూరు చేసిన అధికారులు, తీసుకున్న వ్యక్తి, దళారులను గుర్తించి శిక్షించాలని పోలీసులను కోరా రు. కాగా, నర్సంపేటకు చెందిన ఓ వ్యక్తి.. చనిపోయిన రాకేష్ పేరు మీద తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇందులో బ్యాంక్ సిబ్బంది, దళారుల పాత్ర ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రుణం కిస్తీ చెల్లించాలని మృతుడి ఇంటికి చేరుకున్న కలెక్షన్ మేనేజర్ రుణం ఎప్పుడిచ్చారని నిలదీసిన మృతుడి కుటుంబ సభ్యులు వరంగల్ జిల్లాలో ఘటన -
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి
విద్యారణ్యపురి: ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండ, వరంగల్ జిల్లా పీఆర్టీయూ శాఖల ఆధ్వర్యంలో హనుమకొండలోని పీఆర్టీయూ భవనం వద్ద యూనియన్ టీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత సామల యాదగిరి వర్ధంతి కార్యక్రమంలో రఘోత్తమరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పింగిళి శ్రీపాల్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ ముగియగానే నిలిచిన ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తిచేయిస్తామని హామీ ఇచ్చారు. ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల ప్రయోజనాలు నెరవేర్చేందుకు ఏ ప్రభుత్వమున్నా ఆ ప్రభుత్వంతో మమేకమై పనిచేసే అతిపెద్ద సంఘం పీఆర్టీయూ అని, దీనిని కాపాడుకోవాల్సి బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. కార్యక్రమంలో పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీరెళ్లి కమలాకర్, హనుమకొండజిల్లా అధ్యక్షుడు మంద తిరుపతిరెడ్డి, జనరల్ సెక్రటరీ ఫలితశ్రీహరి, వరంగల్జిల్లాల అధ్యక్షుడు ఈదునూరి రవీందర్రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శులు తిరునగరి శ్రీనివాస్, ఎడ్ల ఉపేందర్రెడ్డి, సామల పట్టాభి, కరీంనగర్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి జాలిరాఘవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. టీచర్ ఎమ్మెల్సీ కూర రఘోత్తమరెడ్డి -
‘మేడిగడ్డ’ బొరియతో బుగులు
కాళేశ్వరం: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి మేడిగడ్డ బ్యారేజీలో బొరియ పడడంతో నిర్మాణ సంస్థతో పాటు ఇరిగేషన్శాఖ అధికారులు బుగులు చెందుతున్నారు. బొరియ ఎక్కడి నుంచి.. ఎక్కడి వరకు ఉందనే విషయం అధికారులకు అంతుచిక్కడం లేదని తెలిసింది. ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి, ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి.. బ్యారేజీ నిర్వహణతో పాటు ఇరిగేషన్శాఖ ఇంజనీర్ల పనితీరుపై సీరియస్గా ఉన్నారు. త్వరలో సీఎంతో పాటు మంత్రులు రానుండడంతో మరమ్మతులు చేపట్టిన నేపథ్యంలో బ్యారేజీలోని 7వ బ్లాకులో 20 పియర్ ముందు పెద్ద బొరియ(గొయ్యి) ఏర్పడడంతో నిర్మాణసంస్థ, ఇరిగేషన్శాఖలు హుటాహుటినా ఆ ప్రాంతంలో మట్టి నింపారు. మరో రెండు బ్లాకుల్లో కూడా బొరియలు? 7వ బ్లాకు పక్కన గల 8, 6వ బ్లాకుల్లో కూడా బొరియలు విస్తరించి ఉండొచ్చనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఫౌండేషన్ ఎలా ఉంది? బ్యారేజీ పొడవునా ఇలాగే ఉందా? అనే విషయంపై జియోఫిజికల్, జియోటెక్నికల్ పరీక్షల నిర్వహించడం ద్వారా పూర్తిగా తెలువనుంది. గ్రౌటింగ్ చేసి సుమారు 40వేల ఇసుక బస్తాలు వేశారు. ఇప్పటికే ఎన్డీఎస్ఏ ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ అయ్యర్ కమిటీ, మాజీ సుప్రీంకోర్టు జడ్జి పినాకి చంద్రఘోష్ టీమ్ల సూచనలతో వర్షాకాలంలోపు తాత్కాలిక మరమ్మతులు చేపట్టిన విషయం తెలిసిందే. మూడు రోజుల క్రితం సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యూపీఆర్ఎస్) టీమ్ బృందం పరిశీలన చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను సందర్శించి తమ నివేదికలు అందజేయనుంది. మేడిగడ్డ బ్యారేజీ వద్ద సీసీ బ్లాకుల పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. 7వ బ్లాకులో మొరాయించిన గేట్ల నట్లు విప్పుతున్నారు. పూర్తిగా గేట్లను తొలగించిన తరువాత మరమ్మతులు చేయడానికి వీలవుతుందని తెలిసింది. రాకపోకలు బంద్ మేడిగడ్డ బ్యారేజీలో బొరియ ఏర్పడడంతో మహారాష్ట్ర, తెలంగాణ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. గతేడాది బ్యారేజీ పియర్లు కుంగినప్పటికీ కనీసం టూవీలర్కు అనుమతిచ్చేది. శనివారం నుంచి గేట్లు వేసి ఎవరినీ అనుమతించడం లేదు. దీంతో రెండువైపులా వచ్చేవారు గంటతరబడి నిరీక్షించి వెళ్లిపోతున్నారు. ● గేట్ల మరమ్మతులు ప్రారంభం ఇరురాష్ట్రాలకు రాకపోకలు బంద్ -
అసిస్టెంట్ రిజిస్ట్రార్ అశోక్బాబు బదిలీ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిపాలనా భవనంలో కీలకమైన టీచింగ్, నాన్టీచింగ్ విభాగాల్లో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా విధులను నిర్వర్తిస్తున్న పెండ్లి అశోక్బాబునును బదిలీ చేస్తూ శనివారం రిజిస్ట్రార్ పి.మల్లారెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. అశోక్బాబుకు హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్సైన్స్కళాశాల అసిస్టెంట్ రిజిస్ట్రార్గా బదిలీ అయ్యింది.కేయూ వీసీగా తాటికొండ రమేశ్ హయాంలో అశోక్బాబు కీలకంగా వ్యవహరించడం, దీంతోపాటు యూనివర్సిటీ భూమిలో ఇల్లు ఉండటంతో భూ కబ్జాకు పాల్పడ్డాడనేది అకుట్ బాధ్యులతోపాటు వివిధ విద్యార్థి సంఘాలు కూడా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. రమేశ్ పదవీకాలం ముగియడంంతో అకుట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మామిడాల ఇస్తారి, ఇతర బాధ్యులు కూడా ఈ నెల 24న రిజిస్ట్రార్తో వాగ్వాదానికి దిగారు. అశోక్బాబును సస్పెండ్ చేయాలని లేదా ఆసెక్షన్ నుంచి వేరే చోటుకు పంపాలని డిమాండ్ చేశారు. దీంతో శనివారం మల్లారెడ్డి హైదరాబాద్కు వెళ్లారు. ఇన్చార్జ్ వీసీ వాకాటి కరుణను కలిశారు. వీసీ అప్రూవల్ మేరకు అశోక్బాబును ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాలకు బదిలీ చేశారు.పరీక్షల విభాగానికి ఏఆర్ సరళాదేవి ఆర్ట్స్అండ్ సైన్స్కళాశాలలో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా బాధ్యతలను నిర్వర్తిస్తున్న జి సరళాదేవిని కాకతీయ యూనివర్సిటీలోని పరీక్షల విభాగం ఏఆర్గా బదిలీ చేశారు కేయూ నుంచి ఆర్ట్స్ కాలేజీకి రిజిస్ట్రార్ మల్లారెడ్డి ఉత్తర్వులు జారీ -
ఎమ్మెల్సీ ఓటు వేయండిలా..
ఎమ్మెల్సీ ఎన్నిక ఓటింగ్ విధానంపై ఈసీ విడుదల చేసిననమూనా బ్రోచర్ వరంగల్ డెస్క్: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ రేపు (సోమవారం) జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ ఉప ఎన్నిక బ్యాలెట్ పేపర్ పద్ధతిన నిర్వహిస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇతర సాధారణ ఎన్నికలకు ఓటు వేసే విధానంలో చాలా తేడా ఉంటుంది. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ఓటు వేసే క్రమంలో ఈవీఎంలను వాడుతారు. ఆ ఎన్నికల్లో అభ్యర్థి పేరు, పార్టీ గుర్తు ఉంటుంది. ఒకే అభ్యర్థికి ఓటు వేయాల్సి ఉంటుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు అందుకు భిన్నంగా ఉంటాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరికీ ప్రాధాన్యతా క్రమంలో ఓటు వేసే అవకాశం ఓటర్లకు ఉంటుంది. ప్రాధాన్యతాక్రమంలోనే ఓటు.. ● ప్రతీ ఓటరు బరిలో ఉన్న మొత్తం అభ్యర్థుల్లో ఒక్కరికి లేదా కొందరికి లేదా అందరికీ ఓటేయొచ్చు. ● అంకెలు మాత్రమే ఆ బాక్సులో ప్రాధాన్యతాక్రమంలో వేయాల్సి ఉంటుంది. ● మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తేనే ఆ ఓటు చెల్లుబాటు అవుతుంది. ● ఏ వ్యక్తికై తే మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తారో ఆ వ్యక్తి బ్యాలెట్ పేపర్ వరుసలో ఏ నంబర్లో ఉన్నా కూడా.. బాక్సులో 1 అనే అంకె వేయాల్సి ఉంటుంది. ● 1, 2, 3, 4, 5 ఇలా ప్రాధాన్యతాక్రమంలో పోటీలో ఉన్న అభ్యర్థులకు ఓటు వేయాలి. ఒక్కరికి కూడా ఓటేయొచ్చు● పోటీలో ఎంత మంది అభ్యర్థులు ఉన్నా అందులో 40వ సీరియల్ నంబర్లో ఉన్న అభ్యర్థికి ఒక్కరికే ఓటు వేయాలంటే అతడికి ఎదురుగా ఉన్న బాక్సులో 1 అని ఓటు వేసి మిగతా వారికి వేయకున్నా ఆ ఓటు చెల్లుతుంది. ● 1వ నంబర్ ప్రాధాన్యత ఓటు వేయకుండా 2, 3, 4 నంబర్లతో ఓట్లేస్తే ఆ ఓటు చెల్లదు. ● తప్పనిసరిగా 1 నుంచి సీరియల్గా మాత్రమే ఓటు వేయాలి. ● ఒక అభ్యర్థికి ఒక అంకెను మాత్రమే వేయాలి. ● అంకెలను తెలుగులో కానీ, ఇంగ్లిష్లో, ఇతర భాషాల్లో వన్, టు, త్రీ అని పదాలు, అక్షరాల్లో రాయకూడదు. ● బ్యాలెట్ పేపర్పై ఎలాంటి సంతకాలు చేయకూడదు. ● వేలిముద్ర వేయకూడదు. ● అభ్యర్థికి ఎదురుగా ఉన్న బాక్సులో రైట్ గుర్తు, ఇంటు గుర్తు పెట్టకూడదు. సొంత పెన్నుతో ఓటు వేయొద్దు.. ● బ్యాలెట్లో ఓటర్ ఓటు వేసేటప్పుడు సొంత పెన్నుతో ఓటు వేయొద్దు. ● అలా వేస్తే ఓటు చెల్లదు. ● ఒకరికి ఇచ్చిన ప్రాధాన్యత ఓటు మరో అభ్యర్థికి ఇచ్చినా ఆ ఓటు చెల్లదు. ● ఒకరికి 1వ నంబర్ వేసి దాన్ని పదేపదే దిద్దినా ఆ ఓటు చెల్లదు. ● బ్యాలెట్ పేపర్ను బాక్సులో వేయకుండా తీసుకెళ్తే కేసు నమోదు చేస్తారు. ● బాక్సు మధ్యలో మాత్రమే నంబర్ రాయాల్సి ఉంటుంది. ● రిటర్నింగ్ అధికారి ఇచ్చిన ఊదా రంగు స్కెచ్ పెన్నుతో గాక ఇతర ఏ పెన్నులతో రాసినా అది చెల్లుబాటు కాదు. ● ఏ అంకెలు వేయకుండా ఖాళీ బ్యాలెట్ పేపర్ ఇచ్చినా ఆ ఓటు చెల్లుబాటు కాదు.రేపు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ఫ బరిలో ఉన్న 52మంది అభ్యర్థులందరికీ ఓటు వేయొచ్చు ఫ ‘1’ప్రాధాన్యత అంకె ఇవ్వకుండా మిగతావి ఇస్తే ఆ ఓటు చెల్లదు ఫ అధికారి ఇచ్చిన పెన్నునే ఉపయోగించాలి ఓటు వేసే విధానం.. ప్రతి అభ్యర్థికి ఎదురుగా పార్టీ పేరు లేదా స్వతంత్ర అభ్యర్థి అని రాసి ఉంటుంది. పార్టీల గుర్తులు ఉండవు. అభ్యర్థి పేరు ఎదురుగా ఖాళీ బాక్స్ ఉంటుంది. పోలింగ్ అధికారి ఇచ్చిన పెన్నుతో మాత్రమే ఓటరు తన ఓటు వేయాల్సి ఉంటుంది. అభ్యర్థి పేరు ఎదురుగా ఖాళీ బాక్స్లో పెన్నుతో కేవలం నంబర్ మాత్రమే వేయాల్సి ఉంటుంది. -
సదస్సుల వేదిక.. నిట్
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్ క్యాంపస్.. జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు, సదస్సులకు వేదిక అవుతోంది. నిత్యం వివిధ ఆవిష్కరణలతో ప్రపంచ స్థాయిలో తన ప్రత్యేకత చాటుకున్న నిట్ వరంగల్లో కాన్ఫరెన్స్ హాల్ కాంప్లెక్స్తో పాటు అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఫలితంగా ఈ క్యాంపస్లో సదస్సులు, సమావేశాలు నిర్వహించుకుంటే ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఔత్సాహికులు, వివిధ కళాశాలలు, పాఠశాలలు, ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. ఇక్కడే తమ సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. సెక్యూరిటీతో పాటు పూర్తిగా ఆడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడిన ఏసీ కాన్ఫరెన్స్ హాల్స్, ఎల్ఈడీ ప్రొజెక్టర్, స్కీన్ర్స్తో సెంటర్లను ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ హాల్ కాంప్లెక్స్.. నిట్ వరంగల్లో తమ విద్యార్థులకు సదస్సులు, సమావేశాలు నిర్వహించడంతో పాటు గెస్ట్ లెక్చర్స్కోసం ప్రత్యేకంగా కాన్ఫరెన్స్ హాల్స్ ఏర్పాటు చే శారు. సైంటిస్ట్లు, స్వాతంత్య్ర ఉద్యమ సంగ్రామంలో పాల్గొన్న నాయకుల పేరిట కాన్ఫరెన్స్ హాల్ కాంప్లెక్స్తో పాటు రాజ్యాంగ నిర్మాత పేరిట అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. కాన్ఫరెన్స్ హాల్స్ ఇలా.. నిట్లోని కాన్ఫరెన్స్ హాల్ కాంప్లెక్స్లో హోమీ బా బా హాల్, బోస్ హాల్, రామన్ హాల్, రామానుజన్ హాల్, ఖురానా హాల్, చంద్రశేఖర్ హాల్ ఉన్నాయి. ఇందులో హోమీబాబా హాల్, రామానుజన్ హాల్లో 125 మంది, ఖురానా హాల్ 90 మంది, బోస్ హాల్, రామన్ హాల్, చంద్రశేఖర్ హాల్లో 160 మంది, అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో 400 మంది, మరో ఆడిటోరియంలో వెయ్యి మంది కూర్చునే సామర్థ్యంతో సమావేశాలకు అనువుగా ఏర్పాటు చేశారు. అదే విధంగా నిట్లో ప్రతి డిపార్ట్మెంట్కు 80 నుంచి 120 మంది కూర్చునే సామర్థ్యంతో ప్రత్యేకంగా ఒక హాల్ ఉంటుంది. ఆదాయ వనరుగా.. నిట్ వరంగల్లో ఏర్పాటు చేసిన సెమినార్ హాల్స్, అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియం ఆదా య వనరుగా మారుతోంది. నిట్ తమ సమావేశాలతో పాటు బయట వ్యక్తులకు ప్రత్యేక రుసుముతో అవకాశం కల్పిస్తోంది. కాన్ఫరెన్స్ హాల్ కాంప్లెక్స్లోని హాల్స్కు ప్రతి సమావేశానికి రూ. 8 వేలు , అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియం రూ.15వేలకు అద్దెకు ఇస్తున్నారు.క్యాంపస్లో కాన్ఫరెన్స్ హాల్ కాంప్లెక్స్, అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఏర్పాటు సమావేశాలకు మొగ్గుచూపుతున్న ఔత్సాహికులు ఇన్స్టిట్యూట్కు ఆదాయం సమకూర్చుతున్న సెంటర్లు -
రైతు ప్రాణం తీసిన మొక్కజొన్న చొప్ప..
సంగెం: మొక్కజొన్న చొప్పు మంటలు ఆర్పుతున్న క్రమంలో ఊపిరాడక ఓ రైతు మృతి చెందాడు. ఈ ఘటన సంగెం మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కాట్రపల్లికి చెందిన గాయపు భగవాన్రెడ్డి(56)కి భార్య రమాదేవి, ముగ్గురు కూతుళ్లు దివ్య, శ్రుతి, మౌనిక, తల్లి సమ్మక్క ఉన్నారు. తనకున్న భూమిలో వ్యవసాయం చేస్తు కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. శనివారం సాయంత్రం మొక్కజొన్న చొప్పకు నిప్పు పెట్టాడు. గాలి దుమారానికి పక్కన ఉన్న భాస్కర్రెడ్డికి చెందిన ఫామాయిల్ తోటలోని మొక్కజొన్న చొప్ప, డ్రిప్ పైపులకు మంటలు అంటుకున్నాయి. మంటలు ఆర్పేందుకు భగవాన్రెడ్డి తీవ్ర ప్రయత్రం చేశాడు. మోకాళ్ల నొప్పులు ఉండడంతో మంటలు, పొగనుంచి తప్పించుకోలేక ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం పక్క రైతు.. కుటుంబీకులు పోలీసులకు తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న ఎస్సై నరేష్.. భగవాన్రెడ్డి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. -
సిద్ధాంతం కోసం పనిచేసేదే బీజేపీ
హన్మకొండ: కమిట్మెంట్తో, సిద్ధాంతం కోసం పని చేసేది కేవలం బీజేపీ నాయకులే అని ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి అన్నారు. శనివారం హనుమకొండలోని బీజేపీ ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి పూర్తి సహకారం లభించకపోవడంతో కేటీఆర్.. బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ఫోన్ చేసి మద్దతివ్వాలని కోరుతున్నారన్నారు. బీఆర్ఎస్ నుంచి ప్రాణభయం ఉందని, జైలులో నుంచి బీజేపీ లీగల్ సెల్ నాయకులకు ఫోన్లు చేసి సహాయం పొంది బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న ఆతర్వాత బీజేపీని, ప్రధానిని, నాయకులను తిట్టిన నీచుడు అని దుయ్యబట్టారు. విశ్వసనీయ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నానని, పట్టభద్రులు తనను గెలిపించాలని కోరారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ప్రజలు, పట్టభద్రుల సమస్యలపై పోరాడే గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. సమావేశంలో బీజేపీ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, గంట రవికుమార్, వరంగల్ పార్లమెంట్ ప్రభారీ మురళీధర్ గౌడ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ తదితరులున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి -
పచ్చదనం పరిఢవిల్లాలి
బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వరంగల్ అర్బన్: మహా నగర పరిధి చెరువు కట్టలు, పరిసర ప్రాంతాలు పచ్చదనంతో పరిఢవిల్లాలని, ఆదిశగా మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. శనివారం బల్దియా ప్రధాన కార్యాలయంలో హార్టికల్చర్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. నగర పరిధిలో నీటి వనరుల్ని పరిరక్షించుకోవాలని, ఔషధ గుణాలు/పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే ఎకో ఫ్రెండ్లీ లక్షణాలున్న మొక్కల ఎంపికకు అత్యంత ప్రాధాన్యమివ్వాలన్నారు. నగర వ్యాప్తంగా 7 నర్సరీల్లో ఈఏడాది మొత్తం మొక్కల లక్ష్యం 5 లక్షలు కాగా.. ప్రస్తుతం నర్సరీల్లో సిద్ధం చేసిన మొక్కలు 1.80 లక్షలు కాగా.. మొత్తం 3.30 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నట్లు ఉద్యానవన అధికారి వివరించారు. సమావేశంలో హార్టికల్చర్ అధికారి రమేశ్, అసిస్టెంట్లు ప్రిన్సి, అశ్విని, ప్రవళిక, అనూహ తదితరులు పాల్గొన్నారు. -
ఇక.. వార్డు ఆఫీసర్లే కీలకం
వరంగల్ అర్బన్: కొత్త ఇంటి నంబర్ల జారీ, భవనాలు, అదనపు కట్టడాల రివైడ్జ్లో చేతివాటం, బకాయిదారుల నుంచి డబ్బులు వసూలు చేసి సకాలంలో చెల్లించకపోవడం వంటి అవినీతి, ఆరోపణల నేపథ్యంలో.. ఎట్టకేలకు రాష్ట్ర పురపాలక శాఖ ఔట్సోర్సింగ్ బిల్ కలెక్టర్లపై కొరడా ఝుళిపించింది. ఆస్తి, నీటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ వసూళ్లు చేసే బాధ్యతల నుంచి తప్పించాలని రాష్ట్ర పురపాలక శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిబంధన అన్ని గ్రేటర్, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల కమిషనర్లకు గత రెండ్రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వరంగల్ బల్దియాలో పని చేస్తున్న 38 మంది ఔట్సోర్సింగ్ బిల్ కలెక్టర్లను పన్నుల వసూళ్ల నుంచి తప్పిస్తూ అధికారులు ఆదేశాలిచ్చారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే అధికం గ్రేటర్ వరంగల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, కార్మికులు 85శాతానికి పైగా ఉన్నారు. సుమారు మూడు దశాబ్దాలుగా పర్మనెంట్ ఉద్యోగుల నియమాల్లేవు. శాశ్వత ఉద్యోగులు మరణిస్తే, అనా రోగ్యం పాలైతే మాత్రమే వారి పిల్లలను కారుణ్య నియామకాల ప్రక్రియ కొనసాగుతోంది. ఈనేపథ్యంలో నగరం విస్తరించడంతో పర్మనెంట్ కార్మికులు పూర్తి స్థాయిలో లేక అన్ని విభాగాల్లో ఔట్సోర్సి ంగ్ ఉద్యోగుల సంఖ్య పెరిగింది. అవినీతి, అక్రమాల్లో సైతం వారి పాత్ర కనిపిస్తోంది. పలు మున్సిపాలిటీల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడడం, ప్రజల నుంచి వీరిపై అభ్యంతరాలు వ్యక్తం కావడం వంటి ఘటనలు వెలుగు చూశాయి. ఏదైనా అవినీతి జరిగితే శాశ్వత ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడం, అవసరమైతే సొమ్ము రికవరీ చేయవచ్చు. కానీ.. ఔట్ సోర్సింగ్ బిల్ కలెక్టర్లను విధుల్లో నుంచి తొలగించడం, క్రిమినల్ కేసులు పెట్టడంతో సరిపెట్టాల్సి వస్తోంది. ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో బల్దియా పరిధిలో పని చేస్తున్న 45 మంది ఔట్సోర్సింగ్ బిల్ కలెక్టర్లను వసూళ్లకు దూరం పెడుతూ ఆదేశాలు జారీ చేశారు. సన్నాహాలు.. బల్దియాకు పది నెలల కిందట 38 మంది వీఆర్ల ను బదిలీ చేశారు. వీరితోపాటు ప్రస్తుతం బల్దియాలో 32 మంది శాశ్వత ఉద్యోగులు ఇన్చార్జ్ బిల్ కలెక్టర్లుగా పని చేస్తున్నారు. నగరంలో 66 డివిజన్లు ఉండగా.. వారిలో 66 మందిని వార్డు ఆఫీసర్లుగా నియమించి, వీరికి ఆస్తి, నీటి పన్నులు వసూలు చేసే బాధ్యతలను కట్టబెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మిగిలిన నలుగురిని ఈ–సేవా సెంటర్లలో బదిలీ చేసే దిశగా కసరత్తులు చేస్తున్నారు. ఇక ఆర్థిక అంశాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పాత్ర లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. వారికే పన్ను వసూళ్ల బాధ్యత ఔట్సోర్సింగ్ బిల్ కలెక్టర్లను తప్పించాలని ఆదేశం ఉత్తర్వులు జారీ చేసిన పురపాలక శాఖ -
అప్పుడు.. ఇప్పుడు అదే తంతు..!
సాక్షిప్రతినిధి, వరంగల్: ‘వడ్డించే వాడు మనవాడైతే ఏ పంక్తిలో ఉన్నా ఫరవాలేదు’ అన్నట్లుగా ఉంది జలవనరులశాఖలో పదోన్నతులు, పోస్టింగుల వ్యవహారం. ప్రతిభావంతులైన ఇంజనీర్లు ఎందరున్నా ‘లాబీయింగ్’ చేసే వారినే పదోన్నతులు వరిస్తాయన్న చర్చ ఆ శాఖలో ఎప్పటినుంచో ఉంది. ప్రభుత్వాలు ఏమున్నా ఉత్తర్వులు, మార్గదర్శకాలకు మంగళం పాడేసి కొనసాగిస్తున్న ప్రమోషన్ల తంతు తరచూ వివాదాస్పదమవుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన ఇంజనీర్లకు అగ్జిలరీ ప్రమోషన్(ప్రోత్సాహక పదోన్నతులు)ల పేరిట చేసిన ప్రతిపాదనలు రచ్చరచ్చగా మారాయి. ప్రాజెక్టు ప్రారంభ దశనుంచి ఇన్వెస్టిగేషన్, లైడార్ సర్వే, డిజైన్స్, డ్రాయింగ్స్, ఎస్టిమేషన్, టెండర్లు, అగ్రిమెంట్స్, భూసేకరణ, పర్యవేక్షణ తదితర విభాగాల్లో వివిధ కేడర్ల ఇంజనీర్లు కీలక భూమిక పోషించారు. ఉన్నతాధికారులు ప్రతిపాదించిన ప్రమోషన్ల జాబితాలో ఈ విభాగాలకు చెందిన ఇంజనీరు ఒక్కరూ లేకపోవడంపై అప్పట్లో అసంతృప్తి భగ్గుమంది. తాజాగా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన బ్యారేజీలపై ఒక పక్క విచారణ జరుగుతుండగా, మరో పక్క ఎంక్వయిరీ ఎదుర్కొంటున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు సూపరింటెండెంట్ ఇంజనీర్గా అదనపు బాధ్యతలు అప్పగించడం నీటిపారుదల శాఖలో చర్చనీయాంశమవుతోంది. కీలక విభాగాలకు దక్కని చోటు.. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి సందర్భంగా 150 కి.మీ. పొడవున జల సంపదతో కళకళలాడడానికి ఇంజనీర్ల కఠోర శ్రమ, పట్టుదల కారణమని భావించిన అప్పటి సీఎం కేసీఆర్.. లింక్–1 ఇంజనీర్లతోపాటు లింక్–2 ఇంజనీర్లలో కష్టపడి పనిచేసిన వారికి ప్రోత్సాహకంగా ప్రమోషన్ ఇచ్చి గౌరవించాలని తలపించి ప్రతిపాదనలు కోరారు. ఈ మేరకు ఉన్నతాధికారులు మేడిగడ్డ బ్యారేజ్నుంచి బీవీ రమణారెడ్డి (ఈఈ), ఎం.రాజు (ఏఈఈ), అన్నారం బ్యారేజ్నుంచి ఎ.యాదగిరి (డీఈఈ), పి.రవిచంద్ర (ఏఈఈ)లు, లింక్ –2 నుంచి నూనె శ్రీధర్ (డీఈఈ) పేర్లు పంపారు. దీంతో ప్రాజెక్టు ప్రారంభం నుంచి కఠోర శ్రమ చేసిన పలు విభాగాలకు చెందిన పలువురిని విస్మరించారన్న అసంతృప్తి చెలరేగింది. కాళేశ్వరం లింక్ –2 సర్కిల్ రూపకల్పన నుంచి రామగుండం డివిజన్–1 ఏర్పడి, మేడిగడ్డ బ్యారేజ్ నుంచి ఎల్లంపల్లి రిజర్వాయర్ వరకు ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ పనులను చేస్తూ లైడార్ సర్వే చేసిన ఇంజనీర్లకు ఒక్కరికి కూడా చాన్స్ ఇవ్వలేదు. కాళేశ్వరం లింక్ –1 ఎస్టిమేట్స్, టెండర్లు, వ్యాప్కోస్ నుంచి డిజైన్స్, డ్రాయింగ్, అగ్రిమెంట్ల వరకు పని చేసిన ఇంజనీర్లను పక్కకు పెట్టి మధ్యన వచ్చిన కొందరికి కూడా అవకాశం ఇచ్చారన్న చర్చ జరిగింది. 1992 పీఎస్సీకి చెందిన ఇద్దరు సీనియర్ ఇంజనీర్లను పక్కకు పెట్టి ప్రోత్సాహక ప్రమోషన్ కోసం ప్రతిపాదనలు పంపినట్లు తెలిసి వారు నేరుగా సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఏఈఈ స్థాయిలో మొదటినుంచి ఎస్టిమేట్స్, డిజైన్స్, టెండర్స్లో పాల్గొన్న ఒక్కరికీ ప్రోత్సాహక ఇంజనీర్ల జాబితాలో పేర్లు లేకపోవడం అప్పట్లో దుమారం రేపింది. క్షేత్రస్థాయిలో పనిచేసే ఏఈఈలలో వికలాంగులు భూసేకరణ ప్రధాన భూమిక పోషించినప్పటికి ఒక్కరికి కూడా అవకాశం దక్కకపోగా, ఎవ్వరికి తీసిపోకుండా పురుషులతో సమాన స్థాయిలో రాత్రి 12 గంటల వరకు పనిచేసిన మహిళా ఏఈఈలను విస్మరించడం వివాదాస్పదంగా మారింది. పదోన్నతుల విషయంలో ‘ఇరిగేషన్’లో ఇష్టారాజ్యం బీఆర్ఎస్ హయాంలో వివాదంగా ‘కాళేశ్వరం’ ప్రమోషన్లు కీలక విభాగాల్లోని ఇంజనీర్లకు దక్కని చోటు కొందరికే అవకాశంపై అప్పట్లో అసంతృప్తి ప్రస్తుత కాంగ్రెస్ సర్కారులోనూ అదే తీరు సీఎంను కలిసేందుకు సిద్ధమవుతున్న ఇంజనీర్లు కాంగ్రెస్ హయాంలోనూ మారని తీరు.. ప్రభుత్వాలు ఏమున్నా నీటిపారుదలశాఖ (జలవనరుల శాఖ)లోని కొందరు ఉన్నతాధికారులు ప్రభుత్వాధినేతలను తప్పుదోవ పట్టించి తమ, అనుచరుల పనులు చక్కబెడుతున్నారన్న చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు, సూచనలకు భిన్నంగా రెండు నెలల్లో పదవీ విరమణకు దగ్గరున్న ఇంజనీర్ను నియమించడంపై దుమారం రేగుతోంది. బ్యారేజీల సమస్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) అధ్యయనం చేస్తోంది. ఒక పక్క ఇన్ని రకాల విచారణలు జరుగుతుండగా.. ఇంకోవైపు సుందిళ్ల బ్యారేజీ, పంపుహౌస్ బాధ్యతలను (ఇరిగేషన్ డివిజన్–3, రామగుండం) చూస్తున్న ఈఈ సర్దార్ ఓంకార్ సింగ్కు వరంగల్ ఇరిగేషన్ సర్కిల్ ఎస్ఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఈ నెల 22న మెమో జారీ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో చక్రం తిప్పిన కొందరు ఈఈ స్థాయి అధికారులు.. తాజా ప్రభుత్వంలోనూ పైచేయి సాధిస్తుండడాన్ని కొందరు ఇంజనీర్లు జీర్ణించుకోవడం లేదు. అదేవిధంగా అగ్జిలరీ ప్రమోషన్లలో జరిగిన అక్రమాలు, అవకతవకలతోపాటు ప్రాజెక్టు నిర్మాణలోపాలు, బీఆర్ఎస్ హయాంలో కీలకంగా వ్యవహరిస్తున్న సహచర ఇంజనీర్ల బాగోతాల చిట్టాతో సీఎం రేవంత్రెడ్డిని కలిసేందుకు కొందరు బాధిత ఇంజనీర్లు సిద్ధమవుతుండడం నీటిపారుదల శాఖలో హాట్ టాపిక్గా మారింది. -
పోరాడే నాయకుడు ప్రేమేందర్రెడ్డి
రామన్నపేట: గత 40 సంవత్సరాలుగా నీతి, నిజాయితీతో ప్రజల కోసం పనిచేస్తూ, నిరుద్యోగుల సమస్యలపై శాసనమండలిలో ప్రశ్నించే గొంతుకై న బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా దేశాయ్పేట కేఆర్ గార్డెన్లో శుక్రవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలో పట్టభద్రులు ప్రేమేందర్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఎన్నికల ఇన్చార్జ్ పీఎల్ శ్రీనివాస్, కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రబెల్లి ప్రదీప్రావు, రత్నం సతీష్ షా, బాకం హరిశంకర్, వన్నాల వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యేలు రాజేశ్వర్రావు, వన్నాల శ్రీరాములు, అల్లం నాగరాజు, కార్పొరేటర్లు కల్పన, స్వాతి, రంజిత్ పాల్గొన్నారు. ప్రదీప్రావు ఇంటికి లక్ష్మణ్ కాశిబుగ్గ: నగర పర్యనటకు వచ్చిన లక్ష్మణ్ ఓ సిటీలోని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా ప్రదీప్రావు, రేణుక దంపతులు ఆయనకు స్వాగతం పలికి జ్ఞాపిక అందజేసి శాలువాతో సన్మానించారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ -
కేసీఆర్ కుటుంబమే పెద్ద బ్లాక్మెయిలర్
ములుగు: కేసీఆర్ కుటుంబం కంటే పెద్ద బ్లాక్మెయిలర్ రాష్ట్రంలో ఎవరూలేరని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. ములుగు మండలం ఇంచర్ల సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో శుక్రవారం నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నిక సన్నాహక సమావేశంలో సీతక్క మాట్లాడారు. తాను ఎక్కడ మోసం చేశానో తనపై ఆరోపణలు చేస్తున్న దుర్మార్గులు, దోపిడీదారులు నిరూపించాలని సవాల్ విసిరారు. ఆదివాసీ మహిళ మంత్రిగా ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోతున్నారని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటకు కట్టుబడి సన్నాలుకు బోనస్ ఇస్తున్నామని, ఇకముందు దొడ్డురకానికి కూడా ఇస్తామని తెలిపారు. ‘పక్కదేశంలో చదువుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి గొప్పోడా.. మన మధ్యలో ఉంటూ ప్రజలు, నిరుద్యోగుల సమస్యలపై నిత్యం పోరాడుతున్న తీన్మార్ మల్లన్న గొప్పోడా..’ అని సమావేశానికి వచ్చిన పట్టభద్రులను అడిగి సమాధానం రాబట్టారు. మల్లన్నను అర్థరాత్రి అరెస్ట్ చేసి, కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసినా ప్రశ్నించడం మానుకోలేదని అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. ప్రతి విషయంలో ప్రశ్నించి అడ్డుతగులుతున్నాడని నన్ను అరెస్ట్ చేయించావు, మరి ఇప్పుడు నీ చెల్లి కవితమ్మ ఎందుకు అరెస్ట్ అయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉద్ధేశించి తీన్మార్ మల్లన్న అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిని ఎందుకు నిలబెట్టారో రాకేశ్రెడ్డికే తెలియదని, దుర్గమ్మ గుడిచుట్టూ మేకను తిప్పినట్లు అతన్ని తిప్పుతున్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో మాజీ ఎంపీ పోరిక బలరాంనాయక్, డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి ధనసరి సూర్య, నాయకులు కూచన రవళి, గొల్లపల్లి రాజేందర్గౌడ్, బానోత్ రవిచందర్, రాంరెడ్డి, రవి, వెంకటనారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి సీతక్క -
రైలుకింద పడిన జంట
● బాలిక మృతి, యువకుడికి తీవ్ర గాయాలుకాశిబుగ్గ/ఖమ్మం క్రైం: ఓ జంట రైలుకింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో బాలిక చనిపోగా, యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన వరంగల్, కాజీపేట రైల్వేస్టేషన్ల మధ్య పోతన జంక్షన్ సమీపంలోని రైల్వేట్రాక్పై శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. జీఆర్పీ సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ కాశిబుగ్గకు చెందిన మేకమల్ల చెన్నకేశవ(19)కు, ఖమ్మం సారధినగర్కు చెందిన ఇంటర్ చదువుతున్న బాలిక(17)కు ఫోన్లో పరిచయమైంది. వీరు తరచూ ఫోన్లో మాట్లాడుతుండగా బాలికను తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఆమె గురువారం ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చింది. శుక్రవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో సుష్మ ఇంటికి ఫోన్ చేసి చనిపోతున్నా అని చెప్పి డౌన్లైన్లో వెళ్తున్న నవజీవన్ ఎక్స్ప్రెస్ రైలుకింద పడ్డారు. బాలిక అక్కడికక్కడే మృతిచెందింది. చెన్నకేశవ కాళ్లు తెగి తీవ్ర గాయాలయ్యాయి. గమినించిన స్థానికులు 108 ద్వారా చెన్నకేశవను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై ఐలయ్య సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాలిక మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీలో భద్రపరచామని తెలిపారు. ఖమ్మం త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో బాలిక అదృశ్యం కేసు నమోదైందని సీఐ తెలిపారు. అమ్మా చనిపోతున్నా.. నా కోసం వెతకొద్దు ‘అమ్మా నేను చనిపోతున్నాను... నా కోసం వెతకొద్దు’ అని చెప్పిన నిమిషాల్లోనే ఖమ్మంకు చెందిన బాలిక వరంగల్ – కాజీపేట మధ్య రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం రాత్రి బాలిక తల్లి ఖమ్మం పోలీసుస్టేషన్కు వచ్చి తన కుమార్తె ఆచూకీ విషయమై అక్కడి సీఐ రమేష్తో మాట్లాడుతోంది. అదేసమయాన ఆమెకు ఫోన్ చేసిన బాలిక ‘నేను చనిపోతున్నాను.. నా కోసం వెతకొద్దు’ అని చెప్పి కట్ చేసింది. దీంతో ఖమ్మం త్రీటౌన్ సీఐ రమేష్ లొకేషన్ ఆధారంగా వరంగల్ – కాజీపేట రైల్వే స్టేషన్ల మధ్య ఉన్నట్లు గుర్తించి ఖమ్మం ఆర్పీఎఫ్ సీఐ శ్రీనివాస్రెడ్డికి సమాచారం ఇచ్చారు. ఆయన సిబ్బందిని అప్రమత్తం చేసి ఘటనాస్థలికి వెళ్లేలోగా బాలికతోపాటు ఉన్న యువకుడు రైలుకింద కిందపడ్డారు. బాలిక చనిపోవడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. -
మనువాద రాజకీయాలతో రాజ్యాంగానికి ముప్పు
● సామాజిక విశ్లేషకులు భిక్షమయ్యనయీంనగర్: మనువాద రాజకీయాలతో రాజ్యాంగానికి ప్రమాదం ఉందని సామాజిక విశ్లేషకులు బొజ్జ భిక్షమయ్య అభిప్రాయపడ్డారు. హనుమకొండ ప్రెస్క్లబ్లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంటలెక్చువల్స్ ఫోరం ఆధ్వర్యంలో శుక్రవారం రాజ్యాంగ పరిరక్షణ సదస్సు ఫోరమ్ కన్వీనర్ ప్రొ.ఎర్రగట్టు స్వామి అధ్యక్షతన నిర్వహించారు. ప్రధాన వక్త బొజ్జ భిక్షమయ్య మాట్లాడుతూ.. ఒకే దేశం, ఒకే మతం, ఒకే సంస్కృతి అన్న నినాదమే మోసపూరితమైందన్నారు. బలహీనవర్గాలు, వెనుకబడిన మైనార్టీలకు రిజర్వేషన్లు ఉండకుండా కుట్ర పన్నుతున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చట్టసభలు 90రోజలు నడవాలని కాని 15రోజులే నడుస్తున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని పిలుపునిచ్చారు. డాక్టర్ ప్రీతి దయాళ్ మాట్లాడుతూ.. రాజ్యాంగం రద్దు అయితే దేశంలో ప్రజాస్వామ్యం రద్దు అవుతుందన్నారు. ప్రొఫెసర్ వెంకటనారాయణ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజ్యాంగం మార్చాలనే వాళ్లను ఓడించాలని, ప్రజల గొంతుకగా నిలిచిన తీన్మార్ మల్లన్నను గెలిపించాలని గ్రాడ్యుయేట్లను కోరారు. ఈ సదస్సులో వివిధ సంఘాల నాయకులు రామబ్రహ్మం, ప్రొఫెసర్ వీరన్న, ఎండీ.రియాజ్, కత్తి వెంకటస్వామి, రాజు, తదితరులు పాల్గొన్నారు. -
అందుబాటులో నూతన వంగడాలు
హన్మకొండ: రైతులకు అవసరమైన నూతన వంగడాలు అందుబాటులో ఉన్నాయని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకుడు డాక్టర్ ఆర్.ఉమారెడ్డి అన్నారు. వరంగల్ పైడిపల్లిలోని వరంగల్ వ్యవసాయ పరిశోధన స్థానంలో శుక్రవారం నిర్వహించిన విత్తన మేలాలో ఉమారెడ్డి మాట్లాడారు. అధిక దిగుబడులు ఇచ్చే, చీడపురుగులను తట్టుకునే నూతన వరి, కంది, పెసర విత్తనాలు వ్యవసాయ పరిశోధన స్థానంలో అందుబాటులో ఉన్నాయన్నారు. పంటల అవశేశాలు కాలపెట్టకుండా భూమిలోనే కలియదున్నాలని, పచ్చిరొట్ట పంటలను వేసుకుని భూసారాన్ని కాపాడుకోవాలని సూచించారు. అనంతరం శాస్త్రవేత్తలు వి.వెంకన్న, జి.వీరన్న, ఎన్.సంద్య కిశోర్ మాట్లాడారు. వరిలో నేరుగా విత్తె పద్ధతి ద్వారా రైతులు సాగు ఖర్చులు తగ్గించుకోవచ్చని తెలిపారు. పత్తి పంటలో అధిక సాంద్రత కలిగిన పత్తి ద్వారా మంచి లాభాలు సాధించవచ్చని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. పంట మార్పిడి విధానం ద్వారా మేలు జరుగుతుందన్నారు. పప్పు దినుసులు, నూనె గింజలు, కూరగాయల విస్తీర్ణం పెంచాలని సూచించారు. వరంగల్ జిల్లా వ్యవసాయాధికారి ఉషాదయాళ్ మాట్లాడుతూ.. రైతులు నాణ్యమైన విత్తనాలు గుర్తింపు పొందిన డీలర్ వద్దనే తీసుకోవాలని, వాటికి సంబంధించిన రశీదు, ఇతర వివరాలు జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. జీలుగ విత్తనాలు రైతులకు రాయితీపై అందిస్తున్నామని తెలిపారు. రైతులు పంట బీమా చేయించుకోవాలన్నారు. ఈ సందర్భంగా రైతులకు విత్తనాలు అందించి, రైతులకు అవసరమైన కరపత్రాలు విడుదల చేశారు. కార్యక్రమంలో ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ దిలీప్ కుమార్, వ్యవసాయ శాఖ హనుమకొండ ఏడీ దామోదర్ రెడ్డి, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు. -
రైల్వే ఉద్యోగుల సీసీఎస్ రుణాలపెంపు
కాజీపేట రూరల్: రైల్వే కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ (లిమిటెడ్) సీసీఎస్ (రైల్వే ఉద్యోగులు) సభ్యుల రుణాలు పెంచుతూ డైరెక్టర్ల మీటింగ్లో తీర్మానించినట్లు కాజీపేట రైల్వే సీసీఎస్ డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస్ యాదవ్, కాజీపేట రైల్వే సీసీఎస్ కో ఆప్షన్ డైరక్టర్ దేవులపల్లి రాఘవేందర్ శుక్రవారం తెలిపారు. సికింద్రాబాద్ సీసీఎస్ ముఖ్య కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సీసీఎస్ డైరెక్టర్ల బోర్డు మీటింగ్లో రుణాలను పెంచుతూ కమిటీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కాజీపేట నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీనివాస్యాదవ్, రాఘవేందర్ ఈ మీటింగ్లో పాల్గొన్నారు. సీసీఎస్ సభ్యులకు ప్రస్తుతం ఇస్తున్న జనరల్ లోన్ రుణం రూ.3లక్షలను రూ.4లక్షల వరకు, స్పెషల్ లోన్ రూ.5లక్షల నుంచి రూ.10లక్షల వరకు పెంచినట్లు తెలిపారు. పెంచిన రుణాలను జూలై 1వ తేదీ నుంచి అమలు చేస్తున్నామని, రుణాల వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య ● భార్య పుట్టింటికి వెళ్లి రాకపోవడంతో ఘటన ● ఏడాదిక్రితం ప్రేమవివాహం చేసుకున్న జంట హసన్పర్తి: కుటుంబ కలహాలతో పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నగరంలోని ఒకటో డివిజన్ పలివేల్పుల ఆనంద్నగర్ కాలనీలో శుక్రవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పలివేల్పులకు చెందిన గోలి నితిన్(25) నర్సంపేటకు చెందిన ఓ యువతి ప్రేమించుకుని ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి కాపురం కొంతకాలం సవ్యంగానే సాగినా.. అనంతరం గొడవలు ప్రారంభమయ్యాయి. ఇటీవల భర్తతో గొడవ పడిన భార్య పుట్టింటికి వెళ్లింది. భార్య తిరిగి రావడం లేదని మనస్తాపానికి గురైన నితిన్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం వరంగల్లోని ఎంజీఎం మార్చురీకి తరలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ ఎస్సై రాజ్కుమార్ తెలిపారు. -
ప్రేమ విఫలమైంది.. అందుకే చనిపోతున్నా
గూడూరు: ‘ నాప్రేమ విఫలమైంది. అందుకే చనిపోతున్నా’ అంటూ ఓ యువకుడు తన కుటుంబ సభ్యులతో వీడియో కాల్లో మాట్లాడి ఆ తరువాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం మచ్చెర్ల శివారు కొమురంభీంనగర్ అటవీప్రాంతంలో శుక్రవారం జరిగింది. పోలీసులకు మృతుడి తండ్రి కీర్యానాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నా యి. నర్సంపేట డివిజన్ ఖానాపురం మండలం నాజీతండాకు చెందిన బాదావత్ నవీన్ (25) ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. కానీ ఆ యువతి ఇటీవల నవీన్ ప్రేమను కాదంటుండడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో అతను గురువారం ఉదయం నాజీతండా నుంచి బయలుదేరి గూ డూరు మండలం మచ్చెర్ల శివారు కొమురంభీంనగర్ అటవీ ప్రాంతానికి చేరుకున్నాడు. తన ప్రేమ విఫలమైందని, అందుకు తాను పురుగుల మందు తాగి చనిపోతున్నట్లు కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి చెప్పాడు. ఆ తరువాత పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే నాజీతండా నుంచి బయలుదేరి అడవికి చేరుకోగా నవీన్ అపస్మారకస్థితిలో పడి ఉండడాన్ని గమనించారు. వెంటనే గూడూరు సీహెచ్సీకి తరలించి, ప్రథమ చికిత్స అనంతరం వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. తండ్రి కీర్యానాయక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులకు వీడియో కాల్చేసి ఆత్మహత్య -
రిజిస్ట్రేషన్లు సులభతరంగా చేపట్టాలి
● జాయింట్ ఐజీ మధుసూదన్రెడ్డి కాజీపేట అర్బన్: భూక్రయవిక్రయదారులకు సులభతరంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ జాయింట్ ఐజీ మధుసూదన్రెడ్డి తెలిపారు. వరంగల్ ఆర్వో రిజిస్ట్రేషన్ కార్యాలయంలో శుక్రవారం వార్షిక తనిఖీలో భాగంగా జాయింట్ ఐజీ మధుసూదన్రెడ్డి రిజిస్ట్రేషన్, చిట్స్ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐజీ కార్యాలయంలో జాయింట్ ఐజీ మధుసూదన్రెడ్డి, డీఐజీ సుభాషిణిని జిల్లా రిజిస్ట్రార్ హరికోట్ల రవి, సబ్ రిజిస్ట్రార్ అమ్జద్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు. -
బ్లాక్మెయిల్ చేసిన వ్యక్తికి కమ్యూనిస్టుల మద్దతా?
● బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమహన్మకొండ: యూ ట్యూబ్ చానల్ను అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి తీన్మార్ మల్లన్న కమ్యూనిస్టులు ఎలా మద్దతు ఇస్తారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ ప్రశ్నించారు. శుక్రవారం హనుమకొండలోని బీజేపీ ఎన్నికల కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీనియర్ నాయకుడు రాఘవులు అవినీతికి పాల్పడ్డారని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వద్ద రూ.100 కోట్లు తీసుకుని 10 టీవీ చానల్ను ధారాదత్తం చేశారని తీన్మార్ మల్లన్న యూట్యూబ్ ద్వారా ప్రచారం చేశారని, ఈ ఆరోపణలకు ఆధారాలు చూపించాడా..? లేక తీన్మార్ మల్లన్న బ్లాక్ మెయిల్కు భయపడి మద్దతు ఇస్తున్నారా.. అనేది సమాజానికి చెప్పాలన్నారు. బ్లాక్ మెయిల్ చేసి మీ అవినీతి సొమ్ము నుంచి తీసుకున్న మొత్తాన్ని సీఎం రేవంత్కు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారా అని ప్రశ్నించారు. తాను కూడా కేటీఆర్ వద్ద డబ్బులు తీసుకుని స్థలం కొన్నానని ఆ చానల్ ద్వారా ప్రచారం, ఆరోపణ చేస్తే ఆధారాలు చూపించాలని, లేకపోతే చెప్పుతో కొడతానని హనుమకొండ చౌరస్తాలో ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది జరిగి మూడేళ్లయినా ఆధారాలు చూపించలేదన్నారు. విజ్ఞులైన పట్టభధ్రులు ఆలోచించాలన్నారు. ప్రజల పక్షాన పోరాడే బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, నాయకులు తాళ్లపల్లి కుమారస్వామి, కొండి జితేందర్ రెడ్డి, విష్ణువర్థన్ రెడ్డి, రాజిరెడ్డి, నర్మెట శ్రీనివాస్ పాల్గొన్నారు. -
నకిలీ విత్తనాలు, పురుగు మందులను అరికట్టాలి
వరంగల్: రైతులు సాగుకు సిద్ధమవుతున్న ప్రభుత్వ అనుమతిలేని, కాలం చెల్లిన విత్తనాలు, పురుగు మందులను రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకునే ప్రయత్నాలు చేస్తున్న వ్యాపారులు, ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ మోర్తాల చందర్రావు కోరారు. శుక్రవారం తెలంగాణ రైతు సంఘం నాయకులు వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ఝాను కలసి వినతి పత్రాలను అందజేసి, మాట్లాడారు. గత సంవత్సరం విక్రయించగా మిగిలిన బ్రాండెడ్ కంపెనీల విత్తనాలను అదే కంపెనీల పేరుతో ఇప్పుడున్న లాట్ నంబర్ వేస్తూ ప్యాకింగ్ చేసి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. ట్రూతప్పుల్ లేబుళ్లను ప్యాకింగ్లపై అంటించి అమ్మకాలు చేసి సొమ్ము చేసుకుంటున్నారని పేర్కొన్నారు. పైరు ఏపుగా పెరుగుతుందని, దిగుబడి బాగా వస్తుందనే నమ్మించి అనుమతి లేని బయో మందులను సైతం రైతులకు అంటగడుతున్నారని అలాంటివారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించి పోలీస్ శాఖలోని నిఘా వర్గాలు, వ్యవసాయ శాఖ అధికారులను అప్రమత్తం చేసి విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల వ్యాపారుల హోల్సేల్, రిటేల్ దుకాణాల్లో, సరుకులు నిల్వలు ఉండే గోదాముల్లో తనిఖీలు చేపట్టి రైతులు మోసపోకుండా చూడాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రమేశ్, సంపత్కుమార్, నర్సయ్య, గోపాలరావు, ఆనందరావు పాల్గొన్నారు. -
‘అసిస్టెంట్ రిజిస్ట్రార్ను సస్పెండ్ చేయాలి’
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అశోక్బాబును సస్పెండ్ చేయాలని కాకతీయ యూనివర్సిటీ అధ్యాపకుల సంఘం (అకుట్ ) డిమాండ్ చేసింది. ఈమేరకు అకుట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మామిడాల ఇస్తారి, ఎన్జీఓ బాధ్యులు, పార్ట్టైం లెక్చరర్లతో కలిసి కేయూ రిజిస్ట్రార్ ఆచార్య మల్లారెడ్డికి శుక్రవారం వినతిపత్రాన్ని అందజేశారు. యూనివర్సిటీ భూములపై డిజిటల్ సర్వేకన్నా ముందే కేయూలోని 229 సర్వేనంబర్లో అశోక్బాబు ఇల్లు ఉందని ఆయన భూకబ్జాకు పాల్పడ్డారని ఆరోపించారు. అలాంటి అశోక్బాబు యూనివర్సిటీలో కీలకమైన అసిస్టెంట్ రిజిస్ట్రార్గా విధులను నిర్వర్తించటం ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. అశోక్బాబు.. మాజీ వీసీతో కలిసి పరిపాలనను భష్ట్రపట్టించారని ఆరోపించారు. గతంలో కేయూ ల్యాండ్ కమిటీలో ఉన్న అశోక్బాబును పాలకమండలి తొలించిన విషయాన్ని ఇస్తారి రిజిస్ట్రార్కు గుర్తుచేశారు. అశోక్బాబు తాను పనిచేస్తున్న సెక్షన్ నుంచి తనకు తానుగా తొలిగిపోతే బాగుంటుందన్నారు. అశోక్బాబును సస్పెండ్ చేసి కొత్త అసిస్టెంట్ రిజిస్ట్రార్ను నియమించాలని డిమాండ్ చేశారు. విషయాన్ని ఇన్చార్జ్ వీసీ వాకాటి కరుణ దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకుంటామని రిజిస్ట్రార్ ఆచార్య మల్లారెడ్డి బదులిచ్చారు. ఆచార్య బ్రహ్మేశ్వరీ, డాక్టర్ రమేశ్, డాక్టర్ ఎన్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ ప్రమాణాలతో సౌకర్యాలు
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్లో ప్రారంభించిన అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకం అభివృద్ధి పనులు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో చేపడుతున్నట్లు సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) భర్తీష్కుమార్ జైన్ పేర్కొన్నారు. కాజీపేట జంక్షన్లో చేపట్టిన వరల్డ్క్లాస్ అమృత్భారత్ రైల్వే స్టేషన్ స్కీం అభివృద్ధి పనులను శుక్రవారం డీఆర్ఎం తనిఖీ చేశారు. కాజీపేట రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే వెయింటింగ్ హాల్స్, టాయ్లెట్స్, విశ్రాంతి గదులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జితోపాటు జంక్షన్ ఎదుట ఉన్న సర్క్యూలేటింగ్ ఏరియాలో జరుగుతున్న పనులను ఆయన తనిఖీ చేసి పనుల నిర్మాణం, నాణ్యత ప్రమాణాలపై అధికారులతో మాట్లాడారు. అభివృద్ధి పనుల్లో భాగంగా తొలగిస్తున్న కార్యాలయాలు, నూతన నిర్మాణాలను పరిశీలించి పలు చోట్ల మార్పులు, చేర్పులపై, వర్షం నీరు నిల్వకుండా ఉండేందుకు అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ ఏడీఆర్ఎం గోపాల్, వివిధవిభాగాల అధికారులు ఉన్నారు. జనగామ రైల్వేస్టేషన్లో పనుల పరిశీలన జనగామ: కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్కీంలో భాగంగా జనగామ రైల్వేస్టేషన్ ఆధునికీకరణకు సుమారు రూ.107కోట్ల వరకు బడ్జెట్ కేటాయించగా, మొదటి విడుత రూ.27 కోట్లతో పనులు కొనసాగుతున్నాయి. శుక్రవారం డీఆర్ఎం భర్తీష్కుమార్ జైన్ జనగామ రైల్వేస్టేషన్లో పనుల పురోగతిని పరిశీలించారు. లక్ష్యం మేరకు పనులు పూర్తి కావాలని ఆదేశించారు. పార్కింగ్, గ్రీనరీ, తదితర వాటికి సంబంధించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాజీపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు తనిఖీ చేసిన డీఆర్ఎం భర్తీష్కుమార్
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
దేశాన్ని వణికించిన 10 భారీ అగ్ని ప్రమాదాలు
Sunday Story: 'ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న'!
'పరాక్రమం' టీజర్ విడుదల.. టీమ్కు సపోర్ట్గా నిలిచిన విశ్వక్ సేన్
విధ్వంసం సృష్టించిన విండీస్ బ్యాటర్లు.. సౌతాఫ్రికాకు సిరీస్ పరాభవం
యాదాద్రి ఆలయంలో భక్తులకు ఇబ్బందులు
ఇవి మార్జాల పుష్పాలనుకుంటున్నారా!
Magazine Story: తిన్నారో.. చచ్చారే! హైదరాబాద్ వాసులకు బంపర్ ఆఫర్
రాజ్కోట్ ప్రమాదంలో 33కు చేరిన మృతుల సంఖ్య.. ప్రభుత్వం కీలక నిర్ణయం
snake bite: పట్టిన పామే కాటేసింది
అవును.. అది నిజంగా మృత్యుగుహే!
తప్పక చదవండి
- విధ్వంసం సృష్టించిన విండీస్ బ్యాటర్లు.. సౌతాఫ్రికాకు సిరీస్ పరాభవం
- సెలక్ట్ చేసి చివరి నిమిషంలో హ్యాండిచ్చేవారు: హీరోయిన్
- ఇన్సూరెన్స్ లైసెన్స్ అప్లికేషన్ను విత్ డ్రా.. పేటీఎం మరో కీలక నిర్ణయం
- బ్యాంక్ల్లో ఇబ్బందులా?, ఆర్బీఐకి ఫిర్యాదు చేయండిలా..
- పిల్లల ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ఆరుగురి శిశువుల మృతి
- ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి అఖిలేష్?
- మరో ఎంపీ లండన్లో ఉన్నా.. నన్ను టార్గెట్ చేశారు: స్వాతి మలివాల్
- ‘లైఫ్ ట్యాక్స్’కు ఎగనామం!
- Mallikarjun Kharge: చైనా ఆక్రమణలపై మోదీ మౌనం
- క్షమాపణ చెప్పాలి... లేకుంటే దావా
Advertisement