-
71 ఏళ్ల వయసులో అన్ని డ్రైవింగ్ లైసెన్స్ల..!
భారీ వాహనాలను అలవోకగా డ్రైవ్ చేస్తున్న ఈ బామ్మను చూసి వామ్మో..! అనాల్సిందే. చాలా చాకచక్యంగా నడిపేస్తోంది. అంతేకాదు హెవీ వెహికల్ డ్రైవింగ్ స్కూల్ని కూడా ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తోంది కూడా. అలాంటి వాహనాలను నడపడం కేవలం మగవాళ్లు మాత్రమే చేయగలరన్న మూసధోరణిని మూలనపడేసింది. సామర్థ్యం ఉంటే ఎవ్వరైనా.. చేయగలరని చేసి చూపించింది ఈ సూపర్ బామ్మ..!. ఆమె సక్సెస్ జర్నీ ఎలా సాగిందంటే..మణి అమ్మగా పిలచే రాధామణి అమ్మ..కేరళకు చెందిన 71 ఏళ్ల మహిళ. తన అద్భతమైన డ్రైవింగ్తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ఆమె జేసీబీలు దగ్గర నంచి క్రేన్ల వంటి భారీ వాహనాల వరకు ప్రతీది ఈజీగా నడిపేస్తుంది. అంతేకాదండోయే ఏకంగా విభిన్న హెవీ వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్ల 11 పొందిందట. తాను ఈ హెవీ వెహికల్స్ని ఇంత అలవోకగా నడపడానికి కారణం.. తన భర్తదే క్రెడిట్ అంటోంది. మహిళలు అస్సలు డ్రైవింగ్ నేర్చకోవడానికి ముందుకురాని కాలంలో ఆమె తన భర్త అండదండలతో భారీ వాహనాలను డ్రైవ్ చేయడం నేర్చుకుంది. అలా ఆమె 1981లో ఫోర్ వీలర్ లైసెన్స్ పొందింది. ఆ తర్వాత 1984లో హెవీ వెహికల్ లైసెన్స్ పొందింది. ఆ టైంలో కేరళలో మహిళలు హెవీ వెహికల్ లైసెన్స్ పొందడంలో ఎదురవుతున్న సవాళ్ల గురించి చెప్పుకొచ్చారు. అంతేగాదు తాను ఈ హెవీ వెహికల్ డ్రైవింగ్ స్కూల్ని ఎలా స్థాపించారో కూడా వివరించారు. 2004లో భర్త మరణంతో రాధమణి ఈ రంగంలో పలు అడ్డంకులను ఎదుర్కొంది. అయిన ప్పటికీ పట్టుదలతో డ్రైవింగ్ స్కూల్ భాద్యతలు చేపట్టి డ్రైవింగ్ కమ్యూనిటీ లీడర్ స్థాయికి ఎదిగింది. మొదట్లో అది ఏ2Z డ్రైవింగ్ స్కూల్ ఆ తర్వాత కాలక్రమేణ ఏ2Z ఇన్స్టిట్యూట్గా మారింది. ఇక్కడ మణి అమ్మ..అన్ని రకాల భారీ పరికరాలను ఎలా ఆపరేట్ చేయాలో శిక్షణ ఇస్తుంది. ఈ వయసులో కూడా ఆమె చదువు కొనసాగిస్తోంది. ఆమె ఇప్పుడు మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేస్తోంది. అంతేగాదు తాను మొదట్లో భారీ వాహనాల డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడూ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారో గర్తు చేసుకున్నారు. ఆ టైంలో డ్రైవింగ్ నేర్చకోవడం ఓ సవాలుగా ఉండేదన్నారు మణి అమ్మ. అంతేగాదు చిన్న వాహనాల కంటే భారీ వాహనాల నడపటమే సులభమని ఆమె నొక్కిచెబుతున్నారు. తాను ఎన్ని ఆటంకాల ఎదురైనా అంకితభావంతో వేర్వేరు భారీ వాహనాల 11 లైసెన్స్లు పొందినట్లు చెప్పుకొచ్చారు. నేర్చుకోవాలన్న అభిరుచి ఉన్నవాళ్లకి వయోభేదం పెద్ద సమస్య కాదంటున్నారు. అలాగే డ్రైవింగ్ అనేది ఏ ఒక్క లింగానికో పరిమితం కాదని రాధామణి నొక్కి చెబుతున్నారు. నిజంగా రాధామణి గ్రేట్ కదూ. మన అమ్మమల కాలంలోనే ఆమె ఇంత అలవోకగా నేర్చుకోవడమే గాక ఇతరులకు మెళ్లకువలు నేర్పిస్తున్నారు. పైగా మహిళలు ఈ రంగంలోకి ధైర్యంగా రావొచ్చు, సంకోచించాల్సిన పని లేదంటన్నారు రాధామణి.(చదవండి: ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..) -
బ్రక్సిజమ్ అంటే...? పిల్లల పళ్లుకి ప్రమాదమా..?
కొందరు పిల్లలు... ఆ మాటకొస్తే కొందరు పెద్దలు కూడా నిద్రలో పళ్లు కొరుక్కోవడంతోపాటు దవడలు బిగబట్టి పళ్లు నూరుతుంటారు. దీనిని వైద్యపరిభాషలో ‘బ్రక్సిజమ్’ అంటారు. దీనివల్ల పళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ సమస్యపై అవగాహన కోసం ఈ కథనం.తీవ్రమైన మానసిక ఒత్తిడి, యాంగై్జటీ వంటి పరిస్థితులే బ్రక్సిజానికి కారణం. ఎప్పుడో ఒకసారి పళ్లు బిగబట్టడం, కోపం వచ్చినప్పుడు పళ్లు కొరకడం సహజం. కానీ నిత్యం నిద్రలో ఇది జరుగుతుంటే మాత్రం దీన్ని రుగ్మతగా పరిగణించి చికిత్స తీసుకోవాలి. లక్షణాలు: ΄పొద్దున లేవగానే తలనొప్పి. ఒక్కోసారి ముఖం నొప్పి కూడా. చెవి పోటు దవడ కండరాల నొప్పులు కొందరిలో చెవిలో హోరు (టినైటిస్) నోరు నొప్పి కారణంగా ఆహారం తీసుకోలేకపోవడం నోరు తెరవడానికి, మూయడానికి ఇబ్బంది. రకాలు: అవేక్ బ్రక్సిజమ్ : కొందరు మెలకువగా ఉన్నప్పుడు పగటివేళ పళ్లు కొరుక్కుంటూ ఉంటారు. ఇలాంటి కేసుల్లో ఒత్తిడికి కారణం గుర్తించి కౌన్సెలింగ్ ఇస్తే సరిపోతుంది. అంతకుమించి చికిత్స అవసరం ఉండకపోవచ్చు. కొందరిలో ఏదైనా విషయంపై తదేకంగా దృష్టి కేంద్రీకరించినప్పుడు అసంకల్పితంగా దవడ బిగిస్తుంటారు. దీనికీ చికిత్స అవసరం ఉండదు స్లీప్ బ్రక్సిజమ్: నిద్రలో ఉన్నప్పుడు అదేపనిగా పళ్లు కొరకడంతో ΄ాటు తాము అలా చేస్తున్నామన్న విషయమే పిల్లలకు తెలియదు. పగటివేళల్లో మామూలుగానే ఉంటారు. వీళ్లకు చికిత్స అవసరం. రిస్క్ ఫ్యాక్టర్స్: పిల్లల్లో తీవ్రమైన ఒత్తిడి, యాంగై్జటీ వంటి పరిస్థితుల తోపాటు మేజర్ డిప్రెసివ్ డిజార్డర్స్ లేదా జనరలైజ్డ్ యాంగై్జటీ డిజార్డర్స్ వంటి మానసిక పరిస్థితులు పెద్దవారిలో ఆల్కహాల్తో పాటు కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ వంటివి ఎక్కువగా తాగడం పెద్దల్లో యాంగై్జటీని తగ్గించడం కోసం వాడే కొన్ని రకాల ఔషధాలు. ఉదాహరణకు ‘సెలక్టివ్ సెరిటోనిన్ రీ–అప్ టేక్ ఇన్హిబిటార్స్ –ఎస్ఎస్ఆర్ఐస్ అనే మందులు పెద్దవారిలో గురక రావడం. చికిత్స: పిల్లలు నిద్రలో ఎప్పుడైనా పళ్లు కొరుకుతుంటే దానికి పెద్దగా చికిత్స అవసరం లేదు. కానీ అది పళ్లకు హాని కలిగించే ంత తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం సీరియస్గా తీసుకోవాల్సిందే. ముందుగా వారి పళ్లు దెబ్బతినకుండా పంటి డాక్టర్ ఆధ్వర్యంలో మౌత్ గార్డ్స్ అమర్చడం అవసరంస్ట్రెస్ తగ్గించడానికి తొలుత కౌన్సెలింగ్, తర్వాత ధ్యానం వంటి పద్ధతులతో తేలిక పాటి వ్యాయామాలు ‘కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ’తో చాలావరకు ఉపయోగం ఉంటుంది కొన్ని పరీక్షల తర్వాత యాంగై్జటీ, డిప్రెషన్ వంటివి ఉన్నాయని తేలితే... యాంగ్జియోలైటిక్స్ అనే యాంటీ యాంగై్జటీ మందులతో పాటు మజిల్ రిలాక్సెంట్ ఔషధాలు. జీవనశైలి అంటే లైఫ్స్టైల్లో మార్పులు (మద్యం అలవాటు వదిలేయడం, పరిమితికి మించి కాఫీలు, పొగ తాగడాన్ని మానేయడం) డాక్టర్డాక్టర్ నరేంద్రనాథ్ రెడ్డి సీనియర్ డెంటల్ సర్జన్(చదవండి: కిచెన్ని క్లీన్గా ఉంచడంలో టూత్పేస్ట్ ఎలా పనిచేస్తందో తెలుసా..!) -
కడుపులో అల్సర్స్ తగ్గాలంటే..!
ఆహారపు అలవాట్లు మారడం తోపాటు జీవనశైలిలో ఒత్తిడి పెరగడం వల్ల జీర్ణకోశానికి వస్తున్న సమస్యల్లో కడుపులో అల్సర్స్ కూడా ఒకటి. ఆహారాన్ని జీర్ణం చేయడం కోసం కడుపులో ఆమ్లం (యాసిడ్) ఉత్పత్తి అవుతుంది. అది నిర్ణీత మోతాదులో ఉత్పత్తి కాకపోవడం వల్ల కడుపులో అల్సర్లు వస్తాయి. ఇలా జీర్ణాశయంలో వచ్చే అల్సర్ని గ్యాస్ట్రిక్ అల్సర్ అంటారు. ఈ అల్సర్స్ను అధిగమించాలంటే... యోగా, ధ్యానం వంటి వాటి ద్వారా మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటం ఆహారంలో కారం, మసాలాలు తక్కువగా ఉండేలా జాగ్రత్తపడటం కాఫీ, టీలు పరిమితంగా తీసుకోవడం లేదా పూర్తిగా మానేయడం పొగతాగడం, మద్యం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం క్రమం తప్పకుండా రోజూ ఒకే సమయానికి ఆహారం తీసుకోవడం.(చదవండి: ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ విపత్తు ఆస్పత్రి!ఎక్కడంటే..) -
కిచెన్ని క్లీన్గా ఉంచడంలో టూత్పేస్ట్ ఎలా పనిచేస్తందో తెలుసా..!
టూత్పేస్ట్ దంతాలు శుభ్రంగా ఉంచుకోవడానికే కాదు. మన కిచెన్ని శుభ్రంగా ఉంచుకోవడంలో కూడా చాలా బాగా ఉపయోగపడతుంది. ముఖ్యంగా స్టీల్ సింక్లు, ట్యాప్లు, ఎంత ఘోరంగా ఉంటాయో తెలిసిందే. అలాంటి వాటిపై ఉండే మొండి మరకలను క్లీన్ చేయడంలో టూత్పేస్ట్ చాలా చక్కగా పనిచేస్తుంది. ఎలా ఈ టూత్ పేస్ట్ మన కిచెన్లో ఉన్న వస్తువులను క్లీన్గా ఉంచుతుందో సవివరంగా తెలుసుకుందాం.! మన ఇంట్లో వేస్ట్గా మిగిలిపోయిన పాత పేస్ట్లు వస్తువులను శుభ్రం చేయడంలో చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా నీటిలోని ఫ్లోరైడ్ కారణంగా కొన్ని రకాల స్టీల్ వస్తువులపై తెల్లటి మరకలు ఉండిపోతాయి. అవి ఓ పట్టాన పోవు. అలాంటి వాటిని వదలగొట్టడంలో టూత్పేస్ట్ అద్భతంగా పనిచేస్తుంది. అలాంటి వాటిని క్లీన్ చేయడంలో ఎలా సహకరిస్తుందంటే..స్టెయిన్లెస్ స్టీల్ సింక్లు..వంటగదిలోని సింక్ మిలమిల మెరుస్తు కాంతిగా ఉండాలంటే టూత్పేస్ట్ని ఉపయోగించటం మంచిది. దానిపై పడు గీతలు, ఒక విధమైన తెల్లటి మరకలను వదలగొట్టడంలో టూత్ పేస్ట్ భలే పనిచేస్తుంది. స్పాంజ్ సాయంతో కాస్త ప్రెజర్ ఉపయోగించి క్లీన్ చేస్తే సులభంగా మరకలు, గీతలు వదిలిపోతాయి. కుళాయిలు..నీటి కుళాయిలపై ఉండు మచ్చలు, మరకులతో కాస్త అసహ్యంగా కనిపిస్తుంటాయి. అలాంటి వాటిని టూత్పేస్ట్ని పూసి క్లాత్తో క్లీన్ చేస్తే చక్కగా మెరుస్తూ అందంగా ఉంటుంది. గ్లాస్ అండ్ సిరామిక్ స్టవ్లు..గ్లాస్ అండ్ సిరామిక్ స్టవ్ టాప్లపై మరకలు, వండిన పదార్థాల అవశేషాలను నీటిగా వదలించడంలో టూత్పేస్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. మగ్స్పై కాఫీ, టీ మరకలు..కొన్ని రకాల టీ కప్పుల్లో కాఫీ, టీ మరకలు ఓ పట్టాన వదలవు. అలాంటప్పడు టూత్పేస్ట్ని ఉపయోగిస్తే నీటిగా వదిలిపోతాయి. కటింగ్ బోర్డ్..కూరగాయలు కోసే కటింగ్ బోర్డ్లు వివిధ రకాల ఆహార పదార్థాల వాసనలతో, మరకలతో ఉంటాయి. వాటిని టూత్పేస్ట్తో శ్రభం చేస్తే చూడటానికి అందంగానే గాకుండా మంచి సువాసనతో ఉంటుంది. టూత్పేస్ట్ల్ ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, రాపిడి వాసనలను తొలగించి ఉపరితలాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది.(చదవండి: ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..) -
ఒంటెల్లాంటి చెట్లు! ఇవి కేవలం అక్కడ మాత్రమే..
మనం ఎన్నో రకాల చెట్లను చూసుంటాం. అందులో పొట్టివిగా, పొడవుగా ఏవైనా కావచ్చు. కానీ ఈ వింతరకమైనా చెట్లను ఎప్పుడైనా చూశారా! అచ్చం గజస్తంభాలను పోలిన విధంగా ఉన్నాయి. ఒంటె మెడలలాగా పొడవుగా, ఏనుడు ఆకారంలో భారీగా ఉన్నాయి. అవేంటో చూసేయండి!నిలువునా స్తంభాల్లా పెరిగే ఈ చెట్లను బేయబాబ్ చెట్లు అని అంటారు. ఇవి ఎక్కువగా మడగాస్కర్లోను, అరేబియన్ ద్వీపకల్పంలోను, ఆఫ్రికా ప్రధాన భూభాగంలోను, ఆస్ట్రేలియాలోను కనిపిస్తాయి. బేయబాబ్ చెట్లలో తొమ్మిది రకాలు ఉంటే, వాటిలో ఆరు రకాలు కేవలం మడగాస్కర్లో మాత్రమే కనిపిస్తాయి. మిగిలిన వాటిలో రెండు రకాలు అరేబియన్ ద్వీపకల్పంలోను, ఆఫ్రికా ప్రధాన భూభాగంలోను, మరో రకం ఆస్ట్రేలియాలోను కనిపిస్తాయి. వీటి ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. ఇవి నిట్ట నిలువుగా పెరుగుతాయి. కాండానికి చిట్టచివర మాత్రమే కొమ్మలు ఉంటాయి. ఈ చెట్లు ఒంటెల్లాంటివి. వీటి కాండం చుట్టుకొలత 23 అడుగుల నుంచి 36 అడుగుల వరకు ఉంటుంది.ఆకురాలే కాలంలో కూడా ఈ చెట్లు తమ కాండంలో లీటర్ల కొద్ది నీటిని నిల్వ ఉంచు కుంటాయి. ఈ చెట్లు వెయ్యేళ్ల నాటివని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ శతాబ్ది ప్రారంభంలో దక్షిణాఫ్రికాలో బేయబాబ్ చెట్లు పెద్ద సంఖ్యలో మరణించాయి. అయితే, అవి చీడపీడల వల్ల కాకుండా, నీటి కొరత కారణంగానే మరణించినట్లు శాస్త్రవేత్తలు తేల్చారు.ఇవి చదవండి: తన రంగును మార్చుకునే.. సరస్సును ఎప్పుడైనా చూశారా! -
ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..
బాలీవుడ్ దిగ్గజ లెజండరీ గాయని లతా మంగేష్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె తన మధురమైన గానంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె కేవలం గొప్ప గాయని మాత్రమే కాదు గొప్ప క్రికెట్ అభిమాని కూడా. భారతదేశం ప్రపంచ క్రికెట్లో సూపర్ పవర్గా లేని రోజల్లో అనూహ్యంగా టీమ్ ఇండియా ప్రపంచకప్ గెలుచుకుని అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు లోను చేసింది. ఆ ఘట్టం చరిత్రలో మర్చిపోని గొప్ప రోజు. అయితే ఆ రోజుల్లో బీసీసీఐ వద్ద సరిపడ నిధులు కూడా లేవు. ఇంతటి ఘన విజయం అందించిన ఆటగాళ్లుకు జీతాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంది. ఆ టైంలో మన క్రికెటర్లను సత్కరించేందుకు తన వంతుగా మద్దతు ఇస్తూ ఏం చేశారో తెలుసా..!జూన్ 25, 1983.. భారత క్రికెట్ చరిత్రలో ఆ రోజును ఎవరు మర్చిపోలేరు. ఇంగ్లండ్ గడ్డపై భారత్ నిలిచి అందరికి షాక్ ఇచ్చింది. ఆ రోజు చిరస్మరణీయమైనది, ప్రత్యేకమైనది. భారత్లో క్రికెట్ ఉన్నంత కాలం ఆ రోజుని ఎప్పటికీ మరిచిపోలేం. కపిల్ దేవ్(Kapil Dev) సారథ్యంలో టీమిండియా తొలి ప్రపంచకప్ గెలిచి ఇప్పటికీ 40 ఏళ్లు. జూన్ 25, 1983న లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో వరుసగా రెండుసార్లు ప్రపంచకప్(World Cup) సాధించి మంచి ఊపుమీద ఉన్న వెస్టిండీస్తో జరిగిన ఫైనల్లో భారత్ 43 పరుగుల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. అప్పటి నుంచే భారత క్రికెట్లో కొత్త శకం మొదలైంది. ఈ వన్డే ప్రపంచకప్ గెలవడానికి ముందు, టీమ్ ఇండియా 1975 మరియు 1979 ప్రపంచకప్లలో లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ టోర్నీల్లో భారత్ కేవలం రెండు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. ఆ రెండు టోర్నీల్లో వెస్టిండీస్(West Indies) ఛాంపియన్గా నిలిచింది. అయితే హ్యాట్రిక్ విజయంపై ఆశలు పెట్టుకున్న వెస్టిండీస్కు భారత్ గట్టి షాకిచ్చింది. నిజానికి భారత్ లీగ్లోనే స్వదేశానికి చేరుకుంటారనేది అందరి ఊహగానాలు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ..ఈ టోర్నీలో భారత్ చాంపియన్గా నిలిచి తొలి ట్రోఫీని తన ఖాతాలో వేసుకుని చరిత్ర సృష్టించింది. ఆ ఏడాది ప్రపంచకప్ టోర్నీకి ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చింది. చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్(World Cup Final) జరిగింది. తొలుత భారత జట్టు బ్యాటింగ్ చేసింది. కానీ ఆశించినంత స్థాయిలో స్కోర్ చేయలేదు. కేవలం 54.4 ఓవర్లలో 183 పరుగులు మాత్రమే చేసింది. వెస్టిండీస్కు ఈ లక్ష్యం పెద్దది కాదు. మంచి మంచి బ్యాటర్లు జట్టులో ఉన్నారు. అయితే బౌలర్లు మదన్ లాల్, మొహిందర్ అమర్నాథ్ ధాటికి విండీస్ 140 పరుగులకే ఆలౌటైంది. భారత్ 43 పరుగుల తేడాతో విజయం సాధించి తొలి ప్రపంచకప్ను ఎగరేసుకుపోయి సంబరాలు చేసుకుంది. ఈ ఘన విజయంతో భారత్లో యువత ఆసక్తి క్రికెట్ వైపు మళ్లింది. అభిమానుల సంఖ్య పెరిగింది. గల్లీ గల్లీలో క్రికెట్ ఆడేంతగా ఆ ఆటపైక్రేజ్ పెరిగిపోయింది. అయితే అప్పట్లో బీసీసీ వద్ద నిధులు లేవు. కనీసం భారత్కి ఇంత ఘన కీర్తిని తెచ్చిపెట్టిన ఆటగాళ్లను సత్కరించేందుకు కూడా బీసీసీఐ వద్ద డబ్బులు లేవు. ఆ సమయంలో బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్కేపీ సాల్వే, క్రికెట్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్న రాజ్సింగ్ దుంగార్పూర్లు లతా మంగేష్కర్ను సంప్రదించి ఈ విషయాన్ని చెప్పారు. అందుకు మద్దుతు ఇవ్వడంతో దేశ రాజధానిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో లతా మంగేష్కర్ కచేరిని ఏర్పాటు చేసి ఫండింగ్ని కలెక్ట్ చేశారు. ఈ కచేరీ ద్వారా అప్పట్లో దాదాపు రూ. 20 లక్షలు దాక నిధులను బీసీసీఐ సేకరించింది. జీవితకాల పాస్..ఆ మొత్తం నుంచి 14 మంది ఆటగాళ్లకు వారి అత్యుత్తమ ప్రదర్శనకు గానూ ప్రోత్సాహకంగా రూ. 1 లక్ష చొప్పున అందించారు. ఇక సంగీత కచేరి కోసం లతా మంగేష్కర్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆ సమయంలో తమకు సహాయం చేసిన లతా మంగేష్కర్కు బీసీసీఐ పెద్ద గిఫ్ట్ ఇచ్చింది. ప్రపంచంలో ఎక్కడైనా భారత క్రికెట్ జట్టు మ్యాచ్ జరుగుతున్నా.. లతా మంగేష్కర్ చూసేందుకు ఉచిత పాస్ అందించారు. అంటే జీవితకాల పాస్ అన్నమాట. ఆమె జీవితకాలం ప్రపంచంలో ఎక్కడ మ్యాచ్ జరిగినా ఆమె ఉచితంగా చూడొచ్చు. కానీ ఆమె ఎప్పుడూ ఆ పాస్ ఉపయోగించలేదు. కానీ బీసీసీఐ మాత్రం ఆమె సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. లతా మంగేష్కర్ గౌరవ సూచకంగా భారతదేశంలో ఆడే ప్రతి అంతర్జాతీయ మ్యాచ్కు బోర్డ్ ఎప్పుడూ రెండూ టికెట్లను లతా మంగేష్కర్ కోసం రిజర్వు చేసింది. ముఖ్యంగా ప్రపంచ కప్ గెలిచిన కపిల్ దేవ్ బృందం కోసం లతా మంగేష్కర్ సోదరుడు పండిట్ హృద్యనాథ్ ప్రత్యకంగా ఓ పాటే రాయడం విశేషం.ఇలాంటి వాళ్లు తమ కళతోనే గొప్పగొప్ప సేవకార్యక్రమాలు చేసి చరిత్రలో నిలిచిపోవడమే గాక భావితరాలకు గొప్ప స్ఫూర్తిగా ఉంటారు.(చదవండి: యూఎస్ జడ్జిగా తొలి తెలుగు మహిళ! వైరల్గా ప్రమాణ స్వీకారం..!) -
తన రంగును మార్చుకునే.. సరస్సును ఎప్పుడైనా చూశారా!
ప్రకృతి అద్భుతాల్లో ఒకటి.. మహర్లూ సరస్సు. దక్షిణ ఇరాన్ లోని షిరాజ్ నగరానికి సమీపంలో దాదాపు 600 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉందీ ఉప్పు నీటి సరస్సు. ఓ పక్క తెలుపు, మరో పక్క లేత గులాబీ రంగుతో.. సందర్శకుల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఎత్తైన ప్రాంతంలో కొలువుదీరిన ఈ కొలను కాలానుగుణంగా తన రంగును మార్చుకుంటుంది.షిరాజ్కు ఆగ్నేయంగా 27.0 కిమీల (16.8 మైళ్ళు) వరకూ ప్రవహిస్తుంది. సాధారణంగా వేసవి చివరి నాటికి ఆవిరైపోతుంది. ఆ సమయంలోనే ఇది పింక్ కలర్లోకి మారి.. ప్రకృతి ప్రియుల్ని ఆకర్షిస్తుంది. సూక్ష్మజీవుల కారణంగా ఇది పింక్ కలర్లోకి మారుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. నీటి మట్టం మరింత తగ్గగానే ముదురు గులాబీ రంగులోకి మారుతుంది. ఇందులో పేరుకున్న ఉప్పే.. ఈ సరస్సు మధ్యలో లేదా తీరంలో నిలబడటానికి.. దిమ్మలా, ఒడ్డులా మారుతుంది.ఇలాంటి పింక్ సరస్సులు ప్రపంచవ్యాప్తంగా మరిన్ని ఉన్నాయి. రష్యాలోని ఆల్టై పర్వత ప్రాంతంలో ఉన్న సైబీరియన్ పింక్ లేక్ కూడా గతంలో వైరల్ అయ్యింది. ఆ సరస్సు మధ్యలోంచి రైలు పట్టాలు వేయడంతో సందర్శకులను అది మరింత ఆకట్టుకుంటోంది. ‘ఆర్టెమియా సాలినా’ అనే ఉప్పు నీటి రొయ్యల జాతి కారణంగానే ఆగస్ట్ సమయంలో.. సైబీరియన్ సరస్సుకి గులాబీ రంగు వస్తుందని నిపుణులు తేల్చారు.ఇవి చదవండి: అవును.. అది నిజంగా మృత్యుగుహే! -
ఈ కొత్తరకం స్నాక్స్ వంటకాలు.. ట్రై చేయండిలా..!
ఈ కొత్తరకం స్నాక్స్ వంటకాలను గురించి మీరెప్పుడైనా విన్నారా! ఆమ్లెట్ వేయడంలో కొత్తదనం.., బాదం క్రిస్పీ చికెన్ మరెంతో స్పెషల్.., సోయా అంజీరా హల్వాలు నోరూరించే విధంగా ఉన్నాయంటే ఒక్కసారి వంట వార్పు చేయాల్సిందే!కోకోనట్ ఆమ్లెట్..కావలసినవి..గుడ్లు – 5కొబ్బరి కోరు – పావు కప్పుఉల్లిపాయ ముక్కలు – 2 టీ స్పూన్లు (చాలా చిన్నగా తరిగి, దోరగా వేయించి పెట్టుకోవాలి)పచ్చిమిర్చి ముక్కలు – కొద్దిగా (చాలా చిన్నగా తరిగి, దోరగా వేయించి పెట్టుకోవాలి)కొత్తిమీర తురుము– కొద్దిగా (అభిరుచిని బట్టి)హెవీ క్రీమ్ – అర టేబుల్ స్పూన్ (మార్కెట్లో లభిస్తుంది)పంచదార – 2 లేదా 3 టీ స్పూన్లుబటర్ – 2 టేబుల్ స్పూన్లు (కరిగింది, నూనె కూడా వాడుకోవచ్చు)ఉప్పు – కొద్దిగాతయారీ..– ముందుగా ఒక బౌల్లో వేయించిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు.. కొత్తిమీర తురుము, కొబ్బరి తురుము, పంచదార, హెవీ క్రీమ్ వేసుకుని.. అందులో గుడ్లు పగలగొట్టి.. కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.– అనంతరం పాన్ లో బటర్ లేదా నూనె వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుని.. ఈ ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్లా పరచి.. చిన్న మంట మీద ఉడకనివ్వాలి.– ఇరువైపులా ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. అభిరుచిని బట్టి ఈ మిశ్రమంతో మొత్తం ఒకే అట్టులా కాకుండా.. రెండు లేదా మూడు చిన్నచిన్న ఆమ్లెట్స్లా వేసుకోవచ్చు. వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే భలే రుచిగా ఉంటుంది ఈ ఆమ్లెట్.బాదం క్రిస్పీ చికెన్..కావలసినవి..బోన్ లెస్ చికెన్ – 3 లేదా 4 పీసులు (పలుచగా, పెద్దగా కట్ చేసిన ముక్కలు తీసుకోవాలి)మొక్కజొన్న పిండి – 6 టేబుల్ స్పూన్లుగోధుమ పిండి – 1 టేబుల్ స్పూన్బాదం – అర కప్పు (దోరగా వేయించి.. బ్రెడ్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి)ఎండుమిర్చి – 2 (కచ్చాబిచ్చాగా పొడి చేసుకోవాలి)గుడ్లు – 2, బాదం పాలు – 3 టీ స్పూన్లుమిరియాల పొడి – కొద్దిగాఉప్పు – తగినంతనూనె – సరిపడాతయారీ..– ముందుగా ఒక బౌల్లో మొక్క జొన్న పిండి, గోధుమ పిండి, మిరియాల పొడి, ఎండు మిర్చి పొడి, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.– మరో బౌల్లో గుడ్లు పగలగొట్టి.. బాగా గిలకొట్టి.. అందులో బాదం పాలు పోసి కలిపి పెట్టుకోవాలి. ఇంకో బౌల్ తీసుకుని.. అందులో బాదం పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో చికెన్ ముక్కను తీసుకుని.. దానికి మొక్కజొన్న పిండి మిశ్రమాన్ని బాగా పట్టించాలి.– అనంతరం దాన్ని గుడ్డు–బాదం పాల మిశ్రమంలో ముంచి, వెంటనే బాదం పొడి పట్టించి.. నూనెలో దోరగా వేయించి.. సర్వ్ చేసుకోవాలి.సోయా అంజీరా హల్వా..కావలసినవి..డ్రై అంజీరా – 20 లేదా 25 (15 నిమిషాలు నానబెట్టుకోవాలి)కిస్మిస్ – 15 (నానబెట్టి పెట్టుకోవాలి)సోయా పాలు – అర కప్పుఫుడ్ కలర్ – కొద్దిగా (అభిరుచిని బట్టి)జీడిపప్పు, బాదం, పిస్తా – కొద్దికొద్దిగా (నేతిలో దోరగా వేయించి.. చల్లారాక కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి)నెయ్యి, పంచదార – సరిపడాగసగసాలు లేదా నువ్వులు – కొద్దిగా గార్నిష్కితయారీ..– ముందుగా అంజీరా, కిస్మిస్ రెండూ కలిపి.. మెత్తటి పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోవాలి.– ఈలోపు కళాయిలో 5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకుని అందులో.. అంజీరా మిశ్రమాన్ని వేసుకుని చిన్న మంట మీద గరిటెతో తిప్పుతూ ఉండాలి.– దగ్గర పడుతున్న సమయంలో సోయా పాలు, జీడిపప్పు, బాదం, పిస్తా ముక్కలు వేసుకుని మళ్లీ దగ్గరపడే వరకు చిన్న మంట మీద.. మధ్య మధ్యలో తిప్పుతూ ఉడికించాలి.– అనంతరం సరిపడా పంచదార, ఫుడ్ కలర్ వేసుకుని.. బాగా తిప్పాలి. టేస్ట్ చూసుకుని పంచదార, నెయ్యి అభిరుచిని బట్టి ఇంకొంచెం కలుపుకోవచ్చు.– కాస్త దగ్గర పడుతున్న సమయంలో స్టవ్ ఆఫ్ చేసి.. కాసేపు అలానే గాలికి వదిలిపెట్టాలి.– దగ్గరపడి, చల్లారాక చేతులకు నెయ్యి రాసుకుని.. మొత్తం మిశ్రమాన్ని రోల్స్లా చుట్టుకుని.. గసగసాల్లో లేదా వేయించిన నువ్వుల్లో దొర్లించాలి. అనంతరం నచ్చినవిధంగా కట్ చేసుకోవాలి.ఇవి చదవండి: ఈ మినీ మెషిన్తో.. స్కిన్ సమస్యలకు చెక్! -
ఈ మినీ మెషిన్తో.. స్కిన్ సమస్యలకు చెక్!
వయసు పెరిగే కొద్ది కళ్ల చుట్టూ ముడతలు, పెదవుల చుట్టూ గీతలు పడటం సర్వసాధారణం. అయితే దాన్ని.. చిత్రంలోని ఈ మైక్రోకరెంట్ లైన్ స్మూతింగ్ ఇన్స్టంట్ ప్లంపర్ డివైస్తో తగ్గించుకోవచ్చు. ఈ మినీ మెషిన్.. ఆ సమస్యను కేవలం వారం రోజుల్లోనే పరిష్కరించేస్తుంది.ఈ మినీ మెషిన్ తో ట్రీట్మెంట్ తీసుకుంటే.. కళ్లు కాంతిమంతమవుతాయి. పెదవులు ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఈ డివైజ్కి ఒకవైపు రెండు చిన్న చిన్న బాల్స్ లాంటి మసాజర్ హెడ్స్ ఉంటాయి. వాటిని చర్మానికి ఆనించి మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టూల్కి మధ్యలో చిన్న రోలర్ బాటిల్ ఉంటుంది. అందులో సీరమ్ ఉంటుంది.మసాజ్ చేసుకునేముందు ఆయా ప్రదేశాల్లో ఆ సీరమ్ని అప్లై చేసుకుని ట్రీట్మెంట్ తీసుకోవాలి. సీరమ్ రోలర్ని డివైస్ నుంచి బయటికి తీసుకోవచ్చు.. తిరిగి అక్కడే అటాచ్ చేసుకోవచ్చు. ఈ సీరమ్ .. యాంటీ ఆక్సిడెంట్ కెఫిన్, క్రాన్ బెర్రీ ఎక్స్ట్రాక్ట్, రోజ్ వాటర్, ఫర్మింగ్ నియాసినామైడ్, విటమిన్ బి5 వంటి 95% సహజ పదార్థాలతో తయారైంది.ఈ మెషిన్ తో సుమారు ఏడు రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే.. కళ్లు, పెదవుల చుట్టూ ఉన్న ముడతలు, గీతలు పోయి సహజమైన అందం సొంతమవుతుంది. ఈ డివైస్కి చార్జింగ్ పెట్టుకుని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ మసాజర్లో 5 లెవల్స్తో కూడిన ఆప్షన్్స ఉంటాయి. దాంతో అవసరాన్ని బట్టి పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. ధర 186 డాలర్లు. అంటే 15,530 రూపాయలన్నమాట.ఇవి చదవండి: ఇవి మార్జాల పుష్పాలనుకుంటున్నారా! -
Children's Story: సహన రెండవ తరగతి చదువుతోంది.. ఒకరోజూ..!
సహన రెండవ తరగతి చదువుతోంది. ఆమె అన్నింటికీ తొందరపడుతుంది. ఏదయినా సరే తను అడిగిన వెంటనే నిమిషాల్లో జరిగిపోవాలి. లేదంటే గొడవ చేసి అమ్మ నాన్నలను విసిగిస్తుంది.‘అమ్మా! నా జడకు రబ్బర్ బ్యాండ్ వదులుగా ఉంది, సరిగ్గా పెట్టు’ వంట చేస్తున్న మానస దగ్గరకు వచ్చి అంది సహన. ‘పప్పు తాలింపు పెడుతున్నాను, ఐదు నిమిషాలు ఆగు’ అంది మానస. ‘అమ్మా! ప్లీజ్ అమ్మా, రామ్మా’ అంటూ నస పెట్టింది అమ్మాయి. దాంతో చేసే పని ఆపి సహన జడకి రబ్బర్ బ్యాండ్ సరిగ్గా పెట్టింది మానస.‘డాడీ! నాకు సాయంత్రం రంగు పెన్సిళ్లు తీసుకురండి’ ఆఫీసుకు వెళ్తున్న తండ్రితో చెప్పింది సహన.‘సరే అలాగే‘ అంటూ వెళ్ళిన ఆయన సాయంత్రం రంగు పెన్సిళ్లు మరచిపోయి వచ్చారు. అందుకు సహన మొండి పేచీ పెట్టింది. ఆ పేచీ భరించలేక ఆయన మళ్ళీ బజారుకి వెళ్ళి తీసుకువచ్చారు. ‘సహనా! నీకసలు ఓపిక లేదు. ఏదైనా అడిగిన వెంటనే దొరకదు. సమయం పడుతుంది. దానికోసం ఓర్పుగా ఎదురు చూడాలి. ఇలా తొందరపడితే.. తొందరపెడితే ముందు ముందు చాలా కష్టపడాల్సి వస్తుంది’ బాధపడుతూ కూతురితో అన్నారాయన. ఆ మాటలను సహన పెద్దగా పట్టించుకోలేదు.ఒకరోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తూనే అమ్మతో ‘స్కూల్ యాన్యువల్ డేకి నన్నో గ్రూప్ డాన్స్కి సెలెక్ట్ చేశారు టీచర్. గ్రూప్ డాన్స్ కాదు సోలో డాన్స్ చేస్తానని చెప్పాను’ అంది సహన.‘మంచిదే.. కానీ గ్రూప్ డాన్స్ అంటే నువ్వెలా చేసినా అందరిలో కలసిపోతుంది. సోలో డాన్స్ అయితే చాలా శ్రద్ధపెట్టి నేర్చుకోవాలి! ఒక్కసారి ప్రాక్టీస్కే నాకంతా వచ్చేసిందని తొందరపడితే కుదరదు. రోజూ ఇంటి దగ్గర కూడా సాధన చేయాలి మరి!’ అంది మానస. ‘అలాగేలే అమ్మా’ అంటూ తల ఊపింది సహన నిర్లక్ష్యంగా! యాన్యువల్ డే కోసం స్కూల్లో డాన్స్ నేర్పించడం మొదలైంది. కానీ సహన ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయట్లేదు. అది గమనించి కూతురితో అన్నది మానస ‘ఇంటి దగ్గర నువ్వు సరిగా ప్రాక్టీస్ చేయడం లేదు. అలా అయితే స్టేజీ మీద బాగా చేయలేవు’ అని! ‘స్కూల్లోనే బాగా చేస్తున్నానమ్మా! అది చాల్లే’ అని జవాబిచ్చింది సహన ఎప్పటిలాగే నిర్లక్ష్యంగా. ఇంక చెప్పినా వినేరకం కాదని వదిలేసింది మానస.సహన వాళ్ల స్కూల్ వార్షిక దినం రానే వచ్చింది. సాంస్కృతిక కార్యక్రమాలు మొదలయ్యాయి. సహన వంతు వచ్చింది. పాట మొదలైంది. దానికి తగ్గ స్టెప్స్.. హావభావాలతో డాన్స్ చేయసాగింది సహన. అయితే హఠాత్తుగా తను వేయాల్సిన స్టెప్స్ని మరచిపోయి వేసిన స్టెప్స్నే మళ్లీ మళ్లీ వేయసాగింది. ‘అలా కాదు సహనా.. ఇలా చేయాలి’ అంటూ స్టేజీ పక్క నుంచి వాళ్ల డాన్స్ టీచర్ చిన్నగా హెచ్చరిస్తూ చేతులతో ఆ స్టెప్స్ని చూపించసాగింది. అర్థం చేసుకోలేక అయోమయానికి గురైంది సహన. దాంతో డాన్స్ ఆపేసి.. బిక్కమొహం వేసి నిలబడిపోయింది.స్టేజీ మీదకు వెళ్లి ఆమెను కిందకు తీసుకొచ్చేసింది టీచర్. ప్రేక్షకుల్లో ఉన్న మానస లేచి.. గబగబా సహన దగ్గరకు వెళ్లింది. కూతురిని హత్తుకుంది. దానితో అప్పటివరకు ఉన్న భయం పోయి తల్లిని గట్టిగా వాటేసుకుంది. ‘అమ్మా! నేను డా¯Œ ్స మధ్యలో స్టెప్స్ మరచిపోయాను’ వస్తున్న దుఃఖాన్ని దిగమింగుతూ చెప్పింది సహన. ‘నీకు చాలాసార్లు చెప్పాను.. ఏదైనా పూర్తిగా నేర్చుకోనిదే రాదని! కొంచెం రాగానే అంతా వచ్చేసిందనుకుంటావు. ఇప్పుడు చూడు ఏమైందో! సాధన చేయకపోవడం వల్ల ఆందోళన పడ్డావు. అదే చక్కగా ప్రాక్టీస్ చేసుంటే ఈ కంగారు ఉండేది కాదు కదా! తొందరపాటు వల్ల ఇలాంటివి జరుగుతాయనే ఓర్పుగా ఉండాలని చెప్పేది’ అంది మానస.అమ్మ మాటలనే వింటూ ఉండిపోయింది సహన. ‘చదువులోనూ అంతే! జవాబులో కొంత భాగం రాగానే వచ్చేసిందంటావు. ముక్కున పట్టి అప్పచెప్పి ఇక చదవడం ఆపేస్తావు. ముక్కున పట్టింది ఎంతసేపో గుర్తుండదు. అందుకే పరీక్షల్లో సరిగ్గా రాయలేక మార్కులు తెచ్చుకోలేకపోతున్నావు. అప్పటికప్పుడు ఏదీ వచ్చేయదు. నిదానంగా ఏ రోజు పాఠాలు ఆ రోజు చదివి అర్థం చేసుకోవాలి’ చెప్పింది మానస.అలా అంతకుముందు అమ్మ ఎన్నిసార్లు చెప్పినా సహనకు అర్థం కాలేదు. కానీ ఈసారి బాగా అర్థమయింది. తన పొరబాటును గ్రహించింది. ‘అమ్మా.. ఇప్పటి నుంచి తొందరపడను. నిదానంగా ఆలోచిస్తాను. దేన్నయినా పూర్తిగా నేర్చుకుంటాను’ అన్నది సహన .. అమ్మను చుట్టేసు కుంటూ! ‘మా మంచి సహన.. ఇక నుంచి పేరును సార్థకం చేసుకుంటుంది’ అంటూ.. కూతురు తల నిమిరింది మానస. – కైకాల వెంకట సుమలతఇవి చదవండి: మిస్టరీ.. 'ఆ వస్తువుల్ని ఎవరైనా తీసుకెళ్తే.. ఎందుకలా జరుగుతుంది'? -
ప్రపంచంలోనే తొలి పోర్టబుల్ విపత్తు ఆస్పత్రి!ఎక్కడంటే..
ఆస్పత్రిని అప్పటికప్పుడూ సెట్ వేసినట్లుగా సెటప్ చేసే పోర్టబుల్ ఆస్పత్రి గురించి విన్నారా. పైగా ఈ ఆస్పత్రి సాయంతో దాదాపు 200 మంది రోగులకి ఒకేసారి వైద్యం అందించొచ్చట కూడా. ఇంతకీ ఏ దేశం ఈ ఆస్పత్రి మోడల్ని తీసుకొచ్చిందంటే..భారతదేశం ప్రపంచంలోనే తొలి విపత్తు ఆస్పత్రిని ప్రవేశపెట్టింది. దీనిని ఎయిర్లిఫ్ట్ చేసి సుమారు 72 క్యూబ్లు ప్యాక్ చేయవచ్చు. ఈ ప్రాజెక్ట్ను 'ఆరోగ్య మైఔత్రి క్యూబ్' అని పిలుస్తారు. భీష్మ(భారత హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హితా అండ్ మైత్రి ప్రాజెక్ట్)లో భాగంగా ఈ సరికొత్త ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు. ఈ క్యూబ్లలో ఆపరేషన్ థియేటర్, మినీ ఐసీయలు, వెంటిలేటర్లు, రక్త పరీక్షపరికరాలు, ఎక్స్రే యంత్రం, వంట స్టేషన్, ఆహారం, నీరు, షెల్టర్ పవర్ జనరేటర్ వంటి అవసరమైన పరికరాలు, సామాగ్రి అందుబాటులో ఉంటాయి. అలాగే ప్రత్యేక కేజ్లో దాదాపు వందమంది రెండు రోజుల పాటు జీవించేందుకు అవసరమైన సామాగ్రితో నింపిన 36 మినీ క్యూబ్లను చూడవచ్చు. వీటిలో రెండు మెయిన్ కేజ్లు ఉంటాయి.వాటిని మాస్టర్ క్యూబ్స్ అని పిలుస్తారు. వీటిల్లో దాదాపు 200 మంది ప్రాణాలను రక్షిచవచ్చు. ఈ మినీ ఫోర్టబుల్ ఆస్పత్రి 40 బుల్లెట్ గాయాలు, 25 పెద్ద రక్తస్రావం, 25 పెద్ద కాలిన గాయాలు, సుమారు 10 హెడ్ ఇంజూరీస్, వెన్నెముక గాయాలు, ఛాతీ గాయాలు, వెన్నుముకకి అయ్యే పగళ్లు గాయాలు వంటి వివిధ రకాల తీవ్రమైన గాయాలను నిర్వహించగల సామర్థ్యం గలది. గతేడాది ప్రధాని నరేంద్ర మోదీ ప్రాజెక్ట్ బీష్మలో భాగంగా ఈ ఆరోగ్య మైత్రి క్యూబ్ని ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత రక్షణ మంత్రిత్వ శాఖ టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది. నిజానికి ఈ ఆరోగ్య మైత్రి ప్రాజెక్ట్ని గత జనవరిలో జరిగిన గ్లోబల్ సదస్సులో ప్రకృతి వైపరీత్యాలు లేదా మానవతా సంక్షోభాల వల్ల ప్రభావితమైన అభివృద్ధి చెందుతున్న దేశాలకు అవసరమైన వైద్య సామాగ్రిని అందించే లక్ష్యంతో ప్రవేశపెట్టారు.ఆగస్టులో గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిన మెడ్టెక్ ఎక్స్పోలో జరిగిన జీ20 ఆరోగ్య మంత్రుల సమావేశంలో ఈ ప్రాజెక్టు అధికారిక ప్రారంభం జరిగింది. అంతేగాదు ఈ ప్రాజెక్టును మొదటగా మయన్మార్ అధికారులకు చూపించారు. ఇక ప్రధాని మోదీ వ్యక్తిగతంగా ఆరోగ్య, రక్షణ మంత్రిత్వ శాఖలకు ఈ ఆలోచనను అందించారు. ఆయన సూచనల కారణంగా ఆయుర్వేద ఉత్పత్తులకు క్యూబ్స్లోని వస్తువులు జాబితాలో జోడించామని అధికారులు తెలిపారు. భారతదేశం మయన్మార్కు రెండు ఆరోగ్య మైత్రి క్యూబ్లను విరాళంగా అందించింది ఒక శ్రీలంకకు కూడా ఒకటి విరాళంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.(చదవండి: మిట్టీకూల్’: మట్టితో ఫ్రిడ్జ్!..కరెంట్తో పనిలేదు..!) -
మిస్టరీ.. 'ఆ వస్తువుల్ని ఎవరైనా తీసుకెళ్తే.. ఎందుకలా జరుగుతుంది'?
తూర్పు సీయరా నెవడా, కాలిఫోర్నియాలో ‘బాడీ’ అనే ఘోస్ట్ టౌన్ ని ప్రతి ఏడాది కొన్ని లక్షల మంది సందర్శిస్తుంటారు. 7,395 అడుగుల (2,254 మీటర్లు) ఎత్తైన కొండపై ఉన్న ఈ చారిత్రక నగరం.. ఎన్నో మిస్టీరియస్ కథనాలతో నేటికీ ప్రపంచాన్ని వణికిస్తోంది. అక్కడి అందాలను కళ్లతో ఆస్వాదించాలే తప్ప కంటికి ఇంపైన వస్తువును ‘బాగుంది కదా’ అని తీసుకుని బ్యాగ్లో వేసుకున్నామో బొందితో కైలాసం ఖాయం. ఆ క్షణం నుంచే.. అక్కడున్న అతీంద్రయశక్తుల వేట మొదలవుతుందట.1859లో.. గి బోడే అనే వ్యక్తి.. తన స్నేహితులతో కలసి.. సీయరా పర్వతాలకు తూర్పువైపు వెళ్లినప్పుడు.. మొదటిసారి ఈ ప్రాంతాన్ని కనుగొన్నాడట. అక్కడ బంగారు గని ఉందని గుర్తించిన ఆ స్నేహితులంతా.. ఎవరికీ తెలియకుండా ఆ స్థలాన్ని కొంతకాలం రహస్యంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్లే తిరిగి తమతమ స్వస్థలాలకు బయలుదేరారు.అయితే బోడే తన స్వస్థలమైన మోనోవిల్కు వెళ్తుంటే.. దారిలో మంచు తుఫానులో చిక్కి మరణించాడు. దాంతో అతడి స్నేహితులంతా ఆ బంగారు గనులున్న ప్రాంతానికి బోడే అని పేరు పెట్టారు. అయితే బోర్డ్ మీద పేరు రాసే వ్యక్తి.. బోడేకి బదులుగా బాడీ అని రాయడంతో అదే పేరు స్థిరపడిపోయింది. కాలక్రమేణా ఆ గని గురించి తెలుసుకున్నవారి సంఖ్య పెరగడంతో.. 1876 నాటికి.. అక్కడ భారీ స్థాయిలో బంగారం తవ్వకాలు మొదలయ్యాయి. మైనింగ్ కంపెనీలు, హైడ్రో–ఎలక్ట్రికల్ కేంద్రాలతో ఆ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందసాగింది.తదనుగుణంగా అక్కడ స్థిరపడేవారి సంఖ్య కూడా పెరగసాగింది. సుమారు 10 వేల మంది నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇతరప్రాంతాల నుంచీ రాకపోకలు పెరగడంతో రైల్వే మార్గం కూడా ఏర్పడింది. 1880 నాటికి, బాడీలో ఎన్నో వ్యాపారాలు వెలశాయి. అక్కడి ‘చైనా టౌన్’ అనే ఓ పెద్ద భవనంలో మొత్తం చైనీయులే ఉండేవారట. తమ దేశానికి చెందిన వస్తువుల్ని అక్కడి స్థానికులకు అమ్మేవారట. అయితే బాడీ టౌన్ మొత్తంలో క్రైమ్రేట్ విపరీతంగా ఉండేదట. హత్యలు, జూదం, వ్యభిచారం, దోపిడీలు, తుపాకీ కాల్పులు ఇలా వీధికో అఘాయిత్యం నమోదయ్యేదట.1882 ప్రాంతంలో బతుకు తెరువు కోసం ఓ కుటుంబం బాడీకి వెళ్లాల్సి వచ్చిందట, దాంతో ఆ ఇంటి చిన్నారి ‘‘వీడ్కోలు దేవా.. మేము బాడీకి వెళ్తున్నాం’’ అని ఏడుస్తూ గట్టిగా ప్రార్థించిందట. దాన్ని బట్టి అర్థంచేసుకోవచ్చు బాడీలో ఎలాంటి భయానక వాతావరణం ఉండేదో? అక్కడికి వెళ్తే తిరిగి ప్రాణాలతో వస్తామన్న నమ్మకం ఎవరికీ ఉండేదికాదట.అన్యాయాలు, అహింసలతో కొందరు చనిపోతే.. తీవ్రమైన మంచు కారణంగా మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ఇంకొందరేమో మైనింగ్ ప్రమాదాల్లో అసువులుబాశారు. ఇదిలా ఉంటే.. 1892లో ఘోరమైన అగ్నిప్రమాదం సంభవించి తీవ్రమైన ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టమూ వాటిల్లింది. గనులు ఖాళీ కావడంతో.. 1917 నాటికి రైల్వే మార్గాన్ని కూడా నిలిపివేశారు. 1932లో మరొక భారీ పెద్ద అగ్నిప్రమాదం జరిగేసరికి.. పట్టణమంతా ఖాళీ అయ్యింది. అలా ప్రకృతితో మమేకమైన బాడీ.. ఇప్పుడు మాత్రం ఎన్నో వ్యథలను వినిపిస్తోంది.బాడీ పట్టణాన్ని చూడటానికి రెండు కళ్లూ చాలవంటారు పర్యాటకులు. కొండ కోనల్లో, విశాలమైన గడ్డి మైదానాల్లో .. చెల్లాచెదురుగా పడున్న వాహనాలు.. నాటి కట్టడాలు, గుర్రపు బండ్లు వంటివన్నీ చిత్రకారుడు గీసిన పెయింటింగ్లా ఆకట్టుకుంటాయి. ఇక్కడ మొత్తం 168 భవనాలు నేటికీ చెక్కుచెదరకుండా దర్శనమిస్తాయి. సమీపంలోని శ్మశానవాటికలో 150 మంది ఖననాలు కనిపిస్తాయి. అయితే.. బాడీ టౌన్ లో పగటి పూట కూడా విచిత్రమైన అలికిడులు భయపెడతాయట.ఆ పురాతన ఇళ్లల్లో నిద్ర చేయడానికి సాహసించిన ఎందరో పర్యాటకులు అక్కడి అతీంద్రియశక్తులేవో తమకు ఊపిరి ఆడకుండా చేశాయని, కనిపించని రూపాలేవో వణికించాయని తమకెదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. మరోవైపు ‘ఒ కెయిన్ హౌస్’ అనే ఇంట్లో ఒక చైనా మహిళ.. దయ్యంగా తిరుగుతుందని స్థానికుల నమ్మకం. అలాగే శ్మశానవాటికలో ‘ఎవెలిన్’ అనే మూడేళ్ల పాప ముసిముసి నవ్వులు వినిపిస్తాయనీ చెబుతుంటారు. ఎవెలిన్ మరణ వివరాలు 1897 రికార్డ్స్లో ఉన్నాయి.ఇక్కడికి వచ్చిన ఎందరో పర్యాటకులు ఇక్కడ దొరికిన సీసాలను, చిన్న చిన్న బొమ్మలను తమ వెంట తీసుకెళ్లి ప్రమాదాలను కొనితెచ్చున్నారట. తీసుకెళ్లిన ప్రతి వస్తువు ఒక లేఖతో పాటు బాడీకి తిరిగి రావడమే ట్విస్ట్. ‘‘ఈ వస్తువును దొంగిలించినందుకు లేదా తీసుకున్నందుకు మమ్మల్ని క్షమించండి’ అని రాసిన ఎన్నో అజ్ఞాత లేఖల్లో.. బాడీలోని వస్తువుల్ని వెంట తీసుకుని వెళ్లడం వల్ల వాళ్లు ఎదుర్కొన్న సమస్యలను రాశారా బాధితులు.కారు ప్రమాదాలు జరగడం, ఉద్యోగాలు కోల్పోవడం, తీవ్ర అనారోగ్యానికి గురికావడం ఇలా ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడి.. తిరిగి ఆ వస్తువుల్ని బాడీకి పంపించేశారట. అందుకే తెలిసినవారు ఎవ్వరూ ఇక్కడి వస్తువుల్ని బ్యాగ్లో వేసుకోరు. ఏది ఏమైనా ఇక్కడ ఉన్న అతీంద్రియశక్తులు ఏంటీ? ఇక్కడి వస్తువుల్ని ఎవరైనా తీసుకెళ్తే ఎందుకు వారిని వెంటాడుతున్నాయి? అనేది నేటికీ మిస్టరీయే! – సంహిత నిమ్మనఇవి చదవండి: Short Story: ఒకనాడు ఆ రాక్షసుడు నర్మదా తీరంలో.. -
Short Story: ఒకనాడు ఆ రాక్షసుడు నర్మదా తీరంలో..
ఒకానొకప్పుడు సౌరాష్ట్రంలో ఒక క్షత్రియుడు ఉండేవాడు. బతికినంత కాలం ప్రజలను పీడించుకు తిన్నాడు. నిస్సహాయులైన ప్రజలు అతడిని నేరుగా ఏమీ అనలేక లోలోపలే అతడిని తిట్టుకునేవారు. అతడి ప్రస్తావన వస్తేనే చాలు, చీత్కరించుకునేవారు. జన్మలో ఎలాంటి పుణ్యకార్యం చేయని ఆ క్షత్రియుడు కాలం తీరి మరణించాడు. పూర్వజన్మ పాపకర్మల ఫలితంగా బ్రహ్మరాక్షసుడిగా జన్మించాడు.నర్మదానది పరిసరాల్లోని అడవుల్లో దొరికిన జీవిని దొరికినట్లే తింటూ తిరుగుతుండేవాడు. పొరపాటున ఆ అడవిలోకి మనుషులు ఎవరైనా అడుగుపెడితే వారిని కూడా తినేస్తూ నరమాంస భక్షకుడిగా మారాడు. బ్రహ్మరాక్షసుడి ధాటికి భయపడి మనుషులు ఆ అడవిలోకి అడుగుపెట్టడమే మానుకున్నారు. ఒకనాడు ఆ రాక్షసుడు నర్మదా తీరంలో తపస్సు చేసుకుంటున్న మునీశ్వరుడి ఆశ్రమానికి వచ్చాడు. నరమాంసం తిని చాలారోజులు కావడంతో ఆ బ్రహ్మరాక్షసుడు మునీశ్వరుడిని ఎలాగైనా తినేయాలని అనుకున్నాడు. అయితే, మంత్ర యోగ విద్యల్లో ఆరితేరిన ఆ మునీశ్వరుడు సామాన్యుడు కాదు. బ్రహ్మరాక్షసుడి ప్రయత్నాన్ని గ్రహించి, మహా మహిమాన్వితమైన విష్ణుపంజర స్తోత్రాన్ని పఠించడం ప్రారంభించాడు. స్తోత్ర ప్రభావంతో బ్రహ్మరాక్షసుడు మునీశ్వరుడిని సమీపించ లేకపోయాడు. అయినా, ఆశ చావని బ్రహ్మరాక్షసుడు అదను చూసుకుని మునీశ్వరుడిని తినేయాలనుకుని, ఆశ్రమం బయటే కాచుకుని ఉన్నాడు. అలా నాలుగు నెలలు గడచిపోయాయి. అన్నాళ్లు వేచి చూడటంతో బ్రహ్మరాక్షసుడి శక్తి క్షీణించింది. శరీరం నీరసించింది. అడుగు వేసే ఓపిక లేక అతడు అక్కడే కూలబడిపోయాడు. ధ్యానం నుంచి లేచిన మునీశ్వరుడు ఆశ్రమం వెలుపల కూలబడిన రాక్షసుడిని చూశాడు. అతడిపై జాలిపడ్డాడు. నీరసించిన రాక్షసుడు నెమ్మదిగా పైకిలేచి, ఓపిక తెచ్చుకుని ‘మహాత్మా! నేను ఎన్నో పాపాలు చేశాను. అడవిలో తిరుగాడే జంతువులనే కాదు, అడవిలోకి అడుగుపెట్టిన ఎందరో మనుషులను కూడా చంపి తిన్నాను. నా పాపాలు తొలగిపోయే మార్గం చెప్పండి’ అని దీనంగా ప్రార్థించాడు.‘ఓయీ రాక్షసా! నేను నరమాంసభక్షకులకు ఉపదేశం చేయను. పాపోపశమన మార్గం ఎవరైనా విప్రులను అడిగి తెలుసుకో! ముందుగా నువ్వు నరమాంసభక్షణ మానేయి’ అని చెప్పి మునీశ్వరుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. బ్రహ్మరాక్షసుడు ఆనాటి నుంచి మనుషులను చంపి తినడం మానేశాడు. కేవలం వన్యమృగాలను మాత్రమే వేటాడి, వాటిని చంపి తింటూ, తన పాపాలు ఎలా తొలగిపోతాయా అని చింతిస్తూ ఉండసాగాడు. కొద్దిరోజులు రాక్షసుడికి అడవిలో ఆహారం దొరకలేదు. ఆకలితో ఉన్న బ్రహ్మరాక్షసుడు ఆహారాన్వేషణ కోసం అడవికి వచ్చాడు. ఎంతసేపు ప్రయత్నించినా ఒక్క జంతువైనా దొరకలేదు. మధ్యాహ్నం కావస్తుండగా రాక్షసుడికి ఆకలి బాగా పెరిగింది. సరిగ్గా అదే సమయానికి ఒక బ్రాహ్మణ యువకుడు పండ్లు కోసుకోవడానికి అడవిలోకి వచ్చాడు.ఆకలి తీవ్రత పెరగడంతో బ్రహ్మరాక్షసుడు తన పూర్వ నియమాన్ని పక్కనపెట్టి, బ్రాహ్మణ యువకుడిని భక్షించి ఆకలి తీర్చుకోవాలని భావించాడు. ఒక్క ఉదుటన అతడి వద్దకు చేరుకుని, అతడిని ఒడిసి పట్టుకున్నాడు. ఈ హఠాత్పరిణామానికి బ్రాహ్మణ యువకుడు భయభ్రాంతుడయ్యాడు. రాక్షసుడి చేతిలో ఎలాగూ చావు తప్పదనే నిశ్చయానికి వచ్చిన బ్రాహ్మణ యువకుడు ‘ఓయీ రాక్షసా! నన్ను ఎందుకు పట్టుకున్నావో చెప్పు. నువ్వు నన్ను వదలాలంటే నేనేం చేయాలో చెప్పు’ అని అడిగాడు.‘ఓరీ మానవా! నేను నరమాంస భక్షకుడిని. వారం రోజులుగా నాకు ఆహారం దొరకలేదు. చివరకు నువ్వు దొరికావు. నిన్ను విడిచిపెడితే నాకు ఆకలి ఎలా తీరుతుంది?’ అన్నాడు. ‘రాక్షసా! నేను మా గురువుగారికి ఆహారంగా ఫలాలు తీసుకుపోవడానికి వచ్చాను. నీకు ఆహారమవడానికి నాకు అభ్యంతరమేమీ లేదు. కొద్దిసేపు గడువిస్తే నేను ఈ ఫలాలను నా గురువుగారికి ఇచ్చి వస్తాను’ అన్నాడు బ్రాహ్మణ యువకుడు. ‘దొరక్క దొరక్క దొరికావు. నిన్ను విడిచిపెట్టాక నువ్వు తిరిగి రాకపోతే నా గతేమిటి? అయితే, ఒక పని చేశావంటే నిన్ను విడిచిపెడతాను. నేను ఇంతవరకు చాలా పాపాలు చేశాను. జాలి దయ లేకుండా ఎందరో మనుషులను చంపి తినేశాను. నా పాపాల నుంచి విముక్తి పొందే మార్గం చెప్పావంటే నిన్ను తినకుండా వదిలేస్తాను’ అన్నాడు.బ్రాహ్మణ యువకుడికి ఏమీ తోచలేదు. చివరకు తాను నిత్యం పూజించే అగ్నిదేవుడిని స్మరించుకున్నాడు. అతడి ప్రార్థనకు అగ్నిదేవుడు స్పందించాడు. అతడికి సాయం చేయమని సరస్వతీదేవిని కోరాడు. అగ్ని కోరిక మేరకు సరస్వతీదేవి బ్రాహ్మణ యువకుడికి మాత్రమే కనిపించి, ‘నాయనా భయపడకు. నీ నాలుక మీద నిలిచి ఒక దివ్యస్తోత్రాన్ని పలికిస్తాను. అది విన్న రాక్షసుడు నిన్ను విడిచిపెడతాడు’ అని చెప్పింది.సరస్వతీదేవి మాటతో ధైర్యం తెచ్చుకున్న బ్రాహ్మణ యువకుడు ‘ఓయీ రాక్షసా! నేనిప్పుడు ఒక దివ్యస్తోత్రం వినిపిస్తాను. ఈ స్తోత్రాన్ని త్రికాలాల్లోనూ పఠించావంటే, నీ సమస్త పాపాలూ నశించి, తుష్టి, పుష్టి, శాంతి కలుగుతాయి’ అని చెప్పి తన నోట నిలిచిన సరస్వతీదేవి అనుగ్రహంతో విష్ణుసారస్వత స్తోత్రాన్ని ఆశువుగా పఠించాడు.బ్రాహ్మణ యువకుడు దివ్యస్తోత్రాన్ని బోధించగానే బ్రహ్మరాక్షసుడు ఎంతో సంతోషించి, అతడిని తినకుండా వదిలేశాడు. బ్రాహ్మణ యువకుడు రాక్షసుడికి నీతులు బోధించి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు. – సాంఖ్యాయనఇవి చదవండి: Sunday Story: 'ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న'! -
Sunday Story: 'ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న'!
‘ఎట్టా సచ్చిపోయినాడురా బంద నాగన్న, నిన్నటి దాంక బిస్సగా ఉండ్య?’ అని పెద్దింటి మనిషిని అడిగాడు తగ్గుబజారు మనిషి. మాటలు వినపడేంత దూరంలోనే యేటి తగ్గున దొడ్డికి కూచ్చోని మాట్లాడుకుంటున్నారిద్దరూ. ప్రొక్లెయినర్తో ఏటి గట్టునున్న కంప ఉన్న కంపచెట్లను పీకించేసరికి వరిమళ్లు నున్నగా కనపడతున్నాయి. చింతట్టు మీంద నుంచి తెల్ల కొంగల గుంపొకటి వరిమళ్లల్లోకి దిగింది. గుడ్ల మాడి ఇంటి బరుగోళ్ళు యేట్లో సల్లగా పనుకొని నెమురేచ్చా ఉండాయి.బీడీ పొగ గాల్లోకి ఊత్తా ‘నిన్న పెత్తల్ల అమాస గదరా.. కేజీ మటన్, సీపు లిక్కర్ తెచ్చుకున్యాడంట, ఒక్కడే తిని తాగి సచ్చినాడు. ఉబ్బరం పట్టకల్యాక నిద్రలోనే గుండె పట్టుకుందంటా. మంచి సావు సచ్చినాడులే ముసిలోడు’ అన్యాడు పెద్దింటి మనిషి. ‘ఎంత సావొచ్చరా వానికి, డెబ్బై ఏళ్ళు వొచ్చినా మనిషి తుమ్మసెక్క ఉన్యట్టు ఉండ్య’ అనుకుంటా ఇద్దరూ ఒకేపారి లేసి యేట్లోకి పోయివచ్చినారు. ‘తొందర పోదాం పారా, ఎత్తేలోపే ఒకసారి సూసోద్దామ’ని ఊళ్ళోకి దావ పట్టినారు. ముసిలోల్లు, సావాసగాళ్లు అందరూ నాగన్నను సూన్నీకి పోతనారు. యాపసెట్టు కొమ్మల మద్దే నుంచి పడ్తన్య ఎండలో నాగన్నను రగ్గు మీంద పండుకోబెట్టినారు. తలాపున ఊదిగడ్లు పట్టుకుని కూచ్చోని ఉంది నడిపి కోడలు. వచ్చినోళ్లకు నీళ్ళు, కాపీ అందించా సేలాకీగా ఉంది సిన్న కోడలు. మొగుని కాళ్ళ కాడ కూచ్చోని ‘మటన్ కూరాకు, మటన్ కూరాకు అని కలవరిచ్చా ఉన్యాడు మూడు దినాల నుంచి. ఉన్నది అంత తిని సచ్చిపోయే గదరా’ అని ఏడుచ్చాంది నాగన్న పెళ్ళాం. నాగన్న మొఖం సచ్చిపోయినాంక గూడా కళతోనే ఉంది. వచ్చినోళ్ళు అందరూ దాని గురించే మాట్టాడుకుంటా పోతనారు. నాగన్న సిన్నకొడుకు మాటికి ఒకసారి ఇంట్లోకి పోయొచ్చా మూతి తుడుసుకుని వాళ్ళ నాయనను తలుసుకుని కుమిలిపోతనాడు. మిగిలిన ఇద్దరు కొడుకులు తలకాయ న్యాలకేసి నిలబన్యారు. మనువళ్లు మిగతా పనులు సూసుకుంటా ఉండారు. ఊరు సర్పంచు సెండుమల్లె దండ నాగన్న మీందేసి ఒక పక్కన నిలబడి ‘ఎట్టి మాలోళ్లకు సెప్పినారా?’ అని పెద్దరికం నిరూపించుకున్యాడు. నాగన్న పెద్దకొడుకు ముందుకొచ్చి ‘మా పిల్లోల్లు సెప్పనీకి పోయినారు సామీ’ అన్యాడు. ఇంతలోనే ఊరి నుంచి కూతురు ఏడ్సుకుంటా వచ్చి వాళ్ళ నాయన మీంద పడింది. పెద్దింటి మనిషి, తగ్గుబజారు మనిషి ఇద్దరూ గూడా నాగన్న మొఖం దిక్కు సూసి ఒక పక్కన నిలబన్యారు.కోపంగా ఇంటికాడ బగ్గి ఆపి దిగినారు నాగన్న మనువళ్లు. యాప సెట్టు మీందున్న కాకులు అరుసుకుంటా పైకి లేసినాయి. శాంచేపు నుంచి గాడిపాట్లో ఉండే బరుగోళ్ళు రెండు కొట్టుకుంటా ఉండాయి. వాళ్ళ నాయన కాడికి వచ్చి ‘ఈరన్న గుంత తియ్యనీకి రాడంట’ అన్యారు. ఆడ ఉన్య అందరూ వచ్చినోళ్ల దిక్కేమొఖం పెట్టినారు. ‘ఏంటికి?’ అని అడిగినాడు నాగన్న పెద్దకొడుకు.‘ఏమో నాయన! ఏం ఏంటికి గుంత తియ్యవు అని అడిగితే ఏం పలకల్యా.’ ‘ఏం వానికి పొగరు ఎక్కిందంటనా’ అన్యాడు పసిడెంట్. ‘లెక్క జాచ్చి ఇయ్యాలేమో లేరా’ అన్యాడు నిలబన్య పెద్దమనిషి. ‘ఆడికి అది గూడా సెప్పినాం మామా, నీ లెక్క నా పుల్లాతుకు సమానమని ఎచ్చులు పోయినాడు.’‘బలసినట్టు ఉందే.. ఎవరు అనుకోని మాట్టాడ్తానాడంట? కాళ్ళు ఇర్సాలేమో’ అని మీసం తిప్పినాడు నాగన్న నడిపి కొడుకు. ‘ఒర్యా నడిపే.. ఇది కొట్టాట టైమ్ కాదు.. వాని అవసరం మనది. నువ్వు మీయన్న పోయి మాట్టాడి రాపోరి’ అన్యారు రొంత మంది. కొడుకులు ఆలోచనలో పన్యారు. ‘ఇంగో ఇద్దరూ పెద్ద మనుషులు గూడా పోరి’ అన్యాడు పసిడెంట్. గుంత తీసే ఈరన్నను తిట్టుకుంటా పోయినారు నలుగురు.‘ఏం వచ్చి సచ్చింది గుంత తీనీకి పోయే.. లెక్కన్నా వచ్చాది. పెద్ద మాంసం తెచ్చుకుందాం’ అంది మంచంలో నెత్తి దూక్కుంటా ఈరన్న పెళ్ళాం. ఇంటి పక్కన ఉన్య కానుగ సెట్టు కింద కూచ్చోని హరిశ్చంద్ర పద్యం పాడుకుంటా తాడు పేన్తా ఉండాడు ఈరన్న. ‘వీళ్ళ బజార్లు బాగుంటాయి ప్పా.. నీట్గా ఉండాయి సూడు.. మన బజార్లు సచ్చినాయి ఎప్పుడూ సూసినా కుళాయి నీళ్ళు పార్త బురద బురద ఉంటాయి’ అన్యాడు నాగన్న కొడుకులతో పాటు వచ్చన్య మొదటి పెద్దమనిషి.ఆయన సెప్పినట్టే రోడ్డుకు రెండేపులా సెట్లు ఏపుగా పెరిగి ఉండాయి. ఎండ భూమి మీందకు దిగకుండా ఉంది. ఇంటి దిక్కే వచ్చన్య నలుగురును సూసి మంచం మీంద నుంచి దిగి నమస్కారం సేసింది ఈరన్న పెళ్ళాం. ఈరన్న ఏం పలకనట్టు కూచ్చున్యాడు. హరిశ్చంద్ర పద్దెం గొంతు పెంచి అందుకున్యాడు. జనం రొంత గుంపు అయినారు. ‘ఈరన్న.. ఓ ఈరన్న’ అని పిల్సినాడు నాగన్న పెద్దకొడుకు. ‘ఎవరోళ్ళు..’ అన్యాడు ఈరన్న. ‘బంద నాగన్న కొడుకులం’ అన్యాడు నాగన్న నడిపి కొడుకు. ‘సెప్పండి సామీ’ అని అరుగు దిగినాడు. ‘సెప్పనీకి ఏం ఉంది ఈరన్న.. నాగన్న సచ్చిపోయినాడు తెల్దా ఏందీ?’ అన్యాడు రెండో పెద్దమనిషి. ‘తెల్సు సామీ!’ ‘మరేందీ ఈరన్న.. పిల్లోల్లు వచ్చే గుంత తియ్యవనీ సెప్పినావంట?’‘అవును తియ్యను సామీ.’‘యేంది ఈరన్న.. ఏం కావాలా సెప్పు? ఐదు వేలు లెక్క.. రెండు కోటర్లు మందు ఇచ్చాం రా.. టైమ్ ఐపోతాందీ’ అన్యాడు నడిపి కొడుకు. ‘నాకు పదివేలు ఇచ్చినా గుంత తీయను’ అని తెగేసి సెప్పినాడు ఈరన్న. ‘ఏం ఎందుకు ఈరన్న.. మా తాత సచ్చిపోయినప్పుడు నువ్వే గదా తీసినావ్? మా పెద్దనాయన సచ్చిపోయినప్పుడు నువ్వే తీసినావ్? మా ఇల్లు నీకే కదా.’ ‘అవ్ వాళ్ళందరివి తీసిన. రేప్పొద్దున మీలో ఎవరు సచ్చినా గుంత తీచ్చా, కానీ ఈ గుంత తియ్యను.’భుజం మీందున్న టువాలా సర్దుకుంటూ ‘యేందిబీ.. మాటలు యాడికో పోతనాయి. రొంత సూసుకొని మాట్టాడు’ అన్యారు పెద్దమనుషులు. ‘సూడు అయ్యా.. నా మాటలు యాటికి పోలా. నేను గుంత తియ్యను. నన్ను యిడ్సిపెట్టండి.’‘ఏమైందో సెప్పమంటే ఇకారాలు పోతనాడు, ఈడు రాకపోతే వేరేవాళ్ళు రారా యేంది. వాళ్ళను పిల్సుకొని పోదాం’ అన్యాడు నడిపి కొడుకు. ‘ఆ... అట్నే పోండి సామీ’ అని తాడు పేనే పనిలో పడ్డాడు ఈరన్న. మెత్తగా ‘పెద్దోళ్ళు వచ్చినారు, పోకూడదా’ అంది ఈరన్న పెళ్ళాం.‘నీ యమ్మ నిన్ను నరికి, ఈన్నే గుంత తీసి పూడుచ్చా అతికేం మాట్టాన్యావంటే’ అని ఒంటి కాలు మీంద పెళ్ళాం పైకి లేసినాడు ఈరన్న. ‘నీ దినం కూడు కుక్కలు తినా. ఏమన్యానని నా మీందకు వచ్చనావు? పోయేకాలం వచ్చిందిలే నీకు. పెద్దోళ్ళతో పెట్టుకుంటనావు’ అని తిట్టుకుంటా మంచంలో మళ్ళా కూచ్చుంది.నలుగురు ఎదురుగా ఉన్య ఇంటి కాడికి పోయి నిలబన్యారు. ‘అయ్యా.. ఆ ఈరన్న గానీ ఇల్లుకు మేము పోయినామంటే.. వాడు తాగి అమ్మనక్కను తిడ్తాడు. వాన్తో మాకు కొట్టాట వొద్దు అయ్యా.. వానికి ఏం కావాలో ఇచ్చి వాణ్ణే పిల్సుకొని పోండి’ అన్యాడు ఈరన్న ఎదిరింటి మనిషి.రొంత దూరంలో నిలబన్య ఈరన్న అన్న కొడుకు కెళ్ళి సూసేసరికి వాడు సేసేది ఏంల్యాక తలకాయ దించుకున్యాడు. సెప్పనీకి సూసినా వాళ్ళ మనుషుల మీంద మాటలతో పెద్దపులి పడినట్టు పన్యాడు ఈరన్న. ఎవ్వరూ గూడా నోరెత్తల్యా. సెవులూ కొట్టుకుంటా వెనక్కి పోయినారు నలుగురూ. ఈరన్న పెళ్ళాం భయపడ్తా మొగుని దగ్గరకొచ్చాంటే సింత నిప్పుల మాదిరి ఉన్య ఈరన్న కళ్ళు సూసి దూరం నిలబడి జరగబోయేది తలుసుకొని బిత్తర సూపులు సూచ్చాందినాగన్న తలకాయ కాడ ఉన్య బియ్యం గ్లాసులో కొత్త ఊదిగడ్లు నుంచి పొగ దట్టంగా లేచ్చా అప్పుడే లేపిన షామియానాను తాకుతాంది. రెండు మూడు కొత్త పూల దండలతో నాగన్న మొఖం యింగా వెలిగిపోతాంది. గాడిపాడు ఖాళీ అయ్యింది. ‘వాడు రాడంట!’ అని నలుగురు తలకాయలు దించుకున్యారు. ‘ఆ నావట్టకు ఏం పోయేకాలం వచ్చిందో సూడు క్కా’ అని పక్కన కూచున్య బండకాడ కూరగాయాల ఆమెతో బంకామె కళ్ళు పెద్దవి సేసి సెప్పింది. ‘వాడు ల్యాకపోతే ఏంది? వేరే వాళ్లు లేరా’ అన్యాడు పసిడెంట్. ‘వాని దెబ్బకు ఎవరూ రాకుండా ఉండారు.’నాగన్న పెళ్ళాం ఏడుపు యాపసెట్టు అంతా అయింది. ఉన్య రెండు మూడు కాకులు గూడా ఎగిరిపోయినాయి. ‘ఎంత సేపు పెడ్తార్రా.. వాణ్ని పిల్సి ఈపు పగలగొట్టకుండా? ఇదే మా ఊర్లో అయ్యింటే బొడ్డాలు పగలగొట్టే వాళ్ళం. పెద్దమనుషులు ఉండారా? మా మామతో పాటు సచ్చినారా’ అన్యాడు సావు సూన్నీకి వచ్చిన సుట్టం.అది యిన్య పెద్ద మనుషుల మొఖంలో నెత్తుర సుక్క ల్యాకుండా పోయింది. దొంగకోళ్ళు పట్టే మాదిరి ఒకరి మొఖం ఒకరు సూసుకుని బెల్లం కొట్టిన రాయిలా నిలబన్యారు. పరువు మీందకు వచ్చేసరికి కోపంగా ఈరన్నను పిల్సుకొని రమ్మని పసిడెంట్ మనిషిని పంపినాడు. విషయం ఊరంతా పాకింది. ఊర్లో యాసావు అంత మంది జనాన్ని సూసిండదు. ఏం అయితాదని జనాలు పనులు పోకుండా కూచ్చున్యారు. తిన్నాల ఉన్నట్టు ఉంది సావు. ఏడ్సి ఏడ్సి నాగన్న పెళ్ళాం సోయి ల్యాకుండా పడిపోయింది.తప్పెటోల్లు రెండు పెగ్గులేసుకొని ఒక మూలకు కూచున్యారు. ఏం సెయ్యాలో తెలీక కొడుకులు గమ్మున నిలబడి ఉండారు. నాగన్నకు నలుగురు కొడుకులు అందరికి సమానంగా భూమి పంచి ఇచ్చి సోడమ్మ దేళంలో పూజారి పని సేచ్చా ఉండ్యా. దేళంకి చందాలు వసూలు చేయడం, దేళం బాగోగులు సూసుకుంటా సంతోషంగా బతుకుతుండ్యా. సోడమ్మ దేళంలో దీపం వెలగని రోజు లేదు.పనికోసం యా రోజు ఒకరికోసం సెయ్యి స్యాసింది ల్యా. అంత వయసులో కూడా ఎద్దులతో ఆరు ఎకరాల భూమి పండిచ్చా ఉన్యాడు. రోజుకు రెండు సెంబుల కాఫీ తాగుతా, నాలుగు కట్టలు వకీలా బీడీలు కాల్చేవోడు. పెళ్ళాంతో యారోజు మాట్టాడింది ల్యా ఎప్పుడూ కొట్టాడ్త ఉండేవాడు. ఊర్లో ఉన్నన్ని రోజులు ఉత్తపైనే ఉండేటోడు సంతకు పోవాల్సి వచ్చే కొత్తపెళ్ళికొడుకు మాదిరి పోయేటోడు నాగన్న.ఎండ ఎక్కువైంది. సేతీకి ఉన్య పారేన్ వాచ్ పదే పదే సూసుకుంటా ఉండాడు పసిడెంట్. ఈరన్న పేనే తాడు భుజానేసుకుని నిమ్మళంగా వచ్చి రోడ్డు మీందనే నిలబన్యాడు. ఈరన్న వొచ్చినాడని గందరగోళం అయింది. ఊరి పెద్దోళ్లనే మల్లెసినా మొగోడు ఎవడాని కొత్తగా వచ్చిన సుట్టాలు ఈరన్న దిక్కు నోరెళ్ళబెట్టి సూచ్చనారు. వొంటి మింద కేజీ కండ గూడా లేదు. తాగి తాగి ఎముకలు బయట పన్యాయి. మూతి మొత్తం తిప్పినా మీసాలే. కళ్ళు ఎండిపోయిన కుందు యేరు మాదిరి ఉండాయి.‘యేరా ఆన్నే రోడ్డు మీంద నిలబన్యావ్? రా ఇట్టా’ అన్యాడు పసిడెంట్. ఈరన్న పసిడెంట్ మాటకు ఎదురుసెప్పల్యాక నీళ్ళు నములుతా ఉండాడు. ‘యేందిరా?’ అని కళ్ళు పెద్దవి సేసినాడు పసిడెంట్. రోడ్డు మీందకు కళ్ళేసి ‘నేను ఆడికి రాను రెడ్డి’ అని సెప్పినాడు. కొత్త ఊరోళ్ళు పసిడెంట్ కెళ్ళి సూసినాడు. పసిడెంట్కు తలకాయ కొట్టేసినట్టు అయింది. పెద్దమనుషులు పసిడెంట్కు సర్ది సెప్పినారు. అందరూ రోడ్డు మీందకు వచ్చినారు. ‘సూచ్చనా సూచ్చనా శానా ఇకారాలు పోతనావ్? యేంది వాయ్ కథ’ అన్యాడు పసిడెంట్. అందరూ తల ఒకమాట ఏసుకున్యారు. ఈరన్న ఏం పలకకుండా నిలబన్యాడు. పీర్ల పండగ గుండం మాదిరి నిప్పులు కక్కుతా ఇద్దరు ముగ్గురు సెయ్యి పైకి లేపినారు.‘లాస్ట్ సారి మర్యాదగ సెప్తనా.. పోయి గుంత తీపో’ అన్యాడు పసిడెంట్. ‘నా గొంతు కోసినా.. నేను గుంత తియ్యను రెడ్డి’ అని పసిడెంట్ కళ్ళల్లోకి సూటిగా సూచ్చా సెప్పినాడు. ఈరన్న దొమ్మ పొగరు ఊరు మొత్తం సూసింది. ఇట్టా కాదని కోటోళ్ల తాత ముందుకు వచ్చి ‘ఒర్యా... నీకు, నాగన్నకు ఏమైనా తకరారు అయిందా?’ అని అడిగినాడు. ఈరన్న అందరి దిక్కు సూచ్చా తలకాయ ఊపినాడు.‘ఓర్నీ పాసుగూలా.. ఈ మాట ముందు సేప్తే పోయేది గదరా. ఏం కొట్టాట అయింది’ అని అడిగినారు. ఈరన్న ఏం మాట్టాడకుండా రోడ్డు వెంబడి నడ్సుకుంటా పోతాంటే జనం ఈరన్న దిక్కు సూచ్చా పోయినారు. పెద్దమనుషులు ఈరన్న పీక మీంద కాలేసి తొక్కేమాదిరి ఉండారు. గాడ్దెంకా దాటి సోడమ్మ దేళం ముందు రోడ్డు కాడ ఆగినాడు ఈరన్న. జనం గూడా ఏం సెప్తాడ అని కాసుకొని ఉండారు. ఈరన్న ఊరి మంది దిక్కు సూచ్చా పదేళ్ళ కింద మాట ఇదని మొదలుపెట్టినాడు.ఆ పొద్దు ఇంగా సరిగ్గా తెల్లవారాల్య. ఊర్లో సారాయి బాలన్నను పోలీసులు పట్టకపోయినాంక సారాయి కోసం జనం అందరూ పక్క ఊరికి పోతాండారు. రెండు రోజుల నుంచి సారాయి ల్యాక న్యాలుకా పీక్తాంటే నేను సోడమ్మ వెనక దావ గుండా సచ్చా బతుకుతా పక్క ఊరికి పోయినా. కాళ్ళకు సెప్పులు లేవు. అడ్డదావాలో ముల్లులు ఉండాయని సోడమ్మ ముందు దావ వెంబడి ఊళ్ళోకి వచ్చాంటే పొద్దున పూజ సేసుకొనికీ వచ్చిన నాగన్న దావన పోతన్య నన్ను సూసి ‘ఒర్యా ఈరన్న.. ఒర్యా’ అని క్యాకేసినాడు. ఎవరోబ్బా ఇంత పొద్దునా అని నేను ఆగి తలకాయ తిప్పి సూసినా. ‘మాల నాకొడాకా యా దావ నుంచి రా నువ్వు పొయ్యేది’ అన్యాడు.‘ఓ నాగన్న... మాటలు మర్యాదగా రానీ’ అన్య కైపు బిస్సన.‘తాగుబోతు నా కొడకా నీకు మార్యాద యేందిరా, మీకు వెనక దావ ఉంది గదరా.. పెద్దరెడ్డి మాదిరి ఎవరూ సూల్లేదని ముందు నుంచి పోతానావ్’ అన్యాడు. నాకు కైపు అంత యిడ్సిపోయి కోపం అరికాళ్ళల్లో నుంచి మెదుడులోకి పాకింది.. ‘నీ యబ్బా కట్టిచ్చినాడా రోడ్డు.. ఇది అందరికీ’ అని సెప్పినా. అంతే కోపంతో ఎగిచ్చి తన్యాడు కాల్తో. నా కొడకా.. మళ్ళా మాట్టాడ్తనావే.. మీ బతుకులెంత? మీరెంత? యాపొద్దు పోంది, ఈ పొద్దు ఇట్టా ఎందుకు పోతనావ్ వాయ్ అని కుతిక మీంద కాలేసినాడు. సాచ్చం ఆ సోడమ్మ తల్లే. ‘మీకు ఒక దావ.. మాకు ఒక దావ ఎందుకు?’ అని అడిగినా. ‘మీరు మేము ఒకటేనా వాయ్. మేము ల్యాకపోతే మీ బతుకులు తెల్లవారావ్’ అన్యాడు.‘మేము గూడా ల్యాకపోతే మీ బతుకులు తెల్లవారవ్.. మీ పీనుగ కూడా లేయ్యదు’అని సెప్పినా. ‘అంతా మొగోనివా?’ అన్యాడు. ‘సరే అయితే సెప్తండా సూసుకో.. ఇదే ఆకాశం, ఇదే నేల, ఇదే సోడమ్మ, ఎదురుగా ఉన్య మారెమ్మ మీంద ఒట్టేసి సెప్తనా.. రెండు దావలు పోయి ఒకే దావ వచ్చేగానీ నీ పీనుగకు నేను పికాసి ఎత్తను, పారా ముట్టను’ అని గట్టిగా అర్సి తొడ కొట్టి, మీసం తిప్పినా. ‘పో.. పో వాయ్ సూసినావ్, నీ మూడకాసు మాటలు’ అని నన్ను వెనక దావలోకి మెడకాయ పట్టుకొని గుంజకపోయినాడు’ అని జెప్పి.. సాచ్చం అద్దో ఆ మారెమ్మ తల్లే అని పోతురాజు మాదిరి మారెమ్మ దేళంకెళ్ళి సెయ్యి సూపిచ్చినాడు.జనాలు అందరూ కిక్కురుమనుకుండా సినిమా సూసినట్టు సూసినారు. సోడమ్మ కటాంజన్కు కట్టిన ఎర్ర గుడ్డ గాలికి ఊగుతా ఉంది. పొద్దున్నుంచి దీపం ల్యాక దిగులుగా ఉన్నట్టు ఉంది. సాచ్చం యాడ అడుగుతారో అని సోడమ్మ కళ్ళు మూసుకుని ఏం ఎరగనట్టు వింటా ఉంది. సోడమ్మ వెనక దావాలో నిలబన్య ఈరన్న మనుషులు దీనంగా మొఖం పెట్టినారు.‘మళ్ళా మీకు ఆ దావ ఉంది గదరా.. నువ్వు ఎందుకు ఈ దావలో నడ్సినావ్’ అన్యారు పెద్దమనుషులు. ‘మళ్ళా మీరు అదే పాట పాడ్తారు. నేల అంతా ఒకటే అయినప్పుడు మీకు ఒక దావేంది, మాకు ఒక దావేంది రెడ్డి’ అన్యాడు ఈరన్న ఊగిపోతా. ‘ఇప్పుడు ఏం అంటావ్ రా’ అని పళ్ళు నూరినారు పెద్దమనుషులు. ‘నేను సేప్పేది ఏం లేదు రెడ్డి.. నన్ను యిడ్సిపెడ్తే నా పని నేను సూసుకుంటా!’‘సూడు ఈరన్న అయిపోయిందేందో అయిపోయింది. రా వచ్చి గుంత తీయ్. మా నాయన తరుపున పెద్ద కొడుకుగా నేను నిన్ను క్షమాపన అడుగుతనా’ అన్యాడు నాగన్న పెద్దకొడుకు.‘ఎట్టా అయిపోతాది సామీ.. పది సంవత్సరాల నుంచి గుండెకాయ కాల్తానే ఉంది. ఉప్పు కారం మీకన్నా రొంత ఎక్కువే తిన్యా. కుందరాగు నర్సన్న పెద్దకొడుకు కుందరాగు ఈరన్నను నేను, మాట అంటే పానం లెక్క. మీరు సెప్పినట్టే మా బతుకులా? మీకేమో తారోడ్డులు, మాకేమో మట్టి దావలా? మారాల మారి తీరాల.’అందరూ అర్థంకానట్టు సూచ్చనారు. పసిడెంట్ ముందుకు వచ్చి ‘ఇప్పుడు ఏం కావాలి రా నీకు?’‘అందరికీ ఒకే దావా కావాలా!’ ‘తంతే నాకొడకా యేట్లో పడ్తావ్.. అందరికీ ఒకే దావ యేంది రా.. తలకాయ తిరుగుతుందా?’‘నాకు ఏం తిరగల్యా సామీ.. ఇప్పుడే సక్కగా పనిసేచ్చాంది. మేము గూడా ముందు దావలో నుంచే నడుచ్చాం.’ ‘నడసనియ్యక పోతే..’‘మీ గుంతలు మీరే తవ్వుకోండి.. మీ పీనుగులు మీరే బూర్సుకోండి!’ఈరన్న మనసు అందరికీ అర్థం అయింది. పెద్దమనుషులు అందరూ గుంపు అయి గుస గుసలాడ్త ఈరన్న దిక్కు సంపేమాదిరి సూచ్చాండారు. ఎండ నెత్తి మీందకు వచ్చింది. నాగన్న తలకాయ కాడ ఊదిగడ్లు మారుతానే ఉండాయి. బయట ఊరోళ్ళు పెద్దమనుషుల దిక్కు మనుషుల్లానే సూడకుండా ఉండారు. ఈరన్న దిక్కు వాళ్ళ మనుషులు వచ్చి బలంగా నిలబడి కళ్ళ నిండా నీళ్ళు పెట్టుకున్యారు. దమ్ములు ఇరిసి నిలబన్య ఈరన్న దిక్కు పెళ్ళాం కళ్ళు ఆర్పకుండా సూచ్చాంది. వాళ్ళళ్ళో వాళ్ళు కొట్టుకుంటా అర్సుకుంటా ఉంటే తాపకొకసారి మీసం తిప్పుతా బుసలు కొడ్తా ఉండాడు ఈరన్న.కొంతమంది ఈరన్న సంగతి సూజ్జామని పంచెలు ఎగ్గొట్టుకోని తిరిగి పోయినారు. సెసేది ఏం ల్యాక పెద్దమనుషులు సల్లు పోయినారు. సోడమ్మ వెనక దావకి కంపసెట్లు అడ్డంగా పెట్టినారు. ఈరన్నను ఎత్తుకుని క్యాకలేసినారు వాళ్ళ మనుషులు. అప్పుడే గుళ్ళో పెట్టిన దీపం వెలుగులో సోడమ్మ నవ్వుతా ఉన్యట్టు ఉంది. ఊళ్ళోదావ గురించి దండోరా యినపడ్తాంటే పికాసీ, పారా తీసుకొని యేటి పడమటి దిక్కు శ్మశానం కెళ్ళి ఈరన్న ఉదయిస్తా పోయినాడు. – సురేంద్ర శీలం -
ఇవి మార్జాల పుష్పాలనుకుంటున్నారా!
ఫొటోలో కనిపిస్తున్న పువ్వులను చూశారు కదా, అచ్చంగా పిల్లిపిల్లల్లా ఉన్నాయి కదూ! ఈ మార్జాల పుష్పాలు ఎక్కడివనేగా మీ అనుమానం? ఈ మార్జల పుష్పాలు దేవతా వస్త్రాల్లాంటివే! భూప్రపంచంలో ఎక్కడా కనిపించవు. మరి ఈ ఫొటో ఏమిటి అనుకుంటున్నారా? ఇదంతా కృత్రిమ మేధ మాయాజాలం.చైనాకు చెందిన కొందరు సైబర్ మోసగాళ్లు ఈ మార్జాల పుష్పాల ఫొటోలను కృత్రిమ మేధతో సృష్టించి, బహుళజాతి ఈ–కామర్స్ సంస్థ ‘ఈబే’లో అమ్మకానికి పెట్టారు. ఇవి పూర్తిగా సేంద్రియ పద్ధతులతో పెంచిన తోటల్లో పూసినవని, ఈ పూలు అత్యంత అరుదైనవని, జన్యుమార్పిడి పద్ధతులేవీ లేకుండా సహజంగా పూసిన తాజా పూలు అని నమ్మబలుకుతూ, ఒక్కో పూలగుత్తిని 45 డాలర్లకు (రూ.3,757) అమ్ముతున్నట్లు ప్రకటించారు.ఫొటోలోని పూలు ఎక్కడా చూడనివి కావడమే కాకుండా, చూడటానికి ముద్దొచ్చే పిల్లిపిల్లల్లా ఆకర్షణీయంగా ఉండటంతో కొందరు ఔత్సాహికులు వాటిని కొనడానికి డబ్బులు కూడా పంపారు. ఫేస్బుక్, ఎక్స్ (ట్విటర్) వంటి సోషల్ మీడియా సైట్లలోనూ ఈ ఫొటోలను జనాలు విరివిగా షేర్ చేశారు కూడా. కొందరు ఆశాజీవులు ఈ పూలమొక్కల విత్తనాలు కావాలంటూ కూడా కామెంట్లు పెట్టారు. కొద్దిరోజుల్లోనే ఇదంతా ఆన్లైన్ మోసమని బయటపడటంతో డబ్బులు పంపి చేతులు కాల్చుకున్న జనాలు లబలబలాడుతున్నారు.ఇవి చదవండి: అవును.. అది నిజంగా మృత్యుగుహే! -
అవును.. అది నిజంగా మృత్యుగుహే!
ఇది చూడటానికి మిగిలిన కొండగుహల మాదిరిగానే కనిపిస్తుంది గాని, నిజానికిది మృత్యుగుహ. ఈ గుహలోకి అడుగుపెడితే మృత్యువు తప్పదు. కోస్టారికాలోని పోవాస్ అగ్నిపర్వత శిఖరం వద్ద ఉన్న ఈ కొండగుహ మృత్యుగుహగా పేరుమోసింది.రెండు మీటర్ల లోతు, మూడు మీటర్ల పొడవు ఉన్న ఈ గుహ చిన్నా చితకా జంతువులు, పక్షులు తలదాచుకోవడానికి అనువైన ప్రదేశంలా కనిపించినా, ఇందులోకి జంతువులు, పక్షులు ఏవీ వెళ్లవు. పొరపాటున వెళితే, క్షణాల్లోనే అవి ఊపిరాడక మరణిస్తాయి. కంటికి కనిపించని, కనీసం ముక్కుపుటాలకు వాసనైనా తెలియని కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ వాయువులు ఈ గుహ నిండా వ్యాపించి ఉండటం వల్లనే ఈ గుహలో ఎలాంటి జీవులైనా ప్రాణాలతో ఉండలేవు.వెలిగించిన కాగడాను ఈ గుహలోపల పెడితే అది క్షణాల్లోనే ఆరిపోతుంది. ఊపిరి పీల్చుకోవడానికి అవసరమైన ఆక్సిజన్ బొత్తిగా లేకపోవడం, లోపల అంతా కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ వాయువులు వ్యాపించి ఉండటం వల్ల ఇది మృత్యుగుహగా తయారైంది.ఈ గుహ లోపల ప్రతి గంటకు కనీసం ముప్పయి కిలోల కార్బన్ డయాక్సైడ్ వెలువడుతుంది. ఈ ప్రాంతంలో రిక్రియో వెర్డే కాంప్లెక్స్ నిర్మాణం జరుపుతున్నప్పుడు ఇంజినీర్లు ఈ గుహకు గల ప్రాణాంతక లక్షణాన్ని తొలిసారిగా గుర్తించారు. వారు దీనికి ‘కేవా డి లా మ్యూర్టె’ (మృత్యుగుహ)గా పేరుపెట్టారు.ఇవి చదవండి: ఈ సరికొత్త టెక్నాలజీ గురించి విన్నారా! వీటి పనేంటో తెలుసా!! -
‘మిట్టీకూల్’: మట్టితో ఫ్రిడ్జ్!..కరెంట్తో పనిలేదు..!
రిఫ్రిజిరేటర్... సామాన్య భాషలో ఫిడ్జ్. ఒకప్పుడూ అది అపురూపమైన వస్తువు. ధనికులు మాత్రమే దీన్ని ఉపయోగించేవారు. ఇప్పుడూ మధ్య తరగతి ఇళ్లల్లో కూడా ఇవి దర్శనమిస్తున్నాయి. కానీ పేదవాళ్లకు మాత్రం ఇప్పటికీ అపురూపమైన వస్తువే. పైగా కొనాలంటే రూపాయి, రూపాయి పోగు చేసుకుని అప్పోసొప్పో చేసుకుని కొంటారు. పైగా దీన్ని వేసవిలోనే జాగ్రత్తగా వాడుకుంటారు. ఎందుకంటే..? దీనికి అయ్యే కరెంట్ బిల్లు కూడా ఎక్కువే. ఒకవేళ పాడైతే బాగు చేయించుకోవాలన్న కష్టమే. అలాంటి వాటికి చెక్పెట్టేలా ఎకో ప్రెండ్లీగా మట్టితో ఫ్రిడ్జ్ని ఆవిష్కరించారు గుజరాత్కి చెందిన డ భాయ్ ప్రజాపతి. ఎలా రూపొందించారంటే..‘మిట్టీకూల్’ ఫ్రిడ్జ్..ఇది పూర్తిగా బంకమన్నుతో తయారైన ఫ్రిజ్. అందుకే దీనికి ‘మిట్టీకూల్’ ఫ్రిడ్జ్ అని పేరు పెట్టి, మార్కెట్లోకి తెచ్చాడు ,మన్సుఖ్ . ఈ ఫ్రిడ్జ్ కు విద్యుత్ అవసరం లేదు. ఎటువంటి మరమ్మత్తులూ చేయాల్సిన పని లేదు. అయినా అద్భుతంగా పని చేస్తుంది. సాధారణ గది ఉష్ణోగ్రతలో రెండు రోజుల్లోనే పాడైపోయే కూరగాయలను ఇందులో భద్రపరిస్తే, ఐదారు రోజులు నిక్షేపంగా నవనవలాడుతూ తాజాగా ఉంటాయి. పెరుగు, దోశె పిండి లాంటివి కూడా పుల్లబడకుండా ఉంటాయి. జ్యూసులు, నీళ్లు పెడితే చల్లబడతాయి. ఇందులో 5 కిలోల కూరగాయలు, పండ్లను నిల్వ చేయవచ్చు. విద్యుత్ కోతలు తరచుగా ఉండే ప్రాంతాల్లో, మట్టి రిఫ్రిజిరేటర్ను ఉపయోగిస్తున్నారు. మిట్టి కూల్లో పైన ఉన్న అరలో 2 లీటర్ల నీటిని పోయాలి. ఈ ఫ్రిజ్ బాష్పీభవన సూత్రాలపై పనిచేస్తుంది. దీనికి నిర్వహణ ఖర్చు కూడా ఉండదని కనగరాజ్ తెలిపారు.విద్యుత్ అవసరం లేదుసాధారణంగా విద్యుత్ ఆధారితంగా పనిచేసే ఫ్రిడ్జ్లో ఉంచిన వస్తువులు తింటే కొంత అనారోగ్యానికి గురవుతారు. కాని మట్టితో తయారు చేసి.. సహజసిద్దంగా ఉండే మట్టితో తయారు చేసి ఈ మిట్టి కూల్ లోని వస్తువులు తింటే ఎలాంటి అనారోగ్యం రాదని చెబుతున్నారు. అందుకే ప్రస్తుతం తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈ మిట్టి కూల్ కు అత్యంత డిమాండ్ ఉంది. ఇందులో ఉంచిన ఆహార పదార్ధాల్లో రుచిలో ఎలాంటి మార్పు రాదంటున్నారు మన్సుక్భాయ్ ప్రజాపతి.ప్రజాపతి నేపథ్యం..ప్రజాపతి గుజరాత్లోని రాజ్కోట్లోని మోర్బిలోని నిచ్చిమండల్ గ్రామంలో జన్మించాడు. ప్రతికూల ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు స్వస్తి చెప్పి.. కుటుంబ పోషణ కోసం కూలీ పనులు చేసేవాడు. అతను చిన్నతనం నుంచి సాంప్రదాయక మట్టి వస్తువుల తయారీపై సమగ్రమైన పరిజ్ఞానం ఉంది. దీంతో 1988లో ప్రజాపతి రూ. 30,000 చెల్లించి మట్టి పలకల తయారీకి సంబంధించిన తన సొంత కర్మాగారాన్ని ప్రారంభించాడు. కానీ మట్టి చిప్పల మన్నిక గురించి అతనికి చాలా ప్రతికూల అభిప్రాయాలు వచ్చాయి. అయినప్పటికీ పలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. అలా 1990లో అతని కంపెనీ రిజిస్టర్ అయ్యింది.ఇక 2001లో మిట్టికూల్ ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేయబడింది. ఆ తర్వాత 2002 నుంచి పూర్తి స్థాయిలో దీనిపై పనిచేయడం మొదలు పెట్టారు. అదే ఏడాది GIANగా ప్రసిద్ధి చెందిన గ్రాస్రూట్స్ ఇన్నోవేషన్ ఆగ్మెంటేషన్ నెట్వర్క్తో ప్రపంచానికి పరిచయమై.. ఈ మిట్టీకూల్ గురించి అందరికీ తెలియడం జరిగింది. ఇక బ్రిటన్, జర్మనీల్లో జరిగిన ప్రదర్శనల్లో ఈ ఫ్రిడ్జ్ను చూసి, అక్కడి శాస్త్రవేత్తలు ప్రశంసలు కురిపించారు. విద్యుత్తుతో పనిచేసే ఫ్రిజ్లతో పోలిస్తే, ఈ మట్టి ఫ్రిజ్ ఖరీదు చాలా తక్కువ. దీని ఖరీదు రూ. 8,500/అంతే!.(చదవండి: జపాన్ బుల్లెట్ రైలు తరాతని మార్చిన కింగ్ఫిషర్!) -
ఈ సరికొత్త టెక్నాలజీ గురించి విన్నారా! వీటి పనేంటో తెలుసా!!
ఇప్పటి వరకు చాలా రకాల ఎయిర్ ప్యూరిఫైయర్లు అందుబాటులోకి వచ్చాయి. ‘కరోనా’ దెబ్బకు ప్రపంచం అంతటా ఎయిర్ ప్యూరిఫైయర్ల వినియోగం బాగా పెరిగింది. అయితే, ఇవి టేబుల్ ఫ్యాన్ల మాదిరిగానే ఉంచిన చోట నుంచే తమ సామర్థ్యం మేరకు నిర్ణీత విస్తీర్ణంలో గాలిని శుభ్రం చేస్తాయి. దుమ్ము ధూళి కణాలతో పాటు సూక్ష్మజీవులను తొలగిస్తాయి.ఫొటోలో కనిపిస్తున్న రోబో ఎయిర్ ప్యూరిఫైయర్ మామూలు ఎయిర్ ప్యూరిఫైయర్లకు పూర్తిగా భిన్నమైనది. ఇది సెల్ఫ్ డ్రైవింగ్ రోబో ఎయిర్ ప్యూరిఫైయర్. ఇది ఇల్లంతా కలియదిరుగుతూ గాలిలో ఎక్కడ తేడా ఉంటే అక్కడ నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ పోతుంది. ఇది క్షణాల్లోనే గాలిలోని దుమ్ము ధూళి కణాలను, వ్యాధికారక సూక్ష్మజీవులను తొలగిస్తుంది. ‘పయాగర్’ పేరుతో కొరియన్ డిజైనర్ గ్వాంగ్ డియోక్ సియో దీనిని రూపొందించాడు. దీని ధరను ఇంకా ప్రకటించలేదు.అల్ట్రాసోనిక్ పెస్ట్ రిపెల్లర్..ప్రతి ఇంటిలోనూ చీమలు, దోమలు, ఈగలు, సాలెపురుగులు, బొద్దింకలు, చెదపురుగులు వంటి కీటకాలతో ఇబ్బందులు తప్పవు. వీటికి తోడు బల్లులు, ఎలుకలు వంటివి ఇంటి వాతావరణాన్ని దెబ్బతీస్తాయి. చీమలు, దోమలు, బొద్దింకలు, చెదపురుగులను నిర్మూలించడానికి రసాయనాలతో కూడిన రకరకాల మందులు వాడుతుంటాం.ఈ మందులు మనుషులకూ హాని చేస్తాయి. ఇక ఎలుకలను పట్టడానికి బోనులు, ట్రాప్లు వాడుతుంటాం. ఇన్ని ఇబ్బందులు లేకుండా వీటన్నింటినీ తరిమికొట్టే సాధనాన్ని అమెరికన్ కంపెనీ ‘టెకోఆర్ట్’ అందుబాటులోకి తెచ్చింది. ఇది అల్ట్రాసోనిక్ పెస్ట్ రిపెల్లర్. దీనిని వాడటం చాలా సులువు. ప్లగ్ సాకెట్లో పెట్టి, స్విచాన్ చేసుకుంటే చాలు, ఇది నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతుంది.దీని ప్రభావంతో చీమలు, దోమలు, బొద్దింకలు మొదలుకొని బల్లులు, ఎలుకలు కూడా ఇంటి పరిసరాల నుంచి పరారైపోతాయి. ఈ పెస్ట్ రిపెల్లర్ 1200 చదరపు అడుగుల పరిధిలో ప్రభావం చూపుతుంది. దీని ధర 28.99 డాలర్లు (రూ.2,420) మాత్రమే!ఇవి చదవండి: బట్టతలను దూరం చేసే.. టోపీ గురించి విన్నారా! -
బట్టతలను దూరం చేసే.. టోపీ గురించి విన్నారా!
బట్టతల పురుషులను ఇబ్బందిపెట్టే సమస్య. బట్టతలపై జుట్టు మొలిపించుకోవడానికి చాలామంది పడరాని పాట్లు పడుతుంటారు. రకరకాల నూనెలు వాడుతుంటారు. అప్పటికీ ఫలితం లేకపోతే, చాలా ఖరీదైన, బాధాకరమైన హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సలకు కూడా సిద్ధపడుతుంటారు. బట్టతలకు విరుగుడుగా అమెరికన్ కంపెనీ ‘హయ్యర్డోస్’ తాజాగా ఈ టోపీని మార్కెట్లోకి విడుదల చేసింది.ఈ టోపీని క్రమం తప్పకుండా ఆరునెలలు పెట్టుకుంటే, బట్టతల మటుమాయమవుతుందని తయారీదారులు చెబుతున్నారు. బయటి నుంచి చూడటానికి ఈ టోపీ మామూలుగానే ఉన్నా, దీని లోపలి భాగంలో ఇన్ఫ్రారెడ్ కిరణాలను ప్రసరించే చిన్న చిన్న బల్బులు ఉంటాయి. రీచార్జ్ బ్యాటరీ సాయంతో ఇవి పనిచేస్తాయి. ఈ బల్బుల నుంచి వెలువడే ఎర్రని కాంతి కిరణాలు జుట్టు కుదుళ్లలోని కణజాలంలో ఉండే మైటోకాండ్రియాను బలోపేతం చేస్తాయి.ఫలితంగా బట్టతలపై క్రమక్రమంగా వెంట్రుకలు మొలకలెత్తడం మొదలవుతుంది. దీని ఖరీదు 449 డాలర్లు (రూ.37,493). హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చికిత్సకయ్యే ఖర్చుతో పోల్చుకుంటే ఈ టోపీ ధర తక్కువే!ఇవి చదవండి: నయనతార 'చిన్నారి కవల'లను చూశారా! -
హైపర్టెన్షన్కు కారణమేంటి? జీవనశైలిలో మార్పే పరిష్కారమా?
రక్తపోటు బాధితులు తరచూ తమ బీపీని చెక్ చేసుకుంటుండాలి. లేదంటే ఇది దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీస్తుంది. మనం ఏదైనా వ్యాధితో బాధపడుతూ వైద్యుని దగ్గరకు వెళ్లినప్పుడు ఆ వైద్యుడు ముందుగా మన రక్తపోటును పరీక్షిస్తారు. ప్రస్తుతం హైపర్టెన్షన్ (అధిక రక్తపోటు) సమస్య దాదాపు అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తున్నది.చాలా మంది అధిక రక్తపోటును సాధారణమైనదిగా తీసుకుంటారు. బహుశా ఇది ఎంత ప్రమాదకరమైనదో తెలియకనే ఇలా చేస్తుంటారు. నిజానికి హైపర్టెన్షన్ అనేది ఒక ‘సైలెంట్ కిల్లర్’. ఇది అంతర్గతంగా శరీరానికి ఎంతో హాని కలిగిస్తుంది. రక్తపోటుపై అవగాహన కల్పించేందుకు ఢిల్లీ ఎయిమ్స్ మే 17 నుండి 25 వరకు ‘హైపర్టెన్షన్ వీక్’నిర్వహించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎయిమ్స్ వైద్యులు మాట్లాడుతూ హైపర్టెన్షన్ కేసులు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయని తెలిపారు. ఈ నేపధ్యంలోనే హైపర్టెన్షన్ నుంచి బాధితులకు ఉపశమనం కల్పించేందుకు ఎయిమ్స్ పలు ప్రణాళికలు రూపొందిస్తున్నదని పేర్కొన్నారు.పలు గణాంకాల ప్రకారం భారతదేశంలో దాదాపు 22 కోట్ల మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. అస్తవ్యస్త జీవనశైలే దీనికి ప్రధాన కారణం. ఎయిమ్స్ సీసీఎం విభాగం హెచ్ఓడీ డాక్టర్ కిరణ్ గోస్వామి మాట్లాడుతూ నేటి కాలంలో యువతలో హైపర్టెన్షన్ ఎక్కువగా కనిపిస్తున్నదని, 18 ఏళ్లలోపు పిల్లల్లో కూడా హైపర్టెన్షన్ సమస్య తలెత్తుతున్నదన్నారు.అధిక రక్తపోటుకు ప్రధాన కారణాలు ధూమపానం, పొగాకు వినియోగం, అధికంగా ఉప్పు తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు, వేయించిన ఆహారం, ఒత్తిడి కారణంగా రక్తపోటు పెరుగుతోంది. అధిక రక్తపోటు నివారణకు ఆహారంలో పచ్చి కూరగాయలు, శుభ్రమైన పండ్లను చేర్చుకోవాలి. పొగాకు తీసుకోవడం మానివేయాలి. జీవనశైలిలో వ్యాయామం, శారీరక శ్రమలను చేర్చుకోవడం చాలా ముఖ్యం. దీంతో అధిక రక్తపోటును నివారించవచ్చు. దీనితో పాటు 30 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరూ రక్తపోటును తరచూ చెక్ చేసుకోవాలి. తద్వారా శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. -
నయనతార 'చిన్నారి కవల'లను చూశారా!
పిల్లలు నవ్వినా అందమే, ఏడ్చినా అందమే. ఏ కోణంలో చూసినా అందమే అందం! వారి అల్లరి ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఇలా ఇద్దరు పిల్లల అల్లరి... అందులో కవల పిల్లల అల్లరి... ఎంతో గమ్మత్తుగా వామ్మో అనాల్సిందే!నయనతార తన కవల పిల్లల ఫొటోలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తూ మురిసిపోతుంటుంది. తాజా విషయానికి వస్తే... తన కవల పిల్లలతో నయన ఆనంద క్షణాలను పట్టించే వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది. పిల్లలతో సింపుల్గా ఆటో ప్రయాణం చేసిన నయనతార ఈ ఆటో రైడ్ విజువల్స్ను ఇన్స్టాగ్రామ్లోపోస్ట్ చేసింది.‘సూపర్ స్టార్’గా పేరు తెచ్చుకున్న నయనతార సింపుల్గా ఆటోలో ప్రయాణించడం నెటిజనులను బాగా ఆకట్టుకుంది. పలువురు నెటిజనులు ఈ వీడియోను తమ సోషల్ పేజీలో షేర్ చేస్తున్నారు. మాతృత్వంలోని మధురిమ గురించి తీయటి కామెంట్లు పెడుతున్నారు.ఇవి చదవండి: తాను.. బాలీవుడ్ 'ఆస్థా'న ఫేవరెట్! -
తాను.. బాలీవుడ్ 'ఆస్థా'న ఫేవరెట్!
కాన్స్ రెడ్ కార్పెట్ మీద ఐశ్వర్యా రాయ్ లుక్స్కి వెస్ట్రన్ వరల్డ్ అంతా ఫిదా అయిపోయింది. మనకూ కొత్తగా కనిపించింది. అలా ఆమెను తీర్చిదిద్దిన స్టయిలిస్ట్ ఆస్థా శర్మ. ఆమె అంట్రప్రెన్యూర్ కూడా!ఆస్థా స్వస్థలం ఢిల్లీ. ఫ్యాషన్ ప్రపంచంతో అసలు ఆమెకు ఎలాంటి సంబంధం లేదు. వాళ్లది లాయర్ల కుటుంబం. ఆమె తండ్రి.. ఢిల్లీలో పేరుమోసిన అడ్వకేట్. కెరీర్ విషయంలో తన తండ్రి అడుగుజాడల్లోనే నడవాలనుకుని ఇంటర్ అయిపోగానే ‘లా’ ఎంట్రెన్స్ రాసింది. సీట్ వచ్చింది కూడా. కానీ ఆస్థా వాళ్ల నాన్న.. తన కూతురు లాయర్ కాకుండా ఇంకేదైనా రంగంలో స్థిరపడితే బాగుండు అనుకున్నాడు. అదే విషయాన్ని బిడ్డతో చెప్పాడు.. ‘నేను లాయర్ అయ్యాను కాబట్టి.. నువ్వూ కావాలనే మైండ్సెట్తో లా చదవకు. నీకేది ఇష్టమో అదే చెయ్’ అని. అప్పుడు ఆలోచించింది ఆస్థా.. నిజంగా తనకు లా చదవాలని ఉందా? అని! ఇంట్రెస్టింగ్గా ఏమీ అనిపించలేదు.దాంతో అది వదిలేసి ఢిల్లీ యూనివర్సిటీలో బీఏ ఇంగ్లిష్ లిటరేచర్లో చేరింది. అది చదువుతున్నప్పుడే ఆస్థాకు క్రియేటివ్గా ఏదో చేయాలనే తపన మొదలైంది. ఆ శోధనలోనే ఫ్యాషన్ పట్ల ఆసక్తి పెరిగింది. బీఏ అయిపోగానే ‘పర్ల్ అకాడమీ’ ఫ్యాషన్ మార్కెటింగ్ అండ్ మర్చండైజింగ్ కోర్స్లో జాయిన్ అయింది. కానీ అదేమంత ఇష్టంగా తోచలేదు. అప్పుడే ఒక ఫ్రెండ్ ద్వారా ‘స్టయిలింగ్’ గురించి తెలుసుకుంది.ఫ్యాషన్ మార్కెటింగ్ కోర్స్ పూర్తవగానే స్టయిలింగ్లోకి దిగింది. మ్యాగజైన్ స్టయిలిస్ట్ రిన్ జాజో దగ్గరికి ఇంటర్న్గా వెళ్లింది. అదే సమయంలో మరో స్టయిలిస్ట్ ఆదిత్య వాలియాకూ అసిస్టెంట్గా పని చేయడం మొదలుపెట్టింది. అప్పుడు గ్రహించింది స్టయిలింగ్ అనేది తన కైండ్ ఆఫ్ వర్క్ అని. ఆ ఇంటర్న్షిప్ అయిపోగానే ఆమెకు ఏ్చటp్ఛట’టఆ్చ్డ్చ్చట మ్యాగజైన్లో ఫ్యాషన్ ప్రొడ్యూసర్ కొలువు దొరికింది. అది ఆమెకు పనిలో అనుభవాన్నే కాదు.. ఫ్యాషన్ లోకపు కాంటాక్ట్స్నీ పెంచింది. గొప్ప ఎక్స్పోజర్నిచ్చింది.అది ఒక పంజాబీ సినిమాలోని అగ్రతారలకు స్టయిలింగ్ చేసే చాన్స్ని తెచ్చిపెట్టింది. అంతే మ్యాగజైన్లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఆసా, ఆమె కొలీగ్ మోహిత్ ఇద్దరూ ఆ ప్రాజెక్ట్లో తలమునకలయ్యారు. సక్సెస్ సాధించారు. దానిద్వారా వచ్చిన పెద్దమొత్తాన్ని తీసుకుని ముంబై చేరారు. ‘వార్డ్రోబిస్ట్’ అనే ఫ్యాషన్ స్టార్ట్ప్ పెట్టారు. అది ఆస్థాకు బాలీవుడ్ ఎంట్రెన్స్ని కల్పించింది. ఐశ్వర్యా రాయ్ని పరిచయం చేసింది. తన పనితనాన్ని నిరూపించుకునే అవకాశాన్నిచ్చింది. ఐశ్వర్యా రాయ్ మెచ్చి ఆమెను తన పర్సనల్ స్టయిలిస్ట్గా అపాయింట్ చేసుకుంది.ఆ వాసి మరింత మంది తారలకు చేరి.. దిశా పాట్నీ, మృణాల్ ఠాకుర్, నోరి ఫతేహీ, విద్యా బాలన్, భూమి పెడ్నేకర్లకూ స్టయిలింగ్ చేసే ఆపర్చునిటీస్ని అందించింది. అంతేకాదు అంట్రప్రెన్యూర్గా ‘ద వెడ్డింగ్ స్టయిల్’ ప్రాజెక్ట్నూ లాంచ్ చేసే దశకు చేర్చింది. ఆస్థా ఇప్పుడు.. బాలీవుడ్ సెలబ్రిటీస్కి ఫేవరెట్ స్టయిలిస్ట్.. బడ్డింగ్ స్టయిలిస్ట్లకు రోల్ మోడల్!స్టయిలిస్ట్ అవడానికి ఫ్యాషన్ పట్ల ప్యాషన్ మాత్రమే సరిపోదు. ఫ్యాషన్ అండ్ డిజైనింగ్లో చదువు, ఆ సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్, అంతులేని ఈ పోటీ రంగంలో అలుపెరగని శ్రమ, ఊహకందని సృజన చాలా ఇంపార్టెంట్! అందుకే ఎప్పటికప్పుడు మారుతున్న ట్రెండ్స్ మీద అవగాహన, స్టడీ, రీసెర్చ్ తప్పనిసరి! ఇవన్నీ ఉంటేనే స్టయిలింగ్లో మన మార్క్ చూపించగలం.. బెస్ట్ అనిపించుకోగలం! – ఆస్థా శర్మఇవి చదవండి: ఆ పాత్రలో.. మెప్పించడానికి చాలానే కష్టపడింది! -
జపాన్ బుల్లెట్ రైలు తలరాతని మార్చిన కింగ్ఫిషర్!
శాస్త్రవేత్తలు, మహామహా మేధావులు ఎన్నో కొంగొత్త ఆవిష్కరణలు చేయడం గురించి విన్నాం. అవన్నీ పూర్తి స్థాయిలో ఫలవంతమయ్యేందుకు దేవుడు వైపు(ప్రకృతి వైపు) చూడక తప్పేది కాదు. ఆయన చేసిన సృష్టి అద్భుతమే ఓ గొప్ప మేథస్సు. దాని సాయంతోనే ఆవిష్కరణలు ఫలమంతమయ్యేవి. అలాంటి ఘటనే జపాన్ బుల్లెట్ రైలు విషయంలో చోటు చేసుకుంది. అదేంటంటే..జపాన్ శాస్త్రవేత్తలు సాంకేతికతో కూడిన అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైళ్లను రూపొందించారు. అవి ప్రజల దూరాలను దగ్గర చేసి సమయాన్ని ఆదా చేసేలా అత్యంత నాణ్యతతో రూపొందించారు. అయితే జపాన్లో రైలు మార్గం చాలా వరకు టన్నెళ్లతో కూడినది. దీంతో గంటక సుమారు 240 నుంచి 320 కిలోమీటర్లు దూరం ప్రయాణించే ఈ బల్లెట్ రైళ్లు ఈ టన్నెల్ గుండా వెళ్లగానే భారీ శబ్దాలు వచ్చేవి. ఎంతలా అంటే ఇవి దాదాపు 400 మీటర్లు దూరంలో ఉన్న నివాసితులకు వినిపించేంత పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేవి. దీంతో ఈ రైళ్లపై ఫిర్యాదులు రావడం మొదలయ్యింది. నిజంగానే ఆ శబ్దాలు భరిచలేనంత పెద్దగా వచ్చేవి. దీంతో శాస్త్రవేత్తలు ఈ సమస్యకు పరిష్కారం ఏంటని వెతకడం ప్రారంభించారు. పలు సమావేశాల్లో చర్చల్లో దీనికి పరిష్కారం ప్రకృతిని పరిశీలించే కనుగొనగలమని ఒక శాస్త్రవేత్త సూచించడంతో..ఈ బుల్లెట్ ట్రెయిన్ని ఆవిష్కరించిన ఇజీ నకాట్సు ఆ దిశగా ఆలోచించడం మొదలు పెట్టాడు. ఇక్కడ బుల్లెట్ రైలు అత్యంత వేగంతో టన్నెల్ గుండా వెళ్తుండటంతో దాని ముందున్న అట్మాస్పియరిక్ ప్రెజరే ఈ బారీ శబ్దానికి కారణమని గుర్తించాడు. ఇలా ఆకాశం నుంచి వేగవంతంగా పయనించి భూమ్మీదకు వచ్చే జీవి ఉందా అనే దిశగా ఆలోచించడం ప్రారంభించాడు. అప్పుడే కింగ్ ఫిషర్ బర్డ్ జ్ఞప్తికి వచ్చింది. అది ఆకాశ నంచి అత్యంత వేగంగా వచ్చి నీటిలోకి శబ్దం లేకుండా తల ముంచి చేపలను లటుక్కున పట్టుకునే తీరు నకాట్సని సరికొత్త ఆలోచనను రేకెత్తించింది. దాని ముక్కు అత్యంత సూదిగా పొడుగుగా ఉండటంతోనే కదా నీటిపై శబ్దం చేయకుండా లోపలకు ముంచి చేపను పట్టుకోగలుగుతుంది అని గుర్తించాడు. దీన్నే బుల్లెట్ రైలుకి అప్లైచేసి దాని రూపురేఖలు మార్పు చేస్తాడు. అనుహ్యాంగా అది టన్నెల్ గుండా వెళ్లినప్పుడూ ఎలాంటి శబ్ద కాలుష్యాన్ని సృష్టించకుండా నిశబ్దంగా వెళ్తుంది. ఈ కొత్త డిజైన్ శబ్దాన్ని తగ్గించడమే కాకుండా, రైళ్లను 15% వేగంగా, 15% శక్తిని ఆదాచేసేలా చేసింది. దేవుడి అద్భత సృష్టిని కాపీ కొట్టడం ద్వారా ఇది సాధ్యం అయ్యిందని ఆయన మేథస్సు ముందు మానవ మేథస్సు చిన్నదేనని నకాట్సు అన్నారు. Japan's famous bullet train used to make a loud boom when it travelled through tunnels. But, thanks to a spot of bird-watching, an engineer was able to fix the problem after he was inspired by a kingfisher.#biomimicry #designthinking #uxRead more at: https://t.co/MzROXEt3aV pic.twitter.com/2HZd9P8FIy— Black Bee (@BlackBeeCoIndia) June 27, 2021 (చదవండి: భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగేస్తున్నారా? నిపుణులు ఏమంటున్నారంటే..) -
ఆ పాత్రలో.. మెప్పించడానికి చాలానే కష్టపడింది!
శర్మిన్ సహగల్.. నెట్ఫ్లిక్స్లో ‘హీరామండీ’ సిరీస్ చూసినవాళ్లు ఇట్టే గుర్తుపట్టేస్తారు.. ‘ఆలమ్జేబ్’ అని! అవును.. ఆ పాత్రలో మెప్పించడానికి చాలానే కష్టపడింది శర్మిన్. అయినా నెపోటిజమ్ కామెంట్స్, విమర్శలను ఎదుర్కోక తప్పలేదు. నెపోటిజమ్ ఏంటీ? అని కనుబొమలు ముడిపడ్డాయా? అయితే వివరాలు తెలుసుకోవాల్సిందే!శర్మిన్ పుట్టిపెరిగింది ముంబైలో. అమ్మ .. బేలా సహగల్.. ఫిల్మ్ ఎడిటర్ అండ్ డైరెక్టర్. నాన్న.. దీపక్ సహగల్.. ఫిల్మ్ ప్రొడ్యూసర్. శర్మిన్ సినిమా నేపథ్యం తల్లిదండ్రులతో కాదు తాత మోహన్ సహగల్ (దీపక్ వాళ్ల నాన్న. రేఖను బాలీవుడ్కి పరిచయం చేసింది ఈయనే!), మేనమామ.. సంజయ్లీలా భన్సాలీతో మొదలైంది. భన్సాలీ చెల్లెలే శర్మిన్ వాళ్లమ్మ బేలా. ఇప్పుడర్థమైంది కదా శర్మిన్ విషయంలో నెపోటిజమ్ ప్రస్తావన ఎందుకు వచ్చిందో!తను ట్వల్త్ క్లాస్ వచ్చేవరకు డాక్టర్ కావాలనే కలలు కన్నది. ట్వల్త్ క్లాస్ సెలవుల్లో తన మేనమామ తీసిన ‘దేవ్దాస్’ సినిమాను చూసి షారూఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్, మాధురీ దీక్షిత్ల నటనకు, తన మేనమామ స్టయిల్ ఆఫ్ మూవీ మేకింగ్కి ఫిదా అయిపోయి యాక్టర్ కావాలని నిశ్చయించుకుంది.అసిస్టెంట్గా పనిచేస్తున్నప్పుడే శర్మిన్లో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ని గుర్తించాడు భన్సాలీ. అందుకే మంగేశ్ హదావ్లే దర్శకత్వంలో జావేద్ జాఫ్రీ కొడుకు మీజాన్ జాఫ్రీ, శర్మిన్లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ ‘మలాల్’ అనే సినిమాను నిర్మించాడు. అందులో శర్మిన్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత ‘అతిథి భూతో భవ’లోనూ నటించింది. పలువురి ప్రశంసలు అందుకుంది.న్యూయార్క్ వెళ్లి థియేటర్ అండ్ ఫిల్మ్ స్టడీస్లో డిగ్రీ చదివింది. తిరిగొచ్చి సంజయ్లీలా భన్సాలీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేరింది. అలా గోలియోంకీ రాస్లీలా రామ్లీలా, మేరీ కోమ్, బాజీరావ్ మస్తానీ, గంగూబాయి కాఠియావాడీ సినిమాలకు పనిచేసింది.‘హీరామండీ’తో వెబ్ ప్రయాణం మొదలుపెట్టింది. మనీషా కోయిరాలా, సొనాక్షీ సిన్హా, రిచా చడ్డా, అదితీ రావ్ హైదరీ, ఫరీదా జలాల్ వంటి ఉద్దండులతో కలసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అందుకే ‘ఆలమ్జేబ్’గా ఆమె నుంచి మరింత పెర్ఫార్మెన్స్ని ఆశించారు ప్రేక్షకులు. సీనియర్స్ ముందు శర్మిన్ తేలిపోయిందని నిరాశచెందారు. అయితే ఆ విమర్శలను పాజిటివ్గానే తీసుకుని తన ప్రతిభను మరింత మెరుగుపరచుకుంటుందని ఆమె అభిమానుల అభిప్రాయం.సంజయ్లీలా భన్సాలీని నేను మామయ్య అని పిలవను. సర్ అనే పిలుస్తాను. దేవ్దాస్ సినిమా చూస్తే కానీ ఆయన టాలెంట్ ఏంటో తెలీలేదు. ఆ టాలెంటే నేను ఆయన్ని‘ సర్’ అని పిలిచేలా చేస్తోంది. ఆ లెజెండ్ నాకు మామయ్య అవడం నా అదృష్టం! – శర్మిన్ సహగల్ -
నేచురల్గానే వచ్చింది! జాగ్రత్తలు ఎలా?
నాకు 42 ఏళ్లు. ప్రెగ్నెంట్ని. మూడో నెల. పిల్లల కోసం కొన్నేళ్లు ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు నేచ్యురల్గానే వచ్చింది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలరు. – ఆకునూరి శైలజ, వైరాఈరోజుల్లో చాలామంది 35 ఏళ్ల తర్వాతే గర్భం దాలుస్తున్నారు. 40 ఏళ్లు దాటినా ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టే అవకాశాలున్నాయి. పౌష్టికాహారం, క్రమం తప్పని వ్యాయామం, సరైన మందులు, చెకప్స్ ఉండాలి. పాజిటివ్గా ఉండాలి. హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ని డీల్ చేసే ఆసుపత్రిలో చూపించుకోవాలి. ఇప్పుడు అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ద్వారా 40 ఏళ్లు దాటిన వాళ్లకు కూడా ఐవీఎఫ్ ద్వారా పిల్లలు కలుగుతున్నారు. అయితే ఈ వయసులో గర్భం దాల్చినవాళ్లకు బీపీ, సుగర్, థైరాయిడ్ సమస్యలు ఎక్కువ రావచ్చు.బిడ్డకీ జన్యుపరమైన సమస్యలు, బరువు తక్కువగా ఉండటం, నెలలు నిండకముందే ప్రసవించడం వంటి చాన్సెస్ పెరగొచ్చు. అయితే కరెక్ట్ డయాగ్నసిస్, ట్రీట్మెంట్తో వీటిని మేనేజ్ చేయవచ్చు. ఇది తొలి చూలు అయితే ఆరోగ్య సమస్యలు వచ్చే రిస్క్ తక్కువుంటుంది. మలి చూలు అయి.. ఇంతకుముందు ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ లేదా గర్భస్రావం అయినా.. 40 ఏళ్ల తర్వాత ఇంకా రిస్క్ పెరుగుతుంది. జెస్టేషనల్ డయాబెటిస్ అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే సుగర్ వ్యాధి రిస్క్ నాలుగు రెట్లు ఎక్కువ. అందుకే ప్రతి చెకప్లో యూరిన్లో సుగర్ టెస్ట్ చేస్తారు. ఒకవేళ యూరిన్లో సుగర్ నిర్ధారణ అయితే అప్పుడు బ్లడ్ సుగర్ టెస్ట్ చేస్తారు. డయాబెటాలజిస్ట్, డైటీషియన్ కన్సల్టేషన్తో మేనేజ్ చేస్తారు.సుగర్ కంట్రోల్ కానప్పుడు మాత్రమే తల్లికి, బిడ్డకి కాంప్లికేషన్స్ వస్తాయి. రెగ్యులర్గా బిడ్డ ఎదుగుదలను చెక్ చేస్తే స్కాన్స్ని రిఫర్ చేస్తారు. అయితే 40 ఏళ్లు దాటిన గర్భిణీల్లో అయిదవ నెల లోపు గర్భస్రావం అయ్యే రిస్క్ ఎక్కువ. అందుకే 3 నుంచి 5 నెలల్లో డాక్టర్ సూచించిన మందులను తప్పకుండా వాడాలి. శారీరకంగా ఎక్కువ శ్రమ లేకుండా చూసుకోవాలి. 7 వ నెల నుంచి ప్రతి రెండు వారాలకు ఒకసారి చెకప్కి వెళ్లాలి. బిడ్డ కదలికలను ఎలా ట్రాక్ చేయాలో వివరిస్తారు. కదలికలు తక్కువగా అనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి.తొమ్మిదవ నెల నిండుతున్నప్పుడు ప్రసవానికి ప్లాన్ చేస్తారు. సిజేరియన్ డెలివరీ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. బిడ్డ బరువు, తల్లి ఆరోగ్యపరిస్థితిని బట్టి డెలివరీ ప్లాన్ చేస్తారు. బీపీ, సుగర్ ఉన్నవారిలో ప్రసవం తర్వాత బ్లీడింగ్ ఎక్కువ ఉండొచ్చు. దానికి సిద్ధపడే మందులు ఇస్తారు. ప్రెగ్నెన్సీ, ప్రసవం.. ఆరోగ్యంగా.. సుఖంగా జరిగిపోవడానికి బరువును నియంత్రణలో పెట్టుకోవాలి.సమతుల, పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. జంక్, ప్రాసెస్డ్ ఫుడ్ జోలికి వెళ్లకూడదు. నిపుణుల పర్యవేక్షణలో యోగా, వ్యాయామం వంటివి చేయాలి. కాఫీ, ఆల్కహాల్ వంటివి మానెయ్యాలి. ఇన్ఫెక్షన్స్ సోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫీటల్ మెడిసిన్ కన్సల్టెంట్తో క్రమం తప్పకుండా మూడవ నెల, అయిదవ నెలల్లో స్కాన్స్ చేయించుకోవాలి. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తే ప్రెగ్నెన్సీ రిస్క్ని తగ్గించవచ్చు.– డా. భావన కాసు, గైనకాలజిస్ట్ & ఆబ్స్టేట్రీషియన్, హైదరాబాద్
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
● జిల్లాలో వరుస చోరీలు ● తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ ● ఆందోళన చెందుతున్న ప్రజలు ● నిఘా పెంచిన పోలీసులు
వసతులు కల్పించాలని హిందూవాహిని వినతి
ఏటా రెండులారీల కోడి ఎరువు
సేంద్రియ ఎరువులకు డిమాండ్
ప్యాసింజర్ రైళ్లు.. నిర్లక్ష్యం ఎన్నేళ్లు?
‘బీజేపీపై బురదజల్లే ప్రయత్నం’
జీవన సాఫల్య పురస్కారం అందుకున్న ‘నలిమెల’
పత్తి విత్తనం.. ధరలకేదీ కళ్లెం?
రైతులకు జీలుగ విత్తనాల కష్టాలు
వామ్మో.. హోటల్ ఫుడ్
తప్పక చదవండి
- 13 నిమిషాలు యథాతథం
- Cyclone Remal: ‘రెమాల్’తో బెంగాల్ అతలాకుతలం
- ఎన్నికలు ముగియగానే కాశ్మీర్కు.. అమిత్ షా కీలక ప్రకటన
- టీమిండియా హెడ్ కోచ్గా గౌతం గంభీర్.. కానీ ఒకే ఒక కండీషన్!?
- జూన్లో బ్యాంకులు పని చేసేది ఎన్ని రోజులంటే..
- హైదరాబాద్లో లగ్జరీ ప్రాపర్టీలు కొన్న నీలిమా దివి..
- చంపుతామని బెదిరిస్తున్నారు: స్వాతిమలివాల్
- ఆ నలుగురికి చివరికి మిగిలిందేంటి?
- ఇంట్లో ఆంక్షలు? ఎవరు స్ట్రిక్ట్? సితార ఫన్నీ ఆన్సర్స్
- ఆమె క్రికెటర్స్ పాలిట దేవత..1983 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టు కోసం..
Advertisement