-
బలమైన శక్తిగా కమ్యూనిస్టులు
నెహ్రూసెంటర్: రానున్న రోజుల్లో బలమైన శక్తిగా కమ్యూనిస్టులు ఎదగనున్నారని, మేధావులు, కమ్యూనిస్టులు దేశానికి అవసరమని ప్రజలు భావిస్తున్నారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జి.నాగయ్య అన్నారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం సీపీఎం జిల్లా విస్తృతస్థాయి సమావేశం గునిగంటి రాజన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నాగయ్య మాట్లాడుతూ.. వామపక్ష పార్టీలు ఎంపీ స్థానాలు గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నాయని, దానికి అనుగుణంగా సీపీఎం శ్రేణులు ప్రజా సమస్యలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. బీజేపీ కలలు కన్నట్లు తెలంగాణలో ఎంపీ స్థానాలు పెరిగే అవకాశం లేదని, హిందూముస్లింలను రెచ్చగొట్టి ఓట్లు పొందాలని బీజేపీ యత్నించిందన్నారు. అయినప్పటికీ ప్రజలు కాంగ్రెస్కు మద్దతు తెలపడంతో ఇండియా కూటమి గెలవడం ఖాయమన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ ఇంకా బలహీనపడే అవకాశం ఉందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యావంతులు, మేధావులు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో వామపక్షాలు బలపర్చిన కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించాలని కోరారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆకుల రాజు, సూర్నపు సోమయ్య, అల్వాల వీరయ్య, జిల్లా కమిటీ సభ్యులు సమ్మెట రాజమౌళి, బానోత్ సీతారాంనాయక్, దుడ్డెల రాంమూర్తి, కుర్ర మహేష్, మండల రాజన్న, గునిగంటి మోహన్, బానోత్ హరినాయక్, వివిధ మండలాల కార్యదర్శులు పాల్గొన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు జి.నాగయ్య -
మున్నేరు చెత్తమయం..
డోర్నకల్: డోర్నకల్ సమీపంలోని మున్నేరువాగు పరిసరాలు చెత్త, వ్యర్థాలతో కలుషితమవుతున్నాయి. వాగుకు ఒక వైపు డోర్నకల్, మరోవైపు చాప్లాతండా గ్రామ పంచాయతీ ఉంది. చాప్లాతండా వైపు వాగు ఒడ్డున చాప్లాతండా జీపీ డంపింగ్యార్డు, శ్మశానవాటిక ఏర్పాటు చేశారు. గత వానా కాలం మున్నేరువాగుకు భారీ వరద పోటెత్తడంతో డంపింగ్ యార్డుతో పాటు శ్మశానవాటిక అడుగు భాగం వరదలో కొట్టుకుపోయి రాళ్లు తేలి నడవడానికి వీలు లేకుండా మారింది. కాగా చాప్లాతండాకు డంపింగ్ యార్డు సౌకర్యం లేకపోవడంతో ప్రతీ రోజు జీపీ నుంచి సేకరించిన చెత్తను మున్నేరువాగు పరీవాహక ప్రాంతంలో డంప్ చేస్తున్నారు. వాగు ఒడ్డున పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చెత్త, వ్యర్థాలు పేరుకుపోయి తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. ఈ వ్యర్థ్యాలతో నీరు కలుషితమవుతోంది. కోళ్ల వ్యర్థాలు.. డోర్నకల్తో పాటు చుట్టు పక్కల గ్రామాల్లో చికెన్ షాపుల నిర్వాహకులు కోళ్ల వ్యర్థాలను మున్నేరు వాగులో పడేస్తుండడంతో నీటితో పాటు పరిసరాలు కలుషితమవుతున్నాయి. డోర్నకల్ పరిధిలో వాగు ఒడ్డున శ్మశానవాటిక ఉండటంతో నిత్యం అంత్యక్రియలు, కర్మకాండలు నిర్వహించి శుభ్రపర్చకపోవడంతో ప్లాస్టిక్ వ్యర్థాలు, మద్యం సీసాలు పెద్ద మొత్తంలో పేరుకుపోయాయి. మున్నేరువాగుకు ఇరువైపులా చెత్త, వ్యర్థాలు, ప్లాస్టిక్ వస్తువులు, మద్యం సీసాలు పడేస్తుండటంతో ఈ ప్రాంతానికి వచ్చేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి వాగు ఇరుపక్కల పరిసరాలు శుభ్రం చేయించాలని, చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వాగులో గ్రామపంచాయతీ చెత్త, వ్యర్థాలు కలుషితమవుతున్న పరిసరాలు -
అనుమతులు రద్దు చేశాం
మహబూబాబాద్: గ్రీన్ల్యాండ్లో ఇచ్చిన గృహ అనుమతులను రద్దు చేశామని టీపీఎస్ ప్రవీణ్ పేర్కొన్నారు. మానుకోట మున్సిపాలిటీ 34 వార్డు పరిధిలో కబ్జా చేసిన గ్రీన్ల్యాండ్కు గృహ నిర్మాణ అనుమతులు ఇచ్చారు. ఈవిషయంపై ఈనెల 26న ‘గ్రీన్ల్యాండ్ల కబ్జా’ అనే శీర్షికన సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి టీపీఎస్ ప్రవీణ్ స్పందించారు. ఈమేరకు కబ్జాకు గురైన గ్రీన్ల్యాండ్ స్థలంలో కమిషనర్ పేరుతో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా టీపీఎస్ ప్రవీణ్ మాట్లాడుతూ.. గ్రీన్ ల్యాండ్లలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దన్నారు. గ్రీన్ల్యాండ్లో గృహ నిర్మాణ అనుమతులు ఇచ్చి అధికారులు పెద్ద పొరపాటు చేశారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. గ్రీన్ల్యాండ్ల పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు చేపడుతామన్నారు. 34 వార్డులో గ్రీన్ ల్యాండ్ కబ్జా చేసిన వ్యక్తిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రీన్ల్యాండ్లో గృహ నిర్మాణ అనుమతుల విషయంలో సంబంధిత ఉన్నతాధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన్నట్లు సమాచారం. కాగా సాక్షి కథనంతో అధికారులు స్పందిచంచి గ్రీన్ల్యాండ్లో బోర్డు ఏర్పాటు చేయడంతో ఆ వార్డు ప్రజలు సాక్షికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పాకాలలోకి దిగితే కష్టాలే.. ఖానాపురం: వరంగల్ జిల్లాలో పర్యాటక ప్రాంతమైన పాకాల అందాలను వీక్షించడానికి పర్యాటకులు భారీగా వస్తారు. కానీ, ఆదమరిచి సరస్సులోకి దిగితే కష్టాలు కొని తెచ్చుకున్నట్లేనని ఫారెస్ట్ సిబ్బంది చెబుతున్నారు. పాకాల సరస్సులో భారీ మొసళ్లు ఉన్నాయని, సరస్సులోకి ఎవరూ దిగొద్దని అధికారులు హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేశారు. కాగా, ఆదివారం ఒడ్డుపైకి పెద్ద మొసలి రావడంతో పలువురు ఆసక్తిగా తిలకించారు.● టీపీఎస్ ప్రవీణ్ ● గ్రీన్ల్యాండ్ స్థలంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు -
‘బెల్టు’ దందా..
అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం రెండు నెలల నుంచి బీర్ల సప్లయ్ తగ్గింది. అంతేకాని వైన్స్షాపుల యజమానులు కృత్రిమ కొరత సృష్టించడం లేదు. అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం ఇస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. బెల్టుషాపుల్లో పాత సరుకు ఉండవచ్చు. వేసవి కాలం కావడంతో బీర్లకు డిమాండ్ పెరగడంతో దొరకడం లేదు. – బి.కిరణ్, జిల్లా ఎకై ్సజ్శాఖ అధికారి మహబూబాబాద్ రూరల్: జిల్లాలో బెల్టుషాపుల్లో జోరుగా మద్యం విక్రయిస్తున్నారు. వైన్స్షాపుల నిర్వాహకులు కృత్రిమ కొరత సృష్టిస్తూ బీర్లు లేవని నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు. తీరా చూస్తే బెల్టుషాపుల్లో అధిక ధరకు అవే బీర్లు లభ్యమవుతున్నాయి. ఇలా మద్యం ప్రియుల నుంచి అధికంగా వసూలు చేస్తూ వారి జేబులకు చిల్లు పెడుతున్నారు. కాగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేపథ్యంలో వైన్స్షాపులు మూసివేయడంతో బెల్టుషాపుల నిర్వాహకులు ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. బెల్టుషాపులకు తరలుతున్న మద్యం.. వైన్స్షాపుల్లో లేవంటున్న పలు రకాల బీర్లు బెల్టుషాపుల్లో అమ్మకాలు చేస్తున్నారు. కాగా మద్యం షాపుల నిర్వాహకులు వచ్చిన స్టాక్ను బెల్టుషాపులకు తరలిస్తున్నట్లు తెలుస్తుంది. ఒక్కో బీరుపై రూ.30వరకు అదనంగా తీసుకుంటూ బెల్టుషాపులకు ఇవ్వగా.. వారు మరో రూ.30 అదనంగా తీసుకుని రూ. 210నుంచి రూ. 220 వరకు విక్రయిస్తున్నారు. బీర్లతో పాటు మద్యంపై కూడా అధికంగా వసూలు చేస్తున్నారు. అంతా సిండికేటే.. జిల్లాలో ఉన్న మద్యం దుకాణాలు సిండికేట్గా మారి వచ్చిన స్టాక్ను బెల్టుషాపులకు తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైన్స్లలో దొరకని సరుకు బెల్టుషాపుల్లో దొరకడం చూస్తుంటే వైన్స్షాపుల యజమానులు, బెల్టుషాపుల నిర్వాహకులు సాగిస్తున్న వ్యాపారం మూడుపువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోంది. అంతా మా ఇష్టమనే విధంగా వ్యవహరించడం వారికి పరిపాటిగా మారింది. చోద్యం చూస్తున్న అధికారులు... జిల్లా వ్యాప్తంగా నిబంధనలు అతిక్రమించి మద్యం విచ్చలవిడిగా విక్రయించడంతో పాటు అధిక ధరలకు అమ్ముతున్నప్పటికీ ఎకై ్సజ్శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అధిక ధరలకు మద్యం విక్రయిస్తే తమ దృష్టికి తేవాలని పేర్కొంటున్నప్పటికీ ఈ తతంగం అంతా వారి కనుసన్నల్లోనే జరుగుతుందని తెలుస్తుంది. పల్లెలు, పట్టణ పరిసర ప్రాంతాల్లో విచ్చలవిడిగా బెల్టుదందా నడుస్తున్నప్పటికీ ఎకై ్సజ్శాఖ అధికారులు మాత్రం ఎక్కడ కూడా దాడులు నిర్వహించకపోవడం ఏమిటని విమర్శలకు తావిస్తుంది. బెల్టుషాపుల్లో అధిక ధరలకు మద్యం విక్రయాలు మందుబాబుల జేబులకు చిల్లు అంతా సిండికేట్.. పట్టించుకోని ఎకై ్సజ్శాఖ అధికారులు -
బాలిక కిడ్నాప్ కేసులో ఇద్దరి అరెస్ట్
పరకాల: పెళ్లి పేరుతో బాలికను కిడ్నాప్ చేసి కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఆదివారం పరకాల పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ డి.రవిరాజ్.. కేసు వివరాలు వెల్లడించారు. చిట్యాల మండలం చల్లగరిగె గ్రామంలో ఆన్లైన్ సెంటర్ నడుపుతున్న యువకుడు బండి దీక్షిత్.. నడికూడ మండలం పులిగిల్లకు చెందిన సంఘ కుమారస్వామి ఆటోలో ఈ నెల 23న ఇదే గ్రామానికి(పులిగిల్ల)చెందిన ఓ బాలికను పెళ్లి పేరుతో కిడ్నాప్ చేశారు. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో అదే ఆటోలో మూడు రోజుల తర్వాత పరకాలకు వస్తుండగా అంబేడ్కర్ జంక్షన్ వద్ద పోలీసులు పట్టుకున్నారు. పెళ్లి కోసం కిడ్నాప్ చేసింది వాస్తవమేనని నిందితులు ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ రవిరాజ్ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై రమేష్, సిబ్బంది పాల్గొన్నారు. -
దొంగల ముఠా అరెస్ట్..
హసన్పర్తి : పగలు రెక్కీ..అర్ధరాత్రి చోరీలకు పాల్ప డుతున్న ఓ దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎర్రగట్టుగుట్ట ప్రాంతంలో వాహనాల తనిఖీ సందర్భంగా ఓ ఆటో.. పోలీసులను చూసి ఆపకుండా ముందుకు సాగింది. దీంతో వెంబడించి ఆటోను పట్టుకుని విచారించగా ఆ ముఠా తమ నేరం ఒప్పుకుంది. ఆదివారం హసన్పర్తి పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సురేశ్ వివరాలు వెల్లడించారు. పాలకుర్తికి చెందిన సొలోంకి రాజారాం, హైదరాబాద్లోని చంద్రాయణగుట్ట బాబానగర్కు చెందిన సొలోంకి రాజు స్నేహితులు. కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు. ఈ క్రమంలో జల్సాలకు అలవాటు పడిన వీరు కూలీ డబ్బులు సరిపడకపోవడంతో చోరీలు చేయడం ప్రారంభించారు. ఇందులో భాగంగా తాళం వేసి ఉన్న ఇళ్లే టార్గెట్గా అర్ధరాత్రి చోరీలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో హసన్పర్తి, ఎల్క తుర్తి మండలాల్లోని పలు ప్రాంతాల్లో చోరీకి పాల్ప డ్డారు. నిందితుల నుంచి రూ.5.60 లక్షల విలువైన బంగారం, రూ. 20 వేల విలువైన వెండి, రూ.30 వేల విలువైన ఎల్ఈడీ టీవీ, రూ.4.80 లక్షల విలువైన 32 స్మార్ట్ ఫోన్లు మొత్తం రూ.10. 90 లక్షల విలువైన సొత్తు స్వాఽధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు. కాగా, గ్రామాల్లో ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ సూచించారు. ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. రూ.10.90 లక్షల విలువైన సొత్తు స్వాధీనం వివరాలు వెల్లడించిన సీఐ సురేశ్ -
విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై కేసు
గార్ల: పోలీసులను దుర్బాషలాడి, వారి విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తిపై కేసు నమోదైంది. ఎస్సై జీనత్కుమార్ కథనం ప్రకారం.. గార్ల మండలం అంజనాపురం గ్రామానికి చెందిన గుగులోత్ మధు.. మద్యం సేవించి తండ్రి ధర్మపై గొడవ పడ్డాడు. కుమారుడి వేధింపులు తాళలేక తండ్రి 100కు డయల్ చేశాడు. దీంతో పోలీసు సిబ్బంది సిరాజ్పాషా, శ్రీను, ప్రసాద్.. అంజనాపురం వెళ్లారు. తండ్రితోని ఎందుకు గొడవ పడుతున్నావని మధును మందలించారు. దీంతో మద్యం మత్తులో ఉన్న మధు.. పోలీసులపై తిరగబడడమే కాకుండా దుర్బాషలాడారు. పోలీస్ వాహనాన్ని గంటపాటు అడ్డుకున్నాడు. ఈ ఘటనపై కానిస్టేబుల్ సిరాజ్పాషా ఫిర్యాదు మేరకు మధుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆదివారం వెల్లడించారు. సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి ● మావోయిస్టు సింగరేణి కోల్బెల్ట్ కమిటీ కార్యదర్శి లేఖ భూపాలపల్లి అర్బన్ : సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారంపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతూ మావోయిస్టు సింగరేణి కోల్బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ ఆదివారం లేఖ విడుదల చేశారు. సింగరేణి ప్రైవేటీకరించకుండా చర్యలు తీసుకోవాలని, విద్యుత్ సంస్థల నుంచి సింగరేణికి రావాల్సిన బకాయిలు విడుదల చేయాలని, ఓపెన్ కాస్టులను రద్దు చేసి భూగర్భ గనుల ద్వారానే బొగ్గు ఉత్పత్తి చేయాలని కోరారు. కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి ఉద్యోగావకాశాలు కల్పించాలని, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించి డిస్మిస్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలన్నారు. కార్మికులకు ఆదాయ పన్ను రద్దు చేసి వారి పిల్లల కోసం సింగరేణి పాఠశాలలు అభివృద్ధి చేసి ప్రత్యేక యూనివర్సిటీలు ఏర్పాటు చేయాలన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగానే కాంగ్రెస్ వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. చిందేసిన ఎస్పీ భూపాలపల్లి అర్బన్: లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో శనివారం రాత్రి ఎస్పీ కిరణ్ఖరే ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బంది ఆత్మీయ విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ విందులో పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి సినిమా పాటలకు ఎస్పీ నృత్యం చేశారు. -
ప్రేమ పేరుతో మోసం.. యువకుడి ఆత్మహత్య
కాజీపేట : ప్రేమ పేరుతో యువతి మోసం చేసిందనే మనస్తాపంతో ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నల్లగొండ సమీపంలో చోటు చేసుకుంది. మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. కాజీపేట మండలం సోమిడికి చెందిన మంతుర్తి రమేశ్, రాజమ్మ దంపతుల కుమారుడు రాజ్కుమార్ (28) దాదాపు ఏడేళ్లుగా హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. పనిచేసే చోట పరిచమైన ఓ యువతితో కొద్దికాలంగా చనువుగా ఉంటున్నాడు. సూర్యాపేట జిల్లాకు చెందిన సదరు యువతి కుటుంబీకులకు ఇటీవల వీరి ప్రేమ విషయం తెలియడంతో రాజ్కుమార్ను హెచ్చరించారు. దీంతో రాజ్కుమార్ ఎదురు తిరగడంతో యువతి బంధువులు సూర్యాపేట పీఎస్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రేమించిన యువతి.. కుటుంబీకుల ఒత్తిడికి తలొగ్గి ఎదురు తిరుగడం, బంధువులు చంపేస్తామంటూ బెది రించడంతో రాజ్కుమార్ మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఏడేళ్లుగా సాగిన ప్రేమాయణం.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను వివరిస్తూ సెల్ఫీ వీడియోను రికార్డు చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బంధు, మిత్రులకు పంపించాడు. వెంటనే అప్రమత్తమైన సన్నిహితులు రాజ్కుమార్ను వెతకడానికి ప్రయత్నించగా సూర్యాపేటలో చిక్కాడు. ఎంత నచ్చ చెప్పినా వినకుండా తనకు ఆత్మహత్యే శరణ్యమని చెప్పి పరారయ్యాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం నల్లగొండ సమీపంలో గుర్తుతెలియని రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడిన విషయం వెలుగు చూసింది. యువతి కుటుంబీకుల బెదిరింపుల వల్లే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతుడి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. కాగా, చెట్టంత ఎదిగిన కుమారుడు ప్రేమ కోసం బలయ్యాడని, తనను బెదిరించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు కోరారు. సోమిడిలో విషాదఛాయలు -
యథేచ్ఛగా రియల్ దందా..
హసన్పర్తి : భూముల ధరలు పెరగడంతో రియల్ వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతూ అమాయకులను నట్టెట ముంచుతున్నారు. అధికారులను మచ్చిక చేసుకుని నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు చేస్తున్నారు. ఆ వెంచర్లల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా లక్షలాది రూపాయల లాభాలు పొందుతున్నారు. ఎక్కువ శాతం గ్రామాల్లోనే ఈ వ్యాపారం సాగుతోంది. నివేశిత స్థలాలుగా వ్యవసాయ భూములు.. హసన్పర్తి మండలంలోని పలు గ్రామాల్లో వ్యవసాయ భూములు నివేశిత స్థలాలుగా మారుతున్నాయి. కార్పొరేషన్లో విలీనమైన గ్రామాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా మండలంలోని మడిపల్లి, జయగిరి, గంటూరుపల్లి, పెంబర్తి, నాగారం, బైరాన్పల్లి, సిద్ధాపురంతో పాటు విలీన గ్రామాలు హసన్పర్తి, దేవన్ననపేట, చింతగట్టు, మునిపల్లి, భీమారం, పెగడపల్లి, పలివేల్పుల, వంగపహాడ్, ఆరెపల్లి, పైడిపల్లి, కొత్తపేట, ఉనికిచర్ల, ముచ్చర్ల, కోమటిపల్లి, ఎల్లాపురం గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం యథేచ్ఛగా సాగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడపడితే అక్కడే వెంచర్లు వెలుస్తున్నాయి. అధికారులకు కూడా వాటాలు? హసన్పర్తి మండలంలో నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు వెలుస్తున్నాయి. ఈ వ్యవహారంలో అధికారులకు కూడా వాటాలు ముట్టుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్ని గ్రామాల్లో అఽధికారులు వెంచర్లలో భాగస్వాములుగా ఉన్నట్లు స్థానికంగా చర్చ సాగుతోంది. అందినకాడికి దండుకుంటున్న వ్యాపారులు అక్రమ లేఔట్లతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. నిబంధనల మేరకు వెంచర్లు చేయాలంటే అనుమతి తప్పని. అయితే ఇందులో మార్కెట్ ధరకనుగుణంగా గజానికి కొంత మేరకు ప్రభుత్వ ఖజానాలో డబ్బు జమా చేయాల్సి ఉంటోంది. దీంతో పాటు 20శాతం మేరకు భూమిని ‘కుడా’కు తనఖా పెట్టాలనే నిబంధన ఉంది. దీంతో నిబంధనల ప్రకారం వెంచర్ చేపడితే ఈతతంగం ఉంటుందని భావిస్తున్న రియల్ వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. అక్రమంగా వెంచర్లు వేస్తూ అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, ఈ విషయంలో మండల పంచాయతీ అధికారి రవిబాబును అడగగా, రియల్ వ్యాపారులు అక్రమంగా హద్దులు పాతుతే వాటిని తొలగించే బాధ్యత ‘కుడా’అధికారులదేనన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు నివేశిత స్థలాలుగా వ్యవసాయ భూములు ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పట్టించుకోని అధికారులు -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
చిల్పూరు: రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని మండలంలోని వంగాలపల్లిలో జరిగింది. ఘట నకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నా యి. గ్రామానికి చెందిన చింత కరుణాకర్ (38) ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం మామిడి కాయలు తీసుకొస్తానంటూ ఇంటి నుంచి వెళ్లాడు. గ్రామ సమీపంలో పట్టాలు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతుడికి భార్య నిరీష, ఇద్దురు పిల్లలు ఉన్నారు. రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని మరో వ్యక్తి.. కాశిబుగ్గ/కేసముద్రం: రైలునుంచి జారి పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఘటన కేసముద్రం – తాళ్లపూసలపల్లి రైల్వే స్టేషన్ల మధ్య రంగాపురం రైల్వే గేటు సమీపంలో ఆదివారం జరిగింది. జీఆర్పీ సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం 40 – 45 ఏళ్ల వయసు గల వ్యక్తి ఎడమ చేతిపై నాన్న అని, కుడి చేతిపై అమ్మ అని పచ్చబొట్టు ఉందని తెలిపారు. ఆ మృతదేహాన్ని వరంగల్ ఎంజీఎం మార్చురీలో భద్రపరిచినట్లు వివరించారు. మృతుడి వివరాలకు 97017 47014, 87126 58585 నంబర్లలో సంప్రదించాలని జీఆర్పీ సీఐ నరేష్ కోరారు. -
తల్లిని పోషించే విషయంలో ఘర్షణ
మహబూబాబాద్ రూరల్ : తల్లిని పోషించే విషయంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో అన్నపై తమ్ముడు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం మహబూబాబాద్ మండలం వేమునూరులో చోటుచేసుకుంది. బాధితుడు డొంకెని వెంకన్న కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన డొంకెని పిచ్చమ్మకు ఇద్దరు కుమారులు వెంకన్న, రమేశ్ ఉన్నారు. కొంతకాలం నుంచి పిచ్చమ్మ తన చిన్న కుమారుడు రమేశ్ ఇంటివద్ద ఉంటుంది. ఈ క్రమంలో తనకు అన్నం పెట్టడంలేదని తల్లి.. రమేశ్ ఇంటి ఎదుట కూర్చుంది. ఈ విషయం తెలుసుకున్న పెద్ద కుమారుడు వెంకన్న తల్లి వద్దకు వెళ్లి అన్నం ఎందుకు పెట్టడలేదని అడుగుదాం రమ్మని తమ్ముడి వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో అన్నదమ్ముల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఇందులో వెంకన్నపై తమ్ముడు రమేశ్, తన కుటుంబీకులు దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో వెంకన్నకు తీవ్రగాయాలుకాగా ప్రభుత్వ ఆసుపత్రికి తలించారు. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు రూరల్ బ్లూకోల్ట్స్ పీసీలు సోమమల్లు, హుస్సేన్ ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. అన్నపై తమ్ముడి దాడి వేమునూరులో ఘటన -
అదుపు తప్పి ఆటో బోల్తా..
జఫర్గఢ్: అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. ఈప్రమాదంలో దంపతులు మృతి చెందగా ముగ్గురు స్వల్ప ంగా గాయపడ్డారు. ఈ ఘటన ఆదివారం మండలంలోని సూరారంలో చోటు చేసుకుంది. ఎస్సై రవియాదవ్ కథనం ప్రకారం.. స్టేషన్ఘన్పూర్ మండలం శివునిపల్లికి చెందిన ఎండీ యాకూబ్ (80), అమీనబీ (70) దంపతులు ముగ్గురు బంధువులతో కలిసి సూరారంలో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఆటోలో బయలుదేరారు. తీగారం మీదుగా సూరారం వస్తుండగా ఇదే గ్రామ శివారులో కల్వర్టు వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో యాకూబ్, అమీనబీ దంపతులు తీవ్రంగా గాయపడగా ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న బంధువులు, స్థానికులు.. యాకూబ్, అమీనబీ దంపతులను వరంగల్ ఎంజీఎం తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవియాదవ్ తెలిపారు. ● దంపతుల మృతి ● ముగ్గురికి స్వల్ప గాయాలు -
కురవి సొసైటీ చైర్మన్పై దాడి
కురవి: కురవి సొసైటీ చైర్మన్ దొడ్డ గోవర్ధన్రెడ్డిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం మండలంలోని నేరడలో జరిగింది. నేరడ గ్రామంలో గౌడ కులస్తుల ఆరాధ్యదైవం కాటమయ్య పండుగ జరిగింది. ఈ పండుగకు ఓ వ్యక్తి.. కురవి సొసైటీ చైర్మన్ దొడ్డ గోవర్ధన్రెడ్డితోపాటు అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులను పిలిచాడు. అక్కడ చైర్మన్, వేరే వ్యక్తులకు స్వల్పంగా మాటమాట పెరిగింది. భోజనాల అనంతరం చైర్మన్ తన పామాయిల్ తోట వద్దకు వెళ్లాడు. ఈ క్రమంలో ఇరుగు వెంకన్న, వంశీ, గోపితోపాటు మరికొందరు వ్యక్తులు చైర్మన్ గోవర్ధన్రెడ్డి తోట వద్దకు వెళ్లి గొడవకు దిగి అతడిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై చైర్మన్ గోవర్ధన్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అలాగే, చైర్మన్పై వెంకన్న తదితరులు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలు ఫిర్యాదులు చేసుకున్నాయి. ఈ విషయంపై ఎస్సై గోపిని వివరణ కోరగా నేరడకు చెందిన ఘర్షణపై రెండువర్గాలకు చెందిన వ్యక్తులు ఫిర్యాదులు చేశారని, విచారణ చేసి కేసులు నమోదు చేస్తామన్నారు. -
ప్రేమ విఫలమై.. మనసు ముక్కలై..
కొత్త కారణం.. అప్పుల బాధ తట్టుకోలేక.. ఇంటి బాధ్యతలు మోయలేక, ఆర్థిక సమస్యలు పరిష్కరించలేక ఇన్నాళ్లూ ఆత్యహత్యలు చేసుకోవడం చూశాం. కానీ ప్రస్తుతం చావుకు కొత్త కారణం వెలుగుచూస్తోంది. అదే ప్రేమ. కనిపెంచిన తల్లిదండ్రులు, కనిపెట్టుకుని ఉండే స్నేహితులను కూడా కాదని ప్రేమ కోసం విలువైన జీవితం బలి పెడుతున్నారు. వయసుతో పాటు వచ్చే ఆకర్షణను అర్థం చేసుకోలేక.. మితిమీరిన ఆలోచనలతో జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ముఖ్యంగా నేటి యువతపై సినిమా తీవ్ర ప్రభావం చూపుతోంది. హీరో, హీరోయిన్లను అనుకరించడంతో పాటు ఆ పాత్రలను అనుసరించడంతో సమస్యలు వస్తున్నాయి. జీవితం విలువ తెలుసుకోలేక.. కౌమార దశలో ఉన్న యువత ప్రేమ, ఆకర్షణకు తేడా తెలుసుకోలేకపోతున్నారు. వయసుతో పాటు సహజంగా వచ్చే మార్పులకు మితిమీరిన ఆలోచనలు తోడు కావడంతో వీరు పెడదారిన పడుతున్నారు. దీనికి తోడు ఇంటి వద్ద, విద్యాలయాల్లో ఒత్తిడి కూడా వీరిని చిత్తు చేస్తోంది. యుక్త వయసులోకి అడుగుపెట్టడంతో పాటు జల్సాల వైపు దృష్టి పెట్టడం.. ఖాళీ సమయాల్లో సినిమాలకు వెళ్లడం.. తల్లిదండ్రుల సావాసం దూరమవుతుండడంతో ఘోరాలు జరుగుతున్నాయి. మోసకారి మొబైళ్లు.. ప్రస్తుతం ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చిన ఆండ్రాయిడ్ మొబైల్ కూడా యువతను పక్కదోవ పట్టిస్తోంది. పదో తరగతిలోనే చేతికి సెల్ఫోన్ రావడంతో పుస్తకాలు చదివే అలవాటు, తద్వారా మానసిక పరిణితి పొందే అవకాశాలను యువత పూర్తిగా దూరం చేసుకుంటోంది. ఇష్టానూసారంగా వస్తున్న సోషల్ మీడియా పోస్టింగ్లతో పాటు అభూత కల్పనలు, చిన్నకవితలు, మెసేజ్లు తెలియని స్నేహితులను కూడా దగ్గరకు చేర్చుతున్నాయి. స్నేహితుల మధ్య బంధాన్ని ప్రేమగా మార్చి యువతను మోసగిస్తున్నాయి. ప్రేమికుల ఆత్మహత్యలు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతంలో కంటే ఈ ఏడాది ప్రేమికుల ఆత్మహత్యలు పెరిగాయి. మచ్చుకు కొన్ని ఘటనలు. ఈ ఏడాది మార్చి 22న ఉప్పల్ వద్ద ప్రేమికులు రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లిదండ్రులకు తీవ్ర దుఃఖం మిగిల్చారు. ఈ నెల 24న కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో వరంగల్ కాశిబుగ్గకు చెందిన మేకమల్ల చెన్నకేశవ్ (19), ఖమ్మం జిల్లా కేంద్రంలోని సారథి నగర్ కాలనీ చెందిన బాలిక (17) నవజీవన్ ఎక్స్ప్రెస్ కిందపడి ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటనలో బాలిక మృతి చెందగా యువకుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. అదే రోజు మహబూబాబాద్ జిల్లా గూడూరుకు చెందిన యువకుడు బాదావత్ నవీన్.. ప్రేమ విఫలమయ్యిందనే ఆవేదనలో క్షణికావేశానికి లోనై పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇలాంటి ఘటనలు రోజు ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తునే ఉంటున్నాయి. అవగాహన కార్యక్రమాలేవీ? ర్యాగింగ్ నిర్మూలనలో భాగంగా గతంలో ప్రభుత్వ కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించే వారు. ఆత్మహత్యలు, ఒత్తిడిని జయించడం వంటి అంశాలపై అవగాహన కల్పించే వారు. ఈ పాఠాలు ప్రస్తుతం కనుమరుగయ్యాయి. అవగాహన కార్యక్రమాలు పూర్తి స్థాయిలో జరుగుతున్న దాఖ లాలు కనిపించడం లేదు. తల్లిదండ్రులతో మాట్లాడుతున్న సమయం తగ్గుతూ వస్తోంది. ఫలితంగా యువతకు మార్గదర్శనం కనుమరుగైంది. ఆ ప్రేమ కనిపించకేనా..? ఈమె మీ అమ్మమ్మ.. ఈయన మీ తాతయ్య.. ఇది మన ఊరు.. ఇతడు మనవాడు బాగా చదువుకుని ఉన్నత స్థానంలో ఉన్నాడని ప్రేమగా కబుర్లు చెప్పే తల్లిదండ్రులు ప్రస్తుతం తక్కువైపోతున్నారు. మా ర్కులు, ర్యాంకులు, కెరీర్, సంపాదన ఒత్తిడిలో పడి పిల్లలతో మాట్లాడే సమయం తగ్గిస్తున్నారు. అదే పిల్లలను వేరే ప్రేమ వెతుక్కునేలా చేస్తోంది. యువతలో పెరుగుతున్న బలవన్మరణాలు క్షణికావేశంలో అఘాయిత్యాలు తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు 17 నుంచి 22 ఏళ్ల వారే అధికంతల్లిదండ్రుల లోపం కూడా..యుక్త వయసులోకి వస్తున్న తమ పిల్ల లపై తల్లిదండ్రులు దృష్టి సారించాలి. వారిని పెడదోవ పట్టకుండా చూడాలి. తమ కుటుంబ జీవనం, భవిష్యత్లో సాధించాల్సిన లక్ష్యాలను వివరించాలి. ప్రస్తుతం చాలా మంది ఇంటి వద్ద ప్రేమ పొందలేకపోతున్నారు. ఫలితంగా ఆరు బయట ఆకర్షణకు గురవుతున్నారు. టీనేజీలోని ఈ ఆకర్షణను ప్రేమగా భావించుకుని అనర్థాల వైపునకు మళ్లుతున్నారు. –బర్ల వెంకటేశ్వర్లు, రిటైర్డ్ ఎస్సై, కాజీపేట వ్యక్తిత్వ వికాస తరగతులేవీ?ప్రతి కళాశాలలో వ్యక్తిత్వ వికాస తరగతులు ఉండాలి. ఉన్నత పాఠశాలల్లో వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన పాఠ్యాంశాలు ఉండాలి. అయితే ఇవి ప్రస్తుతం పాఠ్యాంశాల కరిక్యూలమ్లో లేవు. దీంతో నేటి యువత చాలా ఇబ్బందులు పడుతోంది. కళాశాలల్లో కూడా ప్రముఖులతో యువతకు వ్యక్తిత్వ వికాసం పెంపొందించే ఏర్పాటు చేయాలి. –బరుపాటి గోపి, వ్యక్తిత్వ వికాస నిపుణుడు క్షణికావేశంలో కొందరు.. ఆలోచన లేక మరికొందరు.. సరైన సూచనలు అందక ఇంకొందరు..ఇలా ఇరువై ఏళ్లు నిండని యువకులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సినిమా ప్రభావానికి లోనై సహ విద్యార్థులతో ప్రేమలో పడుతున్నారు. ఈ ప్రేమను నెగ్గించుకునే దారి తెలియక, ఆలోచనలు అదుపులో పెట్టుకోలేక ఆత్మహత్యల వైపునకు వెళ్తున్నారు. ఫలితంగా తల్లిదండ్రులకు తీరని శోకం కలుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరుసగా చోటు చేసుకుంటున్న ఘటనలే దీనికి నిదర్శనం. –కాజీపేట -
ఘరానా మోసం..
మంగపేట : మండలంలోని రాజుపేట కెనరా బ్యాంకులో ఘరానా మోసం జరిగింది. బ్యాంకు గోల్డ్ అప్రైజర్.. వినియోగదారులు కుదువపెట్టిన బంగారం స్థానంలో నకిలీ గోల్డ్ ఉంచాడు. అనంతరం వియోగదారుల బంగారంతో పరారయ్యాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్యాంకులో మూడు నెలలకు ఒకసారి నిర్వహించే తనిఖీల్లో ఈ విషయం బయటపడింది. దీంతో వరంగల్ రీజినల్ కార్యాలయ అధికారులు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. బ్యాంకు గోల్డ్ అప్రైజర్ అందుబాటులో లేకపోవడం.. అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అధికారులు అతడిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యా దు చేసినట్లు తెలుస్తోంది. బ్యాంకులో మాయమైన బంగారు విలువ రూ. 2 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. వరంగల్ జిల్లా నర్సంపేట మండలానికి చెందిన సమ్మెట ప్రశాంత్ రెండు సంవత్సరాల నుంచి బ్యాంకు అప్రైజర్గా పనిచేస్తున్నాడు. బ్యాంకు పరిధిలోని రైతులు, వ్యాపారులతో పరిచయాలు పెంచుకున్నారు. బ్యాంకు పక్కన ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ‘సాయిరాం జ్యువెలర్స్’ షాపు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో కొందరు స్థానికుల నుంచి రూ . 50 లక్షలకు పైగా అప్పు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల నుంచి ప్రశాంత్ ఇంటికి తాళం వేసి ఉండడం, బ్యాంకు అధికారులు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అప్పు ఇచ్చిన బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఖాతాదారుల్లో ఆందోళన.. బ్యాంకులో బంగారం మాయం చేసినట్లు ప్రచారం జరుగుతుండడంతో ఖాతాదారుల్లో ఆందోళన మొదలైంది. గోల్డ్ అప్రైజర్ ప్రశాంత్కు బంగారం షాపు ఉండడంతో రైతులు, వ్యాపారులు, స్థానికులు అతడి వద్ద బంగారం కొనుగోలు చేసి ఆర్థిక అవసరాల కోసం బ్యాంకులో తాకట్టుపెట్టారు. ఈ క్రమంలో బ్యాంకులో నకిలీ బంగారం ఉదాంతం వెలుగు చూడడంతో ప్రశాంత్పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇచ్చిన బంగారం అసలైందా లేక నకిలీదా అనే అనుమానం సైతం వ్యక్తం చేస్తున్నారు. అతడి వద్ద బంగారం కొనుగోలు చేసిన కొందరు వ్యక్తులు.. అదే బంగారం బ్యాంకులో కుదువపెట్టి వచ్చిన డబ్బును అతడికే అప్పుగా ఇచ్చినట్లు తెలుస్తోంది. పథకం ప్రకారమే జరిగిందా? బ్యాంకులో నకిలీ బంగారం విషయం పథకం ప్రకారమే జరిగి ఉంటుందనే చర్చ జరుగుతోంది. బ్యాంకు లావాదేవీల విషయంలో బ్రోకర్లను ఆశ్రయించొద్దని బ్యాంకు ఎదుట బోర్డు ఏర్పాటు చేసిన మేనేజర్ .. ఈ విషయంలో ఎందుకు దృష్టి సారించలేకపోయారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రశాంత్ వ్యవహార శైలిని పసిగట్ట లేకపోయారా? లేక ఇంకేమైనా జరిగిందా అనే సందేహం కలుగుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. విషయం ఇలా వెలుగు చూసింది ప్రశాంత్ వరంగల్కు చెందిన ఓ బంగారం షాపు యజమానికి అప్పు చెల్లించాల్సి ఉంది. తాను కొద్ది రోజుల నుంచి డబ్బు కోసం ఫోన్ చేస్తే ప్రశాంత్ లిఫ్ట్ చేయకపోవడంతో సదరు వ్యాపారి నేరుగా రాజుపేటకు వచ్చాడు. పథకం ప్రకారం అప్పటికే రెండు రోజుల క్రితమే విధులకు సెలవుపెట్టిన ప్రశాంత్ తాను అద్దెకుంటున్న ఇల్లు, షాపునకు తాళంవేసి బంగారం, ఖరీదైన వస్తువులతో కారులో ఉడాయించాడు. దీంతో వ్యాపారి బ్యాంకుకు వెళ్లి ఆరా తీశాడు. సెలవు అయిపోయి రెండు రోజులు గడుస్తున్నా విధులకు హాజరుకాకపోవడం.. ఇంటికి తాళం వేసి ఉండడంతో పాటు ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అనుమానం వచ్చి బ్యాంకులో తాకట్టుపెట్టిన బంగారం పరిశీలించగా నకిలీ అనే విషయం బయపడిందని స్థానికులు చర్చించుకుంటున్నారు. బ్యాంకులో బంగారం స్థానంలో నకిలీ ప్రత్యక్షం పరారీలో గోల్డ్ అప్రైజర్ పోలీసులకు బ్యాంక్ అధికారుల ఫిర్యాదు -
అధిక సాంద్రత పత్తిసాగు లాభదాయకం
మహబూబాబాద్ రూరల్: అధిక సాంద్రత పద్ధతి లో పత్తిని సాగు చేయడం ద్వారా దిగుబడి ఎక్కువ వస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి అభిమన్యు, మల్యాల కేవీకే సమన్వయకర్త డాక్టర్ మాలతి అన్నా రు. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగుపై ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ మల్యాల కేవీకే ఆధ్వర్యంలో మహబూబాబా ద్ మండలంలోని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ అధికారులు, విస్తరణ అధికారులు, రైతులకు శనివారం వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వానా కాలం పంటల సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయాలనుకుంటున్న రైతులు పాటించాల్సిన పద్ధతులు, పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. అధిక సాంద్రత పత్తి రకాలు, వాటిని విత్తే విధానా న్ని వివరించారు. సందేహాలు ఉన్న రైతులు వ్యవ సాయ అధికారులను సంప్రదించి, సలహాలు తీసు కోవాలని తెలిపారు. మానుకోట ఏడీఏ లక్ష్మీనారా యణ, విత్తన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. -
నానమ్మ కోసం కట్టిన చీర మనవడికి ఉరితాడు
జనగామ రూరల్: బాత్రూంలో నానమ్మ కోసం సపోర్టుగా ఏర్పాటు చేసిన చీర.. మనవడికి ఉరితాడైంది. చీర చుట్టుకుని ఊపిరాడక అప్పటి వరకు తల్లి కళ్లెదుటే ఎగిరి గంతులు వేసిన ఆ బాలుడు క్షణాల్లో కనిపించని లోకాలకు వెళ్లాడు. ఈ విషాదకర ఘటన శనివారం జనగామ మండలం గానుగుపహాడ్లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఆంజనేయులు, అనిత దంపతులు బతుకుదెరువు నిమిత్తం ఏడు నెలల క్రితం హైదరాబాద్ వెళ్లారు. నాచారంలో వాచ్మెన్గా పని చేస్తూ.. తన ఇద్దరు పిల్లలు సంపత్(11), గణేష్ను గ్రామంలోని తల్లిదండ్రుల వద్ద ఉంచారు. ఇద్దరు పిల్లలు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంటున్నారు. గ్రామంలో ఇటీవల జరిగిన దుర్గామాత ఉత్సవాల కోసం ఆంజనేయులు దంపతులు పదిహేను రోజుల క్రితం వచ్చారు. పండగ ముగిసి.. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఈ సమయంలో పెద్ద కుమారుడు సంపత్ బాత్రూంలో ఉన్న చీర మెడకు చుట్టుకుని మృతి చెందాడు. 95 ఏళ్ల వయసున్న తల్లికి సపోర్టు కోసం ఆంజనేయులు బాత్రూంలో చీరకట్టి ఉంచారు. సంపత్ అందులోకి వెళ్లి... ఊయలలా ఉన్న చీరతో ఆడుకునే సమయంలో మెడకు చిక్కుకుని ఊపిరి ఆడక మృతి చెందాడు. తల్లి అనిత బట్టలు ఉతికే క్రమంలో బాత్ రూంకు వెళ్లగా.. సంపత్ వేలాడుతూ కనిపించడంతో కేకలు వేసింది. అప్పటి వరకు తల్లి కళ్ల ముందటే ఎగిరి గంతులు వేసిన సంపత్.. క్షణాల్లో కనిపించని లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబం గుండెలవిసేలా రోదించింది. విగత జీవిగా పడి ఉన్న బాలుడిని చూస్తూ... తమ్ముడు గణేష్.. అన్నా అన్నా అంటూ ఏడుస్తుంటే అక్కడున్న అందరి హృదయాలను కలిచి వేసింది. ఈ ఘటనపై చిన్నారి తండ్రి బండి రాజుల ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సృజన్ తెలిపారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆడుకుంటూ అనంతలోకాలకు.. చీర చుట్టుకుని బాలుడి మృతి గానుగుపహాడ్లో ఘటన -
గ్రీన్ ల్యాండ్ల కబ్జా
మహబూబాబాద్: ప్రభుత్వ భూములు, చెరువుశిఖం భూములు చాలా వరకు కబ్జాలకు గురి కాగా కబ్జాదారుల కన్ను చివరికి గ్రీన్ ల్యాండ్స్పై పడింది. మానుకోట మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న సమయంలో గ్రీన్ల్యాండ్లు ఎక్కువగా ఉన్నా.. మున్సి పాలిటీగా అప్గ్రేడ్ అయ్యాక భూముల ధర పెరుగడంతో గ్రీన్ల్యాండ్ల కబ్జాల పర్వం కొనసాగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు చేసి లేఅవుట్ లేకుండానే పాట్లుగా విక్రయిస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మానుకోట మున్సిపాలిటీ పరిధిలో సుమారు 70గ్రీన్ల్యాండ్లు ఉన్నాయి. కానీ, అందులో కొన్ని కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లాయి. ప్రస్తుతం ఆయా స్థలాల్లో భవనాలు నిర్మాణం కావడం గమనార్హం. వాస్తవానికి గ్రీన్ ల్యాండ్లలో పార్క్లు, పట్టణ ప్రకృతి వనాలు, ఓపెన్ జిమ్లు, చిల్డ్రన్స్ పార్క్లు లాంటి ప్రజలకు ప్రయోజనం కలిగే నిర్మాణాలు మాత్రమే చేయాలని అధికారులు చెబుతున్నారు. కబ్జాకు గురవుతున్న గ్రీన్ ల్యాండ్లు ఇటీవల కాలంలో ఇల్లందు రోడ్డులోని 168/2, 169,175/1 సర్వే నంబర్లలోఉన్న 861గజాల గ్రీన్ ల్యాండ్లు కబ్జాకు గురయ్యాయని కౌన్సిలర్ బుజ్జి వెంకన్న మున్సిపాలిటీ ఫిర్యాదు చేశారు. నేటి వరకు ఆస్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలి. ఈదులపూసపల్లి రోడ్డులో గ్రీన్ ల్యాండ్ కబ్జాకు గురైందని కౌన్సిలర్లు సంబంధిత పత్రాలతో కార్యాలయంలో అందచేసినా చర్యలు లేవు. శనిగపురం రోడ్డులో గ్రీన్ ల్యాండ్లు కబ్జాకు గురవుతున్నాయని బాలాజీ గార్డెన్ సమీపంలో చేసిన వెంచర్లో గ్రీన్ ల్యాండ్ను గుట్టను చూపించారని దానిపై ఆప్రాంత కౌన్సిలర్ భూక్య శ్రీను కౌన్సిల్ సమావేశంలో మొర పెట్టుకున్నా ఫలితం లేకపోయింది. మన్మోహన్రెడ్డి కాంప్లెక్స్ సమీపంలోని గ్రీన్ల్యాండ్ కబ్జాకు గురైందని కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. 34 వార్డులో గ్రీన్ ల్యాండ్ కబ్జా 34 వార్డులో సుమారు 200గజాల గ్రీన్ ల్యాండ్ కబ్జా చేసి గృహనిర్మాణానికి చదును చేస్తుండగా.. స్థానికులు అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. మున్సిపల్ కార్యాలయంలో ఈనెల 24న ఫిర్యాదు చేశారు. అయితే కాసులకు కక్కుర్తి పడిన అధికారులు ఆ గ్రీన్ ల్యాండ్ స్థలంలో గృహ నిర్మాణ అనుమతులు ఇచ్చినట్లు సమాచారం. అనధికార వెంచర్లే ఎక్కువ మానుకోటలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎక్కువగా లేఅవుట్ లేని వెంచర్లు ఏర్పాటు చేసి రూ.కోట్లు దండుకుంటున్నారు. 2021ఆగష్టు నుంచి టీఎస్ బీపాస్ ద్వారా లేఅవుట్ అనుమతులు ఇస్తున్నారు. లేఅవుట్ తీసుకుంటే 10శాతం గ్రీన్ ల్యాండ్తోపాటు 15శాతం మార్టిగేజ్ చేయాల్సి ఉంది. నిబంధనల ప్రకారం చేసిన తర్వాత మార్టిగేజ్ చేసి భూమి తిరిగి ఆ వెంచర్ చేసిన వ్యాపారులకు కేటాయిస్తారు. కబ్జాలు జరగకుండా చూడాలి గ్రీన్ ల్యాండ్ స్థలంలో గృహనిర్మాణం చేయడానికి చదును చేశాడు. అనుమతి ఉందని చెబుతున్నారు. ముందుగా బోరు వేసి పనులు ప్రారంభిస్తామని చెప్పడంతో అడ్డుకుని మున్సిపల్ కార్యాలయంలో ఫిర్యాదు చేశాం. స్థలం కబ్జా కాకుండా చూడాలి. – వసంత, 34వ వార్డు వాసి గ్రీన్ ల్యాండ్లలో నిర్మాణాలు చేయొద్దు గ్రీన్ ల్యాండ్లలో నిర్మాణాలు చేయొద్దు. చేసినా కూల్చివేసి కేసులు పెడుతాం. అనుమతులు రద్దు చేసే అధికారం ఉంది. 34వ వార్డు గ్రీన్ల్యాండ్ కబ్జా విషయంలో ఫిర్యాదు వచ్చింది. విచారణ చేసి తదుపరి చర్యలు తీసుకుంటాం. – ప్రవీణ్, టీపీఎస్ అక్రమార్కులకు సహకరిస్తున్న అధికారులు గ్రీన్ ల్యాండ్కు గృహ నిర్మాణ అనుమతులు -
ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు చేయాలి
మహబూబాబాద్: ఓట్ల లెక్కింపునకు తగు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అౖద్వైత్కుమార్ సింగ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్పై కలెక్టరేట్లో శనివారం సంబంధిత అధి కారులకు శిక్షణ ఇచ్చారు. ఈసందర్భంగా అద్వైత్కుమార్సింగ్ మాట్లాడుతూ.. కౌంటింగ్ ప్రక్రియకు భారత ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు. కౌంటింగ్ విధివిధానాలపై సందేహలు ఉంటే నివృతి చేసుకోవాలని చెప్పారు. కౌంటింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఉద్యోగులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మాక్ కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు డేవిడ్, లెనిన్ వత్సల్ టొప్పో, మాస్టర్ ట్రైనర్స్ రాము, ప్రవీణ్, నోడల్ అధికారులు, కౌంటింగ్ అసిస్టెంట్లు, కౌంటింగ్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. పేకాటరాయుళ్ల అరెస్ట్బయ్యారం: మండలంలోని గంధంపల్లి–కొత్తపేటలో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని శనివారం అరెస్ట్ చేసినట్టు ఎస్సై మౌలానా తెలిపారు. విశ్వసనీయ సమాచారం.. డీఎస్పీ ఆదేశాల మేరకు కొత్తపేటలోని ఓ ఇంటిలో సోదా చేయగా పేకాట ఆడుతూ వ్యక్తులు పట్టుపడ్డట్లు వివరించారు. నిందితుల నుంచి రూ.40,850తోపాటు ఐదు సెల్ఫోన్లు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. వైన్స్, బార్లు మూసివేతమహబూబాబాద్ రూరల్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిబంధనల అమలులో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎకై ్సజ్ అధికారులు జిల్లా వ్యాప్తంగా ఉన్న వైన్స్, బార్లను శనివారం సాయంత్రం సీజ్ చేశారు. జిల్లాలో ఉన్న 59 మద్యం దుకాణాలు, 9బార్ అండ్ రెస్టారెంట్లలో సోమవారం సాయంత్రం వరకు మద్యం క్రయవిక్రయాలు బంద్ ఉంటాయని తెలిపారు. మద్యం లైసెన్స్దారులు బెల్ట్షాపులకు గానీ, చిల్లర వర్తక దుకాణాలకు గానీ ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమించి అక్రమంగా మద్యం సరఫరా చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎక్కడైనా మద్యం పంపకాలు, అమ్మకాలు జరిగితే డీపీఈఓ ఫోన్ నంబర్ 87126 58998, జిల్లా టాస్క్ఫోర్స్ అధికారి– 87126 59026, మానుకోట ఎకై ్సజ్ సీఐ –87126 59014, తొర్రూర్ ఎకై ్సజ్ సీఐ –87126 59015, గూడూరు ఎకై ్సజ్ సీఐ –87126 59013, కంట్రోల్ రూం నంబర్ 8719 298533 ద్వారా సమాచారం తెలియజేయాని కోరారు. మానుకోటలో చైన్ స్నాచింగ్మహబూబాబాద్ రూరల్ : జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి దుండగులు ఓ మహిళ మెడలోని పుస్తెలతాడు(బంగారు చైన్)ను లాక్కొని పారిపోయారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని బ్యాంక్ కాలనీ ప్రాంతంలోగల ఆర్.కేటవర్స్ అపార్ట్మెంట్లో నివాసం ఉండే ఎలమరెడ్డి రమాదేవి, తమ ఇంటి పక్కన ఉండే అరుణతో కలిసి రోజు మాదిరిగానే వాకింగ్కు వెళ్లారు. వాకింగ్ అనంతరం ఇంటికి వెళ్తున్న క్రమంలో కృష్ణవేణి (పాత సిద్ధార్ధ స్కూల్ ) స్కూల్ ప్రాంతానికి చేరుకోగానే ఎదురుగా ద్విచక్ర వాహనంపై ఓ గుర్తు తెలియని యువకుడు వేగంగా వచ్చి రమాదేవి మెడలోని మూడు తులాల బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లాడు. జరిగిన సంఘటనపై బాధితురాలు టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నట్లు టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ తెలిపారు. శాస్త్రోక్తంగా ‘సదస్యం’ మంగపేట: మల్లూరు హేమాచలక్షేత్రంలో సదస్యం కార్యక్రమాన్ని శనివారం రాత్రి శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ఇన్చార్జ్ కార్యనిర్వాహణ అధికారి పర్యవేక్షణలో భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఉప ప్రధానార్చకులు అమరవాది మురళీకృష్ణమాచార్యులు, శిష్యబృందం ఆలయ అర్చకులు ఉదయం స్వామివారికి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
గార్ల: గ్రామాల్లో సీజనల్ వ్యాధులను నివారించేందుకు వైద్యులు, వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ అంబరీషా ఆదేశించారు. ముల్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన శనివారం తనిఖీ చేశారు. వైద్యసిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం వైద్యసిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. విధుల్లో సమయపాలన పాటించాలన్నారు. ఏజెన్సీ మండలమైన గార్లలో వైద్యులు, వైద్యసిబ్బంది వేతనంతోపాటు, అదనంగా ఏజెన్సీ అలవెన్స్ పొందుతున్నందున స్థానికంగా నివాసం ఉంటూ గ్రామాల్లోని ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాల ని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గర్భి ణులకు డెలివరీలు చేయడం లేదని వైద్యసిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీహెచ్సీల్లో ప్రతీనెలా కనీసం 10కి తగ్గకుండా నార్మల్ డెలివరీలు చే యాలని సూచించారు. గ్రామాల్లో ఏఎన్ఎంలు ఇంటింటి సర్వే చేపట్టి దీర్ఘకాలిక రోగులు, గర్భిణులను గుర్తించి వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు.అంటువ్యాధులను నివారించేందుకు గ్రామాల్లో ప్రతీ శుక్రవారం ఫ్రై డే డ్రై డే పేరుతో కార్యక్ర మం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాల ని తెలిపారు. సమీక్షా సమావేశంలో డాక్టర్లు రాజ్కుమార్జాదవ్, పృధ్వీ, సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీని వాస్, సీహెచ్ఓ సక్కుబాయి, హెచ్ఈఓ శ్రీహరి, స్టాఫ్నర్సులు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ అంబరీషా ముల్కనూరు పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ -
ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలి
నెహ్రూసెంటర్: వాతావరణంలో వచ్చే మార్పులు, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత లోపిస్తే వ్యాధులు సంక్రమిస్తాయని పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, నీటి సరఫరా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని డీఎంహెచ్ఓ డాక్టర్ కళావతిబాయి సూచించారు. డీఎంహెచ్ఓ కార్యాలయంలో సబ్ యూనిట్ ఆఫీసర్స్, హెల్త్ అసిస్టెంట్లకు వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎంహెచ్ఓ మాట్లాడారు. క్షేత్రస్థాయిలో తమకు కేటాయించిన గ్రామాల్లో నీటిద్వారా, దోమల ద్వారా సంభవించే వ్యాధులపై అవగాహన కల్పిస్తూ ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాలన్నారు. విషపూరిత వ్యాధులు, జ్వరాల భారిన పడకుండా ఫ్రైడే డ్రైడే పాటించాలని సూచించారు. వర్షాకాలంలో తప్పనిసరిగా కాచివడబోసిన నీటినే తాగాలని చెప్పారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ అంబరీష, డాక్టర్లు సుధీర్రెడ్డి, మురళీధర్, పీఓ ఎన్సీడీ డాక్టర్ నాగేశ్వర్రావు, మాస్ మీడియా అధికారి ప్రసాద్, హెచ్ఈలు మహేందర్రెడ్డి, పురుషోత్తం, కేవీ రాజు, సబ్ యూనిట్ ఆఫీసర్స్ గోపిచందర్, శ్రీనివాస్, రామకృష్ణ, డీపీఓ రుక్ముద్దీన్ పాల్గొన్నారు. -
వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి
కురవి: వైద్య సిబ్బంది సమయ పాలన పాటిస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిప్యూటీ డీఎంహెచ్ఓ అంబరీష ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంతోపాటు బలపాల గ్రామంలోని పీహెచ్సీలను ఆయన సందర్శించి తనిఖీ చేపట్టారు. పీహెచ్సీల్లోని రికార్డులు, డెలివరీ గది, టీబీ రికార్డులను పరిశీలించారు. వ్యాక్సినేషన్ రిజిస్టర్లు, మందుల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు. బలపాలలో కొనసాగతున్న భవన నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కృష్ణార్జునరావు, సబ్యూనిట్ ఆఫీసర్ వడ్డెబోయిన శ్రీనివాస్, డాక్టర్లు విరాజిత, స్రవంతి, భార్గవి, కుమారస్వామి, సత్యనారాయణ, గౌసుద్దీన్, శోభ, యేసుమణి, బాబురావు, నాగమణి, సృజన, వసంతలక్ష్మి పాల్గొన్నారు. -
పోరాడే వ్యక్తినే మండలికి పంపాలి
తొర్రూరు: ప్రజల పక్షాన పోరాడే వ్యక్తినే శాసన మండలికి పంపించాలని, ఆ అర్హత ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డికి ఉందని మాజీ మంత్రి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోరుతూ శుక్రవారం డివిజన్ కేంద్రంలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో పాలకుర్తి నియోజకవర్గస్థాయి సన్నాహక సమావేశం నిర్వహించారు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ పూసాల శ్రీమాన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, రాష్ట్ర నాయకులు లేగా రామ్మోహన్రెడ్డితో కలిసి ఈటల మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో ప్రజలతో ఛీ కొట్టించుకున్న ఏకై క సీఎం రేవంత్రెడ్డి అని అన్నారు. పదేళ్లకాలంలో మోదీ ప్రభుత్వం ఒక్క స్కాం చేయలేదని తెలిపా రు. కాంగ్రెస్ హయాంలో అన్ని స్కాంలేనని.. మంత్రులు కూడా జైలుకు పోయారన్నారు. అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందన్నారు. నిరుద్యోగులను, ఉగ్యోగులను వంచించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మండలి ఎన్నికలో బుద్ధి చెప్పాలన్నారు. నిరుద్యోగులు, పట్టభద్రుల ఆకాంక్షలు నెరవేరాలంటే బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డి ని గెలిపించుకోవాలన్నారు. బీజేపీ నాయకులు కసిరెడ్డి భాస్కర్రెడ్డి, పల్లె కుమార్, రంగు రాములు, కొలుపుల శంకర్, దొంగరి మహేందర్, కోటేశ్వర్, రచ్చ కుమార్, సాయిని ఝాన్సీ, సోమన్న, సురేష్, రవిబాబు, పులేందర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ హామీల అమలులో విఫలం మహబూబాబాద్ అర్బన్: కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలులో పూర్తిగా విఫలమైందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్లో శుక్రవారం ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో భాగంగా పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈటల హాజరై మాట్లాడుతూ.. దేశంలో మూడోసారి మోదీ ప్రధాని కావడం కాయమన్నారు. పాలన కంటే పదవులను కాపాడుకునే పనిలో కాంగ్రెస్ మంత్రులు నిమగ్నమయ్యారన్నారు. ఒకరి శాఖలో మరొకరు తలదూర్చుకుంటూ కయ్యం పెట్టుకుంటున్నారన్నారు. కేసీఆర్ రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను అమ్మి సంపాదించుకున్నారని, మిగిలిన కొద్దిపాటి భూములను కాంగ్రెస్ అమ్ముకునేందుకు యత్నిస్తున్నదన్నారు. రెండు పార్టీల తీరుతో విసుగు చెందిన ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలన్నారు. మాజీ రాజ్య సభ సభ్యుడు గరికపాటి మోహన్రావు, బీజీపీ సీనియర్ నాయకులు శుభాష్రెడ్డి, ప్రదీప్రావు, బీరప్ప,వెంకన్న, జగన్, నరేందర్రెడ్డి, ధర్మారెడ్డి, శశివర్ధన్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లరావు, ఎంపీ అభ్యర్థి సీతారాంనాయక్ ఉన్నారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ -
డ్రై డే విధానం పాటించాలి
మహబూబాబాద్ రూరల్: ప్రతి శుక్రవారం డ్రై డే విధానం పాటించాలని డీఎంహెచ్ఓ కళావతిబాయి అన్నారు. మహబూబాబాద్ మండలంలోని మల్యాల పీహెచ్సీతో పాటు గ్రామంలో ఆమె శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బంది.. జీపీ సిబ్బందితో కలిసి ప్రజలకు డ్రై డే విధానంపై అవగాహన కల్పించాన్నారు. పీహెచ్సీ పరిఽధిలో ఆశకార్యకర్తలు జీపీ సిబ్బందితో కలిసి ముగురునీటి గుంతలను పూడ్చివేయాలని, నీరు ఎక్కువగా నిల్వ ఉన్న కుంటల్లో ఆయిల్బాల్స్, కిరోసిన్ పోయాలన్నారు. జ్వరంతో బాధపడుతున్న వారికి రక్తపరీక్షలు చేయాలన్నారు. వానాకాలంలో అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. మాతా, శిశు మరణాలు జరగకుండా చూడాలని, పీహెచ్సీ పరిధిలో జరుగుతున్న గర్భస్రావాలపై నిఘా ఉంచాలని ఆదేశించారు. కార్యక్రమంలో మల్యాల పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ సుధీర్కుమార్, జిల్లా ఉపమాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, ఎంపీహెచ్ఈఓ తోట శ్రీనివాస్, స్టాఫ్నర్సులు ఆరోగ్య, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు. సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి నెహ్రూసెంటర్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలని డీఎంహెచ్ఓ కళావతిబాయి, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావు సూచించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం గైనకాలజిస్టు, టీవీవీపీ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, ప్రోగ్రాం అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచి జి ల్లాను రాష్ట్రంలో ఉన్నతస్థానంలో నిలపాలన్నారు. క్షేత్రస్థాయిలో గర్భిణులకు అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఆస్పత్రుల సమన్వయ అధికారి వెంకట్రాములు, డాక్టర్ వీరన్న, డాక్టర్ చింత రమేష్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ బిందుశ్రీ, డాక్టర్ అంబరీష, డాక్టర్ సుధీర్రెడ్డి, డాక్టర్ మురళీధర్, ప్రభుత్వ ఆస్పత్రి గైనకాలజిస్టు డాక్టర్ శ్రీవిద్య, డాక్టర్ దీప్తి, డాక్టర్ కరుణాకర్,డాక్టర్ ప్రసాద్, డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ కళావతిబాయి -
రైతన్న జాగ్రత్త..
అవగాహన కలిగి ఉండాలి రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా బిల్ తీసుకోవాలి. పంట పూర్తి అయ్యేవరకు కొనుగోలు చేసిన విత్తన పాకెట్ కవరు, బిల్ రైతులు తమవద్ద జాగ్రత్తగా ఉంచుకోవాలి. విడి విత్తనాలు అమ్మేందుకు వచ్చిన వారి వివరాలు వ్యవసాయ అధికారులకు చెప్పాలి. విత్తనాల కొనుగోళ్లు, అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. రైతులను మోసం చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవు. – అభిమన్యు, డీఏఓమహబూబాబాద్ రూరల్ : వానాకాలం పంటల సాగులో భాగంగా రైతులు విత్తనాల కొనుగోళ్లలో జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల్లో శుక్రవారం విత్తనాల కొనుగోళ్లపై రైతులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది ప్రత్యేకంగా విత్తనాల కొనుగోళ్ల సందర్భంగా డీలర్లు ప్రతి రైతుకు అమ్మే విత్తనాల లాట్ నంబరు, సాగుచేసే పంట, వారు తీసుకునే వైరెటీ వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని ఆదేశించారు. నాణ్యమైన విత్తనాలను అమ్మాలని, అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని విత్తన డీలర్లను వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరించారు. ఎవరైనా సరే అనధికారికంగా బీజీ3 లాంటి విత్తనాలను అమ్మితే విత్తన చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లోకి వెళ్లి ఎవరుకూడా విత్తనాల అమ్మకాలు చేయవద్దని, అలా ఎవరైనా వస్తే వ్యవసాయ అధికారులకు చెప్పాలని రైతులకు సూచించారు. విత్తనాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● లైసెన్స్ ఉన్న విత్తన డీలర్ దగ్గర మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి ● రైతులు కొనుగోలు చేసిన విత్తనాల రశీదు తీసుకోవాలి ● పంటకాలం పూర్తయ్యే వరకు రశీదు భద్రపరుచుకోవాలి ● రశీదు మీద విత్తన కంపెనీ పేరు, విత్తన రకం, బ్యాచ్ నంబర్, లాట్ నంబర్, ధర ఉండాలి ● విత్తన ప్యాకెట్ మీద తయారైన తేదీ, కాలం ముగిసిన తేదీ చూసుకోవాలి విత్తనాల కొనుగోలులో అప్రమత్తత అవసరం బీజీ3 సీడ్స్ అమ్మితే కఠిన చర్యలు జిల్లా వ్యాప్తంగా రైతు వేదికల్లో సదస్సులు
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
తప్పక చదవండి
- స్వాతిమలివాల్పై దాడి.. కేజ్రీవాల్ సహాయకుడికి నో బెయిల్
- యుద్ధ ట్యాంకుల రేసులో భారత్ ఘన విజయం
- హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో శృతి భావోద్వేగ ప్రసంగం: చప్పట్లతో మారుమోగిన క్యాంపస్
- అతనితో రవితేజ హీరోయిన్ పెళ్లి.. ఇప్పుడేమో వేల కోట్లకు!
- శెభాష్ శ్రేయస్.. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అతడే
- పాయింట్ బ్లాంక్లో డీజేపై కాల్పులు
- భారత్ నుంచి 40 దేశాలకు మేడ్ ఇన్ ఇండియా కార్లు
- ఇండస్ట్రీలో విషాదం.. నటుడిని కాల్చిచంపిన దుండగులు!
- గంభీర్ కాదు!.. కేకేఆర్ విజయాల్లో అతడిది కీలక పాత్ర.. ముగ్గురు హీరోలు
- ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Advertisement