-
రిజిస్ట్రేషన్స్, శిక్షణ స్థలం
సాహితీ బ్యూటీ పార్లర్ అండ్ ట్రైనింగ్ సెంటర్, ఏకలవ్య స్కూల్ రోడ్, శివాజీ నగర్, నల్లగొండ సెల్ : 96660 13544, 80747 42864సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి జూన్ 22 వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఇస్తారు శిక్షణలో నేర్పించే అంశాలు త్రెడ్డింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్, డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, డై అప్లికేషన్, మేకప్స్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్స్),హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ అండ్ గ్రూమింగ్, ఫేషియల్స్రిజిస్ట్రేషన్ స్వీకరించు తేదీలు : ఈ నెల 22వ తేదీ వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ఫీజు : రూ.3 వేలు వర్క్షాప్ షెడ్యూల్ తేదీలు: ఈ నెల 23వ తేదీ నుంచి జూన్ 22వ తేదీ వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు శిక్షణ ఉంటుంది. -
కౌంటింగ్ పకడ్బందీగా నిర్వహించాలి
నల్లగొండ : పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ పక డ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ దాసరి హరిచందన పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు జరిగిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కౌంటింగ్ టేబుల్ వద్ద పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. కౌంటింగ్ ప్రక్రియలో ఏ చిన్న సమస్య తలెత్తినా వెంటనే ఆర్వో, ఏఆర్ఓల దృష్టికి తీసుకురావాలన్నారు. అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఎన్నికల నియమావళి కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సిబ్బంది కౌంటింగ్ సెంటర్లోకి ప్రవేశించిన సమయం నుంచి ఏఏ స్టేజీలలో ఎటువంటి పనులు చేయాలి, ఎటువంటి పనులు చేయకూడదు అనే విషయాలను ట్రైనర్ బాలు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, స్పెషల్ కలెక్టర్ నటరాజన్, డీఆర్డీఓ నాగిరెడ్డి, అధికారులు శ్రవణ్, శ్రామిక్ పాల్గొన్నారు. ఫ కలెక్టర్ దాసరి హరిచందన -
యాదాద్రిలో ఊంజలి సేవోత్సవం
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మవారికి ఊంజలి సేవోత్సవం పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండపంలో అమ్మవారిని అధిష్టింపజేసి ఊంజలి సేవ నిర్వహించారు. ఆండాళ్ అమ్మవారికి ఇష్టమైన నాధస్వరాన్ని వినిపించారు. అనంతరం హారతినిచ్చారు. ఇక ప్రధానాలయంలోనూ సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవ, ఆరాధనలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆయ ముఖ మండపం, ప్రాకార మండపాల్లో శ్రీసుదర్శన హోమం, నిత్య కల్యాణం, జోడు సేవోత్సవం తదితర కై ంకర్యాలు గావించారు. -
వర్షం.. రైతుల హర్షం
నల్లగొండ అగ్రికల్చర్ : ఉపరితలద్రోణి కారణంగా గురువారం రాత్రి జిల్లా అంతటా వర్షం కురిసింది. పదిహేను రోజులుగా ఎండలు, ఉక్కపోతతో ఇబ్బందులు పడిన జిల్లా ప్రజలు వర్షంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో ఊరట చెందుతున్నారు. రోహిణి కార్తే రాకముందే వర్షాలు కురుస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మూడు రోజులు క్రితం కురిసిన వర్షాలకు రైతులు దుక్కుల దున్నకం, ఎరువులు తోలుకోవడం వంటి పనులు ప్రారంభించారు. గురువారం కురిసిన వర్షానికి భూమి మంచి పదును కావడంతో రైతులు పూర్తిస్థాయిలో వ్యవసాయ పనుల్లో నిమగ్నం కానున్నారు. జిల్లాలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు సగటున 25.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అత్యధికంగా కనగల్ మండంలో 108.9 మిల్లీమీటర్లు, అత్యల్పంగా గుండ్లపల్లి మండలంలో 1.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఫ 25.2 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు వర్షపాతం వివరాలు ఇలా.. (మిల్లీమీటర్లలో) మండలం వర్షపాతం కేతేపల్లి 76.8 చిట్యాల 61.2 గుర్రంపోడు 59.8 నాంపల్లి 46.8 తిప్పర్తి 41.4 చండూరు 35.2 నార్కట్పల్లి 26.0 కట్టంగూరు 13.6 శాలిగౌరారం 23.2 నకిరేకల్ 22.2 నల్లగొండ 31.2 మునుగోడు 30.1 మర్రిగూడ 9.2 చింతపల్లి 17.8 అనుముల 18.0 నిడమనూరు 11.0 త్రిపురారం 13.0 మాడుగులపల్లి 6.4 వేములపల్లి 4.1 మిర్యాలగూడ 3.0 దామరచర్ల 11.3 అడవిదేవులపల్లి 14.7 తిరుమలగిరిసాగర్ 4.4 పెద్దవూర 21.4 పెద్దఅడిశర్లపల్లి 28.2 కొండమల్లేపల్లి 32.9 దేవరకొండ 19.0 చందంపేట 3.8 గట్టుప్పల్ 7.5 -
పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
నల్లగొండ : ఈనెల 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలను పకడ్బందీగా జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) డి.రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై శుక్రవారం ఆమె తన చాంబర్లో నిర్వహించిన జిల్లాస్థాయి సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈనెల 24 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు జరగనున్నాయని ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సంవత్సరం, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల సందర్భంగా విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని విద్యుత్ అధికారులను, గట్టి బందోబస్తుతో పాటు, 144 సెక్షన్ విధించాలని పోలీస్ అధికారులను, జవాబు పత్రాలను డీఆర్సీ కేంద్రానికి పంపించడంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోస్టల్ అధికారులను ఆదేశించారు. పరీక్ష సమయానికి అనుగుణంగా బస్సులు నడపాలని ఆర్టీసి అధికారులు సూచించారు. పరీక్ష కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచేలా ఉత్తర్వులు జారీ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఏఎన్ఎంలను ఏర్పాటు చేయాలని, ఓఆర్ఎస్ పాకెట్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. సమావేశంలో డీఐఈఓ ఆర్.దస్రూ, ఏఎస్పీ రాములునాయక్, ట్రాన్స్కో డీఈ సుధీర్కుమార్, ఆర్టీసీ డిప్యూటీ ఆర్ఎం మాధవి పాల్గొన్నారు. ఫ జిల్లా రెవెన్యూ అధికారి రాజ్యలక్ష్మి -
అభివృద్ధి పనులు పూర్తిచేస్తాం
నల్లగొండ : అమ్మ ఆదర్శ పాఠశాలలో్లృ చేపట్టిన అభివృద్ధి పనులు పాఠశాలల పునః ప్రారంభం నాటికి పూర్తి చేస్తామని కలెక్టర్ హరిచందన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ.శాంతికుమారి శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వివిధ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నుంచి కలెక్టర్ హరిచందన మాట్లాడారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా పాఠశాలల్లో పనులు చేపట్టడం వల్ల స్కూళ్లలో ఎంతో పురోగతి కనిపిస్తోందని చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా నుంచి అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డీఈఓ భిక్షపతి, డీఆర్డీఓ నాగిరెడ్డి, పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా మేనేజర్ నాగేశ్వర్రావు, డీసీఓ కరుణాకర్, డీఏఓ శ్రవణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫ కలెక్టర్ హరిచందన -
హరితహారానికి సన్నద్ధం
దేవరకొండ : పదో విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతన్నారు. గాను ఆయా శాఖల వారీగా లక్ష్యాలను నిర్ధేశించారు. ఆ ప్రకారం మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టనున్నారు. ఇప్పటికే జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నర్సరీల్లో మొక్కలను సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో 42.20లక్షల మొక్కలు నాటేందుకు అధికార యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు గాను జిల్లా వ్యాప్తంగా 844 నర్సరీల్లో మొక్కల పెంపకం పనులు చురుగ్గా సాగుతున్నాయి. గత అనుభవాలను స్ఫూర్తిగా తీసుకొని ఈ ఏడాది 72 రకాల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. వాటిలో పలు రకాల పూల మొక్కలతో పాటు పండ్ల, నీడనిచ్చె మొక్కలను నర్సరీల్లో పెంచుతున్నారు. ప్రణాళికలు సిద్ధం హరితహారం కార్యక్రమంలో భాగంగా నిర్ధేశించిన లక్ష్యాలను సాధించేందుకు గాను జిల్లా యంత్రాంగం పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రస్తుత వేసవిని దృష్టిలో ఉంచుకొని నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను ఎండవేడిమి నుంచి సంరక్షించేందుకు గాను ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. నర్సరీలకు షేడ్ నెట్స్ ఏర్పాటు చేయడంతో పాటు రోజూ రెండు సార్లు నీటిని అందిస్తున్నారు. ఈ ఏడాది అన్ని నర్సరీలు డీఆర్డీఓ, అటవీశాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు ఆయా నర్సరీలను పరిశీలించి క్షేత్రస్థాయిలో అధికారులకు తగు సూచనలిస్తున్నారు. విద్యాసంస్థలు, వసతి గృహాలు, రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ కార్యాలయాలు, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో నాటిన ప్రతి మొక్కను బతికించేందుకు సమష్టి కృషి చేస్తున్నారు. ప్రతి మొక్కనూ సంరక్షిస్తాం హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించాం. జిల్లా వ్యాప్తంగా 844 నర్సరీల్లో 42.20లక్షలు మొక్కలు పెంచుతున్నాం. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటనున్న ప్రతి మొక్కనూ సంరక్షించేందుకు గాను ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో హరితహారం లక్ష్య సాధనకు కృషి చేస్తాం. – నాగిరెడ్డి, డీఆర్డీఓ, నల్లగొండ ఫ 10వ విడతలో 42.20లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం ఫ 844 నర్సరీల్లో మొక్కల పెంపకం -
బెస్ట్ అవైలబుల్కు దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ : బెస్ట్ అవైలబుల్ స్కిం కింద 2024 – 25 విద్యా సంవత్సరంలో ఒకటో తరగతి (డేస్కాలర్), 5వ తరగతి (రెసిడెన్షియల్)లో చేరేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల ఎస్సీ విద్యార్థుల తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తుదారులు గ్రామీణ ప్రాంతాల వారైతే సంవత్సర ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణ వాసులైతే రూ.2 లక్షల ఆదాయం కలిగి ఉండొచ్చని, ఏప్రిల్ 1వ తేదీ తర్వాత మీసేవ కేంద్రం ద్వారా ఆదాయ ధ్రువీకరణ పత్రం పొంది ఉండాలని సూచించారు. ఆదాయ, కుల ధ్రువీకరణ, ఆధార్ కార్డు, రెండు పాస్పోర్టు సైజ్ ఫొటోలతో జూన్ 6వ తేదీలోగా జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో సాయంత్రం ఐదు గంటలలోగా సమర్పించాలని పేర్కొన్నారు. గతంలో ఎవరైనా కుటుంబ సభ్యులు బెస్ట్ అవైలబుల్ స్కీం, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివితే ప్రస్తుతం ఈ పథకం వారికి వర్తించదని తెలిపారు. జూన్ 11వ తేదీన ఉదయాదిత్య భవన్లో డ్రా పద్ధతిన విద్యార్థులను ఎంపిక చేస్తామని తెలిపారు. నిబంధనలు పాటించాలిమర్రిగూడ : ఎరువుల దుకాణదారులు, రైతు సేవా సహకార సంఘం నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పి.శ్రవణ్కుమార్ ఆదేశించారు. శుక్రవారం మర్రిగూడ మండలంలోని శివన్నగూడ, లెంకలపల్లి, మర్రిగూడలోని ఎరువుల దుకాణాలు, మన గ్రోమోర్ కేంద్రాలను ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. రైతు సేవా సహకార సంఘంలో పచ్చిరొట్ట ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. జీలుగు విత్తనాలు 30 కేజీలకు రూ.1116, జనుము 40కేజీలకు రూ.1448 ధరకు లభిస్తున్నాయని తెలిపారు. పత్తి, వరి విత్తనాలను లైసెన్స్ కలిగిన దుకాణాల్లో మాత్రమే కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన వాటికి బిల్లులు తీసుకోవాలని, విత్తనాలను విత్తిన తరువాత ఖాళీ ప్యాకెట్లను పంట కాలం పూర్తయ్యే వరకు భద్రపరుచుకోవాలని రైతులకు సూచించారు. 23న స్పాట్ అడ్మిషన్లు పెద్దవూర : ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల(సీఓఈ) అవంతీపురం, మిర్యాలగూడలో ప్రవేశాలకు ఈ నెల 23వ తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు పెద్దవూర టీఎస్డబ్ల్యూఆర్జేసీ ప్రిన్సిపాల్ లక్ష్మీకాంత్రెడ్డి శుక్రవారం తెలిపారు. 2023–24 విద్యా సంవత్సరంలో గిరిజన సంక్షేమ పాఠశాలలు, ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ విద్యార్థులు సాధించిన జీపీఏ ప్రాతిపదికన అడ్మిషన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. కౌన్సిలింగ్కు హాజరయ్యే విద్యార్థులు అన్ని ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతోపాటు రెండు సెట్ల జిరాక్స్, నాలుగు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలతో ఉదయం తొమ్మిది గంటలకు హాజరుకావాలని సూచించారు. ఈ నెల 25వ తేదీన బాలికలకు కూడా ఇదే కళాశాలలో స్పాట్ అడ్మిషన్లకు కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం నల్లగొండ : కాన్పూర్, బెంగళూరులో భారత వాయు సైన్యం నిర్వహిస్తున్న అఖిల భారత అగ్నివీర్ వాయు (మ్యుజీషియన్) నియామక ర్యాలీకి అర్హులైన అభ్యర్థులు ఈ నెల 22 నుంచి జూన్ 5 వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జిల్లా ఉపాధికల్పన అధికారి ఎన్.పద్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024 జనవరి 2, 2007 జూలై 2వ తేదీన మధ్య జన్మించిన అవివాహిత యువతీ యువకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తాత్కాలిక అడ్మిట్ కార్డ్తో రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు అర్హులని పేర్కొన్నారు. రిక్రూట్మెంట్ ర్యాలీ తేదీ, సమయం తాత్కాలిక అడ్మిట్ కార్డ్లో పేర్కొంటారని తెలిపారు. రేపు ఉమ్మడి జిల్లా స్థాయి చెస్ పోటీలు సూర్యాపేట టౌన్ : సూర్యాపేటలోని కిరాణ మర్చంట్స్ అసోసియేషన్ భవనంలో ఈ నెల 19న ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి అండర్–7, 13, 17 విభాగాల్లో చెస్ పోటీలు నిర్వహించనున్నట్టు అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గండూరి కృపాకర్, ఎల్.సతీష్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటలలోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఎల్.సతీష్కుమార్ సెల్ 8555008996, 9394753343 నంబర్లను సంప్రదించాలని కోరారు. -
ముస్తాబవుతున్న మెడికల్ కళాశాల
నల్లగొండ టౌన్ : నల్లగొండ మెడికల్ కళాశాల భవనాల సమూదాయం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జిల్లా కేంద్రంలోని ఎస్ఎల్బీసీలో 42 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న కళాశాల త్వరలోనే విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం కళాశాల భవన సమదాయం నిర్మాణాలు 85 శాతంవరకు పూర్తి కావచ్చాయి. చుట్టూ 42 ఎకరాల విస్తీర్ణంలో ప్రహరిగోడ నిర్మాణం పనులు సాగుతున్నాయి. ఆవరణలో పూలచెట్లు, గ్రీనరీ, శానిటేషన్, పార్కింగ్ షెడ్ల నిర్మాణం పనులు కూడా వేగవంతంగా చేపడుతున్నారు. భవన సమూదాయాన్ని అక్టోబర్ మాసం చివరినాటికి పూర్తి చేయాల్సి ఉంది. కానీ ఇంజనీరింగ్ అధికారులు మాత్రం సెప్టెంబర్లోగా అన్ని పనులను పూర్తి చేసి అప్పగించాలన్న లక్ష్యంతో ఉన్నారు. 2019లో కళాశాల మంజూరు.. 2019 విద్యా సంవత్సరంలో నల్లగొండ మెడికల్ కళాశాల తరగతులు ప్రారంభమైనప్పటికీ సొంత భవనం లేకపోవడంతో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో తరగతులను నిర్వహిస్తున్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లో కళాశాల నిర్మాణం కోసం రూ.100 కోట్లు కేటాయించింది. దీంతో ఎస్ఎల్బీసీలోని 42 ఎకరాల స్థలంలో కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మెడికల్ కళాశాల భవనాన్ని జీ ఫ్లస్ 3గా నిర్మిస్తున్నారు. 700 మంది విద్యార్థులకు వసతి ఉండే విధంగా బాలుర హాస్టల్ భవనాన్ని జీ ప్లస్4గా, బాలికల హాస్టల్ భవనాన్ని జీ ప్లస్5గా, ప్రిన్సిపాల్ క్వార్టర్ గెస్ట్ హౌజ్ జీ ప్లస్3గా అత్యాధునిక హంగులతో నిర్మించారు. దాంతో పాటు కళాశాలకు అనుబంధంగా క్యాంటిన్ నిర్మాణం కూడా పూర్తి చేశారు. భవనాలకు రంగలను వేయడం పూర్తయింది. భవనాల లోపల ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఇంటీరియల్ డెకరేషన్ తదితర పనులను కాంట్రాక్టర్ శరవేగంగా చేయిస్తున్నారు. మెడికల్ కళాశాల భవనాల సమూదాయాన్ని అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా నిర్మించేందుకు ఇంజనీరింగ్ అధికారులు కృషి చేస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలకు ఎక్కడా తలొగ్గకుండా నిర్మాణ పనులను పూర్తి చేయించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. నర్సింగ్ కళాశాలకు స్థలం కేటాయింపునల్లగొండ మెడికల్ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాల కూడా మంజూరైంది. మెడికల్ కళాశాలకు కేటాయించిన 42 ఎకరాల స్థలంలోనే 5 ఎకరాలను నర్సింగ్ కళాశాలకు ప్రభుత్వం కేటాయించింది. భవన నిర్మాణానికి నిధులు కేటాయించలేదు. దీంతో నర్సింగ్ కళాశాలను ప్రైవేట్ భవనంలో నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం నిధులు కేటాయిస్తే నర్సింగ్ కళాశాల భవనాన్ని నిర్మించడానికి ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఫ రూ.వంద కోట్లతో కళాశాల, హాస్టల్స్, ప్రిన్సిపాల్ క్వార్టర్స్ నిర్మాణం ఫ 85 శాతం పూర్తయిన పనులు ఫ త్వరలో అందుబాటులోకి రానున్న నూతన భవనం -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఆటో
మునగాల: విద్యుత్ స్తంభాన్ని ఆటో ఢీకొట్టింది. ఈఘటనలో ఆటోలో ఉన్న ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన మునగాల మండలంలోని తిమ్మారెడ్డిగూడెం శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. మునగాల మండల కేంద్రం నుంచి గరిడేపల్లి మండలం వెలిదెండ గ్రామానికి వెళ్లే రహదారిలో రోడ్డు అంచున విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా ఉంది. ఎదురుగా వస్తున్న ఓ వాహనాన్ని తప్పించబోయిన ఆటో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. విద్యుత్శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని రోడ్డుకు అడ్డంగా పడిపోయిన స్తంభాన్ని తొలగించి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. ఇదిలా ఉండగా ఈ రహదారిలో గణపవరం – తిమ్మారెడ్డిగూడెం గ్రామాల మధ్య పలు విద్యుత్ స్తంభాలు రోడ్డును ఆనుకునే ఉన్నాయని, సంబంధిత కాంట్రాక్టర్ స్తంభాలను తొలగించకుండా రోడ్డు నిర్మాణం చేపడుతున్నాడని పలువురు ఆటో డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. పలువురికి గాయాలు -
రేషన్ బియ్యం పట్టివేత
చిలుకూరు: మండల పరిధిలోని బేతవోలు గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని పట్టుకొని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురభి రాంబాబు శుక్రవారం తెలిపారు. గ్రామానికి చెందిన నారసాని నరసింహారావు రేషన్ లబ్ధిదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసి గ్రామంలో ఓ చోట డంపు చేసినట్లుగా వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీ చేశామని పేర్కొన్నారు. ఈమేరకు 8 క్వింటాళ్ల రేషన్ బియ్యంను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నరసింహారావుపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. పాము కాటుతో మాజీ వార్డు మెంబర్ మృతినార్కట్పల్లి: పాము కాటుతో నార్కట్పల్లి మేజర్ గ్రామ పంచాయతీ ఆరవ వార్డు మాజీ సభ్యుడు, బీజేపీ నాయకుడు చేపూరి రాజు (34) మృతి చెందాడు. శుక్రవారం తన కూరగాయల తోటలో గడ్డి తీస్తుండగా.. పాము కాటుకు గురయ్యాడు. సమీపంలో ఉన్న వారు గమనించి అతడిని చికిత్స నిమిత్తం స్థానిక కామినేని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలుకోదాడరూరల్: రెండు ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కోదాడ పట్టణంలోని రంగని గుడి వద్ద శుక్రవారం చోటు చేసుకుంది. అనంతగిరికి చెందిన నాగరాజు, కోదాడకు చెందిన సతీష్ ద్విచక్రవాహనాలపై ఎదురెదురుగా వస్తూ ఢీ కొన్నారు. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. అసభ్యకర ప్రచారంపై ఫిర్యాదుభువనగిరి క్రైం: సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం నిర్వహించడంపై బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ శుక్రవారం భువనగిరి పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ కుమార్ తెలిపారు. -
పోలీసులమని బెదిరించి నగదు చోరీ
కోదాడరూరల్ : తాము పోలీసులమని బెదిరించి ఓ వ్యక్తి వద్ద నగదు చోరీ చేసిన ఇద్దరి యువకులను కోదాడ రూరల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన ఇస్మాయిల్ ఈ నెల 16న రాత్రి ఏడు గంటల సమయంలో కోదాడ నుంచి స్వగ్రామం వెళ్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలోని దోరకుంట శివారు వద్ద నడిగూడెం మండలం రత్నవరం గ్రామానికి చెందిన వినయ్, కోదాడ పట్టణ పరిధిలోని సాలార్జంగ్పేటకు చెందిన మతిన్లు ఇస్మాయిల్ బైక్ను అడ్డగించారు. తాము పోలీసులమంటూ బెదిరించి అతని వద్ద రూ.4500 నగదును అపహరించారు. మరుసటి రోజు మళ్లీ ఫోన్ చేసి ఇంకా డబ్బు కావాలని బెదిరింపులకు పాల్ప డ్డారు. దీంతో ఇద్దరిపై అనుమానం వచ్చిన ఇస్మాయిల్ కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈమేరకు ఎస్ఐ అనిల్రెడ్డి విచారణ చేసి నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. కాగా.. నిందితులిద్దరూ గతంలో గంజాయి కేసులో జైలుకు కూడా వెళ్లారు. -
నిలిచి ఉన్న డీసీఎంను ఢీకొన్న బైక్
చిట్యాల: చిట్యాల మండలం వెలిమినేడు గ్రామ శివారులో శుక్రవారం జాతీయ రహదారిపై నిలిచి ఉన్న డీసీఎంను బైక్ వెనక నుంచి ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. చిట్యాల– 2 ఎస్ఐ లింగయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సురేంద్రకుమార్, పంకజ్, ప్రమోద్లు ఉషా లేబర్ కాంట్రాక్టర్ వద్ద కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరు శుక్రవారం వెలిమినేడు గ్రామం నుంచి విధులు నిర్వహిస్తున్న చౌటుప్పల్ పరిధిలోని ఓ ఫార్మా పరిశ్రమ వద్దకు వెళ్లేందుకుగాను ఒకే బైక్పై బయలు దేరారు. వెలిమినేడు పరిధిలోని సుర్కంటిగూడెం క్రాస్రోడ్డు వద్దకు రాగానే హైవేపై నిలిపి ఉంచిన డీసీఎం వాహనాన్ని వెనక నుంచి ఢీకొట్టారు. దీంతో బైక్ నడుపుతున్న సురేంద్ర్కుమార్(23) అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ పంకజ్, ప్రమోద్లను వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రమోద్(20) మృతి చెందాడు. మృతదేహాలకు నల్లగొండలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ సైదాబాబు, లింగయ్య పరిశీలించారు. మృతుడు సురేంద్ర్కుమార్ తమ్ముడు సంత్లాల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ఇద్దరు యువకులు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు -
‘అధిక వడ్డీ’ నిందితులపై పోలీసుల ఆరా
మునుగోడు: పుడమి ప్రాజెక్ట్ కంపెనీ పేరుతో అమాయక ప్రజల నుంచి రూ.లక్షలు వసూలు చేసి మోసం చేసిన ఘటనపై పోలీసులు స్పందించి కంపెనీ నిర్వాహకులపై ఆరా తీస్తున్నారు. కంపెనీ ఎప్పుడు పెట్టారు.. ఎంత మంది వద్ద వసూలు చేశారనే విషయాలను తెలుసుకుంటున్నట్లు సమాచారం. నల్లగొండ జిల్లాతో పాటు హైదరాబాద్లో కూడా బాధితులు ఉండటంతో అక్కడ ఏమైనా కేసులు నమోదయ్యాయా అని ఆరా తీస్తున్నారు. పుడమి కంపెనీ మోసంపై పూర్తిస్థాయిలో విచారించి, ఎస్పీ ఆదేశాల మేరకు చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. ఇక్కడి సమాచారాన్ని నిర్వాహకులకు అందిస్తున్న ఏజెంట్ బాధితుల ఒత్తిడి ఎక్కువ కావడంతో సమాధానం చెప్పలేక ఈడీ నోటీసుల పేరుతో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆ కంపెనీ నిర్వాహకులకు ఓ ఏజెంట్ ఇక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నట్లు తెలిసింది. మునుగోడు మండలంలోని పలివెల గ్రామానికి చెందిన ఆ ఏజెంట్ దాదాపు 80 మందికి పైగా రూ.60 కోట్ల వరకు పెట్టుబడి పెట్టించి అతనే దాదాపు రూ.4 కోట్ల కమీషన్ పొందాడు. దీంతో అతని ద్వారా పెట్టుబడి పెట్టిన కొందరు బాధితులు అతడిని నిలదీయడంతో తనకు వచ్చిన కమీషన్ అందరికీ ఇస్తానని, మిగిలిన డబ్బులతో తనకు సంబంధం లేదని చెప్పాడు. కానీ ఇస్తానని చెప్పిన కమీషన్ కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడని బాధితులు వాపోయారు. అయితే అజ్ఞాతంలోకి వెళ్లిన వారికి ఇక్కడి సమాచారాన్ని ఇతను చేరవేస్తున్నట్లు తెలిసింది. అతడిని విచారిస్తే అజ్ఞాతంలోకి వెళ్లిన వారి సమాచారం లభిస్తుందని పలువురు పేర్కొంటున్నారు.ఏజెంట్లను నిలదీస్తున్న బాధితులు పుడమి కంపెనీలో పెట్టుబడి పెట్టిన బాధితులు ఏజెంట్లను నిలదీస్తున్నట్లు తెలిసింది. ఏడాది కాలంగా తమకు డబ్బులు ఇవ్వకపోవడంతోపాటు కనీసం ప్లాట్లు కూడా ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించడం లేదని ప్రశ్నిస్తున్నారు. కానీ పెట్టుబడి పెట్టించిన ఏజెంట్లు కంపెనీ నిర్వాహకులు మోసం చేస్తారని తమకూ తెలియదని, మీతో పాటు తాము కూడా డబ్బులు పెట్టి మోసపోయామని వాపోతున్నట్లు తెలిసింది. కంపెనీ డైరెక్టర్లలో ఒకరైన పలివెల గ్రామ వ్యక్తి బయటికి వస్తేనే అందరికీ న్యాయం జరుగుతుందని, అప్పటి వరకు ఓపిక పట్టాలని ఏజెంట్లు అంటున్నారని పలువురు బాధితులు పేర్కొంటున్నారు. పుడమి ప్రాజెక్ట్తో నష్టపోయిన వారి వివరాలు తెలుసుకుంటున్న పోలీసులు హైదరాబాద్లోనూ బాధితులు ఉండటంతో అక్కడ నమోదైన కేసులపై ఆరా పూర్తిస్థాయిలో విచారించి చర్యలు తీసుకునేందుకు సన్నద్ధం -
తేనెటీగల దాడిలో ఇద్దరికి గాయాలు
చిట్యాల: మున్సిపాలిటీ పరిధిలోని శివనేనిగూడెం (ఒకటవ వార్డు)లో శుక్రవారం విధులు నిర్వహిస్తున్న ఇద్దరు మున్సిపల్ సిబ్బందిపై తేనెటీగలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. శివనేనిగూడెంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయ ఉత్సవాల నేపథ్యంలో మున్సిపల్ సిబ్బంది జిట్ట మణెమ్మ, రుద్రవరం అండాలు ఆలయం సమీపంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో చెట్లపై ఉన్న తేనెటీగలు వీరిపై అకస్మాత్తుగా దాడి చేశాయి. తీవ్రంగా గాయపడడంతో నార్కట్పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. వీరిని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేష్, చిట్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి తదితరులు పరామర్శించారు. వృద్ధురాలు అదృశ్యంభువనగిరి క్రైం: మండలంలోని బస్వాపురం గ్రామంలో వృద్ధురాలు అదృశ్యమైంది. గ్రామానికి చెందిన ఉడుత లక్ష్మ మ్మ(80) ఈ నెల 16న ఉదయం 8 గంటలకు బయటకు వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లో చెప్పి వెళ్లింది. తిరిగి రాకపోవడంతో కుమారుడు ఉడుత సత్యనారాయణ శుక్రవారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు. వివరాలు తెలిస్తే 87125 79973, 87126 62803 నంబర్కు సమాచారం అందించాలని తెలిపారు.తహసీల్దార్ కార్యాలయంలో బ్యాటరీ చోరీగరిడేపల్లి: మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం రాత్రి ఉపయోగంలో లేని బ్యాటరీ చోరీకి గురైనట్లు తహసీల్దార్ బండ కవిత తెలిపారు. శుక్రవారం ఉదయం కార్యాలయం అటెండర్ రోజు వారీగా డ్యూటీకి వచ్చి చూసేసరికి కార్యాలయం వెనుక గేట్ తాళం ధ్వంసం చేసి ఉండడంతో అధికారులకు సమాచారం అందించాడు. దీంతో వారు కార్యాలయానికి చేరుకుని పరిశీలించారు. ఏ ఇతర సామగ్రి చోరీకి గురికాలేదని, కార్యాలయ ఆవరణలోని జనరేటర్ పక్కన ఉపయోగంలో లేని బ్యాటరీ మాత్రమే చోరీకి గురైనట్లు తహసీల్దార్ తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని పోలీసులు పేర్కొన్నారు. అత్యాచారం కేసులో బాలుడికి ఆరు నెలల జైలురామగిరి(నల్లగొండ): బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో బాలుడికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ జడ్జి శిరీష శుక్రవారం తీర్పు వెలువరించారు. నల్లగొండ మండలం ఆర్జాలబావికి చెందిన బాలుడు 2020 జూలై 19న అదే కాలనీలో ఓ బాలికపై ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేయడంతో నల్లగొండ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. సీఐ డానియల్, ఎస్సై శివకుమార్, కానిస్టేబుల్ ఎస్. సురేస్, బి.సుమన్లు ప్రాసిక్యూషన్కు సహకరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ కె. లక్ష్మణ్ నాయక్ వాదనలతో ఏకీభవించిన నల్లగొండ జువైనల్ కోర్టు జడ్జి శిరీష బాలుడికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ హైదరాబాద్ గాజులరామారం స్పెషల్ హోంకు తరలించాల్సిందిగా తీర్పు వెల్లడించారు. -
ఉరేసుకుని బాలిక ఆత్మహత్య
మిర్యాలగూడ టౌన్: ఉరేసుకుని బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శుక్రవారం మిర్యాలగూడ మండలంలోని ఉట్లపల్లిలో చోటు చేసుకుంది. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. వేములపల్లి మండలం అమనగల్లు గ్రామానికి చెందిన మహిళ తన భర్త కొద్దిరోజుల క్రితం మృతి చెందడంతో తన కుమార్తెతో కలిసి తన పుట్టినిల్లు అయిన మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామంలో నివాసం ఉంటోంది. ఉపాధి హామీ కూలీతో పాటు ఇతర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆమె కుమార్తె నల్లగొండలోని పారామెడికల్ కళాశాలలో నర్సింగ్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. కళాశాలకు సెలవులు ఇవ్వడంతో బాలిక ఇంటి వద్దే ఉంటోంది. అయితే తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన దేశబోయిన యశ్వంత్తో గత రెండు, మూడేళ్లుగా బాలిక చనువుగా ఉంటుంది. మూడు రోజుల క్రితం బాలిక యశ్వంత్ల మధ్య ఫోన్లో వాగ్వాదం చోటు చేసుకుంటుంది. దీంతో యశ్వంత్ ఫోన్ నంబరును బాలిక బ్లాక్లిస్ట్లో పెట్టడంతో యశ్వంత్ శుక్రవారం ఉట్లపల్లి గ్రామానికి చేరుకున్నాడు. వారిద్దరి మధ్య తిరిగి వాగ్వాదం నెలకొనడంతో యశ్వంత్ ఆమెను కొట్టి, ఆమె వద్ద ఉన్న సెల్ఫోన్ను లాక్కొని వెళ్లాడు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక (17) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గుర్తించి తల్లికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు అక్కడకు చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మిర్యాలగూడ డీఎస్పి రాజశేఖర్రాజు, మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబు ఏరియా ఆసుపత్రికి వచ్చి బాలిక కుటుంబ సభ్యుల ద్వారా సంఘటనకు దారి తీసిన విషయంపై ఆరా తీశారు. అయితే తలుపులు కూడా వేసుకోకుండా ఉరి వేసుకుని ఉండటంతో గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యశ్వంత్ కొట్టడంతోనే తన కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిందని డీఎస్పీ ఎదుట మృతురాలి తల్లి వాపోయింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ నరేష్ తెలిపారు. తక్కెళ్లపాడుకు చెందిన యువకుడే కారణమని తల్లి ఆరోపణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు ఆస్పత్రికి తరలివచ్చిన బంధువులు బాలిక ఆత్మహత్య విషయం తెలుసుకున్న ఉట్లపల్లి గ్రామంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి బంధువులు, మాలమహానాడు నేతలు ఏరియా ఆస్పత్రికి తరలివచ్చారు. ఆప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. -
పంట మార్పిడితో భూసారం
పెద్దవూర: రైతులు పంట మార్పిడి చేయకపోవడంతో చీడపీడల వ్యాప్తి ఎక్కువై దిగుబడి తగ్గుతోంది. ఒకే పంటను ఒకే భూమిలో ఏళ్ల తరబడి సాగు చేస్తే సమస్యలు ఎదురవుతాయి. చీడపీడల తాకిడి అధికమవుతుంది. భూమి సైతం నిస్సారంగా మారుతుంది. పంట మార్పిడి చేయడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చునని హాలియా ఇన్చార్జి ఏడీఏ కె. సందీప్ సూచిస్తున్నారు. వేర్వేరు పంటలు సాగు చేస్తే రైతులకు దిగుబడి పెరగడంతో పాటు భూమిలో సారం పెరుగుతుందని, చీడపీడల బెడద తక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. పంట మార్పిడికి సంబంధించి సూచనలు, సలహాలు ఆయన మాటల్లోనే.. ● నేల భౌతిక స్థితి మెరుగుపడుతుంది. ● భూమిలో నీరు నిల్వ ఉండే శక్తి కలిగి భూసారం వృద్ధి చెందుతుంది. ● చీడపీడలు దూరమవుతాయి. ● ఫలితంగా సస్యరక్షణకు వినియోగించే మందుల ఖర్చు తగ్గుతుంది. ● శిలీంధ్ర వ్యాధులను దూరం చేయవచ్చు. ● బీజాలు, వాటి అవశేషాలు, వానపాముల అభివృద్ధి కూడా ఎక్కువగానే ఉంటుంది. ● కీటకాల గుడ్లు వృద్ధి చెందకుండా చేసుకోవచ్చు. ● పంటలో నాణ్యత పెరిగి గిట్టుబాటు ఎక్కువగా పొందే అవకాశం ఉంటుంది. పంటమార్పిడిలో తీసుకోవాల్సిన మెలకువలు..● పంట మార్పిడిలో నేల ఉపరితలాన్ని పూర్తిగా కప్పే పంటల్ని ఎంపిక చేసుకోవాలి. శనగ, బొబ్బెర, పెసర, మినుము వంటి పంటలను వేసుకోవడం వలన నేలను పూర్తిగా కప్పి ఉంచుతాయి. దీనివలన కలుపు మొక్కలను నివారించవచ్చు. ● వరి తర్వాత మినుము, పెసర, వేరుశనగ, చెరకు వేయడం వలన సుడిదోమ, తుంగ్రో వైరస్ను నివారించవచ్చు. ● పత్తి సాగు చేసిన నేలలో మినుము, పెసర వంటివి వేయడం వలన తెల్లదోమ ఉదృతి తగ్గుతుంది. ● వేరుశనగ తర్వాత జొన్న, మొక్కజొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలి. దీనివలన వెరుశనగ పంటను ఆశించే ఆకుముడత ఉధృతిని తగ్గించవచ్చును. ● పసుపు తర్వాత వరి, జొన్న వంటి పంటలను సాగు చేసుకోవాలి. దీనివలన నేలలో నెమటోడ్ల సంఖ్య తగ్గుతుంది. ● నులిపురుగుల సమస్య అధికంగా ఉన్న ప్రదేశంలో వేరుశనగ, మిరప, పొగాకు, వంగ పంటలను కొంతకాలం పాటు తప్పనిసరిగా ఆపాలి. రైతులు పాటించాల్సినవి ● భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ చేసే శక్తి ఉన్నప్పుడు పంట తర్వాత వేరే పంటను వేసి ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి. ● తేలికపాటి నేలలు, ఎర్ర, ఇసుక నేలల్లో మిశ్రమ పంటలు వేసుకోవాలి. ● వర్షాకాలం రోజులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఎక్కువ పంటకాలం కలిగిన కంది, నువ్వులు, వేరుశనగ వంటి పంటలను వేసుకోవాలి. ● బంకమన్ను శాతం ఎక్కువగా ఉంటే ఎర్రనేలలు, నల్లరేగడి నేలలు, పల్లపు ప్రాంతాల్లో పంట మార్పిడి చేసే ఏడాదిలో రెండు పంటలు పండించుకోవాలి. ఇలా చేసుకోవచ్చు.. యాసంగిలో వేరుశనగ సాగు చేసిన రైతులు తర్వాత వానాకాలంలో మొక్కజొన్న పంట వేసుకుంటే పైరుకు కొంత నత్రజని లభిస్తుంది. దీంతో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చును. కంది, శనగ పంటలను వరుసగా వేస్తే కాయతొలుచు పురుగుల తాకిడి అధికంగా ఉంటుంది. అందుకే ఈ పురుగులు తక్కువగా ఆశించే జొన్న, సోయాచిక్కుడు, నువ్వులు, మినుము, ఉలవ, మెట్టవరి వంటి పంటలతో మార్పిడి చేసుకోవాలి. వరితో పంట మార్పిడి చేసుకుంటే వేరుశనగ పంటకు నులిపురుగుల బెడద తగ్గుతుంది. వరుసగా పొద్దుతిరుగుడు పంటను సాగు చేసే వారు కొర్ర, జొన్న, సజ్జ వంటి చిరుధాన్యాల పంటలను లేదా కంది, శనగ, మినుము వంటి ఆపరాల పంటలను లేదా వేరుశనగతో పంట మార్పిడి చేసుకోవచ్చు. వంగ తోట వేసిన రైతులు కాలీఫ్లవర్తో పంట మార్పిడి చేసుకుంటే వంగకు ఎండు తెగులు సోకదు. టమాట, ఆవాలు, బంతి ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేస్తే నులి పురుగుల ఉధతి తగ్గుతుంది. ఫ హాలియా ఇన్చార్జి ఏడీఏ కె. సందీప్ ఎంపికలో జాగ్రత్తలు తప్పనిసరి పంట మార్పిడి చేయాలంటే అంతకుముందు వేసిన పంటకు భిన్నంగా పెరిగే పంటను ఎంచుకోవాలి. కొన్ని పంటల వేరు వ్యవస్థలు నేలలోని పొరల నుంచి పోషకాలన్నీ ఎక్కువగా గ్రహిస్తూ ఉంటాయి. కాబట్టి పోషకాలన్నీ ఎక్కువగా గ్రహించే నువ్వులు, పొద్దు తిరుగుడు, మొక్కజొన్న పంటలకు బదులుగా భూమికి పోషకాలను గ్రహించి సమకూర్చే అపరాల పంటలతో పంట మార్పిడి చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అపరాల పంటలు కరువు పరిస్థితులను తట్టుకుంటాయి. ఆకుల్ని రాల్చి భూమికి సేంద్రీయ పదార్థాన్ని అందిస్తాయి. ఆపరాల పంటల మీద ఉండే బుడిపెలు వాతావరణంలోని నత్రజనిని స్థిరీకరిస్తాయి. సూక్ష్మ జీవుల చర్య వల్ల ఎంజైముల ఉత్పత్తి పెరుగుతుంది. నల్లరేగడి నేలల్లో సోయ చిక్కుడు వేసుకుంటే పంట కోత సమయానికి ఆకులు పూర్తిగా రాలుతాయి. తద్వారా ఎకరానికి ఒకటి నుంచి రెండు టన్నుల సేంద్రీయ పదార్థం లభిస్తుంది. ఇలా చేయవద్దు.. పంట మార్పిడి చేసే సమయాలలో అనుకూలమైన పంటనే ఎంచుకోవాలి. లేదంటే చీడపీడల ఉధృతి ఎక్కువ అవుతుంది. బెండ తర్వాత పత్తి వేస్తే ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఈ రెండు పంటలకు ఒకే రకమైన చీడపీడలు ఆశిస్తాయి. జొన్న వేసిన పొలాల్లో మిరప వేయకూడదు. పసుపు తర్వాత మిరప, టమాటా, క్యాబేజీ, దోస, గుమ్మడి, సోర, బీర, పత్తి, ఆవాలు, బెండ వేసుకోకూడదు. ఆకుముడత ఆశించే ప్రాంతాల్లో వేరుశనగ, సోయాచిక్కుడు వేయకూడదు. ధాన్యపు పంటలతో.. దోస, కాకర, గుమ్మడి, పొట్ల, బీర, బూడిద గుమ్మడి, దొండ వంటి తీగ జాతి కూరగాయల పంటలను వరి పైరుతో పంట మార్పిడి చేసుకోవాలి. ఉల్లిసాగు చేసే రైతులు ధాన్యపు పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. ఒకసారి పసుపు సాగు చేసిన వారు రెండేళ్లపాటు భూమిలో పసుపు సాగు చేయకూడదు. ఒకవేళ చేస్తే దిగుబడి తగ్గుతుంది. చీడపీడల బెడద పెరుగుతుంది. వరి, చెరుకు, అరటి, తమలపాకు, కూరగాయల పంటలతో పంట మార్పిడి చేసుకోవాలి. పసుపు తర్వాత వరి, జొన్న వేసుకుంటే నులి పురుగుల ఉధృతి తగ్గుతుంది. మిరప, వేరుశనగ, క్యాబేజీ పంటలను ఆశించే లద్దె పురుగుల తాకిడి అరికట్టాలంటే జొన్న, వరి, సజ్జ, రాగి, పొద్దుతిరుగుడు వంటి ఆరుతడి పంటలతో మార్పిడి చేయాలి. -
విద్యుదాఘాతంలో ఐదు గేదెలు మృతి
కేతేపల్లి: కేతేపల్లి మండలంలోని కొత్తపేట గ్రామంలో శుక్రవారం విద్యుదాఘాతంతో ఐదు పాడి గేదెలు మృతి చెందాయి. గురువారం రాత్రి వీచిన ఈదురుగాలులకు కొత్తపేట గ్రామశివారులోని వాగు వెంట ఉన్న పంట భూముల్లో విద్యుత్ తీగలు తెగి పడ్డాయి. ఈక్రమంలో శుక్రవారం ఉదయం స్థానికురాలైన దాసరి సునీతకు చెందిన ఐదు పాడి గేదెలు మేత కోసం గ్రామ శివారులోకి వెళ్లగా.. కింద పడి ఉన్న విద్యుత్ తీగలు గేదెల కాళ్లకు తగిలి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాయి. వీటి విలువ రూ. 2లక్షలకు పైగానే ఉంటుందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. సైదాపురం గ్రామంలో 6 గొర్రెలు మృత్యువాత యాదగిరిగుట్ట: మండలంలోని సైదాపురం గ్రామంలో విద్యుదాఘాతానికి గురై ఆరు గొర్రెలు మృతి చెందాయి. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుండా శంకరయ్య తన గొర్రెలను మేపుతుండగా సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు 6 గొర్రెలు తగిలాయి. దీంతో ఆ గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. సుమారు రూ.80వేల నష్టం జరిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ సర్పంచ్ బీర్ల శంకర్, ఉప సర్పంచ్ దుంబాల సురేఖ వెంకట్రెడ్డి, నాయకులు శిఖ ఉపేందర్, పెద్ద కుర్మ నంద వెంకటేష్ కోరారు. -
రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
యాదాద్రి భువనగిరి, సాక్షి: పది వేల మందిలో ఒకరికి అరుదుగా వచ్చే వ్యాధి అది. నెలలు కూడా నిండని తమ బిడ్డను బతికించుకునేందుకు ఆ తల్లిదండ్రులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కోట్లలో ఖరీదు చేసే ఇంజెక్షన్ కోసం సగానికి పైగా సాయం సమకూరగా.. మిగిలిన సాయం అందేలోపే పరిస్థితి విషమించింది. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతంగా ముగిసింది. ఆ తల్లిదండ్రులకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. వలిగొండ మండలం పులిగిల్లకు చెందిన ఆరు నెలల చిన్నారి భవిక్రెడ్డి అరుదైన జెనెటిక్ డిసీజ్ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ(SMA) బాధపడ్డాడు. ఆ పసికందు బతకాలంటే రూ.16 కోట్లు ఇంజెక్షన్ అవసరం. తండ్రి దిలీప్ ఎలక్ట్రిషీయిన్. దీంతో ఖరీదైన చికిత్స ఆ కుటుంబానికి కష్టం తెచ్చి పెట్టింది. అయితే నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి క్రౌడ్ ఫండింగ్ చేపట్టింది. దాని ద్వారా విదేశాల నుంచి రూ.10 కోట్లు సమకూరగా.. మరో ఆరు కోట్ల సాయం కోసం దాతల్ని ఆశ్రయించారు ఆ తల్లిదండ్రులు. సాక్షి సైతం నిన్న(మే 16 గురువారం) ఆ వార్తను ప్రచురించి.. దాతల కోసం పిలుపు ఇచ్చింది. అయితే.. ఇంతలోనే ఆ చిన్నారి ఆరోగ్యం విషమించింది. హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భవిక్ కన్నుమూశాడు. ఖరీదైన ఇంజెక్షన్ కోసం సగం కంటే ఎక్కువ సాయం సమకూరినా.. మిగిలిన సాయం కోసం సమకూరేలోపే ఆ చిన్నారికి నూరేళ్లు నిండిపోయాయి.ఎస్ఎంఏ అంటే స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ. ఈ జన్యులోపం అందరిలో కనిపించదు. తల్లిదండ్రులు క్యారియర్లుగా ఉండి.. పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుంది. మనుషుల్లోని 23 జతల క్రోమోజోములు ఉంటాయి. వీటిల్లో క్రోమోజోమ్ -5లో సర్వైవల్ మోటార్ న్యూరాన్-1(ఎస్ఎంఎన్1) వంటి జన్యువు లోపం ఏర్పడుతుంది. కండరాల స్పందనకు ఈ జన్యువు చాలా కీలకం. ఇది శరీరంలో అవసరమైన ఎస్ఎంఎన్ ప్రొటీన్ తయారు చేయడానికి చాలా అవసరం. మోటార్ న్యూరాన్ కణాలకు ఇది చాలా కీలకం. వాస్తవానికి ఎస్ఎంఎన్-2 రూపంలో శరీరం దీనిని బ్యాకప్ జన్యువు ఉంచుకొన్నా అది ఉత్పత్తి చేసే ఎస్ఎంఎన్ ప్రొటీన్ సరిపోదు. కేవలం 10శాతం మాత్రమే తయారు చేస్తుంది. ఫలితంగా మోటార్ న్యూరాన్ కణాలు బలహీనమైపోతాయి. అమెరికాలో ఏటా ఈ లోపంతో సుమారు 400 మంది పిల్లలు జన్మిస్తారని అంచనా. ఎస్ఎంఏ 1, 2, 3, 4 రకాలు ఉన్నాయి. వీటిల్లో టైప్-1 ప్రమాదకరమైంది.లక్షణాలు..కండరాలు బలహీనంగా ఉండటం మెడపై ఎటువంటి పట్టు లేకపోవడంకూర్చోవడం, నిలబడటం, నడవటం చేయలేరుపాలుతాగడం వంటివి వాటికి కూడా ఇబ్బంది పడతారుఊపిరి తీసుకోవడంలో కూడా ఇబ్బంది ఎదుర్కొంటారు.చికిత్స ఇలా..ఎస్ఎంఏ-1 చిన్నారులు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. ఒకప్పుడు వీరికి చికిత్స చేయడానికి అవకాశం ఉండేది కాదు. దీంతో వీరి ఆయుర్దాయం దాదాపు రెండేళ్లు మాత్రమే ఉండేది. కానీ, ఇప్పుడు నొవార్టిస్ కంపెనీ ప్రయోగాత్మకంగా ‘జోల్జెన్స్మా’ అనే జన్యు చికిత్స ఇంజెక్షన్ను తయారు చేసింది. ఇది పూర్తిగా తగ్గించకపోయినా.. టైప్ 1 నుంచి వచ్చే ఎన్నో సమస్యల నుంచి బిడ్డ కోలుకొనేట్లు చేస్తుంది. దీని ధర రూ.16 కోట్లు ఉంది. ఇక దీనిని దిగుమతి చేసుకొనేందుకు చెల్లించాల్సిన సుంకాలను కలుపుకొంటే మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఔషధాన్ని అమెరికా నుంచి తరలించడం మొదలైన రోజు నుంచి 14 రోజుల్లోపే వాడుకోవాలి. దీని షెల్ఫ్లైప్ 14 రోజులు మాత్రమే. -
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
ఫ శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ల అందజేత సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి జూన్ 22 వ తేదీ వరకు బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ ఇవ్వనున్నారు. ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిక్షణ ఇస్తారు శిక్షణలో నేర్పించే అంశాలు త్రెడ్డింగ్, వ్యాక్స్, పెడిక్యూర్, మెనిక్యూర్, బ్లీచింగ్, స్కిన్కేర్, హెయిర్ కేర్, వైట్నింగ్ ఫేస్ ప్యాక్స్, డ్యాండ్రఫ్ ట్రీట్మెంట్, హెయిర్ ఫాల్ ట్రీట్మెంట్, హెయిర్ కట్స్, హెయిర్ స్టైల్స్, హెన్నా ప్రిపరేషన్, డై అప్లికేషన్, మేకప్స్ (బ్రైడల్, పార్టీ, లైట్ మేకప్స్),హెయిర్ మసాజ్, కమ్యూనికేషన్ అండ్ గ్రూమింగ్, ఫేషియల్స్రిజిస్ట్రేషన్స్, శిక్షణ స్థలం సాహితీ బ్యూటీ పార్లర్ అండ్ ట్రైనింగ్ సెంటర్, ఏకలవ్య స్కూల్ రోడ్, శివాజీ నగర్, నల్లగొండ సెల్ : 96660 13544, 80747 42864రిజిస్ట్రేషన్ స్వీకరించు తేదీలు : ఈ నెల 17వ తేదీ (నేటి) నుంచి 22వ తేదీ వరకు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు. ఫీజు : రూ.3 వేలు వర్క్షాప్ షెడ్యూల్ తేదీలు: ఈ నెల 23వ తేదీ నుంచి జూన్ 22వ తేదీ వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు శిక్షణ ఉంటుంది. -
No Headline
నల్లగొండ టూటౌన్: వరంగల్–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డిని ఆదరించి గెలిపించాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. గురువారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పట్టభద్రులంతా గుజ్జుల ప్రేమేందర్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసేలా పార్టీ కార్యకర్తలంతా ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలన్నారు. ప్రతి ఓటరు దగ్గరకు బీజేపీ కార్యకర్త నేరుగా వెళ్లి కలిసి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథాకలను వివరిస్తూ ఓటు అభ్యర్థించాలన్నారు. నిరుద్యోగ యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని, కాంగ్రెస్ మోసపూరిత విధానాలను పట్టభద్రులకు, నిరుద్యోగ యువతకు వివరించాలని కోరారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డి జిల్లా కోర్టుకు వెళ్లి న్యాయవాదులను కలిసి తనకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, నల్లగొండ ఎంపీ అభ్యర్థి శానంపుడి సైదిరెడ్డి, నాయకులు గోలి మధుసూదన్రెడ్డి, మాదగాని శ్రీనివాసగౌడ్, నూకల నర్సింహారెడ్డి, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, పిల్లి రామరాజు, రావెల్ల కాశమ్మ, కంకణాల నివేదిత, నూకల వెంకట నారాయణరెడ్డి, పోతెపాక సాంబయ్య, ఫకీర్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఫ మాజీ మంత్రి ఈటల రాజేందర్ -
ఏసీబీకి చిక్కిన విద్యుత్ లైన్మన్
చింతపల్లి: విద్యుత్ స్తంభం ఏర్పాటు చేసేందుకు రైతు వద్ద నుంచి రూ.20వేలు లంచం తీసుకుంటూ విద్యుత్ లైన్మన్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ జగదీశ్ తెలిపిన ప్రకారం.. చింతపల్లి మండల పరిధిలోని మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు గ్రామంలోని తన వ్యవసాయ పొలం వద్ద బోరుతో పాటు ఇంటి వద్ద విద్యుత్ కనెక్షన్ కోసం విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయాలని 2022లో దరఖాస్తు చేసుకున్నాడు. కాలయాపన చేస్తూ వచ్చిన విద్యుత్ లైన్మన్ నడింపల్లి వేణుకుమార్ విద్యుత్ స్తంభం ఏర్పాటు చేసేందుకు రూ.50వేలు లంచం డిమాండ్ చేశాడు. మొదటి విడతగా రూ.20వేలు, పని పూర్తిచేసిన తర్వాత మిగిలిన రూ.30వేలు ఇచ్చేలా అంగీకారం కుదిరింది. ఈ తరుణంలోనే రెండేళ్లుగా లైన్మన్ చుట్టూ తిరిగిన ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం మధ్యాహ్నం చింతపల్లి మండల కేంద్రంలోని సాయిబాబా దేవాలయం వద్ద రైతు నుంచి రూ.20వేలు లంచంగా తీసుకుంటుండగా విద్యుత్ లైన్మన్ నడింపల్లి వేణుకుమార్ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం వేణును అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఫ విద్యుత్ స్తంభం ఏర్పాటు చేసేందుకు లంచం డిమాండ్ ఫ రూ.20వేలు తీసుకుంటూ పట్టుబడ్డ వైనం -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
సంస్థాన్ నారాయణపురం: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందాడు. వివరాలు.. సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామానికి చెందిన వ్యాపారవేత్త బెలిదె అశోక్(65) ఏప్రిల్ 27న పుట్టపాక నుంచి జనగాంకు బైక్పై వస్తుండగా రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అతడి తలకు బలమైన గాయం కావడంతో గత 18రోజులుగా హైదరాబాద్లో చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతిచెందాడు. గురువారం అశోక్ భౌతికకాయానికి పలువురు వ్యాపారవేత్తలు, కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. మృతుడికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాంగ్రెస్ నాయకుడిపై దాడిచౌటుప్పల్: పట్టణ కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. వివరాలు.. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని బీసీకాలనీకి చెందిన పల్చం శ్రీనివాస్ వ్యాపారం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నాడు. తన అన్న పల్చం సత్యంతో కలిసి ఆయన 10వ వార్డు పార్టీ బాధ్యతలు చూసేవారు. ఇటీవల ఇతర పార్టీల నుంచి కొంతమంది నాయకులు కాంగ్రెస్లో చేరారు. లోక్సభ ఎన్నికల్లో వార్డు బాధ్యతలు వీరికి కాకుండా కొత్తగా పార్టీలో చేరిన వారికి అప్పగించారు. దీంతో అన్నదమ్ములు ఇద్దరూ అసంతృప్తితో ఉన్నారు. లోక్సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చౌటుప్పల్లోని జెడ్పీహెచ్ఎస్ వద్ద పార్టీ మున్సిపాలిటీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడు బాలు మహేందర్ను ఇదే విషయమై వారు నిలదీశారు. దీంతో మాటామాటా పెరగడంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. ఇతర నాయకులు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. గురువారం సాయంత్రం చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ వద్ద శ్రీనివాస్ టీ తాగుతుండగా.. నంబర్ ప్లేట్ లేని ఓ స్కార్పియో వాహనం వచ్చింది. అందులో నుంచి ఐదారుగురు వ్యక్తులు బయటకు దిగి పక్కనే ఉన్న రాళ్లను తీసుకొని శ్రీనివాస్పై దాడి చేసి పారిపోయారు. తీవ్రగాయాలపాలైన శ్రీనివాస్ను స్థానికులు స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా తనపై బాలు మహేందర్ దాడి చేయించాడని శ్రీనివాస్ ఆరోపించారు. బాలు మహేందర్తో పాటు ఎమ్మెల్యేతో కూడా తనకు ప్రాణహాని ఉందని అన్నారు. మెరుగైన చికిత్స నిమిత్తం శ్రీనివాస్ను హైదరాబాద్కు తరలించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
ప్రశ్నించే గొంతుకకు ఓటేయాలి
నల్లగొండ టూటౌన్: ఖమ్మం, వరంగల్, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో ప్రశ్నించే గొంతుక బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. గురువారం నల్లగొండ పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చిన్ననాటి నుంచే విద్యార్థుల సమస్యలపై పోరాడిని చరిత్ర ప్రేమేందర్రెడ్డిదని అన్నారు. ప్రజల పక్షాన 40 సంవత్సరాలుగా పోరాడుతున్నారని తెలిపారు. పట్టభద్రుల ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు, ప్రైవేట్ టీచర్లు, మేధావులు, నిరుద్యోగులు, యువతతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రేమేందర్రెడ్డిని గెలిపించాల్సిన ఆవశ్యకతను వివరిస్తామన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ హవా ఉందని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి యువత వెన్నుదన్నుగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే చట్టసభలలో ప్రతిపక్షం బలంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ను ప్రజలు ఛీ కొడుతున్నారని, బీఆర్ఎస్లో గెలిచిన వాళ్లే పార్టీ మారుతున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ గుజ్జుల ప్రేమేందర్రెడ్డి మాట్లాడుతూ.. తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే యువత, ప్రజల పక్షాన మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు, పెద్దపల్లి ఎంపీ వెంకటేష్నేత, పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్రెడ్డి, నల్లగొండ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి, గోలి మధుసూదన్రెడ్డి, మాదగాని శ్రీనివాస్గౌడ్, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, వీరెళ్లి చంద్రశేఖర్, నూకల వెంకట్నారాయణరెడ్డి, పోతెపాక సాంబయ్య, కంకణాల నివేదిత తదితరులు పాల్గొన్నారు. ఫ మాజీ మంత్రి ఈటల రాజేందర్ -
అమరుల ఆశయసాధనకు కృషిచేద్దాం
ఫ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రామగిరి(నల్లగొండ): అమరుల ఆశయసాధనకు కృషిచేద్దామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. గురువారం తిప్పర్తి మండలం అనిశెట్టిదుప్పలపల్లిలో నిర్వహించిన సీపీఎం సీనియర్ నాయకుడు నన్నూరి అంజిరెడ్డి సంతాప సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దోపిడీ, అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసం నిరంతరం పోరాడే వారే కమ్యూనిస్టులు అన్నారు. నిరంతరం పేదల హక్కుల కోసం పోరాడిన అంజిరెడ్డి మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. రాజకీయాల్లోకి బడా కార్పొరేట్ కంపెనీల అధినేతలు చొరబడి కలుషితం చేశారని ఆరోపించారు. అంజిరెడ్డి పార్థివదేహాన్ని మెడికల్ కళాశాలకు అందజేయడం అభినందనీయమన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ.. నన్నూరి అంజిరెడ్డి తన ఇంటిని సీపీఎం కార్యాలయంగా మార్చుకుని పేదలకు ఎంతో సేవ చేశారని గుర్తుచేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్రెడ్డి, పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు బొంతల చంద్రారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండా శ్రీశైలం, సయ్యద్ హాశం, పాలడుగు నాగార్జున, చిన్నపాక లక్ష్మీనారాయణ, పాలడుగు ప్రభావతి, సీనియర్ నాయకులు ఊట్కూరి నారాయణరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఎండీ సలీం, గంజి మురళీధర్, సత్తయ్య పాల్గొన్నారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
బద్ధిపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
వేసవిలో ‘చల్లని’ సేవ
గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదివించండి
వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
బుద్ధ జయంతిని విజయవంతం చేయాలి
ఎప్సెట్ ఫలితాల్లో ‘శ్రీచైతన్య’ విజయకేతనం
ఏషియన్ పవర్ లిఫ్టింగ్లో బంగారు పతకం
నేటి నుంచి జీల్గుల మల్లికార్జునస్వామి ఉత్సవాలు
వ్యానును ఢీకొన్న కారు
తప్పక చదవండి
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
- నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
- దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
- Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
- టైముకు తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
- తెలంగాణ ఈఏపీసెట్లో ఏపీ ప్రభంజనం
Advertisement