అమేథీలో ఇలాంటి చర్య మొదటిసారి చూస్తున్నా.. కిషోరి లాల్ శర్మ | Sakshi
Sakshi News home page

అమేథీలో ఇలాంటి చర్య మొదటిసారి చూస్తున్నా.. కిషోరి లాల్ శర్మ

Published Mon, May 6 2024 2:41 PM

We Are Not Scared by this Act Kishori Lal Sharma

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై ఆదివారం రాత్రి బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. దీనిని అమేథీ బరిలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి 'కిషోరి లాల్ శర్మ' తీవ్రంగా ఖండించారు. ఇలాంటి చర్యలకు తాము భయపడబోమని శర్మ పేర్కొన్నారు.

పార్టీ కార్యాలయం మీద దాడి చేయడం సమంజసం కాదని, ఇది అమేథీ సంస్కృతికి విరుద్ధమని కిషోరి లాల్ శర్మ వ్యాఖ్యానించారు. ఇప్పటికి అనేకసార్లు ఈ నియోజక వర్గంలో ఎన్నికలు జరిగాయి. కానీ ఎప్పుడూ ఇలాంటి చర్య మాత్రం జరగలేదు. ఇలాంటి చర్యలను మొదటిసారి చూస్తున్నానని ఆయన అన్నారు.

బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల సిద్ధాంతాలు భిన్నంగా ఉన్నప్పటికీ.. వారి పనితీరును బట్టి ఓట్లు అడగాలి. ఆలా కాకుండా పార్టీ కార్యాలయాల మీద దాడి చేయడం క్షమించరాని నేరమని, నిందితులను పోలీసులు గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

ఈ ఘటనను యూపీ కాంగ్రెస్ ఇన్‌చార్జి అవినాష్ పాండే ఖండించారు. రాష్ట్రంలో బీజేపీ మూలాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, స్మృతి ఇరానీ తమ ఓటమిని స్పష్టంగా చూస్తున్నారు. అందుకే అమేథీలో హింసాత్మక పరిస్థితిని సృష్టించాలని చూస్తున్నారని ఆయన అన్నారు.

అమేథీ కాంగ్రెస్ పార్టీలో జరిగిన సంఘటన గురించి ఎస్పీ అనూప్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. కొంతమంది వ్యక్తులు బయట పార్క్ చేసిన వాహనాల అద్దాలు పగలగొట్టారని, ఆదివారం రాత్రి కాంగ్రెస్ జిల్లా కార్యాలయం నుంచి మాకు ఫోన్ వచ్చింది. సంఘటన గురించి తెలుసుకుని, పోలీసు బలగాలను సంఘటనా స్థలానికి పంపారు. సద్దాం హుస్సేన్ అనే వ్యక్తి తన వాహనాన్ని ధ్వంసం చేశాడని, అతనిపై రాళ్లు రువ్వడం వల్ల ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసి, అవసరమైన చర్యలు తీసుకుంటామని అనూప్ సింగ్ తెలిపారు.

Advertisement
 
Advertisement