-
పైకి పొత్తులు.. వెనుక కత్తులు!
●● కూటమి అభ్యర్థుల్లో అంతర్మధనం ● గెలుపుపై సన్నగిల్లుతున్న నమ్మకం ● వలస అభ్యర్థులకు సహకరించని స్థానిక నేతలు ● వాళ్లు నిజంగా మద్దతు ఇచ్చారో లేదో తెలియక మల్లగుల్లాలు సాక్షి, రాజమహేంద్రవరం: సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన పోలింగ్ ప్రక్రియ ముగిసి, నాలుగు రోజులైంది. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో బరిలోకి దిగిన అభ్యర్థులు గెలుపోటములపై బేరీజు వేసుకుంటున్నారు. పోలింగ్ సరళిపై లెక్కలతో కుస్తీలు పడుతున్నారు. ఏ వర్గం, ఏ వార్డు తమకు అండగా నిలిచాయో అంచనా వేసుకుంటున్నారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. సీట్ల సర్దుబాటులో భాగంగా వివిధ నియోజకవర్గాల్లో కూటమి తరఫున పోటీ చేసిన వలస అభ్యర్థుల్లో మాత్రం గెలుపుపై మీమాంస నెలకొంది. కూటమిలోని ఇతర పార్టీల నేతలు, కార్యకర్తలు కీలకమైన పోలింగ్ సమయంలో నిజంగానే తమకు మద్దతు తెలిపారా లేక వెన్నుపోటు పొడిచారా అని అనుమానపడుతున్నారు. కడుపులో కత్తులు పెట్టుకుని పైకి మాత్రం కౌగిలించుకున్న చందంగా వ్యవహరించారా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. బయటకు తమతో తిరుగుతూనే.. ఓటు వేయించాల్సిన సమయంలో మిన్నకుండిపోయారేమోనని, అదే జరిగితే తమ రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకమవుతుందని ఆందోళన చెందుతున్నారు. కూటమి తెచ్చిన తంటా సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. సీట్ల సర్దుబాటులో భాగంగా జిల్లాలోని నిడదవోలు, రాజానగరం అసెంబ్లీ స్థానాలను జనసేనకు.. రాజమండ్రి ఎంపీ, అనపర్తి ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ కట్టబెడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామం ఆయా స్థానాల్లో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఆశిస్తున్న టీడీపీ నేతలకు అప్పట్లోనే మింగుడు పడలేదు. దీంతో ఆ పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. చివరకు అధినేత చంద్రబాబునే ఎదిరించి, అడ్డుకునే స్థాయికి చేరాయి. నేతల ఆందోళనకు తలొగ్గిన బాబు రాజీ మంత్రం పఠించారు. అసమ్మతి నేతలను పిలిపించుకుని బుజ్జగించారు. విభేదాలు పక్కన పెట్టి కలసికట్టుగా పని చేయాలని హితబోధ చేశారు. కూటమి అధికారంలోకి వస్తే తగిన గుర్తింపు కల్పిస్తామని ఎర వేశారు. పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టినా.. బాబు పట్టించుకోకపోవడంతో అదును చూసి దెబ్బ కొట్టాలని టీడీపీ శ్రేణులు భావించాయి. దీంతో అప్పటికి బాబు ప్రతిపాదనకు ఓకే చెప్పేశారు. ఇంకేముంది! బీజేపీ, టీడీపీ, జనసేన శ్రేణులన్నీ కలసికట్టుగా పని చేస్తాయని చంద్రబాబు భావించారు. బాబు భరోసాతో కొందరు టీడీపీ నేతలు ప్రచారాన్ని ముందుండి నడిపించారు. కూటమి అభ్యర్థిని గెలిపించాలని విస్తృతంగా పర్యటించారు. కానీ, నిజంగా పోలింగ్ సమయం వచ్చేసరికి కూటమిలోని కొంత మంది ఇతర పార్టీల నేతలు అనూహ్యంగా అభ్యర్థులకు వ్యతిరేకంగా పని చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా టీడీపీ నేతలే ఈవిధమైన చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ మిత్రపక్షం అభ్యర్థి గెలిస్తే తమ రాజకీయ భవిష్యత్తు దెబ్బ తింటుందనే ఉద్దేశంతోనే వారు ఈవిధంగా చేశారని అంటున్నారు. చిన్నమ్మకు చుక్కెదురు రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పోటీ చేసిన విషయం తెలిసిందే. రాజమండ్రిలో రంగప్రవేశం చేసిన వెంటనే చిన్నమ్మ తనదైన శైలిలో వ్యవహారం నడిపారు. సొంత పార్టీ బీజేపీనే విస్మరించారు. సొంత దుకాణం తెరిచారు. స్వపక్ష నేతలను పక్కన పెట్టారు. టీడీపీ నేతలు, తన మరిది చంద్రబాబు ప్రయోజనాల కోసం పాటు పడ్డారు. ఈ పరిణామం అప్పటికే రాజమండ్రి ఎంపీ స్థానం ఆశిస్తున్న టీడీపీ నేత బొడ్డు వెంకట రమణ చౌదరి వర్గంలో ఆగ్రహావేశాలను నింపింది. ఈ వర్గం ఎన్నికల్లో పైకి మద్దతు తెలిపినట్లు నటించినా.. లోలోపల మాత్రం ఆమెకు సహకరించిన దాఖలాలు లేవు. పార్లమెంటరీ నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి. పురందేశ్వరిపై ఉన్న వ్యతిరేకతతో వైఎస్సార్ సీపీ ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్కు ఓటు వేయాలంటూ కొందరు కూటమి నేతలే ప్రచారం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కూటమిలోని ఇతర పార్టీల నేతలు సహకరించకపోవడంతో పురందేశ్వరి తన విజయంపై ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇవ్వాల్సిన ఎన్నికల నిధుల్లో సైతం చిన్నమ్మ కోత విధించడంతో పార్లమెంటరీ నియోజకవర్గ వ్యాప్తంగా ఆమెకు వ్యతిరేక పవనాలు వీచినట్లు చెబుతున్నారు. -
రాజానగరంలోనూ అంతే..
రాజానగరంలోనూ ఇదే పరిస్థితి. ఈ ఎమ్మెల్యే సీటును టీడీపీ నేత బొడ్డు వెంకట రమణ చౌదరికి కేటాయించనున్నామని చంద్రబాబు తొలినాళ్లలో చెప్పారు. నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు సైతం అప్పగించారు. అంతలోనే అనూహ్యంగా జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ తెర పైకి వచ్చారు. ఈ పరిణామం బొడ్డు వర్గంలో ఆగ్రహావేశాలు నింపింది. బాబు బుజ్జగింపులతో మెత్తబడిన బొడ్డు.. జనసేన నేత బత్తులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తమ వర్గాన్ని సైతం ఆయన వెంట తిప్పారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. తీరా పోలింగ్ సమయంలో మాత్రం ఆశించిన మేరకు సహకారం అందించలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. -
ముళ్లపూడి వర్గం గరంగరం
గోపాలపురంలో తాను వ్యతిరేకించిన మద్దిపాటి వెంకట్రాజుకు టీడీపీ టికెట్టు ఇచ్చేందుకు చేసిన ప్రయత్నాలను ఆ పార్టీకి చెందిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మొదటి నుంచీ వ్యతిరేకించారు. అయితే, మద్దిపాటి వెంకట్రాజుకే బాబు టికెట్టు ఇచ్చారు. దీంతో ఇరువర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ముళ్లపూడి వర్గం ఏకంగా చంద్రబాబునే అడ్డుకునేందుకు ప్రయత్నించింది. అనంతరం బాబు మైండ్వాష్తో ముళ్లపూడి బెట్టు వీడి.. కాస్త మెట్టు దిగారు. మద్దిపాటికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రచారంలో పాల్గొన్నారు. అయితే, ఈ పరిణామం ఆయన వర్గీయుల్లో ఆగ్రహావేశాలు నింపింది. ఎన్నికల్లో ఆ వర్గం ముళ్లపూడికి దూరమైంది. చేసేది ముళ్లపూడి సైతం పైకి మద్దిపాటికి సహకరిస్తున్నట్లు ఉన్నా.. లోలోపల మాత్రం అనుకున్న సహకారం అందించలేదనే ఆరోపణలు వస్తున్నాయి. -
శేషారావు సైలెంట్?
టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు సైతం నిడదవోలు నుంచి ఆ పార్టీ టికెట్టు ఆశించి భంగపడ్డారు. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా రాజమండ్రి రూరల్లో ఉన్న జనసేన నేత కందుల దుర్గేష్కు నిడదవోలు టికెట్టు ఇచ్చారు. దీనిపై కొన్నాళ్లు వర్గవిభేదాలు కొనసాగినా.. చంద్రబాబు జోక్యంతో ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది. దుర్గేష్ను గెలిపించాలని తన వర్గీయులను, ప్రజలను శేషారావు కోరారు. అందుకుగాను ప్రజల కాళ్లు మొక్కుతున్నట్లు సభలో పాదాభివందనం చేశారు. ఇంత వరకూ బాగానే ఉన్నా.. ఒకవేళ దుర్గేష్ను గెలిపిస్తే తన రాజకీయ భవిష్యత్తు ఏమిటనే ఆందోళన ఆయనను వెంటాడింది. అలా జరగడం తనకు తీరని నష్టాన్ని కలిగిస్తుందని భావించిన శేషారావు.. పోలింగ్కు వారం రోజుల ముందు నుంచి దుర్గేష్కు ఆశించిన మేర సహకారం అందించలేదని చెబుతున్నారు. పైకి మాత్రం రోజంతా ప్రచారాల్లో పాల్గొంటున్నా.. దుర్గేష్కు కచ్చితంగా ఓటేయాలని తన వర్గానికి శేషారావు సూచించలేదని అంటున్నారు. రాజమండ్రి సిటీ, రూరల్ నియోజకవర్గాల్లో వింత పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే ఓటు తమకు వేయాలని, ఎంపీ ఓటు మీ ఇష్టమని టీడీపీ రూరల్, సిటీ ఎమ్మెల్యే అభ్యర్థులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు ప్రచారం చేసినట్లు తెలిసింది. -
హుండీల ఆదాయం రూ 3.70 లక్షలు
పెరవలి: అన్నవరప్పాడులో వేంచేసియున్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారి హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించినట్లు ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. ప్రధాన హుండీతో పాటు ఉప ఆలయాల హుండీల ద్వారా స్వామివారికి 50 రోజులకు రూ.3,70,291 ఆదాయం వచ్చిందని వివరించారు. ఈ ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి వినియోగిస్తామన్నారు. ఆలయ కమిటీ, గ్రామ పెద్దలు సహకారంతో ప్రతి శనివారం ఉచిత అన్న సమారాధన నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో తీపర్రు గ్రూప్ దేవాలయాల ఈఓ ఎంవీ రామయ్య, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. పలు రైళ్లలో అదనపు ఏసీ కోచ్లురాజమహేంద్రవరం సిటీ: వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల సౌకర్యార్థం రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లలో శనివారం నుంచి 21వ తేదీ వరకూ అదనంగా ఒక థర్డ్ ఏసీ కోచ్ ఏర్పాటు చేశారు. రైల్వే అధికారులు గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. సికింద్రాబాద్ – విశాఖపట్నం – సికింద్రాబాద్ (12740/12739), సికింద్రాబాద్ – విశాఖపట్నం – సికింద్రాబాద్ (22204/22203) రైళ్లలో ఈ అదనపు ఏసీ కోచ్లు ఏర్పాటు చేశామని వివరించారు. వాడపల్లి వెంకన్న ఆదాయం రూ.90.45 లక్షలు ఆలమూరు: వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి నెల రోజుల వ్యవధిలో రూ.90.45 లక్షల ఆదాయం లభించింది. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ డి.నాగమల్లేశ్వరరావు పర్యవేక్షణలో గురువారం ఆలయ ఆవరణలో హుండీల ఆదాయం లెక్కింపు జరిగింది. ప్రధాన హుండీల ద్వారా రూ. 67,40,864, అన్న ప్రసాదం హుండీ ద్వారా 23,04,531 ఆదాయం లభించింది. 710 గ్రాముల బంగారం విరాళాల ద్వారా ఆలయ కమిటీకి అందినట్టు ఏసీ నాగమల్లేశ్వరరావు తెలిపారు. -
ఫిట్నెస్కు వేళాయె..
● స్కూల్ బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ ● జిల్లాలో 1,284 విద్యా సంస్థల బస్సులు బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లాలోని వివిధ విద్యా సంస్థలకు చెందిన బస్సులకు ఏటా ఇచ్చే ఫిట్నెస్ సర్టిఫికెట్ల (ఎఫ్సీ) జారీ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. పాఠశాలలు, కళాశాలలు తెరిచే నాటికి వాహనాల పరిస్థితి సక్రమంగా ఉండాలన్న ఆదేశాల మేరకు రాష్ట్ర రవాణా శాఖ అధికారులు ఈ ఎఫ్సీలు జారీ చేయనున్నారు. కాకినాడ, పెద్దాపురం, కత్తిపూడి ప్రాంతాల్లోని రవాణా శాఖ కార్యాలయాల పరిధిలోని మండలాల్లో ఉన్న వాహనాలను తనిఖీ చేసి ఎఫ్సీలు జారీ చేయనున్నారు. ఈ నెలంతా ముఖ్యంగా బస్సులకు ఎఫ్సీలు జారీ చేయనున్నారు. దీనికోసం ప్రత్యేకంగా సిబ్బందిని కేటాయించి, ఆయా బస్సులను పూర్తి స్థాయిలో తనిఖీ చేస్తారు. జిల్లా వ్యాప్తంగా 1,284 స్కూల్ బస్సులు ఉన్నాయి. 2018 తరువాత కొనుగోలు చేసిన వాటికి రెండేళ్లకోసారి, అంతకుముందు కొనుగోలు చేసిన వాహనాలకు ప్రతి ఏటా ఎఫ్సీ తీసుకోవాల్సిందే. ఇవీ నిబంధనలు ● రవాణా శాఖ నిబంధన 185–ఎఫ్ ప్రకారం ప్రతి పాఠశాల, కళాశాలల బస్సులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి. ● 60 సంవత్సరాల వయస్సు దాటిన వారు డ్రైవర్గా పని చేయడానికి అనర్హులు. ● పాఠశాల బస్సు నడిపే డ్రైవర్కు బీపీ, షుగర్, కంటి సంబంధిత సమస్యలు లేవని సర్టిఫికెట్ సమర్పించాలి. ఈ సర్టిఫికెట్ బస్సులో ఒకటి, యజమాని వద్ద ఒకటి తప్పనిసరిగా ఉండాలి. ● డ్రైవర్ నియామకం సమాచారాన్ని ఆర్టీఓ అధికారులకు తప్పనిసరిగా తెలియజేయాలి. ● డ్రైవర్గా పనిచేసేవారికి కనీసం ఐదేళ్ల అనుభవం, హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. ● కళాశాలలు ప్రిన్సిపాల్స్, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలి. ప్రతి నెలా వాహనం స్థితిగతులను నమోదు చేయాలి. బస్సులో తప్పనిసరిగా ఫిర్యాదు పుస్తకం ఉండాలి. ● బస్సులో అన్ని లైట్లు, సిగ్నల్స్ కచ్చితంగా పని చేయాలి. ● బస్సుకు నాలుగు వైపులా రిఫ్లెక్టివ్ టేపు అతికించాలి. ● అద్దాలన్నీ పటిష్టంగా ఉండాలి. ● బస్సు నుంచి పొగ అధికంగా రాకూడదు. ● బ్రేకులు కండిషన్లో ఉండాలి. ● పెయింటింగ్ కొత్తగా వేయించాలి. ● ఎమర్జెన్సీ డోర్, మంటలను ఆర్పే పరికరం, ఫస్ట్ ఎయిడ్ బాక్సు తప్పనిసరిగా ఉండాలి. విద్యా సంస్థలకు సమాచారం స్కూల్ బస్సుల ఫిట్నెస్ గడువు బుధవారంతో ముగిసింది. వీటికి ఎఫ్సీల జారీపై ఆయా విద్యా సంస్థలకు సమాచారం ఇచ్చాం. ప్రతి స్కూల్ బస్సు తాజా ఫిట్నెస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అన్నీ సక్రమంగా ఉంటేనే సర్టిఫికెట్ ఇస్తున్నాము. పాఠశాలలు, కళాశాలలు తెరిచే నాటికి అన్ని బస్సులూ ఎఫ్సీ కలిగి ఉండాలి. నిబంధనలు పాటించని బస్సులను సీజ్ చేయడంతో పాటు కేసులు నమోదు చేస్తాం. ఎఫ్సీలపై విద్యాసంస్థల యాజమాన్యాలు ఏమాత్రం నిర్లక్ష్యం వహించరాదు. – ఎ.మోహన్, జిల్లా రవాణా అధికారి, కాకినాడ -
ప్రశాంతంగా ఈఏపీ సెట్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చరల్ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ గురువారం ప్రారంభమయ్యాయి. తొలి రోజున అగ్రికల్చరల్, ఫార్మసీ విభాగాలకు సంబంధించిన పరీక్ష నిర్వహించారు. కాకినాడ రీజియన్లో అయాన్ ఇనిస్టిట్యూట్ (అచ్యుతాపురం రైల్వే గేట్), సూరంపాలెంలోని ప్రగతి, ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలల ప్రాంగణాల్లో 4 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలకు అభ్యర్థులు గంట ముందుగానే చేరుకున్నారు. ప్రారంభ సమయంలో అక్కడక్కడ కొద్ది నిమిషాల పాటు సర్వర్ సమస్య మినహా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా పరీక్షలు సజావుగా జరిగాయి. ఉదయం పరీక్షకు 921 మందికి 819 మంది, మధ్యాహ్నం పరీక్షకు 915 మందికి గాను 836 మంది హాజరయ్యారు. ఉదయం, సాయంత్రం కలిపి 181 మంది గైర్హాజరవగా, 90.14 శాతం హాజరు నమోదైంది. సర్వత్రా ‘హైటెన్షన్’ కాకినాడ సిటీ: సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ఈ నెల 13న ముగింది. ఓటర్లు ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఇక మిగిలింది ఫలితం వెలువడడమే. దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఇంకా ఎన్నికలు జరగాల్సి ఉండటంతో అప్పటి వరకూ ఫలితాల కోసం ప్రజలు నిరీక్షించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఎక్కడ చూసినా ఎవరి జాతకాలు ఎలా ఉండబోతున్నాయనే అంశం పైనే ఎక్కడ చూసినా చర్చలు జరుగుతున్నాయి. పల్లెల నుంచి పట్టణాల వరకూ అభ్యర్థుల గెలుపోటములపై టీ కొట్లు, రచ్చబండల వద్ద ఇదే వాతావరణం కనిపిస్తోంది. నలుగురు ఒకచోట చేరితే రాజకీయ చర్చలే జరుగుతున్నాయి. ఎన్సీసీతో క్రమశిక్షణ పెద్దాపురం: విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ అలవర్చుకోవడం ఎన్సీసీతోనే సాధ్యమని కాకినాడ 18వ ఆంధ్రా బెటాలియన్ కమాండెంట్ కల్నల్ వివేక్ సావన్ గౌడర్ అన్నారు. పెద్దాపురం జవహర్ నవోదయ విద్యాలయలో ఆంధ్రా, తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ ఐడీఎస్ఎస్సీ–2024కు ఎంపికై న క్యాడెట్ల శిక్షణ శిబిరాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఆర్.కమలం అధ్యక్షతన జరిగిన సదస్సులో కల్నల్ గౌడర్ మాట్లాడుతూ, ఎన్సీసీతో ప్రతి విద్యార్థికీ మంచి భవిష్యత్తు లభిస్తుందన్నారు. దృఢ సంకల్పం, ఆత్మవిశ్వాసం, నిబద్ధతతో కూడిన శిక్షణ ఎన్సీసీతోనే సాధ్యపడుతుందని చెప్పారు. ఈ నెల 24వ తేదీ వరకూ ఈ శిక్షణ ఉంటుందన్నారు. ఈ క్యాంప్లో విద్యార్థులకు డ్రిల్, ఆయుధ శిక్షణ, మ్యాప్ రీడింగ్, యోగాతో పాటు ఆర్మీలోని వివిధ అంశాలపై శిక్షణ ఇస్తారని తెలిపారు. వివిధ కళాశాలలు, పాఠశాలలకు చెందిన సుమారు 520 మంది పురుష, మహిళా క్యాడెట్లతో పాటు ఇంటర్ డైరెక్టరేట్ షూటింగ్ సెలక్షన్ క్యాంపులో భాగంగా మరో 51 మంది విద్యార్థులు పాల్గొంటారని వివరించారు. కార్యక్రమంలో సుబేదార్ హేమంత కుమార్, భాస్కర్రెడ్డి, కిషోర్, తొమ్మిది మంది ఎన్సీసీ అధికారులు, 29 మంది ఆర్మీ అధికారులు, 571 మంది ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొన్నారు. ఏపీఆర్జేసీలో 48వ ర్యాంకు కరప: పెద్దాపురప్పాడు గ్రామానికి చెందిన విద్యార్థి శ్రీరెడ్డి గంగ రాకేష్ ఏపీఆర్జేసీ పరీక్షల్లో 48వ ర్యాంకు సాధించాడు. పెద్దాపురప్పాడు బిరుదా సూర్యనారాయణ (ఫకీర్రావు) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివిన అతడు ఏపీఆర్జేసీ ప్రవేశ పరీక్ష రాశాడు. గురువారం వెలువడిన ఫలితాల్లో రాకేష్ 48వ ర్యాంక్ సాధించాడని హెచ్ఎం ఎస్ఎస్ఎస్ శ్రీనివాస్ తెలిపారు. ఆ విద్యార్థిని జెడ్పీటీసీ సభ్యుడు యాళ్ల సుబ్బారావు, ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, ఎంఈఓలు కె.బుల్లికృష్ణవేణి, పి.సత్యనారాయణ, హెచ్ఎం శ్రీనివాస్, పీడీ బీవీవీఎస్వీ ప్రసాద్ అభినందించారు. -
స్ట్రాంగ్ రూముల భద్రతకు చర్యలు
● జేఎన్టీయూకేలో సీసీ కెమెరాల డిస్ల్పే స్క్రీన్లు ● కలెక్టర్ నివాస్కాకినాడ సిటీ: ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు ఈవీఎంల స్ట్రాంగ్ రూముల భద్రతను పరిశీలించేందుకు వీలుగా జేఎన్టీయూకేలో సీసీ కెమెరాల డిస్ల్పే స్క్రీన్లు ఏర్పాటు చేశామని జిల్లా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ఈవీఎంల స్ట్రాంగ్ రూములను గురువారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్ట్రాంగ్ రూముల భద్రతను అభ్యర్థులు, వివిధ రాజకీయ పార్టీల ఏజెంట్లు పరిశీలించేందుకు జేఎన్టీయూకే క్యాంటీన్పై ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాల స్క్రీన్, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ స్క్రీన్ల సదుపాయాన్ని అభ్యర్థులు, వారి ఏజెంట్లు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ప్రిన్సిపాల్ చాంబర్ మీటింగ్ హాలులో వివిధ నియోజకవర్గాలకు సంబంధించి స్ట్రాంగ్ రూముల వద్ద విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందితో సమావేశమయ్యారు. స్ట్రాంగ్ రూముల వద్ద నిర్వర్తించాల్సిన విధులపై దిశానిర్దేశం చేశారు. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా స్ట్రాంగ్ రూముల వద్ద నిరంతరం విధులు నిర్వర్తించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించామని తెలిపారు. సిబ్బంది అందరూ అప్రమత్తతతో ఉండాలని, ప్రతి రోజూ ఉదయం స్ట్రాంగ్ రూముల సీళ్లను తప్పనిసరిగా పరిశీలించాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూముల సందర్శనకు వచ్చిన ప్రతి ఒక్కరి వివరాలను ఎప్పటికప్పుడు లాగ్ రిజిస్టర్లో నమోదు చేయాలని, వీడియో కెమెరాల్లో చిత్రీకరించాలన్నారు. ఏదైనా సందేహం ఉంటే సంబంధిత రిటర్నింగ్, ఇతర అధికారులకు వెంటనే సమాచారం అందించాలని సిబ్బందిని నివాస్ ఆదేశించారు.19న జిల్లా స్థాయి పర్యావరణ పోటీలు కాకినాడ సిటీ: అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర జీవవైవిధ్య మండలి ఆధ్వర్యాన ఈ నెల 19న స్థానిక పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి పర్యావరణ పోటీలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ జె.నివాస్ తెలిపారు. ఈ పోటీల వాల్పోస్టర్ను కలెక్టరేట్లో గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జీవవైవిధ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ‘జీవవైవిధ్యం వలన లాభాలు’ అనే అంశంపై నాలుగో తరగతి నుంచి డిగ్రీ వరకూ చదువుతున్న విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆ రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకూ ఈ పోటీలు నిర్వహిస్తారన్నారు. ఇతర వివరాలకు 62811 58344 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ హెచ్ఎస్ భావన, ఆంధ్రప్రదేశ్ నేషనల్ గ్రీన్ కోర్ ప్రాంతీయ సమన్వయకర్త కేసరి శ్రీనివాసరావు, జిల్లా సమన్వయకర్త వీకేవీ మహేశ్వరరావు, ఎంఎస్ఎన్ చారిటీస్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎంఎస్ సుబ్రహ్మణ్యం, క్లస్టర్ సమన్వయకర్తలు ఎన్.వీరభద్రరావు, వీఎస్వీ రమణమూర్తి, పి.రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. రేపటి నుంచి బాక్సింగ్ శిక్షణ పిఠాపురం: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద శనివారం నుంచి ఉచిత బాక్సింగ్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని కోచ్ పి.లక్ష్మణరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యాన ఈ శిక్షణ ఇస్తున్నామన్నారు. వివరాలకు 9989 0011 62 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు. -
ఇంటర్తో ఉద్యోగం
మంచి అవకాశం ఉమ్మడి జిల్లాలో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఐటీ రంగంలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నాం. ఇంటర్ 75 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. విద్యార్థులకు మంచి భవిష్యత్తు లభిస్తుంది. – ఉమ్మడిశెట్టి అనిల్, హెచ్సీఎల్ టెక్బీ స్టేట్ మేనేజర్ ప్రభుత్వ ప్రణాళికతో.. విద్యార్థులు ఇంటర్తో ఉద్యోగం సంపాదించుకునేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. దీనిపై అన్ని యాజమాన్యాల ఇంటర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు అవగాహన పెంచుకునేలా సమావేశం ఏర్పాటు చేశాం. – ఐ.శారద, ఇంటర్ బోర్డు రీజినల్ జాయింట్ డైరెక్టర్, రాజమహేంద్రవరం ● రాష్ట్ర ప్రభుత్వం చొరవతో సాకారం ● ఇంటర్ బోర్డు, హెచ్సీఎల్ టెక్బీ సంయుక్త ఆధ్వర్యాన 18న జాబ్మేళా ● 75 శాతం ఉత్తీర్ణతతో అర్హత ● మ్యాథ్స్ మినహా అన్ని గ్రూపుల విద్యార్థులకూ అవకాశం ● ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 300 మంది పైగా దరఖాస్తు కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంటర్మీడియెట్ పూర్తి కాగానే విద్యార్థులు ఉద్యోగులుగా మారనున్నారు. అది కూడా సాఫ్ట్వేర్ కంపెనీలో కొలువు చేస్తూ ఉన్నత చదువులు చదువుకునే అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో వారికి ఈ మహత్తర అవకాశం లభిస్తోంది. రాష్ట్రంలో 75 శాతం మార్కులతో ఇంటర్ పూర్తి చేసిన అన్ని గ్రూపుల (మ్యాథ్స్ మినహా) విద్యార్థులకూ ఇంటర్మీడియెట్ బోర్డు, హెచ్సీఎల్ టెక్బీ సంయుక్త ఆధ్వర్యాన ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 2022–23, 2023–24 విద్యా సంవత్సరాల్లో ఇంటర్ పూర్తి చేసిన, ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. వీటికి ఉమ్మడి జిల్లాలో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు 300 మంది ఇప్పటి వరకూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీరికి ఇంటర్ బోర్డు, హెచ్సీఎల్ టెక్బీ సంయుక్త ఆధ్వర్యాన ఈ నెల 18న రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఆదిత్య డిగ్రీ కళాశాలలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా తొలుత క్యాట్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ, చివరిగా ఇంగ్లిష్ వర్సంట్ పరీక్ష నిర్వహిస్తారు. ఈ మూడింటిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఏడాది శిక్షణ ఇస్తారు. ఈ కాలంలో ఏడో నెల నుంచి నెలకు రూ.10 వేల చొప్పున సైపెండ్ ఇస్తారు. బైపీసీ, సీఈసీ, హెచ్ఎసీ, ఒకేషనల్ కోర్సులు చదివిన వారు అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి డీపీఓ విభాగంలో కూడా ఉద్యోగాలు పొందవచ్చు. ఉద్యోగం చేస్తూ ఉన్నత విద్య ఇంటర్తో కొలువులో చేరిన విద్యార్థుల చదువు అక్కడితో ఆగిపోకూడదనే ఉద్దేశంతో.. ఉద్యోగం చేస్తూనే ఉన్నత విద్యను అభ్యసించేలా ప్రణాళిక రూపొందించారు. దీనికి అమిటీ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. దీనిలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఫీజు కింద విద్యార్థులకు చెల్లించే జీతంలో హెచ్సీఎల్ కంపెనీ ఏటా రూ.15 వేలు ఇవ్వనుంది. -
ట్రయల్ రన్ విజయవంతం
●● సత్యదేవుని టేకు రథం పనితీరు పరిశీలన ● చాలని జాకీ మోటార్ సామర్థ్యం ● పొక్లెయిన్తో రథాన్ని లాగి సరిచేసిన సిబ్బంది ● అధిక సామర్థ్యమున్న జాకీ మోటార్ ఏర్పాటు చేయాలని ఈఓ ఆదేశంఅన్నవరం: రత్నగిరి వాసుడు సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్లను ఊరేగించేందుకు రూ.1,04 కోట్ల వ్యయంతో తయారు చేయించిన భారీ టేకు రథం ట్రయల్ రన్ గురువారం విజయవంతంగా నిర్వహించారు. రథం నడిచేటప్పుడు కొన్ని సాంకేతిక సమస్యలు ఉత్పన్నమయ్యాయి. వాటిని ఈ నెల 22న జరిగే స్వామివారి రథోత్సవం నాటికి పరిష్కరిస్తామని అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈఓ) కె.రామచంద్ర మోహన్ తెలిపారు. ట్రయల్ రన్ జరిగిందిలా.. ● పంపా సత్రంలో ఉన్న రథాన్ని పండితుల మంత్రోచ్చారణల నడుమ ఉదయం ఎనిమిది గంటలకు ముందుకు కదిపారు. ● ఉదయం 11 గంటలకు ధవళేశ్వరం నుంచి వచ్చిన పది మంది రథం నడిపే నిపుణులు, సుమారు వంద మంది దేవస్థానం సిబ్బంది తాడుతో రథాన్ని ముందుకు లాగుతూ మెయిన్ రోడ్డు మీదకు తీసుకుని వచ్చారు. దీనికి సుమారు గంట సమయం పట్టింది. ● పంపా సత్రం గేటు తొలగించి అప్పటికప్పుడు క్వారీ డస్ట్ ర్యాంపులా వేశారు. అయితే ఉదయం నుంచీ వర్షం కురుస్తూండటంతో ర్యాంపు మెత్తబడి చక్రాలు ముందుకు కదల్లేదు. దీంతో మళ్లీ వెనుకకు తీసుకుని వెళ్లి తిరిగి వేగంగా రోడ్డు మీదకు తీసుకుని వచ్చారు. ● ఈ రథం చక్రాలు సులభంగా తిరగడానికి, మధ్యలో ఉన్న హైడ్రాలిక్ జాకీ సాయంతో రథాన్ని కాస్త మీదకు లేపారు. ● ఆంధ్రా బ్యాంక్ సెంటర్ వరకూ రథం బాగానే నడిచింది. తిరిగి వెనుకకు వచ్చేందుకు గాను రోడ్డు మలుపు తిరిగేటప్పుడు రథాన్ని పైకి ఎత్తేందుకు ఏర్పాటు చేసిన హైడ్రాలిక్ జాకీ మొరాయించింది. దీని మోటార్ సామర్థ్యం తక్కువ కావడంతో ఈ సమస్య ఏర్పడిందని గుర్తించారు. దీంతో రథం పగ్గాలను పొక్లెయిన్కు కట్టి ముందుకు లాగారు. ● ట్రయల్ రన్లో పాల్గొన్న ఈఓ రామచంద్ర మోహన్ మైకు ద్వారా సిబ్బందికి ఎప్పటికప్పుడు తగు సూచనలిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ రమేష్బాబు, ఈఈలు మురళి, నరసింహరెడ్డి, డీఈలు ఉదయ్, బీఎస్ రాంబాబు, పి.గుర్రాజు, ఏఈఓ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. రథోత్సవం వేళ జాగ్రత్తలు తప్పనిసరి ● భారీ టేకు రథం ట్రయల్ రన్ అనేక విషయాలను తేటతెల్లం చేసింది. ● దేవస్థానానికి ఇప్పటి వరకూ ఇంత పెద్ద రథం లేదు. సుమారు 36 అడుగుల ఎత్తు, 14.6 అడుగుల వెడల్పు, 21 అడుగుల పొడవు కలిగిన ఈ రథం సత్యదేవుని ఊరేగింపు వాహనాల్లోనే చాలా పెద్దది. ● సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈ నెల 22న జరిగే ఊరేగింపులో ఈ టేకు రథంపై స్వామి, అమ్మవారిని తొలి పావంచా నుంచి ఆంధ్రా బ్యాంక్ సెంటర్ వరకూ.. అక్కడి నుంచి దేవస్థానం హైస్కూల్ వద్ద ఉన్న మొదటి టోల్ గేట్ వరకూ ఊరేగించనున్నారు. ● తొలి పావంచా నుంచి ఆంధ్రా బ్యాంక్ వరకూ రోడ్డు చాలా పల్లంగా ఉంటుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా రథం ముందుకు వెళ్లిపోయే ప్రమాదం ఉంటంది. ● ఆరు రథ చక్రాల్లో నాలుగింటికే హైడ్రాలిక్ బ్రేకులున్నాయి. అవి బాగానే పని చేస్తున్నాయి. అయితే మలుపులు తిరిగే సమయంలో జాకీతో రథాన్ని అరడుగు మేర ఎత్తి చక్రాలు మలుపు తిప్పుతున్నారు. ప్రస్తుతం ఉన్న జాకీ మోటార్ సామర్థ్యం 24 టన్నులు. అయితే రథం బరువు సుమారు 34 టన్నులు. ఈ మేరకు రథోత్సవం నాటికి ఎక్కువ సామర్థ్యం ఉన్న జాకీ మోటార్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ● రథోత్సవం నాడు వాహనాలను మెయిన్ రోడ్డు మీదుగా గ్రామంలోకి రానివ్వకుండా జాతీయ రహదారి మీదుగా బస్ కాంప్లెక్స్కు వచ్చేలా చేయాలి. సాంకేతిక సమస్యలు పరిష్కరిస్తాం సత్యదేవుని టేకు రథం ట్రయల్ రన్ సంతృప్తికరంగా జరిగింది. రథం జాకీ మోటార్ సామర్థ్యం చాలక రథాన్ని ఎత్తే సమయంలో ఇబ్బంది ఏర్పడింది. 34 టన్నుల పైబడి బరువు ఎత్తే మోటార్ అమర్చాలని ఆదేశించాం. రథోత్సవాన్ని భక్తులందరూ తిలకించేలా 22వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. – కె.రామచంద్ర మోహన్, ఈఓ, అన్నవరం దేవస్థానం సత్యదేవుని టేకు రథాన్ని లాగుతున్న సిబ్బంది -
ఐటీఐ.. ఉపాధికి బాట
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఐటీఐ పూర్తిచేసిన వారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఈ కోర్సులు ముగించిన వారికి పాలిటెక్నిక్ డిప్లమాలో నేరుగా రెండో సంవత్సరం ప్రవేశం పొందేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఐటీఐ చివరి ఏడాదిలోనే జాబ్మేళాలో పరిశ్రమల్లో ఉపాధి పొందే వీలుండటంతో ఐటీఐకు డిమాండ్ ఏర్పడింది. పదవ తరగతి పూర్తి చేయగానే త్వరితగతిన ఉపాధి పొందేందుకు ఐటీఐ కోర్సులు ఒక చక్కని బాటను ఏర్పాటు చేస్తాయని సాంకేతిక నిపుణులు చెబుతారు. ఐటీఐ కోర్సు ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఒక చక్కటి అవకాశంగా భావించవచ్చు. సాంకేతిక కోర్సుల్లో ఇంటర్ ఒకేషనల్, పాలిటెక్నిక్ కోర్సులతో పాటు పలువురు విద్యార్థులు ఐటీఐ (ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్)కు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. నైపుణ్యం తప్పనిసరి.. ఐటీఐ పూర్తి చేసిన తర్వాత విద్యార్థులు అప్రెంటిస్ పూర్తి చేసుకుంటే 18 ఏళ్లు దాటగానే పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు పొందడానికి ఒక చక్కని మార్గంగా ఉంటుంది. విద్యుత్, రైల్వే, రక్షణ, పలు ప్రభుత్వ, ప్రముఖ ప్రై వేట్ సంస్థల్లో ఐటీఐ కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగావకాశాలు త్వరితగతిన లభిస్తాయి. అయితే ఐటీఐ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. ఆయా ట్రేడుల్లో నైపుణ్యం సంపాదించిన విద్యార్థులకు ఉపాధి తప్పనిసరిగా లభిస్తుందనడంలో సందేహం లేదు. ఇదిలా ఉంటే రాష్ట్ర నైపుణ్యాభివద్ధి శిక్షణ సంస్థ ఐటీఐల్లో స్కిల్ హబ్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు నైపుణ్య అంశాలపై శిక్షణ ఇస్తోంది. ఉద్యోగం, ఉపాధితో పాటు స్వయం ఉపాధికి సైతం ఐటీఐ కోర్సు దోహదపడుతుంది. ఏడాది, రెండేళ్ల వ్యవధితో రెగ్యులర్ కోర్సులు ఐటీల్లో ఏడాది, రెండేళ్ల కాలపరిమితికి రెగ్యులర్ కోర్సులు ఉంటాయి. రెండేళ్ల కాలపరిమితితో ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎలక్ట్రానిక్ మెకానికల్, డ్రాఫ్ట్స్మేన్ సివిల్, ఇనుస్ట్రుమెంటేషన్ మెకానికల్ వంటి కోర్సులు ఉంటాయి. ఏడాది కాలపరిమితితో డీజిల్ మెకానిక్, వెల్డర్, కటింగ్ అండ్ సూయింగ్, కంప్యూటర్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ తదితర కోర్సులు ఉంటాయి. ఐటీఐల్లో చేరగోరే విద్యార్థులు వారికి ఆసక్తి ఉన్న కోర్సులు ఏ ఏ ఐటీఐల్లో ఉన్నాయో వెళ్లి పరిశీలించుకోవాలి. దరఖాస్తుల పరిశీలన పూర్తయిన విద్యార్థులు మాత్రమే కౌన్సెలింగ్కు అర్హత సాధిస్తారు. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే తరగతుల ప్రవేశానికి షెడ్యూల్ విడుదల చేస్తారు. ఐటీఐ కోర్సుల్లో ప్రవేశానికి జూన్ 10వ తేదీ తుదిగడువుగా ఉపాధి, శిక్షణ శాఖ ప్రకటించింది. ఉన్నత చదువులకు అవకాశం ఐటీఐ కోర్సుల్లో రెండేళ్ల వ్యవధి ఉన్న కోర్సులు పూర్తి చేసిన వారికి ఉన్నత చదువులకు అవకాశం ఉంది. ఐటీఐ పూర్తి చేసిన వారికి పాలిటెక్నిక్ రెండవ సంవత్సరంలో బ్రిడ్జి కోర్సు ద్వారా ప్రవేశం పొందేందుకు అవకాశం ఉంది. పాలిటెక్నిక్ పూర్తి చేసిన అనంతరం బీటెక్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. తద్వారా ఉద్యోగావకాశాలు మెరుగుపర్చుకోవచ్చు. ఈ విధంగా ఏటా పలువురు విద్యార్థులు నేరుగా లేటరల్ ఎంట్రీని పొంది, ఉన్నత విద్యను అభ్యసించి, ఉద్యోగావకాశాలను పొందుతున్నారు. రెండేళ్ల కాలపరిమితి కోర్సులు ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, డ్రాఫ్ట్స్మేన్ సివిల్. ఆర్అండ్ఏసీ టెక్నాలజీ, మెకానికల్ మోటార్ వెహికల్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇనుస్త్రుమెంట్ మెకానిక్, టర్నర్, మెచినిస్ట్. ఏడాది కాలపరిమితి కోర్సులు మెకానిక్ డీజిల్, సీవోపీఏ, వెల్డర్, సూయింగ్ టెక్నాలజీ, పీపీవో ప్రవేశాలకు తొలి దశ నోటిఫికేషన్ విడుదల జూన్ 10వ తేదీ తుది గడువు జిల్లాలో 2,432 సీట్లు, 2 ప్రభుత్వ కళాశాలలు 12 ప్రైవేట్ ఐటీఐలు జిల్లాలో పరిస్థితి ఇదీ కాకినాడ జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యం పరిధిలో కాకినాడ, జగ్గంపేటల్లో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలు ఉండగా, ప్రైవేట్ యాజమాన్యం పరిధిలో 12 ఐటీఐలు ఉన్నాయి. ప్రభుత్వ ఐటీఐల పరిధిలో 728, ప్రైవేట్ ఐటీఐల పరిధిలో 1,704 సీట్లు ఉన్నాయి. రెండు యాజమాన్యాల పరిధిలో 2,432 సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. డ్రోన్ టెక్నాలజీపై స్వల్ప కాలిక కోర్సు ప్రారంభం కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో ఈ ఏడాది నూతనంగా డ్రోన్ టెక్నాలజీపై ఆరు నెలల వ్యవధి గల కోర్సును ప్రవేశ పెడుతున్నారు. కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో 20 సీట్లు ఉన్న ఈ కోర్సును గత ఏడాది నుంచి ప్రారంభిస్తున్నారు. వ్యవసాయం, సర్వే, షూటింగ్స్లో డ్రోన్ టెక్నాలజీ వినియోగం పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 10 ఐటీఐల్లో డ్రోన్ టెక్నాలజీ కోర్సును ప్రవేశ పెట్టారు. అందులో భాగంగా కాకినాడ ప్రభుత్వ ఐటీఐలో ఈ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఉపాధి అవకాశాలు త్వరగా వస్తాయి త్వరిత గతిన స్థిరపడాలనుకునేవారికి ఐటీఐ కోర్సులు ఎంతో ఉపయోగపడతాయి. ఐటీఐలో చేరగోరే విద్యార్థులు జూన్ 10వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు పరిశీలన సమయంలో సమీప ప్రభుత్వ ఐటీఐలకు విధిగా హాజరు కావాలి. కౌన్సెలింగ్ షెడ్యూల్ వివరాలను విద్యార్థుల మొబైల్ నంబర్కు పంపిస్తాం. పదవ తరగతిలో విద్యార్థి పొందిన మార్కులు, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం అడ్మిషన్స్ ఉంటాయి. – ఎంవీజీ వర్మ, ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల జిల్లా కన్వీనర్, కాకినాడ -
జాతీయ బాస్కెట్బాల్ పోటీలకు శ్రావణి
పిఠాపురం: జాతీయ స్థాయి బాస్కెట్బాల్ పోటీలకు పిఠాపురానికి చెందిన క్రీడాకారిణి కె.శ్రావణి ఎంపికై ంది. ఈ నెలలో మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరగనున్న జాతీయ జూనియర్ బాలబాలికల జాతీయ స్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో ఆమె పాల్గొంటుందని జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి బొజ్జా మాణిక్యాలరావు తెలిపారు. ఈమె గతంలో నాలుగు జాతీయ స్థాయి బాస్కెట్బాల్ పోటీలకు నాయకత్వం వహించినట్టు చెప్పారు. జాతీయ స్థాయి బాస్కెట్బాల్ పోటీలకు ఎంపికై న శ్రావణిని ఆయనతో పాటు సంఘ సభ్యులు కొత్తెం సుందర్కుమార్, నంబల అర్జున్, బొజ్జా పసతీష్, దుర్గాప్రసాద్ తదితరులు అభినందించారు. బస్సు ప్రమాదం ఘటనపై మంత్రి వనిత దిగ్బ్రాంతి దేవరపల్లి: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద జరిగిన బస్సు ప్రమాదంపై రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు దేవరపల్లి మండలం యర్నగూడెంలోని తన క్యాంపు కార్యాలయం నుంచి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందడం బాధాకరమని ఆమె అన్నారు. మృతులు కుటుంబాలకు మంత్రి వనిత ప్రగాఢ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. హైదరాబాద్ వెళుతున్న ట్రావెల్ బస్సు, టిప్పర్ లారీ చిలకలూరిపేట సమీపంలోని పసుమర్రు వద్ద ఢీ కొట్టడంతో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందిన ఘటన తన మనసును కలచి వేసిందని ఆమె పేర్కొన్నారు. పలు రైళ్ల రద్దు రాజమహేంద్రవరం సిటీ: విజయవాడ డివిజన్లో ట్రాఫిక్ మెయింటినెన్స్ నిమిత్తం రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను ఈ నెల 27వ తేదీ వరకూ రద్దు చేసినట్లు రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు. దీని ప్రభావంతో రాజమహేంద్రవరం– విశాఖపట్నం(07466) విశాఖపట్నం– రాజమహేంద్రవరం(07467), రాజమహేంద్రవరం – నరసపూర్(07884), నరసపూర్– రాజమహేంద్రవరం(07883), గుంటూరు– విశాఖపట్నం (22702), గుంటూరు–విశాఖపట్నం(17239) రద్దు చేసినట్లు తెలిపారు.16వ తేదీ నుంచి 27వ తేదీ వరకూ విశాఖపట్నం–గుంటూరు (17240) రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. డ్రెయిన్లోకి జేసీబీ బోల్తా కాజులూరు: గొల్లపాలెం – కుయ్యేరు రహదారిలోని దుగ్గుదుర్రులో కల అండ్రంగి డ్రెయిన్ వద్ద బుధవారం వంతెనపై నుంచి వెళుతున్న జేసీబీ అకస్మాత్తుగా బోల్తాపడింది. డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించటంతో ప్రాణాపాయం తప్పింది. వివరాల్లోకి వెళితే.. కాజులూరు – దుగ్గుదుర్రుల మధ్యలో అండ్రంగి డ్రెయిన్పై వంతెన కొంతకాలం క్రితం కుప్పకూలింది. నూతన వంతెన నిర్మాణం చేపట్టే పనిలో భాగంగా అధికారులు డ్రెయిన్పై మరో తాత్కాలిక వంతెనను నిర్మించారు. ఈ నేపథ్యంలో గొల్లపాలెం నుంచి కుయ్యేరులో మట్టి తీసేందుకు జేసీబీ ఈ తాత్కాలిక వంతెనపై వెళ్లింది. అయితే డ్రెయిన్లోకి వాలు ఎక్కువగా ఉండటంతో బోల్తా పడింది. ఆ సమయంలో దానిలో డ్రైవర్తో పాటు మరో వ్యక్తి ఉన్నారు. మరో రెండు జేసీబీలను రప్పించి బోల్తాపడిన దానిని బయటకు తీశారు. స్వధార హోమ్ తనిఖీ ˘ రావులపాలెం: స్థానిక స్వధార హోమ్ను సీనియర్ సివిల్ జడ్జి, రాజమహేంద్రవరం జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ కె.ప్రకాష్ బాబు బుధవారం తనిఖీ చేశారు. హోమ్లోని బాలికలకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. అలాగే రికార్డులు పరిశీలించి, విద్యార్థినులతో మాట్లాడి పలు అంశాలను తెలుసుకున్నారు. క్రమశిక్షణతో చదువుకుని, ఉన్నత శిఖరాలకు ఎదగాలని వారికి సూచించారు. -
స్ట్రాంగ్ రూములను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
అనుకున్న దానికన్నా దిగుబడులు అధికం ఈ ఏడాది ప్రకృతి సహకరించడంతో అనుకున్న దానికన్నా వరి దిగుబడులు అధికంగా వచ్చాయి. సాధారణ రకాలతోపాటు, బొండాలు రకం దిగుబడులు ఐదు నుంచి 7 బస్తాలు అధికంగా వచ్చాయి. బొండాలు రకంకు ప్రస్తుతం మార్కెట్లో మంచి గిరాకీ ఉండడంతో రైతులు అధిక ధరలకు ధాన్యం విక్రయించుకొంటున్నారు. – ఎన్.విజయ్కుమార్, జిల్లా వ్యవసాయశాఖాధికారి నీటి ఇబ్బందులు లేకుండా చూశారు ఏప్రిల్ మొదటి వారంలో వరిపైరు చిరుపొట్ట దశలో ఉంది. నీటి ఎద్దడి వస్తుందని ఎంతో భయపడిపోయాం. వ్యవసాయశాఖ అధికారులు, ఇరిగేషన్ అధికారుల సమన్వయంతో పనిచేసి శివారు ప్రాంత ఆయకట్టుకు కూడా నీరు అందించారు. – కొనిశెట్టి సత్యనారాయణ, రైతు, కొమరగిరి, యు.కొత్తపల్లి మండలం దేవరపల్లి: వర్జీనియా పొగాకు కొనుగోళ్లు ఊపందుకున్నాయి. వేలం కేంద్రాలకు వస్తున్న బేళ్ల సంఖ్య రోజురోజుకు పెరగడంతో కొనుగోళ్లు శరవేగంగా జరుగుతున్నాయి. మార్కెట్లో రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో వేలం కేంద్రాలకు రైతులు కోటా ప్రకారం బేళ్లు తీసుకువచ్చి అమ్ముకుంటున్నారు. మార్చి 4వ తేదీన తూర్పు, ఏలూరు జిల్లాలోని ఐదు వేలం కేంద్రాల్లో పొగాకు కొనుగోళ్లు ప్రారంభించగా, ఇప్పటి వరకు 52 రోజులు కొనుగోళ్లు జరిగాయి. ఇప్పటి వరకు రూ.430 కోట్ల విలువ గల 14.95 మిలియన్ల కిలోల పొగాకు విక్రయాలు జరిగాయి. నిలకడగా ధర పొగాకు ధర మార్కెట్లో నిలకడగా ఉంది. 20 రోజులుగా పొగాకు గరిష్ట, సగటు ధర నిలకడగా ఉండడంతో రైతులకు గిట్టుబాటు ధర లభిస్తోంది. గురువారం మార్కెట్లో కిలో గరిష్ట ధర రూ.331, సగటు ధర రూ.288, కనిష్ట ధర రూ. 225 లభించింది. కిలో గరిష్ట ధర రూ.341 పలికిన పొగాకు కొద్దిరోజుల అనంతరం తగ్గుముఖం పట్టింది. రూ.331 ధర నిలకడగా కొనసాగుతోంది. పొగాకు బోర్డు రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని దేవరపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెంలోని రెండు వేలం కేంద్రాల్లో వర్జీనియా పొగాకు వేలం కేంద్రాలు ఏర్పాటు చేసి ఇ–ఆక్షన్ విధానంలో పొగాకు కొనుగోళ్లు నిర్వహిస్తున్నారు. 18 కంపెనీలు వేలంలో పాల్గొని పొగాకు కొనుగోలు చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలోని తొర్రేడు, రంగంపేట ప్రాంతాల్లో పండించిన బ్లాక్ సాయిల్(బీఎస్) పొగాకును దేవరపల్లి వేలం కేంద్రంలో విక్రయిస్తున్నారు. ఈ పొగాకు కిలో గరిష్ట ధర రూ. 252.62 పలికింది. బోట్క్లబ్ (కాకినాడ సిటీ): సకాలంలో రైతులు సాగునీరు అందించడంతోపాటు, వరుణుడు కూడా రైతులను కరుణించడంతో రబీ సాగు సక్రమంగా సాగింది. జిల్లాలో ఈ ఏడాది 1.65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా వంద శాతం కోతలు పూర్తయ్యాయి. ఏప్రిల్ నెలలో సాగునీటి ఎద్దడి రాగానే ప్రభుత్వం అప్రమత్తమై ఒక ఎకరా కూడా ఎండిపోకుండా పూర్తి స్థాయిలో నీరు అందించింది. చీడపీడలు కూడా లేకపోవడంతో వరి సాగు చేసిన రైతులకు అధిక దిగుబడులు వచ్చాయి. దీంతో అన్నదాతలు ఆనందంలో మునిగిపోతున్నారు. సాధారణ రకాలతోపాటు బొండాలు సాగు చేయడంతో రైతులు ఎకరాకు 50 నుంచి 60 బస్తాలు దిగుబడి సాధించారు. దీంతో పెట్టుబడులు పోను రూ.20 వేల వరకూ లాభాలు రావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా రబీ చివరలో వర్షాలు పడడంతో రైతులు ఇబ్బంది పడ్డారు. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా వరుణుడి కరుణ లేని కారణంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉండేది. జిల్లాలో ఈ ఏడాది మే నెలలో పెద్ద వర్షాలు కురవక పోవడంతో రైతులకు వరి పంట పూర్తిగా చేతికొచ్చింది. నకిలీల మాట లేదు విత్తు దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు వరకూ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నదాతలకు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించడంతో నకిలీ మాటే లేకుండా పోయింది. గతంలో అయితే రైతులు బయట మార్కెట్లో విత్తనాలు కొనుగోలు చేసుకొంటే అవి సక్రమంగా మొలకెత్తేవి కాదు. దీనికితోడు నకిలీ పురుగుమందులు యధేచ్ఛగా విక్రయించే వారు. ప్రస్తుతం రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావాల్సిన నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించారు. ఒక ఎకరా కూడా ఎండిపోకుండా.. ఏప్రిల్ నెలలో సాగునీటి ఎద్దడి రావడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సాగునీరు అందని ఆయకట్టును గుర్తించి ఆయా ప్రాంతాలకు నీరు అందించే ఏర్పాటు చేసింది. దీంతో ప్రతి ఎకరాకు నీరు అందింది. ఎక్కడా వరి పంట ఎండిన దాఖలాలు లేవు. మెట్ట ప్రాంతాలైన గోకవరం, పెద్దాపురం, కోటనందూరు, ఏలేశ్వరం ప్రాంతాలకు కూడా పూర్తి స్థాయిలో నీరు అందించడంతో అధిక దిగుబడులు వచ్చాయి. రైతులకు కలిసొచ్చిన యంత్ర పరికరాలు వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల్లో యంత్ర పరికరాలు అందుబాటులోకి తీసుకురావడం రైతులకు ఎంతో కలిసొచ్చింది. ప్రస్తుత రబీలో రైతులు దాదాపు 95 శాతం వరి కోత యంత్రాల ద్వారా కోతలు కోయించారు. దీంతో పది రోజుల క్రితం చిరుజల్లులు పడినా రైతులు ధాన్యం సురక్షితంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎకరాకు 60 బస్తాల దిగుబడి జిల్లాలో ఈ ఏడాది 1.65 లక్షల ఎకరాల్లో వరిసాగు చేయగా, 90 వేల ఎకరాల్లో బొండాలు రకం సాగు చేశారు. వాతావరణం కలిసి రావడంతో ఎకరాకు 55 నుంచి 60 బస్తాల దిగుబడి వచ్చింది. సాధారణ రకాలైన 1121, 1157, 1154, బీపీటీ 5204 రకాలకు కూడా ఎకరాకు 47 నుంచి 50 బస్తాల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం జిల్లాలోని అన్ని మండలాల్లో వరి కోతలు పూర్తయ్యాయి. రైతులు దాదాపు ధాన్యం విక్రయాలు పూర్తి చేసుకొన్నారు. కాకినాడ సిటీ: సాధారణ ఎన్నికలు–2024కు సంబంధించి కాకినాడ జేఎన్టీయూలో భద్రపరిచిన ఈవీఎంల స్ట్రాంగ్ రూములను బుధవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జె.నివాస్, జిల్లా ఎస్పీ ఎస్.సతీష్కుమార్ ఇతర ఎన్నికల అధికారులతో కలిసి పరిశీలించారు. జేఎన్టీయూలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సెంట్రల్ లైబ్రరీలో భద్రపరిచిన పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన సీసీ కెమెరా టీవీలను, సెక్యూరిటీ సిబ్బంది వ్యవస్థను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి సంబంధించి కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన పనుల నిమిత్తం జేఎన్టీయూ ప్రిన్సిపాల్ చాంబర్, మీటింగ్ హాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు వేచి ఉండే గది, ఇతర ప్రాంతాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. జేఎన్టీయూ మెయిన్గేటు నుంచి లోపలికి వచ్చే వారి వివరాలు, పోలీస్ బందోబస్తు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జేఎన్టీయూ వద్ద బందోబస్తును మరింత పటిష్టం చేయాలన్నారు. స్ట్రాంగ్రూముల పరిశీలినకు వచ్చే రాజకీయ పార్టీల ప్రతినిధులకు స్ట్రాంగ్ రూములకు వెళ్లే రూట్లను తెలియపరిచే విధంగా మెయిన్ గేటు వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని కలెక్టర్ నివాస్ అధికారులను ఆదేశించారు. జోరుగా కొనుగోళ్లు 14.95 మిలియన్ల కిలోల వర్జీనియా పొగాకు అమ్మకాలు 1.22 లక్షల బేళ్లు విక్రయం కిలో గరిష్ట ధర రూ.331 రూ.430 కోట్ల విలువైన పొగాకు అమ్మకం జిల్లాలో రబీ కోతలు పూర్తి ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణం 1.65 లక్షల ఎకరాలు సకాలం నీరు అందడంతో భారీగా దిగుబడులు సాధారణ రకం ఎకరాకు 47 నుంచి 50 బస్తాలు బొండాలు రకం 55 నుంచి 60 బస్తాలు 65 శాతం బొండాల సాగు ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు -
నేటి నుంచి ఏపీఈఏపీ సెట్
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంజినీరింగ్, ఫార్మశీ, అగ్రికల్చరల్ కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ–2024 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు గురువారం ప్రారంభం కానున్నాయి. పరీక్షల నిర్వహణ బాధ్యతను ఈ ఏడాది జేఎన్టీయూ కాకినాడకు అప్పగించారు. ఈ నెల 16,17 తేదీల్లో అగ్రికల్చరల్, ఫార్మశీ విభాగాలకు, 18వ తేదీ నుంచి 23 వరకూ ఇంజినీరింగ్ విభాగాలకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటలు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకూ పరీక్షల నిర్వహణకు సన్నద్ధమయ్యారు. పరీక్ష కేంద్రంలోకి ఉదయం 7.30 నుంచి, మధ్యాహం 1.30 నుంచి ప్రవేశానికి అనుమతిస్తారు. పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యమైనా ప్రవేశానికి అనుమతి నిరాకరించారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఇంజినీరింగ్లో 7,865 అగ్రికల్చరల్, ఫార్మా విభాగంలో 3,260 మంది పరీక్షలకు హాజరవుతున్నారు. రెండు విభాగాలకు కలిపి 24 మంది దరఖాస్తు చేసుకున్నారు. కాకినాడ జిల్లాలో ఐదు ఆన్లైన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలివే... అయాన్ డిజిటల్ కేంద్రం– అచ్యుతాపురం గేట్ కాకినాడ, ప్రగతి ఇంజినీరింగ్ కళాశాల– సూరంపాలెం, ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో 4 కేంద్రాలు – సూరంపాలెం హెల్ప్ లైన్ నంబర్లు : 0884–2342499, 2359599 కాకినాడ జిల్లాలో ఐదు కేంద్రాల ఏర్పాటు ఇంజినీరింగ్ 7,865, అగ్రికల్చరల్ ఫార్మాలో 3,620 మంది రెండు విభాగాలకు 24 మంది దరఖాస్తు ఈ నెల 23 వరకూ పరీక్షల నిర్వహణ నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ ఏర్పాట్లు పూర్తి పరీక్షకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. వేసవిని దృష్టిలో ఉంచుకుని వైద్యసేవలు, విద్యుత్, పోలీస్ బందోబస్తు తదితర శాఖలకు సమాచారం ఇచ్చి పరీక్షలు సజావుగా నిర్వహించేలా అందరి అధికారులను సమన్వయం చేసుకుంటూ సూచనలు చేశాం. కో–ఆర్డినేటర్ వెంకటరెడ్డి నేతృత్వంలో ఏపీతో పాటు హైదదాబాద్లో కలిపి 49 కేంద్రాలలో పరీక్ష నిర్వహిస్తున్నాం. – డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు, సెట్ చైర్మన్, వీసీ జేఎన్టీయూకే -
నేడు, రేపు గురుకుల పాఠశాలల్లో సీట్ల భర్తీ
కాకినాడ సిటీ: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో 2024–25 విద్యా సంవత్సరానికి జూనియర్ ఇంటర్మీడియట్లో చేరే విద్యార్థులకు మొదటి జాబితా సీట్లను ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా కేటాయించామని జిల్లా సమన్వయాధికారి జి.వెంకటరావు తెలిపారు. మిగిలిన సీట్లను ప్రవేశ పరీక్ష రాసిన విద్యార్థులతో మెరిట్ లిస్ట్ ప్రకారం భర్తీ చేస్తామన్నారు. ద్రాక్షారామం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో గురువారం బాలురకు, కాకినాడ సాంబమూర్తి నగర్లోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో శుక్రవారం బాలికలకు కేటాయించనున్నట్లు తెలిపారు. ఈ కౌన్సెలింగ్ ఉదయం 10 గంటల నుంచి జరుగుతుందన్నారు. ఆయా విద్యార్థుల మొబైల్ నంబర్లకు ఇప్పటికే సమాచారం అందజేసినట్టు తెలిపారు. విద్యార్థులు తమ ఆధార్ కార్డు, పదో తరగతి మార్కుల జాబితా, కుల ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలన్నారు. ఇతర సమాచారం కోసం జి.దేవి 63040,97747, వి.ప్రసాద్బాబు 94404 99016 నంబర్లను సంప్రదించాలన్నారు. -
17, 18 తేదీల్లో గైట్లో ఎస్టీయూ రాష్ట్ర స్థాయి శిక్షణ
రాజానగరం: రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర స్థాయి ఉద్యమ శిక్షణ తరగతులను ఈనెల 17, 18 తేదీలలో గైట్ ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం ఆ కళాశాలలో సన్నాహక సమావేశం నిర్వహించారు. సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు శివప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిశ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పి.రఘునాథరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహరెడ్డితో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరవుతారన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. -
భవిత భద్రం
ఫ స్ట్రాంగ్ రూములో నేతల తలరాతలు ఫ టెన్షన్ వీడాలంటే మూడు వారాలు ఆగాల్సిందే.. ఫ లెక్క తేల్చే పనిలో అభ్యర్థులు ఫ ఆసక్తి అంతా ఆ ఆరు గంటల పోలింగ్ పైనే.. సాక్షి ప్రతినిధి, కాకినాడ: సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. అభ్యర్థుల భవితవ్యం తేల్చే ఈవీఎంలు స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉన్నాయి. బరిలో నిలిచిన అభ్యర్థులందరూ తమ తలరాతలు తేల్చే ఓటర్ల తీర్పు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికోసం మరో మూడు వారాల నిరీక్షణ తప్పదు. దాదాపు ఒకటిన్నర నెలలుగా క్షణం తీరిక లేకుండా ఎన్నికల ప్రచారం, వ్యూహ ప్రతివ్యూహాల్లో బిజీబిజీగా గడిపిన అభ్యర్థులందరూ మంగళవారం మధ్యాహ్నం వరకూ కాస్త సేదతీరారు. సాయంత్రం అయ్యేసరికి తిరిగి ఎన్నికల హడావుడిలో పడిపోయారు. పోలింగ్ కేంద్రాల వద్దకు పోటెత్తిన ఓటర్లు ఎవరి పక్షాన నిలిచారనే విషయమై ఆరా తీస్తున్నారు. ఓటర్ల తీర్పుపై కూడికలు, తీసివేతల్లో తలమునకలై ఉన్నారు. ఏయే పోలింగ్ కేంద్రాల్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి, గత ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ వచ్చింది, ఈ ఎన్నికల్లో మొగ్గు ఎటువైపు ఉంది వంటి వివరాలను బూత్ ఏజెంట్ల ద్వారా సేకరించి, లెక్కలు వేస్తున్నారు. దాదాపు అభ్యర్థులందరూ ఇటువంటి అంశాలపై నాలుగైదు ఎన్నికల్లో పని చేసి, లెక్కలు తీసిన.. రాజకీయాల్లో తలపండిన సీనియర్లను దగ్గర పెట్టుకుని, గెలుపు ఓటములపై అంచనాలు తయారు చేసుకునే పనిలో ఉన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో నాలుగైదుసార్లు పోటీ చేసిన అభ్యర్థులైతే సమర్థులైన ఏజంట్ల ద్వారా పక్కాగా తమకు పడిన ఓట్లను అంచనా వేస్తున్నారు. ఓటింగ్ సందర్భంలోనే ఏజెంట్లు ఎప్పటికప్పుడు సుమారుగా లెక్కలు వేసి, వాటిని అభ్యర్థులకు వివరిస్తూంటే విజయావకాశాలను బేరీజు వేసుకుంటున్నారు. విజయం తమదంటే తమదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ ఓటర్లదే కీలక పాత్ర! ఈసారి పోలింగ్ సరళిలో ఒక అంశం ప్రధానంగా చర్చనీయాంశమైంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ ఒక మోస్తరు పోలింగ్ నమోదైంది. ఎటొచ్చీ సోమవారం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 10 గంటల తరువాత కూడా క్యూలలో వేచి ఉన్న ఓటర్లే ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారని చెబుతున్నారు. ఓటర్లు పెద్ద ఎత్తున పోటెత్తిన ఆ ఆరు గంటల్లో నమోదైన ఓటింగ్ దాదాపు అందరు అభ్యర్థుల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఓటెత్తిన మహిళలునియోజకవర్గాల వారీగా పోలింగ్ వివరాలు నియోజకవర్గం మొత్తం పోలైన పోలింగ్ ఓట్లు ఓట్లు శాతం తుని 2,24,538 1,87,183 83.36 ప్రత్తిపాడు 2,17,267 1,74,789 80.45 పిఠాపురం 2,36,409 2,04,808 86.63 కాకినాడ రూరల్ 2,69,330 2,01,833 74.94 పెద్దాపురం 2,15,095 1,76,987 82.28 కాకినాడ సిటీ 2,41,620 1,74,336 72.17 జగ్గంపేట 2,29,863 1,92,289 83.65 -
జిల్లాలో 80.30 శాతం పోలింగ్
ఫ తుది లెక్కలు విడుదల చేసిన కలెక్టర్ ఫ ఓటు వేసిన వారు 13,12,255 కాకినాడ సిటీ: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొన్ని ప్రాంతాల్లో సోమవారం అర్ధరాత్రి వరకూ జరిగిన విషయం తెలిసిందే. ఆయా ప్రాంతాల నుంచి ఈవీఎంలను కాకినాడ జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు మంగళవారం ఉదయం 7 గంటల వరకూ తరలిస్తూనే ఉన్నారు. దీంతో జిల్లావ్యాప్తంగా పోలింగ్ వివరాలు అధికారులకు ఆలస్యంగా అందాయి. జిల్లాలో పోలింగ్ తుది వివరాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జె.నివాస్ రాత్రి ప్రకటించారు. దీని ప్రకారం జిల్లాలో 80.30 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాలో మొత్తం 16,34,122 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 8,04,445, మహిళలు 8,29,371, ఇతరులు 186 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 6,52,578 (81.12 శాతం), మహిళలు 6,59,575 (79.52 శాతం), ఇతరులు 102 (54.84 శాతం) కలిపి మొత్తం 13,12,255 మంది ఓట్లు వేశారు. చైతన్య కార్యక్రమాలతో.. ఓటు ప్రాధాన్యంపై ఓటర్లలో అవగాహన పెంచేందుకు నిర్వహించిన చైతన్య కార్యక్రమాలు ఓటింగ్ శాతం గణనీయంగా పెరగడానికి దోహదపడ్డాయని కలెక్టర్ నివాస్ తెలిపారు. 2019 ఎన్నికల్లో జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 78.52 శాతం ఓటింగ్ నమోదు కాగా, ఈసారి ఇది పెరిగిందని తెలిపారు. ఈ ఉద్యమంలో చురుకై న భూమిక వహించిన జేఎన్టీయూకే, రంగరాయ వైద్య కళాశాలల విద్యార్థులు, లాయర్లు, మత్స్యకార పెద్దలు, ఆటో డ్రైవర్లు, పోలీసులు, స్వచ్ఛంద సంస్థలను కలెక్టర్ అభినందించారు. ఓటు పవిత్రత, ప్రాధాన్యాన్ని చాటుతూ ప్రసిద్ధ యువ నేపథ్య గాయకుడు యశస్వి కొండేపూడి సహకారంతో చిత్రీకరించి, వివిధ మాధ్యమాల్లో ప్రదర్శించిన ‘ఓటే నీ ఆయుధం’ స్వీప్ వీడియో పాటను 57 వేల మందికి పైగా తిలకించి, స్పందించారన్నారు. వీటితో పాటు స్వీప్ సదస్సులు, ర్యాలీలు, సందేశాత్మక గ్లో లైట్లు, హోర్డింగులు, సెల్ఫీ పాయింట్లు కూడా ఓటు హక్కు ప్రాధాన్యంపై ప్రజలను జాగృతం చేశాయని వివరించారు. పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసిన అధికారులను, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు భద్రం జిల్లాకు సంబంధించిన ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామగ్రిని రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల సాధారణ పరిశీలకుల సమక్షంలో సురక్షితంగా భద్రపరిచామని కలెక్టర్ నివాస్ వెల్లడించారు. పోలింగ్ పూర్తయిన అనంతరం జేఎన్టీయూకేలో నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో పోలింగ్ కేంద్రాల వారిగా ఈవీఎంలను, ఎన్నికల సామగ్రిని స్వీకరించామని వివరించారు. ఈవీఎంలు భద్రపరచిన స్ట్రాంగ్ రూములకు జిల్లా సాధారణ పరిశీలకులు ఎస్.గణేష్, రాజేష్ జోగ్పాల్, కలెక్టర్ నివాస్, ఎస్పీ ఎస్.సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్, పిఠాపురం రిటర్నింగ్ అధికారి ఎస్.రామ్సుందర్రెడ్డి, ఆయా నియోజకవర్గాలకు చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మంగళవారం సీల్ వేశారు. అన్ని స్ట్రాంగ్ రూముల వద్ద సీసీ కెమెరాలతో 24/7 నిరంతర నిఘా ఏర్పాటు చేశారు. ఎల్ఈడీ టీవీ స్క్రీన్లు, విద్యుద్దీపాలు అమర్చారు. కేంద్ర, రాష్ట్ర పోలీసు బలగాలతో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. జేఎన్టీయూకేకి కిలోమీటరు పరిధిలో 144 సెక్షన్ విధించారు. ఈ కార్యక్రమంలో తుని, ప్రత్తిపాడు, కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగ్గంపేట నియోజవర్గాల రిటర్నింగ్ అధికారులు పీవీ రామలక్ష్మి, ఎ.శ్రీనివాసరావు, ఇట్ల కిషోర్, జె.సీతారామారావు, జె.వెంకటరావు, ఎం.శ్రీనివాసరావు, ట్రైనీ ఐపీఎస్లు తదితరులు పాల్గొన్నారు. -
దాడి కేసు నమోదు
రాయవరం: మండలంలోని కూర్మాపురంలో సోమవారం జరిగిన ఘటనపై ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు దాడి కేసు నమోదు చేసినట్లు రాయవరం ఏఎస్సై పి.వెంకటేశ్వరరావు మంగళవారం తెలిపారు. ఏఎస్సై వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన వీరబోయిన వీరవెంకటదుర్గాప్రసాద్ వలంటీర్గా పనిచేసి ఇటీవల రాజీనామా చేశాడు. సోమవారం నిర్వహించిన ఎన్నికల పోలింగ్ సమయంలో వలంటీర్ బయట వ్యక్తులతో మాట్లాడుతున్నాడు. అదే సమయంలో జనసేన పార్టీకి చెందిన చెక్కు మహేష్ మరో 13 మంది దుర్గాప్రసాద్ వద్దకు వచ్చిన నీకు ఇక్కడ పనేంటి? ఇక్కడకు ఎందుకు వచ్చావంటూ ఘర్షణకు దిగి, దాడికి పాల్పడ్డారు. గాయాల పాలైన దుర్గాప్రసాద్ రామచంద్రపురం ఏరియా ఆస్పత్రిలో చేరాడు. ఈ మేరకు ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. -
తమ పార్టీ వ్యక్తినే కిడ్నాప్ చేసిన జనసేన కార్యకర్తలు
మలికిపురం: మండలంలోని రామరాజులంక గ్రామంలో జనసేన కార్యకర్త రేకపల్లి నాగరాజును ఆ పార్టీ కార్యకర్తలే కిడ్నాప్ చేశారు. సోమవారం గ్రామంలోని పోలింగ్ స్టేషన్లో ఓటు ముందుగా వేసే విషయంలో గ్రామంలోని జనసేన కార్యకర్తలు పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణలో రేకపల్లి నాగరాజును తోసేశారు. వాగ్వాదం జరిగింది. దీంతో నాగరాజు వ్యతిరేక వర్గమయిన అదే గ్రామానికి చెందిన వ్యక్తుల బంధువులు అయిన గూడపల్లి, కేశనపల్లి గ్రామాలకు చెందిన జనసేన యువకులు నాగరాజును సోమవారం సాయంత్రం కిడ్నాప్ చేసినట్టు నాగరాజుతండ్రి సూర్య నారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నాప్కు గురయిన నాగరాజు దొరికాడని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంపత్కుమార్ తెలిపారు -
జగమంత కుటుంబం మాది
● చేసిన అభివృద్ధే శ్రీరామరక్ష ● మళ్లీ వైఎస్సార్ సీపీకే పట్టం ● ఆ పార్టీ అభ్యర్థుల ధీమా ప్రభుత్వం చేసిన అభివృద్ధే శ్రీరామరక్ష.. పేదలకు అందించిన పథకాలే కొండంత బలం, బలగం.. అందుకే జనమంతా వైఎస్సార్ సీపీకి మద్దతు పలికారు.. మళ్లీ పార్టీ విజయఢంకా మోగిస్తుందని, జగనన్న సీఎం కావడం ఖాయమని సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ధీమాగా ఉన్నారు. ఎన్నికల్లో ఓటర్లు తమ అమూల్యమైన ఓటు ద్వారా అది నిజం చేశారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారి మాటలు ఇలా.. – కరప, తుని రూరల్, సామర్లకోట -
మళ్లీ సీఎం వైఎస్ జగనే
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసా రి పదవి చేపట్టడం ఖాయమని ఎన్నికల ద్వారా ప్రస్పుటమైంది. పోలింగ్ సరళే ఇందుకు నిదర్శనం. కాకినాడ సిటీ పరిధిలోని అన్ని పోలింగ్ స్టేషన్లలో ఉదయం నుంచే ఓటర్లు చైతన్యవంతులై ఓటు వేశారు. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు, వృద్ధులు, మహిళలు ఓటింగ్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజా స్పందనను బట్టి వైఎస్సార్ సీపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి, మరోసారి అధికారాన్ని దక్కించుకుంటుంది. – ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, కాకినాడ సిటీ వైఎస్సార్ సీపీ హ్యాట్రిక్ ఖాయం జగ్గంపేట నియోజకవర్గంలో ఓటర్లంతా వైఎస్సార్ సీపీకే అనుకూలంగా ఓట్లు వేశారు. ఇక్కడ పార్టీ విజయంతో హ్యాట్రిక్ సాధించడం ఖాయం. ఓటర్లంతా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాలే మా విజయానికి కొండంత అండగా నిలుస్తాయి. ప్రతిపక్షాలు కుయుక్తులు పన్నినా, దుష్ప్రచారం చేసినా ఓటర్లు నమ్మలేదు. జగనన్నతోనే ప్రజలంతా ఉన్నారు. – తోట నరసింహం, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, జగ్గంపేట -
ఫ్యాన్ గాలిని ఆపలేరు
రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచింది. వైఎస్సార్ సీపీకి ప్రజలందరి మద్దతు లభించింది. ఇక ఫ్యాన్ స్పీడ్ను ఎవరూ ఆపలేరు. మహిళలు, యువకులు, అన్ని వర్గాల ప్రజలు ఓటు ద్వారా చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పారు. త్వరలో వచ్చే ఎన్నికల ఫలితాల్లో అది తేటతెల్లం అవుతోంది. కూటమి హామీలను ప్రజలెవరూ నమ్మలేదు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తిరిగి జగనన్నను సీఎం చేసేందుకు ఓటు అనే ఆయుధాన్ని సంధించారు. మళ్లీ వైఎస్సార్ సీపీ విజయం తథ్యం. – దాడిశెట్టి రాజా, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, తుని విజయం నాదే.. పిఠాపురం నియోజకవర్గంలో విజయం నాదే. రానున్న ఎన్నికల ఫలితాల్లో ఇదే నిజం కాబోతోంది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చూడాలన్న ఒకేఒక్క ఆకాంక్షతో ఎక్కువ మంది ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే ప్రత్యర్థి పార్టీకి ఓటమి తప్పదని తెలిసి దుకాణం సర్దేసుకుంది. ఇక ఆ పార్టీ వారు కనపడరు. నా ఎన్నికల ప్రచారంలో బ్రహ్మరథం పట్టి ఓట్లతో గెలుపును అందిస్తున్న పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటా. పట్టణ అభివృద్ధికి మరింత కృషి చేస్తా. – వంగా గీత, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, పిఠాపురం -
గెలుపు మనదే
కాకినాడ రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ విజయం ఖాయం. గ్రామాల్లో ఓటింగ్ సరళిని బట్టి ప్రజలు మా పక్షానే నిలిచారని తేటతెల్లమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసిన 32 రకాల సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి జరిగిన మేలే, మాకు కొండంత అండ అయ్యింది. అర్హతే ప్రమాణికంగా 32 వేల మందికి ఇళ్ల పట్టాలివ్వడం, విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యం ఇవ్వడంతో వైఎస్సార్ సీపీకే ఓటర్లు పట్టం కట్టారు. సీఎం జగన్ ఐదేళ్లుగా అమలు చేసిన సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి విజయానికి కలిసి వచ్చే అంశం. మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి కావడం తధ్యం. జిల్లాలో మెజార్టీ స్థానాలు కై వసం చేసుకుంటాం. – కురసాల కన్నబాబు, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, కాకినాడ రూరల్ సంక్షేమానికే అందరి ఓటు సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలంతా వైఎస్సార్ సీపీ వైపే ఉన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమానికే అంతా ఓటేశారు. ఈ ఎన్నికల్లో అది ప్రస్పుటమైంది. ఓటర్లు తమ తీర్పు ఇవ్వడానికి గంటల తరబడి క్యూలో ఉండి మరీ జగనన్న నాయకత్వానికి మద్దతు ఇచ్చారు. సంక్షేమ పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరూ వైఎస్సార్ సీపీకి పట్టం కట్టారు. టీడీపీకి ఇవే చివరి ఎన్నికలు. ఓటర్లను ప్రలోభపెట్టడానికి కూటమి ఎన్ని కుయుక్తులు పన్నినా ఎవరూ నమ్మలేదు. జగనన్న రాజ్యాన్నే ప్రజలంతా కోరుకుంటున్నారు. – దవులూరి దొరబాబు, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, పెద్దాపురం -
ఓటరు మహాశయా.. వందనం
● ప్రశాంతంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ● జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు కాకినాడ సిటీ: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది.. సుమారు రెండు నెలలుగా జిల్లా యంత్రాంగం చేసిన కృషి ఫలించింది. సోమవారం ఎన్నికల పోలింగ్లో చిన్న చిన్న సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న 1,640 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ విధానం ద్వారా ఓటింగ్ సరళిని జిల్లా ఎన్నికల పరిశీలకుడు ఎస్.గణేష్, కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె.నివాస్ పరిశీలించారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం ఈవీఎంలు మొరాయించాయి. ఆయా ప్రాంతాల్లో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం కావడంతో ఓటర్లు బారులు తీరి కనిపించారు. కొన్ని ప్రాంతాల్లో టీడీపీ నాయకులు ఓటమి భయంతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, ఓటర్లపై దురుసుగా ప్రవర్తించారు. కాకినాడ నగరంలోని ఏటిమొగ, జగన్నాథపురం, గోగుదానయ్యపేట, ముత్తానగర్, ముగ్గుపేట, నాగరాజుపేట, సూర్యనారాయణపురం, సాంబమూర్తినగర్, సంజయ్నగర్, దుమ్ములపేట, కొత్తకాకినాడ తదితర ప్రాంతాల్లో వివిధ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద ఎత్తున మోహరించి ఉండడంతో కొద్దిపాటి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ నాయకులు పోలింగ్ బూత్లకు 20 మీటర్ల దూరంలోనే ఉండి బహిరంగంగా తమ పార్టీకే ఓటు వేయాలని ప్రచారం చేయడం గమనార్హం. వారు ప్రచారం చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదని విమర్శలు వ్యక్తమయ్యాయి. మూడు విభాగాలుగా విభజించి.. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి రంగంలోకి దిగిన జిల్లా ఎన్నికల సెల్ వివిధ కోణాల్లో సమాచారాన్ని సేకరించింది. జిల్లా పోలీస్ యంత్రాంగం ఏర్పాటు చేసిన నిఘా విభాగ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, బృందం అందించిన సమాచారం కీలకంగా మారింది. వీటి ఆధారంగా పోలీసులు అత్యంత సమస్యాత్మక, సమస్యాత్మక, సున్నిత ప్రాంతాలను పక్కాగా గుర్తించారు. దీంతో జిల్లాలో 331 సమస్యాత్మక గ్రామాల్లో కేంద్ర బలగాలను మోహరింపజేశారు. షాడో పార్టీల సమాచారంతో.. ప్రతి అభ్యర్థితో పాటు అనుచరుల్లోనూ కీలకమైన వారిని అనునిత్యం వెంటాడటానికి జిల్లా పోలీసులు షాడో టీమ్స్ను రంగంలోకి దింపారు. ఈ బృందాలు ఎప్పటికప్పుడు వారి కదలికలను కనిపెట్టి సమాచారం అందిస్తూ వచ్చాయి. వీటి ఆధారంగా ఆయా ప్రాంతాల్లో బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేసుకుంటూ వచ్చారు. పోలింగ్ రోజున కూడా పెద్ద ఎత్తున పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. ఫలితంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పక్కాగా చర్యలు తీసుకోగలిగారు. మరోపక్క రెండు నెలలుగా రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులకు కౌన్సెలింగ్, బైండోవర్లపై టాస్క్ఫోర్స్, పోలీసులు దృష్టి పెట్టారు. జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో బయట, అజ్ఞాతంలో ఉన్నవారి వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా ఎస్పీ ఎస్.సతీష్కుమార్ చర్యలు తీసుకున్నారు. ఆ సమయం కీలకం పోలింగ్ రోజు చివరి రెండు గంటల మధ్య సమయం అత్యంత కీలకం. ఈ వేళలోనే దొంగ ఓట్లు ఎక్కువగా పడటం, ఘర్షణలు చోటు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పోలీసు విభాగం ఆ రెండు గంటలూ అత్యంత అప్రమత్తమైంది. రిజర్వ్లో ఉన్న బలగాలను సైతం ఆయా ప్రాంతాల్లోకి పంపించి ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా తీసుకుంది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకూ ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 8.79 శాతం, సాయంత్రం 6 గంటలకు 68.71 శాతం పోలింగ్ నమోదయ్యింది. జిల్లాలో 16,32,122 మంది ఓటర్లు ఉండగా, సాయంత్రం 6 గంటలకు 11,22,753 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గం పోలింగ్ నమోదు శాతం 9–11 గంటలు 1 గంట 3 గంటలు 4 గంటలు 6 గంటలు తుని 20.55 35.88 49.88 56.82 66.19 ప్రత్తిపాడు 23.23 37.65 52.52 55.62 67.68 పిఠాపురం 24.84 41.56 56.34 60.46 75.30 కాకినాడ రూరల్ 25.21 40.84 52.01 55.71 67.08 పెద్దాపురం 23.44 35.33 50.67 56.85 68.57 కాకినాడ పట్టణం 24.64 39.02 52.45 53.64 65.29 జగ్గంపేట 23.36 41.15 54.76 57.15 70.98
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- Election Commission of India: 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
- అడవిలో పుట్టి... గుడి ముంగిట నిలిచి...
- Rahul Gandhi: మోదీ నాతో చర్చకు రారు
- నీటిలో ఎక్కొచ్చు.. గాలిలో ఎగరొచ్చు
- దేశంలోనే పెద్ద స్టీల్ ఎయిర్ కాన్కోర్స్
- Russia-Ukraine war: కిర్గిజ్స్తాన్లో విదేశీయులపై దాడులు
- 16 ఏళ్లకే ఏఐ ఇంజనీర్! మన తెనాలి కుర్రాడే..
- అఫ్గాన్లో ఆకస్మిక వరదలు
- టైముకు తినండి.. ఆరోగ్యంగా ఉండండి!
- భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా
Advertisement